శాస్త్రవేత్తలు

SCIENTISTS

Friday, 27 January 2012


SCIENTISTS

నీల్స్ బోర్ 

             నీల్స్ బోర్ 1885 అక్టోబర్ 7న క్రిష్టియన్ బోర్, ఎలెన్ ఎడ్లెర్ బోర్ దంపతులకు 
డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లో జన్మించాడు. 1903లో గణితం, వేదాంతం 
అభ్యసించడానికి కోపెన్‌హాగన్ విశ్వవిద్యాలయంలో చేరాడు. తర్వాత వేదాంతానికి 
బదులు భౌతికశాస్త్రం చదవాలని 
నిర్ణయించుకున్నాడు. 1911లో డాక్టరేట్ పట్టా పొందాడు. 'జె.జె. థామ్సన్ వద్ద చేరి 
పరిశోధనలు చేశాడు. తర్వాత మాంచెస్టెర్ విశ్వవిద్యాలయంలో 'ఎర్నెస్ట్ రూథర్‌ఫర్డ్ వద్ద 
 పనిచేస్తూ పరిశోధనలు కొనసాగించాడు.  
 
             బోర్ 1913లో పరమాణు నిర్మాణానికి సంబంధించి ఒక నమూనాను
 ప్రతిపాదించాడు. దీన్ని వివరించడానికి మొదటిసారిగా 'క్వాంటం సిద్ధాంతాన్ని'
 ఉపయోగించాడు. 1918లో సైద్ధాంతిక భౌతికశాస్త్ర పరిశోధనశాలకు అధిపతి 
అయ్యాడు. రెండో ప్రపంచయుద్ధ సమయంలో 
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని 'లాస్ అలమోస్' పరిశోధనశాలలో అణుబాంబు 
నిర్మాణానికి ఇతర శాస్త్రజ్ఞులతో పాటు పరిశోధనలు చేశాడు. యుద్ధానంతరం 
కోపెన్‌హాగన్‌కి తిరిగొచ్చిన నీల్స్ బోర్ కేంద్రకశక్తిని శాంతియుతంగా ఉపయోగించడంపై 
ప్రచారం చేశాడు. CERN అనే  ప్రయోగశాలను స్థాపించడంలో ప్రముఖ పాత్ర 
వహించాడు.
             బోర్ ప్రతిపాదించిన పరమాణు నిర్మాణానికి 1922లో భౌతికశాస్త్ర విభాగంలో 

 నోబెల్ బహుమతి వచ్చింది. డేనిష్ ప్రభుత్వం 'ది ఆర్డర్ ఆఫ్ ది ఎలిఫెంట్' పురస్కారంతో 
గౌరవించింది. 1929లో ఫ్రాంక్లిన్ పతకాన్ని పొందాడు. 1997లో డేనిష్ జాతీయ బ్యాంక్ 
బోర్ చిత్రమున్న 500 క్రోనే కరెన్సీ నోటును విడుదల చేసింది. 1962 నవంబరు 18న 
కోపెన్‌హాగన్‌లో నీల్స్ బోర్ మరణించాడు.
 ______________________________________________
         థామస్ ఆల్వా ఎడిసన్
  థామస్ ఆల్వా ఎడిసన్ 1847 ఫిబ్రవరి 11న 
అమెరికాలోని మిలాన్‌లో జన్మించారు. అతడి 
తల్లిదండ్రులు నాన్సీ మాథ్యూస్, సామ్యూల్ 
ఆగ్డెన్ ఎడిసన్. ఆయన అధికారిక పాఠశాల 
చదువు కేవలం 3 నెలలు మాత్రమే సాగింది. 
అతడి తల్లే గురువై విద్యాబోధన చేశారు. 
'స్కూల్ ఆఫ్ నేచురల్ ఫిలాసఫి', 'కూపర్ 
యూనియన్' అతడి విద్యాభ్యాసానికి సహకరించాయి.

           ఎడిసన్ గ్రాండ్ ట్రంక్ రైల్వేలో వార్తాబాలుడిగా ఉండేవాడు. తన ఖాళీ 
 సమయాల్లో రైలు పెట్టెలోనే ప్రయోగాలు చేసేవాడు. ఈయన చేసిన ఓ ప్రయోగం 
వల్ల ఓ రైలు బోగీ ప్రమాదానికి గురికావడంతో తన ఉద్యోగం పోగొట్టుకున్నారు. 
 క్వాడ్రుప్లెక్స్ టెలిగ్రాఫ్ కనుక్కుని, దాని మేథోహక్కులను 1874లో వెస్ట్రన్ 
యూనియన్ సంస్థకు విక్రయించారు. వచ్చిన డబ్బుతో న్యూజెర్సీలోని 
మెన్లో పార్కులో ఓ పారిశ్రామిక పరిశోధనాశాల ప్రారంభించారు. 1877లో 
 గ్రామఫోన్(ఫోనోగ్రాఫ్), అతి చవకయిన ఫిలమెంటు విద్యుద్దీపంకనుక్కున్నారు. 
1877 - 78లో టెలిఫోన్‌లలో ఉపయోగించే కార్బన్ మైక్రోఫోన్, X - కిరణాలతో 
 ఫొటోలు తీసే ఫ్లోరోస్కోప్ అనే పరికరం కనుక్కున్నారు. 1891లో కైనెటోస్కోప్ 
 అనే పరికరం ఆవిష్కరించారు. 1912లో మొదటిసారిగా మూకీ చిత్రాల 
స్థానే టాకీ చిత్రాలు నిర్మించారు. ఈయన ఉష్ణ అయానిక ఉద్గారం 
కనుక్కున్నారు. దానికి 'ఎడిసన్ ఫలితం' అని పేరు. ఈయన తన 
జీవితకాలంలో 1093 పరిశోధనలకు పేటెంట్ హక్కులు పొందారు.
           అమెరికా సంయుక్త రాష్ట్రాల కాంగ్రెస్ ఈయన పుట్టిన తేది 

ఫిబ్రవరి 11ని జాతీయ పరిశోధకుల రోజుగా ప్రకటించింది. ఈయన 1931 
అక్టోబరు 18న, తన 84వ ఏట న్యూజెర్సీలోని వెస్ట్ ఆరెంజ్‌లో మృతి చెందారు.
___________________________________________



       నికోలా టెస్లా
నికోలా టెస్లా 1856 జులై 10 న క్రోయేషియాలోని 
స్మిల్జాన్‌లో జన్మించారు. డ్యూకా, మిలుటిన్ టెస్లా ఆయన 
తల్లిదండ్రులు. కార్లోవాక్‌లోని హయ్యర్ రియల్ జిమ్నా
జియంలో టెస్లా విద్యాభ్యాసం చేశారు. 1875 లో ఎలక్ట్రికల్ 
ఇంజినీరింగ్ చదివేందుకు గ్రాజ్‌లోని ఆస్ట్రియన్ 
పాలిటెక్నిక్‌లో చేరారు. తర్వాత ఛార్లెస్ ఫెర్డినాండ్ 
యూనివర్సిటీలోనూ ఆయన విద్యాభ్యాసం సాగింది.
        టెస్లా 1880లో బుడాపెస్ట్‌లోని టెలిగ్రాఫ్  

