Tuesday 23 October 2012

చీకటి రోజులు

 
 
కరెంట్ లేని ప్రపంచాన్ని ఊహించడం అన్న ఆలోచనే భయానకం. మనిషి జీవితం అంతగా విద్యుత్‌తో పెనవేసుకుపోయింది. మనిషి బతుకు ఇప్పుడు కేవలం ప్రాణ
వాయువు ఒక్కటే ఆధారం కాదు, కరెంటు కూడా అంటే గొప్పగా ఆశ్చర్యపడాల్సినదేమీ లేదు. ఇంటి కాలింగ్ బెల్ నుంచి, బాత్‌రూమ్‌లో గీజర్ వరకు, వంటిల్లు, పడకిల్లు అని లేకుండా అన్నీ విద్యుత్ అవసరాలకు మూలమే. అమెరికాలో కొన్ని నిమిషాలు కరెంట్ పోతే సమస్త జన జీవనం స్తంభించిపోయిందట! అని చాన్నాళ్ల క్రితం జనం ఆశ్చర్యంగా చెప్పుకున్న సంగతి ఇప్పుడు మన దేశానికి వర్తిస్తోంది. కరెంట్ అవసరాలు ఎంతగా
పెరిగాయో, కోతలూ అంతకంతకూ పెరుగుతున్నాయి.
అరవై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతంలో ప్రతి పల్లెకు,
పరిశ్రమకు ఇరవై నాలుగు గంటలు ఎడతెగకుండా విద్యుత్
సరఫరా చేయలేకపోతున్నాం. స్వర్ణాంధ్రప్రదేశ్‌గా పేరొందిన
రాష్ట్రం ఇప్పుడు అంధేరాప్రదేశ్‌గా పేరు తెచ్చుకుంటోంది.
భారతదేశ ధాన్యాగారంగా పేరొందిన రాష్ట్రం సేద్యానికి కావలసినంత విద్యుత్‌ను రైతులకు అందించలేకపోతోంది. ముందు
చూపుతో ప్రణాళికలు రూపొందించే పాలకుల కొరత, అధికారుల అలక్ష్యం వెరశి అటు పట్నాలు, ఇటు పల్లెలు చీకటి రాజ్యంలో కొట్టుమిట్టాడుతున్నాయి. తిమిరంతో సమరం చేస్తున్నాయి.
ప్రతి ఒక్కరూ కరెంట్‌గత జీవులైపోయారు. ఏ పని చేయాలన్నా కరెంట్ అవసరం. అది సమయానికి ఉండదు. ఉంటే లోఓల్టేజీ. కరెంట్ ఉంది కదా అని పని మొదలుపెడితే అంతలోనే పోతుంది. ప్రాణం పోకడ గురించి వైద్యులైనా చెప్పగలరేమోగాని కరెంట్ నిలకడ గురించి చెప్పగలవారెవరూ లేరు. ఘన, ద్రవ, వాయు పదార్థాలు ఏవీ కూడా కరెంట్ ఉత్పత్తికి తోడ్పడని పరిస్థితి. బొగ్గు కొరత, అనావృష్టి, గ్యాస్ కోత ఇవన్నీ కలసి అగమ్యగోచరమైన పరిస్థితిలోకి నెట్టాయి. ప్రభుత్వాల అధినేతలు, అధికారులు కరెంట్‌తో పరాచికాలు ఆడిన ఫలితం ఇప్పుడు జనానికి ‘కోతల’ రూపంలో షాక్ కొడుతోంది. సకాలంలో వర్షాలు లేకపోవడం తదితర కారణాల వల్ల జలవిద్యుత్ ప్రాజెక్టుల పరిస్థితి ఏమీ బాగాలేదు. బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్లు కూడా వివిధ సమస్యలతో సతమతమవుతున్నాయి. బొగ్గు ధరలు పెరుగుతుండడంతో ఆ మేరకు వినియోగదారునిపై భారం వేయాల్సి వస్తోంది. మరోపక్క రావాల్సిన మేరకు బొగ్గు రావడం లేదు. గత ఏడాది, ఈ ఏడాది కూడా మహానది బొగ్గు గనుల నుంచి రావాల్సిన దాంట్లో సగం బొగ్గు కూడా రాలేదు. దానా దీనా వివిధ మార్గాల ద్వారా అందే విద్యుత్ తొమ్మిది వేల మెగావాట్లకు కాస్త అటు ఇటుగా ఉంటోంది. కానీ వేసవి లాంటి కీలక సీజన్‌లో కావాల్సిన విద్యుత్ కనీసం 12వేల మెగావాట్ల నుంచి 13వేల మెగావాట్ల వరకు ఉంటుంది. అంటే దీన్నిబట్టి లోటు అంచనా వేసుకోవచ్చు. కెజి బేసిన్‌లో ఆశించిన మేర ఉత్పత్తి జరగకపోవడం, వివిధ రాష్ట్రాలకు తరలింపుల వల్ల గ్యాస్ ఆధారిత విద్యుత్ నామమాత్రంగా మారింది. ఇప్పుడు రాష్ట్రంలో సగటు విద్యుత్ లోటు 45 మిలియన్ యూనిట్లు. ఈ మాత్రానికే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఫిబ్రవరి నుంచి మే మధ్య కాలంలో ఉండే 100-120 మిలియన్ యూనిట్ల లోటును భర్తీ చేయడం ఎలా?
మామూలుగా వేసవిలో కోతలు సర్వసాధారణం. గత రెండేళ్లుగా ‘్భరీ’ పరిశ్రమలకు విద్యుత్ కోతలు అమల్లో ఉన్నాయి. ప్రస్తుతం పరిశ్రమలకు పవర్ హాలీడే అమలవుతోంది. దాంతో కొన్ని పరిశ్రమలు పాక్షికంగా, ఇంకా కొన్ని పూర్తిగా మూతపడుతున్నాయి. దానివల్ల దినసరి ఉత్పత్తి నష్టం రూ.248 కోట్లు. భారీ పరిశ్రమలకు పవర్ హాలిడే వల్ల నెలలో సగం అంటే 16 రోజులు కోత విధిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. భారీ పరిశ్రమలు, లఘుపరిశ్రమలే కాదు ఒకటి, రెండు పవర్‌లూమ్‌లు నిర్వహిస్తున్న నేత కార్మికులపై కూడా దాని ప్రభావం పడింది. దానికి తోడు విద్యుత్ చార్జీలు పెరగడం వల్ల పవర్‌లూమ్‌లు కుంటుపడ్డాయి. గడచిన దశాబ్దకాలంగా రాష్ట్రంలో పరిశ్రమల విద్యుత్ వినియోగం బాగా పెరుగుతూ వస్తోంది. రాష్ట్భ్రావృద్ధికి పరిశ్రమలు కీలకం. ఈ రంగంలో విద్యుత్ వినియోగం ప్రయోజనకరమే. పదేళ్ల కిందట ఏడువేల మిలియన్ యూనిట్లున్న వినియోగం ఇప్పుడు 20వేల మిలియన్ యూనిట్లకు పెరిగింది. అయినప్పటికీ మొత్తం విద్యుత్ వినియోగంలో పరిశ్రమల వాటా ముప్పై శాతానికి మించడం లేదు. అదే పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగే గుజరాత్ పరిశ్రమల్లో విద్యుత్ వినియోగం 40 శాతం వరకు ఉంది. కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా అంతే. పరిశ్రమలతో పాటు రాష్ట్రంలో స్పిన్నింగ్ మిల్లులు, లైఫ్ సేవింగ్ డ్రగ్స్, విత్తన ప్రాసెసింగ్ యూనిట్లకు వారానికి మూడు రోజులు లేదా నెలకు ఎనిమిది రోజులు పవర్ హాలిడే ప్రకటించారు. ఇక పౌల్ట్రీ, రైస్‌మిల్లులు, కోల్డ్‌స్టోరేజీలకు 40శాతం విద్యుత్ కోత అమలు చేస్తున్నారు. వ్యవసాయం, సింగరేణి, తాగునీరు, ప్రభుత్వ ఆసుపత్రులు, రైల్వే ట్రాక్షన్, డిఫెన్స్‌లకు మినహాయింపు ఇచ్చారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆసుపత్రులకు కూడా విద్యుత్ సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడవచ్చు. అయితే అధికారికంగా కోతలు విధించిన సమయాల్లోనూ కొన్ని ప్రాంతాలలో కిందిస్థాయి సిబ్బంది సహాయ సహకారాలతో విద్యుత్ చౌర్యం జరుగుతోంది. ఇది విద్యుత్ పంపిణీ సంస్థల ఆదాయాన్ని దెబ్బతీస్తోంది.
రాష్ట్రప్రజలు అటు కరెంటు కోతలకు, ఇటు ప్రభుత్వాల వాతలకు అలవాటు పడ్డారు. డిస్కంలు తరచుగా పెంచుతున్న విద్యుత్ చార్జీలను భరిస్తూనే మరొకవైపు వినియోగదారులు ప్రతి సంవత్సరం కరెంట్ కోతలు తప్పవని గ్రహించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాష్టవ్య్రాప్తంగా చాలామంది వినియోగదారులు ఇప్పటికే ఇన్వర్టర్లను కొనుగోలుచేసి బిగించేసుకున్నారు. గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాలలో ‘బీహార్ తరహా పద్ధతి’లో సిటీ జనరేటర్ వ్యవస్థ జోరుగా సాగుతోంది. కొంతమంది వ్యాపారులు సొంతంగా డీజిల్ జనరేటర్లు పెట్టుకుని, వాటి ద్వారా ఇళ్లు, దుకాణాలకు కేబుల్ టీవీ కనెక్షన్లు ఇచ్చినట్లు కరెంట్ కనెక్షన్లు ఇచ్చి విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం. బీహార్‌లోని చాలా గ్రామాల్లో కరెంట్ సరఫరా సరిగా ఉండదు. వీధిలో ఎవరైన ఓ మోతుబరి జనరేటర్ ఏర్పాటు చేసుకుని వీధిలోని వారందరికీ కరెంట్ ఇస్తుంటాడు. అందుకు వారు నెలకు ఇంత అని ఇస్తుంటారు. ఇప్పుడు గోదావరి జిల్లావాసులు ఆ పద్ధతికి అలవాటు పడుతున్నారు. ఈ రకంగా ప్రైవేట్ ఆపరేటర్లు , తప్పనిసరి పరిస్థితుల్లో పరిశ్రమల నిర్వాహకులు జనరేటర్లను నడపడం కోసం పెద్ద మొత్తంలో డీజిల్ కొని దేశంలో డీజిల్ వినియోగాన్ని పెంచుతున్నారు.
అధికారం ఉన్నవారిది లేదా అధికారంలో ఉన్నవారిని మెప్పించి పనులు చేయించుకోగలవారిదే రాజ్యం. రాష్ట్రానికి కేంద్రంలో ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీలు, మంత్రులు చేతులు ముడుచుకు కూర్చోవడం వల్ల కేంద్రంలో అధికారంలో ఉన్న వివిధ రాష్ట్రాల మంత్రులు ఆయా రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో పరిధికి మించి ప్రవర్తిస్తున్నారు. మన మంత్రులు మాత్రం అదేదో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అన్నట్లు వ్యవహరిస్తున్నారు. మరోవైపు కేంద్రంలో ఇతర రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న వారు తమ సొంత రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుకునేందుకు స్వార్థంతో వ్యవహరిస్తున్నారు. కేంద్రం వద్ద గ్రిడ్ పరిధిలో ఉండే విద్యుత్ నుంచి రాష్ట్రానికి వచ్చే విద్యుత్తుకు కోతపెట్టిన కేంద్ర విద్యుత్ శాఖ సహాయమంత్రి వేణుగోపాల్ 100 మెగావాట్లు తన సొంతరాష్ట్రం కేరళకు తరలించుకుపోతున్నారు. గత సంవత్సరం కేంద్ర గ్రిడ్ నుంచి దక్షిణాదికి ఇచ్చే విద్యుత్‌లో రాష్ట్రం 150 మెగావాట్లు పొందగా ఈ సారి అది బాగా తగ్గిపోయింది. ఈ విధంగా గ్రిడ్ నిర్వహణకు సంబంధించిన నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా మొన్నీమధ్య జరిగినట్లు దేశమంతా చీకటిమయం అవుతుంది. గ్రిడ్ పరిధిలోని రాష్ట్రాలు పరిమితికి మించి విద్యుత్‌ను వాడుకోవడం వల్ల వ్యవస్థ విఫలమైంది. గ్రిడ్ పరిధిలో ఎనిమిది రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతం ఉన్నా ప్రధానంగా మూడు రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్‌లే ఈ పరిస్థితికి కారణమని ఆరోపణలు వచ్చాయి. కొన్ని రాష్ట్రాలు పరిమితికి మించి విద్యుత్‌ను ఉపయోగించుకోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా చెప్తున్నారు.
రాష్ట్రంలో బొగ్గుతో పాటు గ్యాస్ నిల్వలుండటం సానుకూలాంశం. ప్రస్తుతం 2760 మెగావాట్ల సామర్థ్యంతో గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులున్నాయి. వీటికి 12.97 ఎంఎంఎస్‌సీఎండీల గ్యాస్ అవసరం కాగా కేంద్రం 9.75 ఎంఎంఎస్‌సీఎండీల గ్యాస్ మాత్రమే కేటాయించింది. కానీ ఇప్పుడు కేటాయించిన గ్యాస్‌లో కేవలం 32శాతం మాత్రమే సరఫరా అవుతోంది. ఫలితంగా 1,200 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. కొత్తగా ప్రైవేటురంగంలో 3,300 మెగావాట్ల సామర్థ్యంతో ప్రాజెక్టులు సిద్ధమయ్యాయి. వీటితో కలిపి మొత్తం 8,185 మెగావాట్ల సామర్థ్యంతో ప్రాజెక్టులు ప్రతిపాదనలో ఉన్నాయి. అలానే రాష్ట్ర ప్రభుత్వం 2,900 మెగావాట్ల ప్రాజెక్టులకు సిఫార్సు చేసింది. కరీంనగర్, శంకర్‌పల్లి ప్రాజెక్టులు ప్రతిపాదనలో ఉన్నాయి. అన్నీ కలిపితే 70 ఎంఎంఎస్‌సీఎండీల గ్యాస్ అవసరం. ఇందులో సగం వాస్తవరూపంలోకి వచ్చినా రాష్ట్రం మిగులు విద్యుత్ సాధిస్తుంది. రాష్ట్ర విద్యుత్ ఉత్పాదన సంస్థ ఎపిజెన్‌కో ప్రతిపాదించిన అనేక ప్రాజెక్టులు ఏళ్లతరబడి వెలుగుచూడటం లేదు. రాష్ట్రంలో పరిస్థితి ఘోరంగా ఉందని స్వయంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఢిల్లీలో జరిగిన విద్యుత్ శాఖ మంత్రుల సమావేశంలో వెల్లడించారు. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 2770 మెగావాట్లు ఉన్నా గ్యాస్ కొరత కారణంగా 1600 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం వృథా అవుతోందని, గ్యాస్ సరఫరా లేక 4వేల మెగావాట్ల విద్యుత్ ఆగిపోయిందని చెప్పారు. దాదాపు 22వేల కోట్ల పెట్టుబడి వృథా అయ్యింది. ఢిల్లీ సమావేశంలో మంత్రి ఏకరువు పెట్టిన సమస్యల, కోర్కెల చిట్టా పరిశీలిస్తే పరిస్థితికి కారణం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు, కేటాయింపుల్లో అవకతవకలు, విద్యుత్ మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్న మంత్రుల పక్షపాత ధోరణి అని అర్థమవుతోంది.
హర్యానాలోని ఎన్‌టిపిసి జజ్జర్ కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తున్న 131 మెగావాట్ల విద్యుత్‌కు తోడుగా కేరళకు తరలివెళ్తున్న 100 మెగావాట్ల విద్యుత్ కూడా మనకి వచ్చినట్లయితే కొరత కొంతవరకు తీరుతుంది. ప్రస్తుతం కొన్ని ఇతర రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కంటే విద్యుత్ లోటు ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో విద్యుత్ కొరత 13 నుంచి 15శాతం మధ్య ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌లోటు సగటున 13.6 శాతం నమోదు కాగా తమిళనాడులో 14.9శాతం, ఉత్తరప్రదేశ్‌లో 14.3శాతం, బీహార్‌లో 14.1శాతం లోటు నమోదైంది. విద్యుత్ పంపిణీలో నష్టాలు కూడా ఈ లోటుకు కారణం. జాతీయ స్థాయిలో విద్యుత్ సరఫరా, పంపిణీ నష్టాలు 26-27శాతం ఉన్నాయని ఈ నెల మొదటివారంలో కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వీరప్ప మొయిలీ అన్నారు. విద్యుత్ వినియోగం క్రమశిక్షణతో కూడుకున్న వ్యవహారం. ఏ ఒక్కరు క్రమశిక్షణారాహిత్యంగా వ్యవహరించినా అందరూ ఇబ్బంది పడాల్సిందే. విద్యుత్ ఉత్పాదనను పెంచుకోవడంలో విఫలమైన రాష్ట్రాలు - అవసరాలకోసం పరిమితికి మించి ఇష్టానుసారం విద్యుత్తును ఉపయోగించుకుంటున్న ఫలితమే ఇటీవల విద్యుత్ గ్రిడ్‌లు విఫలం కావడం.
ప్రధాని జోక్యం
విద్యుత్ శాఖ నుంచి హోం శాఖకు బదిలీ అయివెళ్తున్న సుశీల్‌కుమార్ షిండే గ్యాస్ కోతతో రాష్ట్రానికి పెట్టిన వాతనుంచి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తాత్కాలికంగా ఉపశమనం కలిగించారు. 2008లో కెజి బేసిన్‌లో పూర్తిస్థాయిలో గ్యాస్ ఉత్పత్తి అవుతున్న సమయంలో కేంద్ర గ్యాస్ మంత్రిత్వ శాఖ నియమించిన మంత్రివర్గ సాధికారిక కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని అడ్డంపెట్టుకుని షిండే ఈ ఆదేశాలు జారీచేసినట్లు చెప్తున్నారు. 2012-13 నాటికి కెజి బేసిన్ ఉత్పత్తి బాగా పెరుగుతుందని అప్పట్లో చేసిన అంచనా ఆధారంగా రత్నగిరి ప్రాజెక్టుకు కొంత గ్యాస్ కేటాయించాలని కమిటీ సిఫార్సు చేసింది. కానీ పరిస్థితిలో మార్పు వచ్చింది. కెజి బేసిన్‌లో గ్యాస్ ఉత్పత్తి పడిపోయింది. రాష్ట్రానికి ఇస్తున్న గ్యాస్‌ను మళ్లించారు. ఈ విషయం ముందుగా తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు నిర్ణయం అమలులోకి వచ్చాక ప్రధానమంత్రిని కలిసి మంత్రి జారీచేసిన ఉత్తర్వులను తక్షణం నిలుపుచేసేలా చేశారు. రత్నగిరికి మన రాష్ట్రం వాటా నుంచి గ్యాస్ మళ్లించడం తాత్కాలికంగా నిలిపివేసినా ఆ ప్లాంట్‌కు ఇచ్చిన రసాయన ఎరువుల కంపెనీ హోదా వల్ల మనకు భవిష్యత్‌లో ముప్పు వచ్చే అవకాశం ఉందన్నది విద్యుత్‌రంగ నిపుణుల అభిప్రాయం. ప్రస్తుతం ఇస్తున్న 3.48 ఎంఎంఎస్‌సిఎండి గ్యాస్‌తో నెలలో తొమ్మిది రోజులు గ్యాస్ ఆధారిత విద్యుత్ సంస్థలు పనిచేయగలవు. ఆ కేటాయింపును 6 యూనిట్లకు పెంచితేనే రాష్ట్రానికి విద్యుత్ కొరత నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెప్తున్నారు.
ధరల భారం
గత ఏడాదిలో మన రాష్ట్రంతో పాటు 19 రాష్ట్రాలు విద్యుత్ చార్జీలను భారీగా పెంచాయి. చార్జీల పెంపుదల సుమారు 37 శాతం ఉంది. అలాఅని విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందా అంటే అదీ లేదు. విద్యుత్ మంత్రిగా ఉన్నప్పుడు సుశీల్‌కుమార్ షిండే సూచించిన విధంగా ఆరు నెలలకు ఒకసారి విద్యుత్ చార్జీలను పెంచేందుకు వేచి ఉండకుండా ఇంధన వ్యయ సర్దుబాటు (ఎఫ్‌ఎస్‌ఎ) పేరిట అదనపు చార్జీలను వసూలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు కోరుతున్నాయి. దానివల్ల వినియోగదారులపైన 5వేల కోట్ల మేర భారం పడుతోంది. అయితే విద్యుత్ సంస్థలకు ఆదాయ లోటు 11వేల కోట్లు ఉండగా దానిలో రూ.6వేల కోట్లు ప్రభుత్వమే భరిస్తోందని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి తెలిపారు. గతంలో చిన్నతరహా పరిశ్రమలు రెండు నెలలకు గాను రూ.200 కోట్లు చెల్లించలేమంటే ప్రభుత్వమే ఆ మొత్తాన్ని భరించిందని ఆయన అన్నారు. అసలు చార్జీలతో పోలిస్తే సర్‌చార్జీలు ఎక్కువని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌లో బొగ్గు, గ్యాస్ ధరలో పెరుగుదల కేవలం 10 నుంచి 15శాతం మాత్రమే ఉంటే సర్‌చార్జి భారం 50 నుంచి 80 శాతం ఎలా ఉంటుందని నిపుణులు విద్యుత్ నియంత్రణ కమిషన్ ఎదుట డిస్కంలను నిలదీశారు. ఒకేసారి మూడేళ్ల సర్‌చార్జ్‌లు వసూలు చేస్తే అసలు చార్జీలను మించిపోతాయన్నారు. సర్‌చార్జ్‌లను ప్రభుత్వమే భరించాలని నిపుణులు సూచించారు. ఎలాంటి హేతుబద్ధత లేకుండా పట్నవాసుల్ని, పల్లెప్రజల్ని ఒకగాటన కట్టి సర్‌చార్జి వసూలు చేస్తున్నారు. వ్యవసాయానికి వాడుకున్న విద్యుత్‌పై పడుతున్న సర్‌చార్జీలను సాధారణ వినియోగదారులపై వేయడాన్ని వారు తప్పుపట్టారు. ‘నెలకు 10 యూనిట్లు మాత్రమే వాడుకునే కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి. ఇలాంటి వినియోగదారులు కనీస చార్జీ కింద రూ.50 చెల్లిస్తారు. అంటే యూనిట్‌కి రూ.5 చొప్పున పడుతోంది. సాధారణంగా మొదటి 50లోపు యూనిట్లకు యూనిట్‌కు రూ.1.45 మాత్రమే చార్జీ అంటే యూనిట్‌కు రూ.3.55 అదనంగా చెల్లించారు. అది చాలదన్నట్లు సర్‌చార్జ్ వేయడం ఏం న్యాయం?’ అని విద్యుత్ నియంత్రణ కమిషన్ బహిరంగ విచారణకు హాజరైన వారు ప్రశ్నించారు.
పెరుగుతున్న డిమాండ్
జనం అవసరాలకు ప్రతి ఏటా విద్యుత్‌కు డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. పెరుగుతున్న అవసరాల దృష్ట్యా ఏటా పది శాతం వంతున డిమాండ్ పెరుగుతూనే ఉంది. 2005-06లో రాష్ట్ర అవసరాలకోసం వినియోగానికి 8,239 మెగావాట్ల విద్యుత్ అవసరం కాగా 2011-12 నాటికి 13,663 మెగావాట్లకు పెరిగింది. డిమాండ్‌కు తగిన విధంగా ప్రతియేటా సరఫరాను పెంచుకుంటూ పోయినప్పటికీ 2012 మార్చిలో పీక్ డిమాండ్ ఉన్నప్పుడు జరిగిన సరఫరా డిమాండ్ కన్నా 2300 మెగావాట్లు తక్కువగా ఉంది. అంటే గడచిన ఆరేళ్ల కాలంలో అధికారంలో ఉన్న పాలకులు, అధికారులు కాస్త ముందు చూపుతో వ్యవహరించి ఉంటే ఈ సరఫరా లోటును అధిగమించడం అసాధ్యంగా మారేది కాదు. జెన్‌కో ప్రతిపాదించిన అనేక ప్రాజెక్టుల్లో కొన్నింటింని టెండరు దశలోనే నిలిపివేశారు. మరికొన్ని వనరుల కొరత వల్ల, ఇంకా కొన్ని బొగ్గు, నీరు లభ్యత లేదని పక్కనపెట్టారు. దాంతో అవి ప్రభుత్వం వారి దస్తాల్లోనే మూలుగుతున్నాయి. విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్న ప్రైవేట్ సంస్థలు ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కాకముందే తోక జాడిస్తున్నాయి. గ్యాస్ ధరను పెంచాలని రిలయెన్స్ గత కొంతకాలంగా కేంద్రంపై వత్తిడి తెస్తోంది. అందువల్ల సమీప భవిష్యత్తులో గ్యాస్ ధర పెంచకతప్పదని నిపుణులు చెప్తున్నారు. అప్పుడు విద్యుదుత్పత్తి వ్యయం, యూనిట్ ధర పెరగక తప్పదు. ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ ప్రాజెక్టులకు సరైన నిర్మాణ కంపెనీలను ఎంపిక చేసుకోకపోవడం కూడా జాప్యానికి దారితీస్తోంది. నిర్మాణ కంపెనీల నిర్లక్ష్యానికి తోడు జెన్‌కో అధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవడం కూడా ఇందుకు కారణం.
గడచిన ఐదేళ్లలో విద్యుత్ లోటు 1494మిలియన్ యూనిట్ల నుంచి 5795 యూనిట్లకు పెరిగింది. విద్యుత్ డిమాండ్ 44శాతం పెరగడం దానికి తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవడం వినియోగదారులకు ఇబ్బందికరంగా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో విద్యుత్ రంగంలో లోటుపాట్లను సవరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించడం మంచి పరిణామం. అయితే విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి ప్రైవేట్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు ప్రభుత్వం భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు చేయాలి. విద్యుత్ గ్రిడ్‌లను పటిష్టం చేయడంతో పాటు సురక్షితంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలి. అన్నింటికన్నా ముందు అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు విద్యుత్‌ను ఆదాచేసేందుకు కలసికట్టుగా కృషిచేయాలి. విద్యుత్ ఉత్పత్తిలో, పంపిణీలో, వినియోగంలో సమూల మార్పులు రానంతవరకు పరిస్థితిలో మార్పును ఆశించలేం.
*
రత్నగిరి గొప్పేమిటి?
రత్నగిరి ప్రాజెక్టు కేటాయింపులకు 2008లో బీజం పడింది. 2008లో ప్రణబ్‌ముఖర్జీ నేతృత్వంలో ఏర్పాటుచేసిన మంత్రుల సాధికారక కమిటీ గ్యాస్ కేటాయింపుల్లో ప్రాధాన్యతలను నిర్ణయించింది. అందులో భాగంగానే రత్నగిరి పవర్ ప్రాజెక్టుకు గ్యాస్ కేటాయించాలని కమిటీ నిర్ణయించింది. ఆ నిర్ణయించడంలో పెట్టిన మెలికవల్లే ఇప్పుడు సమస్య ఉత్పన్నమైంది. గ్యాస్ కేటాయింపుల్లో అధిక ప్రాధాన్యత ఎరువుల తయారీ యూనిట్లకు, రెండో ప్రాధాన్యత వంటగ్యాస్‌కు, మూడో ప్రాధాన్యత విద్యుత్ ఉత్పత్తి యూనిట్లకు ఇచ్చారు. రత్నగిరి నిజానికి విద్యుత్ ప్లాంట్ అయినా ఎరువుల ప్లాంట్ హోదా కల్పించి గ్యాస్ కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇచ్చారు. రత్నగిరి ప్లాంట్‌కు ఎరువుల ప్లాంట్‌తో సమానంగా ప్రాధాన్యత ఇచ్చి గ్యాస్ సరఫరా చేయాలని అప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని ఎవరూ తప్పుపట్టలేదు. కానీ ఇప్పుడది అంతర్రాష్ట్ర సమస్యగా మారింది. కెజి బేసిన్‌లో గ్యాస్ ఉత్పత్తి తగ్గడంతో మన వాటాకింద రావాల్సిన గ్యాస్ వాటా తగ్గింది. 80 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేయాల్సిన రిలయెన్స్ కేవలం 51మిలియన్ యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. రత్నగిరి నుంచి వత్తిడి పెరిగినా గత 11 నెలలుగా కేంద్రం దానిని పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్‌కు 3.48 ఎంఎంఎస్‌సిఎండి గ్యాస్‌ను కేటాయిస్తూ వచ్చారు. ఇప్పుడు ఉత్పత్తి బాగా తగ్గి వత్తిడి ఎక్కువ కావడంతో కేటాయింపు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
రెంటుకన్నా కరెంటు చార్జీ ఎక్కువ
రాజధాని నగరంలోని కొన్ని ప్రాంతాలలో సర్‌చార్జీలతో కలిపి అద్దెకన్నా కరెంటు చార్జీ ఎక్కువవుతోంది. అసలే అరకొర ఉపాధితో బతుకీడుస్తున్న బడుగుజీవులు ఈ భారాన్ని మోయలేకపోతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి రాజధాని చుట్టుపక్కల నివసించే వారు తమ సొంత రాష్ట్రాలకు తరలివెళ్తున్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖకు చెందిన డిస్కంలకు ప్రభుత్వం పదివేల కోట్లకు పైగా బకాయి పడింది. దీనిలో దాదాపు రూ.6400కోట్లు 2009 ఎన్నికల సందర్భంగా అదనంగా కొనుగోలు చేసిన విద్యుత్‌కే ఇవ్వాలి. ఆ ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన వై.ఎస్.రాజశేఖర రెడ్డి ప్రభుత్వం గాని, ఆయన తరువాత గద్దెనెక్కిన ముఖ్యమంత్రులు గాని పట్టించుకోలేదు. లెక్కకు రాని విద్యుత్ అంతా సేద్యానికి వాడుతున్నారనే వాదన ఉంది. అంటే తెలంగాణకు చెందిన ఒక జిల్లాలో బిల్లుల లెక్కకు వస్తున్న విద్యుత్ 35శాతం, 15శాతం పంపిణీ నష్టాలను కలిపినట్లయితే అది దాదాపు 50శాతం అవుతుంది. అంటే మిగిలిన సగం సేద్యానికి వాడుతున్నారని అనుకోవాలి. వాస్తవంగా చూస్తే పరిస్థితి అలా లేదు. కావలసినంత విద్యుత్ సరఫరా కావడం లేదని, రాత్రుళ్లు పొలంవద్ద ఉండి సేద్యానికి నీరు పంప్ చేసుకోవాల్సి వస్తోందని రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. అనేక చోట్ల సబ్ స్టేషన్లను ముట్టడించినట్లు , అధికారులను నిర్బంధించినట్లు వార్తలు వస్తున్నాయి.

