దర్శనీయ ప్రదేశములు

ఆహ్లాదం తిరుమల మెట్ల ప్రయాణం

   








                      తిరుమల... తెలుగువారి జీవితంలో ఓ భాగం. జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా తిరుమల తిరుపతి సందర్శించని తెలుగు వారు ఉండరు. ఎన్నిసార్లు చూసినా కొత్తగా, సరికొత్తగా ఉండే పుణ్యక్షేత్రం. నిత్య కల్యాణం, పచ్చతోరణంలా కళకళలాడుతూ కనిపించే తిరుమలకు మెట్ల దారిలో వెళితే ఆధ్యాత్మిక అనుభూతి మాత్రమే కాదు, ఆరోగ్యం, ఆహ్లాదకరం కూడా...
ఉరుకులు పరుగుల నేటి నవనాగరిక, యాంత్రిక జీవితంలో మనిషికి కాసింత ఊరటనిచ్చే వాటిలో కుటుంబ సమేతంగా జరిపే విహార, తీర్థయాత్రలు ప్రధానమైనవి. 28 సంవత్సరాల నా పాత్రికేయ జీవితంలో కుటుంబ సమేతంగా తిరుపతి నుంచి శ్రీవారి మెట్ల దారిలో కాలినడకన తిరుమల చేరడం మధురానుభవం.
ఓ శనివారం డ్యూటీ చేసి, కాచిగూడ స్టేషన్లో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ ఎక్కడంతో తిరుమల తిరుపతికి మా కుటుంబ ప్రయాణం సాగింది. ఉదయం ఆరు గంటలకు తిరుపతి చేరాల్సిన మా రైలు.. మూడు గంటలు ఆలస్యంగా గమ్యస్థానం చేరింది.
చలో... శ్రీవారిమెట్లు
తిరుపతి బస్టాండ్‌లో అలిపిరి బస్సెక్కి శ్రీవారిమెట్ల స్టాప్‌లో దిగి ఉచిత లగేజీ కౌంటర్లో సామాన్లు భద్రపరిచాం. అనంతరం శ్రీవారి మెట్లమార్గం ద్వారా తిరుమలకు మా కుటుంబ అధిరోహణ యాత్ర ప్రారంభమయ్యింది.
పచ్చటి ప్రకృతి ఒడిలో ఠీవిగా నిలబడి, రారండంటూ ఆహ్వానంతో పాటు, సవాలు విసురుతున్నట్లుగా కనిపించే శేషాద్రి కొండల్లో... ఎన్నో వ్యయప్రయాసల కోర్చి నిర్మించిన 2,350 మెట్లు ఎక్కుతూ, తిరుమల చేరడంలో ఉన్న శ్రమ, ఆనందం కలగలిసిన అనుభూతిని ఎవరికి వారు వ్యక్తిగతంగా పొందాల్సిందే తప్ప మాటల్లో వర్ణించలేం.
పొలోమంటూ పిల్లలు, పెద్దలు
నాలుగేళ్ల పిల్లల నుంచి ఆరుపదుల పెద్దల వరకూ, ఆడమగ తేడా లేకుండా మెట్లదారిలో హరితవనాల సౌందర్యం, పిల్లగాలి వీచికల ద్వారా హాయిగా తాకిన శేషాద్రి వనాల పరిమళాలను అనుభవిస్తూ, ఆస్వాదిస్తూ తిరుమల దిశగా కదిలిపోవడం ఈ ఈ దారిలో నిత్యకృత్యం. సుదూర యాత్రలు చేసే బహుదూరపు బాటసారులను గుర్తు చేసుకొంటూ... ఒక్కోమెట్టూ ఎక్కుతూ ఆపసోపాలు పడేవారు కొందరైతే, ఇదేం కష్టమైన పని కాదంటూ చెంగు చెంగున లేడిపిల్లల్లా, కోడెదూడల్లా దూసుకుపోయే వారు మరికొందరు. 'మీకు హైబీపీ ఉంటే మెట్ల దారి నడక ప్రాణంతకం' అన్న ముందస్తు హెచ్చరికను పక్కన పెట్టి, బిక్కు బిక్కుమంటూ నడిచే భక్తులు కొందరైతే, తమ శరీరాన్ని మోయటమే కష్టంగా భావించే స్థూలకాయులు సైతం మెట్ల దారిలో పాట్లు పడటం స్ఫూర్తిదాయకంగా అనిపిస్తుంది.
900 మెట్లు చేరితే...
మెట్లదారిలో 900వ మెట్టు చేరగానే మేమున్నామంటూ భక్తుల నమోదు ప్రత్యేక కౌంటర్‌ ఉద్యోగులు పలుకరిస్తారు. తొమ్మిది వందల మెట్లు ఎక్కిన ప్రతి ఒక్క యాత్రికుడి/రాలి ఫోటోతీసి శ్రీవారి ఉచిత దర్శన అనుమతి పత్రాన్ని ఇస్తారు.
అప్పటివరకూ ఆడుతూ, పాడుతూ హాయిగా సాగిన మెట్లదర్శన భక్తులకు అసలు పరీక్ష 1600 మెట్లు చేరగానే ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి ప్రారంభమయ్యే మెట్లను మోకాలి మెట్లుగా చెబుతారు. నిట్టనిలువుగా నిర్మించిన మెట్లను ఎక్కడం అంత తేలిక కాదు. నాలుగు మెట్లు ఎక్కడం, కాసేపు విశ్రాంతి, ఆ తర్వాత మరోనాలుగు మెట్లు... ఇలా భారంగా, ఓ పరీక్షలా సాగుతుంది. ప్రయాణం 2100 మెట్లు దాటిన తర్వాత మరో చెక్‌ పాయింట్‌లో యాత్రికుల ఫొటో పత్రాలను మరోసారి పరీక్షించి, టీటీడీ స్టాంపువేసి మరీ ఇస్తారు. ఇక్కడి నుంచి మిగిలిన 250 మెట్ల ప్రయాణం 'అదిగో.. అల్లదిగో శ్రీహరివాసమూ' అన్నట్లుగా... గోవింద, గోవిందా అంటూ సాగిపోతుంది. శ్రీవారి మెట్లలో ఆఖరి మెట్టుపైన ఉన్న మండపం చేరడంతో ప్రతి ఒక్కరికీ ఏదో సాధించామన్న సంతృప్తి, శ్రీవారి పాదాల చెంతకు చేరామన్న భరోసా కలుగుతాయి.
మెట్ల మార్గం ద్వారా తమ ప్రయాణం పూర్తి చేయడం ద్వారా ఫిట్‌నెస్‌ను బేరీజు వేసుకొనే యాత్రికులు చాలామందే కనిపిస్తారు. ఏడాదికి ఓ సారైనా మెట్లదారిలో తిరుమల చేరందే తమకు తృప్తి ఉండదని, గత కొద్ది సంవత్సరాలుగా ఇలా చేయడం జీవితంలో ఓ భాగం చేసుకొన్నామని చెప్పేవారూ కనిపిస్తారు.
ఎన్నో లాభాలు
తిరుపతి నుంచి బస్సులో వచ్చే యాత్రికులకంటే మెట్లదారిలో కాలి నడకన వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోంది. మెట్ల దారిలో వెళ్లిన భక్తులు 24 గంటల వ్యవధిలో శ్రీవారి దర్శనం చేసుకొనే అవకాశం ఉంటుంది. ప్రత్యేక క్యూ ద్వారా ఉచితంగా దర్శనం లభిస్తుంది. అంతేకాదు. కాలినడక భక్తులకు 25 రూపాయల ఖరీదు చేసే ఉచిత లడ్డూను సైతం అంద చేయాలని నిర్ణయించింది.
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన నిరుపేద భక్తులకు మెట్లదారి ప్రయాణం నిజంగా ఓ వరమే అని చెప్పాలి. తిరుపతి నుంచి తిరుమల చేరాలన్నా, తిరుమల నుంచి తిరుపతి రావాలన్నా ఒక్కొ యాత్రికుడు 90 రూపాయలు బస్సు చార్జీగా చెల్లించాలి. విపరీతంగా పెరిగిన చార్జీల భారం మోయలేని పేదయాత్రికుల్లో కాలినడకనే మెట్లదారిలో తిరుమల వచ్చి వెళ్లే వారి సంఖ్య రాను రాను పెరుగుతోందని టీటీడీ గణాంకాలే చెబుతున్నాయి. దీనికితోడు మెట్లదారి ప్రయాణాన్ని ప్రోత్సహించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది.
దక్షిణా... మూర్తులు... 
తిరుమల దేవస్థానం అన్నా, శ్రీవారన్నా భక్తి విశ్వాసాలున్న చాలా మందికి అంతులేని భక్తి. అయితే దేవస్థానం ఉద్యోగుల్లో కొంతమందికి మాత్రం 'దక్షిణల పైన ఉన్న భక్తి స్వామి వారిపై ఉన్నట్లు కనిపించదు. ఆకుపచ్చ చొక్కాలు, తెలుపు లుంగీలు ధరించి స్వామి వారి కల్యాణం క్యూ దగ్గర నానా హడావిడి చేస్తూ.. దగ్గరనుంచి కల్యాణం చూడండంటూ భక్తులను ప్రలోభపెట్టి, స్వామివారి సాక్షిగా దక్షిణ పేరుతో లంచాలు డిమాండ్‌ చేసే ప్రబుద్ధ ఉద్యోగులకూ కొదవలేదు.
ప్రతి చోటా మంచీ, చెడూ ఉండటం సహజమే. దానికి 'తిరుమల తిరుపతి' ఏ మాత్రం మినహాయింపు కాదు. దేశం నలుమూలల నుంచి అనునిత్యం తిరుమలకు వచ్చే వేలు, లక్షల భక్తులకు టీటీడీ చేస్తున్న సేవలు అసమానం.
తిరుమలలో 24 గంటలు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం, నిత్యాన్నదాన పథకాలను ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.
రెండున్నర గంటల మెట్ల నడక, ఎనిమిదిగంటల పాటు క్యూలో నిరీక్షణ, 80 సెకన్ల శ్రీవారి దర్శనంతో మా తిరుమల యాత్ర ముగిసింది.
తిరుమల యాత్ర ఎలాంటి అసౌకర్యమూ లేకుండా పూర్తి చేయాలంటే శుక్ర, శని, ఆదివారాలలో వెళ్లక పోవటమే మంచిది. ధనవంతులు, వీఐపీ భక్తుల సిఫారసు లేఖలున్న వారికి శ్రీవారి దర్శనం ముందుగా లభిస్తుందన్న కఠోర వాస్తవాన్ని సామాన్య భక్తులు బాగా గుర్తుంచుకొంటే మంచిది.
- చొప్పరపు కృష్ణారావు, 8498084018.









  అనంతపురం చూసొద్దాం

  












                అనంతపురం ఆసక్తి రేకెత్తించే చారిత్రక ప్రదేశాల నిలయం. పెనుకొండ, రాయదుర్గ కోట, లేపాక్షి, ధర్మవరం, అనంతపురం వంటి ప్రదేశాలు ఇక్కడ నిక్షిప్తమై ఉన్నాయి. 550 సంవత్సరాల తిమ్మమ్మ మర్రిమాను మరో ప్రధాన ఆకర్షణ. పరిమాణ రీత్యా ప్రపంచ గిన్నిస్‌ బుక్‌ రికార్డులో చేరింది.
ధర్మవరం అనంతపురానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఎన్నో ప్రాచీన కట్టడాలున్నాయి. శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర దేవాలయ శిల్ప కళానైపుణ్యం అబ్బురపరుస్తుంది. ఇందులోని స్థంభాలను మీటినప్పుడు ఏడు రకాల సంగీత స్వరాలు వినిపిస్తాయి. నిరంతరం ఎడతెగకుండా పారే జలపాతాలు కనువిందు చేస్తాయి.
ధర్మవరం నూలు పరిశ్రమ, పట్టు చీరలు ప్రపంచ ఖ్యాతి గడించాయి. తోలుబొమ్మల తయారీలో నైపుణ్యానికి పేరున్న ప్రదేశం ఇది.
పెనుకొండ : బెంగళూరు జాతీయ రహదారిపై అనంతపురానికి 70 కిలోమీటర్ల దూరంలో పెనుకొండ ఉంది. విజయనగరం సామ్రాజ్యానికి ఒకప్పుడు రాజధానిగా ఉన్న పెనుకొండ కోట, ఆ రోజుల్లో దానిమీద దాడిచేయడానికి అభేద్యమైనదిగా ఉండేది. ఈ కోటలో చూడదగ్గ రెండు సుందర ప్రదేశాలు ఉన్నాయి. ఒకటి గగన్‌ మహల్‌. ఇది రాజుల వేసవి విడిది. మరోటి బాబయ్యదర్గ. ఇది మత సామరస్యానికి ప్రతీకగా ఉంది.
కుంభకర్ణ గార్డెన్‌ : పెనుకొండకు సమీపాన ఉన్న కుంభకర్ణ గార్డెన్‌ను చూసి తీరాల్చిందే. దీన్ని 5 ఎకరాల్లో తీర్చిదిద్దారు. ఇందులో నిద్రావస్తలో ఉన్న కుంభకర్ణుని అతి పెద్ద విగ్రహం ఉంది. దీని పొడవు 142 అడుగులు, ఎత్తు 32 అడుగులు. సొరంగంలా ఉండే ఆయన పొట్టలోకి నడిచి వెళ్లొచ్చు కూడా. పలువురు రాక్షసులు నిద్రపోతున్న కుంభకర్ణుణ్ణి లేపడానికి ప్రయత్నించే దృశ్యం ఆకర్షిస్తుంది. ఇది అనంతపురానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది.
హేమవతి : ఇది దేవాలయ పట్టణం. అనంతపురానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిందుపురం దీనికి సమీప రైల్‌హెడ్‌. హేమవతి పల్లవుల రాజ్యపాలన కాలంలో దొడ్డేశ్వర స్వామి ఆలయం ప్రఖ్యాతి గాంచింది. విగ్రహానికి ఉపయోగించిన రాతిని తట్టితే లోహం నుండి వచ్చే శబ్ధం వస్తుంది.
నంది, నల్లటి బాసల్ట్‌ గ్రానైట్‌తో చేయబడింది. 8 అడుగుల పొడవు, 4 అడుగుల ఎత్తులో ఉండి ప్రవేశ ద్వారం వద్ద కూర్చుని ఉంటుంది. గర్భాలయం లోపల 6 అడుగుల ఎత్తుగల శివలింగం ఉంది. ఈ దేవాలయంలోనే సిద్ధేశ్వర స్వామి దేవాలయం, మల్లికార్జున స్వామిదేవాలయం ఉన్నాయి. లోపల మ్యూజియం కూడా ఉంది. ఇందులో అరుదైన చారిత్రక ప్రాధాన్యత గల ప్రతిమలున్నాయి. సమీపంలో గోరంట్ల దేవాలయాన్ని చూడవచ్చు.
రాయదుర్గ కోట : అనంతపురానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కోటను విజయనగర రాజులు నిర్మించారని గోడల మీది శిలా శాసనాల వల్ల తెలుస్తోంది. ఈ దేవాలయం జైన్‌ గురువులు, వారి శిష్యులు చిత్రించిన అతి చక్కటి శిల్పకళతో సమ్మోహనపరుస్తుంది.
గుత్తికోట : కర్నూలు - బెంగళూరు జాతీయ రహదారిలో అనంతపురం నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుత్తికోటకి రైలు, రోడ్డు మార్గాలు ఉన్నాయి. ఈ కోట 300 మీటర్ల ఎత్తులో కొండమీద ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లో అతి ప్రాచీన కొండకోటల్లో ఒకటి. విజయనగర రాజుల యుగంలో నిర్మించిన ఈ కోటను గుల్ల ఆకారంలో కట్టారు. ఇందులో 15 ప్రధాన ద్వారాలు ఉంటాయి. అంత ఎత్తులో నీటి వనరులు లభించడం విశేషం.
ఆలూరు : అనంతపురానికి 87 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలూరు ఎన్నో ఎత్తైన కొండలతో ఉంటుంది. ఇక్కడి జలపాతాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సుందర దృశ్యాలతో ఉన్న ఈ గ్రామం పిక్నిక్‌కు అనువైనది. రంగనాథ దేవాలయం చుట్టుపక్కల ఉన్న సుందర పరిసర ప్రాంతాలు తన్మయత్వానికి గురిచేస్తాయి. ఏటా మార్చి- ఏప్రిల్‌ నెలల్లో పౌర్ణమి రోజున రథోత్సవం గొప్పగా జరుగుతుంది.
తాడిపత్రి : అనంతపురానికి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది. చింతాల వెంకట రమణ దేవాలయం నగరం నడిబొడ్డున సమున్నతమైన గోపురంతో ఉంది. పట్టణానికి ఒక కిలోమీటరు దూరంలో పెన్నానది చూటముచ్చటగా ఉంటుంది. అక్కడే రామలింగేశ్వర స్వామి దేవాలయం ఉంది. చిన్నమార్గం ద్వారా వచ్చే నీటితో స్థిరంగా నింపిన పీఠం మీద చెక్కించిన లింగం గురించి స్థానికులు విశేషంగా చెప్పుకుంటారు.

_________________________________________________________________

అసోం


 
                  ఫూర్వకాలంలో కామరూప రాజ్యమే నేటి అసోం రాష్ట్రం. మన దేశానికి ఎక్కువ శాతం పెట్రోలియం, కిరోసిన్ అందించే రాష్ట్రం ఇదే. ఇంకా ఇక్కడ టీ , కాఫీ పంటలను అధికంగా సాగు చేస్తారు. అసోం కొండ ప్రాంతాలలోని ప్రజలు జానపద నృత్యాలు బాగా చేస్తారు. బ్రహ్మపుత్రా నది ఎక్కువ దూరం ప్రవహించే రాష్ట్రం ఇది. ఎత్తయిన పర్వతాలు అసంఖ్యాకం. ఈ రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో గౌహతి అతి ప్రాచీనమైనది. పూర్వకాలం నుంచి అనేకమంది రాజులకు రాజధానిగా ప్రఖ్యాతి చెందింది. అలనాటి కాలంలో ఈ పట్టణం పేరు జ్యోతిషపుర.
గౌహతిలో అసోం పూర్వ చరిత్రను తెలియజేసే చక్కని మ్యూజియం ఉంది. ఈ మ్యూజియంలో ప్రాచీన నాణేలు, మట్టి, లోహ పాత్రలు, అనేక పురాతన అవశేషాలు కనువిందు చేస్తాయి. గౌహతికి దగ్గరలోని నీలాచలం కొండపై కామాఖ్య దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. కామాఖ్యదేవి అస్సామీల ఆరాధ్య దేవత. బ్రహ్మపుత్రా నదికి దక్షిణవైపున ఉన్న ఈ దేవాలయాన్ని నరకాసురుడు నిర్మించాడని భక్తుల నమ్మకం. ఇప్పటికీ ఈ ఆలయంలో జంతు బలులు విరివిగా సాగుతూనే ఉంటాయి. ఇక్కడి తెల్లని పాలరాతి గోపురాలు పర్యాటకులకు ఎంతో ప్రశాంతతనిస్తాయి. అష్టాదశ శక్తిపీఠాలలో ఇది ఒకటి. ఇక్కడ ఉన్న పురాతనమైన నవగ్రహ దేవాలయం చూడతగ్గది.
               బ్రహ్మపుత్రా నదికి మధ్యలో దూరంగా ఒక దీవి కనిపిస్తుంటుంది. ఆ దీవిపై కనిపించే ఆలయంలోఉమానందుడు పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయాన్ని చేరాలంటే పడవలో ప్రయాణించాల్సిందే. మరికొంత దూరంలో గుహాటీ షహర్ అనే ప్రదేశంలో నిర్మితమైన శ్రీతారాదేవి ఆలయం కూడా అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా ప్రఖ్యాతి పొందింది. అసోం రాష్ట్ర రాజధాని నగరం డిస్పూర్. ఇది ప్రాచీనకాలం నుంచీ పేరుపొందిన వ్యాపార కేంద్రం. గౌహతి నుంచి బ్రహ్మపుత్ర నదికి ఎగువన ‘సిబసాగర్’ అనబడే యాత్రాస్థలం చూడతగ్గ ప్రదేశం. ఇక్కడి జంతు ప్రదర్శనశాల చాలా పేరుపొందింది.
_________________________________________________

ఢిల్లీ


ఇప్పటి ఢిల్లీ నగరాన్ని పాండవాగ్రజుడైన ధర్మరాజు ‘ఇంద్రప్రస్థం’ పేరిట నిర్మిం చాడని పురాణ కథనం. క్రీ.శ. 638 నుండి 691 వరకు పరిపాలించిన అనంగపాలుడు ఢిల్లీని చాలా మార్పులు చేశాడు. తర్వాత మహమ్మదీయుల కాలంలో ఢిల్లీ చాలా అభివృద్ధి చెందింది. క్రీ.శ. 1850లో బహదూర్‌షా మరణానంతరం బ్రిటీష్ పాలకులు ఢిల్లీ నగరాన్ని రాజధానిగా ప్రకటించారు. ఢిల్లీలో సందర్శించదగిన ప్రదేశాలు చాలా ఉన్నాయ. ఢిల్లీ రైల్వేస్టేషన్ నుండి చాందినీ చౌక్ వీధి గుండా వెళ్ళి లాహార్ గేట్‌కు చేరవచ్చు. లాహార్‌గేట్‌ను ఢిల్లీ గేట్ అంటారు. ఇది కోటకు ముఖద్వారం. 268 అడుగుల పొడవు, 27 అడుగుల వెడల్పుగల మార్గంలో ఇరువైపులా చట్టా చౌక్ అనే రెండంతస్తుల షాపులు ఢిల్లీ గేటు దాటగా కనిపిస్తాయి. ఆ ప్రక్కనే నౌబత్ కానా భవనం ఉంటుంది. 500 అ. పొడవు 300 అ. వెడల్పుగల దివానీ ఆమ్ అనబడే రాజభవనం ఉంటుంది. దానికి దగ్గరలోనే 630 అ. వెడల్పుగల రంగమహల్ పాలరాతి కట్టడాలతో అందంగా యమునా నది పక్కనే ఉంటుంది. దివా నీ ఖాన్ భవనం చారిత్రాత్మక మైనది. ఇక్కడే ఔరంగజేబు దారా, మురాద్‌లను చంపాడు. ఇక్కడే నాదిర్షా కోహినూర్ వజ్రాన్ని మహమ్మద్ షా నుండి కాజేశాడు. రంగమహల్‌కి దక్షిణంగా కొద్ది దూరంలో ఢిల్లీ మ్యూజియం ఉంటుంది. పురాతన వస్తువులెన్నో ఇందులో భద్రపరిచారు. 1644లో షాజహాన్ ప్రారంభించగా, 1668లో ఔరంగజేబు పూర్తి చేసిన కట్టడమే జుమ్మామసీదు.
ఢిల్లీ గేటు నుండి ఒక కి.మీ. దూరంలో యమునా నది ఒడ్డున ప్రశాంతవనంలో మహాత్మాగాంధీ సమాధి ఉంది. దీనినే రాజ్‌ఘాట్‌గా పిలుస్తారు. రాజ్‌ఘాట్‌కు దగ్గరలో నెహ్రూ స్మారక మందిరాన్ని శాంతివనంగా పిలుస్తారు. ఆ ప్రక్కనే లాల్‌బహదూర్ స్మారక సమాధిని విజయ ఘాట్‌గా పిలుస్తారు. ఢిల్లీగేటు బయటనే ఉన్న ఫిరోజ్‌కోట 1354లో ఫిరోజ్ షా తుగ్లక్‌చే నిర్మించబడింది. ఇదే ప్రఖ్యాత ఫిరోజ్‌షా కోట్లా. ఇవన్నీ పాత ఢిల్లీ విశేషాలు. ఆ తర్వాత విస్తరించిన నగరమే కొత్త ఢిల్లీ. 1900లో కన్నాట్ భారత సందర్శన సందర్భంగా 67 అడుగుల వ్యాసార్థంతో పద్మాకారంలో నిర్మించబడిన కట్టడమే కన్నాట్ ప్లేస్. 1938లో రాజాబలదేవ్ దాస్ బిర్లా ఎంతో ఖర్చుతో నిర్మించిన పాలరాతి దేవాలయమే బిర్లామందిర్. ప్రసిద్ధి చెందిన మన పార్లమెంట్ భవనం 1920లో నిర్మించారు. ఇక ప్రఖ్యాతి చెందిన రాష్టప్రతి భవనం 330 ఎకరాల స్థలంలో 340 గదులుగల పాలరాతి భవనం. ప్రపంచ ప్రసిద్ధి చెందిన భవనాలలో ఇది ఒక అందమైన భవనంగా పేరు పొందింది. 1914-18 యుద్ధాల్లో మరణించిన సైనికుల జ్ఞాపకార్థం ఇండియాగేట్ నిర్మించారు. కాగా, సుమారు 50వేల మంది కూర్చుని క్రీడలను వీక్షించగల నేషనల్ స్టేడియం ఢిల్లీ నగరం ప్రత్యేకత. ఇవేగాక ఢిల్లీలో చూడ తగ్గ ప్రసిద్ధిచెందిన ప్రాంతాలు జంతర్‌మంతర్, పాండవులకోట, జంతు ప్రదర్శనశాల, సఫ్దర్ జంగ్ సమాధి, కుతుబ్‌మినార్, అలీదర్వాజా, ఇల్‌తుత్‌మిష్ సమాధి, అలీమీర్, యోగమాయా దేవాలయం, తుగ్లక్‌కోట కాళికాలయం, నిజాముద్దీన్ సమాధి, హుమాయూన్ సమాధి, ఐనాఖాన్ సమాధి, సెంట్రల్ ఆసియా మ్యూజియం, నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, శక్తిస్థల్ మొదలైనవి ఉన్నాయి. (చిత్రం) ఎర్రకోట
__________________________________________________________

మేఘాలలో తేలిపోదామా ...