కంపెనీలో ఇంజినీర్‌గా చేరారు. అక్కడ పనిచేస్తున్నప్పుడే 
'టెలిఫోన్ రిపీటర్' అనే పరికరం తయారుచేశారు
1882లో ప్యారిస్ నగరానికి వెళ్లి అక్కడే పలు పరికరాలు తయారు 
చేశారు. 1884లో న్యూయార్క్ పట్టణం చేరుకున్నారు. అక్కడ ప్రఖ్యాత 
శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ దగ్గర పనిచేయడం ఆయన 
శాస్త్ర జీవితంలో ఓ మలుపుగా చెప్పాలి. ఎన్నో వినూత్న పరికరాలకు 
టెస్లా ఇక్కడే రూపకల్పన చేశారు. 1886లో సొంతంగా టెస్లా 
ఎలక్ట్రిక్ లైట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ ప్రారంభించి 
సరికొత్త పరికరాలు ఆవిష్కరించారు.
ప్రధాన ఆవిష్కరణ: రేడియో, టీవీల్లో ఉపయోగించే హై ఫ్రీక్వెన్సీ 
ఇండక్షన్ వేష్టణం (టెస్లా వేష్టణం) రూపొందించారు. భ్రమణం చెందే 
అయస్కాంత క్షేత్రాల ఆధారంగా పనిచేసే పరికరాలెన్నో ఆయన 
సృష్టించారు. ఇండక్షన్ మోటార్, వైర్‌లెస్ సాంకేతికత, టెస్లా విద్యుత్తు 
కారు, పాలిఫేజ్ సిస్టం ఆఫ్ a.c. పవర్ లాంటివి కనుక్కున్నారు.
అవార్డులు: 1893లో ఇలియట్ క్రెసన్ పతకం, 1916లో ఎడిసన్ 

పతకం, 1934లో జాన్ స్కాట్ పతకాలు టెస్లా అందుకున్నారు. 
ఆయన గౌరవార్థం శాస్త్రవేత్తలు 'టెస్లా'ని అయస్కాంత క్షేత్రప్రేరణకు 
S.I. ప్రమాణంగా ప్రతిపాదించారు. నికోలా టెస్లా 1943 జనవరి 7న 
న్యూయార్క్ నగరంలో తన 86వ ఏట మరణించారు.
_________________________________________

మైఖేల్ ఫారడ
    
     మైఖేల్ ఫారడే 1791 సెప్టెంబరు 22 న 
ఇంగ్లండ్‌లోని న్యూఇంగ్‌టన్‌లో ఓ పేద కుటుంబంలో 
పుట్టారు. తండ్రి జేమ్స్ కమ్మరి పనిచేసేవారు. 
ఫారడే కేవలం ప్రాథమిక విద్య మాత్రమే చదివారు. 
చిన్నప్పుడే పుస్తకాలు బైండ్ చేసే షాపులో పనికి 
కుదరడం వల్ల ఆ షాపులోని ఎన్నో పుస్తకాలు 
చదివే అవకాశం ఆయనకు లభించింది. ఆ 
పుస్తకపఠనమే విజ్ఞానశాస్త్రంపై ఆయనకు ఎనలేని 
అభిరుచిని కలిగించింది.
జీవితం: 1813లో ఈయన ప్రముఖ శాస్త్రవేత్త సర్ హంఫ్రీడేవికి 
కార్యదర్శిగా, రాయల్ ఇన్‌స్టిట్యూట్ రసాయనశాలలో 
సహాయకుడిగా నియమితులయ్యారు. సర్ హంఫ్రీడేవి విదేశీ 
పర్యటల్లో ఫారడే తోడుగా వెళ్లేవారు. విజ్ఞానశాస్త్రానికి సంబంధించి 
 ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి ఈ పర్యటనలు ఎంతో 
దోహదపడ్డాయి. ప్రముఖ శాస్త్రవేత్తలతో ఆయనకు పరిచయాలు 
ఏర్పడ్డాయి ఫారడే 1824లో రాయల్ సొసైటీ సభ్యుడిగా 
ఎంపికయ్యారు. రాయల్ ఇన్‌స్టిట్యూషన్‌లో తొలి పుల్లేరియన్ 
 రసాయనశాస్త్ర ఆచార్యుడిగా నియమితులయ్యారు. ఐరోపాలోని 
ప్రముఖ సైన్స్ అకాడమీలు కూడా ఆయన్ని తమ సభ్యుడిగా ఎంపిక 
చేశాయి.
ప్రధాన ఆవిష్కరణ: ఫారడే విద్యుచ్ఛక్తి మీద ప్రయోగాలు చేశారు. 

విద్యుదయస్కాంత ప్రేరణ నియమాలు ప్రతిపాదించారు. ఎన్నో 
ప్రయోగాల ద్వారా విద్యుత్తు విశ్లేషణ నియమాలు ప్రకటించారు. 
డయా అయస్కాంత తత్వాన్ని కూడా కనుక్కున్నారు. ధృవణం 
చెందిన కాంతిని భ్రమణం చెందించగల 'రొటేటర్' పరికరాన్ని ఫారడే 
ఆవిష్కరించారు. ఆయన ప్రతిపాదించిన నియమాలు, సూత్రాలు 
విద్యుత్తు మోటార్, డైనమో రూపొందించేందుకు దోహదపడ్డాయి.
అవార్డులు: 'నైట్‌హుడ్' తో సహా ఫారడేకు ఇంగ్లండ్ ప్రభుత్వం 

ఇవ్వజూపిన ఎన్నో పురస్కారాలను ఆయన వినమ్రంగా 
తిరస్కరించారు. ఆయన గౌరవార్థం విద్యుత్ కెపాసిటన్స్ S.I. 
ప్రమాణంగా ఫారడేని ప్రతిపాదించారు. బ్రిటిష్ మహారాణి 
ఆయనకు హంప్టన్ కోర్టు సముదాయంలోని ఓ భవంతి 
కూడా బహుకరించారు. ఫారడే ఈ భవంతిలోనే 
1867 ఆగస్టు 25న కన్నుమూశారు. 
_________________________________________


       సర్ ఐజక్ న్యూటన్

   సర్ ఐజక్ న్యూటన్ 1642 డిసెంబరు 25న 
ఇంగ్లండ్ లింకన్ షైర్‌లోని ఊల్స్‌థాపేలో 
జన్మించారు. గ్రాంథమ్‌లోని కింగ్స్ 
పాఠశాలలో చదువుకున్నారు. 1661 
జూన్‌లో కేంబ్రిడ్జ్ ట్రినిటీ కాలేజీలో 
చేరి.. 1665 ఆగస్టులో పట్టభద్రుడిగా 
బయటకు వచ్చారు. 1669 లో 
గణిత శాస్త్ర ఆచార్యుడిగా కేంబ్రిడ్జి 
విశ్వవిద్యాలయంలో 
నియమితులయ్యారు.
జీవితం: యాంత్రిక శాస్త్రం, కలన గణితాన్ని 