Sunday 21 October 2012

విశ్వానికి అంతం లేదా?


  • ఎందుకని? ఇందుకని!
దేనికైనా అంతం ఉంది. మరి విశ్వానికీ అంతం ఉండాలి కదా?
- బి.శ్రీనివాస్‌, పరదేశమపేట, జగన్నాయక్‌పుర, కాకినాడ, తూ.గో.జిల్లా
పదార్థాల రూపానికి శాశ్వతత్వం లేదు. ఎందుకంటే పదార్థాల్లో మార్పు సహజం. అది అనివార్యం. అంటే పదార్థాల గుణగణా లకే అంతం ఉందిగానీ పదార్థానికే అంతం ఉంది అనుకోకూడదు. పదార్థానికి అంతం ఎపుడూ లేదు. శక్తి కూడా పదార్థ రూపమే. విశ్వం మొత్తం పదార్థ రూపమే. కాబట్టి విశ్వానికి ఆది, అంతం రెండూ ఉండవు. అది ఎపుడూ ఉంది. ఎల్లపుడూ ఉంటుంది. కానీ అనునిత్యం, అనుక్షణం మారుతూ ఉంటుంది. ఉదాహరణకు ఆకాశంలో రెండు మేఘా లున్నాయి. అందులో మొత్తం 10 లీటర్ల నీరు, రెండు గ్రాముల దుమ్మూ ధూళి ఉన్నాయనుకొందాం. ఉష్ణోగ్రత తగ్గడం వల్ల ఆ రెండు మేఘాలు, వర్షంలా కురిశాయి. అంటే మేఘాలు ఇపుడు లేవు. కాబట్టి మీరన్న అర్థంలో మేఘాలు అంతరించాయి. కానీ మేఘాల్లో ఉన్న 10 లీటర్ల నీరు, రెండుగ్రాముల ధూళి మేఘ రూపంలో నుంచి మురికి వర్షపునీరుగా భూమ్మీద పడ్డాయి. ఆ మురికినీటిలో 10 లీటర్ల నీరు, అందులో ఆ రెండు గ్రాముల ధూళి కలిసే ఉన్నాయి. కాబట్టి మేఘాలలో ఉన్న పదార్థాలు నాశనం కాలేదు కదా? ప్రధానంగా జీవులు పుట్టడాన్ని, మరణించడాన్ని 'పుట్టిన ప్రతిదీ గతించక మానదు. గతించిన ప్రతిదీ తిరిగి పుట్టక మానదు' అన్న తాత్విక దృష్టిలో మీరు విశ్వాన్ని ప్రశ్నించినట్లున్నారు. నా ఉదాహరణనే తీసుకుందాం. నేను 1956, జులై 2వ తేదీన పుట్టాను. కానీ అది సమాజానికి ఓ పుట్టినతేదీగా గుర్తించడానికి తల్లి గర్భం నుంచి బయటపడ్డ ఓ ఘట్టాన్ని (incidence of delivery) పుట్టిన తేదీ, సమయంగా భావిస్తున్నారు. కానీ నారూపం ఆరోజుకు ముందు కూడా ఉంది. అయితే నా తల్లి గర్భంలో ఉంది. అంటే 1956 జూన్‌ 2వ తేదీకి ముందే నేను లేనా? ఎందుకు లేను? నా తల్లి గర్భంలో అరకేజీ తక్కువ బరువులో ఉన్నాను. అంతకుముందు 9 నెలల క్రితం ఎక్కడ ఉన్నాను? ఇంకా సూక్ష్మ రూపంలో సంయుక్త జీవకణం (zygote) రూపంలో ఉన్నాను. అపుడే 'నేను' అన్న భావానికి అర్థం, రూపం నిర్దేశించబడ్డాయి. కానీ అర్థాన్ని, ఆ రూపాన్ని శాసించే చిహ్నాలు (code) నా తల్లి అండం (egg), నా తండ్రి శుక్ర కణం (sperm) లలో ముందే దాగున్నాయి. ఆ చిహ్నాలకు, జన్యుస్మృతికి విరుద్ధంగా నా సూక్ష్మరూప సంయుక్తకణం ఉండదు. మరి ఆ అండానికి, శుక్రకణానికీ ఆధారం ఎవరు? ఇలా వెనక్కి వెళ్లితే ఈ భూమ్మీద జీవావిర్భావం వరకూ వెళ్లవచ్చును. కాబట్టి నా జన్మ తేదీ కేవలం సాపేక్షమే (relative) గానీ ఓ పదార్థ నూతన ఆరంభం కాదు. నా శరీరంలో ఉన్న ప్రతి కణం, ప్రతి కణంలోని ప్రతి అణువు, ప్రతి అణువులోని ప్రతి పరమాణువు, ప్రతి పరమాణువులో ఉన్న ప్రతి ప్రాథమిక కణం ఈ విశ్వంలో నుంచే నా రూపంలోని ఓ సందర్భంలో ఓ చిరు గుణాత్మక మార్పు ద్వారా రామచంద్రయ్య అనే సంయుక్త జీవకణం ఏర్పడింది. అది నా తల్లి నుంచి వచ్చిన పోషక పదార్థాల్ని వాడుకుంటూ కణవిభజన చెంది, జన్యుస్మృతి (genetic code) ప్రకారం 4 కేజీల బరువున్న మగపిల్లాడిగా ఆ రోజు జన్మిం చింది. పుట్టిన తర్వాత భూవాతావరణంలో ఉన్న గాలిని, తల్లిపాలను, ఆ తర్వాత రైతుల శ్రమతో పండిన వరిగింజ ల్లోని ఆహారపదార్థాలు, పప్పుదినుసులు, నూనెలు, మాం సం, చేపలు, నీరు సేవిస్తూ 4 కేజీల నుంచి 80 కేజీల య్యాను. సమాజంలో తిరగడం వల్ల భాష, ప్రకృతి జ్ఞానం, ప్రజాశక్తికి వ్యాసం రాయగల కనీసపు ఆలోచనలు సిద్ధించాయి. మరికొన్నేళ్ల తర్వాత ఈ శరీరంలో ఇప్పటి లాగే సజావుగా జీవప్రక్రియలు (physiological processes) కొనసాగలేవు. అందులో కొన్ని మొరా యిస్తాయి. లేదా ఎప్పుడూ మనకన్నా ముందే ఈ భూమ్మీ ద పుట్టిన సూక్ష్మజీవులు నా మీద దాడిచేసి లేనిపోని మాయరోగాలు నాకు వచ్చేలా చేస్తాయి. లేదా ఏదైనా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల నామీద కాల్పులు జరగ వచ్చును లేదా నా జేబులో ఉన్న సెల్‌ఫోన్‌ దొంగ లించడం కోసం అమెరికా సంస్కృతిని వంటబట్టించు కొన్న ఓ మందుబాబు నన్ను తుపాకీతో పేల్చ వచ్చును. మొత్తం మీద మరణం ఏదోవిధంగా వస్తుంది. ఈ మరణం రామచంద్రయ్యలోని పదా ర్థానికి కాదు. అది ఏదైనా వైద్యకళాశాలలో విద్యార్థుల ప్రయోగాలకు సమకూరే మృతదేహంగా ఉపయోగ పడుతూ ఉంటుంది. శస్త్రచికిత్స ప్రయోగాల్లో ముక్కలైన దేహభాగాల్ని వైద్యకళాశాల వారు దహనం చేస్తే అది మంట (combustion) అనే రసాయనిక ప్రక్రియ ద్వారా CO2, H2O, NO2, P2O5, Ca3 (PO4)2, CaSO4, NaCl,….వంటి పలురకాల ఘన, ద్రవ, వాయు పదార్థాలుగా మారి భూ పదార్థాల సంచయంలోకి శోషించుకుంటుంది. కాబట్టి పుట్టినపుడున్న పదార్థాలు, మరణానంతర పదార్థాలు, పెరుగు తున్న క్రమంలో వాడుకున్న పదార్థాలు, పెరుగుతున్న క్రమంలో మల మూత్రాదులు, చెమట, నిశ్వాసాలు తదితర ప్రక్రియల్లో విసర్జించిన పదా ర్థాలు అన్నీ ఈ విశాల విశ్వంలో అటూయిటూ గుణాత్మకంగా ఓ నియమా నుసారం మారే ప్రక్రియల్లో అంతర్భాగాలే అన్న విషయం మనం గుర్తుం చుకోవాలి. ఇదే ఉదాహరణ మీకు, అందరికి, ప్రతి చెట్టుకు, ప్రతి వస్తువు కు మనం ఆపాదించాలి. ఉన్నట్టుండి శూన్యం నుంచి భూమి పుట్టలేదు. కొందరు ఛాందసవాదులు, మతతత్వవాదులు శూన్యం నుంచి దేవుడనే ఓ పెద్ద సృష్టికర్త ఆదేశం నుంచి విశ్వం పుట్టిందంటారు. ఆ వాదన శాస్త్ర పరీక్షకు నిల్వదు. అలాగే ఈ సృష్టికి విలయం (annihilation) ఉంటుం దనీ, ఏదో ఒకరోజు ఆ లోకనాటకుడు, చిద్విలాసుడు, జగన్నాటక సూత్ర ధారి సరదాగా మనం కంప్యూటర్‌ను షట్‌డౌన్‌ చేసినట్లుగా ఈ విశ్వాన్ని తన లోకి గుటకాయ స్వాహా చేస్తాడనీ అదే విశ్వానికి అంతమనీ, అది మరెంతో దూరంలో లేదనీ లేనిపోని ఆందోళనను ఇతరులకు కలిగిస్తారు. అదీ జరిగేదేమీ కాదు. ఈ విశ్వం ఎపుడూ ఉంది, ఎల్లపుడూ ఉంటుంది. ఈ విశ్వం లో ఉన్న పదార్థం పలురూపాల్లో ఉంది. గతితార్కికంగా రూపాలు, గుణాలు మార్చుకుంటూ పదార్థ, ప్రదేశ, కాలాల్ని (matter, space, time) తనలో మమేకం చేసుకుంటుంది.
ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక

సముద్ర.. తీర.. జీవవైవిధ్యం.. పరిరక్షణ..


భూగోళ ఉపరితలంలో 70% పైగా విస్తీర్ణాన్ని సముద్రాలే ఆక్రమిస్తున్నాయి. నాలుగు కిలోమీటర్ల లోతు వరకూ జీవులు జీవించగలుగుతున్నాయి. సముద్రాలు ఇంత విస్తృతంగా వున్నప్పటికీ భూగోళంలో వుండే జీవవైవిధ్యంలో దాదాపు 20% మాత్రమే వీటిలో వుంటుంది. కానీ, భూభాగంలోని జీవవైవిధ్యం, దాని కొనసాగింపులో సముద్రాలు కీలకపాత్ర వహిస్తున్నాయి. ముఖ్యంగా మనం పీల్చుకునే ఆక్సిజన్‌లో దాదాపు మూడోవంతు సముద్రజీవుల నుండే లభిస్తుంది. భూ భాగంలోని అన్ని వృక్ష, జంతు జీవులకన్నా 15 రెట్లు అధిక కార్బన్‌ డై ఆక్సైడ్‌ను సముద్రాలు నిక్షిప్తం చేస్తున్నాయి. సముద్రజీవులు (చేపలు, పీతలు, రొయ్యలు తదితరాలు) మనకు ఆహారంగా ఉపయోగపడుతూ ప్రొటీన్లను సరఫరా చేస్తున్నాయి. భూగోళంపై వాతా వరణమార్పుల హెచ్చుతగ్గుల్ని నియంత్రిస్తూ ఒకమేర మాత్రమే మారేలా చేస్తున్నాయి. ఇంత ప్రాముఖ్యతగల జీవావరణ వ్యవస్థలో 34 అకశేరుకాల వర్గాల్లో 32 సముద్ర, తీర జీవావరణంలోనే నివసిస్తున్నాయి. ఈ జీవావరణంలో ఐదు లక్షల నుండి కోటి సముద్రజాతులు వున్నట్లు అంచనా. సముద్రంలో అతిగా చేపల్ని పట్టడం, కాలుష్యం సముద్ర జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే భూగోళ జీవవైవిధ్యం కూడా అస్థిరత్వానికి గురవుతుంది. వీటి పరిరక్షణపై ఇప్పుడు హైదరాబాద్‌లో జరుగుతున్న అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సు ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ కార్యక్రమాలను రూపొందిస్తుంది. వీటిని 'ప్రొఫెసర్‌ అరిబండి ప్రసాదరావు' సహకారంతో సంక్షిప్తంగా తెలుపుతూ మీ ముందుకొచ్చింది ఈ వారం 'విజ్ఞానవీచిక'.