  • పచ్చని చెట్లమధ్య రాసి పోసినట్లుండే తెల్లని మేఘాలు... రోడ్డు పక్క, దూరంగా కనిపించే కొండలమీద ఉన్న చెట్లు... ఇలా ప్రకృతి మొత్తం తైలవర్ణచిత్రంలా ఉంటుందిక్కడ. ఇక వానాకాలంలో అయితే ఎటుచూసినా మేఘాల గుంపు కనిపిస్తుంది. ఆ వాతావరణం ప్రశాంతతకు చిహ్నమేమో అనిపిస్తుంది. అటువంటి మేఘాలయకు వెళ్లడమంటే మేఘాలలో తేలిపోవడమే....
మేఘాలయ భారతదేశపు ఈశాన్యప్రాంతంలో 300 కిలోమీటర్ల పొడవు, వంద కిలోమీటర్ల వెడల్పుతో పర్వతమయంగా ఉంటుంది. దీనికి ఉత్తరాన అస్సాం రాష్ట్ర సరిహద్దుగా బ్రహ్మపుత్ర నది.. దక్షిణాన షిల్లాంగ్‌ పట్టణం ఉంటుంది. ఇదే మేఘాలయ రాష్ట్ర రాజధాని కూడా...!
మేఘాలయ వాతావరణం మరీ వేడిగా, అలా అని మరీ చల్లగా ఉండదు. కానీ దేశం మొత్తంలో చూస్తే వర్షాలు మాత్రం ఈ ప్రాంతంలోనే అత్యధికం. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో 1200 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదవుతుంది. షిల్లాంగ్‌కు దక్షిణాన ఉన్న చిరపుంజి పట్టణం ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఆ దగ్గర్లోని మాసిన్రామ్‌లో కూడా అంతే.
మేఘాలయలో మూడోవంతు అటవీ ప్రాంతమే. పశ్చిమాన 'గరో' పర్వత శ్రేణులు, తూర్పున 'ఖాసి, జైంతియా' పర్వతశ్రేణులు ఉన్నాయి. కానీ ఇవి మరీ ఎత్తుగా ఉండవు. షిల్లాంగ్‌ శిఖరం అన్నింటికంటే ఎత్తైంది (1,965 మీటర్లు). పర్వతాల్లో విలక్షణమైన 'స్టేలక్టైటు, స్టేలగ్మైటు' సున్నపురాయి వుంటుంది.
వర్షాలు ప్రారంభమైన తర్వాత మేఘాలయలో పర్యాటకులు తప్పనిసరిగా వెళ్లే ప్రదేశం ఒకటుంది. అదే షిల్లాంగ్‌కు సమీపంలోని చిన్న చిన్న గుట్టలు. మధ్యలో రాళ్లు... చుట్టూ పెరిగిన పెద్దపెద్ద చెట్లు కలిగిన ప్రదేశం ఇది. వీటిని ప్రకృతి శక్తులను తృప్తిపరిచేందుకు ప్రత్యేకంగా రూపొందించారని అక్కడుండే ఖాశీ తెగకు చెందిన ఆదివాసీలు చెబుతుంటారు. షిల్లాంగ్‌ నుంచి చిరపుంజికి ప్రయాణం కనువిందు చేసే ప్రకృతి దృశ్యాలతో హాయిగా సాగిపోతుంది. దారి పొడవునా బంగ్లాదేశ్‌ మైదాన ప్రాంతాలు, సుడులు తిరుగుతూ పర్వతాలను కప్పేసే పొగమంచు, గలగలమనే చిన్న చిన్న జలపాతాలు... ఎంత చూసినా తనివి తీరదు. క్షణమైనా రెప్పవేయాలనిపించదు. అంతగా ప్రకృతి సౌందర్యం అలరిస్తుంది. చిరపుంజిలో విశ్రాంతి తీసుకునేందుకు రిసార్టులు అందుబాటులో ఉంటాయి. ఇక ట్రెక్కింగ్‌ చేయడానికి సిద్ధపడితే సహజసిద్ధంగా ఏర్పడిన వంతెనలు ఉండనే ఉన్నాయి. ఇవి ఒక్కోటి 200 సంవత్సరాల పురాతనమైనవి. అన్నీ రబ్బరు చెట్లతో సహజసిద్ధంగా ఏర్పడినట్లు చెబుతుంటారు.
బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లోని మాలినోంగ్‌ గ్రామం కూడా మేఘాలయలో చూడదగిందే. ఇది ఆసియాలోనే పరిశుభ్రమైన గ్రామంగా పేరుగాంచింది. ''మేఘాలయ టూరిజం డెవలప్‌మెంట్‌ ఫోరం'' ఈ గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చాలా శ్రమించింది. ఆ శ్రమ ఫలితమా అన్నట్లు నిజంగానే ఆ ప్రాంతం చాలా శుభ్రంగా ఉంటుంది. రంగురంగు పూలు, చెట్ల కొమ్మల మీద విశ్రాంతి గృహాలు కలిగిన మాలినోంగ్‌... మేఘాలయలో తప్పక సందర్శించాల్సిన ప్రాంతాల్లో ఒకటి. ఇక్కడ ప్రజలు కూడా ఎంతో మర్యాదగా వ్యవహరిస్తారు. అయితే వారిని ఫొటోలు మాత్రం తీయనీయరు. షిల్లాంగ్‌ బారా బజార్‌లో స్త్రీల కోసం ప్రత్యేక దుస్తులు దొరుకుతాయి. అక్కడి ఖాసీ మహిళలు వీటిని లేసులు, పూసలతో అందంగా అలంకరించి ధరిస్తారు. అందరికీ అందుబాటు ధరల్లో అంటే... 200 రూపాయల నుంచి వేల రూపాయల ఖరీదు చేసే దుస్తులు ఇక్కడ లభిస్తాయి.
డాన్‌, బోస్కో మ్యూజియం, బారా బజార్‌, షిల్లాంగ్‌ శిఖరం, ఎలిఫెంట్‌ ఫాల్స్‌, సహజ వంతెనలు... మొదలైనవి మేఘాలయలో చూడదగ్గ పర్యాటక ప్రాంతాలు. ఆహారం, విషయానికి వస్తే... చైనీస్‌, టిబెటన్‌, భారతీయ వంటకాలు లభిస్తాయి. ఇక్కడి పోలీస్‌ బజార్‌ ప్రాంతంలో చాలా హోటళ్లున్నాయి. ఈ హోటళ్లన్నింటిలోనూ లభించే 'మొమో'లను అక్కడి వారు ఇష్టంగా తింటుంటారు.
ఎలా వెళ్లాలంటే...
గౌహతి వెళ్లాక, అక్కడి నుంచి రహదారి మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. 13వందల రూపాయల అద్దెతో ట్యాక్సీలు దొరుకుతాయి. షేరింగ్‌ పద్ధతిలో అయితే మూడు వందలు అవుతుంది. ఇక షిల్లాంగ్‌లో తిరిగేందుకు కూడా ఈ షేరింగ్‌ ట్యాక్సీలే అనుకూలంగా ఉంటాయి.
సైకిలెక్కి హిమ పర్వతాల్ని చుట్టేద్దాం
ఓ వైపు కొండ.. మరోవైపు లోయలో గలగలా పారే బియాస్‌ నది పరవళ్లు, కొండచిలువలా మలుపులు తిరిగిన తారురోడ్డు, 50 నుండ 100 అడుగుల ఎత్తుదాకా పెరిగిన దేవదారు చెట్ల పరిమళం, నీరెండలో చల్లటి చలి... ఇంతటి వింత అనుభూతిని అందించే ఈ ప్రాంతంలో ఆహ్లాదం తప్ప మరేమీ కనిపిచదు. ఇది మరెక్కడో కాదు... హిమాచల్‌ ప్రదేశ్‌లోని మంచు పర్వతాల్లో...
భగభగమండే ఎండల నుంచి మంచు కొండలకు, కాంక్రీట్‌ అడవుల నుంచి కీకారణ్యానికి, రణగొణ ధ్వనుల నుంచి కిలకిలారావాల వైపుకు మహా కాలుష్యం నుంచి స్వచ్ఛమైన వాతావరణానికి, యాంత్రిక ప్రపంచానికి దూరంగా ప్రకృతి ఒడిలో హాయిగా గడపాలంటే హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లాల్సిందే!
అక్కడ బోలెడన్ని పర్యాటక ప్రాంతాలున్నప్పటికీ, నేషనల్‌ హిమాలయన్‌ మౌంటెన్‌ బైటింగ్‌ అనే కార్యక్రమంలో భాగంగా కొండల్లో సరదాగా సైకిల్‌ తొక్కుతూ వెళ్లడానికి పర్యాటకులు ఆసక్తి చూపుతారు. చల్లగా వుండే 'కులు' పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలోని ఓట్‌ అనే ప్రాంతం నుంచి ఈ యాత్ర మొదలవుతుంది. సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది ఓట్‌. ఇక్కడి నుంచి సైకిల్‌ తొక్కుకుంటూ వెళ్లాల్సిన ప్రదేశం 'జలోరీ పాస్‌'. ఇది సముద్ర మట్టానికి 10,500 అడుగుల ఎత్తులో వుంటుంది. మొదటి రోజున సైకిల్‌ తొక్కుతూ... 16 కిలోమీటర్ల దూరం వెళ్లాలి. యాత్రను ఏర్పాటు చేసిన నిర్వాహకులే సైకిల్‌ ఇస్తారు. ఇది గేర్ల సైకిల్‌. తలకు హెల్మెట్‌, మోచేతులు, మోకాళ్లకు గార్డ్స్‌, చేతులకు గ్లవ్స్‌, కళ్లకు గాగుల్స్‌ వేసుకుంటే... మనల్ని మనమే గుర్తుపట్టలేం. ఉదయం 8 గంటలకు మొదలవుతుంది ఈ పర్యటన.
'ఓట్‌' వద్ద సుమారు 3 కిలోమీటర్లు పొడవుండే సొరంగం గుండా వెళ్లాల్సి ఉంటుంది. పల్లంగా ఉండే దారిలో సర్రున దూసుకుపోతూ... ఎత్తైన చోట సైకిల్‌ దిగి దాన్ని నడుపుకుంటూ... ఒక్కో మైలురాయి కనిపించినప్పుడల్లా ఇన్ని కిలోమీటర్లు పూర్తి చేశామనే విజయగర్వంతో ముందుకు సాగిపోతుందీ ప్రయాణం.
మధ్యాహ్నానికి బియాస్‌ నది ఒడ్డుకు చేరుకోవచ్చు. నది ఒడ్డున బండరాళ్లపై కూర్చుని నీటి గలగలలు ఆస్వాదిస్తుంటే భలే వుంటుందిలే... అలసటమీద వెంట తెచ్చుకున్న భోజనాన్ని తింటుంటే ఎంత హాయిగా ఉంటుందో. సాయంత్రానికి నిర్వాహకులు ఏర్పాటు చేసిన ప్రదేశంలో బస చేయొచ్చు. నడక, సైకిల్‌ తొక్కడం పెద్దగా అలవాటులేని వారు రాత్రి భోజనాలయ్యాక ఆదమరచి నిద్రపోతుంటారు.
రెండో రోజు యాత్రలో 'జిబి' అనే ఊరు చేరుకోవాల్సి ఉంటుంది. ఇక్కడికి చేరుకోవాలంటే... మొదటిరోజు బస చేసిన ప్రదేశం నుంచి 12 కిలోమీటర్ల దూరం వెళ్లాలి. అయితే ఇది బాగా ఎత్తు ప్రదేశం... సైకిల్‌ తొక్కడం కంటే ఎక్కువసేపు నడవాల్సి ఉంటుంది. మధ్యాహ్నానికల్లా 'జిబి' చేరుకోవచ్చు. ఈ ప్రాంతం దాటి రెండు మూడు ఫర్లాంగుల దూరం అడవిలోకి వెళ్తే చూడముచ్చటైన చిన్ని జలపాతం ఆహ్వానిస్తుంది. అప్పుడే ఐస్‌ కరిగి నీరైనట్టుగా, ఈ జలపాతం నీళ్లు చాలా చల్లగా ఉంటాయి. ఈ నీళ్లలో స్నానం కాదు కదా... నీళ్లు పట్టుకోడానికే వణికిపోతాం. అంత చల్లగా ఉంటాయి.
మూడో రోజున 'షోజా' అనే ప్రాంతానికి చేరుకోవాలి. అక్కడికి వెళ్లాలంటే కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరమే. అంటే మొదటి రెండు రోజులకంటే తక్కువ దూరమే. అయినప్పటికీ ఒక్క అడుగైనా సైకిల్‌ తొక్కలేని పరిస్థితి. ఎందుకంటే నిట్టనిలువు రోడ్డు, పక్కనే పెద్ద పెద్ద లోయలు... తక్కువ బరువున్న సైకిలైనా, చాలా బరువు అనిపిస్తుంది. ఇలాంటి కొండల్లో కూడా విసిరేసినట్లుగా అక్కడక్కడ ఇళ్లు కనిపిస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఈ ఇళ్లలో ఫ్రిజ్‌ తప్ప అన్ని వసతులూ అందుబాటులో ఉంటాయి. అక్కడ ఫ్రిజ్‌ అవసరం వుండదుగా మరి.
భూమికి ఎనిమిది వేల అడుగుల ఎత్తులో ఉండే షోజాలో చలి జిల్లుమనిపిస్తుంది. వేసవిలోనే చాలా చలిగా ఉండే ఈ ప్రాంతం, చలికాలంలో అయితే అసలు ఊహించుకోడానికే వణికిపోతారు.
చివరి మజిలీ 'జలోరీ పాస్‌'. షోజా నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందది. అయితే బాగా ఎత్తుగా ఉంటుంది. సైకిల్‌ తీసుకెళ్లినా లాభం ఉండదు. అందుకే నడిచే వెళ్లాలి. అలా వెళ్తుంటే వచ్చే మలుపుల ముందు తిరుమల కొండ, శ్రీశైలం మలుపులు కూడా బలాదూరే. ఇక్కడ పొరపాటున కాలుజారి కిందపడితే ఎముకల్లో సున్నం కూడా మిగలదు. అయితే అక్కడక్కడ కొండరాళ్లపై పేరుకుపోయిన మంచును తాకుతూ నడుస్తుంటే కలిగే ఆనందం మాత్రం మాటల్లో చెప్పలేనిది.
అలా జలోరీ పాస్‌ చేరుకున్నాక... అక్కడికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండే 'శేషనాగ సరస్సు' చూడదగ్గది. ఇక్కడికి వెళ్లాలంటే మొత్తం అడవిలోనే నడవాల్సి ఉంటుంది. చిన్న సరస్సు, నల్లటి రంగులో నీళ్లు, చుట్టూ చెట్లున్నా సరస్సులో ఆకు అనేదే కనిపించకపోవడం వింతగా అనిపిస్తుంది. అయితే అది స్థానికులకు ఓ పవిత్రమైన కొలను. ఆ పక్కనే గుడి కూడా ఉంటుంది. సరస్సు అందాలు... దగ్గర్లోని మంచుకొండల సోయగాలు... చూసేందుకు రెండు కళ్లూ సరిపోవు.
పైకి ఎక్కడం కంటే... కిందికి దిగటం సులువే కాబట్టి... తిరుగు ప్రయాణానికి హాయిగా, ఆనందంగా బయలుదేరొచ్చు. అయితే ఆ ఆనందం వెనుక అపాయం పొంచే ఉంటుంది. ఎందుకంటే సైకిల్‌ బ్రేక్‌ ఏ మాత్రం ఫెయిల్‌ అయినా.. అదుపు తప్పినా అంతే సంగతులు. కాబట్టి చాలా జాగ్రత్తగా కిందికి దిగాల్సి ఉంటుంది.
చల్లటి ఐస్‌ లాంటి నీళ్లు, పర్వతాలు, కొండలు, లోయలు, సైకిల్‌ తొక్కినందుకు కాళ్ల నొప్పులు, ఆ నొప్పులతోనే ఆదమరచి నిద్ర. ఆనందం... ఆహ్లాదం... ఆ వెనకే పొంచిఉండే ప్రమాదం ... చలి, ఆ చలిలోనే చెమట... మంచు, వర్షం... ఇలాంటి అందమైన ఆహ్లాదకరమైన ప్రయాణమే ఇది.
నేషనల్‌ హిమాలరు మౌంటెన్‌ బైకింగ్‌ పేరుతో వ్యవహరించే ఈ టూర్‌ను యూత్‌ హాస్టల్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (వైహెచ్‌ఏఐ) అనే సంస్థ ఏర్పాటు చేస్తోంది. అంతేకాకుండా ఈ సంస్థ పలు ట్రెక్కింగ్‌ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆసక్తి ఉన్న పర్యాటకులు తమ పేర్లను నమోదు చేసుకుని పర్యటించొచ్చు. మరిన్ని వివరాల కోసం వైహెచ్‌ఏఐ ఇండియా డాట్‌ ఆర్గ్‌ అనే వెబ్‌సైట్‌ను చూడొచ్చు. 
_________________________________________________

మంచు దుప్పటితో స్వాగతం

అక్కడి మంచు పర్వతాల్ని చూడగానే ప్రతి ఒక్కరూ చిన్న పిల్లలై పోతారు. ఈ ప్రదేశంలో చిన్నా పెద్దా తేడా లేకుండా మంచు ముక్కలతో ఆడుకోడానికి పోటీపడతారు. అలాంటి ప్రాంతం ఏదనుకుంటున్నారా... అంతగా అందర్నీ మైమరిపించగలిగేది ఒకే ఒక్క ప్రాంతం. అదే కులు మనాలి. కులు మనాలి అంటే ఒకే ఊరు పేరు అనుకుంటారు. రెండు వేర్వేరు ఊరి పేర్లు. ఇవి హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రానికి ఓ చివర్లో ఉంటాయి. ముందుగా కులు, అక్కడ్నుండి 45 కిలోమీటర్ల దూరంలో మనాలిలు... తెల్ల మంచు దుప్పటి కప్పుకుని మరీ స్వాగతం చెబుతాయి.
సిమ్లా నుంచి మనాలి 260 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సుమారుగా తొమ్మిది గంటలసేపు ప్రయాణం చేయాలి. దేశ రాజధాని నగరం ఢిల్లీ నుండైతే మనాలికి వెళ్లే ప్యాకేజీ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఢిల్లీ నుండి 18 గంటల ప్రయాణం.
కులు, మనాలీలు పుణ్యక్షేత్రాలు కావు. ఇవి రెండూ కేవలం వేసవి విడిది కేంద్రాలు మాత్రమే. కులులో రఘునాథ్‌, మనాలీలో హిడింబి ఆలయాలు ఉంటాయి. హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రం మొత్తం హిమాలయ పర్వత శిఖరాల నడుమ నెలకొని ఉంటుంది. అందువల్ల కులు, మనాలి ఊళ్ల చుట్టూ ఎత్తైన కొండలే దర్శనమిస్తాయి.
వేసవికాలంలో కులు, మనాలిలో చాలా చల్లగా ఉంటుంది. అయితే చుట్టూ ఉన్న కొండలమీద ఒక్కటంటే ఒక్కటి కూడా పచ్చని చెట్టు ఉండదు. వర్షాకాలం తర్వాత సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో చెట్టన్నీ పచ్చగా కళకళలాడుతూ చూడముచ్చటగా ఉంటాయి. సెప్టెంబర్‌ నాటికి యాపిల్‌పంట వస్తుంది.
నవంబర్‌ నుంచి కులు, మనాలి ప్రాంతాల్లోని కొండలన్నీ మంచుతో నిండి ఉంటాయి. మనాలి నుంచి 55 కిలోమీటర్ల దూరంలో రొహతంగ్‌ కనుమ చూడదగ్గ ప్రాంతం. ఈ కనుమ దాటి వెళ్తే హిమాచల్‌లో చిట్టచివరిగా ఉండేది లాహుల్‌ జిల్లా, దాని తర్వాత లడక్‌ ప్రాంతం వస్తుంది. నవంబర్‌ నుంచి ఏప్రిల్‌ నెలల దాకా మనాలిలోని కొండలన్నీ మంచుతో నిండిపోతాయి. అక్కడ్నుండి రొహతంగ్‌ కనుమదాకా వెళ్లేందుకు వీలు లేకుండా రోడ్లన్నీ మంచుతో మూసుకుపోతాయి. కులు, మనాలిలో అసలయిన అందం నవంబర్‌ నుంచే ప్రారంభం అవుతుంది.
ముఖ్యంగా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఇక్కడ మంచుమీద జరిగే స్కైయింగ్‌ ఆటలు చాలా ఆహ్లాదంగా సాగుతాయి. కేవలం మంచులో ఆడుకోడానికే పర్యాటకులు కూడా ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అందుకే ఈ నెలల్లో కులు, మనాలి ప్రాంతాల్లోని హోటళ్లలో గదులు దొరకడం చాలా కష్టం.
ఇక్కడి గదుల అద్దె దాదాపు 800 నుంచి వెయ్యి రూపాయల వరకు ఉంటుంది. ఇవే గదులు సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో అయితే 300 నుండి 400 రూపాయల దాకా వుంటాయి. ఇక్కడ చక్కటి పచ్చళ్లు, పప్పుతో మాంచి తెలుగు భోజనం ఏర్పాటు చేసే హోటళ్లు కూడా ఉన్నాయి.
ఎడారిలో మంచు పుష్పం
ఆరావళీ పర్వత శ్రేణులలో అందమైన రాణిలా వెలిగిపోతుండే మౌంట్‌ అబూ చిరునవ్వుతో స్వాగతం పలుకుతుంది. ప్రకృతి గీచిన చిత్రాలనే కాకుండా, పరవశింపజేసే ఆలయాలను సైతం తనలో ఇముడ్చుకున్న మౌంట్‌ అబూలో రాజస్థాన్‌ హస్తకళల అందాలకూ కొదవలేదు.
నక్కి సరస్సు జల సౌందర్యం, దిల్‌ఖుష్‌ చేసే దిల్‌వారా ఆలయాలు, వశిష్ట మహర్షి ఆశ్రమం... ఇలా ఒక్కటేమిటి, ఒకసారి చూస్తే మళ్లీమళ్లీ చూడాలనిపించే అద్భుత ప్రదేశం 'మౌంట్‌ అబూ'. ఎర్రటి ఎండలనే కాదు, చల్లటి మౌంట్‌ అబూను తనలో దాచుకున్న రాజస్థాన్‌ వెళ్లేందుకు 'అయ్యో... ఎర్రటి ఎండలోనా...?'' అని గాబరా పడాల్సిన పనిలేదు. ఎంచక్కా మౌంట్‌ అబూ ఉందిగా!!
ఆరావళి పర్వత శ్రేణులలో ఉండే అబూ అనే కొండమీద ఒక చిన్న పట్టణమే 'మౌంట్‌ అబూ'. సుమారు నాలుగు వేల అడుగుల ఎత్తైన కొండమీద ఉండే పట్టణం ఇది. రాజస్థాన్‌ రాష్ట్రం దక్షిణపు అంచుల్లోనూ, గుజరాత్‌ రాష్ట్రానికి ఆనుకుని ఉంటుంది.
ఇక్కడ మనసు దోచుకునే గొప్ప విశేషం ఏంటంటే... దిల్‌వారా అనే చోట ఉండే జైన దేవాలయం. లలితకళలు, శిల్పాలు పట్ల ఆసక్తిలేని వారు కూడా దిల్‌వారాలోని ఆలయాలను చూస్తే నిశ్చేష్టులైపోతారు. అంత సుందరంగా ఉండే ఆలయాలను 12 గంటల తర్వాత మాత్రమే తెరుస్తారు. వీటిని తృప్తిగా చూడాలంటే కనీసం రెండు గంటలు పడుతుంది. ఇక్కడి '''అచలాగఢ్‌్‌'' అనే ప్రదేశంలోని ఈశ్వరుడి గుడి కూడా చాలా ప్రాశస్త్యమైంది.
'ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయం' అనేది మౌంట్‌ అబూలో చెప్పుకోదగ్గ ప్రఖ్యాత సంస్థ. ఈ పట్టణానికి బయట దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ సంస్థకు సంబంధించి మూడు ప్రదేశాలు చాలా ముఖ్యమైనవి. ఒకటి... జ్ఞాన సరోవర్‌. రెండోది... ఓం శాంతి భవనం. మూడు... శాంతి వనం.
ఈ మూడు ప్రాంతాల్లో ఎన్నో ఎకరాల విస్తీర్ణం ఉన్న ఉద్యానవనాల మధ్య, ఊహించలేనంత పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి. ఇక్కడ బ్రహ్మకుమారి సంస్థకు సంబంధించిన తాత్విక చింతన, ఆధ్యాత్మిక దృష్టికి సంబంధించిన విషయాలు మాత్రమే ఉంటాయి. ఈ భవనాల్లోని చిత్రాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఆ తర్వాత అబూ నడిబొడ్డున ఉండే రోడ్డుపైనే వీరి 'మ్యూజియం' ఉంది.
అబూ పట్టణ ప్రాంతానికి అధిదేవతగా పిలువబడే 'అధర్‌దేవి ఆలయం' కూడా చూడదగ్గది. దీనినే అద్భుదదేవి మందిరం అని కూడా అంటారు. అబూ పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో కొండ అంచునున్న ఓ చిన్న గుడి ఇది. ఒక చిన్న గుహలాంటి చోట ఉంటుంది. ఇక్కడికి చేరుకోవాలంటే, కొండ అంచునే సుమారు 200 మెట్లు ఎక్కుతూ వెళ్లాలి.
ఇక మౌంట్‌ అబూకు మూడు కిలోమీటర్ల దూరంలో కొండ అంచున ఉండే అద్భుతమైన ప్రాంతం 'హనీమూన్‌ పాయింట్‌'. ఈ కొండ ఆనుకుని నిట్టనిలువుగా కొన్ని వందల అడుగుల లోతులో ఉండే చదునైన లోయప్రాంతం ఉంటుంది. అక్కడికి దూరంగా ఒకటి రెండు చిన్న గ్రామాలుంటాయి. కొండ అంచున నిలబడి ఈ మనోహరమైన దృశ్యం చూసేందుకు అనువుగా ఇక్కడ సిమెంటుతో ప్లాట్‌ఫామ్స్‌ ఉంటాయి.
అబూ నుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరంలోని కొండమీద ఉండే 'గురు శిఖర్‌ ఆలయం' కూడా ఎంతో ప్రసిద్ధి. 5,653 అడుగుల ఎత్తులో ఉండే ఈ ఆలయ శిఖరం అబూలోని కొండ శిఖరాలన్నింటిలోకి ఎత్తైనది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల విగ్రహాలున్న ఈ ఆలయంలో గురు దత్తాత్రేయుడి పాదముద్రలు కలిగిన మరో చిన్న ఆలయం కూడా ఉంది.
మౌంట్‌ అబూ నగరానికి మధ్యలో మెయిన్‌ బజారుకు ఆనుకుని ఉండే 'నక్కి' సరస్సు గురించి ఓ కథ ప్రచారంలో ఉంది. ఒకప్పుడు దేవతలు స్వయంగా వచ్చి తమ గోళ్లతో ఈ సరస్సును తవ్వారని, అందుకనే దీనికి నక్కి సరస్సు అనే పేరు వచ్చిందని స్థానికుల చెప్తారు. 14వ శతాబ్దంలో నిర్మించబడిన రఘునాథ్‌జీ మందిరం. దాన్ని ఆనుకుని దూలేశ్వర్‌ మహదేవ ఆలయం... కూడా ఈ సరస్సును ఆనుకునే ఉంటుంది.
నక్కి సరస్సు ఒడ్డుమీద సుమారు ఒక కిలోమీటర్‌ దూరం నడిచి వెళ్లినట్టయితే.... సరస్సుకు పడమర వైపు రెండు చిన్న కొండల మధ్య కనిపించే సూర్యాస్తమయ దృశ్యం అత్యద్భుతంగా ఉంటుంది. దీన్ని చూడ్డానికి వెళ్లే దారిలోనే, ఒక చోట చిన్న గుట్టపైన రాయి మీద రాయి నిలువుగా పేర్చి ఉంటుంది. దీన్నే కప్పపిల్ల రాయి అని పిలుస్తారు.
ఇంకా మౌంట్‌ అబూలో చూడదగ్గ విశేషాల విషయానికి వస్తే... రుషికేష్‌ ఆలయం. వశిష్ట మహర్షి ఆశ్రమం. అచలేశ్వర ఆలయం... ఉన్నాయి. ముఖ్యంగా దిల్‌వారాలో ఉన్న అద్భుతమైన ఆలయాలను చూడడం ఒక అపురూపమైన అనుభూతి. మన దక్షిణ భారతీయులకు ఊటీ, కొడైకెనాల్‌ ఎలాగో... ఎడారి ప్రాంతమైన రాజస్థాన్‌ వాసులకు మౌంట్‌ అబూ వేసవి విడిదిలాంటిదని చెప్పొచ్చు.
మౌంట్‌ అబూకు చేరుకోవడం ఎలా?
అన్ని ముఖ్యమైన పట్టణాల నుంచి అబూ పట్టణానికి బస్సులున్నాయి. అబూ రోడ్‌ అనే పేరుతో ఉండే ఓ రైల్వేస్టేషన్‌ నుంచి అబూ పట్టణానికి చేరుకోవాలంటే 37 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. రైల్వే స్టేషన్‌ నుంచి బస్సులు, జీబులు, టాక్సీలు అందుబాటులో ఉంటాయి. వాటిలో వెళ్లాలంటే... బస్సు ఛార్జీ అయితే మనిషికి 7 రూపాయలు. అదే జీపులోనయితే మనిషికి 20 రూపాయలు వసూలు చేస్తారు. ఇక టాక్సీలయితే 150 రూపాయల వరకూ ఉంటుంది.
అందాల అరకు
ప్రకృతి రమణీయత చూడాలంటే అరకులోయ వెళ్లాల్సిందే. ఇక్కడికి రాష్ట్రంలోని వారే కాకుండా, దేశ విదేశాలనుండి కూడా పర్యాటకులు వస్తుంటారు.
అరకులోయ సముద్రమట్టానికి 900 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అణువణువునా ప్రకృతి రమణీయత, అద్భుత పర్వత పంక్తులు ఇక్కడ దర్శనమిస్తాయి.
విశాఖపట్నానికి ఇది 115 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒరిస్సా రాష్ట్రం సరిహద్దుకు చాలా దగ్గర్లో ఉంటుంది. నయగారాలను ఒలికించే జలపతాలు, ఆహ్లాదకరమైన వాతావరణం పర్యాటకులను మైమరపిస్తుంది. ఇక్కడ ప్రకృతి సోయగాన్ని ప్రత్యక్షంగా వీక్షించాల్సిందే గానీ వర్ణించనలవి కాదు. దాదాపు 36 కిలోమీటర్ల పరిథిలో విస్తరించి ఉన్న ఈ అందాల అరకు తప్పకుండా చూడాల్సిన ప్రాంతం.
అరకులోయకు ఘాట్‌రోడ్డు మార్గం ద్వారా వెళ్తున్నప్పుడు రోడ్డుకి రెండు వైపుల ఉన్న దట్టమైన అడవులు కనువిందు చేస్తాయి. ట్రెక్కింగ్‌కి ఇది అనువైన ప్రాంతం. భలే సరదాగా ఉంటుంది. అరకు వెళ్లే మార్గంలో మొత్తం 46 టన్నెళ్లు, బ్రిడ్జ్‌లు స్వాగతం చెబుతాయి. ఇక మధ్యమధ్యలో దర్శనమిచ్చే అనంతగిరి కొండలు కాఫీ తోటలకు ప్రసిద్ధి. అరకులోయను సందర్శించే వారు తప్పక వెళ్లాల్సిన చోటు బొర్రా గుహలు. ఇవి అరకులోయకు సుమారు 29 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.
_____________________________________________