 న్యూటన్ అభివృద్ధి చేశారు.
1670 - 72 మధ్యకాలంలో కాంతి వక్రీభవన మీద 
పరిశోధనలు చేశారు. గాజుపట్టకం తెల్లటి కాంతి కిరణాన్ని 
ఏడు రంగుల కాంతి కిరణాలుగా విడగొడుతుందని చూపారు. 
వస్తుకటకం బదులుగా దర్పణం ఉపయోగించి న్యూటోనియన్ 
టెలిస్కోపు తయారుచేశారు. కాంతి కణ సిద్ధాంతం ప్రతిపాదించి, 
కాంతి లక్షణాలు వివరించారు. జులై 5, 1687లో ఆయన రాసిన 
''ప్రిన్సిపియా'' అనే పుస్తకాన్ని ముద్రించారు. ఆ పుస్తకంలోనే 
మూడు గతి నియమాలు వివరించారు. విశ్వగురుత్వ సిద్ధాంతం 
 ప్రతిపాదించి, గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరగడానికి కారణం 
వాటి మధ్య ఉన్న గురుత్వాకర్షణే అని తెలిపారు.
          1689 - 1690లో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 

1696లో ప్రభుత్వ టంకశాలకు అధిపతిగా నియమితులయ్యారు. 
1705లో ఇంగ్లండ్ మహారాణి నుంచి 'నైట్ హుడ్' బిరుదు పొందారు. 
వెస్ట్ మినిస్టర్ అభేలో న్యూటన్ స్మారక చిహ్నాన్ని చూడవచ్చు. 
1978 నుంచి 1988 వరకూ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ న్యూటన్ చిత్రంతో 
ఉన్న కరెన్సీ నోట్లు విడుదలజేసింది. 1727 మార్చి 31న 
ఇంగ్లండ్‌లోని కెన్సింగ్‌టన్‌లో కన్నుమూశారు.
________________________________________


 క్రిస్టియన్ హైగెన్స్

క్రిస్టియన్ హైగెన్స్ 1629 ఏప్రిల్ 14న 
నెదర్లాండ్స్ హేగ్ పట్టణంలో జన్మించారు.
సుజాన్నా, కానిస్టింటన్ హైగెన్స్ ఆయన తల్లిదండ్రులు.లేడెన్ విశ్వవిద్యాలయం, 

బ్రెడాలోని కాలేజ్ ఆఫ్ ఆరెంజ్‌లో గణితం, న్యాయశాస్త్రాలు అభ్యసించారు

జీవితం:
            1663
లో లండన్ నగరంలోని రాయల్ 
 సొసైటీ సభ్యుడిగా ఎంపికయ్యారు.1666లో ప్యారిస్‌కు చేరుకున్నారు.  
అక్కడ హైగెన్స్ ఫ్రెంచి అకాడమీ ఆఫ్ సైన్సెస్ సభ్యుడిగా ఎంపికయ్యారు.
1655లో శనిగ్రహం చుట్టూ ఘన వలయం ఉందని ప్రకటించారు
 శనిగ్రహం ఉపగ్రహం టైటాన్‌ను గుర్తించారు. లోలక గడియారాలు 
 రూపొందించి 1657లో పేటెంట్ కూడా సాధించారు. 
              లోలక డోలన కాలసూత్రం  ని ఉత్పాదించారు
1678లో కాంతి తరంగ రూపంలో ఈథర్ అనే యానకంలో  
ప్రయాణిస్తుందని ప్రకటించారు. 'హైగెన్స్- ఫ్రెస్నెల్' నియమం 
 ప్రతిపాదించారు. హైగెన్స్ రాసిన 'ట్రీటైజ్ ఆఫ్ లైట్'' (1690), 
''హోరోలోజియం'' (1658) శాస్త్రగ్రంథాలు ఆయనకు 
 గొప్ప ప్రఖ్యాతి ఆర్జించిపెట్టాయి. మొదటి పుస్తకంలో కాంతికి  
సంబంధించిన అంశాలు వివరిస్తే.. రెండో పుస్తకంలో లోలక  
గడియారాల  తయారీకి సంబంధించిన విషయాలున్నాయి.
అవార్డులు: 
              హైగెన్స్ గౌరవార్థం ఎన్నో సంస్థలకు ఆయన పేరు పెట్టారు.  
ఎంతోమంది చిత్రకారులు హైగెన్స్ చిత్రం గీశారు. 1950లో డచ్ ప్రభుత్వం  
ఆయన జ్ఞాపకార్థం కరెన్సీనోట్ కూడా ముద్రించింది. అందులో  
ఆయనతోబాటు శనిగ్రహం చిత్రం కూడా ఉంటుంది. 1695 జులై 8  
నెదర్లాండ్స్‌లో చనిపోయారు. 
_____________________________________________________



             విలియం గేస్కోయిన్

   విలియం గేస్కోయిన్ 1612లో లీడ్స్‌లోని మిడిల్‌టన్‌లో జన్మించారు.
మార్గరెట్ జేన్, హెన్రీ గేస్కోయిన్ ఆయన తల్లిదండ్రులు. గేస్కోయిన్
విద్యాభ్యాసం ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో సాగింది.  

శాస్త్ర జీవితం:
                 విలియం గేస్కోయిన్ తొలిసారి మైక్రోమెట్రిక్ మర తయారుచేశారు
 దాన్ని సెక్సటాంట్‌కి అమర్చి.. రెండు ఖగోళ వస్తువుల మధ్య దూరాన్ని  
కచ్చితంగా కొలవగలిగారు. మర భ్రమణాంతరం, కటకం నాభ్యాంతరాల  
సహాయంతో చంద్రుడు, ఇతర గ్రహాల పరిమాణం నిక్కచ్చిగా లెక్కగట్టారు. 
                 గేస్కోయిన్ రూపొందించిన మైక్రోమీటర్ తర్వాత మరింత 
 మెరుగైంది. అలా మెరుగుపరిచిన మైక్రోమీటరు మరతో శాస్త్రవేత్త రాబర్ట్  
హుక్ తోకచుక్క, ఇతర ఖగోళ వస్తువుల పరిమాణాలు కనుక్కున్నారు
 జేన్ లారెంట్ పామర్ మైక్రోమీటరు మరను మరింతగా అభివృద్ధి చేసి,  
ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న స్క్రూగేజ్‌ని తయారుచేశారు.  
దీని సహాయంతోనే చిన్నవస్తువుల పరిమాణాలు లెక్కగట్టగలిగారు. 
                 గేస్కోయిన్ 1642లో కింగ్ ఛార్లెస్ - 1 సైన్యంలో చేరారు
1644 జులై 2 యార్క్‌షైర్ మార్‌స్టన్ మూర్‌లో జరిగిన యుద్ధంలో మరణించారు. 
________________________________________________


జొహెనెస్ కెప్లర్
          జొహెనెస్ కెప్లర్, 1571లో 
 డిసెంబరు 27 జర్మనీలోని వేల్‌డెర్ స్టాట్‌లో  
జన్మించారు. కేథరిన్, హెన్రిక్ కెప్లర్ ఆయన 
 తల్లిదండ్రులు. గ్రామర్ పాఠశాల, లేటిన్  
పాఠశాల, మాల్‌బ్రాన్‌లోని మతబోధకుల  
పాఠశాలలో విద్య అభ్యసించారు.  
ఆయన 1589లో టుబిన్‌జెన్  
విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రం,
 మతశాస్త్రం నేర్చుకునేందుకు చేరారు
 అక్కడ ఆయన గణితశాస్త్రంలో ప్రతిభావంతుడిగా 
 గుర్తింపు సాధించారు. 
 