సముద్రగర్భంలో, తీరాల్లో కొన్ని జీవులు వుంటుండగా, తీరప్రాంతంలో మరి కొన్ని వుంటున్నాయి. మడ (తీరప్రాంత) అడవులు, పగడపు దిబ్బలు (కోరల్‌రీఫ్స్‌), సముద్రగడ్డి దొంతరలు (బెడ్స్‌), నదులు సముద్రంలో కలిసేచోట ఏర్పడే దీవులు (ఎస్చ్యూరీస్‌), ఉష్ణజలీకరణ ప్రాంతాల వద్ద, సముద్ర పర్వతాలు, సముద్ర అడుగు భాగంలో జమకూడే మెత్తని అవక్షేపాలు (సాఫ్ట్‌ సెడిమెంట్స్‌) ఇవన్నీ... సముద్ర జీవవైవిధ్యానికి నిలయాలు. సముద్ర జీవావరణంలో వైవిధ్య, నివాస ప్రాంతాలు వున్నాయి. వీటిని ప్రధానంగా రెండు రకాలుగా గుర్తిస్తున్నారు. వీటిలో నీరు ఒకటి కాగా, సముద్ర అడుగుభాగం రెండోది. నీటి జీవావరణాన్ని 'పెలాజిక్‌ హాబిటాట్‌'గా వ్యవహరిస్తున్నారు. సముద్రం అడుగుభాగాన వున్న జీవావరణాన్ని 'బెంతిన్‌ హాబిటాట్‌'గా వ్యవహరిస్తున్నారు.
నీటి జీవావరణం..
నీటిలోని నివాసస్థలాన్ని లోతు ఆధారంగా మూడు మండలాలుగా గుర్తించారు. అవి: సూర్యరశ్మి ప్రసరణ జరిగే 100 మీటర్ల లోతు వరకూ ఒకటో మండలం. అయితే, బురద ఎక్కువగా వుండే సముద్రాల్లో ఈ మండలం మీటరు లోతుకే పరిమితమవుతుంది. ఈ పలచని మండలంలో మొక్కజాతులు కిరణజన్య సంయోగక్రియతో తమకు కావలసిన ఆహారాన్ని తామే తయారుచేసుకుం టాయి. ఈ మండల న్ని 'యు ఫోటిక్‌ మండలం'గా పిలుస్తారు. ఈ మండలం కింద 2000 మీటర్ల లోతు వరకూ సూర్యరశ్మి ప్రసరించదు. దీనిలో జంతువులే ప్రధానంగా వుంటాయి. ఇది రెండోది. దీన్ని 'బాతైల్‌ మండలం'గా పిలుస్తారు. దీనికింద ఆరువేల మీటర్ల వరకూ చిమ్మచీకటితో కూడి వుండేది మూడోది. దీన్ని 'ఎబిస్సిమల్‌ మండలం'గా పిలుస్తారు. వీటన్నింటికీ అడుగుభాగంలో రసాయనాల మడ్డి, వృక్ష, జంతు అవశేషాలు తదితరాలు వుంటాయి. వీటిలో పదింట తొమ్మిది వంతుల సముద్ర జీవరాశులు నివసిస్తాయి. సముద్ర, తీర జీవవైవిధ్య పరిరక్షణకు తీరప్రాం తాల్లో నివసించే ప్రజల భాగస్వామ్యం ఎంతైనా వుంది. స్థానిక పరిస్థితులకు అనుగుణమైన పరిరక్షణ కార్యక్రమాల్ని అమలుచేయాల్సి వుంటుంది.
ప్లాంక్‌టన్‌ (పాచి)..
అన్ని సముద్రజీవుల ఆహారానికి మూలం ఈ పాచి. వృక్షజాతికి సంబంధించిన (ఫైటో ప్లాంక్‌టన్‌) 'డై ఆటం ముఖ్యమైనది. ఇది చిన్న చిన్న జంతువులకు (జూ ప్లాంక్‌టన్‌) ఆహారం. లార్వా, ష్రింప్స్‌ (రొయ్య పిల్లలు), క్రాబ్స్‌ (పీతలు)
జూ ప్లాంక్‌టన్‌ కిందకు వస్తాయి. సంయుక్తంగా ఇవి ఎన్నో చేపలకు ఆహారంగా ఉపయోగపడతాయి. ఈ చిన్న చేపలు పెద్ద చేపలకు, సముద్ర క్షీరదాలకు ఆహారం.
అస్థిరత్వం ఎక్కడ నుండి..?
భూభాగం నుండి సముద్రానికి చేరుతున్న కాలుష్యం అస్థిరత్వానికి దోహదపడుతుంది. ప్రధానంగా ముడి చమురు, ఓడల్లో నుండి వచ్చే మురుగు, పారిశ్రామిక వ్యర్థాలు కాలుష్య కారకాలు. సముద్రంలోకి చేరుతున్న వృక్ష పోషకాలు ప్లాంక్‌టన్‌, ఇతర జీవుల పెరుగుదలకు దోహదపడతాయి. పెరిగిన వృక్ష, జంతుజీవాలతో ఇది చిక్కగా కనిపిస్తుంది. దీన్నే 'యూట్రిఫికేషన్‌'గా పిలుస్తున్నారు.
* అతిగా చేపలు పట్టడం. నాశనం కలిగించే విధంగా చేపల్ని పట్టడం, చట్ట వ్యతిరేకంగా దొంగతనంగా చేపల్ని పట్టడం, నియంత్రణ లేని చేపలు వేట.ఇవన్నీ చేపల పెరుగుదలకు ఆటంకం. ఇపుడు 60 కిలోమీటర్ల వరకూ విస్తరించే వలలు వచ్చాయి. మామూలుగా ఏ చేపా ఈ వలల నుండి తప్పించుకోలేదు. దీనివల్ల కొన్ని దేశాల్లో ఈ వలలకు రంధ్రాల్ని ఉద్దేశపూర్వకంగా పెడుతున్నారు. ఫలితంగా చిన్న చేపలు, ఇతర జంతువులు తప్పించుకుని, కేవలం పెద్ద చేపలే వలకు చిక్కుతాయి. తప్పించుకొన్న చిన్న చేపలు పెద్దవై అధిక ఆహారాన్ని అందిస్తాయి.
* సముద్రంలో వుండే చేపలు, వేల్స్‌, ఇతర సముద్రజీవుల వేట ప్రమాదకరంగా మారుతుంది.
* భౌతిక నివాస స్థలమార్పులు చేయడం.
* బయటి జాతుల దాడి.
* భూగోళ వాతావరణమార్పులు.
ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం ప్రపంచ చేపల నిల్వలో 70 శాతం ఇప్పటికే పట్టేశారు. ఫలితంగా చేపల సంఖ్య తగ్గిపోతుంది.
* పగడపు దిబ్బల (కోరల్‌ రీఫ్స్‌)లో 20 శాతం ఇప్పటికే అంతరించిపోయాయి. సమీపకాలంలో ఇవి పునరుజ్జీవం పొందే, పెరిగే అవకాశం కూడా లేవు. 1998లో సంభవించిన పగడపుదిబ్బలు బ్లీచింగ్‌ (రంగు కోల్పోవడం) వల్ల 16 శాతం అంతరించిపోయాయి. అయితే ఆ తర్వాత తీసుకున్న పరిరక్షణ చర్యల వల్ల 40 శాతం పునరుద్ధరించబడ్డాయి. కానీ, మానవ కార్యక్రమాల వల్ల 20 శాతం నశించిపోతున్నాయి.
పునరుద్ధరణ కృషి..
దీని లక్ష్యం సముద్రజీవుల్ని పరిరక్షిస్తూ సుస్థిర వినియోగానికి తోడ్పడడం. అందుకు అనుగుణంగా విధానాలు రూపొందించబడ్డాయి. ఈ సందర్భంలో తీర ప్రాంతంలో నివసించే ప్రజల సామాజిక అవసరాల్ని కూడా దృష్టిలో పెట్టుకోబడుతున్నాయి. ముఖ్యంగా లోతైన సముద్రాల్లో జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం ప్రభుత్వం ఇపుడు అమలుచేస్తున్న జీవవైవిధ్య పరిరక్షణా కార్యక్రమాల్లో ముఖ్యాంశం. అతిగా చేపల్ని పట్టకుండా నియంత్రిస్తున్నారు. సముద్ర, తీర ప్రాంతాల సమన్వయ యాజమాన్యం మీద కేంద్రీకరిస్తూ తీసుకునే పరిరక్షణ చర్యలు వీటి వైవిధ్య పరిరక్షణకు దోహదపడతాయి. అయితే, నష్టపరిచే బయటిజాతులు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. చేపల పెరుగుదలకు ఆటంకం లేకుండా తీర ప్రాంతాల్లో ఏప్రిల్‌ 15 నుండి జూన్‌ 1 వరకూ వాటిని పట్టడం నిషేధించారు.
సముద్రతీరం..
సముద్రం భూభాగాన్ని కలిసేచోట ఇసుకతో కూడిన తీరాలు (బీచ్‌లు) ఏర్పడతాయి. అలల తాకిడికి రాళ్లూ రప్పలు పగిలి ఇసుక ఏర్పడుతుంది. ఈ తీర ప్రాంతంలో పోషకాలు అధికంగా వుం టాయి. నది నీటి ద్వారా కొట్టుకొచ్చిన పోషకాలు, అలలతో తీరానికి చేరి, పోషకాలు చేరతాయి. తీరం వెంబడి జీవించగలిగే జంతువులు, వృక్షాలు వీటిపై ఆధారపడతాయి. నిరంతరం ఎగిసిపడుతున్న అలలు, ఫలితంగా వస్తూ పోతున్న నీరు, ఇసుక, చిన్న చిన్న రాళ్లు పర్యావరణ పరిస్థితుల్ని నిత్యం మారుస్తుంటాయి. దీనికి ఆటుపోట్లు తోడుంటాయి. తీరం వెంబడి ఇసుక కింద వర్మ్స్‌, గవ్వ కలిగిన జీవాలు అధికంగా వుంటాయి. పైన వున్న ఇసుక సముద్రఆలల తాకిడి నుండి వీటిని రక్షిస్తుంది. మానవ దినచర్యలో భాగంగా ఇవి కూడా ప్రమాదంలో పడుతున్నాయి. కట్టడాల నిర్మాణం, చెత్తాచెదారాల్ని విసిరేయడం, ముడిచమురు పోయడం, పనికిరాని చమురుని కలిపేయడం, మురుగు వంటివి సముద్రంలో వదులుతున్నారు. ఫలితంగా ఈ తీరంవెంబడి జీవిస్తున్న పక్షులు ప్రమాదానికి గురవుతున్నాయి. ఒక విధమైన సముద్ర తాబేళ్లు ఈ ఇసుకలో గుడ్లు పెడతాయి. కాలుష్యం, మానవ జీవనం వల్ల వీటి సంఖ్య బాగా తగ్గిపోతుంది.
మనదేశంలో..
మనదేశం దాదాపు ఎనిమిది వేల కిలోమీటర్ల తీరప్రాంతాన్ని కలిగి వుంది. దీని చుట్టూ సముద్రంలోకి 200 కిలోమీటర్ల దూరం వరకూ 20 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సము ద్రపు వనరుల్ని మనమే వినియోగించుకునే హక్కును కలిగి వున్నాం. అదనంగా అండమాన్‌, నికోబార్‌ దీవుల సమూహం చుట్టూ మరో 60 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన సముద్రాన్ని వినియోగించుకునే హక్కు కలిగి వున్నాం. చేపల ఉత్పత్తి మనకు గరిష్టంగా జూన్‌ నెలలో లభిస్తుంది. పశ్చిమ తీరప్రాంతంలో ఉత్పత్తి ఎక్కువ గా వుంటుంది. తూర్పుతీరంలో తక్కువగా వుంటుంది. కానీ, మడ అడవుల ప్రాంతం లో ఉత్పత్తి ఎక్కువగానే వుంటుంది. దక్షిణ తీరం కొనప్రాంతంలో చేపల ఉత్పత్తి అధి కంగా వుంటుంది. బంగాళాఖాతంలో కూడా చేపల ఉత్పత్తి ఎక్కువగా వుంటుంది.
పగడపు దిబ్బలు (కోరల్‌ రీఫ్స్‌)
సముద్ర జీవావరణ ప్రత్యేకత. వీటిని వెంటనే గుర్తించవచ్చు. ఇవి చేపలకు, జీవవ్యవస్థ కొనసాగింపుకూ కీలకం. అందువల్ల వీటి పరిరక్షణకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. సముద్ర అడుగుభాగంలో గల ఎత్తుపల్లాలు జీవవైవిధ్యాన్ని పరిరక్షిస్తున్నాయి.
తీరంలోని చిత్తడినేలలు..
మడ అడవులు ఉప్పునీరు కలిగిన ఉష్ణ తీర ప్రాంతాల్లో వుంటాయి. వీటి వేళ్లల్లో గాలిని పీల్చుకునేందుకు ప్రత్యేకమైన ఏర్పాటు వుంది. కొన్ని వేళ్లు గాల్లోకి పైకి పెరిగి, గాలిని పీల్చుకుంటాయి. ఇవి తీర ప్రాంతాల్ని తుపానులు, అలల నుండి రక్షిస్తాయి.
మీకు తెలుసా..?
* భారత ఫసిఫిక్‌ మహాసముద్రం గరిష్ట జీవవైవిధ్యం కలిగి వుంది. ఒక చదరపు మీటరులో వెయ్యిరకాల జాతులు వున్నట్లు గుర్తించారు.
* వేల్‌: భూగోళంలో అతి పెద్ద క్షీరదం. అందువల్ల ఇవి నీటిలో దీర్ఘకాలం వుండలేదు. మధ్య మధ్య పైకి వచ్చి, స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటుంది. ముక్కు ద్వారా గాలిని వదులుతుంది. ఆ సమయంలో నీరు ఉవ్వెత్తున పైకి లేస్తుంది.
* సముద్రంలో కందకాలూ వుంటాయి. అతి లోతైన కందకం ఫసిఫిక్‌ మహాసముద్రంలో 'మేరియానా ట్రెంచ్‌'. దీనిలోతు 11,034 మీటర్లు.

'వాస్తు' శాస్త్రం కాదు.. ఎందుకని? (3)


'ఇక భూమి రకరకాల ధ్వనులు చేస్తుందట. వాటిలో ''హయేభ, వేణు వీణాబ్ది దుందుభి ధ్వని సంయుతా'' అని 'మయమతం' పేర్కొంటోంది. అంటే గుర్రము, ఏనుగు, వెదురు, వీణ, సముద్రము, భేరి ఈ ధ్వను చేసే భూమి శ్రేష్టమైందట. భూమి, గుర్రం ధ్వని, ఏనుగుల ధ్వని ఎలా చేస్తుందో నీకేమైనా అర్థమైందా?'' అని అడిగాను.
''అలాంటి ధ్వనులు చేసే భూమి ఎలా ఉంటుందో నాకర్థంకావడం లేదు'' అన్నాడు చంద్రమౌళి.
''భూమి ఆకారంతో ఎలా మంచి, చెడు కలుగుతుందో విను.''
''వ్యజనేవిత్తనాశస్యాత్‌'' అని 'రాజమార్తాండం' చెబుతోంది. అంటే 'విసనకర్ర ఆకారంగల భూమి ధననాశనమును కలగజేస్తుంద'ట. అలాగే 'విశ్వకర్మ ప్రకాశిక' ఏం చెబుతోందంటే 'సింహాభా సుగుణాన్‌ పుత్రాన్‌, వృషాభా పశువృద్ధిదా||' అంటే 'సింహాకారముగానున్న భూమి సుగుణవంతులగు పుత్రుల్ని కలిగిస్తుందట! ఎద్దు ఆకారముగా వున్న భూమి పశువృద్ధిని కల్గించును'' అని అర్థం. అలాగే
శ్లో|| సూకరోష్ట్రాజ సదృశీ ధనుః పరశురూపిణీ
కుచేలాన్మలిన్మార్భాన్‌ బ్రహ్మఘ్నాన్జనయేత్సుతాన్‌''
అని కూడ విశ్వకర్మ ప్రకాశిక చెబుతోంది. అంటే
''గృహము నిర్మించనున్న భూమి పంది, ఒంటె, మేక, బాణము, గండ్రగొడ్డలి ఆకారములలో ఏ ఆకారముగా వున్నా దరిద్రులు, మలినమైనవారు, మూర్ఖులు, బ్రహ్మహత్యాతత్పరులైన పుత్రులు కలుగుతారు'' అని అర్థం. భూమి సింహం, ఎద్దు, పంది, మేక.. వంటి ఆకారాలలో ఎలా ఉంటుంది? వీటిలో సింహం, ఎద్దు ఆకారాలు మంచివట. పంది, మేక ఆకారాలు చెడ్డవట! ఒక స్థలం ఎద్దు ఆకారంలో ఉందా? మేక ఆకారంలో ఉందా? అని తేడా ఎలా తెలుసుకుంటారు?' అని ప్రశ్నించాను.
చంద్రమౌళి సమాధానం మౌనమే.
''ఇంకో విషయం. వాస్తువాదులు గృహము నిర్మించనున్న స్థలములో ఏ దిక్కున, ఏ జంతువు ఎముకలుండేదీ, ఆ స్థలము దగ్గరకు పోకుండానే చెబుతారు తెలుసా?''
''అదెలా చెప్పగలరు?''
''అదే విచిత్రం! ఒక వ్యక్తి వాస్తువాది దగ్గరకు వెళ్ళి, తూర్పు దిక్కుగా కూర్చొని, 'అయ్యా! నేను ఇల్లు కట్టుకోబోతున్నాను. శంకుస్థాపనకు ముహూర్తం పెట్టండి!' అని అడిగాడనుకో. అతను అడిగిన ప్రశ్న ఏ అక్షరంతో ప్రారంభమయింది?''
''అ అనే అక్షరంతో'' అన్నాడు చంద్రమౌళి.
''దానిని గూర్చి'' జ్యోతిస్సంహితార్ణవం'' ఏంచెబుతోందో తెలుసా?
శ్లో|| అవర్గోచ్చారితే ప్రశ్నే ప్రాచ్యాందిశి సమాదిశేత్‌|
గోశల్యం వృషశల్యం స్యాద్ద్విహస్తాచ్చ ప్రమాణతః||
అంటే ''ప్రశ్న యొక్క మొదటి అక్షరం 'అ నుండి ఔ' అక్షరములలో ఒక అక్షరం అయితే ప్రశ్న వేసిన వ్యక్తి స్థలంలో తూర్పుదిక్కులో రెండు హస్తములలోతున ఆవు ఎముకలుగానీ, ఎద్దు ఎముకలుగానీ ఉంటాయి అని అర్థం.''
''అదేమిటి? గృహ నిర్మాత వేసే ప్రశ్న యొక్క మొదటి అక్షరం సహాయంతో అతని స్థలంలో రెండు అడుగుల లోతున ఉండే ఎముకలను కనుగొనడం ఎలా సాధ్యం? ఇది శాస్త్రీయంగా రుజువుపర్చలేని విషయం కదా?'' ఆశ్చర్యంతో అన్నాడు చంద్రమౌళి.
''అప్పుడే ఆశ్చర్యపోకు. ఇంకా విను. ''జ్యోతిస్సంహితార్ణవం'' ప్రకా రం ప్రశ్న మొదటి అక్షరం క, ఖ, గ, ఘ లలో ఒకటైతే, స్థలంలో ఆగేయ దిశలో ఒక హస్తం లోతున పిల్లి ఎముకలుగానీ, మేక ఎముకలుగానీ ఉంటాయట! అలాగే ఇతర అక్షరాలకీ వివిధ జంతువుల ఎముకలు ఉండటానికి సంబంధం ఉంటుందట! ఈ అధ్యాయం చివరలో ఏం చెప్పబడిందంటే.. ''బ్రహ్మోక్తత్వాన్న సంశయః'' అని. అంటే ఈశల్యోద్ధార ప్రకరణము ''బ్రహ్మదేవునిచే చెప్పబడినందున సంశ యములేదు' అని అర్థం. ఆ ప్రకారంగా తాముచెప్పే అనేక అసంబద్ధ విషయాలను దేవుళ్ళ పేర్లతో ముడి పెట్టడం తరచుగా జరుగుతోంది. ఇదీ మనం, సైన్సు వాదులం గమనించవలసిన విషయం.''
మరో విచిత్ర విషయం విను. ఇల్లు కట్టే వ్యక్తి వాస్తు వాదిని ప్రశ్నించేటప్పుడు తన శరీరంలో ఏ అవయ వాన్ని తాకితే లేక ఏ అవయవంలో దురదపుట్టి గోకితే ఏం లభిస్తుందో వాస్తు గ్రంథాలలో చెప్ప బడింది. ఆ విషయాలు విను. దానికంటే ముందు గృహం నిర్మించే స్థలంలో వాస్తు పురుషుడు ఎలా ఉంటాడో ఆ వివరం చెప్పబడింది. అది ముందుగా వివరిస్తాను.'' అని ఒక బొమ్మ చూపించాను.
(ఆ వివరాలు వచ్చేవారం)

స్మార్ట్‌ఫోన్‌ క్రెడిట్‌ కార్డ్‌..!


స్మార్ట్‌ఫోన్‌ని క్రెడిట్‌కార్డ్‌లా వాడగలిగే వీలు కలిగిస్తోంది కొత్త టెక్నాలజీ. మొబైల్‌ వాలెట్‌ అప్లికేషన్‌ అనేది ఇప్పుడు తాజాగా అభివృద్ధి చేసిన అప్లికేషన్‌. మాస్టర్‌కార్డ్‌, పే పాల్‌ వంటి దిగ్గజాలు ఈ తరహా అప్లికేషన్‌ను మొబైల్‌ఫోన్‌లపై అందిస్తున్నారు. ప్రస్తుతం వాడుకలో ఉన్న కార్డ్‌ స్వైపింగ్‌ పద్ధతి కాలహరణ చేస్తుందన్న ఉద్దేశం వ్యక్తమవుతోంది. అసలు ఎటువంటి మానవ సంబంధం లేకుండా భవిష్యత్తులో ఆర్థిక లావాదేవీలు జరిగే దిశలో ఫోన్‌ క్రెడిట్‌కార్డ్‌లు అభివృద్ధి చెందనున్నాయి. రిటైల్‌ వర్తకులు ఫోన్‌పై వున్న బార్‌కోడ్‌ని స్కాన్‌ చేస్తే చాలు.. ఫోన్‌ అనుసంధానం జరిగి లావాదేవీ జరిగిపోతుంది. ఇది వినియోగదారులకి సౌకర్యమేగానీ అందరు వర్తకులకీ ఇది వర్తించకపోవచ్చు.

భూమి కంటే పెద్ద 'వజ్రం'..!


అంతరిక్షంలో మన భూమికంటే భారీ పరిమాణంలో మరో గ్రహం కనిపించింది. నిజానికి అది భూమికంటే రెండింతలు పెద్దది. విశేషమేమిటంటే, ఆ గ్రహం అధికశాతం వజ్రంతో నిర్మితమై ఉండటం. ఆ శిలా గ్రహం ఒక నక్షత్రం చుట్టూ అతి వేగంగా పరిభ్రమిస్తోంది. ఎంత వేగంగా అంటే, మన 18 గంటలు దానిపై ఒక సంవత్సరం అట! ఆ గ్రహానికి '55 షaఅషతీఱ వ' అని పేరు పెట్టారు. దానిపై ఉష్ణోగ్రతలు 1,648 సెల్సియస్‌ డిగ్రీల ప్రాంతంలో ఉంటాయి. ఆ గ్రహంలో అధికశాతం గ్రాఫైట్‌, వజ్రాలు వున్నాయి. మామూలుగా అయితే నీరు, గ్రానైట్స్‌ ఉంటాయి. ఇంతకు మునుపు కూడా కొన్ని వజ్ర గ్రహాలను గుర్తించారుగానీ ప్రస్తుత గ్రహమంత వివరాలు లభించలేదు.

పాటలు పాడే మూషికాలు..!


మగ ఎలుకలు ఆడ ఎలుకలను ఆకర్షించడానికి మానవుల్లా పాటలు పాడగలవని తెలిసింది. పైగా, పోటీ గనక వస్తే, పాటలో మార్పులు కూడా చేస్తాయట! కొన్ని దశాబ్దాల క్రితం ఎలుకలకి అసలు గాత్ర వెసులుబాటు ఉండదని భావించేవారు. కానీ ఇప్పుడు వాటికి గాత్రం ఉండటమే కాదు, దాన్ని మార్పు చేయడం, కొత్త బాణీలు నేర్చుకోవడం కూడా తెలుసునని నిరూపించబడింది. ఎలుకల మెదడులో ఉండే స్వర సంబంధిత మార్గాలు మానవులలో మాదిరే ఉంటాయని తెలిసింది.

చిక్కుడులో కాన్సర్‌ నిరోధకాలు..!