అందాల డార్జిలింగ్‌

ప్రకృతి అందాలన్నింటినీ ఒకే చోట చూడాలంటే డార్జిలింగ్‌ వెళ్లాల్సిందే. ఇది తూర్పు హిమాలయ పర్వతాల్లోని కాంచనగంగ పర్వత శ్రేణుల్లో ఉంది. అంతే కాదు నేపాల్‌, భూటాన్‌ దేశాలకు కూడా ఇది చాలా దగ్గరగా ఉంటుంది.డార్జిలింగ్‌ అంటే పిడుగుల ప్రదేశమని అర్థమట. ఈ ప్రదేశంలో చిన్న చిన్న జలపాతాలు చాలా వుంటాయి. ఇక్కడి రైలు ప్రయాణం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
ట్రెక్కింగ్‌ వంటి సాహసాలకూ ఇది అనువైన ప్రాంతం. కొండ శిఖరాల అందాలు, ఎన్నో రమణీయ ప్రకృతి దృశ్యాలు కనువిందు చేస్తాయి. పొగమంచు, సూర్యాస్తమయం ఇట్టే ఆకట్టుకుంటాయి.
డార్జిలింగ్‌లోని దర్శనీయ స్థలాల్లో చంచల్‌ లేక్‌ ఒకటి. ఈ నది నుంచి డార్జిలింగ్‌ ప్రాంత ప్రజలకు తాగునీటిని సరఫరా చేస్తారు. ఇది 8031 అడుగుల ఎత్తున ఉంది. డార్జిలింగ్‌లోని కాళీమాత ఆలయం హిందువులకు, బౌద్ధులకు పవిత్ర పుణ్యక్షేత్రం. ఇక్కడ బౌద్ధుల గ్రంథాలయం, హిమాలయన్‌ మౌంటనీరింగ్‌ ఇనిస్టిట్యూట్‌ కూడా వున్నాయి.
డార్జిలింగ్‌ అందాలను ఆకాశమార్గంలో రోప్‌వే ప్రయాణంలో చూస్తేనే మజా వస్తుంది. ఈ మార్గంలోనే టీ తోటలను కూడా చూడొచ్చు. 14 అడుగుల బుద్ధుడి కాంస్య విగ్రహం సందర్శకులను ఆకట్టుకుంటుంది. ఇక్కడి లాయిడ్‌ బొటానికల్‌ గార్డెన్‌లో హిమాలయ పర్వత వృక్షజాతులన్నింటినీ చూడొచ్చు.
రకరకాల వన్య ప్రాణులను చూడాలంటే బెంగాల్‌ నాచురల్‌ హిస్టరీ మ్యూజియంకి వెళ్లాల్సిందే. పద్మజానాయుడు జులాజికల్‌ పార్కులో సైబీరియన్‌ టైగర్‌ స్నో లెపర్డ్‌ బ్రీడింగ్‌ సెంటర్‌ ఉంది. హస్తకళలకు ఈ ప్రాంతం ఎంతగానో ప్రసిద్ధి చెందింది.
____________________________________________

ప్రకృతి సోయగాల నెలవు

చూపు తిప్పుకోనీయని ప్రకృతి అందాలు ఖండాలా సొంతం. పచ ్చని తివాచీ పరిచినట్లుండే కొండలు, లోయలు, గలగలపారే జలపాతాలు, ఎత్తుపల్లాలతో ఉన్న ఘాట్‌రోడ్లు ఎంత చూసినా తనివి తీరదు. చిత్ర విచిత్ర వేషధారణతో, రంగురంగుల ఆయుధాలు పట్టుకుని నృత్యాలు చేసే గిరిపుత్రులను చూడ్డానికి రెండు కళ్లూ చాలవు.
భారతదేశంలోని ప్రధాన హిల్‌ స్టేషన్లలో ఖండాలా ఒకటి. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో మహారాష్ట్రకు పశ్చిమ దిశలో ఎత్తైన కొండలతో, చూపు తిప్పుకోనీయని పచ్చని ప్రకృతి సౌందర్యంతో ఈ ప్రాంతం పర్యాటకుల మనసు దోచుకుంటోంది. ముంబై మహా నగరానికి 101 కిలో మీటర్ల దూరంలో, 625 మీటర్ల ఎత్తులో వున్న ఖండాలాలో, ట్రెక్కింగ్‌ చేసేందుకు దేశ, విదేశీ పర్యాటకులు సైతం ఆసక్తి చూపిస్తుంటారు.
ఇది చూడ్డానికి చిన్నదిగా కనిపించినా చాలా అందమైన ప్రాంతం. ఖండాలా హిల్‌ స్టేషన్లో కనుచూపు మేర పచ్చని ప్రకృతి, అక్కడక్కడా జలపాతాలు మినహా మరేమీ కనిపించదు. ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామంలా కనిపించే ఈ ప్రాంతం అద్భుతంగా వుంటుంది.
ఛత్రపతి శివాజీ సామ్రాజ్యంలోని భాగమే ఖండాలా. బ్రిటీష్‌ పాలన వచ్చాక దక్కన్‌ పీఠభూమి, కొంకణ్‌ మైదానాల మధ్యలో ఉన్న రోడ్డు మార్గంలోని బోర్‌ ఘాట్‌లో భాగమయింది. బోర్‌ ఘాట్‌కు ఆ కాలంలో రోడ్డు, రైలు రవాణా సౌకర్యాలుండేవి. ముంబై, పూనేలకు రైలు మార్గం ఖండాలా ద్వారానే సాగేది.
ఖండాలాకు 5 కిలోమీటర్ల దూరంలో ''లోనావాలా'' అనే మరో ప్రఖ్యాత హిల్‌ స్టేషన్‌ కూడా చూడదగ్గది. ఖండాలా కంటే పెద్దదైన ఈ ప్రాంతంలోని ప్రకృతి సౌందర్యం ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. కళ్లు తిరిగే లోయలు ఓ వైపు, ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉన్న పర్వతాలు మరో వైపు... తుగవులి, లోనావాలా, భుషి సరస్సుల అందాలు... ఇలా లెక్కలేనన్ని ప్రకృతి సౌందర్య విశేషాలతో లోనావాలా అలరారుతుంది.
ఖండాలాకు 16 కిలోమీటర్ల దూరంలో కొలువైన కర్ణ, భజా గుహలు కూడా తప్పకుండా దర్శించాల్సిన ప్రదేశాలు. ఈ రాతి గుహల్లోని ఆలయాలు క్రీస్తుపూర్వం 2వ శతాబ్దానికి చెందినవని చరిత్రకారులు చెబుతున్నారు. బౌద్ధమతానికి చెందిన హీనయాన శాఖవారు ఈ రాతి గుహాలయాలను నిర్మించినట్లు తెలుస్తోంది. అలాగే ఇక్కడికి దగ్గర్లోని అమృతాంజన్‌ పాయింట్‌ కూడా తప్పక చూడాల్సిందే.
ప్రకృతి సోయగాలకు ఆటపట్టు
ఎత్తైన కొండ ప్రాంతాలు, లోతైన లోయలు, పచ్చిక బయళ్లతో అలరించే ప్రకృతి సోయగాలకు ఆటపట్టు నాగాలాండ్‌. భారతదేశంలో ఇంగ్లీషు అధికార భాషగా ఉన్న ఒకే ఒక్క రాష్ట్రమిది. బర్మా, టిబెట్‌ దేశాలకు చెందిన 16 జాతుల గిరిజనులు చిత్ర విచిత్ర వేషధారణలతో దర్శనమిచ్చి చూపరులను ఆశ్చర్యపరుస్తారు. చేతులకు కంకణాలు, ఛాతీకి కవచాలు, చేతిలో రంగురంగుల ఆయుధాలు పట్టుకుని తిరిగే గిరిజనులు నాగాలాండ్‌లో కోకొల్లలు.
జాతీయ రహదారిపై దిమాపూర్‌ నుంచి మూడు గంటలు ప్రయాణిస్తే నాగాలాండ్‌ రాజధాని కోహిమా చేరుకోవచ్చు. సముద్ర మట్టానికి 1,495 మీటర్ల ఎత్తులో ఉండే ఈ కోహిమాకు చారిత్రక ప్రాధాన్యం ఎంతో ఉంది. రెండో ప్రపంచ యుద్ధకాలంలో జపాన్‌ సేనలు కోహిమాను ఆక్రమించాయి. ఆ సమయంలో ప్రాణాలు పోగొట్టుకున్న అమరవీరుల స్మృత్యర్థం నిర్మించిన స్మారక కేంద్రం పర్యాటకులను కంటతడి పెట్టిస్తుంది.
చూడాల్సిన ప్రదేశాలు
నాగాలాండ్‌ వాసుల జీవన పద్ధతులు, చరిత్రనూ కళ్లకు కట్టినట్లు చూపే స్టేట్‌ మ్యూజియం చూడాల్సిన ప్రదేశాల్లో మొదటిది. చారిత్రక ప్రాధాన్యం ఉన్న విగ్రహాలు, స్థూపాలు, నగలు, తోరణాలను ఇక్కడ పొందుపరిచారు. ఒకప్పుడు పండుగ సమయాల్లో వాడిన అతిపెద్ద డ్రమ్‌ (డప్పు వాయిద్యం)ను ప్రత్యేకంగా ఒక షెడ్డులో భద్రపరిచారు. ఈశాన్య రాష్ట్రాలలో కనిపించే అరుదైన పక్షులను ఒక ప్రత్యేకమైన హాలులో చూడొచ్చు. కోహిమా సమీపాన అరదుర కొండపై ఉన్న కేథలిక్‌ చర్చిలో చెక్కతో చేసిన 'శిలువ' దర్శనమిస్తుంది. ఇది దేశంలోనే అతిపెద్ద శిలువ. ఈ చర్చి కూడా పెద్దదే.
నాగాలాండ్‌కు కోహిమా రాజధానే అయినా, దాదాపు అంతటి ప్రాధాన్యం ఉన్న మరో నగరం దిమాపూర్‌. ఇది నాగాలాండ్‌ వాణిజ్య రాజధానిగా పేరొందింది. చుట్టుపక్కల ఉన్న మణిపూర్‌, అస్సాం, అరుణాచల ప్రదేశ్‌, మేఘాలయ, త్రిపుర, మిజోరం రాష్ట్రాలకు దగ్గర. రాష్ట్రం మొత్తం మీద ఉన్న ఒకే ఒక్క విమానాశ్రయం దిమాపూర్‌లో ఉండడం మరో విశేషం. కదారి రాజుల కాలం నాటి కట్టడాలు దిమాపూర్‌లో అక్కడక్కడా కనిపిస్తాయి. ఇక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలోని రుజాఫెమా చక్కటి సందర్శనా క్షేత్రం. గిరిజనులు తయారు చేసిన రకరకాల వస్తువులు ఇక్కడ దొరుకుతాయి.
కోహిమాకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖోనోమా అనే చిన్న గ్రామం ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు. ఆహ్లాదకరమైన గ్రామం, పరిసరాలు విహారయాత్రకు అనువైన ప్రదేశాలు. పచ్చటి వరి పొలాలతో ప్రకృతి మాత నడయాడే ఖొనోమాకు టూరిస్టుల తాకిడి ఎక్కువ. ఇక్కడ సుమారు ఇరవై రకాల వరి వంగడాలు పండిస్తారంటే నమ్మశక్యం కాదు. సముద్ర మట్టానికి 2,438 మీటర్ల ఎత్తున ఉండే జుకోవాలీ ట్రెక్కింగ్‌కు అనువైన ప్రదేశం. ఇది కోహిమాకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. వెదురుపొదలతో, తెలుపు, పసుపు పచ్చ రంగుల లిల్లీ పువ్వులతో లోయంతా ఆహ్లాదకరంగా ఉంటుంది.
షాపింగ్‌
కోహిమా నగరంలో నడిబొడ్డున బస్‌స్టేషన్‌ ఎదురుగా ఉన్న సేల్స్‌ ఎంపోరియం, నాగా చేతివృత్తులకు ప్రసిద్ధి. రంగురంగుల దుప్పట్లు, బ్యాగులు, చెక్క బొమ్మలు, వెదురుబుట్టలు ఇక్కడ ఎక్కువగా అమ్ముతారు.
______________________________________________

కోల్‌కత

విభిన్న సంప్రదాయాలకు నిలయమైన చారిత్రక నగరం కోల్‌కత. ఇది పశ్చిమ బెంగాల్ ముఖ్య పట్టణం. ఇక్కడి కాళికాలయం చాలా పురాతనమైనది. 90 అడుగుల ఆలయ గోపురం శిల్పాలతో శోభిల్లుతుంటుంది. కాళీమాతను బెంగాలీలు నిష్టగా పూజిస్తారు. ఇక్కడ రవీంద్ర సరోవరం పేరిట 80 హెక్టార్లలో విశాలమైన సరస్సు ఉంది. ప్రతి సంవత్సరం ఇక్కడ బోటు పందాలు ఘనంగా జరుపుతారు. ఇక్కడి ‘ఇండియన్ మ్యూజియం’లో అశోక స్తంభాలు, సింధు నాగరికత అవశేషాలైన హరప్పా, మొహొంజదారో పట్టణ పురాతన వస్తుసముదాయాన్ని చూడవచ్చు. నగరంలోని మరో గొప్ప భవనం విక్టోరియా మెమోరియల్. ఇందులోని 24 గ్యాలరీల్లో దాదాపు 4 వేల అపురూప వస్తువులున్నాయి. నగరం మధ్యలో సువిశాల మైదానంలో చారిత్రక ప్రసిద్ధి చెందిన విలియం ఫోర్టు ఉంది. 1847లో బిషప్ విల్‌సన్ నిర్మించిన ‘సెయింట్ పాల్ కాథిడ్రల్ చర్చి’, ముస్లింలకు పవిత్రమైన నఖోడ్ మసీదు పర్యాటకులను అలరిస్తాయ. పార్క్ స్ట్రీట్‌కు ఉత్తరం వైపున దక్షిణేశ్వర దేవాలయం ఎంతో పేరుగాంచింది. ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త రామకృష్ణ పరమహంస ఈ దేవాలయంలోనే అర్చకునిగా సేవలందించారు. బొటానికల్ గార్డెన్స్, జులాజికల్ గార్డెన్స్, బిర్లా ప్లానిటోరియం, హౌరా బ్రిడ్జి, సహీద్ మినార్, బేలూరుమఠం, డైమండ్ హార్బర్లు వంటివి నగరంలో ఉన్నాయి.
_____________________________________________

1.గోల్కొండ కోట

మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశాలలో గోల్కొండ కోట ఒకటి. కుతుబ్‌ షాహి రాజుల పరిపాలనకు సాక్షీభూతంగా నిలిచిన ఈ కట్టడాన్ని చూడడం ఓ అద్భుతానుభవం. నాటి రాజుల ఆయుధాగారాలు, ధాన్యశాలలు, స్నాన శాలలు, వంటశాలలు మొదలుకొని ఆశ్వశాలలు, నూనె నిల్వ చేసే గది...ఓV్‌ా! వర్ణించడం కష్టం. ఆరోజుల్లోనే (క్రీశ1518) వేడినీటి శాలలు, చప్పట్లు కొడితే అల్లంత దూరాన వినిపించే సౌకర్యం వంటివి ఆశ్చర్యచకితులను చేస్తాయి. మరి ఆ వివరాలేంటో చూద్దామా!
గోల్కొండ కోట గోడ చాలా గట్టిగా, ఎత్తుగా, పెద్ద రాతి బండలతో కట్టినది. దీని విస్తీర్ణము దాదాపు 5మైళ్ళు. ఈ కోటకు 9 తలుపులు, 52 కిటికీలు, 48 మార్గములు వున్నాయి. ఈ కోట గోడకు లోపలి వైపున పెద్ద కందకము వుంది.
కోట ద్వారములు: కోటకు మొత్తం తొమ్మిది (తలుపులు) ద్వారాలున్నాయి. ఫతే దర్వాజ, మోతి దర్వాజ, కొత్తకోట దర్వాజ, జమాలి దర్వాజ, బంజారి దర్వాజ, పటాంచెరు దర్వాజ, మక్కా దర్వాజ డబుల్‌, బొదిలి దర్వాజ, బహిమని దర్వాజా. వీటిలో 1,2,3,4,5,7 ప్రయాణీకుల సౌకర్యార్థము తెరచి వుంటాయి. మిగిలిన వాటిని మూసివేశారు.

కోట బురుజులు: ఈ కోటకు మొత్తం 87 బురుజులున్నాయి. వీటిలో పెట్లా బురుజు, మూసా బురుజు, మజ్‌నూ బురుజు ప్రసిద్ధి గాంచినవి. పెట్లా బురుజు కోటకు ఉత్తర పడమర మూలగా వుంటుంది. దీని మీద అలంగిరీ జయమునుకు గుర్తుగా ఫిరంగి అమర్చబడి ఉంది. ఇది 16 అడుగులు పొడవు ఉంటుంది. ఒక మణుగు (165 పౌండ్ల బరువు గల) ఫిరంగి గుళ్ళు ఉంచే వీలుంది. ఇది చూడ్డానికి చాలా అందంగా వుంటుంది. కోటకు దక్షిణముగా మూసా బురుజు ఉంది. 1666 సంవత్సరములో (1977 హిజ్రి) కమాండర్‌ మూసా ఖాన్‌ ఆధిపత్యములో ధర్మాచారి అనే మేస్త్రీ దీన్ని నిర్మించాడు. దీని మీదుగా ''మీరాన్‌'' అను ప్రసిద్ధిగాంచిన సైన్యాధిపతి హతుడౌతాడు. అతని స్థానంలో''మూసా ఖాన్‌'' నియమితుడవుతాడు. బురుజు మీద ఫిరంగి అమర్చి వుంటుంది. ఇది కూడా పెట్లా బురుజు ఫిరంగి మాదిరిగా దాడిచేయడానికి వీలుగా ఉంటుంది.
కఠోరా హౌస్‌: ఇది కోటలోని 'బాలాహిసార్‌' కు ఉత్తర దిశగా నిర్మితమై ఉన్నది. ఇది 200 గజముల పొడవు, అదే వెడల్పులో, 5 గజముల లోతుగా నిర్మించిన నీటిని నిలువచేసే స్థలం. దీనిని ఒక చెరువు నుండి వచ్చే నీటితో నింపేవారు. దీనికి పడమర దిశలో ఉన్న గేటు దగ్గర శబ్దం చేస్తే అది అన్ని వైపులకు ప్రతిధ్వనిస్తుంది. ఈ నీటి హౌస్‌ను రాజులు, మరి కొందరు ప్రముఖులు వినోద స్థలముగా ఉపయోగించేవారు.
ఆయిల్‌ స్టోర్‌ హౌస్‌: ఇది నూనె దాచి ఉంచే కట్టడం. ఇది 30 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పు, 10 అడుగుల లోతున ఒకే రాతితో మలచబడినది. దీనిలో 12,000 గ్యాలన్ల నూనె నిల్వచేసి, సప్లయి చేసేవారు.
ధాన్‌ కోట లేక గోడౌన్‌: ఇది ఆహార ధాన్యములను దాచి ఉంచే స్థలము. దీనిని యుద్ధ సమయములలో బయటి రాజ్యముల నుండి తెప్పించి నిలువ చేసేవారు.
జమా-ఎ-మసీద్‌: ఈ ప్రార్థనా మందిరము కోటలోని బాలాహిసార్‌ ద్వారమునకు ఎదురుగా తూర్పు దిశగా ఉంది. దీనిని ఒకటవ సుల్తాన్‌ కులీ కుతుబ్‌ షా కట్టించాడు. దీని ద్వారము మీద చరిత్ర ప్రసిద్ధిగాంచిన అరబిక్‌ భాషలో రాసిన చెక్కడము వుంది.

బాలాహిసార్‌: ఇది 15 మైళ్ళ విస్తీర్ణముతో కొండల మీద నిర్మించపబడినది. ఇక్కడ చాలా కట్టడములున్నాయి. వాటిలో కుతుబ్‌షా భవనములు, దర్బార్‌ ఎ-ఆల్‌ అనే జనరల్‌ అసెంబ్లీ హాల్‌ (విధాన సభ), దర్బార్‌ -ఎ-ఖాన్‌ అనే ముఖ్యమైన విధాన మండపములున్నాయి. ఇంకా నూతులు, మందుగుండు సామాను దాచి ఉంచు గది, ఆయుధ కర్మాగారం, మసీదులు, దేవాలయాలు, భక్త రామదాసును బంధించిన జైలు, నీటి రిజర్వాయరు, పెద్ద తోట, స్నాన గదులు, తుపాకులు, మందు గుండు సామాను దాచి ఉంచు గది, కుడివైపు దర్బార్‌-ఎ-ఆమ్‌ అనే అసెంబ్లీ హాలుకు పోవుటకు మార్గము... ఎడమవైపు రాజభవనము నిర్మింపబడినది.
కర్టెయిన్‌ వాల్‌: యుద్ధ సమయములలో శత్రువుల పోకడలను గమనించుటకు వీలుగా బాలాహిసార్‌ ద్వారముల కెదురుగా నిర్మింపబడిన తెరవంటి గోడ. బాలాహిసార్‌ గేటుకు వెలుపలి భాగములో ఒక రంధ్రము ఉంటుంది. యుద్ధ సమయములో శత్రువు గేటు ద్వారా ఏనుగులతో తోయించే సమయంలో దీని నుండి కాగుతున్న నూనెను కాని, కరిగిన లోహమునుకాని పోసేవారు.వైబ్రేషన్‌: బాలాహిసార్‌ గేటు మధ్యభాగంలో మెట్లకు ఎదురుగా నిల్చొని చప్పట్లు కొడితే... తిరిగి బాలాహిసార్‌ ఎత్తయిన భాగము నుండి మారుమోగుతుంది.
కుతుబ్‌షా రాజుల స్నానము: బాలాహిసార్‌ గేటు నుండి లోనికి ప్రవేశించేటపుడు కుడి చేతి వైపు ఈ స్నానముల గది వుంది. కొంచెము నగీనా తోటకు కుడి చేతి వైపు పక్కన వేడి నీళ్ళు... చన్నీళ్ళు వచ్చేలా నేల మార్గమున గొట్టములను అమర్చి కట్టినది. ఈ కుళాయిలను చెరువు నుండి నింపేవారు. ఈ నీటిని అతి ముఖ్యమైన సందర్భములలో ఉపయోగించేవారు. ఎవరయినా రాజ వంశస్తులు దివంగతులైనపుడు ఇక్కడ వేడి నీటితో స్నానము చేయించి శవపేటికను ఉత్తరపు ద్వారము నుండి బయటకు తీసుకెళ్లేవారు.
నగీనా బాగ్‌: తోటకు దక్షిణముగా ఆర్కులలో రాజకుమారులు, రాజకుమార్తెలు ఊగేందుకు ఊయలలు అమర్చబడి ఉన్నవి. ఇప్పటికీ వాటి గుర్తుగా ఆర్కులోని రాళ్ళలో రంధ్రములు కన్పిస్తాయి. నగీనా గార్డెన్‌ నుండి వెళ్ళే సన్నని మార్గంలో ఎడమ చేతివైపు ఒక కట్టడము వుంది. ఇది రక్షకభటుల కోసం నిర్మించిన భవనము. కుతుబ్‌షా వంశపు రాజులలో ఏడవవాడు, ఆఖరివాడు అయిన అబ్దుల్‌ హసన్‌ తానీషా పరిపాలనలో, రక్షక భటులకోసం కట్టబడిన భవన మార్గములోనే ఆయన మంత్రివర్యులైన అక్కన్న మాదన్నల కోసం నిర్మించిన కార్యాలయ భవనం వుంది.
బడీ బౌలి: బాలాహిసార్‌ మెట్లకు కుడిపక్కగా ఒక పెద్ద బావి వుంది. దీనిని బడీ బౌలి అని పిలిచేవారు. ఈ బావిలో ఒక మూల రాయి వుంది. అది వేసవి కాలములో నీరు కిందపడడానికి ఉపయోగపడేది. ఈ బావికి దగ్గరలో రెండు వరండాలున్న ఒక భవనముంది. దీనిలో రాజులు కూర్చొని ప్రకృతి సౌందర్యమును తిలకించేవారు.
డ్రగ్‌ ట్యాంక్‌ కాలువ: బడి బౌలికి కొద్ది దూరంలో మెట్లకిందుగా పారే ఒక కాలువ వుండేది. ఇది డ్రగ్‌ చెరువు కోటకు 5 మైళ్ళ దూరంలో వుంది. కోటలో ఉన్న తోటలకు, చేలకు ఈ కాలువ ద్వారానే నీరును మళ్ళించేవారు, పంటలు పండించేవారు. భక్త రామదాసు చెరసాల: మనము ఈనాడు వింటున్న రామదాసే ఆనాటి కంచర్ల గోపన్న. 1674వ సంవత్సరములో అబుల్‌ హసన్‌ తానీషా ''గోల్కొండను పరిపాలించే కాలములో'' భద్రాచలము తాలూకాకు తహశీల్దారుగా ఉండేవాడు. ఈయన మంత్రివర్యులైన మాదన్నకు మేనల్లుడు. ఈయన భద్రాచలం రామచంద్రునికి దేవాలయాన్ని కట్టించాడు. ఈయన జైలు శిక్షసమయములో ఆయన స్వహస్తములతో ''హనుమంతుని విగ్రహములను, నవగ్రహములను'' తయారుచేశాడు. పై రాతి మీద రామలక్ష్మణులను కూడా తయారుచేశాడు. ఇది ఆయనకు చెరసాలలో పూజా మందిరం. శ్రీరామనవమి సందర్భంగా ఇప్పటికీ భద్రాచలం వచ్చిన యాత్రికులు శ్రీరామదాసు జైలును చూడ్డానికి గోల్కొండ కోటకు వస్తుంటారు.
ఇబ్రహీం కుతుబ్‌ షా మసీదు: ఇది ఇబ్రాహీమ్‌ కులికుతుబ్‌షా కాలము నాటిది. కొన్ని మెట్ల తరువాత ఈ మసీదుకు తూర్పుగా ఒక అర్ధ వలయాకారము వుంది. దీని నుండి గోల్కొండ కోట మొత్తం చూడొచ్చు. హైదరాబాదు నగర భవనములు కూడా చూడొచ్చు.
ఎల్లమ్మ దేవి: అక్కన్న మాదన్న మరియు అబ్దుల్‌ హసన్‌ తానీషా కాలములో కట్టినదీ దుర్గాదేవి లేక మహాకాళి అమ్మవారి మందిరం. ఇక్కడ ప్రతి ఆషాఢ మాసములో జాతరలు జరుగుతాయి. జంట నగరాల నుండి అనేక మంది సందర్శకులు వస్తుంటారు.
బారాదరి: ఇది మూడు అంతస్తులలో నిర్మించబడిన రాజుగారి సభా మండపము. దీని నుండి ''గోషామహల్‌ బారాదరి హైదరాబాదు'' భూమార్గము కూడా వుంది. దీని పై అంతస్తులో రాజ సింహాసనము వుంది. దీని నుండి 30 మైళ్ళ విస్తీర్ణములో అతి సుందరము, శోభాయమానముగా కన్పిస్తుంది. ఇది సముద్ర మట్టమునకు 400 అడుగుల నుండి 2000 అడుగులుంటుంది. దీని నుండి తూర్పుగా కుతుబ్‌షా వంశపు శిథిలమైన భవనములు, లంగర్‌హౌజ్‌ చెరువు, హైదరాబాద్‌ నగరమున ముఖ్య కట్టడమైన చార్‌మినార్‌, మక్కా మసీదు, ఉస్మానియా వైద్యశాల చూడొచ్చు. తూర్పు-దక్షిణ మూలగా మీర్‌ ఆలమ్‌ చెరువు, ఫలక్‌నుమా భవనము, దక్షిణముగా మకై దర్వాజా, హిమయత్‌నగర్‌, దీనికి దక్షిణమున పడమర మూలగా తారామతి, ప్రేమామతి భవనములు, ఉస్మాన్‌ సాగర్‌ చెరువు (గండిపేట) పడమరగా వున్నాయి. తూర్పు - ఉత్తర మూలగా హుసేన్‌ సాగర్‌ చెరువు, సికింద్రాబాదు నగరము, ఉస్మానియా యూనివర్సిటీని చూడవచ్చు. ఉత్తర-పడమర మూలగా కుతుబ్‌షా రాజుల గోపురములు పెట్లాబురుజు చూడొచ్చు. ఉత్తరముగా గోల్కొండ కోట పట్టణము, హకీం పేట, బేగంపేట విమానాశ్రయాన్ని చూడొచ్చు.
నీటి సదుపాయములు: బాలాహిసార్‌కు కింద భాగమున, తూర్పు దిశగా కుతుబ్‌షా భవనమును దాటాక 800 అడుగుల ఎత్తులో నిర్మించిన 5 కొళాయిలున్నాయి. అన్నిటికంటే ఎత్తయిన కొళాయిలో పర్షియన్‌ చక్రవర్తి సహాయంతో నీటిని నింపేవారు. అక్కడి నుండి కొన్ని ప్రదేశాలకు నీటిని అందజేసేవారు.
ఆర్మరి: ఇది బాలాహిసార్‌ గేటు ప్రవేశములోనే ఎడమ వైపు నిర్మించబడిన మూడంతస్తుల భవనం. దీనిలో చిన్న చిన్న తుపాకులు, ఫిరంగి గుళ్ళు మొదలుగునవి దాచి పెట్టేవారు. దీనికి దక్షిణముగా చరిత్ర ప్రసిద్ధి చెందిన ఒక బావి వుంది. 1687 సంవత్సరంలో ఔరంగజేబు దండెత్తి తానీషాని బంధించిన గోల్కొండ కోటను ఆక్రమించిన సమయమున ఆయన భార్య, బిడ్డలు శత్రువుల నుంచి రక్షణ పొందడానికి దీనిలో దూకారని చెప్తారు.
దాద్‌ మహల్‌: రోడ్డుకు తూర్పు దిశగా దీని బాల్కనీ వుంది.. బాల్కనీ ముందు పెద్ద ఖాళీ స్థలము వుంటుంది. ఇక్కడికి ప్రజలు వచ్చి తమ కష్టసుఖాలు చెప్పుకొనేవారు. రాజు ఈ బాల్కానీలోంచి వినేవారు.
____________________________________________________________

2. నయాగరా సొగసులు

  • సోయగాల నయాగరా జలపాతాన్ని చూసే వరకు అనుకోం అది అంత అందమైనదని. నీరు పాలధారల్లా కనిపించడమేంటి? దాని ఒయ్యారాలు, సొగసులు చూచి మనసు పరవశించడమేంటి? అవనికి దిగివచ్చిన ఆకాశగంగలా అగుపడడమేంటి? అని తెగ ఆశ్చర్యపోయిన మనమే....'ఔను అవన్నీ నిజమే సుమా' అనుకొంటాం. జలపాతం ఉధృతిని చూచి మైమరచిపోతాం. అల్లంత దూరాన నిలబడిన మనల్ని తన చిలిపి తుంపరలతో తడిపి మరీ పలకరించే నయాగరాను మర్చిపోలేం. ఆ అద్భుతానుభూతిని జీవితాంతం నెమరువేసుకుంటూనే వుంటాం.