         ఆస్ట్రియా గ్రాజ్‌లోని ప్రొటెస్టెంట్ పాఠశాలలో గణితం, ఖగోళశాస్త్రాల 
 ఉపాధ్యాయుడిగా చేరారు. తర్వాత టుబిన్‌జెన్ విశ్వవిద్యాలయంలో  
బోధకుడిగా పనిచేశారు. ఖగోళ, జ్యోతిష, గణిత, తత్వ శాస్త్రాలపై అధ్యయనం 
 చేశారు. గ్రహాల కొత్త కక్ష్యల గురించి అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్త టైకోబ్రా 
 కెప్లర్‌ని తన సహాయకుడిగా నియమించుకున్నాడు. టైకోబ్రా మరణాంతరం  
ఇంపీరియల్ గణిత శాస్త్రవేత్తగా కెప్లర్ పదవిని పొందారు. గణన చేయడానికి సంవర్గమానాలను ఏవిధంగా ఉపయోగించవచ్చో వివరించారు. గ్రహగతులకు  
సంబంధించి మూడు నియమాలు ప్రతిపాదించారు. కోపర్నికస్ తెలియజేసిన 
 విషయాలను మెరుగుపరిచి వాటిని అభివృద్ధి చేశారు. కెప్లర్ గతి నియమాలు,  
న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి ఉపయోగపడ్డాయి
1630లో నవంబరు 15 తన 58 ఏట జర్మనీలోని రెజెన్స్‌బెర్గ్‌లో మరణించారు.
స్మృతి చిహ్నాలు: 
         చెక్ రిపబ్లిక్ ప్రేగ్‌లో టైకోబ్రా, కెప్లర్ శిలావిగ్రహాలు ప్రతిష్ఠించారు
2002లో కెప్లర్ చిత్రం ఉన్న 10 యూరోల వెండి నాణెం విడుదల చేసారు
 జర్మన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆయన చిత్రాన్ని కలిగి ఉన్న 
 తపాలా బిళ్ల విడుదలజేసింది.
______________________________________________________


  గెలీలియో
          గెలీలియో 1564 ఫిబ్రవరి 15న 
ఇటలీలోని పీసా నగరంలో విన్సెంజో గెలీలియో,
 గైలియా దంపతులకు జన్మించారు. ఆయన
 విద్యాభ్యాసం వల్లెంబ్రోసాలోని ఓ మఠంలో 
సాగింది. అనంతరం గణితశాస్త్ర అధ్యయనం 
కోసం పీసా విశ్వవిద్యాలయంలో చేరారు. 
 
          1589లో పీసాలో గణిత శాస్త్ర అధిపతిగా 
నియమితుడయ్యాడు. 1592లో రేఖాగణితం, యాంత్రిక శాస్త్రం, 
ఖగోళశాస్త్రాలను బోధించడానికి పాడువా విశ్వవిద్యాలయంలో చేరారు. 
1593లో వ్యాకోచం చెందే గాలి వలన పనిచేసే ఉష్ణమాపకం 
కనుక్కున్నారు. 1595 - 98 మధ్యకాలంలో సైనికులకు పనికివచ్చే 
రేఖాగణిత కంపాస్‌ని కనుక్కుని, అభివృద్ధిపరిచారు. 1609లో ఓ టెలిస్కోప్ కనుక్కున్నారు. అది పనిచేసే విధానం పెద్దలకు వివరించారు. 1610 
జనవరిలో ఆయన గురుగ్రహం ఉపగ్రహాలను గుర్తించారు. అదే ఏడాది శుక్రగ్రహం కళలు (Phases) పరిశీలించారు. ఈ పరిశోధనలు 
సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని బలపరిచాయి.
పై నుంచి కిందికి పడే వస్తువులు వాటి ద్రవ్యరాశి లేదా పరిమాణంతో 

నిమిత్తం లేకుండా శూన్యంలో ఒకే సమ త్వరణంతో ప్రయాణిస్తాయని 
తెలిపారు. లఘు లోలకాల మీద ఎన్నో ప్రయోగాలు చేశారు.
వాటి ఫలితాల ఆధారంగానే క్రిస్టియన్ హైగేన్స్ లోలక గడియారాలను తయారుచేయగలిగారు.
          భూకేంద్రక, సూర్యకేంద్రక సిద్ధాంతాలకు సంబంధించి గెలీలియో రాసిన 
 'డైలాగ్' అనే పుస్తకం క్రైస్తవ చర్చి ఆగ్రహానికి కారణమైంది. ఆయన్ని ఫ్లోరెన్స్ 
 నగరంలో గృహనిర్బంధంలో ఉంచింది. అక్కడే 1642 జనవరి 8 తన  
77 ఏట గెలీలియో చనిపోయారు. 
          గెలీలియోని ఆధునిక ఖగోళ శాస్త్ర పరిశోధనల పితామహుడిగా
పిలుస్తారు. 2009లో గెలీలియో టెలిస్కోప్ ఆవిష్కరించి 400 ఏళ్లు 
 పూర్తయిన సందర్భంగా అంతర్జాతీయ స్మారక నాణెం విడుదల చేశారు.
_________________________________________

     హెర్జ్

   హెర్జ్ 1857 ఫిబ్రవరి 22  
జర్మనీ హేంబర్గ్‌లో పుట్టారు.  
అన్నా ఎలిజబెత్, గుస్టవ్ ఫెర్డినాండ్ 
 హెర్జ్, ఆయన తల్లిదండ్రులు. ఆయన 
 జర్మనీలోని వివిధ నగరాల్లో  
విజ్ఞాన శాస్త్రం, ఇంజినీరింగ్  
అభ్యసించారు. 1880లో బెర్లిన్  
విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా 
 పొందారు. 
 
        1883లో కేల్ విశ్వవిద్యాలయంలో సైద్ధాంతిక భౌతిక శాస్త్ర అధ్యాపకుడిగా చేరారు. 1885లో కార్ల్‌స్రూహే విశ్వవిద్యాలయంలో 
భౌతికశాస్త్ర ఆచార్యుడిగా నియమితులయ్యారు. అక్కడ పనిచేస్తూనే విద్యుదయస్కాంత వికిరణాలను ఉత్పత్తి చేయడం, శోధించే ప్రక్రియలను కనుక్కున్నారు. హెర్జ్ చేసిన ప్రయోగాలు వైర్‌లెస్ టెలిగ్రాఫ్, రేడియో, 
రాడార్, టెలివిజన్ ఆవిష్కరణలకు దోహద పడింది. కాంతి తరంగాలు 
కూడా ఒకరకం విద్యుదయస్కాంత తరంగాలని ఆయన కనుక్కున్నారు. 1887లో కాంతి విద్యుత్తు ఫలితం లెక్కగట్టగలిగారు. 1892లో కాథోడ్ కిరణాలు అతిపల్చటి లోహపు రేకుల ద్వారా చొచ్చుకు పోగలవని తెలుసుకున్నారు.
        విద్యుదయస్కాంత వికిరణాల పౌనఃపున్యం S.I ప్రమాణంగా ఆయన  
గౌరవార్థం హెర్ట్జ్ పేరే పెట్టారు. ప్రపంచంలోని ఎన్నో దేశాలు ఈయన చిత్రంతో 
 తపాలా బిళ్లలను విడుదల చేసాయి. ఆయన 1894 జనవరి 1 తన 
 36 ఏట జర్మనీలోని బాన్ నగరంలో కన్నుమూశారు. 
______________________________________________________