ఫాబా బీన్స్‌ అనే రకం చిక్కుడులో అధికమోతాదుల్లో యాంటీ ఆక్సీడెంట్‌ పదార్థాలు ఉన్నాయనీ, అవి అనేకరకాల కాన్సర్‌లను నివారించడంలో సమర్ధవంతంగా పనిచేస్తాయనీ పరిశోధకులు తెలిపారు. ఫాబా బీన్స్‌తో కాన్సర్‌ వంటి మహమ్మారి వ్యాధులేకాక అధిక రక్తపోటుని నియంత్రించడంలో కూడా బాగా పనిచేస్తాయని అంటున్నారు. ఆస్ట్రేలియాలో ఈ తరహా బీన్స్‌ విరివిగా పండుతాయి. వీటి నుండి వెలికితీసిన ఫీనోలిక్‌ సమ్మేళనాలు కొన్నిరకాల కాన్సర్‌ కణాలను నాశనం చేశాయి. అయితే ఈ బీన్స్‌ని ఆహారంగా తీసుకుంటే అవి కాన్సర్‌ కణాలపై ఏవిధంగా పనిచేస్తాయో ఇంకా తెలియవలసి వుంది.

అంతరించే దిశలో మన జీవులు..!

అతి ప్రమాదకరస్థితిలో ఉన్న వంద జాతుల జాబితాలో నాలుగు మన దేశానివే. అయితే ఈ నాలుగు జాతులూ ప్రత్యేకంగా పెద్ద ఉపయోగం లేనివి కావడంతో ప్రభుత్వం దృష్టిలో అంతగా పడలేదు. గతవారం ప్రకటించిన జాబితాలో గ్రేట్‌ ఇండియన్‌ బస్తార్డ్‌ అనే భారీ పక్షీ, గూటీ తరంతులా అనే విషపు సాలెపురుగూ, బతగుర్‌బుస్కా అనే తాబేలూ, వైట్‌ బెల్లీద్‌ హెరాన్‌ అనే కొంగ ఉన్నాయి. ఇవన్నీ అంతరించే దశలో ఉన్నాయి. ఇవన్నీ మానవులకు ప్రత్యక్షంగా ఏవిధంగానూ ఉపయోగం కావు; అంతగా ఆకట్టుకోవు కూడా. అందువల్ల ఇవన్నీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురయ్యాయి. మన దేశంలో ఇవి నాలుగే అయినా ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి నిర్లక్ష్యానికి గురైనవి 8 వేల జాతులు ఉన్నాయి. వీటికి పులులకు ఉన్నటువంటి 'గ్లామర్‌' లేకపోయినా ఒకప్పుడు ఇవీ అధిక సంఖ్యలలో జీవించినవే! గ్రేట్‌ ఇండియన్‌ బస్తార్డ్‌ పక్షి మూడు దశకాల క్రితం సుమారు రెండువేల వరకూ ఉంటే, ఇప్పుడవి రెండొందలకు పడిపోయాయి.

Thursday 11 October 2012

మైక్రోవేవ్‌లతో సౌరశక్తి..!



ఆవేశపడి మైక్రోవేవ్‌ ఒవెన్‌ కొని, చివరికి మిగిలిపోయిన ఆహారాన్ని వేడిచేసుకోడానికే దాన్ని వాడటం చాలాచోట్ల చూస్తుంటాము. కానీ ఇప్పుడు మైక్రోవేవ్‌లతో మరో ఉపయోగం వుందని తెలిసింది. మైక్రోవేవ్‌ని ఉపయోగించే ఫొటో వోల్టాయిక్‌ సెల్స్‌తో తక్కువ ఖర్చులో కొన్ని పదార్థాలను తయారుచేయవచ్చని తెలిసింది. ఒరిగాన్‌ స్టేట్‌ యూనివర్శిటీ ఇంజనీర్లు మైక్రోవేవ్‌ని వాడి రాగి, జింక్‌ సల్ఫైడ్‌ తయారు చేశారు. ఆ పదార్థం తక్కువ విషపూరిత మైనదీ, తక్కువ ఖర్చుతో కూడుకు న్నదీ, మెరుగైనదీ అని వారు అంటు న్నారు. మైక్రోవేవ్‌ను వాడటం వల్ల తయారీ సమయం కేవలం సెకన్లలో ఉంటుంది. పైగా తయారీపద్ధతిపై పూర్తి నియంత్రణ ఉంటుంది. ఈ పరిశో ధన సౌరశక్తి రంగానికి కొత్త ఊతం ఇచ్చినట్టే అని భావిస్తున్నారు. మొత్తానికి మైక్రోవేవ్‌ ఒవెన్‌కు మరొక మంచిపని దొరికింది.

Wednesday 10 October 2012

చెట్లకేం కాస్తాయి?

  • చురక సంహిత
మిత్రుడు సురేష్‌, నేను ఓ నర్సరీకి వెళ్లాం. పూల చెట్లు, పళ్ళ చెట్లు, అందమైన క్రోటన్సు, ఇలా రకరకాల మొక్కలు అక్కడ దొరుకుతాయి.
'ఇదేమి మొక్క' మావాడి ప్రశ్న.
'దానిమ్మ' నర్సరీ అతని జవాబు.
'దీనికి ఏం కాయలు కాస్తాయి?'
'దానిమ్మ కాయలు.'
'ఇదేమి మొక్క, ఆకులు బాగా ఉన్నాయి.'
'నిమ్మ'.
'దీనికి ఏ కాయలు కాస్తాయి.'
'నిమ్మ కాయలు, నిమ్మ చెట్టుకి నిమ్మకాయలు కాస్తాయి.'
'ఇదేమి మొక్క?'
'మామిడి మొక్క, ఇది పెద్దయ్యాక మామిడి కాయలు కాస్తాయి, అది చీనీ మొక్క. దానికి చీనీ కాయలు కాస్తాయి, అది ....'
మధ్యలో ఆపేసి మావాడు 'ఏమి చదువుకున్నావు?' అని అడిగాడు.
'అయిదుకే ఆపేశాను. అందుకే ఏ మొక్కకు ఏ కాయలు కాస్తాయో తెలుసు. తలా తోకా లేని ప్రశ్నలు వేసేంత చదువుకోలేదు. చదువులేదని ఇన్ని రోజులూ బాధపడ్డాను. ఇక నుంచి ఆనందంగా ఉండవచ్చు. లేదంటే నా మెదడు కూడా ఇలా చెడిపోయి ఉండేదేమో' అని గొణుక్కుంటూ వెళ్లిపోయాడు.
నాక్కొంచెం కోపమొచ్చింది. 'ఏరా, కష్టపడే వారితో జోకులా?'
'జోకులు కాదురా. అయిదవ తరగతి చదివిన వారికీ లేదా ఏమీ చదవని వారిక్కూడా ఏ చెట్టుకు ఏ కాయలు కాస్తాయో తెలుసు కదా, మరి మన ప్రధానికి తెలియదా, డబ్బులు చెట్లకు కాయవు, కష్టపడి సంపాదించాలని. ఆయన జోక్‌ వేయగా లేనిది నేను తమాషా చేయకూడదా? ఆర్థిక శాస్త్రంలో నిపుణుడు కూడా. ఇందాక చదువుకున్న వాడినని నాపై నర్సరీ అతను కోప్పడ్డాడు కదా, మరి నా కోపం ఎవరి మీద చూపాలి?'
'ఆ లైన్లో వచ్చావా! అదీ ప్రజలందరూ వింటున్న టీవీ కార్యక్రమంలో, ఓ కామెడీ షోలా ఉందని మా ఆఫీసులో కూడా అనుకున్నారు.'
'సినిమాలో కామెడీ ఆర్టిస్టులుంటారు, మనల్ని నవ్విస్తారు. దాంట్లో వారు స్పెషలిస్టులు. అలాగని హీరో సీరియస్‌గా కథ నడిపినా, తానూ మధ్యలో కామెడీ చేయవచ్చు కొన్ని సీన్లలో. అంతేకానీ మొత్తం కమెడియన్లలా చేయడు కదా!'
'సరేలే ఎవరి సినిమా కష్టాలు వారివి.'
్య్య్య
'నాన్నా, మా బడిలో కథల పోటీలు జరుగుతున్నాయి. నాకేదైనా నాటకం రాసివ్వవా.'
'సాంఘికమా, జానపదమా, పౌరాణికమా?'
'ఏదైనా సరే.'
'సరేలే.'
్య్య్య
పూర్వం మోహనాసురుడనే రాక్షసుడు మనుషులపైనా, ఋషులపైనా దాడి చేసి గాయపరచి వారిని భక్షించేవాడు. ఎందరు ప్రయత్నించినా వాడిని ప్రతిఘటించే శక్తి లేక ఊరుకోవలసి వచ్చేది. అందరూ తప్పించుకుని తిరగసాగారు.
ఒకనాడు ఓ ముని బక్కపలచగా ఉన్నా ధైర్యస్తుడు ఆ అడవిగుండా వెళుతుంటాడు. మోహనాసురుడు ఎదురవుతాడు. వీడిని తిని ప్రయోజనం ఉంటుందా అనుకుని, సరేలే ఓ ఆట ఆడించి వదిలేద్దాం అనుకుని 'ఏరా పుల్లయ్యా, ఎక్కడికి ప్రయాణం?'
'ఓ రాక్షసాధమా, నీ గురించి విన్నాను, నీవూ బుద్ధిగా తపస్సు చేసుకుని దేవుణ్ణి ప్రసన్నం చేసుకుని ఏదైనా వరం పొంది జీవితాంతమూ ఏ శ్రమా లేకుండా హాయిగా ఉండవచ్చు కదా!'
'అవురా, నాకు ఈ విధంగా జ్ఞానబోధ చేసినవారు ఇంతవరకూ తారసపడలేదురా, ఇంతకీ ఏ దేవుడి కోసం తపస్సు చేయమంటావు.'
'పిచ్చివాడా, శివుణ్ణి ప్రార్థించు.'
'ఏ వరం కోరమంటావు?'
'అన్నింటికీ ముఖ్యమైనది డబ్బు అది సంపాదించే మార్గం అడుగు. అదీ ఎలాంటి కష్టం లేకుండా.'
్య్య్య
''ఓం నమః శివాయ, ఓం నమః శివాయ .....' ఘోరమైన తపస్సు (సముద్రాలు పొంగటం, భూకంపాలు రావడం- ఇవన్నీ బ్యాక్‌ గ్రౌండ్‌లో)
'మోహనాసురా వచ్చాను. నేను శివుణ్ణి. ఏదైనా వరం కోరుకో...'
'దేవ దేవా! నా శ్రమను గుర్తించి నాకు ప్రత్యక్షమైనావా?'
'అవును మోహనాసురా'
'పరమ శివా, నీకు తెలుసు ఏదైనా డబ్బుతో ముడిపడి ఉన్నదని. అందుకే నాకు ...'
'నీకు?'
'నాకు డబ్బులు కాసే చెట్టును ఇవ్వు.'
'ఇదేమి కోరిక మోహనాసురా! ప్రకృతి విరుద్ధంగా చెట్లకు కాయలు, పండ్లు కాకుండా డబ్బులా?'
'ఏం కల్పవృక్షమూ, కామథేనువు గురించి మునులు మాట్లాడుకుంటుండగా వినలేదనుకున్నావా?'
'సరే మోహనాసురా. అయితే ఒక షరతు, నీవు కోరినట్లు చెట్లకు డబ్బులు కాస్తాయి కానీ అవి చెట్లని ఎవ్వరికీ తెలియదు. నీకు మాత్రం తెలిసినా నీవు తెలియనట్లు నాటకమాడతావు. కోరరాని కోరిక కోరినందుకు నీకు సుఖం లేకపోగా, నీవు ఆ డబ్బును అనుభవించలేవు.'
'అయితే ఈ జన్మలో కాకుండా వచ్చే జన్మలో ఈ వరం ప్రసాదించు స్వామీ'
'అలాగే' (పెద్ద శబ్దం, శివుడి అంతర్థానం)
్య్య్య
'డబ్బులు చెట్లకు కాయవు, కష్టపడి సంపాదించాలి ...' ప్రధాని జాతినుద్దేశించి చేసిన ప్రసంగం.
కానీ ఎవ్వరికీ తెలియకుండా బ్యాంకులు, బీమా కంపెనీలు, భవిష్య నిధులూ, పెన్షన్లూ, ప్రభుత్వ రంగ కంపెనీలు, నదులూ, సముద్రాలూ, కొండలూ, ఆకాశాలూ, గనులూ, అన్నీ చెట్లే. అన్నింటికీ డబ్బులే డబ్బులు ... విరగకాస్తున్నాయి. వాటిని కోసుకునేందుకు దేశంలోని బడా బాబులకు, విదేశీ బాబులకు నిచ్చెనలేస్తున్న నాయకులు ... ఆ నిచ్చెనల కింద నలిగిపోతూ సామాన్య జనం ...
ఎవరు చెప్పింది డబ్బులు కాయవని ...
్య్య్య
పరదా పడుతుంది, చప్పట్లు ...

మానవ మనుగడ కోసం జీవ వైవిధ్యం


మానవ జోక్యం, ప్రమేయం ప్రకృతి స్వభావాన్ని కొంత మేరకు మార్చే అవకాశం ఉన్నప్పటికీ, మానవులు తమ అవసరాల కోసం విడదీయలేనంతగా ఇప్పటికీ పూర్తిగా ప్రకృతిపై ఆధారపడి ఉన్నారు. ఈ వైరుధ్యం గరిష్ట స్ధాయికి చేరితే అది వైవిధ్యం తిరుగులేని విధంగా అంతం కావడానికి దారితీయడమే కాకుండా మానవ నాగరికత ఉనికికే ముప్పు తెచ్చిపెడుతుంది. మనం వేగంగా ఆ గరిష్ట స్థాయికి చేరుకుంటున్నట్లు సిబిడి గుర్తించింది.