ప్రపంచంలో తప్పక చూడాల్సిన వాటిలో సోయగాల నయాగరా ఒకటి. ఇది ప్రపంచంలోకల్లా వెడల్పయిన జలపాతం. అమెరికా, కెనడా సరిహద్దుల్లో ప్రవహించే చిన్న నది. అసలు అక్కడికి వెళుతున్నామూ అంటేనే మనసంతా ఉద్విగతతో నిండిపోతుంది. తీరా అక్కడికెళ్లాక ... ఆ అందాలను కనులనిండా నింపుకోవడంలోనూ, ఆస్వాదించడంలోనూ మునిగిపోతాం.నయాగరా జలపాతం మొత్తం పొడవు 60 కి.మీటర్లకు మించదు. ప్రవాహ ఉధృతీ తక్కువే. మరి దీని ప్రత్యేకత ఎక్కడవుందీ? అనిపిస్తుంది. ఈ చిన్న నది సుమారు 180 అడుగుల లోతులో పడే దృశ్యం మనల్ని కట్టిపడేస్తుంది. ఆ మనోహర, మనోజ్ఞ దృశ్యం చూసినవారి తనువు పులకించిపోతుంది. కెనడావైపు సుమారు 2000 అడుగుల వెడల్పులో గుర్రపు నాడా ఆకారంలో 140 అడుగుల లోతులో జల పడుతుంది. అమెరికా వైపు జలపాతం మరింత లోతైనది. కానీ వెడల్పే తక్కువ.కెనడావైపు జలపాతం చూడాలంటే కెనడా వీసా కావాలి. అయితే గ్రీన్‌కార్డ్‌ వున్నవారికి అది అవసరం లేదు. డెట్రాయిట్‌ నుంచి నయాగరా సుమారు 300 మైళ్ల దూరం. డెట్రాయిట్‌కు దక్షిణంగా వున్న కెనడాలో అయితే ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైన సీఎన్‌ టవర్‌ వుంది.
అక్కడ జలపాతం వ్యూ వున్న హోటళ్లకు గిరాకీ ఎక్కువగా వుంటుంది. అక్కడ ఏదైనా హోటల్లో గది తీసుకొని కిటికీలోంచి నయాగరా చూస్తుంటే వుంటుందీ...! ఇంక నోట మాటే రాదు. అలా చూస్తుండిపోతాం ఎంతసేపైనా. మరీ మొదటిసారి చూసేవారైతే ఇంక అంతే సంగతులు. ఇంక జలపాతం దగ్గరున్న టేబుల్‌ రాక్‌ కాంప్లెక్స్‌ చూడదగినది. అదే జలపాతానికి 20 అడుగుల దూరంలో నిలబడ్డాం అనుకోండి. నిమిషానికి 20 కోట్ల లీటర్ల నీరు 170 అడుగుల లోతుకు పడుతుంటే ఆ హోరు, వందల అడుగుల ఎత్తుకు లేచి పడే నీటి తుంపర అలలు... అసలు మాటల్లో ఎలా చెప్తాం! ఆ అందాన్ని వర్ణించడానికి ప్రపంచంలో వున్న ఏ భాషా సరిపోదేమో అనిపిస్తుంది. ఆ తుంపరలు మనల్ని తడిపేస్తుంటే వుంటుందీ...
జర్నీ బిహైండ్‌ ద హిల్స్‌ సంగతి మర్చిపోతే ఎలా! టేబుల్‌ రాక్‌ ఆఫీసులోనే టికెట్‌ తీసుకొంటే ఒక రెయిన్‌ కోట్‌ (డిస్పోజబుల్‌) ఇచ్చి లిఫ్టులో 125 అడుగులు కిందికి తీసుకెళతారు. అక్కడ అద్దాల తలుపులోంచి జలపాతాన్ని బాగా దగ్గరగా చూడొచ్చు. నీటి మట్టానికి 26 అడుగుల ఎత్తులో ఒక బాల్కనీ వుంది. మూడు వైపులా రెయిలింగ్స్‌ వుంటాయి. చల్లచల్లటి నీటి తుంపరలు అలా మొహం మీద పడి పలకరిస్తుంటే వుంటుందీ... ఆ ఆనందం మరెప్పుడూ కలగదేమో! రెయిన్‌ కోట్‌ కూడా తీసేసి తడిచిపోవాలనిపిస్తుంది.
అక్కడ భారతీయులే కాదండోరు! యూరోపియన్లు, చైనీయులు, ఆఫ్రికన్లు ... ఎంతోమంది విదేశీయులు చిన్నపిల్లల్లా కేరింతలు పెడుతూ జలపాతం తుంపర జల్లుల్లో తడిచిపోతుంటారు. తర్వాత అక్కడినుంచి టన్నెళ్ల ద్వారా అద్దం బిగించిన కిటికీ లోంచి మరింత దగ్గరగా నీటిని చూడొచ్చు. ఆ తర్వాత పైకి వచ్చి వేడివేడి కాఫీ తాగుతూ... జలపాత దృశ్యాలను చూస్తుంటే గంటలు నిమిషాల్లా గడిచిపోతాయి.
జలపాతాన్ని మరింత దగ్గరగా చూసే వీలు కూడా వుంది. అదెలా అంటారేమో! అదెలాగంటే... మెయిడ్‌ ఆఫ్‌ ది మిస్ట్‌ యాత్ర ద్వారా. అక్కడి గుర్రపు నాడా ఆకారంలో వున్న నదిభాగంలోకి తీసుకెళతారు. దీనికి కూడా ప్రత్యేకమైన టికెట్టుకొనాలి. అందరికీ రెయిన్‌ కోట్లు ఇస్తారనుకోండి. మనం ఎక్కిన బోటు పక్కగా 170 అడుగుల ఎత్తు నుంచి పడే నీటి ఉధృతి, తుంపర్లు ... పైగా మనం ఎక్కిన బోటు జలపాతానికి దగ్గరగా వెళుతూ వుంటే భయం పెరుగుతూ వుంటుంది. అయితే అదేదో సాహస యాత్రలాగా బావుంటుందిలెండి. మొహం మీద పడుతున్న తుంపరలను తుడుచుకోవడం కూడా మర్చిపోయి అలా చూస్తుండిపోతారెవరైనా. కాసేపటి తర్వాత తిరిగి బోటు మనల్ని వెనక్కి తీసుకెళ్తుంది. రాత్రిపూట జలపాతం దగ్గర ఏర్పాటు చేసిన మూడు నాలుగు రంగులు లైట్లు చూస్తే మతిపోవాల్సిందే.
వయోబేధం లేకుండా నయాగరా జలపాతం అందాలను అంతా ఆస్వాదిస్తారు. ఇక కొత్తగా పెళ్లయినవారికైతే అది స్వర్గమే అనుకోండి. ఇక్కడ చూడ్డానికి ఈ జలపాతం ఒక్కటేనా మరేం లేవా? అనుకోకండి. చాలానే వున్నాయి. మెరైన్‌ ల్యాండ్‌ అనే ప్రాంతంలో తిమింగలాలు, డాల్ఫిన్లు, సీ లయన్లు ... వంటి ఎన్నో సముద్ర జంతువులు కూడా కన్పిస్తాయి. కొన్నింటినైతే తాకొచ్చు కూడా. డాల్ఫిన్‌ షో చాలా బావుంటుంది. అక్కడ చాలా పెద్ద స్టీల్‌ రోలర్‌ కోస్టర్‌ వుంది. దాని మీద ఆడుకోడానికి పిల్లలు తెగ ఆరాటపడతారు.ఇదే కాదు. కేబుల్‌ కారులో జలపాతం చూడడం... తుంపర్లలో తడవడం కూడా గొప్ప అనుభూతి. అక్కడ 600 అడుగుల ఎత్తయిన మినోల్టా, 800 అడుగుల ఎత్తున్న స్కైలాన్‌ టవర్లమీదనుంచి కూడా జలపాతాన్ని చూడొచ్చు. స్కైలాన్‌ టవర్‌మీద రివాల్వింగ్‌ హోటల్‌ వుంది. అది తన చుట్టూ తాను తిరుగుతూ వుటుంది. అందులో కూర్చుని టిఫిన్‌ తింటూ, కాఫీ తాగుతూ జలపాతాన్ని వుంటే చాలా బావుంటుంది. బొటానికల్‌ గార్డెన్‌లో 2300 రకాల గులాబీలు పూస్తాయని చెప్తుంటారు. అక్కడి బటర్‌ఫ్లై కన్జర్వేటరీ కూడా మనల్ని కట్టిపడేస్తుంది. అందులో 2000 రకాల సీతాకోకచిలుకలు తమ రంగురంగుల రెక్కలను ఆడిస్తూ వయ్యారంగా పోతుంటే మన మనసు ఒకచోట నిలవదు సుమా! క్లింటన్‌ హిల్‌ ఏరియా దగ్గరకు వెళ్లామూ అంటే పిల్లలు వదిలి రానేరారు. ఇవేకాక రిప్లీస్‌ బిలీవ్‌ ఇట్‌ ఆర్‌ నాట్‌, రిప్లీస్‌ మూవింగ్‌ థియేటర్‌, గిన్నిస్‌ మ్యూజియం, వ్యాక్స్‌ మ్యూజియం, గుర్రపుబగ్గీ సవారీ... అన్నీ చూడాల్సినవే.
ఇక డెట్రాయిట్‌ పట్టణం ప్రత్యేకంగా చూడదగినది. ఇది డెట్రాయిట్‌ నది ఒడ్డున వుంది. తమాషా ఏంటంటే ఇక్కడ కూసింత దొంగల బెడద ఎక్కువే. కానీ మ్యూజియంలకు పేరుగాంచిన ప్రాంతం. అందుకేనేమో దీన్ని మ్యూజియంల నగరం అని కూడా పిలుస్తారు ముద్దుగా. ఇక్కడ... హెన్రీఫోర్డ్‌ మ్యూజియం, ఐమ్యాక్స్‌ థియేటర్‌ వున్న కాంప్లెక్స్‌ అద్భుతంగా వుంటాయి. వీటి తర్వాత చూడాల్సింది బెల్లీ ఐలాండ్‌. ఇది అమెరికా మొత్తంలోకి అతి పెద్ద ఐలాండ్‌ పార్కు. వెయ్యి ఎకరాల విస్త్రీర్ణంలో వున్న ఈ పార్కులో పాలరాతి లైట్‌ హౌస్‌, బీచ్‌, అన్ని రకాల ఆటలు ఆడుకొనేందుకు మైదానాలు, పూలమొక్కలు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ... ఒకటేంటి...అన్నీ కనిపిస్తాయి.
మనం ఇప్పటి వరకు కెనడావైపున్న నయాగరా అందాలను మాత్రమే చెప్పుకున్నాం. ఇప్పుడు అమెరికా వైపున్న అందాలను చూద్దాం. ఇది కొంచెం దూరం ఎక్కువే అనుకోండి. న్యూయార్క్‌, న్యూజెర్సీ, మేరీల్యాండ్‌ లో వుండేవారికి దగ్గర. ఆ పక్కనే వున్న నయాగరా నదిలో చూడాల్సింది గోట్‌ ఐలాండ్‌. అమెరికన్‌ ఫాల్స్‌కు, కెనడా ఫాల్స్‌కు మధ్యలో ఈ ఐలాండ్‌ వుంది. ఇక్కడ రెండు జలపాతాలు కనిపిస్తాయి. అమెరికన్‌ ఫాల్స్‌ బ్రైడల్‌ వీల్‌ అంటారు వీటిని. లిఫ్టులో 175 అడుగులు దిగి, జలపాతానికి 25 అడుగుల దగ్గరకు వెళ్లొచ్చు. పూర్తిగా తడిచిపోతామనుకోండి. ఇక్కడ కూడా మెయిడ్‌ ఆఫ్‌ ద మిస్ట్‌ ట్రిప్‌ వుంటుంది. కాకపోతే కెనడావైపు జలపాతం చూడ్డానికి అయ్యే ఖర్చుకంటే ఇక్కడ అన్నీ రేట్లు ఎక్కువే. ఇక్కడ మరో తమాషా ఏంటంటే... హీలియం బెలూన్‌లో కూర్చుని 400 అడుగుల ఎత్తు నుంచి జలపాతం చూడొచ్చు. మరో ముఖ్యమైన విషయమేమంటే నయాగరా హిస్టరీ మ్యూజియంలో డయానా, మదర్‌ థెరిస్సా వంటి ప్రముఖుల బొమ్మలు వుంటాయి. వీటిని చూస్తుంటే బొమ్మలనుకోం. నిజంగా సదరు మనుషులే అక్కడ నిలబడినట్టు అనిపిస్తుంది.ఇవండీ నయాగరా జలపాతం ముచ్చట్లు. ఇప్పుడేమనిపిస్తోంది! ఎలాగైనా సరే... అక్కడికెళ్లి జలపాతం తుంపర్లలో తడిచిపోవాలనిపిస్తోందా!
____________________________________________________________

3. బృహదీశ్వరాలయ గోపురం భలేభలే

ఏ ఆలయానికి వుండే ప్రత్యేకత దానికి వుంటుంది. కాని తంజాపూరులోని బృహదీశ్వరాలయ గోపుర ప్రత్యేకత మాత్రం మరే దేవాలయానికి లేదనే చెప్పవచ్చు. గగనమధ్యంలో మార్తాండుడు తేజరిల్లిపోతున్నా ఆలయగోపురానికి బంగారుపూతలు పూస్తున్న ఈ దేవాలయ శిఖరం నీడ మాత్రం ఏ సమయంలోను నేలమీద పడదు. ఆ రోజు ఎంత ఎండకాస్తున్నా ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏ వేళలోను బృహదీశ్వరాలయ గోపురం నీడ మాత్రం భూమి మీద పడదు. ఈ వింతకు కారణమేమిటో, ఆనాటి వాస్తుశిల్పులు ఈ విశేషాన్ని ఎలా సాధించగలిగారో ఈ నాటికీ కొరుకుడు పడక పెద్ద పెద్ద ఇంజినీర్లు సైతం తికమకపడిపోతున్నారు.
తమిళనాడులోని తంజావూరు నగరంలో పది శతాబ్దాల క్రితం చోళరాజులకాలంలో బృహదీశ్వరాలయాన్ని నిర్మించారు. చోళరాజులలో సుప్రసిద్ధుడయిన రాజరాజచోళుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ ఆలయాన్ని నిర్మింపచేశాడు. 1004వ సంవత్సరం నుంచి 1010వ సంవత్సరం వరకు ఆరు సంవత్సరాలపాటు అహోరాత్రులు శ్రమించి నిర్మించిన ఈ దేవళం అపూర్వ శిల్పకళాశోభకు ఆలయం. బృహదీశ్వరాలయ ప్రాంగణంలో చెక్కిన నేటికీ కనువిందు చేస్తున్న అనేక శిలాశాసనాల ద్వారా ఆనాటి రాజకీయ, ఆర్థిక సాంఘిక పరిస్థితులను తేటగా తెలుసుకొనవచ్చు. రాజరాజచోళుని వీరత్వం, ఆనాటి శిల్ప సంగీత, నృత్యాది కళావిశేషాలను శాసనాల వల్ల తెలుసుకోవచ్చు.

ఈ మహారాజు కాలంలో బృహదీశ్వరాలయ సమీపంలో ప్రత్యేకంగా రెండు వీధులను కళాకారులకే కేటాయించారు. దాదాపు 400 మంది సంగీత నృత్యశాస్త్రాలలో నిష్ణాతులయిన కళాకారులు ఆ వీధులలో నివసించేవారట. ద్రావిడ వాస్తు పద్ధతిలో నిర్మించిన బృహదీశ్వరాలయం ఎన్నో విశిష్టతలకు ఆలవాలమైంది. ఈ దేవాలయ ప్రాంగణం 152 మీటర్లకు పైగా పొడుగుతో 76 మీటర్లకుపైగా వెడల్పుతో సువిశాలంగా వుంటుంది. ఆలయంలోని మూలవిరాట్‌ అయిన శివమూర్తి లింగాకారంలో 12 అడుగుల ఎత్తుతో శోభిల్లుతూ వుంటాడు. ఈ స్వామిని 'బృహదీశ్వరుడు' అని 'ఆడవల్లన్‌' అనీ వివిధ నామాలతో పిలుస్తూ వుంటారు.
గోపుర విశిష్టత

ఈ ఆలయగోపురాన్ని 216 అడుగుల ఎత్తుతో 14 అంతస్థులుగా అష్టభుజాకారంలో నిర్మించారు. ఈ గోపురం పైభాగాన 25 అడుగుల ఏకశిలా కలశం వుంది. ఈ శిలాకలశం బరువు 81 టన్నులకు పై మాటగానే వుంటుంది. బ్రహ్మాండమైన ఈ శిలాకలశాన్ని గోపురం మీద ప్రతిష్టించడం ఆనాడు పెద్దసమస్యే అయిందిట. ఆలయానికి 6 కిలోమీటర్ల దూరంలో వున్న సారాపల్లం అనే గ్రామం నుంచి ఆలయగోపురం ఎత్తువరకు ఏటవాలుగా ఇసుకతిన్నెలను ఏర్పరిచి ఆ మార్గం గుండా కలశాన్ని గోపురంమీదికి చేర్చారట. ఈ బృహత్‌కార్యం నిర్వహించటానికి కొన్ని వేలమంది పనివారు అవసరమయ్యారంటారు. 
ఏకశిలాకలశం రెండువైపులా రెండు అందమైన నంది విగ్రహాలు జీవకళ ఉట్టిపడుతూ దర్శనమిస్తూ వుంటాయి. శిఖరం నీడ ఏ సమయంలోను నేలమీద పడనివిధంగా నిర్మించటం జరిగింది. గోపురానికి దక్షిణ దిక్కున గణేషుడు, బోళాశంకరుడు వగైరా శిల్పమూర్తులుండగా ఉత్తరదిక్కున వీరభధ్రుడు, అర్థనారీశ్వరుడు వగైరా కన్పిస్తాయి. తూర్పున నటరాజు అఖండనృత్యంలో మునిగిపోయి వుండగా పశ్చిమభాగాన హరిహరుడు, చంద్రశేఖరుడు... వున్నారు. వెరసి అపూర్వమైన కళాశోభతో విలసిల్లే ఈ మూర్తులన్నిటితో బృహదీశ్వరాలయ గోపురం కళలకు కాణాచిగా వెలిగిపోతూ వుంటుంది. ఈ గోపురాన్ని దక్షిణమేరుగా అభివర్ణిస్తుంటారు కూడా.

వాసికెక్కిన నంది
ఆలయప్రాంగణంలో గర్భగుడికి ఎదురుగా వున్న మండపంలో ప్రతిష్టించిన నందివిగ్రహం భారతదేశంలో వున్న రెండో పెద్దనంది విగ్రహం. 12 అడుగుల ఎత్తుతో 19కి పైగా అడుగుల వెడల్పుతోవున్న ఈ బృహత్‌ నంది తన గంభీరమైన చూపులతో జీవకళ ఉట్టిపడుతూ భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ వుంటుంది. ఈ మహానంది బరువు 25 టన్నులకు పై మాటగానే వుంటుంది. ఇన్ని విశిష్టతలు కలిగిన బృహదీశ్వరాలయం తర్వాత కాలంలో వచ్చిన రాజులను కూడా ఆకర్షించింది. 13వ శతాబ్దంలో తంజావూరును పాలించిన కొనేరినాయక్‌ అనే పాండ్యరాజు ఈ ఆలయ ప్రాంగణంలోనే అమ్మవారి ఆలయాన్ని కట్టించాడు. 17వ శతాబ్దంలో మరో రాజు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయాలన్నీ అపూర్వమైన శిల్పకళాశోభతో విరాజిల్లుతూ భక్తులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి! తంజావూరు వెళ్ళినవారు అవశ్యం సందర్శించుకోదగ్గ తీర్థం బృహదీశుని దేవళం!
__________________________________________________________

4. అణువణువునా పచ్చదనం


మెట్టుపాళయం నీలగిరి కొండలకు పాదంలాంటిది. మెట్టుపాళయంనిండా 'రోబో' ఫీవరే. ఎటుచూసినా ఆ సినిమా పోస్టర్లే! ఏమైనా ఒక వ్యక్తిపై అంతెత్తున అభిమానం పొంగిపొర్లడం, దాన్ని సంబంధిత వ్యక్తులు భరించడమూ కష్టమేనేమో! అది వికటించిందా ఇక అంతే! కుష్‌బూకు గుడి కట్టడం, దాన్ని కూలగొట్టడం మనం చూడలేదూ?! ఇక మన యాత్రకొద్దాం.
మెట్టుపాళయంనుండి ఊటీకి నేరోగేజ్‌ రైలుమార్గం వుంది. స్టీమ్‌ ఇంజన్‌ ట్రైన్‌. యావత్‌భారతదేశాన్ని ఉర్రూతలూగించిన 'ఛయ్య ఛయ్య' పాటంతా దీనిమీదనే షూట్‌ చేశారు. అలాగే సంతోషం లాంటి ఎన్నో తెలుగు సినిమాలూనూ. ఆ రైలు కేవలం మూడే పెట్టెలు. దాని ఛార్జి ఎనిమిది రూపాయలు. ముందే రిజర్వ్‌ చేయించుకుంటే 23 రూపాయలు. కొండలు, లోయలు, జలపాతాల మీదుగా ఐదున్నర గంటల ప్రయాణం. సింప్లీ సూపర్బ్‌ అన్నమాట! అటు పక్క చూడాలో, ఇటు పక్క చూడాలో తెలియని డోలాయమానం. అందాలన్నీ కళ్లలో నింపేసుకోవాలన్న తాపత్రయం. తల ఒకవైపు తిప్పితే మరోవైపు మిస్సయిపోతామేమోనన్న ఆత్రం. ఒకదాని వెనుక మరోటి, దాని వెనుక ఇంకోటి... ఇలా అనేక కొండలు, లోయల సమూహం. నీలగిరి కొండల అందాలు ఏమని వర్ణించేది? ప్రకృతికాంత నిండారా తలస్నానంచేసి కురులన్నీ విరబోసుకుని నీరెండలో ఆరబెట్టుకుంటుంటే ఎలా వుంటుంది? అచ్చం అలా వుంది అక్కడి సన్నివేశం. ఓ వైపు ఎత్తైన కొండలు, మరోవైపు లోతైన లోయలు... వీటిముందు మనమెంత? ఏదో సాధించేశామని విర్రవీగే మన అహమెంత?
ఈ కొండల్లో అంతర్లీనంగా కనిపించిందేమిటంటే స్వేచ్ఛ! అవును! స్వేచ్ఛే! ప్రతి చెట్టు తనకు నచ్చిన రీతిలో, తనకు తోచిన దిశవైపు హాయిగా, ఆనందంగా విస్తరించింది. దాన్ని అడ్డుకునేవారూ, అదుపు చేసేవారూ లేరు. ఈ ఆకృతిలోనే పెరగాలనే ఆంక్షలు లేవు. ఆ ఆనందం ప్రతి ఆకులోనూ, పువ్వులోనూ కనిపించింది. అందుకేనేమో మనం పెంచుకునే కుండీల్లోని మొక్కల్లో ఈ జీవం కనిపించదు. ఎంత పోషణ చేసినా సరే! బహుశా మనిషైనా అంతేనేమో! మనం ఎంతో ఖరీదుపెట్టి కొనుక్కునే మొక్కలెన్నో ఇక్కడ పిచ్చిమొక్కల్లా పెరిగాయి. ఇక పేరు తెలీని మొక్కలెన్నో తనువంతా విరిబాలలతో విరగబూశాయి. బలమైన వేళ్లతో విస్తరించిన చెట్లు, పొదలు, తీగలు... అక్టోబర్‌ నెల, మంచుతెరలింకా తొలగని సంజెవేళ, అబ్బ వర్ణింపశక్యం కావడంలేదు.
బతకాలన్న కోరిక ఎంత బలంగా వుండకపోతే... తన ఉనికిని చాటుకోవాలన్న ఆశ ఎంత తీవ్రంగా లేకపోతే ఆ చెట్లు ఈ బండరాళ్లను చీల్చుకుని పైపైకి ఎగబాకుతాయి?! మరి మనమెందుకు చిన్నపాటి కష్టాలకే వెన్ను చూపిస్తాం? ఎందుకు వెనుకంజ వేస్తాం? భద్రతాలేమి మనల్ని పట్టి పీడించడం వల్లేమో! ప్రపంచంలో ఏ జీవికీ లేని ఆత్మహత్య అనే దౌర్భాగ్యపు ఆలోచన మనకే ఎందుకొస్తోంది?
ఈ ఆలోచనల మధ్య కూనూరు వచ్చింది. అక్కడినుండి చిన్న చిన్న ఊళ్లు, టీ గార్డెన్స్‌ మొదలయ్యాయి. టీ ప్లాంటేషన్స్‌, మధ్య నిలువెత్తు 'సిల్వర్‌ ఓక్స్‌' వృక్షాలు. అక్కడక్కడా ఆగుతూ ఉదకమండలం.. అదే ఊటీ చేరుకున్నాం. ముదుమలై అడవులకు చేరుకునే మార్గంలో తగిలే ఊటీ పరిసరాలు ముందు చూసి... మిగిలినవి తర్వాత చూడాలనుకున్నాం. సో, ఆ దిశగా పయనించాం. దారిలో ఊటీ లేక్‌ దర్శనమిచ్చింది. పూర్వం సినిమా డ్యూయెట్లన్నీ అక్కడేగా షూటింగ్‌(ఉదా: 'అభినందన'లోని 'మంచు కురిసే వేళలో..')! కానీ ఇప్పుడది పొల్యూట్‌ అయిపోయింది. ఊటీకి సందర్శకుల తాకిడి ఎక్కువనుకుంట! మేం ముందుగా పైన్‌ ఫారెస్ట్‌ దగ్గర ఆగాం. అక్కడన్నీ ఆకాశాన్నంటే చెట్లే. మీకు 'వసంత కోకిల' సినిమాలో ఓ సన్నివేశం గుర్తుందా?! అమాయకురాలైన శ్రీదేవి కమల్‌హసన్‌ను ''ఈ చెట్లు ఇంత ఎత్తుకు ఎందుకున్నారు?'' అని రెప్పలు అల్లల్లాడించుకుంటూ అడుగుతుంది. దానికతను ''ఆకాశంలో బూజు పడుతుంది కదా! దాన్ని దులపడానికి!'' అనేస్తాడు సింపుల్‌గా! అన్నట్లు ఆ సినిమా షూటింగంతా ఊటీలోనే!
షూటింగ్‌ స్పాట్‌ అని అక్కడ ఓ ప్రదేశం వుంది. నున్నగా వున్న కొండ, చుట్టూ దట్టంగా చెట్లున్న కొండలు... టోటల్లీ సూపర్బ్‌. అది సినిమాల్లో హీరో, హీరోయిన్లు కలిసి దొర్లుకుంటూ పోతారే ఆ కొండన్నమాట! వ్యూ మాత్రం అదిరింది! సినిక్‌ బ్యూటీకి మారుపేరనుకోండి! దాన్ని ఆస్వాదించాక మెల్లగా దిగొచ్చాం. అక్కడ మొక్కజొన్న పొత్తులు ఉడకబెట్టి... ఉప్పు, కారం జల్లి వేడివేడిగా అమ్ముతున్నారు. అంత చల్లటి ప్రాంతంలో! ఇక ఊరుకుంటామా, వెంటనే వాటి పనిపట్టాం.
మెల్లగా పైకారా ఫాల్స్‌ వైపుకు మళ్లాం. దానికి చాలా దూరం నడవాలట. దారిలో మన తెలుగువాళ్లే ఎదురై ఆ జలపాతం చిన్నగా వుందని చెప్పారు. సరే లెమ్మనుకుంటూ వెనుతిరిగాం. అక్కడ ఏం కనిపించాయో తెల్సా?! పిచ్చుకలు! పిచ్చుకలా అని తేలిగ్గా తీసిపారేయకండి. పిచ్చుకలు అంతరించిపోతున్నాయని వినడం లేదూ?! మీరు పిచ్చుకల కిచకిచారావాలు విని ఎన్నాళ్లైంది చెప్పండి? పైగా ఆ పిచ్చుకలు బొద్దుగా భలే ముద్దొచ్చాయి. అడవిలో పెరగడం కదూ! ఇటీవల మన జనవాసాలలోనూ పిచ్చుకలు అక్కడక్కడ మళ్లీ కనిపిస్తున్నా అవి డైటింగ్‌ చేస్తున్న పిచ్చుకల్లా వున్నాయి. మునుపటి హుషారు లేదు.