 చార్లెస్ బాబేజ్

కంప్యూటర్ నిర్మాణానికి ఆద్యుడు 
చార్లెస్ బాబేజ్. 1791 డిసెంబర్ 26 
న బెంజిమన్, బెట్సీ దంపతులకు 
లండన్‌లో జన్మించారు. ప్రాథమిక,
ఉన్నత విద్యాభ్యాసాలు ఇంటివద్ద,
 ప్రైవేట్ పాఠశాలలో జరిగాయి. 
పై చదువులను కేంబ్రిడ్జ్‌లోని 
రినిటీ కాలేజ్, పీటర్‌హౌస్‌లో 
పూర్తిచేసి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ 
నుంచి గౌరవపట్టా పొందారు. 
కేంబ్రిడ్జ్‌లో గణితాచార్యుడిగా 
కొంతకాలం పనిచేసి మంచి గణిత 
శాస్త్రజ్ఞుడిగా పేరు పొందారు.
           సొంతంగా గణనలు చేసే యంత్రానికి 

 బాబేజ్ రూపకల్పన చేశారు. 'డిఫరెన్స్ ఇంజిన్', 'డిఫరెన్స్ ఇంజిన్ - II', సాంకేతికంగా ఎంతో ఉన్నతమైన 'ఎనలటికల్ ఇంజిన్ అనే యంత్రాలను తయారు చేశారు.
 
          వీటికి సంబంధించిన పత్రాలను చదివిన శాస్త్రవేత్తలు బాబేజ్ 
కృషిని ప్రశంసించారు. ఈ యంత్రాలు ప్రస్తుత కంప్యూటర్‌లా ఆలోచించి, సమస్యల సాధనను మానవ సాయం లేకుండా కనుక్కొనే విధంగా ఉన్నాయని భావించారు. బాబేజ్‌ను కంప్యూటర్ నిర్మాణానికి ఆద్యుడు 
అని పిలిచారు.
          రైల్వే సంస్థల కోసం 'పైలట్', 'డైనమో మోటార్ కారు', కంటి 

పరీక్షల కోసం 'ఆఫ్తాలమోస్కోప్' అనే పరికరాలను కూడా చార్లెస్ 
బాబేజ్ తయారు చేశారు. గణిత, ఖగోళ సంబంధ పట్టికలను గణన 
చేసే యంత్రాన్ని తయారుచేశాడు. ఈ పరిశోధనకు 1824లో రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీ నుంచి బంగారు పతకాన్ని పొందారు. బాబేజ్ 
 జ్ఞాపకార్థం చంద్రునిపై ఉన్న ఒక బిలానికి బాబేజ్ బిలం అని పేరు 
పెట్టడమే కాకుండా ఆయన పేరుమీద చార్లెస్ బాబేజ్ ఇన్‌స్టిట్యూట్ 
అనే సంస్థను కూడా స్థాపించారు. 1871లో 79వ ఏట మరణించారు.
_______________________________________

 జాకబ్స్ హెన్రికస్ వాంట్‌హాఫ్ జూనియర్

జాకబ్స్ హెన్రికస్ వాంట్‌హాఫ్ జూనియర్ 1852 ఆగస్టు 30న నెదర్లాండ్స్‌లోని రోటర్‌డామ్‌లో జన్మించారు. తల్లిదండ్రులు హెన్రికస్ వాంట్‌హాఫ్ సీనియర్, కాఫ్‌ వాంట్‌హాఫ్. చదువు ప్రారంభించిన తొలినాళ్లలో కవిత్వం, వేదాంతం పట్ల ఆసక్తి ప్రదర్శించేవాడు. 1869లో డెప్ట్ విశ్వవిద్యాలయంలో చేరాడు. రసాయన సాంకేతిక నిపుణుడిగా పట్టా పొందాడు. 1874లో యుట్రెక్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా పొందాడు.
         1874లో వాంట్‌హాఫ్ స్టియిరో కెమిస్ట్రీలో చేసిన పరిశోధనలను ప్రచురించాడు. 1884లో రసాయన గతిశాస్త్రంపై చేసిన పరిశోధనా వివరాలను ప్రచురించాడు.
 
          వీటిలో రసాయన చర్యల క్రమాంకాన్ని (Order) నిర్ణయించడానికి కొత్త పద్ధతి కనిపెట్టాడు. ఈ పద్ధతిలో గ్రాఫిక్స్, ఉష్ణగతి శాస్త్ర నియమాలను రసాయన చర్యల సమతాస్థితికి ఉపయోగించాడు. 1889లో అర్హీనియస్ సమీకరణానికి భౌతిక న్యాయాన్ని సమకూర్చాడు. 1896లో వాంట్‌హాఫ్‌ను బెర్లిన్‌లోని ప్రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో రసాయన శాస్త్ర ఆచార్యుడిగా నియమించారు.            వాంట్‌హాఫ్ 1893లో రాయల్ సొసైటీ నుంచి డేవి పతకాన్ని స్వీకరించాడు. ద్రావణాల మీద చేసిన ప్రయోగాలు, పరిశోధనలకు 1901లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందాడు. జర్మనీలోని బెర్లిన్‌లో 58వ ఏట 1911 మార్చి 1న మరణించారు. 
_________________________________________

  మెండలీవ్

  మెండలీవ్ 1834 ఫిబ్రవరి 8న సైబీరియాలోని టోబోల్‌స్క్(రష్యా)లో ఇవాన్ మెండలీవ్, మారియా కోర్నిలెవా దంపతులకు జన్మించాడు. స్థానిక పాఠశాల్లో ప్రాథమిక విద్యాభ్యాసం కొనసాగింది. 1850లో పెడగాగిక్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి, 1855లో ఉపాధ్యాయుడిగా అర్హత పొందాడు.
            మెండలీవ్ 1857లో మొదటి నియామకం పొందాడు. 1861లో ''ఆర్గానిక్ కెమిస్ట్రీ'' అనే పుస్తకాన్ని ప్రచురించాడు. 1864లో టెక్నికల్ ఇనిస్టిట్యూట్‌లో రసాయన శాస్త్రాచార్యుడిగా నియమితులయ్యారు. 1869లో ''ప్రిన్సిపుల్స్ ఆఫ్ కెమిస్ట్రీ'' అనే పుస్తకాన్ని ప్రచురించాడు. దీనిలో మూలకాల ఆవర్తన పట్టికకు సంబంధించిన విషయాలను తెలియజేశాడు.  
 