ప్రపంచంలోని దేశాలను పేద, ధనిక దేశాలుగా మాత్రమే కాకుండా మరో రకంగా కూడా వర్గీకరించవచ్చు. జన్యుపరంగా లేదా జీవ వైవిధ్యపరంగా సుసంపన్నమైన దేశాలు, పేటెంట్‌పరంగా సంపన్న దేశాలుగా వాటిని వర్గీకరించ వచ్చు. భూమికి సంబంధించిన జీవ వైవిధ్యం వివిధ రకాలైన సహజసిద్ధమైన మొక్కలు, జంతువులు, సూక్ష్మ ప్రాణుల విషయాల్లో వ్యక్తమవుతుంది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికాలోని పేద దేశాల్లో ఈ జీవ వైవిధ్యం ఎక్కువగా ద్యోతకమవుతుంది. యూరప్‌, ఉత్తర అమెరికా దేశాలు ఈ విషయంలో వెనకబడి ఉన్నప్పటికీ భూమి మీద ఉన్న వివిధ జంతు, మొక్కల వనరులకు సంబంధించిన పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాయి.
జీవ వైవిధ్యంపై ఒప్పందం
జీవ వైవిధ్యం విషయంలో ప్రపంచ దేశాల మధ్య ఉన్న అంతరం జీవ వైవిధ్య ఒప్పంద(సిబిడి) చరిత్రను చాటిచెబుతోంది. ఈ ఒప్పందం 1992లో బ్రెజిల్‌లోని రియో డీ జెనీరోలో జరిగిన ధరిత్రీ సదస్సులో కుదిరి 1993లో అమలులోకి వచ్చింది. 193 దేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంపై సంతకం చేసినప్పటికీ తరువాత ధృవీకరించని బహుకొద్ది దేశాల్లో అమెరికా కూడా ఒకటి. అంటే ఈ తీర్మానానికి అమెరికా కట్టుబడి ఉండదని అర్థం. దీన్ని ధృవీకరించక పోవడానికి అమెరికా తెలిపిన కారణాల్లో మేధోసంపత్తి హక్కుల్లో ఈ ఒప్పందం జోక్యం చేసుకునే అవకాశం ఉందనేది ఒకటి. తమ దేశ పౌరులు, సంస్థల హక్కుల్లో ఈ ఒప్పందం జోక్యం చేసుకుంటుందని అమెరికా వ్యాఖ్యానించింది. సిబిడిలో ముఖ్యంగా మూడు ప్రధాన అంశాలున్నాయి. (ఎ) జీవ వనరుల పరిరక్షణ (బి) ఈ భూమిపై గల జీవ వనరులను స్థిరంగా, నిలకడగా ఉపయోగించుకోవడం, (సి) జీవ వనరులను సాంకేతికంగా ఉపయోగించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను పంచుకోవడంలో సమానత్వం.
ఈ భూమి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఈ ఒప్పందం ఒక ముఖ్యమైన అడుగుగా భావించారు. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఒక ఒప్పందం కుదరడం ఇదే మొదటిసారి కావడం ఈ ఒప్పందానికి ఉన్న మరో విశిష్టత. జీవ వైవిధ్యం ప్రపంచ దేశాల ఉమ్మడి సహజ సంపదగా గుర్తించారు. దానిని పరిరక్షించడం మానవాళి ఉమ్మడి బాధ్యత, సమస్యగా కూడా పరిగణించారు. ఈ భూమిపై జీవ వనరులు పరిమితంగా మాత్రమే ఉంటాయని, అవి వేగంగా అంతరించి పోతున్నాయనే అవగాహన ప్రాతిపదికగా ఈ ఒప్పందాన్ని రూపొందించారు. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం. మొక్కలు, జంతువుల్లో వేగంగా అంతరించిపోతున్న ప్రతి ఒక్క రకం లక్షలాది సంవత్సరాల పరిణామ చరిత్రను కాలరాస్తుంది. మనం మన చుట్టూ ఉన్న విభిన్న రకాల మొక్కలు, జంతువులు ఈ భూమి మీద మొత్తం పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నాయి. మొక్కలు, జంతువులు మరణించిన కొద్దీ ఈ భూమి మీద పర్యావరణం మరింతగా దెబ్బతింటుంది. మొత్తం పర్యావరణ వ్యవస్థ ధ్వంసమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. మనం ఎంతగా సాంకేతికపరంగా, శాస్త్రీయంగా అభివృద్ధి చెందినప్పటికీ కృత్రిమ మార్గాల ద్వారా జీవ వైవిధ్యాన్ని వృద్ధి చేసుకునే మార్గాలు అందుబాటులో లేవు. ఒక జాతి అంతరించిపోతే అది అంతరించిపోయినట్లే. దానిని పునరుజ్జీవింపజేసే అవకాశాలు లేవు.
మానవుడు, ప్రకృతి వైరుధ్యం
ఇతర మొక్కలు, జంతువుల మాదిరిగా మానవులు అందుబాటులోని వనరులను ఉపయోగించుకుని తమ అవసరాలను తీర్చుకోగలరు. ఈ భూమిపై ఉన్న ఇతర ప్రాణుల మాదిరిగా కాకుండా మానవులు ప్రకృతి నుంచి వనరులను సేకరించడంతోపాటు స్వభావాన్ని మార్చగల సామర్ధ్యం కలవారు. అందువల్ల ప్రకృతి, మానవుల మధ్య వైరుధ్యం చెలరేగుతోంది. మానవ నాగరికత ప్రారంభమైనప్పటి నుంచీ ఈ ఘర్షణ ధోరణి కొనసాగుతూవస్తోంది. మానవ నాగరికత ఆవిర్భవించిన తొలి రోజుల్లో ఈ వైరుధ్యం ప్రభావం పరిమితంగానే ఉండేది. మానవ జోక్యాన్ని తట్టుకుని నిలబడగలిగే స్థాయిలో ఆ సమయంలో ప్రకృతి ఉండేది. అది జీవ వైవిధ్యాన్ని పునరుద్ధరించుకునే సామర్ధ్యాన్ని ప్రదర్శించేది. అయితే పెట్టుబడిదారీ వ్యవస్థ హయాంలో సాధించిన అభివృద్ధి, వృద్ధితో ప్రకృతికున్న తన విస్తృత జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుకోగల సామర్ధ్యం ప్రమాదంలో పడింది.
మానవ జోక్యం, ప్రమేయం ప్రకృతి స్వభావాన్ని కొంత మేరకు మార్చే అవకాశం ఉన్నప్పటికీ, మానవులు తమ అవసరాల కోసం విడదీయలేనంతగా ఇప్పటికీ పూర్తిగా ప్రకృతిపై ఆధారపడి ఉన్నారు. ఈ వైరుధ్యం గరిష్ట స్ధాయికి చేరితే అది వైవిధ్యం తిరుగులేని విధంగా అంతం కావడానికి దారితీయడమే కాకుండా మానవ నాగరికత ఉనికికే ముప్పు తెచ్చిపెడుతుంది. మనం వేగంగా ఆ గరిష్ట స్థాయికి చేరుకుంటున్నట్లు సిబిడి గుర్తించింది. మన ముందు ముప్పు పొంచి ఉన్నదనే విషయాన్ని మానవాళి ఇటీవలనే గుర్తించడం మాత్రమే కాదు, జీవ వైవిధ్యం అనే పదాన్ని ఇటీవలే కొత్తగా రూపొందించింది. 1980 దశకంలో ఇది వాడుకలోకి వచ్చింది. మనం ఎంత మేరకు జీవ వైవిధ్యాన్ని కోల్పోయామనే విషయమై మనకు పరిమితమైన సమాచారం మాత్రమే అందుబాటులో ఉంది. గతంలో కూడా అనేకసార్లు పెద్ద ఎత్తున జాతులు అంతరించిపోయాయనే విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. సాధారణ పరిస్థితుల్లో జీవ పరిణామంలో భాగంగా కొన్ని జాతులు అంతరించి పోవడం సహజమే. దీనిని 'బ్యాక్‌గ్రౌండ్‌ రేట్‌' అదృశ్యం అని పిలుస్తారు. ఈ స్థాయి కంటే రెట్టింపు స్థాయిలో జాతులు అంతరించిపోతూ ఉంటే దానిని మూకుమ్మడిగా అంతరించి పోవడంగా వ్యవహ రిస్తారు. గత 60 కోట్ల సంవత్సరాల్లో మూకుమ్మడిగా జాతులు అంతరించిపోయే ప్రక్రియ కనీసం ఐదుసార్లు జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు. సహజసిద్ధంగా ప్రకృతిలో సంభవించే మార్పులు భూ పర్యావరణంలో సమూలమైన మార్పుకు దోహదం చేశాయి. ఉదాహరణకు, రాక్షస బల్లులు (డైనోసార్స్‌) ఈ విధంగానే మూకుమ్మడిగా అంతరించిపోయి ఉండవచ్చునని భావిస్తున్నారు. మానవుల ఉనికి లక్ష సంవత్సరాల కంటే తక్కువ కాలం నుంచే కొనసాగుతుండగా ఈ డైనోసార్స్‌ అనేక లక్షల సంవత్సరాలపాటు ఈ భూమిపై మసలాయనే కథనాలు ప్రచారంలో ఉన్నాయి. తీవ్ర విధ్వంసం సంభవించిన కారణంగానే ఇవి అంతరించిపోయాయని భావిస్తున్నారు. అతి పెద్ద గ్రహ శకలంతో భూమి ఢకొీనడంతో ఈ విధ్వంసం సంభవించి ఉండవచ్చునని భావిస్తున్నారు. మరోసారి మనం మరో పెద్ద విపత్తు దిశగా సాగుతున్నామనే ఆందోళన తలెత్తుతోంది. ప్రకృతి వనరులను మానవులు అడ్డూఅదుపూలేని రీతిలో దోచుకోవడం వల్ల ఈ పరిణామం సంభవించ వచ్చునన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి రోజూ వందల కొద్దీ జాతులు అంతరించి పోయే పరిస్థితిని మనం చూడవచ్చునని పర్యావరణవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇది పైన పేర్కొన్న బ్యాక్‌గ్రౌండ్‌ రేట్‌ కంటే లక్షలాది రెట్లు ఎక్కువగా జరుగుతుందని అంచనా.
జీవ వైవిధ్యం అంతరించడానికి, భూగోళ ఉష్ణోగ్రతల పెరుగుదల ఫలితంగా చోటుచేసుకునే వాతావరణ మార్పుకు మధ్య సంబంధం ఉంది. ఉదాహరణకు ఉష్ణ మండల వర్షపాత అడవులు(రెయిన్‌ ఫారెస్ట్‌లు) అంతరించిపోతే వేలాది తెగల జీవరాసులు అంతమవుతాయి. అంతేకాకుండా వాతావరణంలో కార్బన్‌-డై-ఆక్సైడ్‌ను హరించి వేడిని తగ్గించే సింక్‌లు కూడా హరించుకుపోతాయి. మరోవైపు భూమి త్వరితగతిన వేడెక్కడం అనేక జంతు జాతుల ఉనికికి ముప్పుగా పరిణమిస్తోంది. తద్వారా అవి అంతరించిపోయే ప్రమాదం ఏర్పడింది.
ప్రకృతి వనరుల దోపిడీ
మానవులు నిరంతరం భూమికి చెందిన జీవ వనరులపై ఆధారపడతారనే సిద్ధాంతాన్ని జీవ వైవిధ్య ఒప్పందం ప్రాతిపదికగా తీసుకుంటుంది. అందుకోసం నిలకడైన పద్ధతులను అనుసరించాలని వాదిస్తుంది. మానవ అవసరాలు, జీవ వైవిధ్యాన్ని స్థిరంగా పరిరక్షించుకోవాల్సిన అవసరాల మధ్య సమతుల్యత సాధించాలని అది పిలుపు నిచ్చింది. ఇటువంటి సమతుల్యత హేతుబద్ధమైనదే అయినప్పటికీ దానిని అమలు చేయడం అంత తేలికైన విషయమేమీ కాదు. ధనిక దేశాలు ఎక్కువ మొత్తాన్ని వినియోగిస్తుంటాయి. పేద దేశాలు జీవ వైవిధ్యానికి ప్రధాన నెలవులుగా ఉంటాయి. వాతావరణ మార్పుపై ప్రజల చర్చ కేంద్రీకృతమవుతున్న తరుణంలో జీవ వైవిధ్యాన్ని పరిరక్షించే విషయంలో ధనిక, పేద దేశాల మధ్య పోరాటం జరుగుతోంది. ధనిక దేశాలు తమ వినియోగం తగ్గించుకోవడానికి సుముఖత చూపవు. పైపెచ్చు పరిరక్షణ భారాన్ని పేద దేశాలపై మోపాలని కోరుకుంటాయి. అటువంటి పరిరక్షణకుగాను తమకు ప్రతిఫలం చెల్లించాలని పేద దేశాలు డిమాండ్‌ చేస్తున్నాయి. తమకు ఆర్థికంగా మద్దతు అందించాలని, అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ధనిక దేశాలు అందించాలని కోరుతున్నాయి.
ప్రయోజనాన్ని సమానంగా పంచుకోవడం-నగోయా ప్రొటోకాల్‌
అంతర్జాతీయ సంబంధాల్లో పేద, ధనిక దేశాల మధ్య అంతరం సిబిడిలో స్పష్టమవుతుంది. ఇది ప్రయోజనాలను సమంగా పంచుకోవాలని నిర్దేశిస్తోంది. పైన పేర్కొన్నట్లు ప్రపంచ జీవ వైవిధ్య వనరులు అధిక భాగం పేద దేశాల్లో ఉంటాయి. తమ విస్తరణ కోసం, లాభాలను పెంచుకునేందుకు ధనిక దేశాలు, వాటికి చెందిన బహుళ జాతి సంస్థలకు ఈ వనరులు అందుబాటులో ఉండటం అవసరం. కొత్త మందులకు అవసరమైన ముడిసరుకులను ఈ జీవ వనరులు అందిస్తాయి. అలాగే మెరుగైన వ్యవసాయోత్పత్తులను సాధించేందుకు, ఇంజనీరింగ్‌కు సంబంధించిన అనేక అప్లికేషన్స్‌కు ఇవి అవసరం. పేద దేశాల్లోని జీవ వనరులను దోపిడీ చెయ్యాలని ధనిక దేశాలకు చెందిన కార్పొరేట్లు నిరంతరం ప్రయత్నిస్తాయి. కొత్త ఉత్పత్తులను తయారుచేసేందుకు వీటిపైనే ఆ సంస్థలు ఎక్కువగా ఆధారపడతాయి. ఈ ఉత్పత్తులను గరిష్ట లాభాలకు అవి అమ్ముకుంటాయి. కోట్లాది డాలర్ల లాభాలను అవి సంపాదిస్తాయి. ఏ దేశాల నుంచి ఈ వనరులను సేకరిస్తున్నాయో వాటితో లాభాలు పంచుకునేందుకు ఏమాత్రం ఆసక్తి ప్రదర్శించవు. జీవ వనరుల చౌర్యం కేవలం వృక్ష, జంతు జాతులకు మాత్రమే పరిమితం కావు. స్థానిక ప్రజల పరిజ్ఞానానికి కూడా ఇది విస్తరిస్తుంది. ఈ పరిజ్ఞానాన్ని అక్కడి ప్రజలు వేలాది సంవత్సరాలు కృషి చేసి సంపాదించుకున్నారు. అయితే దీనిని ధనిక దేశాలకు చెందిన సంస్థలు తమ ప్రయోజనాల కోసం, లాభాల కోసం దోపిడీ చేస్తాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే సిబిడి లాభదాయకమైన పంపిణీ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఒక దేశంలో జీవ వనరుల వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను మరో దేశం లేదా సమాజంతో పంచుకోవాలని ఈ సిద్ధాంతం నిర్దేశిస్తోంది. ఇది మొక్కలు, జంతువులకు మాత్రమే కాకుండా సూక్ష్మ జీవులకు (బాక్టీరియా, వైరస్‌లు) కూడా వర్తిస్తుంది. 2006లో అవియన్‌ ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ను ఇతర దేశాలతో పంచుకునేందుకు నిరాకరించడం ద్వారా ఇండోనేషియా అంతర్జాతీయ ఆరోగ్య రంగంలో సంచలనం సృష్టించింది. తమ వైరస్‌ను ఉపయోగించుకునే వాక్సిన్‌ను తయారుచేసే సంస్థలు అందువల్ల వచ్చే లాభాల్లో తమకు వాటా ఇవ్వాలని ఇండోనేషియా డిమాండ్‌ చేసింది. ఇండోనేషియా వైఖరి దీర్ఘకాల ప్రతిష్టంభనకు దారితీసింది. ఆ తరువాత వైరస్‌ను పంచుకునే ఒప్పందం సూత్రప్రాయంగా కుదిరింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పర్యవేక్షణలో ఈ ఒప్పందం తుది మెరుగులు దిద్దుకుంటోంది. జన్యు వనరుల అందుబాటు, వాటిని ఉపయోగించడంవల్ల కలిగే ప్రయోజనాన్ని సమాన ప్రాతిపదికన పంచుకునేందుకు నగోయా ప్రొటోకాల్‌ను ఉద్దేశించారు. సంబంధిత టెక్నాలజీల బదిలీకి కూడా ఈ ఒప్పందాన్ని నిర్దేశించారు. ఈ వనరులు, టెక్నాలజీలపై గల హక్కులను, నిధుల కేటాయింపును, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు దోహదం చేసే చర్యలను పరిగణనలోకి తీసుకుని ఈ ఒప్పందాన్ని రూపొందించారు. 2010లో జపాన్‌లోని నగోయాలో జరిగిన సమావేశంలో ఈ ఒప్పందాన్ని ఆమోదించారు. కనీసం 50 దేశాలు ఆమోదించాల్సి ఉన్నందున ఈ ప్రొటోకాల్‌ ఇంకా అమలులోకి రాలేదు. ఇప్పటి వరకూ స్పల్ప సంఖ్యలో మాత్రమే దేశాలు ఈ ప్రొటోకాల్‌ను ఆమోదించాయి.
హైదరాబాద్‌లో జీవ వైవిధ్య సదస్సు
జీవ వైవిధ్య సదస్సులో ప్రధాన చర్చనీయాంశాలను కొన్నింటిని స్థూలంగా ప్రస్తావించాం. జీవ వైవిధ్య ఒప్పందాన్ని ఆమోదించిన దేశాల ప్రభుత్వాలతో (ప్రాంతీయ, ఆర్థిక సమన్వయ సంస్థల) కూడిన పాలక మండలి సమావేశం అనేక కీలకాంశాలను చర్చిస్తోంది. తీర్మానం అమలులో సాధించిన పురోగతిని సమీక్షించి కొత్త ప్రాధాన్యతలను గుర్తించి సభ్య దేశాలకు కొత్త కార్యాచరణను ఈ సమావేశం రూపొందిస్తుంది. జీవ భద్రతపై కార్టాజెనా ప్రొటోకాల్‌పై ఆరో రౌండ్‌ కాప్‌-మాప్‌-6 చర్చలు అక్టోబర్‌ 1 నుంచి 5 వరకు జరగ్గా, కాప్‌-11 (కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌ పదకొండవ రౌండ్‌ చర్చలు) అక్టోబర్‌ 8 నుంచి 19 వరకు జరుగుతున్నాయి.
-డాక్టర్‌ అమిత్‌ సేన్‌గుప్తా

'వాస్తు' శాస్త్రం కాదు.. ఎందుకని? (2)


  • అశాస్త్రీయ ఆచారాలు 20
'ఇక వాసన పరీక్ష విను. భూమిలోని మట్టిని తీసుకొని వాసన చూచినప్పుడు ఆ వాసనను బట్టి ఆ భూమి ఏ కులా నిదో చెప్పవచ్చట! 'విశ్వకర్మ ప్రకాశిక'లోని ఈ శ్లోకాల్ని విను.
శ్లో|| సుగంధా బ్రాహ్మణీ భూమిః రక్త గంధాతు క్షత్రియా |
మధుగంధా భవేద్వైశ్యా మద్యగంధాచ శూద్రిణీ ||
అంటే భూమి వాసన జాజి, మల్లె వంటి పుష్పముల సువాసన కలిగి వుంటే 'బ్రాహ్మణ భూమి' అని, రక్తము యొక్క వాసన కలిగి వుంటే 'క్షత్రియ భూమి' అని, తేనె వాసన కల్గినది 'వైశ్య భూమి' అనియు, కల్లు వాసన కల్గిన భూమి అయితే 'శూద్ర భూమి' అనియు నిర్ణయించాలట!
ఇక రుచిని బట్టి భూమి వర్ణాన్ని బట్టి...
శ్లో|| మధురా బ్రాహ్మణీ భూమిః కషాయా క్షత్రియా మతా
ఆమ్లా ద్వైశ్యాభవేద్భూమి స్తిక్తాశూద్రా ప్రకీర్తితా||
'భూమియందలి మట్టి తీపిగా ఉన్నచో 'బ్రాహ్మణ భూమి' అనియు, వగరుగా ఉన్నచో 'క్షత్రియ భూమి' అనియు, పులుపుగా ఉన్నచో 'వైశ్య భూమి' అనియు, చేదుగా ఉన్న యెడల 'శూద్ర భూమి' అనియు గుర్తించవలెను' అని అర్థం. ఇక భూమి ఆకారాన్ని బట్టి..
శ్లో|| గంభీరా బ్రాహ్మణీ భూమిః నృపాణాం తుంగమాశ్రితా
వైశ్యాసా సమ భూమిశ్చ,శూద్రిణీ వికటాస్మృతా||
అనగా, గృహము నిర్మించనున్న స్థలము యొక్క ఆకార ము గంభీరముగా ఉన్న యెడల 'బ్రాహ్మణ భూమి' అనియు, ఎత్తుగానున్నచో 'క్షత్రియ భూమి' అనియు, ఎత్తు పల్లములు లేకుండా సమతలం ఉన్న చో 'వైశ్య భూమి' అనియు, ఎత్తు పల్లముతో ఉన్నచో 'శూద్ర భూమి' అనియు తెలుసుకోవాలి.
ఇక భూమియందు పెరిగే చెట్లను బట్టి..
శ్లో|| బ్రాహ్మణీ భూః కుశోపేతా, క్షత్రియాస్యాచ్ఛరాకులా
కుశకాశాకులా వైశ్యా శూద్రా సర్వ తృణాకులా||
అనగా భూమియందు దర్భలు పెరుగుచున్న యెడల 'బ్రాహ్మణ భూమి' అనియు, కాకి వెదురు పెరుగుచున్నచో 'క్షత్రియ భూమి' అనియు, రెల్లు పెరుగుచున్న యెడల 'వైశ్య భూమి' అనియు, వివిధ గడ్డి రకాలున్నచో 'శూద్ర భూమి' అట! ఇక భూమిలోని పల్లాలను అనుసరించి..
శ్లో|| ఉదక్‌ ప్లవా బ్రాహ్మణీ స్యా త్ప్రాక్లవా క్షత్రియామతా
అవాక్‌ ప్లవాచ వైశ్యాస్యా చ్ఛూద్రిణీ పశ్చిమప్లవా||
అంటే ఉత్తరమున పల్లముగా ఉన్న భూమి 'బ్రాహ్మణ భూమి' అనియు, తూర్పున పల్లముగా ఉన్న భూమి 'క్షత్రియ భూమి' అనియు, దక్షిణము పల్లముగా ఉన్న భూమి 'వైశ్య భూమి' అనియు; పశ్చిమము పల్లముగా ఉన్న భూమి 'శూద్ర భూమి'. ఇక భూమి వర్ణాన్ని గూర్చి చివరగా ఇలా 'వాస్తు సర్వస్వం' లో చెప్పబడింది.
శ్లో|| బ్రాహ్మణీ సర్వసుఖదా, క్షత్రియా రాజ్యదా భవేత్‌
ధన ధాన్యకరీ వైశ్యా శూద్రాతు నిందితా స్మృతా||
అనగా 'బ్రాహ్మణ భూమి' సమస్త సుఖాలనిస్తుంది. 'క్షత్రియ భూమి' రాజ్యప్రసాదముగా ఉండును. 'వైశ్య భూమి' ధనధాన్యాలను ఇచ్చును. 'శూద్ర భూమి' నింద్యమైనది, అనగా ఇల్లు కట్టగూడనిది.
ఇప్పుడు చెప్పు చంద్రమౌళీ! రాళ్ళు రప్పలతో వున్న భూమికీ కులాలను ఆపాదించడం, అందులోనూ భూమిలోని ఒక్కో స్థలం ఒక్కో వర్ణానికి చెందిన భూమిగా అనడం అశాస్త్రీయం కాదా? భూమి వివిధ వాసనలతోనూ, అనేకరకాలైన రుచులూ కల్గి ఉంటుందనడం శాస్త్రీయమా? అందులోనూ మంచి వాసన, తీపి రుచీ ఉంటే అది 'బ్రాహ్మణ భూమి' అట! కల్లు లేక సారావాసన, చేదు రుచీ వుంటే 'శూద్రభూమి' అట! ఇది శూద్రులను అవమానించడం కాదా? భూమి గంభీరంగా ఉంటే బ్రాహ్మణ భూమి అట! ఎత్తు పల్లములుగా ఉన్న భూమి శూద్రభూమి అట! భూమి గంభీరంగా ఉండటమంటే ఏమిటి? ఏ వాస్తు పండితుడైనా వివరించగలడా? నల్లటిభూమి 'శూద్ర భూమి' అని ముందు చెప్పి ''కృష్ణ వర్ణో ధమాధ¸మం'' అంటే నల్లటిభూమి చెడ్డ వాటిలో చెడ్డదని తర్వాత చెప్పబడింది. ఇదీ శూద్రులను అవమానించడం కాదా? అంతేకాదు, పడమర పల్లంగానున్న భూమి 'శూద్రభూమి' అనీ, అది 'అధమాథమ భూమి' అనీ, అలాంటి భూమిలో ఇల్లు కట్టు కుంటే కష్టనష్టాలు కలుగుతాయనీ చెప్పబడింది. మన దేశంలో ముంబయి, కొచ్చిన్‌, మంగళూరులాంటి పట్టణా లూ, గోవా రాష్ట్ర పశ్చిమతీర ప్రాంతంలో ఉన్నాయి. ఆ ప్రదే శాలలో భూమి పశ్చిమం పల్లంగా ఉంటోంది. మన దేశం లోని అత్యంత సంపన్నులు ఆ ప్రదేశాలలోనే ఉంటున్నారు. ఇది వాస్తు విరుద్ధమైన విషయం కాదా? అంతేకాదు. మరో ముఖ్యవిషయాన్ని ''వాస్తు ప్రదీపం'' ఇలా తెలియజేస్తోంది.
శ్లో|| స్వవర్ణ గంధ సురసా ధన ధాన్య సుఖా వహా|
వ్యత్యయే వ్యత్యయ ఫల మతః కార్యం పరీక్షణం||
అనగా 'తన వర్ణమునకు సరైన వర్ణము, వాసన, రుచి గల భూమి ధనధాన్య సుఖములనిచ్చును. అలాగాక తన వర్ణమునకు వ్యతిరేకమైన వర్ణము, వాసన, రుచిగల భూమి నష్టమును కలుగజేయును'' అని తెలియజేస్తోంది. అంటే శూద్రులు ఏదైతే వాస్తువాదులు అధమాధమ భూమిగా ప్రత్యేకించి పేర్కొన్నారో దానిపైనే నివసించాలనీ, అలా ఉంటేనే వారికి సుఖాలు కలుగుతాయనీ పేర్కొనడం అమానుషం కాదా? 'ఇలా అత్యంత అశాస్త్రీయంగా, అమా నుషంగా భూమిని విభజించిన 'వాస్తు' శాస్త్రం ఎలా అవుతుంది?' అన్నాను.
చంద్రమౌళి మౌనంగా ఉండిపోయాడు.
'వాస్తు గ్రంథాలలో, ఇల్లు కట్టవలసిన భూమికి సంబంధించిన మరికొన్ని అంశాలు వివరిస్తాను విను' అంటూ కొనసాగించాను.
(మరికొన్ని అంశాలు వచ్చేవారం)
కె.ఎల్‌.కాంతారావు, జన విజ్ఞాన వేదిక.

మైక్రోవేవ్‌లతో సౌరశక్తి..!


ఆవేశపడి మైక్రోవేవ్‌ ఒవెన్‌ కొని, చివరికి మిగిలిపోయిన ఆహారాన్ని వేడిచేసుకోడానికే దాన్ని వాడటం చాలాచోట్ల చూస్తుంటాము. కానీ ఇప్పుడు మైక్రోవేవ్‌లతో మరో ఉపయోగం వుందని తెలిసింది. మైక్రోవేవ్‌ని ఉపయోగించే ఫొటో వోల్టాయిక్‌ సెల్స్‌తో తక్కువ ఖర్చులో కొన్ని పదార్థాలను తయారుచేయవచ్చని తెలిసింది. ఒరిగాన్‌ స్టేట్‌ యూనివర్శిటీ ఇంజనీర్లు మైక్రోవేవ్‌ని వాడి రాగి, జింక్‌ సల్ఫైడ్‌ తయారు చేశారు. ఆ పదార్థం తక్కువ విషపూరిత మైనదీ, తక్కువ ఖర్చుతో కూడుకు న్నదీ, మెరుగైనదీ అని వారు అంటు న్నారు. మైక్రోవేవ్‌ను వాడటం వల్ల తయారీ సమయం కేవలం సెకన్లలో ఉంటుంది. పైగా తయారీపద్ధతిపై పూర్తి నియంత్రణ ఉంటుంది. ఈ పరిశో ధన సౌరశక్తి రంగానికి కొత్త ఊతం ఇచ్చినట్టే అని భావిస్తున్నారు. మొత్తానికి మైక్రోవేవ్‌ ఒవెన్‌కు మరొక మంచిపని దొరికింది.

జీవ భద్రత .. జీవ వైవిధ్యం..