ఇక 'చలో పైకారా లేక్‌' అన్నాం. పైకారా లేక్‌... ''ఏమని వర్ణించనూ..!'' ఒక చేయి తిరిగిన చిత్రకారుని కుంచె నుండి అలవోకగా జాలువారిన చిత్రమంటే సరిపోతుందా?! అనుమానమే! అం..త గొప్పగా వుందా సరస్సు. ప్రకృతి ఎంతో శ్రద్ధగా తీర్చిదిద్దిన ఆ రంగవల్లికను ఊపిరి బిగబట్టి కళ్లనిండా నింపుకోవడమే సరిపోయింది. అదే గొప్ప అనుకుంటే... అందులో బోటింగ్‌! అందరం జంగ్లీలో షమ్మీకపూర్‌లా 'యాహూ' అని అరిచి బోట్‌లో సెటిలైపోయాం. చుట్టూ చిక్కనైన చక్కదనమే! అణువణువునా పచ్చదనమే... అవును పచ్చదనమే..! ప్రకృతిని చూసి పరవశించే ప్రతివారూ అక్కడ తన్మయం చెందాల్సిందే! ఆ మైమరపులోనే బోటింగ్‌ పూర్తయింది.
తరువాత నీడిల్‌ రాక్‌ వ్యూ పాయింట్‌. అక్కడికి చేరేసరికి ఒకటే వాన. ఆ వానలో తడుచుకుంటూ కొండవాలు దిగాం. వెహికల్‌లోని గొడుగులు తీసుకోవాలన్న ఆలోచన కూడా రాలేదేంటో! కొంతదూరం నడిచాక ఆ పాయింట్‌కు చేరాం. వాన, మబ్బుల మధ్యగా దూరంగా మొనతేలిన కొండ... ఓ వర్ణచిత్రంలా మా గొప్ప సొగసుగా వుందిలే! చూస్తూ వుండిపోవడానికి జోరున వర్షం. ఇక తిరిగిరాక తప్పలేదు.
అన్నట్లు మొత్తం టూరంతా ప్రతిచోటా 'ప్లాస్టిక్‌ ప్రొహిబిటెడ్‌ ఏరియా' అని బోర్డులు కనిపించాయి. అది వుండబట్టే ఈమాత్రం ఈ అడవులు మనగలుగుతున్నాయి. లేకుంటేనా... 'సర్వనాశనం' అయిపోయి వుండేది. వరదలు రావడానికీ, పశువులు చనిపోవడానికీ, నేలంతా పాడైపోవడానికీ ప్లాస్టిక్‌ భూతం చేస్తున్న హాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే అంతటా కొండలు, చెట్లు, పువ్వులు ఎలా పెరిగేవి అలాగే వుంచారు. చెట్లను కాపాడమని హోర్డింగులుంచారు. పువ్వు చూస్తే కోయాలనుకోవడం, కాయ చూస్తే తెంచాలనుకోవడం వరకూ ఓకే! దానివల్ల ఎలాంటి నష్టం రాదు. పర్యావరణానికి ఎలాంటి భంగమూ వాటిల్లదు. కానీ... ఆ చెట్టే నరికేస్తే, కొండే తవ్వేస్తే ఎలా? కూర్చున్న కొమ్మను నరుక్కున్న కాళిదాసు గురించి విని ఎగతాళిగా నవ్వుకున్నాం. మరి మనం చేస్తున్నదేంటో!
అలా అలా సాగుతున్న మా ప్రయాణం వున్నట్టుండి క్రమేణా దట్టంగా అల్లుకున్న వెదురు పొదల్లో సాగింది. ఎంత దట్టంగా అంటే ఆకాశం కనపడనంతగా! రోడ్డుకిరువైపులా వున్న పొదలన్నీ ఏకమైపోయి దారిని చీకటిమయం చేసేశాయి. కానీ రాదారి మాత్రం బహు రమణీయంగా వుంది. అలా వెళ్తూ వెళ్తూ దట్టమైన ముదుమలై అడవుల్లోకి అడుగుపెట్టాం. అదంతా టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌. ఎక్కడా దిగే సాహసాలు కూడదు. కేవలం అడవి అందాలను కళ్లతో జుర్రుకోవాలంతే! దారిలో ఓ అడవి ఏనుగు తన రెండు బుజ్జాయిలతో కనిపించింది. కళ్లు ఇంతింత చేసుకుని మరీ చూశాం. మెల్లగా గుడలూరు మీదుగా తెప్పకాడుకు చేరాం.
కానీ పడుకోవాలంటే చెప్పలేనంత భయం. ఎటువైపునుండి ఏ భల్లూకం వస్తుందో, ఏ పక్కనుండి అడవి జంతువు 'హల్లో' అంటుందోనని వణుకు, దడ, గగుర్పాటు. బాబోయ్!
(తెల్లవారుజామున గది తలుపులు తీయగానే ఏం కనిపించాయో తెలియాలంటే వచ్చేవారం వరకూ ఎదురుచూడక తప్పదు)
________________________________________________________

5. శ్రీశైల క్షేత్రంలో ఎన్ని విశేషాలో ...

శ్రీశైలక్షేత్రం కేవలం భక్తి భావాలను, ఆధ్యాత్మిక తత్త్వాన్ని మేళవింపజేసుకోవడమే కాకుండా ఎన్నో చారిత్రక విశేషాలను స్వంతం చేసుకొని మన వారసత్వ వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. అంతేకాకుండా భౌగోళిక అంశాలు, ప్రకృతి అందాలు శ్రీశైలానికి మరింత ప్రత్యేకతను సంతరించి పెట్టాయి. అందుకే శ్రీశైలాన్ని ఒక అరుదైన ప్రదేశంగా పేర్కొనవచ్చు. దట్టమైన అడవులతో, ఎత్తైన కొండలతో, అందమైన లోయలతో, గలగల పారే సహజ జలధారలతో, ఒంపుసొంపుల కృష్ణమ్మ ప్రవాహంతో, సాంస్క ృతిక వారసత్వ సంపదతో, ఆలయ కళావైభవానికి ప్రతీకగా చెప్పదగిన నిర్మాణాలతో అలరారే శ్రీశైల క్షేత్రాన్ని దర్శించి తీరవలసిందే.
శ్రీశైలానికి 8 కి.మీ. దూరంలో రోడ్డును ఆనుకొని శిఖరేశ్వరం వుంది. శ్రీశైలం కొండల్లో అతి ఎత్తైన కొండశిఖరం యిదే. దీని ఎత్తు సముద్రమట్టానికి 898 మీటర్లు (2830 అడుగులు). ఈ శిఖరేశ్వరంలో ప్రాచీనమైన వీరశంకర ఆలయం, ఆలయం పైభాగంలో ఒక రోలు, దానిలో ఒక పొత్రంపై నంది అమర్చబడివున్నాయి. భక్తులు ఆలయ పైభాగానికి వెళ్ళి, అక్కడున్న రోటిలో నువ్వులు పోసి, పొత్రాన్ని తిప్పి, నందికొమ్ములపై నుండి శ్రీశైల ప్రధానాలయాన్ని చూస్తారు. ఎత్తైన ఈ ప్రదేశం నుండి చూసినప్పుడు కనబడే శ్రీశైల దృశ్యం ఎంతో మనోహరంగా వుంటుంది.
పాలధార - పంచధార
హఠకేశ్వరానికి ఎదురుగా రోడ్డుకు యివతలి వైపున గల లోయ ప్రాంతమే పాలధార - పంచధార. ఇక్కడ ఎత్తైన ప్రదేశంలో బండరాళ్ళ నుండి, దాదాపు పక్కపక్కగా ఒకచోట ఒక జలధార, మరోచోట అయిదు జలధారలు నిరంతరం ప్రవహిస్తూనే వుంటాయి. ఈ ప్రవాహపు తీరు పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది.
ప్రాకార కుడ్యం - ప్రత్యేకతలు
శ్రీశైలంలోని ఆలయ ప్రాకారకుడ్యం భారతీయ శిల్పంలోనే ఒక ప్రత్యేకతను కలిగివుండి, పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. దాదాపు 2,79,300 చదరపు అడుగుల వైశాల్యం గల ప్రధాన ఆలయ ప్రాంగణం చుట్టూ సుమారు 20 అడుగుల ఎత్తు, 2121 అడుగుల పొడవుగల కోటగోడ వంటి నిర్మాణమే ప్రాకారకుడ్యంగా చెప్పబడుతోంది. 3153 రాళ్ళను వుపయోగించి నిర్మించిన ఈ ప్రాకారంలో యించుమించుగా బయటివైపుగల అన్ని రాళ్ళపై శిల్పాలు చెక్కబడ్డాయి. ఈ ప్రాకారకుడ్యంలోని ప్రతిరాయిని ఒక కళాఖండంగా పేర్కొనవచ్చు. ఈ కుడ్యం క్రీ.శ.1412 ప్రాంతంలో నిర్మించబడింది. ఈ ప్రాకార కుడ్యంపై శ్రీశైల స్థల కథలకు సంబంధించిన శిల్పాలు, పురాణాలలోని పలుగాథలకు సంబంధించిన శిల్పాలు, దేవతాశిల్పాలు, సిద్ధుల శిల్పాలు, వృక్ష, జంతు శిల్పాలు, యింకా పలు అలంకారిక శిల్పాలు, సామాజిక శిల్పాలు వున్నాయి. ఈ శిల్పాలు ఆనాటి సమాజం యొక్క ఆధ్యాత్మిక వ్యక్తిత్వం, వేషధారణ, విలాసాలు, యుద్ధరీతులు, అప్పటి నృత్యాలు, కళారీతులు మొదలైన వాటన్నిటినీ సూచిస్తూ, అప్పటి సామాజిక జీవన వైవిధ్యాన్ని సూచిస్తున్నాయి.
వీర శిరోమండపం
శ్రీశైల ప్రధానాలయంలో స్వామి వారి ఆలయం ఎదురుగా గల వీరశిరోమండపం ఎంతో చారిత్రక ప్రాశశ్యం వుంది. ఈ మండపాన్ని క్రీ.శ.1377లో రెడ్డి రాజులు నిర్మించారు. ఈ మండపంలో భక్తులు వీరావేశంతో తమ తలలను, కాళ్ళు చేతులను, నాలుకలను, కుత్తుకలను గండ కత్తెరలతో నరుక్కునేవారని, ఈ మండప నిర్మాణ సందర్భంగా వేయించిన శిలాశాసనం చెబుతోంది. ఈ సాహస కృత్యాలకే 'వీరాచారం' అని పేరు. పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్రలో యిలాంటి సాహస కృత్యాలు వర్ణించబడ్డాయి. ఆలయ ప్రాకార కుడ్యంపై కూడా యిలాంటి వీరాచార శిల్పాలున్నాయి. శ్రీశైలంలో యిలాంటి సాహసకృత్యాలకు ఒక మండపమే ప్రత్యేకంగా నిర్మించబడిందంటే, శ్రీశైల సంస్కృతిలో ఈ సంప్రదాయానికి గల ప్రాధాన్యమేమిటో అర్థమవుతోంది.
ట్రైబల్‌ మ్యూజియం
శ్రీశైలంలో పర్యాటకులు తప్పకుండా చూడవలసిన వాటిలో ఈ ట్రైబల్‌ మ్యూజియం ఒకటి, గిరిజన సంస్కృతీ సంప్రదాయాల సమాహారంగా చెప్పదగిన ఈ మ్యూజియం 2003లో ఏర్పాటు చేయబడింది. ఆదిమవాసుల సంప్రదాయ విశేషాలను తెలియచెప్పే ఈ ప్రదర్శనశాల కొన్ని వేల సంవత్సరాల విశేషాలను మన కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తుంది. ఈ మ్యూజియంలో ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌లో చేసిన ఆదిమవాసుల నిలువెత్తు బొమ్మలు నిజంగా వారు మన ముందున్నట్లుగా భ్రాంతిని కలుగచేస్తాయి. పామును ఆడిస్తున్న చెంచు, తప్పెట వాయిస్తున్న చెంచు, డోలు వాయిస్తున్న గిరిజనుడు, శివకథ చెబుతున్న చెంచు, వేణువు ఊదుతున్న గిరిజనుడు, శివునికి సోది చెబుతున్న ఎరుకలసాని మొదలైన మూర్తులు ఈ మ్యూజియంలో వున్నాయి. ఇక్కడ యిలాంటి మూర్తులను 20 దాకా చూడవచ్చు. ఇంకా 33 గిరిజన తెగలకు చెందిన రకరకాల వాయిద్యాలు, వారి ఆభరణాలు, వారి వివిధ వస్తువులను కూడా ఈ ప్రదర్శనశాలలో చూడవచ్చు.
అక్కమహాదేవి గుహలు
శ్రీశైలంలోని అక్కమహాదేవి గుహలు భౌగోళికంగా ఎంతో ప్రత్యేకతను కలిగి వున్నాయి. అక్క మహాదేవి గుహలను యిక్కడ పాతాళగంగ మెట్లను దిగి, దాదాపు 10 కి.మీ. నదిలో ప్రయాణించి చేరుకోవచ్చు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి అయితే 12 కి.మీ. ప్రయాణించాల్సి వుంటుంది.
పన్నెండవ శతాబ్దంలో వీరశైవ శివశరణులలో ప్రసిద్ధి చెందిన అక్కమహాదేవి ఈ గుహలలో కొంతకాలం తపస్సు చేసిన కారణంగా వీటికి అక్కమహాదేవి గుహలు అనే పేరు ఏర్పడింది.ఈ గుహల సహజ అందాలను కన్నులారా చూడవలసిందే కాని వివరించి చెప్పలేము. కుడి, ఎడమలలో రెండు ప్రవేశ ద్వారాలు గల ఈ గుహల ముందు భాగంలో స్తంభాకారంలో ఏర్పడిన శిలలను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎంతో కళా సౌందర్యంతో అలరారే ఈ సహజ స్తంభాలు చెయ్యి తిరిగిన శిల్పి చెక్కిన కళారూపాల్లాగా భాసిస్తాయి.ఈ గుహల కుడివైపు ప్రవేశద్వారం నుండి లోపలికి వెళితే గుహచివరను చేరవచ్చు. సహజసిద్ధంగా ఏర్పడి, సొరంగం బాగా వుండే ఈ దారి సుమారు 250 మీటర్ల పొడవుండి వంపులుగా వుంటుంది. గుహ అంచులో వేదిక లాగా వుండి, దానిపై శివలింగాకారంలో ఏర్పడిన ఒక శిల వుంది. దీన్ని సహజ శివలింగంగా పేర్కొంటారు. ఇక గుహ ఎడమభాగం కూడా కుడివైపు మాదిరిగానే సన్నగా, వంపులుగా వుండి సుమారు, 150 మీటర్ల పొడవుంటుంది. కాగా గుహల లోపలి భాగంలో వివిధ శిలాకృతులు ఎంతో విచిత్రంగా కనిపిస్తాయి.
సహజశిలాతోరణం
అక్కమహాదేవి గుహలవద్ద భూమికి సుమారు రెండువందల అడుగుల ఎత్తులో ఏర్పడిన సహజ శిలాతోరణం ఎంతో అద్భుతం. సుమారు 200 అడుగుల పొడవు, 16 అడుగుల వెడల్పు 4 అడుగుల మందంతో దీర్ఘ చతురస్రాకారంలో గల ఈ శిలాతోరణం, కింద ఎలాంటి ఆధారం లేకుండా కాంటిలివర్‌ బీమ్‌ వుంది. మన దేశంలోని పెద్ద శిలాతోరణాలలో దీన్ని ఒకటిగా చెప్పవచ్చు. అయితే దీని ఉనికి చాలా మందికి తెలియని కారణంగా యిది ప్రాచుర్యంలోకి రాలేదు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పాతాళగంగ మెట్ల నుండి అక్క మహాదేవి గుహల వరకు బోటు సదుపాయాన్ని కల్పించింది. ఎంతో ప్రత్యేకంగా కన్పించే అక్క మహాదేవి గుహలు, అరుదైన అక్కడి శిలాతోరణం, దేశ, విదేశీ పర్యాటకులను బాగా ఆకట్టుకుంటాయని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తికాదు.
కదళీవనం
అక్క మహాదేవి గుహలకు యించుమించు ఎదురుగా రెండవ ఒడ్డున వున్న కదళీవన రేవు నుండి కొండలనెక్కుతూ సుమారు 11 కి.మీ. ప్రయాణించి కదళీవనాన్ని చేరుకోవచ్చు. కదళీవనంలో సహజసిద్ధంగా ఏర్పడిన శిలామండపం చూపరులను సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తుతుంది. కొండ నుండి సహజసిద్ధంగా ముందుకు వచ్చిన ఒక పెద్ద శిల, కింద ఎలాంటి ఆధారం లేకుండా పైకప్పులాగా వుండి మండపం లాగా ఏర్పడింది. దాదాపు 100 మీ. పొడవు 25 మీ. వెడల్పు వున్న ఈ సహజ మండపం సుమారు వేయి మంది ఒకసారి కూర్చొనేందుకు వీలుగా వుంది. ఈ శిలామండపం అంతర్భాగమంతా గుహను పోలి వుంటుంది. మండపం పైకప్పు నుండి అక్కడక్కడ సన్నటి నీటిబొట్లు రాలిపడుతుంటాయి. మండుటెండల్లో కూడా ఈ శిలా మండపం కింద చెప్పలేనంత చల్లగా వుంటుంది. ఈ శిలామండపం పక్కనే నిరంతరం ఉబికివచ్చే నీటి ఊట చూపరులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ కదళీవనం పర్యాటకులకు గొప్ప అనుభూతిని కలిగించడమే కాకుండా, వారు మరో ప్రపంచంలో వున్న భావనను కలిగింపచేస్తుంది.
వైల్డ్‌ లైఫ్‌ టూరిజం
'నాగార్జునసాగర్‌-శ్రీశైలం' ప్రాజెక్ట్‌ టైగర్‌గా గుర్తించబడ్డ అభయారణ్యంలో శ్రీశైలం అటవీప్రాంతం వుండటం చేత వైల్డ్‌లైఫ్‌ టూరిజానికి యిక్కడ మంచి అవకాశాలున్నాయి. ఈ పులుల అభయారణ్యం సుమారు 3,568 చ.కి.మీ. విస్తీర్ణంలో గుంటూరు, ప్రకాశం, కర్నూలు, మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాలలో విస్తరించివుంది. కృష్ణానదికి అటూ యిటూ వున్న ఈ వన్యప్రాణి సంరక్షణాలయంలో పులి, చిరుతపులి, ఎలుగుబంటి, పెద్దనక్క, చిన్ననక్క, కణితి, చుక్కలదుప్పి, నాలుగు కొమ్ముల దుప్పి, చిన్న దుప్పి, బొర్ర జింకలు ముంగిస, 150 రకాలకు పైగా కీటకాలు, పలురకాల పక్షులు వున్నాయి.
_______________________________________________________

6. చుట్టేద్దాం ... మూడు రాష్ట్రాల సరిహద్దులు

దసరా సెలవులు! అంటే ఫ్యామిలీ ట్రిప్‌! ఆలోచన రాగానే ఎక్కడికెళ్లాలి, ఎప్పుడెళ్లాలి, ఎన్ని రోజులెళ్లాలి... అనే ప్రశ్నలే అందరిలోనూ! పోయినసారి కర్నాటకలోని కూర్గ్‌ పరిసరాలు, శృంగేరీ, జోగ్‌ ఫాల్స్‌, బేలూరు, హలిబీడు తిరగ్గా... అటుపక్కకు బందిపూర్‌ అడవులు మిగిలాయి. వాటి పక్కగా తమిళనాడు ముదుమలై అడవులు వుండనే వున్నాయి. వాటికి సమీపంలో కేరళలోని కుమర్‌కోమ్‌, తేక్కెడి, మున్నార్‌ చూడగా మిగిలిన వయనాడ్‌ జిల్లా వుంది. కోయంబత్తూరును వారధిగా చేసుకుంటే దానిపక్కనే వున్న కర్మడాయి అడవులను కవర్‌ చేయొచ్చు. మధ్యేమార్గంగా టారుట్రైన్‌లో మమ్మల్ని తిప్పాలన్న ప్రతాపన్నయ్య ఆలోచన సాయంతో ఊటీని చుట్టేయొచ్చు. యేతావాతా చెప్పొచ్చేదేమిటంటే మేం తిరగబోయేదంతా నీలగిరి బయోస్పియర్‌లోని ఒక భాగం!
మీకిప్పటికే అర్థమై వుంటుంది. ఈ ట్రిప్‌లో ప్రకృతి తప్ప మరో ఆలోచన లేదని! అవును! కాలుష్యభరిత కాంక్రీట్‌ జంగిల్‌లో ఇగిరిపోయిన జీవితేచ్ఛ తిరిగి ఉద్భవించాలన్నా... గుండె గూటిలో తిరిగి మంచుపుష్పాలు విరియాలన్నా ప్రకృతిని మించిన 'శక్తి' మరోటి లేదు. ఇదికాక బిజీ బిజీ రొటీన్‌ లైఫ్‌నుండి అందరం తప్పుకోవాలి. కుటుంబమంతా పదిరోజులు కలిసి హాయిగా గడపాలన్న తిరుగులేని బలమైన ఆలోచన... వెరసి మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో మా జాలీ టూర్‌!ఇలా అనుకున్నాక అందుకుతగ్గ ఏర్పాట్లు మొదలైపోయాయి. ప్రథమ కర్తవ్యంగా ట్రైన్‌ టికెట్ల బుకింగ్‌ అయిపోయింది. కోయంబత్తూరులో దిగిన దగ్గర్నుంచీ తిరిగి రైలెక్కేదాకా వెహికల్‌ ఏర్పాటైపోయింది. ఇక అనుకున్న ప్రాంతాల్లో చూడదగ్గవి ఏంటీ, ఎలా కవర్‌ చేయొచ్చు, ఎక్కడ వుండాలి... ఇలాంటి ప్లానింగ్‌ అంతా ఈశ్వర్‌ భుజస్కందాలమీదే! చిన్న చిన్న సూచనలు మాత్రమే మావి! ఎక్కడికక్కడ హోటల్‌ బుకింగ్స్‌ పూర్తయ్యాయి. లిస్ట్‌ రాసుకుని... పేపర్‌ ప్లేట్లు, చాకు, ఉప్పుతో సహా అవసరమైనవన్నీ ప్యాక్‌ చేసేసుకున్నాం. మీ పనులన్నీ టెన్షన్‌లేకుండా పూర్తి చేసుకోండన్న అత్తయ్య తినుబండారాల తయారీని తన నెత్తికెత్తుకున్నారు. పిల్లలు వారికి కావలసిన స్టోరీ బుక్స్‌, చాకొలెట్స్‌ తమ ట్రావెల్‌ బ్యాగ్స్‌లో సర్దుకుంటే... మీరెక్కడికి తీసుకెళ్లినా చాలు, మీతో వుండటమే మాకు ముఖ్యం అనుకున్న మామయ్య నిశ్చింతగా వున్నారు.
శ్రీనుబావవాళ్లు అనుకోకుండా డ్రాప్‌ అవడంతో వారి టికెట్లు కేన్సిల్‌ చేశాం. ముంబయినుంచి వచ్చిన హర్షతో కలిపి మేం మొత్తం తొమ్మిదిమందిమయ్యాం. మొత్తానికి నెలరోజుల ముందునుంచి చేసుకున్న ఏర్పాట్లు ఓ కొలిక్కొచ్చాయి. వారం ముందునుంచే బ్యాగేజ్‌ సర్దుకుని ఎనిమిదో తారీఖు ఎప్పుడెప్పుడు వస్తుందాని ఎదురుచూపులు సారించాం. ఎట్టకేలకు వెళ్లే రోజు విచ్చేసింది. మా అందరికీ నవ వసంతం వచ్చేసింది.సాయంత్రం ఆరింటికల్లా అందరం స్టేషన్‌కు చేరాం. అనుకున్న సమయానికే రైలొచ్చింది. ఎక్కి సామాను సర్దుకుని సెటిలయ్యాం. తరువాత వెజిటబుల్‌ బిర్యానీ, కర్డ్‌ రైస్‌ ఆరగించి నిద్రలోకి జారుకున్నాం. విజయవాడలో అత్తయ్య, మామయ్య రైలెక్కారు. పొద్దున్న మద్రాసులో మరో రైలెక్కి తెచ్చుకున్న పులిహోర తిన్నాం. రాత్రి తొమ్మిదికి కోయంబత్తూరుకు చేరాం. వెంటనే హోటల్‌ చేరి స్నానాలు కానిచ్చి భోజనానికి వెళ్లేసరికి హోటళ్లన్నీ మూసేశారు. మా దగ్గరున్న పులిహోర, బ్రెడ్‌, జామ్‌ తిని పడుకున్నాం.
పొద్దున్నే 15 సీట్ల వెహికల్‌తో డ్రైవర్‌ రాజు రెడీ! అతనికి తమిళం, మళయాళం సూపర్‌గా వచ్చు. ఇంగ్లీషు 'యస్‌, నో, ఆల్‌రైట్‌' వరకూ వచ్చు. ముక్కలు ముక్కలుగా తమిళం, ఇంగ్లీషు భాషల సాయం తీసుకుని ముప్పుతిప్పలు పడి టూర్‌ ప్లానింగ్‌ మొత్తానికి విశదీకరించగల్గాం. ప్రస్తుతానికి కోయంబత్తూరు సమీపానున్న కర్మడాయి అడవులకు తీసుకెళ్లమన్నాం. దారిలో మిరియాల పొంగల్‌ లాగించేశాం. దుమ్ముతో నిండిన కోయంబత్తూరు దాటి కర్మడాయిలోకి అడుగుపెట్టాం.
అడవితల్లి ఒక్కసారిగా బిడ్డను ఆప్యాయంగా హత్తుకున్న ఉద్విగత. అది మాటలకు అందనిది! భాషకు చిక్కనిది. అదో అనిర్వచనీయ అనుభూతి! ఆ కొండలు, అడవులు, వెనవేల సంఖ్యలో వృక్షాలు... దారంతా విరబూసిన అడవిపూలు వ్యాపింపచేసే పరిమళాలు... మంద్రంగా స్పృశించే చల్లని పవనాలు... రంగురంగుల సీతాకోకచిలుకల స్వాగత నృత్యాలు... పేరు తెలియని పక్షుల బృందగానాలు... అన్నీ ఏకమొత్తంగా ఆహ్వానిస్తోంటే మూగబోవడం మా వంతైంది. ప్రకృతికాంత నడుముచుట్టూ పెనవేసుకున్న వాల్జెడలా సాగుతున్న సన్నటి మార్గంలో వెళ్తూ మంత్రముగ్థలవడమే మేము చేసిన పని! ఇది నిజమేనా! ఇలాంటి ప్రపంచం కూడా వుందా? దుమ్మూ ధూళికి దూరంగా మనదైన ఈ భూలోకంలో ఇంకా చోటు మిగిలే వుందా అనే సంభ్రమం! ఇంతకు ముందు ఇక్కడికి రాలేకపోయామనే పశ్చాత్తాపం... ఇప్పటికైనా వచ్చామనే తన్మయత్వం... ఈ అనుభూతులన్నీ కర్మడాయిలోని పిల్లూరు డ్యామ్‌ చేరుకునేసరికి శిఖరానికంటాయి.
కర్మడాయి అడవుల ప్రోగ్రామ్‌ ముందే బుక్‌ చేసుకున్నాం. ఈ బుకింగ్‌ కేవలం వారం రోజుల ముందే చేసుకోవాలి. ప్రోగ్రామ్‌ రోజంతా. ఒక్కొక్కరికీ మూడొందలు. అదీ శనివారం, ఆదివారం మాత్రమే! అక్కడంతా ఆదివాసీలే వుంటారు. ఏర్పాట్లన్నీ వారివే. ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ చొరవతో ఆదివాసీలకు ఏర్పడ్డ జీవనాధారం అది! మేం చేరుకునే వేళకు అక్కడెవ్వరూ లేరు. ఉయ్యాలలైతే కనిపించాయి.
వెంటనే వాటినెక్కి ఊగులాడటం ప్రారంభించాం. మెల్లగా ఆదివాసీలొచ్చి కుర్చీలేశారు. కూర్చోగానే 'చుక్క కాపీ' అంటూ శొంఠి, బెల్లం కలిపిన పాలు వేయని డికాక్షిన్‌ కాఫీ ఇచ్చారు. తాగాక 'పుట్టి'లో బోటింగ్‌ వెళ్దామన్నారు. రెండు పుట్టిల్లో బయల్దేరాం. అది భవానీ నది. కొండల్లో పుట్టి ప్రవహిస్తున్న దానికి పిల్లూరు డ్యామ్‌ కట్టారు. దాంతో కొండల మధ్య మెలికలు తిరుగుతూ అదో పెద్ద జలాశయంలా మారింది. వీశమెత్తయినా చెత్తలేని, ముఖ్యంగా ప్లాస్టిక్‌ కనిపించని, స్వచ్ఛమైన నీరు నిండిన ఆ విహారం జలవిహారం మాత్రమే కాదు, వనవిహారం కూడా! వివరించలేని అలౌకిక భావనలో అన్నీ మరిచిపోయి లీనమైపోవడం తప్ప మరేమీ గుర్తుకురాలేదు. కనీసం మాటలు కూడా లేవు. ఈ చల్లని గాలి, ఈ ప్రశాంత పయనం, ఈ అడవిపూల గుభాళింపు ఈ జన్మకిది చాలు అన్నంత నిశ్చింత. ఎన్ని కోట్లిచ్చినా ఈ అనుభవం సొంతం కాదనే నిండైన సంతృప్తి. 'గుండెలనిండా ఈ గాలి పీల్చుకోండి. మళ్లీ కావాలన్నా మనకు దొరకదు' అంటున్న ఈశ్వర్‌ను మేమంతా ఫాలో అయిపోయాం.
మధ్యలో పుట్టి ప్రయాణానికి బ్రేక్‌. వెంట తెచ్చుకున్న స్నాక్స్‌ తింటూ ఆదివాసీలకూ ఇచ్చాం. తిరిగి పుట్టిలో ఊహల ఊయలలూగాం. అలా మూడు గంటలు 'ఆకులో ఆకునై... కొమ్మలో కొమ్మనై' మైమరచిపోయాక ఎక్కిన చోటికి చేరాం. 
ఒక పావుగంట రిలాక్సయ్యేసరికి వాతావరణం మారిపోయింది. పదమూడు మంది ఆదివాసీ మహిళలు తర్ఫీదైన సైన్యంలా చకచకా ఏర్పాట్లు చేసేస్తున్నారు. స్వయంగా వండిన వంటకాలను టేబుల్స్‌పై వరుసగా సర్దేశారు. మేమంతా ప్లేట్లు పట్టుకుంటే వరుసగా వడ్డన ప్రారంభించారు. పరమాన్నం, సలాడ్‌, రోటీ, కర్రీ, వెజిటబుల్‌ బిర్యానీ, పెరుగుచట్నీ వడ్డించారు. అది తిన్నాక రాగి ముద్ద, చికెన్‌ కర్రీ... తరువాత పెరుగన్నం కడుపారా తిని చేయి కడుక్కుంటుండగా అరటిపండు... మృష్టాన్నభోజనం అంటే ఇదేనా?! అదీ అడవిబిడ్డల చేతులమీదుగా..! అందుకేనా దీనికింత కమ్మదనం! భుక్తాయాసం తీరాక మరికొందరు ఆదివాసీలు వచ్చి పదండి పదండి ట్రెక్కింగ్‌కెళ్దాం అన్నారు. అక్కడ యేరు వంపులు తిరుగుతూ... రాళ్ల మధ్యగా ఒరుసుకుంటూ వేగంగా ప్రవహిస్తోంది. ఆ నది ఒడ్డునే కొండ రాళ్ల మధ్య మా ట్రెక్కింగ్‌. దారంతా ఎగుడు దిగుళ్లు, రాళ్లు రప్పలూ, పెద్ద పెద్ద వేళ్లు... అయినా ఎక్కడా అలసట తెలీలేదు. పక్కన పరవళ్లు తొక్కుతున్న సెలయేటి సౌందర్యం, కుప్పపోసిన అటవీసౌందర్యం... అవి చెప్పే ఊసులు... పిల్లగాలుల గుసగుసలు ఆస్వాదించడమే సరిపోతే ఇక అలసటకు తావెక్కడీ! గంట గడిచాక చివరి మజిలీ చేరాం. అక్కడ ఏమంత పెద్ద లోతు లేదు. తీసుకువచ్చినవాళ్లు ఇక మీ ఇష్టం వచ్చినంతసేపు ఆడుకోమన్నారు. ఇక అందరికీ పట్టరానంత సంతోషం. అప్పటిదాకా నీళ్ల వద్దకు వెళ్లొద్దని మందలించిన అత్తయ్య, మామయ్య మరి కాదనలేదు.
అలా రెండుగంటలు నీటిలో మునిగీ తేలీ లోకాన్ని మరిచిపోయాం. వజ్రంలాంటి ఆ పరవళ్ల స్వచ్ఛతకూ, నీటి ఒరవడికీ సర్వం మరిచీ స్వాంతన చెందాం. ఇక లేవండి, చీకటిపడుతోంది... మెట్టుపాళయం చేరాలి అన్నాక మరి లేవలేక... ఆ ప్రాంతాన్ని విడువలేక ఒడ్డుకొచ్చాం. ఈ స్వాంతన, ఈ చల్లని స్పర్శ మళ్లీ దొరికేనా... వెళ్లక తప్పదా... ఇక్కడే వుండిపోరాదా... ఇలాగే ప్రశాంతంగా కాలం వెళ్లబుచ్చలేమా... ఇన్ని ఆశల మధ్య ఊగిసలాటే అందరిలోనూ!అన్నీ వదిలేసి ప్రకృతిలో కలిసిపోదామన్న వెర్రి ఆవేశం... సంపాదన, స్వార్థం, మరొకరిని అధిగమించాలనే ఆరాటం, అందుకోసం నిరంతరం పోరాటం... ఇవేమీ గుర్తురాని మైకం ఇక్కడే సాధ్యం! మాటల్లో చెప్పలేని సంతృప్తి! కర్మడాయి అడవుల అనుభవం మనసు పొరల్లో అలా ముద్రించుకుపోయింది. ఇక్కడ దొరికిన ఆత్మసంతృప్తి బతికినన్నాళ్లూ గుర్తుంటుంది. ఎందుకంటే, అక్కడ ఆకు, పువ్వు, పిట్ట, గుట్ట అన్నీ నిశ్శబ్దంగా వున్నాయి. స్వేచ్ఛగా వున్నాయి. ఆదివాసీలు అంతే స్వేచ్ఛగా, స్వచ్ఛంగా వున్నారు. నిజానికి వారే నాగరికులు! ప్రకృతి మనగలిగితేనే మన మనుగడ అన్నది గుర్తించారు. దాన్ని పదిలంగా కాపాడుకుంటున్నారు. ప్రతీదాన్ని 'మనీ మైండెడ్‌'తో కొలిచే ఏ టూరిజంవారి కన్నులూ ఇటు సోకకుండా వుంటే బాగుండు! ఈ చిక్కనైన అటవీసౌందర్యం ఆదివాసీల చేతిలోనే కలకాలం కొలువుంటే బాగుండు!
మా ఆలోచనలేమీ పట్టించుకోని వాహనం రాత్రికి మెట్టుపాళయంకు చేరింది. అక్కడ ఎనిమిది దాటితే భోజనం దొరకడం కష్టమే! అక్కడనే కాదు, ప్రతిచోటా అంతే! మొత్తానికి దొరికినదేదో తిని కడుపు నింపుకున్నాం. రోజంతా వనదేవత ఒడిలో ఆడుకుని అలసిసొలసి సొక్కిపోయామేమో... మాకు తెలీకుండానే క్షణాల్లో నిద్రాదేవత ఒడిలో వాలిపోయాం
______________________________________________________