            మెండలీవ్ అంతవరకూ తెలిసిన మూలకాలను వాటి పరమాణు భారాల ఆరోహణ క్రమంలో అమర్చాడు. ఒకే ధర్మం గల మూలకాలను ఒకే నిలువు వరుసలో ఉంచాడు. ఈ పట్టికను పరిశీలించి మూలకాల ధర్మాలకు, వాటి పరమాణు భారాలకు సంబంధం ఉందని తెలుపుతూ ఆవర్తన నియమాన్ని ప్రతిపాదించాడు. తాను తయారు చేసిన పట్టికకు ఆవర్తన పట్టిక అని పేరు పెట్టాడు.
            ఈ పట్టికలో కొన్ని చోట్ల ఖాళీలను ఉంచాడు. ఈ ఖాళీల ఆధారంగా ప్రకృతిలో ఇంకా కనుక్కోవాల్సిన మూలకాలు ఉన్నాయని తెలియజేశాడు.వీటిలో మూడు మూలకాల లక్షణాలను 1870లో తెలియజేశాడు. తర్వాత శాస్త్రవేత్తలు ఈ మూడు మూలకాలను కనుగొన్నారు. వీటి లక్షణాలు మెండలీవ్ తెలియజేసిన మూలకాల లక్షణాలతో దాదాపుగా సరిపోయాయి
.
            మెండలీవ్ 1893లో తూనికలు, కొలతల విభాగానికి అధిపతి అయ్యాడు. 1905లో స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైస్సెస్‌కి సభ్యునిగా ఎన్నికయ్యాడు. 1907 ఫిబ్రవరి 2న సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో 72వ ఏట మరణించాడు. 

___________________________________________
       
  సర్ హంఫ్రీడేవి

    సర్ హంఫ్రీడేవి 1778 డిసెంబరు 17న కార్నవాల్‌లోని పెంజన్స్ (ఇంగ్లండ్)లో 
 రాబర్ట్ డేవి, గ్రేస్ మిల్లెట్ దంపతులకు జన్మించాడు. పెంజన్స్ గ్రామర్ పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం కొనసాగింది. 
ప్రాథమిక విద్యను పూర్తి చేయడానికి 
1793లో ట్రూరో వెళ్లాడు.
            1798లో బ్రిష్టల్‌లోని 

న్యూమేటిక్ ఇన్‌స్టిట్యూషన్‌లో 
చేరాడు. అక్కడ వాయువులపై 
ప్రయోగాలు చేశాడు. 1801లో 
రసాయన శాస్త్ర అధ్యాపకుడిగా రాయల్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాడు. 1804లో రాయల్ సొసైటీ సభ్యుడయ్యాడు. 1810లో 'ది రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌' కి విదేశీ సభ్యునిగా ఎన్నికయ్యాడు. 1820లో రాయల్ సొసైటీ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు.  
 
          1807లో డేవిడ్ హంఫ్రీ పొటాషియం హైడ్రాక్సైడ్ నుంచి 
పొటాషియం తయారుచేశాడు. సోడియం హైడ్రాక్సైడ్ నుంచి 
సొడియంను వేరుచేశాడు. 1808లో కాల్షియం మూలకాన్ని కనుక్కొన్నాడు. మెగ్నీషియం, బోరాన్, బేరియం మూలకాలను 
కూడా గుర్తించాడు. బొగ్గు గనుల్లో ఉపయోగించే రక్షక దీపాన్ని కనుగొన్నాడు. 1810లో క్లోరిన్ వాయువుకి ఆ పేరును 
ప్రతిపాదించాడు.
          చంద్రునిపై ఒక బిలానికి డేవీ పేరు పెట్టారు. నెపోలియన్ 

బోనా పార్టీ నుంచి ఒక పతకాన్ని పొందాడు. 1819లో హంఫ్రీ డేవీకి
''సర్'' బిరుదు ఇచ్చి గౌరవించారు. 1829 మే 29న 50వ ఏట స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో మరణించాడు.
________________________________________
         

        లైనస్ కార్ల్ పౌలింగ్

   లైనస్ కార్ల్ పౌలింగ్ 1901 ఫిబ్రవరి 28న అమెరికాలోని ఓరిగాన్‌లోని 'లేక్ ఓస్వెగొ'లో 
హెర్మన్ పౌలింగ్, లూసీ ఇసబెల్లా దంపతులకు జన్మించాడు. 1917లో పాఠశాల విద్య 
పూర్తయ్యాక కెమికల్ ఇంజినీరింగ్ 
చదవడానికి కార్వల్లీస్‌లోని ఓరిగాన్ 
స్టేట్ అగ్రికల్చరల్ కాలేజీలో చేరాడు. 
1925లో పట్టభద్రుడయ్యాడు. తర్వాత పేసాడేనాలోని కాలిఫోర్నియా 
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నుంచి Ph.D.పొందాడు. తన రెండు సంవత్సరాల 
యూరప్ పర్యటనలో ప్రముఖ శాస్త్రవేత్తలైన నీల్స్ బోర్, స్క్రోడింగర్, బ్రేగ్‌లతో కలిసి పనిచేశాడు. పౌలింగ్ అణు నిర్మాణాన్ని క్వాంటం యాంత్రిక శాస్త్రంతో వివరించాడు.  
 
            పౌలింగ్ 1939లో రసాయన బంధాలపై ఒక 
పుస్తకాన్ని ప్రచురించాడు. దీనిలో క్వాంటం యాంత్రిక శాస్త్రం 
ఆధారంగా రసాయన బంధాలు ఏర్పడటాన్ని వివరించాడు. 
 ఆర్బిటాళ్లు సంకరీకరణ చెందుతాయని వివరించాడు. రుణ విద్యుదాత్మకత అనే భావనను ప్రవేశపెట్టి, మూలకాల రుణ విద్యుదాత్మకతల పట్టికను తయారు చేశాడు. మొట్టమొదటి
సారిగా యాంటీబాడీస్, ఎంజైమ్‌లు ఎలా పనిచేస్తాయో వివరించాడు. 1951లో పౌలింగ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఏడు పీచు 
ప్రొటీన్‌ల నిర్మాణాలను వివరించింది. 1954లో రసాయన శాస్త్రంలో 
నోబెల్ బహుమతి పొందాడు.
            అణుపరీక్షలను నిషేధించాలని, అణ్వాయుధాల మీద 

నియంత్రణ ఉండాలని ప్రపంచమంతా తిరిగి ప్రచారం చేశాడు. 
అణ్వాయుధ పరీక్షలు జరపకుండా చూడాలని ఐక్యరాజ్యసమితికి 
11వేల మంది శాస్త్రవేత్తల సంతకాలతో ఒక విజ్ఞాపన పత్రాన్ని 
అందజేశాడు. 1962లో పౌలింగ్‌కు నోబెల్ శాంతి బహుమతి 
వచ్చింది. 1994 ఆగస్టు 19న కాలిఫోర్నియాలో మరణించాడు.
_____________________________________

హోమీబాబా...