జీవరాశులకు పెద్దఎత్తున నష్టం జరగకుండా నివారించడమే 'జీవభద్రత'. జీవభద్రత ప్రధానంగా జీవావరణం (ఎకాలజీ), మానవారోగ్యంపై కేంద్రీకరిస్తుంది. జీవావరణంలోకి దిగుమతయ్యే జీవరాశులు, వ్యవసాయంలో బయటి నుండి వచ్చే వైరల్‌ లేక మార్పిడికి గురైన జన్యువులు జీవాల్లో అభద్రతను కలిగిస్తాయి. వైద్యరంగంలో ప్రియాన్స్‌గా పిలువబడుతూ పశువుల్లో చికిత్సలేని 'మాడ్‌ కౌ'లాంటి అంటురోగాల్ని కలిగిస్తున్నాయి. బ్యాక్టీరియాలతో కలుషితమైన ఆహారం, వైద్యరంగంలో జీవావరణం నుండి వచ్చిన అంగాలు, కణజాలాలు లేక జన్యు చికిత్స ఉత్పత్తులు, వైరస్‌లు అభద్రతను కలిగిస్తున్నాయి. రసాయనిక కోణంలో నైట్రేట్‌ నత్రజని జీవావరణంలో కలిసినపుడు, పునరుత్పత్తిని ప్రభావితం చేసే ఇతర కారకాలు, కాలుష్య కారకాలు కూడా అభద్రతను కలిగిస్తూ జీవభద్రత పరిధిలోకి వస్తాయి. గ్రహాంతర సూక్ష్మజీవులు ఉంటే అవి అంతరిక్ష శకలాలతో భూమికి చేరి తెలియని సమస్యలు సృష్టిస్తాయని తగిన జాగ్రత్తలు తీసుకోబడుతున్నాయి. ఇవన్నీ విడివిడిగా లేక సంయుక్తంగా జీవవైవిధ్యంపై ప్రభావం కలిగి వున్నాయి. జన్యుమార్పిడి పంటలు, ఉత్పత్తులు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో జీవభద్రతను కొనసాగించడంలో జీవవైవిధ్యంపై ప్రభావాలను 'ప్రొఫెసర్‌ అరిబండి ప్రసాదరావు' సహకారంతో క్లుప్తంగా తెలుపుతూ మీముందుకు వచ్చింది ఈ వారం 'విజ్ఞానవీచిక'.
జన్యుమార్పిడి సాంకేతికంతో జొప్పించే ఇతర జాతి జన్యువు చొప్పించాల్సిన జాతి జన్యువుల సమూహంలో ఎక్కడ స్థిరపడుతుందో తెలియదు. ఒక్కమాటలో చెప్పాలంటే, ఈ ప్రక్రియ చీకటిగదిలో వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఎక్కడో ఒక దగ్గర స్థిరపడ్డట్టుగా వుంటుంది. ఇలా ప్రవేశపెట్టబడ్డ జన్యువు ఆక్రమించిన స్థలాన్ని (క్రోమోజోముపై), పరిసరాల్లోని ఇతర జన్యువులను బట్టి బయటికి కనిపించే గుణగణాలు (జీన్‌ ఎక్స్‌ప్రెషన్‌) ఆధారపడి వుంటాయి. వీటన్నింటినీ ముందుగానే తెలుసుకోలేం. అందువల్ల, ఇలాంటి జన్యుమార్పిడి ద్వారా రాగల గుణగణాలను అన్నింటినీ ముందుగానే పరిగణనలోకి తీసు కోలేం. అందువల్ల, జన్యుమార్పిడి ఉత్పత్తుల నుండి జీవభద్రతను కలిగించడానికి తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.
జన్యుమార్పిడి సాంకేతికం ద్వారా కొత్తగా సృష్టించబడుతున్న, సృష్టించబోయే జీవకణాలు, రాశులు మానవాళిని నష్టపర్చకుండా జీవభద్రత కోసం నియమ, నిబంధనల్ని రూపొందించుకోవాలి. దీనికోసం అంతర్జాతీయ చర్చలు కొనసాగుతున్నాయి. 'కార్టజినా ప్రొటోకాల్‌ (అంతర్జాతీయ ఒప్పందం)' ఈ చర్చల ఫలితమే.
జీవభద్రతపై 1993 నుండి అమల్లోకి వచ్చిన 'కార్టజినా ప్రొటోకాల్‌' భూగోళంలో జీవవైవిధ్య పరిరక్షణకు ఆధారంగా పనిచేస్తుంది. ఇది పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధిలో భాగంగా 1992 'ఎర్త్‌ సమ్మిట్‌'లో ముందుకొచ్చింది. జీవం కలిగిన జన్యుమార్పిడి జీవులను కొత్త జీవావరణంలో ప్రవేశపెట్టడం వలన రాగల దుష్ప్రరిణామాల్ని ముందుగానే తెలుసుకోలేం కాబట్టి, ముందుజాగ్రత్త చర్యలన్నీ తీసుకోవాలని కార్టజినా ప్రొటోకాల్‌ నిర్దేశిస్తుంది. ఒకవేళ ఇలా కొత్తగా దిగుమతువుతున్న జీవులు అభద్రత కలిగించే అవకాశం వుందని ఏ అభివృద్ధి చెందుతున్న దేశమైనా భావిస్తే అట్టి దిగుమతులను ఆపేసే అధికారాల్ని ఆ దేశం కలిగి వుంది. ఈ ముందుజాగ్రత్త సిద్ధాంతం అభివృద్ధి చెందిన దేశాలకు, ప్రజారోగ్యం, రాగల ఆర్థిక లాభాల మధ్య సమతుల్యత పాటించి, నిర్ణయాలను తీసుకోడానికి వీలు కలిగిస్తుంది. తద్వారా ప్రపంచంలోని జీవవైవిధ్య వనరులను వినియోగించుకోడానికి, జీవం కలిగిన జీవాల అంతర్జాతీయ మార్పిడికి వీలుకలిగిస్తుంది.
ఈ ముందుజాగ్రత్త సిద్ధాంతానికి అనుగుణంగా జన్యుమార్పిడి పంటల ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తులను జీవావరణంలో ప్రవేశపెట్టినప్పుడు రాగల దుష్ప్రరిణామాల్ని కనిపెట్టడానికి క్షుణ్ణంగా పరిశోధన చేయాలి. ఇలా ఎగుమతయ్యే ప్యాకేజీలపై జన్యుమార్పిడి ఉత్పత్తుల లేబుల్‌ని తప్పనిసరిగా వుంచాలి. ఈ నియమాలు చాలా కఠినంగా వున్నాయని జీవ సాంకేతిక పరిశ్రమ భావిస్తుంది. వీటిని అధిగమించడానికే 'గణనీయమైన సమానత్వ' ప్రాతిపదికను ముందుకు తెచ్చింది.
గణనీయమైన సమానత్వ ప్రాతిపదిక..
'గణనీయమైన సమానత్వ ప్రాతిపదిక' మామూలుగా తినే ఆహారపదార్థాలలో కూడా నష్టం కలిగించే కొన్ని పదార్థాలు సహజంగానే వుండవచ్చని భావిస్తుంది. ఇంతకాలం వీటిని తీసుకుంటున్నప్పటికీ అనారోగ్య సమస్యలు తలెత్తలేదు. అందువల్ల, జన్యుమార్పిడితో రూపొందించిన కొత్త పదార్థాలు ఇప్పటికే వినియోగంలో వున్న పదార్థాలతో ఎక్కువభాగం సారూప్యత కలిగి ఉన్నప్పుడు, అలా కంపెనీ నిర్ధారించినప్పుడు అట్టి పదార్థాల ప్రభావాలను అంచనా వేసేటప్పుడు అదనంగా రాగల దుష్ప్రభావాలనే పరిగణనలోకి తీసుకోవాలి. అంతేకానీ, జన్యుమార్పిడి ద్వారా రూపొందించిన పదార్థాల ప్రభావాలని తిరిగి పునరంచనా చేయాల్సిన అవసరం లేదని జీవ సాంకేతిక పరిశ్రమ, దాని మద్దతుదారులు వాదించారు. ఈ వాదనతో అమెరికా ప్రభుత్వంపై వత్తిడి తీసుకొచ్చి, అంగీకరింపజేశారు.
జీవ వైవిధ్యం..
జీవావరణలో జన్యుమార్పిడి పంటలు ఎన్నో మార్పుల్ని తెస్తాయి. అభద్రతను పెంచుతాయి. ముఖ్యంగా ఒకే పంటను, అదీ ఆ పంటలో ఒకటి లేక రెండు జన్యువులు మార్చిన పంటలను ప్రవేశపెట్టి, మాటిమాటికీ పండించడం ద్వారా జీవావరణంలో అస్థిరత్వం పెరుగుతుంది (గత వారం ఈ సమాచారం ఇదే పేజీలో ఇవ్వబడింది). ఇట్టి జీవావరణంలో ఏ చిన్న ఒడుదుడుకులొచ్చినా తట్టుకోలేవు. బయటి నుండి వచ్చే చీడపీడలనూ తట్టుకోలేవు. ఇలాంటి ఒత్తిళ్లను తట్టుకోగల రకాలు రూపొందినప్పుడు (పత్తిలో కాయతొలుచు పురుగు తట్టుకొనే రకం) రైతులు పంట మార్పిడి చేయకుండా అదే పంటను మాటిమాటికీ వేస్తుండడంతో జీవవైవిధ్యం హరించుకుపోతుంది. నేడు పత్తిలో మనం చూస్తున్నది అదే.
ఆరోగ్యంపై ప్రభావం...
బ్రిటిష్‌ శాస్త్రవేత్త 'మైకేల్‌ ఆంటోనియో' ప్రకారం జన్యుమార్పిడి ఆహారం నుండి మూడు, నాలుగురకాల రిస్క్‌లు తలెత్తవచ్చు.
* బయటి నుండి జన్యువును చొప్పించడం వల్ల - ఆ జన్యువు నేరుగా జీవవ్యవస్థలోకి ప్రవేశించవచ్చు. (అంతర్గత బిటి విషాహారంలో జరిగేది ఇదే)
* కొత్తగా ప్రవేశపెట్టిన జన్యు మొక్కల్లో జీవ రసాయనిక మార్పుల్ని తేవొచ్చు - కలుపు మందుల్ని తట్టుకునే రకాల్లో ఎంజైమ్‌ వ్యవస్థలు మారి, ఆరోగ్య సమస్యలను సృష్టించవచ్చు.
* కలుపుమందును తట్టుకునే జన్యుమార్పిడి పంటలతో కలుపుమందుల వినియోగం ఎన్నో రెట్లు పెరిగింది. ఇది జీవావరణంపై దుష్ప్రభావాన్ని కలిగి వుంది.
* జన్యుమార్పిడి ప్రక్రియలు స్వతహాగా మొక్కల్లోని జీవరసాయనిక మార్పుల్ని తెచ్చి, జీవాల్లో కొత్త మార్పులకి దారితీయవచ్చు (మ్యూటాజెనిక్‌ ఎఫెక్ట్స్‌)
దుష్ప్రభావాలపై అధ్యయనం..
జీవ సాంకేతిక పరిశ్రమల వారు ఎక్కువభాగం ఎలుకలకు 90 రోజులు ఆహారాన్ని పెట్టి, ఆరోగ్యభద్రతపై స్వల్పకాల అధ్యయనాలు చేశారు. ఈ ప్రయోగాల్లో ఎక్కువభాగం 30 రోజులకే పరిమితం చేయబడ్డాయి. కలుపు మందును తట్టుకునే జన్యుమార్పిడి మొక్కజొన్నలు ఎలుకలకు పెట్టినప్పుడు వాటి పెరుగుదల తగ్గిపోయింది. ఒకరకం కొవ్వు శాతం పెరిగింది. వాటి కాలేయం, మూత్రపిండాల పని దెబ్బతింది. మరో ప్రయోగంలో బిటి విషాహారాన్ని 90 రోజుల వరకూ ఎలుకలు, కుందేళ్లు, మేకలకు పెట్టారు. అలాగే ఆవులు, కోళ్లు, చేపలకు 42-45 రోజుల వరకే పెట్టారు. ఈ కొద్ది కాలంలోనే బిటి విషాహారం ఈ జంతువుల్లో ఆహారాన్ని తీసుకోవడమే తగ్గించాయి. డయేరియా వచ్చింది, నీళ్లు ఎక్కువగా తీసుకున్నాయి. ఎలుకల్లో కాలేయం, శరీర బరువు తగ్గిపోయింది.
మొత్తం మీద ఈ అధ్యయనాలన్నీ జన్యుమార్పిడి పంటల విషాహారం దుష్ప్రభావాల్ని కలిగిస్తుందని ధృవపరుస్తున్నాయి. కానీ 'గణనీయమైన సమానత్వ సిద్ధాంతం' ఆధారంగా ఈ మార్పుల్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని జీవ సాంకేతిక పరిశ్రమల వారు వాదిస్తున్నారు. ఈ మార్పులన్నీ జన్యుమార్పిడి ఉత్పత్తుల ఆరోగ్య ప్రభావాలపై దీర్ఘకాల అధ్యయన అవసరాన్ని సూచిస్తున్నాయి. మన దేశంలో దీనికి అవసరమైన ఏర్పాట్లు చేయడం లేదు.
స్వతంత్ర పరిశోధనా సంస్థలకు, విశ్వవిద్యాలయాలకు ఈ జన్యుమార్పిడి ఉత్పత్తుల ప్రభావాలపై అధ్యయనానికి అవకాశాలు దొరకడం లేదు. అయినా, వీరు చేసిన కొన్ని అధ్యయనాల్లో తేలిన విషయాలు...
ష బిటి జన్యుమార్పిడి ఆహారాన్ని మూడుతరాలుగా ఎలుకలకు పెట్టినప్పుడు కాలేయం, మూత్రపిండాల్లో జీవకణాలు చనిపోయినట్లు గుర్తించారు. తర్వాత రక్తంలో కూడా మార్పులు వచ్చాయి.
*ఎలుకల్లో ఈ ఆహారం వల్ల రోగ నిరోధక వ్యవస్థలో మార్పులు వచ్చాయి.
* సైటోకిన్‌ పనివిధానంలో మార్పు వచ్చింది.
* జీర్ణకోశాల్లో వున్న సూక్ష్మజీవుల్లో మార్పులొచ్చాయి. జన్యుమార్పిడి ఆహారం పెట్టినప్పుడు కోలిఫాం బ్యాక్టీరియా 23 శాతం అధికంగా వుంది.
* ఈ మార్పులన్నీ ఉద్దేశించకపోయినప్పటికీ వచ్చాయని, సంబంధిత పరిశోధకులు తెలిపారు
* జీవాల్లో కూడా ఇలాంటి పరిణామాలే కనిపించాయి. ముఖ్యంగా వీటిలో కాలేయం, పిత్తాశయం పనివిధానంలో మార్పులొచ్చాయి.
* జన్యుమార్పిడి పొందిన సోయా వల్ల కుందేళ్ల మూత్రపిండాలు, గుండెలోని ఎంజైమ్‌ పనివిధానంలో తేడాలొచ్చాయి.
జన్యుమార్పిడి పంటల వల్ల ఇన్ని ఆరోగ్య సమస్యలున్నప్పటికీ నిర్ధారించు కోకుండానే మన ఆహారవ్యవస్థలోకి ఈ పంట ఉత్పత్తులు వచ్చేశాయి. ముఖ్యంగా సోయా, మొక్కజొన్న, పత్తి గింజల నూనె, పత్తి చెక్కలో ప్రవేశించాయి. వీటివల్ల మరణాలు వెంటనే సంభవించకపోవచ్చు. కానీ, రాగల అనేక అనారోగ్య సమస్యల మాటేమిటి? ముఖ్యంగా ఎండోక్రైన్‌ గ్రంథులకు సంబంధించిన మధుమేహం వంటి ఆరోగ్యసమస్యల మాటేమిటి?
బిటి విషం..
బిటి విషం అనేది ఒక 'స్ఫటిక ప్రొటీన్‌'. ఇది సహజంగా భూమిలో వుండే బ్యాక్టీరియా (బాసిల్లస్‌ తురంజినిసిస్‌) లో ఉంటుంది. అయితే, వీటిలో కొన్ని రకాలు మాత్రమే విష ప్రభావం కలిగి వున్నాయి. వాటినే సస్యరక్షణ మందుగా వినియోగించారు. ప్రకృతిపరంగా, స్థానికంగా వుండే బిటి స్పటిక పదార్థం సస్యరక్షణకు ఉపయోగపడదు. కానీ, కొన్ని కీటకాల జీర్ణకోశంలో ఈ ప్రొటీన్‌ విడుదలవ్వగానే కొన్ని మార్పులొస్తాయి. ఇలా విడుదలైన ప్రొటీనే విష గుణం కలిగి వుంటుంది. ఇలా జీర్ణకోశంలో జరిగే మార్పు సీతాకోకచిలుక జాతిని నియంత్రించేలా చేస్తుంది. ఒకసారి బిటి విషం చురుగ్గా పనిచేయడం మొదలుపెట్టాక జీర్ణకోశ జీవకణాల్ని చంపుతుంది. ఇది కీటకాలు మరణించడానికి దారితీస్తుంది. అయితే, జన్యుమార్పిడి పంటల్లో బిటి విషం మొత్తం చురుగ్గా వుంటుంది. ఇది వేళ్లతో సహా మొక్క అన్ని భాగాల్లోనూ వ్యాపించి వుంటుంది. ఫలితంగా జన్యుమార్పిడి పంటల్లో వున్న బిటి విషం సస్యరక్షణ మందుగా వాడే బిటి విషం కన్నా భిన్నమైంది. క్షీరదాలలో బిటి విషం అలర్జీల్ని కలిగిస్తుంది. రోగ నిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది. బిటి టాక్సిన్‌ క్రై 1ఎబి రకం మానవ జీవకణాలని అంటిపెట్టుకుని వుంటుందని ప్రయోగ పూర్వకంగా ఇటీవల నిరూపించారు. తద్వారా ఆ కణాలు చనిపోతాయి. అయితే, బిటి టాక్సిన్‌ మోతాదు ఎక్కువగా వున్నప్పుడే ఇలా జరుగుతుంది. గర్భిణీలలో బిటి విషం రక్తప్రసరణలో కలిసి పిండాన్ని చేరినట్లు వెల్లడైంది. మానవ జీర్ణవ్యవస్థలో బిటి విష అణువులు విచ్ఛిన్నం కావనీ, కొనసాగుతాయనీ ఇవన్నీ నిర్ధారిస్తున్నాయి. ఇప్పటిదాకా జీవ సాంకేతిక పరిశ్రమల వారు ఇది విచ్ఛిన్నం అవుతుందని చెప్పారు. ఇది ప్రమాదకరమైన పరిణామం. (మైకేల్‌ ఆంటోనియో తదితరుల నుండి..)
మీకు తెలుసా..?
a జీవం కలిగిన జన్యుమార్పిడి జీవాలు అంటే పునరుజ్జీవం పొంది, పెరగగల శక్తిగలవి. జన్యుమార్పిడి జీవాలన్నీ ఈ శక్తిని కలిగి వుండాల్సిన అవరం లేదు. అంటే, అన్ని జీవం కలిగిన జన్యుమార్పిడి జీవాలు జన్యుమార్పిడి జీవాల్లో భాగం. కానీ, జన్యుమార్పిడి జీవాలన్నీ జీవం కలిగి వుండాల్సిన అవసరం లేదు.
గమనిక: ఈ పేజీపై మీ స్పందనలను
9490098903కి ఫోను చేసి తెలియజేయండి.

Wednesday 3 October 2012

'వాస్తు' శాస్త్రం కాదు.. ఎందుకని? (1)