7. గులాబి నగరం అందాలు ... నీలి నగరం చందాలు...

రాజస్థాన్‌ అనగానే మన మదిలో అద్భుతమైన రాజభవనాలు మెదులుతాయి. చిన్నప్పుడు చదువుకొన్న చరిత్ర పాఠాలు, రాజుల విజయగాథలు, రాజపుత్ర స్త్రీల సాహసకృత్యాలు గుర్తొస్తాయి. సూర్యకిరణాలకు పుత్తడిలా మెరిసిపోయే ఇసుకతెన్నెలు, లయబద్దంగా నడిచే ఎడారిఓడలు... పల్చగా మనోఫలకంపై కదలాడతాయి. నాటి రాజుల కళాభిరుచికి, శిల్పుల నైపుణ్యానికీ నిలువెత్తు సాక్ష్యాల్లా రాజభవనాలు దర్శనమిస్తాయి. అన్నిటిలోకి గులాబినగరం, నీలి నగరం సోయగాలు మర్చిపోతామా! అవేనండీ జైపూర్‌, జోధ్‌పూర్‌ పట్టణాలు. మరి ఒళ్లుగగుర్పొడిచే చరిత్రకు సాక్ష్యంగా నిల్చిన రాజస్థాన్‌ వెళ్లొద్దామా...
'భారతదేశ చరిత్రపట్ల, సంస్కృతిపట్ల మక్కువ ఎక్కువ' అని చెప్పేవారెవరైనా సరే రాజస్థాన్‌ అందాలు వీక్షించాల్సిందే. చరిత్రలో చదివిన రాజపుత్రవీరుల వీర చరితలకు నిదర్శనాలైన అక్కడి కోటలు, కట్టడాల అందాలను ఆస్వాదించాల్సిందే.
గులాబి నగరం
జైపూర్‌ గులాబి నగరంగా పేరొందింది. అదేనండీ 'పింక్‌ సిటీ'. ఇది మన దేశంలోకల్లా అత్యంత అందమైన నగరాల్లో ఒకటి. పర్యాటకులను ప్రధానంగా ఆకర్షించేది 'సిటీ ప్యాలెస్‌'. ఆకాశాన్నంటే రాజభవనాలను చూస్తుంటే కనురెప్ప వేయడం కూడా మర్చిపోతాం. నాటి రాజుల దర్పానికి నిలువెత్తు నిదర్శనాలివి. వాటి అందాలను నోటితో వర్ణించడమంటే పెద్ద సాహసమే. చూసి తీరాల్సిందే.
ఇక్కడ హెరిటేజ్‌ హోటళ్లూ, పార్కులూ, ఉద్యానవనాలూ చాలా కనిపిస్తాయి. ఈ ఆధునిక యుగంలో అడుగడుగునా సంప్రదాయం తొంగిచూస్తుంటుంది. అలాగని ఆధునికతను అడ్డుకుంటుందని కాదు. దానికీ ఆహ్వానం పలుకుతూనే వుంటుంది. ఇప్పటికీ గుర్రపు బగ్గీలూ, ఒంటె సవారీలూ దర్శనమిస్తుంటాయి. అయితే రయ్యిమని దూసుకెళ్లే వాహనాల పక్కనుంచి వీటిమీద ప్రయాణం చేయాలంటే కూసింత సిగ్గుపడే వారూ వుంటారనుకోండి. అయితే జైపూర్‌ వెళ్లినవారు మాత్రం తప్పనిసరిగా ఒక్కసారైనా వీటిమీదెక్కి వీధుల్లో ప్రయాణించాల్సిందే. అదో అనిర్వచనీయమైన అనుభూతి మరి. చేజేతులారా వదులుకుంటామా చెప్పండి. అయితే ఒంటెమీద ఎక్కి కూర్చుని మహారాజాల్లా ఫీలయిపోయే వారూ మనకు కనిపిస్తుంటారు. 
అలా మెల్లగా వీధిలో వెళుతూ... రాజస్థానీ ప్రజలను చూస్తుంటే వుంటుందీ! నిజంగా రాజులకాలం నాటికి వెళ్లిపోతాం. ముఖ్యంగా రాజస్థానీ మహిళలు ! చేతి గాజులు మొదలుకొని, మెడలో ఆభరణాలు, వస్త్రాల వరకు అన్నీ తమ ప్రాంతీయ సంప్రదాయానికి ప్రతీకలుగా అలంకరించుకొంటారు. కళ్లు చెదిరిపోయే రంగు బట్టలు ధరించడమంటే వీరికి అమిత ఇష్టం. పురుషులూ తక్కువ కాదు. రంగురంగుల వస్త్రాలతో తలపాగాలు చుట్టుకొని మీసాలు మెలేస్తూ భలే స్టయిల్‌గా నడుస్తుంటారు. ఇక్కడ చూడాల్సిన మరో ముఖ్యమైనది మ్యూజియం. దీని ప్రవేశ ద్వారం వద్ద పాలరాతితో చేసిన రెండు పెద్ద ఏనుగులు పర్యాటకులకు స్వాగతం పలుకుతాయి. ఎంతో అపురూపమైన సంపదని ఈ మ్యూజియంలో భద్రపరిచారు. ఇందులోని నేలంతా పర్షియా, ఆఫ్ఘన్‌ కార్పెట్లతో నిండిపోయి ఉంటుంది. ఇక గోడలు అద్భుతమైన చిత్ర కళతో కళకళలాడుతుంటాయి. ఆనాటి రాజకుటుంబీకులు ధరించిన అనేక రకాలైన దుస్తులను ఇక్కడ చూడొచ్చు.
సిటీ ప్యాలెస్‌ సొగసులు...
సిటీప్యాలెస్‌ లోపలంతా తిరిగి చూస్తుంటే ఎటు వెళ్తున్నామో తెలియదు. ఓ పెద్ద పజిల్‌ లాగా ఉంటుందీ కోట. అప్పట్లో శత్రువుల దాడిని ఎదుర్కోడానికి ఇలా నిర్మించారు కాబోలు. దీని నిర్మాణంలో మొఘలుల శైలి ప్రతిబింబిస్తుంది. ఇది ఏడంతస్తుల నిర్మాణం. ఈ కోటలోని కిటికీలు, పెద్ద పెద్ద తలుపులు... వాటిపై చెక్కిన చిత్ర కళను చూస్తే 'ఎంతటి చేయి తిరిగిన శిల్పి చేశాడీ మాయ' అని అనిపించక మానదు. ఈ కోటలో ముఖ్యమైనది చంద్ర మహల్‌. ఇందులోనే రాజ కుటుంబం నివసించింది. ఈ మహల్‌ గోడలపై మహరాజా ప్రతాప్‌ జీవిత ఫట్టాలు చిత్రించారు. ఇవే కాకుండా అతను ఉపయోగించిన మార్బుల్‌ సింహాసనం, యుద్ధంలో ఉపయోగించిన ఆయుధాలు, అతని గుర్రం ధరించిన కవచం కూడా ఈ చిత్రాల్లో ఉన్నాయి.
కోట పై భాగానికి వెళ్లి నగరాన్ని చూస్తే చాలు... ఎంత అద్భుతమైన నగరమిది అని అనిపించక మానదు. చుట్టూ కనుచూపు మేరలో ఎక్కడ చూసినా గులాబీ రేకలు పరిచినట్లు కనిపిస్తుంది. ఇక్కడి భవనాలన్నీ గులాబీ రంగులోనే ఉన్నాయి. స్థానికులు దీనికి ఒక కథ చెప్తారు. జైపూర్‌ నగరాన్ని 17 శతాబ్దంలో నిర్మించారు. ఈ నగరాన్ని నిర్మించింది బెంగాల్‌కు చెందిన విద్యాధర భట్టాచార్య. అప్పట్లో ధనికులు తమ భవనాలు అందంగా కనిపించాలని, ఎంతో ఖరీదైన గులాబీ రంగు రాళ్లతో నిరించారు. వేల్స్‌ రాజైన ఏడవ ఎడ్వర్డు జైపూర్‌ను దర్శించుకుందామని వచ్చాడు. అక్కడ అతనికి గులాబీ రంగులోని భవనాలు ఎంతగానో ఆకర్షించాయి. నగరం మొత్తం ఇదే రంగులో ఉంటే ఎంత బాగుంటుందో అని అనిపించింది. వెంటనే అన్ని భవనాలకూ గులాబీ రంగు వేయాలని ఆజ్ఞాపించాడు. అప్పటి నుండి అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు అక్కడి ప్రజలు. ఇప్పటికీ ఈ పద్ధతి అమల్లోనే ఉంది. ఇక్కడ ఎండలు ఎక్కువ కాబట్టి ఈనగరాన్ని 'సన్‌ సిటీ' అని కూడా అంటారు. ఈ కోటకు కిలో మీటరు దూరంలో జస్వంత్‌ తాడా ఉంది. ఇక్కడే రాజుల సమాధులు కట్టారు. ఇవన్నీ ఎంతో పలుచగా ఉన్న చలువరాయితో నిర్మించారు. ఇందులో అన్నింటికంటే పెద్దది రాణా సమాధి.
ప్యాలెస్‌ ఆఫ్‌ విండ్ప్‌

దీన్నే హవామహల్‌ అనికూడా పిలుస్తారు. 18వ శతాబ్దం ఆరంభంలో దీని నిర్మాణం జరిగింది. దీన్ని కూడా గులాబీ రంగు రాళ్లతోనే నిర్మించారు. సూర్యకాంతిలో గులాబీల పరదా కప్పుకున్నట్లున్న ఈ మహల్‌ను చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. ఈ మహల్లో మొత్తం 593 కిటికీలున్నాయి. ఈ కిటికీల్లో నుండే ఆనాటి రాణివాసపు స్త్రీలు వీధుల్లో జరిగే ఉత్సవాలను, ఊరేగింపులను తిలకించేవారు. అందుకు అనువుగా దీన్ని అయిదంతస్తులుగా నిర్మించారు. ఇందులో ఎంతో విశాలంగా ఆర్చీలతో తీర్చిదిద్దిన బాల్కనీలు చూడముచ్చటగా వుంటాయి.
హవామహల్‌ సిటీ ప్యాలెస్‌ పశ్చిమాన ఉంటే, ఈశాన్య దిక్కున నహర్‌ ఘర్‌ కోట ఉంది. దీన్ని 17వ శతాబ్దంలో రెండో జైసింగ్‌ తన రాణుల కోసం నిర్మించాడు. ఇందులో భవనం మధ్యభాగం నుండి వర్తులాకారంలో గదులను నిర్మించారు.

ఇక్కడ రాజప్రాసాదాలే కాదు, ప్రకృతి దృశ్యాలూ అత్యద్భుతంగా ఉంటాయి. దేవాలయాలమీది శిల్ప కళ చూపరులను మంత్ర ముగ్దులను చేస్తుంది. రెండున్నర శతాబ్దాల క్రితం కట్టిన దేవాలయాల్లో సూర్య దేవాలయం ఒకటి. దీనికి దగ్గరల్లోనే రాతి ట్యాంకుల్లోని నీటినే సందర్శకులు తాగడానికి ఉపయోగిస్తారు. జైపూర్‌ బంగారు ఆభరాణాలకు, జాతి రాళ్లకు, ఎనామిల్‌ పెయింట్‌కు పెట్టింది పేరు. ట్రిపోలియా బజార్‌ లో అలంకరణ వస్తువులు, రాజస్థానీ దుస్తులు, ఒంటె చర్మంతో తయారు చేసిన చెప్పులు, ఆకర్షించే పాలరాతి బొమ్మలు సందర్శకులను ఇట్టే ఆకట్టుకుంటాయి.
నీలి నగరం

జైపూర్‌ తర్వాత చూడాల్సిన మరో ముఖ్యమైన ప్రదేశం జోధ్‌పూర్‌లోని ఉమెద్‌ భవన్‌ ప్యాలెస్‌. ఇక్కడి ఇళ్లన్నీ నీలిరంగుతో మెరిసిపోతుంటాయి. ఈ నగరాన్ని ఒక్కసారిగా చూస్తే... ఆకాశం దుప్పటిలా కప్పేసిందా అన్నట్లుంటుంది. దీన్ని ఉమెద్‌ సింగ్‌ 19వ శతాబ్దంలో నిర్మించాడు. ఈ ప్యాలెస్‌ను కట్టడానికి 14 సంవత్సరాలు పట్టిందట. సుమారు 26 ఎకరాల విస్తీర్ణంలో 347 పడక గదులతో దీన్ని నిర్మించారు. దీని ఎత్తు 105 అడుగులు. ఏ సమయంలోనైనా సూర్యకాంతి లోపలికి ప్రసరించేందుకు వీలుగా దీనికి అద్దాలను ఏర్పాటు చేశారు. జోధ్‌పూర్‌లో కరువు పరిస్థితులు ఎదురైనప్పుడు, ప్రజలకు ఉపాధి కల్పించడానికి దీని నిర్మాణం చేపట్టారని చెపుతారు.
ప్రస్తుతం దీన్ని మూడు భాగాలుగా చేశారు. ఒక విభాగం రాజుగారి నివాసం. రెండో విభాగంలో మ్యూజియం ఏర్పాటు చేశారు. ఇందులో రాజు, రాణి ధరించిన వస్త్రాలు, ఆభరణాలు, రాజు వేసిన చిత్రాలు, రామాయణ చిత్రాలను ఇందులో చూడొచ్చు. మూడో భాగం హోటల్‌. రాజభరణాలు రద్దు కావడంతో రాజులు ఈ భవనాన్ని హోటల్‌కు లీజుకిచ్చారు. అది 1975లో జరిగింది. రాజులు, రాణులు కదలాడిన ప్రదేశంలో, కోటలో అడుగెట్టాక మనం కూడా ఎక్కడికో వెళ్లిపోయినా ఆశ్చర్యంలేదు.
ఒకక్షణం ఊహల్లోకి ... మరుక్షణం వాస్తవంలోకి వచ్చేస్తుంటాం. మన కాళ్లు మనకు తెలీకుండానే ముందుకు కదులుతుంటాయి. కళ్ల ద్వారా అక్కడి ప్రతి అణువును, వస్తువును మనసులో ముద్రించుకుంటుంటాం. రాజుల శౌర్యానికి, కళాతృష్ణకు సాక్ష్యంగా నిలిచిన కట్టడాలను, వస్తువులను మనసారా చూసి...వచ్చేస్తుంటే ఏదో తెలీని భావం మనసులో నెలకొంటుంది. తిరిగి మన లోకంలోకి వచ్చిన భావన కలుగుతుంది.
_____________________________________________________

8. అతి సుందర నగరం కోపెన్‌ హాగెన్‌

వందలాది ద్వీప సముదాయం మధ్య వెలసిన సుందర నగరమిది. పాలు, పన్నీరు, వెన్న, సముద్ర ఉత్పత్తులకు పేరుగాంచిన నగరమిది. ప్రముఖ ఓడరేవు పట్టణంగా గుర్తింపు పొందింది. అటు ఆధునిక ... ఇటు చారిత్రక సాంప్రదాయాల మేలు కలయికకు పెట్టింది పేరు. ప్రతి సంవత్సరం కొంగొత్త ప్రాంతాలను తప్పక వీక్షించే పర్యాటకుల పాలిట వర ప్రసాదం. అదే కోపెన్‌హాగెన్‌. మరి ఉల్లాసాన్ని... ఉత్సాహాన్ని... ఆహ్లాదాన్ని అందించే ఆ నగర విశేషాలేంటో చూద్దామా...
ప్రపంచంలోకెల్లా ఆధునిక సౌకర్యాలు ఉన్న నగరం ఏదంటే తడుముకోకుండా చెప్పేది ఒక్కటే పేరు. ఇక్కడ ఆధునికతే కాదు సంప్రదాయాలకూ కొదవలేదు. అదే కోపెన్‌ హాగెన్‌. విలాసవంతమైన రెస్టారెంట్లు, నివాస గృహాలు... అంతేకాదు ఇక్కడి ప్రజలకి కాలుష్యమంటే ఏంటో కూడా తెలీదు. ప్రశాంత వాతావరణం, చుట్టూ పచ్చిక బయళ్లు, చల్లటి పిల్లగాలికి అలా... నడుస్తూ వెళ్తుంటే ఎంత బావుంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అబ్బ వెంటనే అక్కడికి వెళ్లి విహరించాలనిపిస్తుంది కదా... అలాంటి వాతావరణంలో ఉంటే అనారోగ్యాలు, బాధలు దరిచేరవేమో అనిపిస్తుంది. అంత చక్కటి... చల్లటి... వాతావరణం కోపెన్‌ హాగెన్‌ నగరం సొంతం. కోపెన్‌ హాగెన్‌ నగరం ఉత్తర యూరప్‌లోని బాల్టిక్‌ సముద్రం మధ్య ఉంది. ఇది డెన్మార్క్‌ రాజధానిగా వుంది. ఈ నగరాన్ని 11వ శతాబ్దంలో బిషప్‌ ఓప్‌లర్‌ నిర్మించారు. ఇతని స్మారక చిహ్నం ఇప్పటికీ మనం చూడొచ్చు. ఈ నగరం పాల ఉత్పత్తులకు, సముద్ర ఉత్పత్తులకు ప్రసిద్ధి.
నేషనల్‌ గ్యాలరీ

పర్యాటకులను ఆకర్షించే వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగినది నేషనల్‌ గ్యాలరీ. దీన్ని బైజెంటాయిన్‌ వాస్తుశైలిలో నిర్మించారు. ప్రాచీన డానిష్‌ చరిత్రను తెలిపే చిత్రాలెన్నింటినో ఇక్కడ చిత్రించారు. ఇంకా ప్రాచీన సంస్కృతికి సంబంధించిన ఆనాటి వస్తువులు, కళాకృతులను ఇక్కడ చూడొచ్చు. 1807 వ సంవత్సరంలో ప్రారంభించిన స్టేట్‌ మ్యూజియంలో పిల్లల కోసం ఒక ప్రత్యేక విభాగం ఉంది. అందులోని మధ్యయుగం నాటి కోటలో నడయాడడం, పురాతన వైకింగ్‌ షిప్‌లో విహరించడం, 19 శతాబ్దపు చివరి కాలంలోని తరగతి గదుల్లో కూర్చుని చదువుకోవడం... వంటివి పిల్లలు ఎంతగానో ఇష్టపడతారు. ఇక్కడి వస్తువులన్నీ పిల్లల్ని ఆ రోజుల్లోకి తీసుకెళ్తాయి.
టివోలీ గార్డెన్‌

ఎంతో విశాలమైన పార్క్‌ ఇక్కడుంది. దీనికి ప్రపంచంలోనే ఆహ్లాదకరమైనదిగా గొప్ప పేరుంది. దీన్ని 18 వ శతాబ్దంలో ఏర్పాటు చేశారు. తాత్కాలిక రాజు కార్స్‌పెంషన్‌ 17 ఎకరాల భూమిని ఈ పార్కు కోసం కేటాయించాడు. దీన్ని చిన్న పిల్లలకే కాదు అన్ని వయసుల వారికీ నచ్చే విధంగా ఏర్పాటు చేశారు. మోటర్‌తో ఏర్పాటు చేసిన రైలు పిల్లలకు ప్రత్యేకాకర్షణ. రాత్రి సమయంలో రంగు రంగుల విద్యుత్‌ దీపాల మధ్య దేదీప్యమానంగా వెలుగులు విరజిమ్ముతున్నప్పుడు ఈ పార్కును చూడడానికి రెండు కళ్లూ చాలవేమో అనిపిస్తుంది. ఇక్కడుంటే ఆకలి దప్పికలు తప్ప వేరేది గుర్తుకు రాదు. అంతగా ప్రకృతిలో లీనమైపోతాం. ఇక్కడ గడిపిన ప్రతిక్షణం జీవితాంతం గుర్తుండిపోతుంది.
స్ట్రోగేట్‌ షాపింగ్‌

నగరంలోని స్ట్రోగేట్‌ బజార్‌లో పర్యాటకులు షాపింగ్‌ చేయడానికి ఆసక్తి చూపుతారు. ఇక్కడి రోడ్లన్నీ చాలా పొడవుగా వుంటాయి. ఇందులోని ఒక రోడ్డు టౌన్‌హాల్‌ నుండి మ్యూజియం వరకు ఉంటుంది. దారి పక్కనే పాదచారులకు తినడానికి రెస్టారెంట్లు కూడా వున్నాయి. ఇక్కడ లభించని వస్తువంటూ ఉండదు. గుండు సూది మొదలు అన్ని రకాల వస్తువులూ దొరుకుతాయి. దుకాణాల ముందు రకరకాల డిస్‌ప్లే బోర్డులు కనిపిస్తాయి. క్రిస్‌మస్‌ పండుగ సమయంలో దుకాణాలను ప్రత్యేకంగా అలంకరిస్తారు. రాత్రిపూట విద్యుత్‌ దీపాలను చూసిన పర్యాటకులు మైమరిచిపోతారు.
ఆకర్షించే జలకన్య
కోపెన్‌ హాగెన్‌లో ఉన్న జలకన్య విగ్రహం చూడ్డానికి చిన్నగా ఉన్నా చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ విగ్రహం విచార వదనంలో ఉంటుంది. దీన్ని సముద్రం ఒడ్డున ఎత్తైన రాతిమీద ఏర్పాటు చేశారు. ఈ శిల్పం చెక్కడం వెనుక ఓ కథ ఉందని స్థానికులు చెబుతారు. 1909లో కార్ల్స్‌బర్గ్‌ బియర్‌ కంపెనీ యజమాని కుమారుడు కార్ల్‌ జేకబ్సన్‌ కోరిక మేరకు జలకన్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికొచ్చారు. ఇది ప్రసిద్ధ్ధ శిల్పి ఎడ్వర్డ్‌ ఎరిక్సన్‌ ప్రతిభకు చిహ్నంగా నిలుస్తుంది. ఎరిక్సన్‌ తన భార్యనే మోడల్‌గా పెట్టి ఈ శిల్పాన్ని చెక్కాడు. అయితే 1913లో అసంపూర్తిగానే ఈ విగ్రహాన్ని ఆపేశారు. ఎన్నోసార్లు దీన్ని పునర్నిర్మాణం తలపెట్టినా ఎప్పటికో గాని అది సఫలం కాలేదు. యూరోపియన్‌ యూనియన్‌లో టర్కీ దేశస్థుల విలీన సమయంలో జరిగిన తిరుగుబాటు దాడిలో ఈ విగ్రహం దెబ్బతిన్నది. దాంతో దీనికి బురఖా తొడిగారు.
ఆర్హస్‌ ... ఓడెన్స్‌...
ఇక్కడ చూడాల్సిన మరో రెండు ముఖ్య పట్టణాలు ఆర్హస్‌, ఓడెన్స్‌. డెన్మార్క్‌లో పెద్ద పట్టణాల్లో ఆర్హస్‌ ఒకటి. ఇక్కడ లడాకూ వైకింగ్‌ జాతీయులు నివసిస్తారు. వెయ్యి సంవత్సరాల క్రితం వీరు ఈ నగరానికి మూల స్థంభాల్లా వుండేవారు. ప్రస్తుతం వీరు తమ పూర్వీకులతో పోలిస్తే చాలా ఆధునికంగా, అందంగా కనిపిస్తారు. ఎంతో గౌరవ మర్యాదలతో పర్యాటకులకు తమ సహాయ సహకారాల్ని అందిస్తారు. అంతే కాకుండా ప్రస్తుతం ఎన్నో విద్యాలయాలతో ఈ నగరం వెలుగొందుతోంది. డెన్మార్క్‌ సాంస్కృతిక జీవనంలో ఈ నగరం ప్రముఖ పాత్ర పోషిస్తోంది.
సిటీహాల్‌
1940లో నిర్మించిన సిటీ హాల్‌ ముఖ్యమైన పర్యాటక స్థలంగా ఉంది. ఈ టవర్‌ పైకి వెళ్లడానికి 450 మెట్లు ఎక్కాల్సుంటుంది. దీని పైకెక్కి చూస్తే నగరమంతా కనిపిస్తుంది. ఇక్కడి మ్యూజియం ప్రపంచంలోకెల్లా ప్రసిద్ధి పొందింది. దీనిని దర్శిస్తే అక్కడి ప్రాచీనుల జీవన శైలి, ఆచార వ్యవహారాలు అర్ధమౌతాయి. పూర్వకాలంలో మహిళల వస్త్రధారణ, వారి వంట విధానం, ఇంటిపనులు చేసే పద్ధతి, ఇంటిని శుభ్రపరచుకొనే విధానం ఆశ్చర్యపరుస్తుంది.