ఆధునిక భారతదేశం ఇప్పటిస్థాయికి ఎదగడానికి కొంతమంది మూలపురుషులు కారణం. అణు విజ్ఞానంలో ఇప్పటిస్థాయికి వచ్చేటట్లు కార్యక్రమాన్ని రూపొందించింది హోమీ జహంగీర్‌ బాబా (హోమీబాబా). అప్పట ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రోద్బలంతో అణు విజ్ఞానంలో మన దేశం స్వయం పోషకత్వం సాధింపజేసే లక్ష్యంతో హోమీబాబా మన దేశ అణు కార్యక్రమాన్ని రూపొందించాడు. ఇటువంటి బాబా 1909 అక్టోబర్‌ 30న జన్మించాడు. అంటే ఈ సంవత్సరం ఆయన శత జయంతి. ఈయనను భారత అణు ఇంధన పితామహుడిగా పరిగణిస్తున్నాం. ఈయన టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ సైన్స్‌ సంస్థను, భారత అణు ఇంధన కమిషన్‌ను ప్రారంభించాడు. 1948లో భారత అణు ఇంధన కమిషన్‌ ఏర్పాటైంది. ఈ రెండూ మన విజ్ఞానశాస్త్ర పరిశోధనలకు, దేశాభివృద్ధికి ఎంతో కీలకమైనవి. ఉన్నత విద్యా సంస్కరణల్లోనూ హోమీబాబా ప్రముఖపాత్ర వహించాడు. ఇవన్నీ ఈ రంగాల్లో మనదేశం స్వయంపోషకత్వం సాధించాలనే లక్ష్యంతో చేపట్టారు. ఇప్పటి ప్రపంచీకరణలో భాగంగా చేపట్టే సంస్కరణలు ఈ లక్ష్యాలకు విరుద్ధంగా ఉన్నాయి. అయితే ఈయన 1966లో ఫ్రాన్స్‌లో మౌన్ట్‌బ్లాంక్‌ అనే చోట జరిగిన భారత విమాన ప్రమాదంలో మరణించాడు. ఈయన మరణం వెనుక సిఐఎ హస్తం ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈయన గౌరవార్థం ముంబయిలో పనిచేస్తున్న అణుశక్తి వ్యవస్థ సముదాయాన్ని బాబా అటమిక్‌ పరిశోధనా సంస్థగా నామకరణం చేశారు. అణుశక్తిని శాంతి ప్రయోజనాలకు వాడటంలో ఈ సంస్థ ఎంతో కృషి చేస్తోంది.

మూడు స్థాయిల్లో పనిచేసే అణు విద్యుత్‌ కార్యక్రమాన్ని ఈయన రూపొందించాడు. మొదటి దశలో సహజంగా దొరికే యురేనియాన్ని భారజలంతో నియంత్రిస్తూ, చల్లబరిచే రియాక్టర్స్‌ (ప్రెషర్డ్‌ హెవీవాటర్‌ రెగ్యులేటర్‌) ద్వారా తయారుచేయాలని ప్రతిపాదించాడు. వాడిన ఇంధనం నుండి ఫ్లుటోనియంను తయారుచేయాలని ప్రతిపాదించాడు. రెండోదశలో ఫాస్ట్‌ బ్రీడర్‌ రియాక్టర్స్‌ ద్వారా ఈ ఫ్లుటోనియం నుండి విద్యుదుత్పత్తి అయ్యేలా ఈ దశను రూపొందించాడు. ఇదే రియాక్టర్‌ ద్వారా మనకు సమృద్ధిగా గల థోరియం అణు ఇంధనం నుండి యు233 తయారుచేయాలని ప్రతిపాదించాడు. ఇక మూడోదశలో యు233 లేదా థోరియం నుండి నేరుగా విద్యుదుత్పత్తి కొనసాగాలని ప్రతిపాదించాడు. అయితే రెండోరోజుల క్రితం 2009, అక్టోబర్‌ 29న ఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మాట్లాడుతూ అణు విద్యుత్‌ కార్యక్రమాల్లో మనం మొదటిదశను పూర్తిచేశామని, రెండో దశలోకి వచ్చామని ప్రకటించారు. అంటే ఇది అణువిద్యుత్‌ కార్యక్రమాల్లో బాబా ముందుచూపుకు నిదర్శనం.
______________________________________ 

ఖగోళశాస్త్ర పితామహుడు..!