  • అశాస్త్రీయ ఆచారాలు20
          కొద్దిరోజుల క్రితం మిత్రుడు చంద్రమౌళి మా ఇంటికి వచ్చాడు. అతనూ నాలాగే రిటైర్డ్‌ ఇంజనీర్‌. వస్తూనే నా చేతిలో ఉన్న 'గృహవాస్తు' అనే పుస్తకాన్ని చూశాడు. 'నీకు 'వాస్తు' శాస్త్రం కూడా తెలుసా?' అన్నాడు ఆశ్చర్యంతో.
'నాకు 'వాస్తు' శాస్త్రం కాదని తెలుసు' అన్నాను నవ్వుతూ.
'అదేమిటి? 'వాస్తు' శాస్త్ర గ్రంథాన్ని చదువుతూ 'వాస్తు'ను శాస్త్రం కాదంటావేమిటి?'
'అవును చంద్రమౌళీ! ఈ గ్రంథాన్నే కాదు. ఇంకా అనేక వాస్తు గ్రంథాలు చదివాను కాబట్టే 'వాస్తు'ను శాస్త్రం కాదంటున్నాను'.
'ఎలా చెప్పగలవు? కొంచెం వివరించు' అన్నాడు చంద్రమౌళి ఆసక్తిగా.
'చంద్రమౌళీ! నీకు నాలుగు రాళ్ళిస్తాను. ఆ నాలుగూ, నాలుగు కులాలకు చెందినవంటాను. అంగీకరిస్తావా?' ప్రశ్నించాను చంద్రమౌళిని.
'టెక్నాలజీలో ఒక డిగ్రీని సంపాదించి ఇంజనీరుగా అనేకేళ్లు పనిచేసిన నేను దీన్ని ఎలా అంగీకరిస్తాను? ఎదురుప్రశ్న వేశాడు చంద్రమౌళి.
'వెరీగుడ్‌. వాస్తువాదుల ప్రకారం ఈ భూమి నాలుగువర్ణాలు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలకు చెందినదిగా వర్ణించబడింది. దానిని వివరిస్తా విను. రంగు, వాసన, రుచి, ఆకారం, దానిలో పెరిగే చెట్లు, ఎత్తుపల్లాలను బట్టి భూమి ఏ వర్ణానికి చెందినదో చెప్పవచ్చట! ముందు రంగుపరీక్షను గూర్చి విను. 'వాస్తు కల్పద్రుమం'లో ఇలా ఉంది.
శ్లో|| శుక్లమృత్స్నాచ యా భూమిర్బ్రాహ్మణా సా ప్రకీర్తితా
క్షత్రియా రక్తమృత్స్నాచ హరిద్వైశ్యా ఉదాహృతా
కృష్ణా భూమిర్భవేచ్ఛూద్రా చతుర్థాపరికీర్తితా||
అనగా, గృహము నిర్మించనున్న స్థలమందలి మృత్తిక లేక మన్ను తెల్లగా ఉన్నచో 'బ్రాహ్మణ భూమి' అనియు, ఎరుపురంగుగానున్న యెడల 'క్షత్రియ భూమి' అనియు, పసుపు వర్ణముగా ఉన్న యెడల 'వైశ్య భూమి' అనియు, నలుపు వర్ణముగా ఉన్నచో 'శూద్ర భూమి' అనీ నిర్ణయించాలని ఆ శ్లోకం యొక్క అర్థం.
'ఇక వాసన పరీక్షకు సంబంధించిన మరికొన్ని అంశాలు వివరిస్తాను విను' అంటూ కొనసాగించాను.
(ఆ కొనసాగింపు వచ్చేవారం తెలుసుకుందాం..)
ఇక వాసన పరీక్ష విను. భూమి అందలి మట్టిని తీసుకొని వాసన చూచినప్పుడు ఆ వాసనను బట్టి ఆ భూమి ఏ కులానిదో చెప్పవచ్చట. 'విశ్వకర్మ ప్రకాశిక'లోని ఈ శ్లోకాన్ని విను.
శ్లో|| సుగంధా బ్రాహ్మణీ భూమిః రక్త గంధాతు క్షత్రియా |
మధుగంధా భవేద్వైశ్యా మద్యగంధాచ శూద్రిణీ ||
అంటే భూమి వాసన జాజి, మల్లె వంటి పుష్పముల సువాసన కలిగి వుంటే 'బ్రాహ్మణ భూమి' అని, రక్తము యొక్క వాసన కలిగి వుంటే 'క్షత్రియ భూమి' అని, తేనె వాసన కల్గినది 'వైశ్య భూమి' అనియు, కల్లు వాసన కల్గిన భూమి అయితే 'శూద్ర భూమి' అనియు నిర్ణయించాలట!
ఇక, రుచిని బట్టి భూమి వర్ణాన్ని నిర్ణయించడాన్ని తెలుసుకుందాం.
శ్లో|| మధురా బ్రాహ్మణీ భూమిః కషాయా క్షత్రియా మతా
ఆమ్లా ద్వైశ్యాభవేద్భూమి స్తిక్తాశూద్రా ప్రకీర్తితా|| (విశ్వకర్మ ప్రకాశిక)
'భూమియందలి మట్టి తీపిగా ఉన్నచో 'బ్రాహ్మణ భూమి' అనియు, వగరుగా ఉన్నచో 'క్షత్రియ భూమి' అనియు, పులుపుగా ఉన్నచో 'వైశ్య భూమి' అనియు, చేదుగా ఉన్న యెడల 'శూద్ర భూమి' అనియు గుర్తించవలెను' అని అర్థం.
ఇక భూమి ఆకారాన్ని బట్టి దాని వర్ణాన్ని ఎలా నిర్ణయిస్తారో చెబుతాను విను.
శ్లో|| గంభీరా బ్రాహ్మణీ భూమిః నృపాణాం తుంగమాశ్రితా
వైశ్యాసా సమ భూమిశ్చ, శూద్రిణీ వికటాస్మృతా|| (విశ్వకర్మ ప్రకాశిక)
అనగా, గృహము నిర్మించనున్న స్థలము యొక్క ఆకారము గంభీరముగా ఉన్న యెడల 'బ్రాహ్మణ భూమి' అనియు, ఎత్తుగానున్నచో 'క్షత్రియ భూమి' అనియు, ఎత్తు పల్లములు లేకుండా సమతలం ఉన్నచో 'వైశ్య భూమి' అనియు, ఎత్తు పల్లముతో ఉన్నచో 'శూద్ర భూమి' అనియు తెలుసుకోవలయును.
భూమియందు పెరిగే చెట్లను బట్టి కూడా ఆ భూమి యొక్క వర్ణాన్ని నిర్ణయించవచ్చట. ఎలాగో విను.
శ్లో|| బ్రాహ్మణీ భూః కుశోపేతా, క్షత్రియాస్యాచ్ఛరాకులా
కుశకాశాకులా వైశ్యా శూద్రా సర్వ తృణాకులా| (విశ్వకర్మ ప్రకాశిక)
అనగా భూమియందు దర్భలు పెరుగుచున్న యెడల 'బ్రాహ్మణ భూమి' అనియు, కాకి వెదురు పెరుగుచున్నచో 'క్షత్రియ భూమి' అనియు, రెల్లు పెరుగుచున్న యెడల 'వైశ్య భూమి' అనియు, వివిధ గడ్డి రకాలున్న యెడల 'శూద్ర భూమి' అనియు తెలియవలెను.
అంతేకాదు. భూమియందలి పల్లములను అనుసరించి ఆ స్థలము యొక్క వర్ణమును తెలుసుకోగలమని 'వాస్తు సర్వస్వం' చెబుతోంది. దాన్ని విను.
శ్లో|| ఉదక్‌ ప్లవా బ్రాహ్మణీ స్యా త్ప్రాక్లవా క్షత్రియామతా
అవాక్‌ ప్లవాచ వైశ్యాస్యా చ్ఛూద్రిణీ పశ్చిమప్లవా||
అంటే ఉత్తరమున పల్లముగా ఉన్న భూమి 'బ్రాహ్మణ భూమి' అనియు, తూర్పున పల్లముగా ఉన్న భూమి 'క్షత్రియ భూమి' అనియు, దక్షిణము పల్లముగా ఉన్న భూమి 'వైశ్య భూమి' అనియు; పశ్చిమము పల్లముగా ఉన్న భూమి 'శూద్ర భూమి'.
భూమి వర్ణాన్ని గూర్చి చివరగా ఇలా 'వాస్తు సర్వస్వం'లో చెప్పబడింది.
శ్లో|| బ్రాహ్మణీ సర్వసుఖదా, క్షత్రియా రాజ్యదా భవేత్‌
ధన ధాన్యకరీ వైశ్యా శూద్రాతు నిందితా స్మృతా||
అనగా 'బ్రాహ్మణ భూమి' సమస్త సుఖములను ఇస్తుంది. 'క్షత్రియ భూమి' రాజ్య ప్రసాదముగా ఉండును. 'వైశ్య భూమి' ధనధాన్యాలను ఇచ్చును. 'శూద్ర భూమి' నింద్యమైనది, అనగా ఇల్లు కట్టగూడనిది.
ఇప్పుడు చెప్పు చంద్రమౌళీ! రాళ్ళు రప్పలతో వున్న భూమికి కూడా కులాలను ఆపాదించడం, అందులోనూ భూమిలోని ఒక్కో స్థలం ఒక్కో వర్ణానికి చెందిన భూమిగా అనడం అశాస్త్రీయం కాదా? భూమి వివిధ వాసనలతోనూ, అనేకరకాలైన రుచులూ కల్గి ఉంటుందనడం శాస్త్రీయమా? అందులోనూ మంచి వాసన, తీపి రుచీ ఉంటే అది 'బ్రాహ్మణ భూమి' అట! కల్లు లేక సారావాసన, చేదు రుచీ ఉంటే 'శూద్ర భూమి' అట! ఇది శూద్రులను అవమానించడం కాదా? భూమి గంభీరంగా ఉంటే బ్రాహ్మణ భూమి అట! ఎత్తు పల్లములుగా ఉన్న భూమి శూద్రభూమి అట! భూమి గంభీరంగా ఉండటమంటే ఏమిటి? ఏ వాస్తు పండితుడైనా వివరించగలడా? నల్లటి భూమి 'శూద్ర భూమి' అని ముందు చెప్పి ''కృష్ణ వర్ణో ధమాధ¸మం'' అంటే నల్లటి భూమి చెడ్డవాటిలో చెడ్డది అని తర్వాత చెప్పబడింది. ఇది కూడా శూద్రులను అవమానించడం కాదా? అంతేకాదు, పడమర పల్లంగా ఉన్న భూమి 'శూద్ర భూమి' అనీ, అది 'అధమాథమ భూమి' అనీ, అలాంటి భూమిలో ఇల్లు కట్టుకుంటే కష్టనష్టాలు కలుగుతాయనీ చెప్పబడింది. మనదేశంలో ముంబయి, కొచ్చిన్‌, మంగళూరులాంటి పట్టణాలూ, గోవా రాష్ట్రం పశ్చిమతీర ప్రాంతంలో ఉన్నాయి. ఆ ప్రదేశాలలో భూమి పశ్చిమం పల్లంగా ఉంటోంది. మనదేశంలోని అత్యంత సంపన్నులు ఆ ప్రదేశాలలోనే ఉంటున్నారు. ఇది వాస్తు విరుద్ధమైన విషయం కాదా? అంతేకాదు. మరో ముఖ్య విషయాన్ని ''వాస్తు ప్రదీపం'' ఇలా తెలియజేస్తోంది.
శ్లో|| స్వవర్ణ గంధ సురసా ధన ధాన్య సుఖా వహా|
వ్యత్యయే వ్యత్యయ ఫల మతః కార్యం పరీక్షణం||
అనగా 'తన వర్ణమునకు సరైన వర్ణము, వాసన, రుచి గల భూమి ధనధాన్య సుఖములనిచ్చును. అట్లుగాక తన వర్ణమునకు వ్యతిరేకమైన వర్ణము, వాసన, రుచిగల భూమి నష్టమును కలుగజేయును'' అని తెలియజేస్తోంది. అంటే శూద్రులు ఏదైతే వాస్తువాదులు అధమాధమ భూమిగా ప్రత్యేకించి పేర్కొన్నారో దానిపైనే నివసించాలనీ, అలా ఉంటేనే వారికి సుఖములు కలుగుతాయనీ పేర్కొనడం అమానుషం కాదా?
'ఇలా అత్యంత అశాస్త్రీయంగా, అమానుషంగా భూమిని విభజించిన 'వాస్తు' శాస్త్రం ఎలా అవుతుంది?' అన్నాను.
చంద్రమౌళి మౌనంగా ఉండిపోయాడు.
'వాస్తు గ్రంథాలలో, ఇల్లు కట్టవలసిన భూమికి సంబంధించిన మరికొన్ని అంశాలు వివరిస్తాను విను' అంటూ కొనసాగించాను.
(మరికొన్ని అంశాలు వచ్చేవారం)
కె.ఎల్‌.కాంతారావు, జన విజ్ఞాన వేదిక.

జీవవైవిధ్య సదస్సు ప్రాధాన్యతేమిటి?



          జీవవైవిధ్య పేరిట హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు ప్రస్తుతం జరుగుతోంది కదా! దాని ఉద్దేశ్యాలు ఏమిటి? జీవవైవిధ్యం అంటే ఏమిటి? సదస్సు అవసరమేమిటి? - జి.నమ్రత, హైదరాబాద్‌
మనం ఇదే శీర్షికలో చాలాసార్లు భూమి పుట్టుపూర్వో త్తరాలు గురించి, భూమ్మీద జీవావిర్భావం గురించి కొంచెం విశదంగానే తెలుసుకున్నాం. నిర్జీవ పదార్థాల నుంచే గతితార్కిక పద్ధతిలో భూమ్మీద నాడున్న భౌతిక పరిస్థితుల ప్రోత్సాహంతో జీవపదార్థం రూపొందింది. దాదాపు 550 కోట్ల సంవత్సరాల వయస్సున్న ఈ భూమ్మీద సుమారు 400 కోట్ల సంవత్సరాల క్రితం జీవాణువు (biomolecule) ఏర్పడ్డట్టు, ఆ జీవ రసాయనిక అణువులే (biochemicals) సంధానించుకొని జీవానికి ప్రమాణమైన (unit of life) జీవకణం (biological cell) ఏర్పడింది. మూలకాలు కేవలం 100 లోపే ఆరోజుల్లో ఉన్నా అవి సమన్వయంగా పరమాణు(atomic) రూపం నుంచి అణురూపంలోకి అమరే విధాలు గణితశాస్త్రం ప్రకారం లక్షలాది విధాలుగా ఉంటుంది. ఉదాహరణకు ఇంగ్లీషు భాషలో ఉన్న అక్షరాలు 26 మాత్రమే అయినా ప్రపంచంలో ఉన్న ఆంగ్ల వాఙ్మయం మొత్తం ఆ 26 లక్షరాల జిగిబిగి కలయికల ద్వారా వచ్చిన పదాల, వాక్యాల మేలు కలయిక (వ్యాకరణ బద్ధంగా) అన్న విషయాన్ని మర్చిపోవద్దు. మరో ఉదాహరణగా పదంటే పదిగా ఉన్న అంకెల (0 నుండి 9 వరకు) తోనే అన్ని సంఖ్యలు ఏర్పడ్డాయి కదా!
ఒక లెక్క వేద్దాం. ఉదాహరణకు ప్రపంచంలో కేవలం A,L,O,P,T అనే 5 అక్షరాలే ఉన్నాయనుకుందాం.. అవి కేవలం 4 లక్షరాలకు మించి బంధం ఏర్పర్చుకోలేవని ఊహిద్దాం. అలాంటపుడు ఈ 5 అక్షరాల ద్వారా 4 అక్షరాలకు మించని పదాలు ఎన్నో తెలుసా! ఒక అక్షరం కూడా పదమే కావచ్చు కాబట్టి A,L,O,P,T = 5 పదాలు
రెండు అక్షరాలుగా ఉన్న పదాలు: AA, AL, AO, AP, AT, LA, OA, PA, TA, LL, LO, LP, LT, OL, PL, TL, OO, OP, OT, PO, TO, PP, PT, TP, TT = 25 మూడు అక్షరాలు ఉన్న పదాలు.. AAA, AAL, AAO, AAP, AAT, LAA, OAA, PAA, TAA, LLA, ALA, AOA, APA, ATA, ALL, AOO, APP, ATT, LAL.. TTT = 125 ఇక నాలుగక్షరాలు మాత్రమే ఉన్న పదాలు: AAAA, AAAA, AAAL, AAAO, AAAP, AAAT, LAAA, OAAA, PAAA, TAAA,…………. TTTT = 625
మొత్తం : 5+25+125+625 ొ 780. అంటే కేవలం 5 అక్షరాలతోనే 780 పదాలు ఏర్పడ్డా అన్ని పదాలకు అర్థంపర్థం లేకపోవచ్చును. ఉదాహరణకు ఏకాక్షర పదాలైన ఐదింటిలో కేవలం A,O లు మాత్రమే భాషలో చూస్తాము. అలాగే రెండు అక్షరాలుగా ఉన్న 25 పదాల్లో అర్థం ఉన్నవి కేవలం AT, LO, TO అనే మూడు పదాలే ఇంగ్లీషు నిఘం టువులో ఉన్నాయి. ఇదేవిధంగా మూడు అక్షరాలున్న పదా లు 125 ఉన్నా ALL, POT, TOP, OPT, PAT, TAP, LAP, TOO,TAT, LOT, PAL, వంటి కొన్నిపదాలు మాత్రమే అర్థవంతంగా ఉన్నాయి. మరి 26 అక్షరాలున్న మొత్తం ఆంగ్ల భాషలో సాధ్యముకాగల పదాల సంఖ్య కొన్నికోట్ల వరకు ఉంటాయి.
ఈ ప్రశ్నలో తలెత్తిన జీవ వైవిధ్యానికీ, ఈ ఆంగ్ల పదాలకు వున్న సంబంధమేమిటి అన్న కొత్త ప్రశ్న పాఠకులకు రాకముందే ఆ సంబంధ మేమిటో తెలుసుకుందాం. అర్థం ఉన్న పదాలే స్థిరమైన పదార్థాలనుకుందాం. ఆ అర్థవంతమైన పదాల్లో నామవాచ కాలు మాత్రమే జీవపదార్థాలనుకుందాం. అంటే భూమ్మీద అక్షరాలు అనబడే మూలక పర మాణువుల మిశ్రణం (admixture) సంభాప్యత (probabilistic) గా ఎన్నో విధాలుగా ఉన్నా ప్రకృతిలో స్థిరంగా ఉన్న పదార్థాలు అర్థవంతమైన పదాల్లాగా కొన్నే ఉంటాయి. ఇందులో ప్రత్యేక భంగిమలో ఏర్పడే జీవంగల ఆ పదాలే DNA సమ్మిళిత జీవకణాలు. అటువంటి జీవ కణాల్లో ఉన్న spellingఅస్త్రను మనం ఆయా క్రోమోజోముల్లో ఉన్న ణచీA శృంఖలంలో ఉన్న జన్యువైవిధ్యాని (gene diversity) కి సూచికగా భావిద్దాం. జీవకణంలో ఉన్న కేంద్రకం (cell nucleus లోని క్రోమోజోముల్లో ఉన్న DNA స్మృతే ఆయా జీవజాతి (species) ని నిర్దేశిస్తుంది. అంటే సుమారు 400 కోట్ల సంవత్సరాలుగా ఆ తొలిరోజుల్లో వేగవంతంగా, ఆ తర్వాత కొంత మందకొడిగా జరిగిన జీవకణవృద్ధి, జీవకణాల పరిణామం (biological cellular evolution) ద్వారా వేలాదిగా ఏకకణజీవులు రూపొందాయి. ప్రత్యేక జీవ లక్షణాలున్న పదార్థాలలో నిర్మితమైన జీవకణానికి మిగిలిన నిర్జీవ పదార్థాలకు లేని లక్షణాలు చేకూరాయి. ఏర్పడిన జాతులు ప్రకృతితో తలపడే క్రమంలో తనలో జరిగే గతి తార్కిక మార్పుల ద్వారా పలుజాతులుగా శాఖోపశాఖలుగా విస్తరించాయి. ఈ వ్యవహారాన్నే మనం 'జీవ పరిణామం (Biological Evolution) లేదా 'ప్రకృతి వరణం ద్వారా జీవపరిణామం (Organic evolution by Natural Selection)µ అంటున్నాము. ప్రకృతికి అనువుగా ఉండేవి, పోరాడగలిగేవి నిలిచాయి. మిగిలినవి ఆదిలోనే అంతరిం చాయి. ప్రకృతికి అనుగుణంగా ఉన్న అన్నివిధాల జీవ జాతులు సమిష్టిగా ఈ భూమ్మీద గత 400 సంవత్స రాలుగా పలు దశల్లో ఉన్నాయి. దీన్నే Biodiversity అంటున్నాము. ఆ క్రమంలోనే కేవలం 20 లక్షల సంవత్సరాల క్రితమే మానవజాతి (human species : Homo sapiens) అనే మనం రూపొందాము. లక్షలాది రకాల మొక్క లు, వేలాది రకాల పురుగులు, వందలాది రకాల పిట్టలు, లక్షలాది రకాల క్రిములు, వందలాది రకాల చేపలు, కోట్లాది రకాల వృక్షజాతులు, సకశేరుకాలు (vertebrates)అకశేరుకాలు (invertebrates), గుడ్లు పెట్టేవి, గుడ్లు తినేవి, ముళ్ల, తీగ చెట్లు, కలబందలు, తుమ్మెదలు, గాడిదలు, నందులు, పందులు, కందులు, మెంతులు, చింతలు, పొటాటోలు, టమేటాలు, చీమలు, దోమలు, గొల్లభామలు, తాబేళ్లు, కుందేళ్లు, మేకలు, కాకులు, జలగలు, మునగలు, శనగలు, పీతలు, కోతులు, చెరకులు, చెదపురుగులు, గవ్వలు, గువ్వలు, రొయ్యలు, పెయ్యలు, ....... ఇలాంటి అనంత జీవకోటికి ఈ అవని ఆవాసాన్ని చ్చింది. ఈ భూమ్మీద ప్రతి మొక్క, ప్రతి పురుగు, ప్రతి పక్షి, ప్రతి జంతువు మానవుడి కంటే ముందే పుట్టాయి. చెట్లు లేనిదే మనిషి లేడు. ఇతర ఏ జంతువులు మనలేవు. చెట్లు ఆహారంతోపాటు ఆక్సిజన్‌ను కూడా విడుదల చేస్తాయి. భూగోళ తాపాన్ని కల్గించే లక్షణ మున్న కార్బన్‌ డై ఆక్సైడ్‌ పరిమాణాన్ని తగ్గిస్తాయి. అలాగే రకరకాల పిట్టలు, బాక్టీరియాలు, జంతువులు మానవుడికీ వాటిలో వాటికీ ఉపకరి స్తున్నాయి. ఎంతో సౌష్టవంగా, పద్ధతి ప్రకారం నడుస్తున్న ఈ విశాల ప్రపంచంలో ఉన్న వివిధరకాల జీవజాతుల పరస్పరాధారిత మనుగడనే మనం 'జీవవైవిధ్యం' అంటున్నాము. అయితే కొందరు వ్యాపార వేత్తలు, పెద్ద పెద్ద పెట్టుబడిదారులు, బహుళజాతి సంస్థలు ప్రకృతి వనరుల్ని ఉన్నఫళాన లూటీ చేసుకుంటున్నందువల్ల అద్భుతమైన జీవవైవిధ్యానికి ప్రమాదం వాటిల్లుతోంది.
ఈ నెల ఒకటవ తేదీ నుంచి 19వ తేదీ వరకూ వివిధ ఘట్టాలుగా, దశదశలుగా హైదరాబాదులో జరుగుతున్న చర్చలే 'అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సు (International Biodiversity Summit).µ ఇది కేవలం సదుద్దేశంతోనే, ప్రజా సంక్షేమమే పరమావధిగా జరుగుతున్నట్టు భావించలేము. కొందరు చేస్తున్న గజదొంగల దోపిడీని కప్పిపుచ్చి జీవవైవిధ్యానికి ఆపద కలిగిస్తున్నది తామే కాదు అందరూనూ అని తప్పు పక్కవాడి మీదకు నెట్టే ఉద్దేశమూ లేకపోలేదు. ప్రపంచంలో ఒకప్పుడున్న జీవుల్లో సుమారు ఒక శాతం మాత్రమే నేడున్నాయంటే ఆందోళన కలగక మానదు. '2011- 2020 సంవత్సరాన్ని అంతర్జాతీయ జీవవైవిధ్య దశాబ్ధం (International Decade of Biodiversity)µ గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. జీవవైవిధ్యంలో ప్రపంచం మొత్తంలో 25 శాతం ఒక్క భారతదేశంలోనే ఉన్నట్టు పరిశోధనలు ఋజువు చేశాక అందరికళ్లు మనమీద పడ్డాయి. మన జీవజాతుల్ని, జీవసంపదను కాపాడుకోవాలి. అనవసర జన్యుమార్పిడి పద్ధతులు ఏమాత్రం అవసరం లేదని అందరం ఎలుగెత్తి చాటాలి.

అపెండిసైటిస్‌కి ఇక మందులతో చెక్‌!

                సాధారణంగా తీవ్రమైన అపెండిసైటిస్‌కి ఆపరేషన్‌ చేసి తొలగించడమే మార్గం! కానీ, తీవ్ర అపెండిసైటిస్‌తో బాధపడే వారిలో 80 శాతం మందికి సరైన యాంటీబయాటిక్‌లు వాడి సమస్యను తగ్గించవచ్చనీ, ఆపరేషన్‌ అవసరం లేకుండా నయం చేయవచ్చనీ స్వీడన్‌ పరిశోధకులు తాజాగా గుర్తించారు. అయితే, యాంటీబయాటిక్‌లు వాడటం వలన సమస్య పూర్తిగా సమసిపోదనీ వీరు భావిస్తున్నారు. భవిష్యత్తులో, మళ్ళీ అపెండిసైటిస్‌ తలెత్తే ప్రమాదం ఉందట. కానీ, ఆపరేషన్‌ను తప్పించుకునేందుకు ఇదొక మార్గమని పరిశోధకులు భావిస్తున్నారు.

- డాక్టర్‌ కాకర్లమూడి విజయ్

'యవ్వన గుళిక' దగ్గరలోనే ఉంది..!



             కండరాలు మళ్ళీ శక్తినీ, బలాన్నీ పుంజుకోవడం ఎలాగో తెలిసిన నేపథ్యంలో శాస్త్రజ్ఞులు యవ్వన గుళికను రూపొందించే దిశలో మరో ముందడుగు వేశారు. లండన్‌, హార్వార్డ్‌ యూనివర్శిటీ పరిశోధకులు కండరాలలోని మూల కణాలపై అధ్యయనం చేస్తూ వయస్సుతోబాటు కండరాలలో పునరుత్పత్తి శక్తి ఎందుకు తగ్గిపోతోంది అన్న విషయంపై పరిశోధిస్తున్నారు. వయస్సుతోబాటు మూలకణాలు కూడా క్షీణించడాన్ని వీరు గమనించారు. అందుకు కారణమైన ఒక ప్రొటీన్‌ను గుర్తించారు. ఆ ప్రొటీన్‌ని గనక నియంత్రించగలిగితే వయస్సు మళ్ళినవారిలో కండరశక్తిని పెంపొందించవచ్చని వీరి అంచనా.

నిరంతరం నిలిచే చిప్‌..!

 


          అతి తీవ్ర ఉష్ణోగ్రతలను, ఇతర వాతావరణ పరిస్థితులను తట్టుకుని, సమర్ధవంతంగా పనిచేసే చిప్‌ను జపాను కంపెనీ 'హిటాచీ' రూపొందిం చింది. ప్రస్తుతం వాడుతున్న చిప్‌లు, హార్డ్‌డిస్క్‌లు అధిక ఉష్ణోగ్రతలో, నీటిలో పాడైపోయే ప్రమాదం ఉంది. హిటాచి రూపొందించిన ఈ కొత్త వాటర్‌ప్రూఫ్‌ చిప్‌ రేడియో తరంగాలు, రసాయనాల వల్లా దెబ్బతినదట! ఇదేగాక, ఈ చిప్‌ వెయ్యి డిగ్రీల సెల్సియస్‌లో వేడిచేసినా, నిప్పుల్లో ఓ రెండుగంటలపాటు కాల్చినా కూడా పాడుకాదట! అనూహ్యంగా పెరిగి, పేరుకుపోతున్న సమాచారాన్ని నిక్షిప్తం చేయడానికీ, రానున్నతరాలకు అందించడానికీ, మనం కొత్తగా ఏమీ చేయలేదు. కొత్త చిప్‌ తరహా దుర్భేద్యమైన సమాచార నిక్షిప్తంచేసే పరికరం ఎంతైనా అవసరమే!