ఓడెన్స్‌ నగరం
జనాభా దృష్ట్యా డెన్మార్క్‌లో మూడోస్థానంలో ఓడెన్స్‌ పట్టణం ఉంది. ఈ నగరం మొత్తం హెన్స్‌ క్రిస్టియన్‌ ఆండర్సన్‌ రాజు పర్యవేక్షణలోనే నిర్మితమైంది. నగరంలో ప్రతిచోటా అతని చిత్రాలు కనిపిస్తాయి. ఇతని జీవిత కాలం మొత్తం ఈ నగరంలోనే గడిచిందనడానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈయన జీవితం మొత్తం దారిద్య్రంలోనే గడిచింది. అది ఎలా ఉందంటే పేరుకు రాజు కానీ జీవితాంతం పూరి గుడిసెలోనే గడిపాడు. ఇప్పుడు ఆ ఇంటినే 'ఆండర్సన్‌ మ్యూజియం'గా మార్చారు. ఈయన చరిత్రను పిల్లలు ఇష్టంగా చదువుతారు. కొద్ది సంవత్సరాల క్రితమే మొదటి హెన్స్‌ క్రిస్టియన్‌ ఆండర్సన్‌ ద్విశతాబ్ది పుట్టినరోజు ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు కొందరు 'అంత గొప్ప వ్యక్తి పేరును వ్యాపారం కోసం వాడుకుంటున్నారు' అని తమ నిరసనను తెలియజేశారు.
ఆండర్సన్‌ మ్యూజియం

మంక్‌మోస్ట్రెడ్‌ రహదారిలో ఉన్న చిన్న గుడిసెలో హెన్స్‌ జన్మించాడు. అతని బాల్యమంతా ఆ ఇంట్లోనే గడిచింది. ప్రస్తుతం ఆ ఇంటిని ఆండర్సన్‌ మ్యూజియంగా మార్చేశారు. ఆయన తన ఆత్మకథలో రాసుకున్న వివరాల ప్రకారం వస్తుసముదాయాన్ని సేకరించి ఇక్కడ భద్రపరిచారు. ఆండర్సన్‌ పేపర్‌ కటింగ్‌ కళలో నిపుణుడని చాలా కొద్దిమందికే తెలుసు.
ఎప్పుడైతే బావుంటుంది?
డెన్మార్క్‌లో జూన్‌, జులై మాసాల్లో కనిష్ట ఉష్టోగ్రత 10-11 డిగ్రీల సెల్సియస్‌, గరిష్ట ఉష్ణోగ్రత 18-21 డిగ్రీల సెల్సియస్‌ వుంటుంది. మిగిలిన నెలల్లో ఇక్కడి వాతావరణం చాలా చల్లగా వుంటుంది. అప్పుడు హాయిగా...కోపెన్‌హాగెన్‌ చెక్కేయొచ్చన్నమాట.
____________________________________________________

9. చరిత్ర నిధి...ప్రకృతి సిరి...రాచకొండ

మూడు బైకులపై ముందుకు సాగిపోతున్న మేము నీరు నిండుగా పారుతున్న పిల్లకాలువ రావడంతో ఆగిపోయాం. చుట్టూ చూశాం. మూడు వైపులా ఆకుపచ్చ సంపదతో అలరారుతోన్న ఎత్తయిన కొండలు. నట్ట నడుమ.. వరిచేను, జొన్న చేను... వీటి మధ్యలో పశువుల మందలు.. ప్రకృతిని ఆస్వాదిస్తూ కొద్దిసేపటి వరకూ అలా ఉండిపోయాం.
'ఇక్కణ్ణుంచీ రాచకొండ కోట ప్రాంతం మొదలవుతుంది' అంటూనే బైకుతో కాలువను దాటుతూ దోవతీశాడు శ్రీనివాస్‌. మేమూ అనుసరించాం.
మూడు బైకులపై మొత్తం ఆరుగురమున్నాం. శ్రీకాంత్‌, అమర్‌ నేను ప్రజాశక్తిలో పని చేస్తున్నాం. నాలుగో సభ్యుడు అడ్వెంచర్‌ యాక్టివిటీ చేసే స్పోర్ట్స్‌పర్సన్‌ విజేశ్‌. అయిదో వ్యక్తి ప్రజాశక్తి మంచాల విలేకరి జోగు శ్రీనివాస్‌. ఆరో వ్యక్తి అదే ఊరికి చెందిన ఫ్రీలాన్స్‌ ఫొటోగ్రాఫర్‌ శ్రీనివాస్‌. ఇద్దరు శ్రీనివాస్‌లు ఉండడంతో ఇతన్ని మేం ఫొటో శ్రీను అని పిలిచాం.
ఔటింగ్‌ చేయడానికి ఏదైనా గుర్తుండిపోయే చోటు కోసం వెతుకుతున్న మాకు జోగు శ్రీనివాస్‌ ద్వారా రాచకొండ చారిత్రక ప్రాధాన్యత, అడ్వెంచర్‌ యాక్టివిటీకి గల అవకాశం గురించి తెలిసింది. మాకు కావలసింది ఇదే అనుకుని 'ఛలో రాచకొండ' అనుకున్నాం.
హైదరాబాద్‌ నుంచి విజయవాడ రహదారి నుంచయినా, శ్రీశైలం రహదారి నుండైనా దాదాపు 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఇక్కడికి రావడానికి బస్సులున్నాయి. అయినా థ్రిల్లింగ్‌గా ఉంటుందని బైకులపై వచ్చిన మా నలుగురితో మంచాల వద్ద జత కలిశారు జోగు శ్రీనివాస్‌, ఫొటోగ్రాఫర్‌ శ్రీనివాస్‌...
కాలువదాటి ముందుకెళ్లిన శ్రీనివాస్‌ను అనుసరించాం. కాలిబాట కూడా సరిగ్గాలేని దారి వెంట బైకులను స్లోగా నడిపిస్తూ ఓ గుట్ట మొదలుకు చేరుకున్నాం. బండ్లు అక్కడ పెట్టి లాక్‌ చేశాం. 'మనం ముందే చెప్పుకున్నట్లు మూడు గుట్టలతో కూడి ఉంటుంది రాచకొండ కోట. ఇది కచేరి కొండ. ఆ పక్కది నాగానాయుడి కొండ. ఇటు పక్కది రాచకొండ...' అని వాటివైపు చూపుతూ 'మూడూ ఒకదానితో ఒకటి కలిసి ఉన్నట్లే కనిపిస్తాయి. కానీ ఒక దాన్నుంచి మరోదానికి వెళ్లాలంటే పూర్తిగా కిందికి దిగి మరో గుట్టపైకి ఎక్కాల్సిందే తప్ప మరో దారి లేదు. ఈమూడిటినీ కలుపుతూ కోటగోడను వ్యూహాత్మకంగా రెండు వరుసల్లో నిర్మించడం దీని ప్రత్యేకత. ముందుగా రాచకొండను చూద్దాం. అప్పటికీ ఓపికుంటే వాటినీ చూద్దాం' అని చెబుతూ కొండపైకి అడుగులు వేసిన శ్రీనివాస్‌ను అనుసరించాం.
కొండపైకి వెళ్లేదారంతా చెట్లు నగరజీవితానికి అలవాటు పడ్డ మాకు నడవడం కష్టంగా ఉంది. అందరిలో నేనొక్కడినే నడి వయస్కుడిని. మిగతావారంతా కుర్రాళ్లే. 'బాబూ మీ అంత ఫాస్ట్‌గా నేను నడవలేను. మీరు స్లోగా నడవాలి' అన్న నా మాటలతో అందరూ ఆగి నన్ను ముందుకు పోనిచ్చి, నా వెనుకగా నడవడం ప్రారంభించారు. కొంచెం పైకి వెళ్లగానే ఏటవాలు కొండ, గుబురు పొదలు ఎదురయ్యాయి. దారి కనిపించలేదు. 'అయ్యో దారే లేదు...గా ఎలా?' అని ప్రశ్నించిన నాకు జవాబుగా వాటిమధ్య నుంచే వెళ్లాలి' అని చెప్పాడు శ్రీనివాస్‌. ఆ మాటలతో చెట్లపై పాములు అవీ ఉండొచ్చన్న ఆలోచన వచ్చి భయమేసి ఆగిపోయాను. నా పరిస్థితి గ్రహించిన విజేశ్‌ 'ఏం కాదు సార్‌...రండి..' అంటూనే పక్కనున్న చెట్టు కొమ్మ విరిచి, దానితో చెట్లకొమ్మలు జరుపుతూ ముందుకు సాగాడు.
'ఇక్కడ కాలుపెట్టండి... ఈ కొమ్మను పట్టుకోండి... జాగ్రత్త...'అంటూ చెబుతున్న వారి సూచనల మధ్య మూడునాలుగు నిమిషాల్లోనే ఆ ప్రాంతం దాటి పైకి వెళ్లాం. 'ఇలా ఉంటుందని తెలిస్తే కర్రో, కత్తో తెచ్చేవారం కదా!...' చెప్పలేదేం అన్నట్లు శ్రీనివాస్‌ వైపు చూశాను. 'చారిత్రక కొండ అంటే మీకు అర్థం కాలేదా? సార్‌...'అని నవ్వాడతను. మాట్లాడుకుంటూ నడుస్తూనే ఒక ద్వారం వంటి దాని వద్దకు చేరుకున్నాం. 'ఇది చూడ్డానికి ద్వారంలా ఉంది కానీ కాదు. శత్రువు ఇదే ద్వారమని భ్రమించేలా దీనిని కట్టారు' చెప్పాడు శ్రీనివాస్‌.
నిజమే.. గోడమధ్య గ్యాపు, పైన బండరాళ్లతో దర్వాజాలాగే కనిపిస్తున్న దాన్ని చూస్తూ లోపలకు వెళ్లాం. అదంతా బల్లపరుపు నేల. ముందుకు నడుస్తూ 'శ్రీనివాస్‌ ఈ కొండపైన జంతువులు, క్రూరమృగాలు ఏమైనా ఉంటాయా?'అని అడిగాను. 'క్రూరమృగాలేం లేవు కానీ కోతులు, కొండముచ్చులు, నక్కలుంటాయి. నెమళ్లు కూడా కనిపించాయి' అన్నాడు. 'ఏ నక్కో, కోతో ఎదురైతే మన పని అయిపోయినట్లే. ఎదుర్కోవడానికి మన దగ్గరేమీ ఆయుధాల్లేవు.. పారిపోవడం కూడా అంత ఈజీ కాదు... ఏం చేద్దాం?'అన్నాను.
విజేశ్‌ తన వీపునుంచి బ్యాగును తీసి అందులోని ఓ రోప్‌, వాటర్‌ బాటిల్‌, చిన్న సుత్తి వంటివి చూపుతూ 'ఇవి ఉన్నాయి కదా! మీరేం వర్రీ అవకండి...' అంటూ నాకు ధైర్యం కలిగించే ప్రయత్నం చేశాడు. 'కోతులేంజేస్తాయి సార్‌...మనని చూసి అవే జడుసుకుంటారు...'అంటూనే పక్కనున్న చెట్టుకొమ్మని విరిచాడు అమర్‌. 'నెమళ్లు మనం చప్పుడు చేస్తే పోతాయి...' అన్నాడు ఫొటో శ్రీను. ఆ మాటలతో 'అమర్‌, శ్రీకాంత్‌...! ఏదైనా జంతువెదురైతే రాయి విసిరో, కర్రతోనో బెదిరించకండి...ఇద్దరు శ్రీనివాస్‌లు చెప్పినట్లు చేయండి' అన్న నామాటలు వింటూనే 'ఏదైనా జంతువొస్తే మేమంతా వచ్చి మీ వెనకాలే నిలబడతాం. మీరే వాటిని పారదోలండి...'అంటూ అమర్‌ వేసిన సెటైర్‌తో అందరమూ నవ్వేశాం. నాలుగైదడుగులు వేయగానే సింహద్వారం ఎదురైంది.
దాని ముందు ఆగి వెనుకకు తిరిగిన శ్రీనివాస్‌ మమ్మల్ని చూస్తూ 'రాచకొండ దుర్గానికి ఇలాంటివే మొత్తం ఆరు సింహద్వారాలున్నాయి...' వాటి గురించి చెబుతోన్న అతని మాటలు వింటూనే ఆ ద్వారం నిర్మాణంలో వాడిన రాళ్లపై చెక్కిన నగిషీలు పరిశీలించాం. ద్వారం ముందు వైపు నుంచి వెనుక తలుపుల వరకూ దాదాపు ఆరడుగుల స్థలముంది. రెండు వైపులా అరుగులున్నాయి. మధ్యలో గుంతలు కనిపించాయి.
'నిధుల కోసం స్థానికులు తవ్విన గుంతలు' చెప్పాడు శ్రీనివాస్‌. ఆ మాటలు విన్న శ్రీకాంత్‌ నవ్వుతూ 'మనం కూడా తవ్వుదామా...!'అన్నాడు. 'నువ్వు తవ్వుతూ ఉండు, మేం పైకెళ్లొస్తాం. నిధులు దొరికితే మాకూ వాటా ఇవ్వండి' అన్న నామాటలతో నవ్వారంతా. 'ఇక్కడ సినిమా షూటింగ్‌ జరిగింది....'అని చెబుతూ దర్వాజ అవతలి వైపు అడుగులు వేసిన శ్రీనివాస్‌ను అనుసరించాం. సినిమా పేరు వినగానే శ్రీకాంత్‌ 'ఏసినిమా'అనడిగాడు. 'విరోధి. దాన్లో నక్సలైటును ఎన్‌కౌంటర్‌ చేసింది ఇక్కడే' అని దర్వాజా పైన చూపాడు. శ్రీకాంత్‌, అమర్‌ పైకెక్కి చూశారు. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్లాం. దారి సన్నగా ఏటవాలుగా ఉంది. బండలు, రాళ్ల పైన అడుగులు వేస్తూ 'బండలు నున్నగా ఉంటాయి...కాళ్లు జారతాయి' జాగ్రత్తలు చెప్పాడు శ్రీనివాస్‌. నెమ్మదిగా పైకెక్కాం. అక్కడో రాతి షెడ్డులాంటిది కనిపించింది. 'ఇది సభామంటపం సార్‌. ఇక్కడే కూర్చుని రాజోద్యోగులు, అధికారులు ప్రజలతో మాట్లాడేవారు. సమావేశాలు జరిపేవాడట. అందుకే ఈ గుట్టకు కచ్చేరి కొండ అనే పేరు వచ్చింది. దీని మధ్య నుంచి అండర్‌గ్రౌండ్‌, దాని నుంచి పక్కనున్న కొండలకూ, బయటకూ దారి ఉండేదంటారు...'అని చెప్పాడు.
అండర్‌గ్రౌండ్‌ ఉందీ అనడానికి ఆధారంగా మధ్యన పూడుకుపోయిన గుంత కనిపించింది. 'ఇక్కడ నుంచి మధ్యలో ఉన్న రాచకొండ, దానికవతలి వైపు నాగానాయుని కొండ కనిపిస్తుంది. దానిపైన రామాలయం, శివాలయాలుంటాయి. శివుని మందిరాలు ఎక్కువగా ఉన్నందునే దానికి ఆ పేరొచ్చింది' అన్నాడు శ్రీనివాస్‌. దానిపై కోటగోడ, అక్కడక్కడా ఇళ్ల వంటి శిథిలమైన నిర్మాణాలు కనిపించాయి. అటువేపు పది, పదిహేనడుగులు వేయగానే కొండఅంచు.. లోతైన అగాథం కనిపించింది. అది చూస్తూనే 'ఈ కచేరి కొండ ఎత్తు 600 అడుగులుంటుందట. అంటే మనం అంత ఎత్తులో ఉన్నాం. ఇక్కడనుంచీ కాలుగానీ జారిందంటే అంతే సంగతులు' అన్న శ్రీనివాస్‌ మాటలతో కొద్దిగా వెనక్కి జరిగాం. కుడివైపు దారి తీశాడు శ్రీనివాస్‌. ఓచోట రాతి మధ్యలోనే ఓ రెండు ఫీట్ల లోతున్న నీటిచెలమ కనిపించింది. 'ఇది ఏ కాలంలోనూ ఎండిపోదు...'అని చెబుతూ 'ఆరోజుల్లో దీన్నుంచే కాలువ ద్వారా నీరు సప్లై అయ్యేదట...' అని బండను తొలిచి చేసిన కాలువను చూపాడు.
దాన్ని చూశాక మా చర్చ రాజులు, కోటలు, ఆనాటి జీవితం, సామాజిక పరిస్థితులపైకి మళ్లింది.
'ఓరుగల్లు సామ్రాజ్యాన్నేలిన ప్రతాపరుద్రుడు, తన రాజ్య రక్షణ కోసం 77 దుర్గాలను నిర్మించాడు. రాచకొండ దుర్గాధిపతియైన రేచర్ల సింగమనాయకుడు ఆయనకు కుడిభుజంగా వ్యవహరించేవాడు. అయితే కాపానీడు చక్రవర్తి అయ్యాక తలెత్తిన విభేదాల కారణంగా సింగమనాయకుడు స్వతంత్ర రాజుగా ప్రకటించుకున్నాడు. దానితో అద్దంకి వేమారెడ్డి నాయకత్వంలో సైన్యాన్ని పంపాడు. వారితో జల్లపల్లి వద్ద తలపడ్డ సింగమనాయకుడు చనిపోగా, ఆయన కొడుకులు అనపోతా నాయకుడు, మాదానాయకుడు వేమారెడ్డిని వధించి విజయం సాధించారు. క్రీ.శ.1365 నుంచీ 1474 వరకూ ఈ రాచకొండ రాజధానిగా వీరు పాలన కొనసాగించారు.
ఈ రేచర్ల పద్మనాయకులు శత్రు దుర్భేద్యమైన కోటల నిర్మాణానికే కాకుండా శాస్త్ర సాహిత్యానికి, కళలకు కూడా చేయూతనిచ్చారని చెబుతారు. కవి, పండితుడైన సింగభూపాలుని కాలంలో ప్రతీయేటా పండితులు, సాహితీ కళాకారులతో సభలూ, సమావేశాలు, గోష్టులు, కళాప్రదర్శనలతో కూడిన వసంతోత్సవాలు జరిగేవి' అని తను తెలుసుకున్న రాచకొండ చరిత్ర సినిమా చూపించాడు ఫొటోశ్రీను.
చెప్పడం ఆపి టైమ్‌ చూసుకుని 'అబ్బో నాలుగున్నరైంది. ఇక మనం దిగాలి. వెలుగు పోయిందంటే జంతువులు అలర్ట్‌ అవుతాయి.. దారి కూడా దొరకదు. పైగా దిగే దారిలోనూ చూడాల్సినవి ఉన్నాయి' అన్న ఫొటోశ్రీను హెచ్చరికతో లేచాం. 'ఇటునుంచి వెళదాం' అంటూ గుట్ట రెండో వైపు నుంచి దారి తీశాడు శ్రీనివాస్‌. గుట్టలు, చెట్లు, వృక్షాలతో పచ్చదనం నింపుకున్న విశాలమైన మైదానంలో పంటపొలాల మధ్యన మసీదు, దాని పక్కునున్న సన్నటి బాటవెంట ఎడ్లబండ్లు, సైకిళ్లు వెళుతున్న దృశ్యం కనువిందు చేసింది.
'దాదాపు 6,000 ఎకరాల విస్తీర్ణంలో దట్టమైన అటవీ ప్రాంతమైనందునే ఇక్కడ నక్సలైట్లుండేవారు. ఈ రాచకొండ దళాన్ని తరిమేయడానికే ఇక్కడ ఫీల్డ్‌ ఫైరింగ్‌ రేంజ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. 1992లో సర్వే చేశారు. అయితే వామపక్షాలు ముఖ్యంగా సిపిఎం నాయకత్వంలో ప్రజలు దానికి వ్యతిరేకంగా ఉద్యమించడంతో అది వాయిదాపడింది. అదే కాలంలో రెండు, మూడు ఎన్‌కౌంటర్లు జరిగాయి. అటు తరువాత మావోయిస్టులు లేకుండా పోయారు' చెబుతున్న ఫొటో శ్రీనివాస్‌ మాటలు వింటూ చెట్లకున్న పండ్లు తెంపుతూ కొండ దిగువకి నడిచాం. అక్కడ చుట్టూ పెద్ద బండల మధ్యన లోతుగా ఉన్న బావి కనిపించింది. సహజంగా ఏర్పడిందే అయినా కళాకారుడు తీర్చిదిద్దినట్లు ఉందాబావి. ఓ పక్కనున్న రాళ్ల మెట్ల ఆసరాతో లోపలకు దిగాం. పూల గుత్తులు వేలాడుతున్న చెట్ల మధ్య కూచున్నాక వెంటనే లేవాలనిపించలేదు. ఆ అనుభూతిని మనస్సులో, దృశ్యాలను కెమెరాలో బంధించాం. అక్కడ నుంచి ఓ పది నిమిషాల నడక అనంతరం సింహద్వారం దాటి బైకులు నిలిపిన చోటికి వచ్చేటప్పటికి ఆరైంది. ఇద్దరు శ్రీనివాస్‌లకు వీడ్కోలు చెప్పి హైదరాబాద్‌ వైపు బైకులను దూకించాం.
- ఎన్‌. మదనయ్య
_________________________________________________

10. తలకోన తలపులు

  • చుట్టూ ఎత్తైన కొండలు... దట్టమైన అరణ్యప్రాంతం... మధ్యలో ఓ జలపాతం ఉంటే ఎంత బాగుంటుందో కదా. అంత అందమైన ప్రకృతి ఎక్కడుందా అనుకుంటున్నారా? మరెక్కడో కాదు... చిత్తూరు జిల్లాలో. ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న తిరుపతికి 45 కిలోమీటర్ల దూరంలోనే ఈ రమణీయ ప్రదేశం ఉంది. అదే తలకోన జలపాతం. ఈ ప్రాంతం నిత్యం పర్యాటకులతో కళకళలాడుతుంటుంది.
నల్లమల పర్వతశ్రేణుల్లో ఈ జలపాతం ఉండడం విశేషం. చుట్టూ దట్టమైన అడవి, ఎత్తైన కొండలు... మధ్యలో జలపాతాన్ని చూసిన పర్యాటకులకు చిత్రమైన అనుభూతి కల్గుతుంది. దాదాపు అరవై మీటర్ల ఎత్తునుంచి జాలువారే జలపాతం కింద నిలబడితే శరీరమంతా చిత్రమైన జలదరింపుకు లోనవుతుంది. ఇక అక్కడినుండి కదలాలని ఎవరికైనా అనిపిస్తుందా చెప్పండి? తలకోన జలపాతం ఉన్న ప్రాంతంలోనే ఓ శివాలయం ఉంది. ఇక్కడి శివుడు సిద్ధేశ్వరుని రూపాన కొలువై ఉన్నాడు. శివుడితో పాటు అమ్మవారు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు కూడా వున్నాయి. పర్యాటకులు తీసుకెళ్లే వాహనాలను ఈ దేవాలయ ప్రాంతం వరకు మాత్రమే అనుమతిస్తారు. అక్కడ్నుండి జలపాతం దగ్గరికి చేరుకోవాలంటే పాదయాత్ర చేయాల్సిందే. కొండ అంచుల్లో దట్టమైన అడవిగుండా దాదాపు రెండు కిలోమీటర్లు ముందుకు వెళ్తే అక్కడ జాలువారే జలపాతాన్ని చూడొచ్చు. రెండు కొండల మధ్య జాలువారే జలపాత దృశ్యం అద్భుతంగా ఉంటుంది. జలపాతానికి కొంత ఎత్తువరకు ఆక్రమించిన బండరాళ్లపై నిలబడితే జలపాతం కింద తడవడానికి వీలవుతుంది. అలాగే జలపాతం కింద పడడం వల్ల ఆ ప్రాంతంలో ఓ పెద్ద గుంటలా ఏర్పడింది. అక్కడ పర్యాటకులు హాయిగా ఈత కొడుతుంటారు.
తలకోనలో వసతి సౌకర్యాలు
జలపాతానికి దగ్గర్లోని ఆలయ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకశాఖ నిర్మించిన ఓ అతిథి గృహం ఉంది. ఇది తప్ప చెప్పుకోదగ్గ సౌకర్యాలు లేవు. ఆలయానికి ముందు భాగంలో పూజాసామగ్రి విక్రయించే చిన్న దుకాణాలు రెండో మూడో ఉంటాయి. అలాగే ఆలయానికి పక్కగా ఓ చిన్న హోటల్‌ అందుబాటులో ఉంటుంది. తలకోనకు వెళ్లే పర్యాటకులు తినే పదార్థాలను వెంట తీసుకెళ్లాలి. ఏమీ తీసుకెళ్లనివారు ఆలయం దగ్గరున్న హోటల్లో ముందుగా చెపితే భోజనం ఏర్పాటు చేస్తారు. తలకోనలోని జలపాతాన్ని సందర్శించే పర్యాటకులు సాయంత్రం వరకు జలపాతం వద్ద గడిపి పొద్దుపోయే సమయానికి గుడిదగ్గరికి చేరుకుంటారు. ఏ కొద్దిమందో తప్ప అందరూ సాయంత్రానికి దగ్గర్లోని గ్రామాలకో లేదా సొంత ప్రదేశానికో తిరుగు ప్రయాణమౌతారు. మరో ప్రత్యేకత ఏమంటే ఇక్కడ సినిమా షూటింగులు నిరంతరం జరుగుతూనే వుంటాయి.
రవాణా సౌకర్యం
తిరుపతి నుండి యెర్రావారి పాలెం చేరుకుని అక్కడ్నుండి పైవేటు వాహనాల ద్వారా తలకోన ఆలయం వద్దకు చేరుకోవచ్చు. యెర్రావారిపాలెం వరకు ఎప్పుడూ బస్సు సౌకర్యం ఉంటుంది. అక్కడినుండి తలకోనకు చేరడానికి వ్యాన్‌, ఆటోలు సిద్ధంగా ఉంటాయి.
________________________________________________