  • నేడు నికోలస్‌ కోపర్నికస్‌ జయంతి
  •  
  • Nikolaus Kopernikus
చిన్నారులూ..! 'విశ్వంలో ఏం జరుగుతుందో..? ఈ భూమి మీద ఇంతమందిమి ఉన్నాం మరి ఇది కుంగిపోదా..?' అని ఇలాంటివే చాలా సందేహాలు మీ బుజ్జి బుర్రల్లో మెదులుతూనే ఉంటాయి. అలాంటి జిజ్ఞాసతోనే ఈ పక్క చిత్రంలో కనిపిస్తున్న 'నికోలస్‌ కోపర్నికస్‌' గొప్ప నిజాన్ని కనిపెట్టాడు. ఇప్పుడు మీలో ఎవర్ని అడిగినా 'సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంద'ని ఠక్కున చెప్పేస్తారు. కానీ దీన్ని నిరూపించడానికి ఎన్నో ఆటంకాలను ఎదుర్కొన్నాడు కోపర్నికస్‌. ఎన్నో ప్రయోగాలు చేశాడు. అందుకు గణిత, ఖగోళశాస్త్రాల్ని మదించాడు. చివరకు భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడనే కన్నా సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందని అను కుంటేనే రాత్రీ పగలుకూ, మారుతున్న ఋతువులకూ కారణాలు సులభంగా అర్థమవుతాయ న్నాడు. అంతేకాదు ఆ వాస్తవాన్ని లెక్కలతో సహా నిరూపించాడు. తన పరిశోధనాసారం ప్రపంచానికి ఎలా ఉపయోగపడిందో ఆయనైతే చూడలేకపోయాడు. కానీ మనం మాత్రం ఆ వాస్తవాన్ని గ్రహించి, మరింత ముందుకుపోతున్నాం. ఈ నిజాన్ని అంగీకరించడానికి నాటి మత వాదులు ఏమాత్రం ఇష్టపడలేదు. కానీ నేడు అదే వాస్తవమైంది. సైన్స్‌ ఏదైనా ప్రయోగాత్మకంగా రుజువైనవే వాస్తవమని నమ్ముతుంది. ప్రయోగాత్మకంగా ఋజువు చేయడం అంత ఆషామాషీ కాదు. అందుకెంతో కృషి చేయాలి. అంత మేధోమథనం చేశాడు గనుకే 'నికోలస్‌ కోపర్నికస్‌' ఖగోళ పితామహుడయ్యాడు. మరి ఆయన గురించి తెలుసుకుందామే..!
'నికోలస్‌ కోపర్నికస్‌' 1473, ఫిబ్రవరి 19న జన్మించాడు. తండ్రి రాగి వ్యాపారం చేసేవాడు. నలుగురి పిల్లల్లో 'కోపర్నికస్‌' ఆఖరివాడు. 'కోపర్నికస్‌'కు పదేళ్లప్పుడే తల్లీతండ్రీ ఇద్దరూ మరణించారు. మేనమామ 'లుకాస్‌ వాజెన్‌రోడ్‌' పెంచి పెద్దచేశాడు. ఆయన గొప్ప విద్యావేత్త. న్యాయశాస్త్రంలో 'బోలాగ్నా' యూనివర్శిటీ నుండి డాక్టరేట్‌ పొందాడు. 'పర్మియా'లో బిషప్‌ కూడా. సామాజిక హోదా, డబ్బుకు లోటు లేకపోవడంతో తెలివైన 'కోపర్నికస్‌'ను బాగా చది వేందుకు ప్రోత్సహించాడు. 'కోపర్నికస్‌' 'క్రాకౌ' యూని వర్శిటీలో రెండేళ్లు చదువుకున్నాడు. ఆ తర్వాత 'ఫ్రంబర్క్‌' చర్చిలో మతాధికారిగా ఉద్యోగం వచ్చింది. చర్చిలో ఎక్కువ సమయం ఉండాల్సిన అవసరం లేకపోవడంతో మరో 12 సంవత్సరాలు చదువు కొనసాగించాడు.
యూరప్‌లో 15వ శతాబ్ది ఆరంభం నాటికి కొత్త మార్గాలు, ప్రాంతాల అన్వేషణ ముమ్మరంగా మొదలైంది. కొందరు అప్పటికే కొత్త ప్రాంతాలను అన్వేషించారు. రాజులు, ప్రభువుల పాలన పోయే దిశగా సమాజంలో మార్పు జరుగుతోంది. మేధోమథనం ఆరంభమైంది. ఇది 'కోపర్నికస్‌'లోనూ ప్రారంభమైంది. ముద్రణ పద్ధతి అమల్లోకి రావడంతో పుస్తకాలూ అందుబాటులోకి వచ్చాయి. కనపడిన ప్రతి పుస్తకాన్నీ 'కోపర్నికస్‌' చదివేవాడు. గణిత, ఖగోళశాస్త్రాలపై ఎక్కడ ఉపన్యాసాలున్నా హాజరయ్యేవాడు.
ఈ కొత్త భావాలకు అప్పట్లో ఇటలీ కేంద్రంగా ఉండేది. క్రమంగా ఆ భావాలు ఇతర దేశాలకూ వ్యాపించాయి. 1496లో 'బోలోగ్నా' యూనివర్శిటీలో 'కోపర్నికస్‌' చేరాడు. ఆ తర్వాత 'పడువా', 'ఫెరార' యూనివర్శిటీల్లో చదివాడు. 'జీవితం, కళ, తత్వ శాస్త్రాల'పై తమ తమ అభిప్రాయాలను లేఖల రూపంలో రాసి, వాటినే పంచేవారు. వాటిని 'కోపర్నికస్‌' ఆసాంతం చదివేవాడు. న్యాయశాస్త్రాన్ని చదువుతున్నా ఆయన ధ్యాసంతా 'ఖగోళ, గణితశాస్త్రాల'పైనే ఉండేది. ఆయన 'గ్రీకు భాషను, వైద్యం, తత్వశాస్త్రం, రోమన్‌ చట్టాన్ని' కూడా అధ్యయనం చేశాడు. 'బోలోగ్నా' యూనివర్శిటీ లోనే ప్రముఖ ఖగోళశాస్త్రవేత్తలు 'డోవినికో', 'డానొవోరా' పరిచయమయ్యారు. 'డానొవోరా' సహకారంతో ఖగోళ పరిశోధనల్లో కిటుకులు తెలుసుకున్నాడు. 'కోపర్నికస్‌' అన్వేషణకు ఇక్కడే పునాది పడింది. విమర్శనాత్మకంగా విషయాల్ని పరిశీలించే అలవాటు 'కోపర్నికస్‌'కు చిన్న ప్పటి నుండీ ఉంది. 'టాలెమీ' సిద్ధాంతాల్లో వాస్తవాన్ని అనుమానించటమే కాక, ప్రత్యామ్నాయం కోసమూ అన్వేషించాడు.
న్యాయశాస్త్రంలో 1503లో డాక్టరేట్‌ పొంది, 'ఫ్రంబర్గ్‌' వెళ్లాడు. ఈలోపు మేనమామ అస్వస్థతకు గురైతే 1506-12 వరకూ అక్కడే ఉన్నాడు. ఈ ఆరేళ్లల్లో ఎన్నో ఆలోచనలు చేశాడు. 'టాలెమి' ప్రతిపాదనల్ని వందలసార్లు పరిశీలించాడు. చివరికి 'సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని' చిత్తుగా తయారుచేశాడు. 1514లో ఈ విషయాన్ని మిత్రులు కొందరికి అందజేశాడు. అదే తర్వాత 'ఆన్‌ ద రివెల్యూషన్‌ ఆఫ్‌ ద సెలెస్ట్రియల్‌ స్పియర్స్‌' గ్రంథంలో వివరించాడు.
'ఫ్రంబర్గ్‌' నుంచి తిరిగొచ్చాక ఇంటి పైకప్పు మీద ప్రయోగశాలను ఏర్పాటు చేసుకుని, ఖగోళ పరిశోధన లు జరిపాడు. తన ప్రతిపాదనల్నే పదేపదే తార్కికంగా పరిశీలించాడు. చివరికి తన సిద్ధాంతమే వాస్తవాన్ని ప్రతిబింబిస్తోందనే నిర్ణయానికి వచ్చాడు. సూర్యుడితో పాటు ఇతరగ్రహాలు భూమి చుట్టూ తిరుగుతున్నట్లు అరిస్టాటిల్‌, టాలెమి ఎందుకు భావించారో 'కోపర్నికస్‌' కు అర్థమైంది. భూమి నిర్దిష్ట కక్ష్యలో 24 గంటలకోసారి తనచుట్టూ తాను తిరగటంతో సూర్యుడూ, ఇతర గ్రహాలూ భూమి చుట్టూ తిరుగుతున్నట్లు వారు భ్రమించారని నిర్ణయానికొచ్చాడు. ఒక్క చంద్రుడే భూమి చుట్టూ తిరుగుతున్నాడని ఆయన ప్రతిపా దించాడు. అంగారకుడు, బృహస్పతి, శని గ్రహాలు భూమి కంటే దూరంగా సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయని చెప్పాడు. దీనికి ఆకర్షితుడైన జర్మనీ గణితశాస్త్రవేత్త 'రెటికస్‌' 1539లో 'కోపర్నికస్‌'ని చూడటానికి 'ప్రంబర్గ్‌'కి వెళ్లాడు. 'రెంటికన్‌' ఎంత బతిమాలినా వాటిని ప్రచురించటానికి 'కోపర్నికస్‌' అంగీకరించలేదు. చివరికి 1540లో 'కోపర్నికస్‌' సిద్ధాంతాన్ని 'రెటికస్‌' స్వయంగా ప్రచురించాడు. ఆ పుస్తకం వెలుగులోకి వచ్చినరోజే 1543, మే 24న 'కోపర్నికస్‌' మరణించాడు. మిత్రులు ఆ పుస్తక ప్రతిని ఒకదాన్ని ఆయన చితిపై పెట్టారంట! ఏమైనా 'విజ్ఞానశాస్త్రం'లో ఇదే అంతిమం అనేదేమీ ఉండదు. నిరంతర ప్రయోగాత్మక ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. అదే విజ్ఞానశాస్త్ర పురోగమనం తీరు..!
మరి ఇంత గొప్ప విషయాన్ని కనిపెట్టిన
'నికోలస్‌ కోపర్నికస్‌'కు జేజేలు చెప్పేద్దామే..!
_______________________________________________
 

CLICK ON NAME OF SCIENTIST
   C.V.RAMAN            MARIE CURIE          J.C. BOSE              A.P.J.KALAM   
S.RAMANUJAN         ARCHIMEDES             NIELS  BOHR        ROBERT BOYLE     
CHARLES DARWIN    ISAAC NEWTON         PLANK MAX            LOUIS PASTEUR              
P C RAY            ERNEST RUTHERFORD      RAJA RAMANNA    MEGHNAD SAHA        

No comments:

Post a Comment