చంద్రుడి కన్నా కాంతిగల తోకచుక్క!



          వచ్చే సంవత్సరం అంతరిక్షంలో ఒక అద్భుతం జరగనుంది. చంద్రుడికంటే సుమారు పదిహేను రెట్ల కాంతివంతమైన తోకచుక్క (కామెట్‌) పట్టపగలే ఆకాశంలో కనిపించే అవకాశం ఉందని తెలిసింది. ఐసాన్‌ (×ూఉచీ) గా పేరు పెట్టబడిన ఈ కామెట్‌ ఉత్తరార్ధ గోళంలో రానున్న నవంబర్‌, డిసెంబర్‌ మాసాలలో దూసుకుపోనుంది. రష్యా అంతరిక్ష పరిశోధకులు కనిపెట్టిన ఈ ×ూఉచీ సూర్యుడివైపు కదులుతుందట! అది సూర్యుడికి రెండు మిలియన్‌ మైళ్ళ దూరంలో ప్రయాణిస్తుంది. ప్రస్తుతం ఆ కామెట్‌ జూపిటర్‌కి సమీపంలో ఉంది.

పిల్లల్లో సరికొత్త సమస్య..!



           ఎక్కువసేపు ఎలక్ట్రానిక్‌ పరికరాలతో కాలంగడిపే పిల్లలకు 'ఇంటర్నెట్‌ యూజ్‌ డిజార్డర్‌' అనే సరికొత్త మానసికవ్యాధి సోకే ప్రమాదం అధికంగా ఉందని ఇటీవల గుర్తించారు. ఇంటర్నెట్‌, వీడియో గేమ్స్‌ వంటివి మత్తు మందుల మాదిరిగా అలవాటయ్యే అవకాశాలూ ఉన్నాయని తెలిసింది. నిర్లిప్తత, దేనిపైనా మనసును లగం చేయలేక పోవడంతో పాటు ఆ పరికరాలను దూరం చేయడంగానీ, మానిపించడంగానీ చేసినపుడు 'విత్‌ డ్రాయల్‌' లక్షణాలు ఎక్కువగా బాధిస్తాయట! ప్రస్తుతం లభిస్తున్న అనేకానేక ఎలక్ట్రానిక్‌ పరికరాల వల్ల దీర్ఘకాలంలో దెబ్బతినేది పిల్లలే అని తేలింది. ఎస్‌ఎంఎస్‌లు, ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ నెట్‌ వర్క్‌ల వలన పెద్దల జీవితాలలోనే విపరీతాలు జరగడం చూస్తు న్నాం. ఇక పిల్లల్లో ఏకంగా మానసిక దుష్పరిణామాలు వస్తాయంటే జాగ్రత్త వహించాల్సిందే. తల్లిదండ్రులూ! మరి మీ పిల్లల్ని ఓ కంట గమనించండి..!!

జన్యుమార్పిడి పంటలు ... జీవవైవిధ్యం ....


ప్రకృతిలో సహజంగానే పరాగ సంపర్కం లేక పర్యావరణ ఒత్తిళ్ల వల్ల, జాతుల్లో అంతర్గతశక్తుల వల్ల జన్యుమార్పులు సంభవిస్తాయి. ఈ మార్పులు జాతుల వైవిధ్యానికి మూలం. ఇది సహజప్రక్రియ. దీనిని నివారించలేం. కానీ, ప్రయోగశాలల్లో జన్యుమార్పుల సాంకేతికంతో రూపొందే పంటలు అలాంటివి కావు. ఈ కొత్త సాంకేతికం భిన్నజాతుల మధ్య జన్యుమార్పిడికి వీలు కలిగిస్తుంది. ఇలా కొత్తగా ప్రవేశపెట్టే జన్యువుల ప్రభావం జీవవైవిధ్యం, పర్యావరణంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇప్పటి విజ్ఞానశాస్త్రం ఎదుర్కొంటున్న సమస్య. పూర్తిగా నియంత్రించిన వాతావరణంలో జరిగే జన్యుమార్పుల ప్రభావాల్ని గుర్తించి, నివారించవచ్చు. కానీ, నియంత్రించలేని బహిరంగ పర్యావరణ పరిస్థితుల్లో జరిగే జన్యుమార్పిడి ప్రభావాల్ని ఊహించి, నియంత్రించలేం. ఒకవిధంగా చెప్పాలంటే తుపాకీ పేలి, బులెట్‌ విడుదలయ్యేంతవరకే బులెట్‌పై నియంత్రణశక్తి మన చేతిలో ఉంటుంది. కానీ, ఒకసారి తుపాకి పేలి, బులెట్‌ విడుదలైన తర్వాత అది కలిగించే నష్టంపై మనకు ఏ నియంత్రణా వుండదూ. ఇలాంటదే 'జన్యుమార్పిడి సాంకేతికంతో రూపొందే పంట'. ఈ నేపథ్యంలో, విస్తారంగా సేద్యమవుతున్న జన్యుమార్పిడి పంటలు జీవవైవిధ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకోవాలి. లేకపోతే, రాగల దుష్ప్రభావాలను ఎదుర్కోలేం. ఈ ప్రభావాల్ని 'ప్రొఫెసర్‌ అరిబండి ప్రసాదరావు' సహకారంతో సంక్షిప్తంగా తెలుపుతూ మీ ముందుకొచ్చింది ఈ వారం 'విజ్ఞానవీచిక'.
విజ్ఞానశాస్త్రం ఎల్లప్పుడూ వాస్తవాల ఆధారంగా అనుభవాల ప్రభావంతో అభివృద్ధి చెందుతుంది తప్ప, ఎవరి ప్రచారం వల్లా కాదు. కానీ, వ్యాపార, వాణిజ్య ప్రయోజనాలు విజ్ఞానశాస్త్రాన్ని స్వాధీనం చేసుకుంటే ఇలాగే జరుగుతుందనీ చెప్పలేం. శాస్త్రజ్ఞులు కూడా నిస్వార్థంగా ఉంటారనీ చెప్పలేం. జన్యుమార్పిడి సాంకేతికాలతో రూపొందే పంటల ప్రభావాలను అంచనా వేయ డంలో ఇప్పుడు జరుగుతున్నది ఇదే. తక్షణ లాభాల్ని, వాణిజ్య ప్రయోజనాల్ని సమర్థించే శాస్త్రజ్ఞులు ఒక వర్గంగా, దీర్ఘకాల ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని పనిచేసే శాస్త్రజ్ఞులు మరో వర్గంగా విభజనకు గురయ్యారు. అన్ని వనరులపై ఆధిపత్యంగల వ్యాపార, వాణిజ్య వర్గాలను సమర్థిస్తున్న శాస్త్రజ్ఞులు (ఇటువంటి వారిని నిజమైన శాస్త్రజ్ఞులుగా భావించకూడదు) ప్రజల్ని పూర్తి వాస్తవాల్ని తెలుసుకోనీయకుండా అయోమయంలో పడేస్తున్నారు. ఇలాంటి వారిని 'శాస్త్ర వ్యాపారులు'గా భావించాలి.
జన్యు సాంకేతికాల నేటి స్థితి..
సాంప్రదాయ ప్రజననం ద్వారా కొత్త రకాల్ని రూపొందించ డానికి భిన్నజాతుల్లోని అభిలషించే గుణగణాలను కావాల్సిన పంటల్లో చొప్పించి, కొత్త వంగడాన్ని రూపొందిస్తారు. ఇది సాధ్యంకానప్పుడు జన్యుమార్పిడి సాంకేతికాల్ని ఉపయోగించి, విజాతిలో కావల్సిన గుణగణాన్ని కలిగించే జన్యువును గుర్తించి, అభివృద్ధిపర్చాల్సిన వంగడంలో జొప్పించి కొత్తరకాన్ని రూపొందిస్తారు.
ఈ రంగంలో పరిశోధనలు అత్యధికంగా ప్రైవేటు, బహుళజాతి కంపెనీల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అమెరికన్‌ బహుళజాతి కంపెనీలు మోన్‌శాంటో, కార్గిల్‌, సింజెంటా వంటి సంస్థల ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ఇవి కేవలం, తక్షణ లాభాల కోసమే పనిచేస్తున్నాయి. వచ్చే దీర్ఘకాల నష్టాల్ని పట్టించుకోవడం లేదు. ఇలాంటి కంపెనీ (బయోటెక్‌ పరిశ్రమ) లు ఈ పంటలు కలిగించే పర్యావరణం, ఇతర ప్రభావాల్ని నిర్ద్వంద్వంగా నిరూపణ చేసుకోకుండానే వీటి సేద్యాన్ని ప్రపంచం మీద రుద్దుతున్నాయి. దూరదృష్టిగల శాస్త్రజ్ఞుల పరిశోధనలకు ఎన్నో ఆటంకాల్ని కలిగిస్తున్నాయి. మనదేశంతో సహా, అన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలలో జరుగుతున్న దిదే. ఈ కంపెనీ శక్తులు ఆయా ప్రభు త్వ శాస్త్ర, సాంకేతిక విధానాలను ప్రభావితం చేస్తూ జన్యుమార్పిడి పం టల రూపకల్పన, ఇతర అంశాలపై పరిశోధనలు జరగకుండా ఆటంకపరు స్తున్నాయి. మన దేశంలో ప్రభుత్వ సం స్థల పత్తి పరిశోధనలకు ఎదురవుతు న్న ఆటంకాలే దీనికి తాజాఉదాహరణ.
చైనాలాంటి దేశాలలో జన్యు మార్పిడి సాంకేతికాల్ని వినియోగిస్తూ అధికదిగుబడి వంగడాల్ని రూపొంది స్తుండగా, మనదేశంలో కేవలం హైబ్రిడ్‌ రకాలకే ఈ సాంకేతికాలు పరిమితం చేయబడుతున్నాయి. ఫలితంగా, రైతులు తమ సొంత విత్తనం వాడుకునే స్వేచ్ఛను కోల్పోయి, కంపెనీల నుండి అధికధరలకు కొనాల్సి వస్తుంది. పైగా, విత్తనోత్పత్తిలో వినియోగిస్తున్న సాంకేతికానికి విలువకట్టే అధికారం తమకే కలదనీ, ప్రభుత్వానికి లేదనీ ఈ కంపె నీలు కోర్టులో వాదిస్తున్నాయి. ప్రభుత్వ సంస్థలు బిటి సాంకేతికంతో రూపొందిస్తున్న 'నర్సింV్‌ా, బికనేరి నర్మా' వంటి అధిక దిగుబడి వంగడాలు రైతులకందకుండా అడ్డుపడ్తు న్నాయి. కీలకస్థానంలోని కొంతమంది రాజకీయవేత్తలు, అధికారులు ఈ కంపెనీలకు సహాయపడుతున్నారు. ఈ విషయాల్ని బయో టెక్నాలజీకి సంబంధించిన పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ గుర్తించి, తీవ్రంగా విమర్శించింది. ఈ నేపథ్యంలో జీవవైవిధ్యంపై జన్యుమార్పిడి పంటలు చూపగల ప్రభావాల్ని అర్థంచేసుకోవాల్సి వుంటుంది.
జన్యుమార్పిడి పంటల స్థితి..
జన్యుమార్పిడి పంటల్ని 2011 నాటికి ప్రపంచంలో 395 మిలియన్‌ ఎకరాలలో సేద్యం చేస్తున్నారు. వీటిని 29 దేశాల్లో 17.7 మిలియన్‌ రైతులు సేద్యం చేస్తున్నారు. వీరిలో 90% మంది వనరులు పరిమితంగా గల చిన్నరైతులు.
సేద్యమవుతున్న జన్యుమార్పిడి పంటల్లో కలుపుమందును తట్టుకునే రకాలే గరిష్టంగా 78 % మేర వున్నాయి. వీటిలో కలుపు నియంత్రణకు అత్యంత శక్తివంతమైన గ్లైఫోసేట్‌ అనే మందును అధికంగా వాడుతున్నారు. ఇది పర్యావరణంపై, జీవవైవిధ్యంపై దుష్ప్రభావం చూపుతోంది. దీని తర్వాత అంతర్గతంగా విషం తయారుచేస్తున్న (బిటి) పంటలు 17-18 % మేర సేద్యమవుతున్నాయి. ఇతర అన్ని ఉపయోగాలకు కలిపి 5 % కన్నా తక్కువ విస్తీర్ణంలో సేద్యమవుతున్నాయి.
సోయాబీన్‌, పత్తి, మొక్కజొన్న, కెనోలా (నూనె ఆవగింజల) నాలుగు బిటి రకాల పంటలు ప్రధానంగా సేద్యమవుతున్నాయి. ప్రపంచ సేద్య విస్తీర్ణంలో 75 శాతం సోయాబీన్‌లో, 82 శాతం పత్తిలో, 32 శాతం మొక్కజొన్నలో, 26 శాతం కెనోలాలో బిటి రకాలు సేద్యమవుతున్నాయి.
జీవవైవిధ్యంపై ప్రభావాలు...
ఒక్కమాటలో చెప్పాలంటే జన్యుమార్పిడి పంటలు పర్యావరణం, జీవవైవిధ్యంపై దుష్ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. ప్రత్యక్ష, పరోక్ష పద్ధతుల ద్వారా జీవవైవిధ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి.
బ్రిటన్‌లో కలుపుమందుల నిరోధకశక్తిగల పంటల వల్ల పక్షుల సంఖ్య తగ్గిపోతున్నట్లు గుర్తించారు. మామూలుగా పక్షులు కలుపు మొక్కల గింజల్ని తింటాయి. జన్యుమార్పిడి రకాలైన బీట్‌రూట్‌, నూనె ఆవగింజల సేద్యంలో కలుపు మొక్కల విత్తనాల ఉత్పత్తి 80 శాతం తగ్గిపోయింది. దీంతో పక్షులకు ఆహారం దొరకక వాటి సంఖ్య తగ్గిపోయింది.
ముఖ్యంగా జన్యుపంటల పుప్పొడి పక్కనే సేద్యమవుతున్న సాంప్రదాయ పంట మొక్కలపై పడినప్పుడు జన్యు కలుషితమవుతుంది. ఇలా ఈ పుప్పొడి ఎంతదూరం విస్తరిస్తుందనేది ఆయా పంటలు, చుట్టూ వున్న వాతావరణపరిస్థితులపై ఆధారపడి వుంటుంది. ఇలా ఒకే జాతి మొక్కల్లో జరిగే మార్పును 'సమాంతర జన్యు మార్పిడి (హారిజాంటల్‌ జీన్‌ ట్రాన్సఫర్‌)'గా వ్యవహరిస్తున్నారు. ఇతర జాతులకూ ఇలా బిటి రకాల పుప్పొడి విస్తరించవచ్చు. ఇలా విస్తరించడాన్ని 'భిన్నజాతుల జన్యుమార్పిడి (వర్టికల్‌ జీన్‌ ట్రాన్సఫర్‌)' గా వ్యవహరిస్తున్నారు. ఈ జన్యుమార్పిడి ఇలా జరగవచ్చు.
* పరాయి జన్యువు (ప్రొటీన్‌ అణువు)ను బాక్టీరియా నేరుగా తీసుకోవచ్చు.
* ప్రొటీన్‌ జీర్ణకోశంలోకి వెళ్లినప్పుడు అది ఆ జీవి కణజాలాల్లోకి ప్రవేశించవచ్చు.
* అగ్రో బ్యాక్టీరియం అనే బాక్టీరియా ద్వారా కూడా ఇతర జీవాల్లోకి ఈ జన్యువు వ్యాపించవచ్చు. ఈ బాక్టీరియాను కణతుల ద్వారా గుర్తించవచ్చు. జన్యుమార్పిడి పంటల తయారీలో జన్యుమార్పిడి కోసం ఈ బాక్టీరియాను వినియోగిస్తారు. ఈ బాక్టీరియా సహజంగా కూడా పర్యావరణంలో వుంటుంది.
* వైరస్‌ల ద్వారా కూడా జీవాల మధ్య జన్యువు మారవచ్చు.
అంతర్గత విష రకాల ప్రభావం..
విషానికి ఉద్దేశించిన కీటకాల్లో నిరోధకశక్తి పెరుగుతుంది. విష ప్రభావం వల్ల ఉద్దేశించిన కీటకాల సంఖ్య తగ్గినప్పటికీ, ఇతర కీటకాలు పుంజుకుంటాయి. ఉదా: బిటి పత్తిలో కాయతొలుచు పురుగు 90 రోజుల వరకూ తగ్గినప్పటికీ, రసంపీల్చు పురుగులు, ఇతర కీటకాలు ఉధృతమవుతున్నాయి. కొత్తరకం వైరస్‌ జబ్బులు (ముడత రోగం) వస్తున్నాయి. భూమిలో వుండే సూక్ష్మజీవులు (బాక్టీరియా, ఫంజి - బూజు) కూడా ప్రభావితమవుతున్నాయి. ఫలితంగా, నేలల్లో సూక్ష్మజీవుల సమతుల్యత దెబ్బతింటుంది.
పార్లమెంటుకమిటీ నిర్ధారణ..
జన్యుమార్పిడి పంట (బిటి పత్తి) ప్రవేశం, అపుడు చేపట్టిన అతి ప్రచారం రైతుల్ని సాంప్రదాయ రకాల నుండి మళ్లించింది. ఫలితంగా ఇవి పూర్తిగా అంతరించిపోయాయి. సేద్యంలో లేవు. ఈ విత్తనాల్నీ ఎవరూ ఉత్పత్తి చేయడం లేదు. విదర్భ (మహారాష్ట్ర) పత్తి రైతుల్లో కొనసాగుతున్న దుస్థితి, ఆత్మహత్యల నేపథ్యంలో బిటి రకాల సేద్యాన్ని మానుకొని అనుకూలమైన సాంప్రదాయ అధికదిగుబడి రకాలను తిరిగి సేద్యం చేయడానికి ఎంత ప్రయత్నించినా విత్తనాలు దొరకలేదని బయో టెక్నాలజీపై పార్లమెంటు స్టాండింగ్‌ కమిటీ స్వయంగా మార్చి, 2012లో గమనించింది. ఏకపంట (బిటి పత్తి) సేద్య దుష్ఫలితాలను ఈ కమిటీ స్వయంగా నిర్ధారించింది. జీవవైవిధ్యాన్ని సురక్షితంగా జన్యు బ్యాంకుల్లో పరిరక్షిస్తున్నామన్న కేంద్ర ప్రభుత్వ వాదనను పార్లమెంటు కమిటీ తప్పుపట్టింది. ఇది ప్రభుత్వానికి పురావస్తు భాండగారం (మ్యూజియం)లో ఉంచిన సంతోషాన్ని కలిగిస్తుందని కమిటీ విమర్శించింది. మారుతున్న పర్యావరణ, వాతావరణ పరిస్థితుల్లో ప్రకృతితో సహజంగానే మరింత జీవవైవిధ్యం అవసరమని, ఇది ఆవిర్భవించడానికి జన్యుబ్యాంకులు తోడ్పడవని కమిటీ అభిప్రాయపడింది. 'నగోయా' ఒప్పందం ద్వారా పొందగలిగే ప్రయోజనాల్లో మనదేశ ప్రయోజనాలు పెద్దఎత్తున ఇమిడి వున్నందున ఎంతో సుసంపన్నమైన మన జీవ వైవిధ్యాన్ని నష్టపోకుండా కొనసాగించాలని కమిటీ నొక్కి చెప్పింది. అవసరాలకు అనుగుణంగా ఆహారోత్పత్తిని, భద్రతను సుస్థిరంగా కొనసాగించడానికి ఎన్నో ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయని, అస్థిరత్వంతో కూడిన జీవసాంకేతికాలపై ఆధారపడకూడదని కమిటీ నొక్కి చెప్పింది.
(జీవ సాంకేతికాలపై పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ రిపోర్టు నివేదిక పేరాలు 8.114 నుండి 8.118 వరకు)
బిటిలో తేడా..!
మనదేశంలో బిటి పత్తి సేద్యం ప్రారంభమైనప్పటి నుండీ ఎన్నో సమస్యలు వచ్చాయి. అయినా, బిటి సేద్యా న్ని సమర్థిస్తూ విస్తరించడానికి మోన్‌శాంటో, దాని సమర్ధకులు ''ఇప్పుడు పెరుగు తున్న వ్యవసాయోత్పత్తి అవసరాలను తీర్చుకోడానికి బిటి ('బయో టెక్నాలజీ') తప్ప మరొకటి లేదని, ఇది అనివార్యమని, ప్రతి కొత్త సాంకేతికంలో ఏదో ఒక రిస్క్‌ వుం టుందని, వాటిని ఎదుర్కొనక తప్పదని'' ప్రచారం చేస్తున్నారు. తద్వారా బిటి పత్తి లోపాల్ని కప్పిపుచ్చుతున్నారు. పైగా, బలవంతంగా అమ్మే అగ్రిసివ్‌ సేల్స్‌ మెన్‌షిప్‌ను చేపట్టారు. ఈ సందర్భంలో 'బిటి' అనే పదాన్ని 'పత్తి' పంటకు, జీవ సాంకేతిక విజ్ఞానానికి ఒకే విధంగా స్ఫురించేలా వాడుతున్నారు. ఇంగ్లీషులో అయితే బిటి పత్తికి ద్‌ీని, జీవ సాంకేతిక విజ్ఞానానికి దీుని సంక్షిప్తంగా వాడతారు. అయోమయమేమీ ఉండదు. కానీ, తెలుగులో ఈ సౌలభ్యం లేదు. బిటి పత్తి అంటే 'బాసిల్లస్‌ తురింజినిసిస్‌' బ్యాక్టీరియా జన్యువును చొప్పించిన సాంకేతికం. దీనిలో బిటి విషం అంతర్గతంగా నిరంతరం చెట్టు పెరిగే కాలంలో తయారవుతుంది. అన్ని భాగాలకూ విస్తరిస్తుంది. ఈ సాంకేతికాన్ని 'అంతర్గత విష' సాంకేతికం (ఎండో టాక్సిన్‌ టెక్నాలజీ) గా వ్యవహరిస్తే ఇబ్బంది ఉండదు. 'బయో టెక్నాలజీ' అంటే జీవుల్లో మార్పులకు సంబంధించిన సాంకేతికం. ఆధునిక జీవ సాంకేతికాల్ని జన్యు మార్పిడి సాంకేతికాలకు సూచికగా వ్యవహరిస్తున్నాం. ద్‌ీ, దీులను తెలుగులో ఒకే పదం 'బిటి'గా వాడుతూ ఉద్దేశ్య పూర్వకంగా ఎందరినో అయోమయంలో పడేస్తున్నారు. దీన్ని నివారించాలంటే ద్‌ీ పత్తిని అంతర్గత విష పంటగా చెప్పాలి.
గమనిక: ఈ పేజీపై మీ స్పందనలను
9490098903కి ఫోను చేసి తెలియజేయండి.