11. ఆకట్టుకునే కుట్రాల జలపాతం

  • ప్రకృతి సిద్ధంగా ఏర్పడి పైనుండి జాలువారే జలపాతంలో తడుస్తూ స్నానం చేయడమంటే ఇష్టపడని వారుండరు. ఆ నీటి ధారల్లో తడవడంలో ఉన్న ఆనందం మరెందులోనూ ఉండదేమో! ఇంతటి సంతోషాన్ని సొంతం చేసుకోవాలంటే కుట్రాలం వెళ్లాల్సిందే.
కుట్రాల జలపాతం తమిళనాడులోని తిరునల్వేలికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతం ఏడాది పొడవునా పర్యాటకులతో సందడిగా ఉంటుంది. వారాంతాల్లో, సెలవురోజుల్లో సందర్శకుల తాకిడి మరీ ఎక్కువగా ఉంటుంది.
జలపాతాల నెలవు కుట్రాలం
చిత్తరువి అనే నది పశ్చిమ కనుమల్లోని తిరుకూడమ్‌ ప్రాంతంలో పుట్టి, కొండ కోనల్లో ప్రవహిస్తూ శిలలప్పెరి అనే ప్రధాన నదిలో కలుస్తుంది. దానికి ముందు కుట్రాలంలోని వివిధ ప్రదేశాల్లో ఏడు జలపాతాలుగా విడిపోతుంది. అత్యంత అద్భుతంగా కనిపించే ఈ ఏడు జలపాతాల్లో కొన్ని అత్యంత ప్రమాదకర ప్రదేశాల్లో ఉన్నాయి. అందుకే అక్కడ పర్యాటకులను స్నానానికి అనుమతించరు. మిగతా చోట్ల సందర్శకులకు పూర్తి స్వేచ్ఛ ఉంది. వాటిలో తనివితీరా జలకాలాడొచ్చు. ఈ ఏడు జలపాతాల్లో ప్రధానమైంది కుర్తాల నాదన్‌ ఆలయానికి సమీపంలో ఉంది. దాదాపు 60 మీటర్ల ఎత్తు నుండి జాలువారే ఈ జలపాతాన్ని పర్యాటకులు చూడడానికి మాత్రమే అనుమతి ఉంది. సిత్తరవి అనే మరో జలపాతం స్నానం చేయడానికి అనువుగా ఉంటుంది. పెద్దగా ఉండే ఇంకో జలపాతం ఐదు పాయలుగా కిందికి పడుతుంది. అందుకే దీనిని ఐదు జలపాతాలు అని పిలుస్తారు. ఇక్కడ కూడా పర్యాటకులు స్నానం చేయడానికి అనుమతి ఉంది.
మరో జలపాతం పేరు టైగర్‌ ఫాల్స్‌. ఇక్కడి నీళ్ల శబ్దం పులి గాండ్రింపులా ఉంటుంది. అందుకే ఈ జలపాతానికి ఆ పేరు వచ్చింది. ఇక్కడ కూడా పర్యాటకులు స్నానం చేయవచ్చు. ఇవే కాకుండా ఇంకొన్ని చిన్న జలపాతాలకూ ఉన్నాయి. ఇవి కూడా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి.
కుట్రాలం విశేషాలు ఇక్కడ జలపాతాలే కాకుండా చూడాల్సినవి చాలా ఉన్నాయి. వాటిలో కుట్రాల నాదర్‌ స్వామి ఆలయం ఒకటి. దీన్ని తమిళ రాజ్యాధిపతులైన చోళ, పండ్య రాజులు అభివృద్ధి చేసినట్టు ఇక్కడి శిలాశాసనాలు చెబుతున్నాయి. నటరాజ రూపంలో ఉన్న పరమేశ్వరుడు కుర్తాల నాదర్‌గా వెలిశాడని చెబుతారు. ఇక్కడి శివలింగాన్ని అగస్త్య మహర్షి స్వయంగా ప్రతిష్టించాడని కథనం. ఈ ఆలయంలో శివుడు లింగాకారంలో వున్నప్పటికీ ప్రధాన పూజలు మాత్రం నటరాజ స్వరూపానికే జరుగుతాయి. అత్యంత రమణీయంగా నిర్మించబడ్డ ఈ ఆలయంలోని శిల్ప సంపద చూపరులను కట్టిపడేస్తుంది. పరమేశ్వరుడితో పాటు కొలువైన అమ్మవారిని వేణువాగ్వాదినీ దేవి అని పిలుస్తారు.
ఈమెతో పాటు పరాశక్తి కూడా కొలువై ఉంది. ఇక్కడ కొలువైన పరాశక్తి అమ్మవారి పీఠం 51 ధరణీ పీఠాల్లో ఒకటిగా విలసిల్లుతోంది.
రవాణా సౌకర్యాలు
చెన్నై నుండి కుట్రాలకు రైలు, బస్సు సౌకర్యాలున్నాయి. కుట్రాలం ప్రాంతానికి సమీపంలోని రైల్వే స్టేషన్‌ పేరు తెన్‌కాశి. ఇక్కడ్నుండి కుట్రాలం ప్రాంతానికి బస్సులు, ఆటోల సౌకర్యం ఉంది. తెన్‌కాశి, కుట్రాలం ప్రాంతాల్లోనూ పర్యాటకులకు అన్ని సదుపాయాలు అందుబాటు ధరల్లోనే లభించడం విశేషం.
_______________________________________________

12. అందాల అద్భుతం నాగార్జున కొండ

నాగార్జున సాగర్‌ రిజర్వాయర్‌ మధ్యలో ఓ చిన్నపాటి ద్వీపకల్పం నాగార్జున కొండ. దీనిమీద ఓ మ్యూజియం కూడా ఉంది. ఇందులో బుద్ధుడికి సంబంధించి అనేక వస్తువులున్నాయి. ఇక్కడి శిల్పకళ శాతవాహనులు, ఇక్ష్వాకుల రాజవైభవానికి నిదర్శనంగా నిలుస్తుంది. మూడు, నాలుగు శతాబ్దాలకు సంబంధించిన శిల్పకళలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇక్కడున్న బుద్ధుని నిలువెత్తు విగ్రహం చాలా అందంగా ఉంటుంది. స్థానకా అనే ఆకృతిలో కూర్చుని, ఆసనాలు వేస్తున్నట్లుండే బుద్ధవిగ్రహం పర్యాటకులను ఆకర్షిస్తుంది. బుద్ధుని కుడిచేయి అభయమిస్తున్నట్టు, ఏదో బోధిస్తున్నట్టు ఉంటుంది. ఈ ప్రాంతానికి వెళ్లే మార్గాల గురించి వివరాలు కలిగిన పుస్తకాలు ఈ మ్యూజియంలోని గ్యాలరీలో ఉంటాయి. నాగార్జున సాగర్‌ నుంచి మోటార్‌బోట్ల ద్వారా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. సాగర్‌కు ఎనభై కిలోమీటర్ల దూరంలోనే ఎత్తిపోతల జలపాతం ఉంది. కొండకోనల్లో నుండి ప్రవహించే చంద్రవంక జలపాతం 22 కిలోమీటర్ల ఎత్తు నుండి కిందకి పడి కృష్ణానదిలో కలుస్తుంది. సూర్యాస్తమయం తర్వాత కూడా ఈ జలపాతం వింతకాంతిలో వెలిగిపోతుంది. ఈ ప్రాంతానికి సమీపంలోనే అటవీ ప్రాంత విభాగం వారు నిర్వహించే మొసళ్ల కేంద్రం ఉంది. అన్నిటికన్నా నాగార్జున కొండపై నుండి చూస్తే కనిపించే మనోహర దృశ్యాలు ఆహ్లాదంగా ఉంటాయి..
________________________________________________________________________

13. సూర్యలంక

మన రాష్ట్రంలో విహారం కోసం సముద్రతీరాలే కాదు, నదీ తీరాలూ బావుంటాయని గోదావరి ప్రాంత వాసులకి బాగా తెలుసు. వాస్తవానికి సముద్ర తీరం వెంబడి మనకు అందమైన బీచ్‌లు తక్కువే. వైజాగ్‌లో మినహాయించి అటు కాకినాడలో గానీ, ఇటు బందరులో గానీ చెప్పుకోదగ్గ, చూడదగ్గ బీచులు, ప్రదేశాలు లేవు. కానీ మా ప్రయాణం మరో అందమైన తీరాన్ని చూపించింది. అదే సూర్యలంక. ప్రతి బీచ్‌లోనూ విపరీతమైన రద్దీ, వెంటపడి మరీ అంటగట్టే అమ్మకం దార్లూ... ప్రశాంతత తప్ప అక్కడ అన్నీ ఉంటాయి. కానీ సూర్యలంకలో అందుకు భిన్నమైన వాతావరణం కనిపించింది.
ఇంకా పర్యాటకుల దృష్టి దీనిపై పడ్డట్లు లేదు. అందుకే ఇక్కడి ఇసుక, నీరు.. అన్నీ స్వచ్ఛంగా కనిపించాయి. బాపట్లలో రైలు దిగి కారులో సూర్యలంక వెళ్తుంటే బంగాళాఖాతంలో సూర్యోదయం దగ్గరికి వెళ్తున్న అనుభూతి. ఇంక అసలు అక్కడకి చేరాక మాత్రం ఆశ్చర్యమేసింది. అదేదో మన స్వంత తీరానికి చేరినట్లు, అదంతా అచ్చంగా మనకోసమే ఉన్నట్లు. అందుకు కారణం జన సంచారం ఎక్కువగా లేకపోవడమే. ఇక్కడ రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్‌ వారి బీచ్‌ రిసార్ట్‌ మాత్రమే (కొన్ని కాటేజీలు) ఉంది. ఆ కాటేజీలు తప్ప వేరే వసతి ఏర్పాట్లు లేవు. అందువల్ల వాళ్లు పెట్టిందే భోజనం. గుంటూరు కారం ఘాటు కాస్త ఎక్కువగా ఉన్నా రుచి పర్వాలేదనిపించింది. కళ్లెదుట కడలి ఉన్నా నది చేపలతో కూర! అయినా సముద్రానికి అతి దగ్గరగా కూర్చుని తినడం వల్ల ఆ విషయం పక్కకు మళ్లింది.
తక్కువ జన సమ్మర్దం. నిండు ప్రకృతి, పూర్తి ప్రశాంతత సంపూర్ణంగా అనుభవించి, ఆనందించాలంటే సూర్యలంక సరైన ప్రదేశం. అయితే, క్రమక్రమంగా దీనికీ ప్రాచుర్యం పెరుగుతోంది. ఇంకొన్ని రోజుల్లో ఇదీ అన్ని బీచ్‌లలాగే కిక్కిరిసిపోతుందేమో!
బీచ్‌కి దగ్గర్లోనే భావనారాయణ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం దగ్గరున్న రెండు ఎత్తైన లోహ స్తంభాలు ఢిల్లీలోని కుతుబ్‌మినార్‌ కాంప్లెక్సులోని స్తంభాల్ని గుర్తు తెస్తాయి. బాపట్ల పట్టణంలో మరో చూడదగ్గ ప్రదేశం టౌన్‌హాల్‌. సుమారు వందేళ్ల చరిత్ర గల ఈ హాల్లో మహాత్మా గాంధీ (1920, 1929) ప్రజలనుద్దేశించి రెండు సార్లు మాట్లాడారట.
మేమున్న రెండు రోజులూ సూర్యలంకలోనూ, బాపట్ల టౌన్‌ హాల్లోనూ గడిపాం. బాపట్లకి దగ్గర్లో (25కిలోమీటర్లు) పదవ శతాబ్దంలో నిర్మించిన భావనారాయణ స్వామి సోదరుని ఆలయం, సహస్రలింగేశరస్వామి ఆలయం ఉన్నాయి. వాటిపై ఆసక్తి ఉన్నవారికి అవీ చూడదగ్గ ప్రదేశాలే. మాకు ఆసక్తీ, వీలు లేక సూర్యలంక నుండే వెనుదిరిగాం.
కనీసం ఒక రాత్రి బస చేసే వెసులుబాటుంటే సూర్యలంక మంచి ఆటవిడుపు ప్రదేశం.
_______________________________________________________________

14. కొండపల్లి బొమ్మల కొలువు

కొండపల్లి పేరు వినగానే ముచ్చటైన చెక్కబొమ్మలు గుర్తుకొస్తాయి. కళాకారులు చెక్కతో వివిధరూపాల్లో, అందంగా తయారు చేసే ఈ బొమ్మలు దేశ విదేశాలనూ ఆకట్టుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ పేరును ఖండాంతరాలు దాటించిన ఘనత కొండపల్లి బొమ్మలకూ ఉందనడంలో అతిశయోక్తి లేదు. విజయవాడకు సుమారు 17 కిలోమీటర్ల దూరంలో, ఇబ్రహీంపట్నానికి దగ్గర్లో ఉంది కొండపల్లి గ్రామం. ఇక్కడ తయారుచేసే బొమ్మలన్నీ పొనికి చెక్కతో చేస్తారు. వీటిని చేయడానికి ఎటువంటి యంత్రాలూ, నమూనాలు, అచ్చులూ లేవు. చేతులతోనే అన్ని రకాల బొమ్మలను తయారు చేస్తారు. ఒకేలాంటివి అనేకం చేయాలన్నా సరే అచ్చులను ఉపయోగించరు. అదే ఈ కొండపల్లి బొమ్మల ప్రత్యేకత. తేలికైన పొనికి చెక్కతో చేయబడే ఈ కొండపల్లి బొమ్మల తయారీ వెనుక కళాకారుల శ్రమ ఎంతో దాగుంది. ముందుగా పొనికి చెక్కపై తయారు చేయాల్సిన బొమ్మ ఆకారాన్ని చెక్కుతారు. తర్వాత రంపపు పొట్టు, చింతగింజల పొడితో ఈ చెక్కబొమ్మకు రూపాన్ని సంతరిస్తారు. దీనికి సున్నం పూసి, ఆరబెట్టిన తర్వాత రకరకాల రంగులతో బొమ్మను ఆకర్షణీయంగా చేస్తారు. కొండపల్లి బొమ్మల్లో ఏనుగు అంబారీ, మావటివాడు, నృత్యం చేసే అమ్మాయిలు, పల్లె పడుచులు, ఎడ్లబండ్లు, బ్రాహ్మణ దంపతులు... లాంటివెన్నో చూపరులను విపరీంతంగా ఆకర్షిస్తాయి. ఇవన్నీ పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించేవే.
ఇవి మాత్రమే కాకుండా అన్ని రకాల జంతువులు, పక్షుల బొమ్మలు సైతం కొండపల్లి కళాకారుల చేతుల్లో ప్రాణం పోసుకున్నాయి. ఇట్టే ఆకట్టుకునే ఈ కొండపల్లి బొమ్మలు విదేశీయుల ఇళ్లలో సైతం కొలువుదీరడం గమనార్హం. కొండపల్లి అంటే కేవలం బొమ్మలు తయారు చేసే ఓ గ్రామమే కాదు, ఇక్కడ కొండవీటి రెడ్డి రాజులు నిర్మించిన ఓ కోట కూడా ఉంది. మూడంతస్తుల రాతి బురుజు కలిగిన ఈకోట పర్యాటకులను కట్టిపడేస్తుంది.
___________________________________________________________

15. అదిలాబాద్‌ అందాలు అదరహో !

ఒత్తిడి నుంచి బయట పడాలనుకున్నప్పుడు... మనసు ప్రశాంతతను కోరుకున్నప్పుడు.. బాధపెట్టే సంఘటనలు ఎదురైనప్పుడు.. లైఫ్‌ రొటీన్‌గా అనిపించినప్పుడు.. మనసును తేలిక పర్చుకోవడానికి చాలా మంది
'ఏం చేయాలా' అని మథన పడుతుంటారు. కొందరు సినిమాకో.. షికారుకో వెళ్లాలనుకుంటారు. కానీ ప్రకృతి ఒడిలో సేద తీరితే కలిగే ఆహ్లాదమే వేరు.. పచ్చపచ్చని ప్రకృతిని చూసినప్పుడు.. మనసు పులకరిస్తుంది. బాధలు, ఇబ్బందులన్నీ మరిచిపోయి కొంగొత్త లోకంలోకి వెళ్లినట్లనిపిస్తుంది. ఆ అందమైన ప్రకృతి ఇచ్చిన ప్రశాంతతో తిరిగొచ్చి హుషారుగా పనిలో నిమగమైపోతాం. అది సరేగాని ఇలాంటి రమణీయమైన అందాలు ఎక్కడున్నాయని అనుకుంటున్నారా? అంతగా ఆలోచించకండి. ఆంధ్రప్రదేశ్‌ చిత్రపటంలో ఓసారి పైకి చూడండి. కనిపిస్తుంది కదూ? అదే అదిలాబాద్‌ జిల్లా. ఇక్కడ ప్రకృతి అందాలకు కొదవే లేదు. ఎత్తైన కొండలు, గలగలపారే జలపాతాలు... అడవుల సంగతైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీటితో పాటు దర్శనీయ స్థలాలు చాలానే ఉన్నాయి.
దక్షిణ భారతదేశంలోనే ఏకైక సరస్వతీ పుణ్యక్షేత్రం బాసర. ఇక్కడికి రాష్ట్రం, దేశం నుండే కాదు, విదేశీ యాత్రికులూ వస్తుంటారు. పండుగ రోజుల్లో యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గురుపౌర్ణమి రోజైతే ఆలయ ఆవరణంతా సందర్శకులతో కిక్కిరిసిపోతుంది. గంటల తరబడి లైన్లో నిలబడాల్సిందే. ఆలయ పరిసరాలు పచ్చగా యాత్రికులను కట్టిపడేస్తాయి. ఆలయ సమీపంలో పరవళ్లు తొక్కుతూ వయ్యారంగా పారే గోదావరి చూడముచ్చటగా ఉంటుంది. ఇక్కడ బోటింగ్‌ చేయకుండా ఉండలేం. పడవమీద ఎన్ని చక్కర్లు కొట్టినా తనివి తీరదు. పిల్లలైతే మళ్లీమళ్లీ వెళ్దామని మారాం చేస్తారు. పెద్దవాళ్లు సైతం 'అయ్యో ఇన్ని రోజులు ఇంత అందమైన ప్రదేశాన్ని చూడలేకపోయామే' అనుకోకుండా వుండలేరు.
బాసరలో ఇటీవల కాలంలో యాత్రికుల సౌకర్యార్థం అతిథి గృహాలు, హోటళ్లు చాలా ఏర్పాటయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం, ఎకో టూరిజం శాఖ కూడా యాత్రికులకు ప్రత్యేకమైన వసతులు కల్పించింది. బాసర ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలో ఉన్నప్పటికీ నిజామాబాద్‌ జిల్లాకు దగ్గరగా ఉంది. రైలు మార్గం కూడా ఉంది. బస్సు ద్వారా రావాలనుకుంటే నిజామాబాద్‌ మీదుగా వస్తే తొందరగా చేరుకుంటాం. నాలుగేళ్ల క్రితం బాసరలో ఏర్పాటైన ట్రిపుల్‌ ఐటి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
అడవులకు కేరాఫ్‌ కవ్వాల్‌ అభయారణ్యం
కనువిందు చేసే కీకారణ్యం 'కవ్వాల్‌' అభయారణ్యం. ఇది జన్నారం మండల కేంద్రానికి సమీపంలో ఉంది. నేను, మరో ముగ్గురు మిత్రులం కలిసి కుటుంబ సమేతంగా కవ్వాల్‌ అభయారణ్యానికి వెళ్లాం. మేము వస్తున్నట్టు ముందుగానే మా ప్రతినిధి ద్వారా అటవీ శాఖాధికారులకు తెలియజేశాం. వారు మా కోసం ఏర్పాట్లు చేశారు. జన్నారం చేరుకునే సరికి సాయంత్రం అయిదయింది. వెళ్లగానే అటవీ శాఖ వారి అతిథి గృహంలో ఫ్రెషప్‌ అయి దొంగపల్లి అడవులకు బయల్దేరాం. మాతో పాటు డిఎఫ్‌ఓ, సిబ్బంది కూడా వచ్చారు. అడవిలో కొద్ది దూరం తర్వాత వాహనం వెళ్లడం కుదరలేదు. ఇక తప్పదని నడక ప్రారంభించాం. శీతాకాలం కావడంతో అందరూ స్వెటర్లు వేసుకున్నారు. చల్లటి వాతావరణం, పచ్చని ప్రకృతిలో నడుస్తుంటే ఆ అనుభూతి వేరు. మధ్యమధ్యలో మాలో ఉన్న ఓ రచయిత జోకులు విసురుతుంటే నవ్వుల్లో మునిగి అడవిలో ఎంత దూరం నడిచినా అలసట తెలీలేదు.
అడవిలో ఉండే కొన్ని రకాల చెట్ల గురించి మా వెంట వచ్చిన డిఎఫ్‌ఓ వివరించారు. అడవంటే కేవలం టేకు చెట్లే ఉంటాయనుకునే వారికి అడవి లోపలికి వెళ్తే తెలుస్తుంది, ఎన్ని రకాల చెట్లుంటాయో. ప్రత్యేకంగా అటవీ శాఖాధికారి వెదురు చెట్ల గురించి వివరించారు. మా అందరికీ ఎప్పుడెప్పుడు అడవి జంతువుల్ని చూద్దామా అని ఆత్రంగా ఉంది. అది గమనించిన అటవీ సిబ్బంది మమ్మల్ని వాగు సమీపంలో పొదల మాటున కూర్చోబెట్టి, ఎవ్వర్నీ మాట్లాడొద్దని, అల్లరి చేయొద్దని (పిల్లలకు) చెప్పారు. శబ్దానికి జంతువులు రావట. అయితే మా వెంట ఉన్న ఒక అల్లరి పిల్ల కిస్‌కిస్‌ మని నవ్వింది. పక్కన కూర్చున్న కెకెరావు 'ష్‌..ష్‌..నవ్వొద్దు' అంటూ సైగ చేశారు. అలా కొంత సేపు కూర్చున్నాం. పులి రాలేదు కాని, కొన్ని అడవి పందులు వచ్చాయి. వాటిని దూరం నుండే చూశాం. తాము అడవిలోకి వచ్చినప్పుడు పులులను చూస్తుంటామని, పులి సంచరించిన పాద ముద్రలను చూపెట్టారు అటవీ సిబ్బంది. వెంట తీసుకెళ్లిన స్నాక్స్‌ అందరం కలిసి ఆరగించాం.
అప్పటికే చీకటి పడడంతో టార్చ్‌ లైట్ల వెలుతురులో పొదలను చీల్చుకుంటూ తిరుగుముఖం పట్టాం. మర్నాడు ఉదయం అల్పాహారం తినేసి కుంటాల, పొచ్చెర జలపాతాల దగ్గరికి బయల్దేరాం.
ఎత్తైన జలపాతం కుంటాల
బోథ్‌ నియోజకవర్గ పరిధిలో ఉన్న కుంటాల జలపాతం రాష్ట్రంలోనే ఎత్తైన జలపాతంగా పేరొందింది. దీంతో పాటే పొచ్చెర జలపాతం కూడా ప్రసిద్ధి చెందింది. కవ్వాల్‌ అభయారణ్యం నుండి ముందు పొచ్చెర జలపాతానికి చేరుకున్నాం. చూడముచ్చటగా ఉన్న పొచ్చెర జలపాతం పక్కనే పార్కు ఉంది. అక్కడికి చేరుకోగానే పిల్లలు జలపాతం వైపు పరుగు తీశారు. జలపాతం దగ్గరికెళ్లొద్దని, ప్రమాదమని హెచ్చరించాడు గైడ్‌. దీంతో ప్రమాద ప్రాంతానికి దూరంగా పై నుండి నీళ్లు పడే ప్రాంతానికి వెళ్లాం. కొండకోనల మధ్య నుండి నీళ్లు వయ్యారంగా వంపులు తిరుగుతూ, పైనుండి కిందకు పడుతున్న నీటిని చూస్తుంటే భలేగా ఉంది. ఆ జలపాతాన్ని చూస్తూ తడవకుండా ఉండడం సాధ్యం కాదేమో!? అందుకే రాజధాని నుండి వచ్చిన మిత్రులు మాత్రం షవర్‌ మాదిరిగా పడుతున్న ఆ ధారల కిందికి వెళ్లి ఆడారు. అలా ఎంతసేపున్నామో సమయం తెలీలేదు. ఆ ఆనందాన్ని పదిలపర్చుకోవడానికి చేతిలో కెమెరా ఉండనే ఉంది. ఎక్కువ సమయం లేదని గుర్తుకొచ్చి అయిష్టంగానే అక్కడి నుండి కుంటాల జలపాతానికి బయల్దేరాం.
జలపాతం చేరాలంటే మెట్లు దిగి వెళ్లాలి. దగ్గరికెళ్తున్న కొద్దీ పరుగులు తీస్తున్న నీళ్లు స్పష్టంగా కన్పించసాగాయి. ఆ దృశ్యం అద్భుతంగా అనిపించింది. 45 అడుగుల ఎత్తు నుండి కిందికి పడే నీళ్లు వినసొంపైన శబ్దం చేస్తున్నాయి. మరీ దగ్గరగా వెళ్లబోతుంటే ప్రమాద హెచ్చరికలున్నాయన్నారు. దీంతో జలపాతానికి పైభాగంలో కాకుండా కిందికి చేరుకొని జలకాలాటలలో..కిలకిల పాటలలో అంటూ కొద్దిసేపు ఎంజారు చేశాం. అదే రోజు లోకేశ్వరం మండలానికి చెందిన పాఠశాల విద్యార్థులు అక్కడికి వన భోజనానికి వచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. దోసిళ్లలో నీళ్లు పట్టుకుంటూ ఒకరిపై ఒకరు చల్లుకుంటున్న చిన్నారులను చూస్తే మాక్కూడా ముచ్చటేసింది. వారితో మాటలు కలిపి సరదాగా కబుర్లు చెప్పుకున్నాం. అప్పటికే సాయంత్రం ఆరవుతోంది. వెళ్లాలనిపించడం లేదు. కానీ తప్పదు కదా! అయిష్టంగానే తిరుగుముఖం పట్టాం. జలపాతం దగ్గర దిగేటప్పుడున్న హుషారు ఎక్కేటప్పుడు లేదు. కొద్దిగా ఇబ్బంది పడాల్సొచ్చింది.
కుంటాల పేరు వెనుక చరిత్ర...
శకుంతలా దుష్యంతులు ఈ ప్రాంతంలో సంచరించారని, అందుకే దీనికి కుంతల జలపాతం అని పేరు వచ్చిందని స్థానికులు చెబుతుంటారు. కుంతల రానురాను కుంటాలగా మారింది. వర్షా, శీతాకాలాల్లో ఇక్కడికి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అయితే జలపాతం దగ్గర జాగ్రత్తగా ఉండాలి. జలకన్య అందాలను దూరం నుంచే ఆస్వాదించాలి. మరీ సమీపంలోకి వెళ్లకూడదు. హెచ్చరికలను బేఖాతరు చేస్తే ప్రాణాలకే ప్రమాదం. అందాలను తిలకించడానికి వచ్చి హెచ్చరికలు పాటించకుండా మృతి చెందిన సంఘటనలూ ఉన్నాయి.
జలపాతం పక్కనే ఏడు అడుగుల గుహ ఉంది. దీని గుండా మనిషి మాత్రమే ప్రవేశించే వీలుంది. పక్కనే నీటి సుడిగుండం, సోమేశ్వరాలయం, కాకతీయుల కాలంనాటి రాతి నంది విగ్రహాలున్నాయి.
ప్రాచీన కళకు ప్రత్యక్ష సాక్షి
చారిత్రక కట్టడాలకు, ప్రాచీన శిల్పకళకు జైనథ్‌ మండల కేంద్రంలో ఉన్న లక్ష్మీనారాయణ ఆలయాన్ని సజీవ సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. శాతవాహనుల కాలంలో నిర్మితమైన ఈ దేవాలయం భారతదేశ సంస్కృతి, కళలను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. జిల్లా కేంద్రం నుండి 20 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. జైనులకు కేంద్రంగా ఉండడంతో ఈ గ్రామానికి 'జైనథ్‌' అని పేరు వచ్చింది. దాదాపు 15 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు గల నల్లటి రాళ్లతో ఈ ఆలయాన్ని నిర్మించడం చెప్పుకోదగ్గ విషయం. గుడిలో దాదాపు 40 అడుగుల లక్ష్మీనారాయణ విగ్రహం ఉంది. దీనిపై మార్చి, ఏప్రిల్‌, సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో సూర్యకిరణాలు నేరుగా ప్రసరించడం మరో విశేషం. ఆలయాన్ని దాదాపు 2500 సంవత్సరాల క్రితం నిర్మించి ఉండొచ్చని స్థానికులు చెబుతుంటారు. అయితే రోజులు గడుస్తున్న కొద్ది ఆలయం కొద్దికొద్దిగా భూమిలోకి కుంగిపోతోందట.
వింతలు... విశేషాలు
ఇవే కాకుండా జిల్లాలో మరెన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. కెరమెరి, నిర్మల్‌ ఘాట్లు జిల్లాకే తలమానికంగా ఉన్నాయి. ఈ రోడ్లపై ప్రయాణం ఆహ్లాదకరమైన విహారం. ఇవే కాక జిల్లాలో అక్కడక్కడ ఎన్నో సుందర ప్రకృతి దృశ్యాలున్నాయి. సినిమాల్లో సుందర దృశ్యాలను చూపించడానికి సినీ దర్శక, నిర్మాతలు కాశ్మీర్‌, లండన్‌ తదితర సుదూర ప్రాంతాలకు వెళ్తుంటారు. కానీ వారికి తెలియని ప్రకృతి అందాలు ఆదిలాబాద్‌ జిల్లాలో అనేకం ఉన్నాయి.
_______________________________________________________________

16. శిల్పకళకు సజీవ సాక్ష్యాలు ఉండవల్లి గుహలు

శిలలపై శిల్పాలు చెక్కినారు.. మనవాళ్లు సృష్టికే అందాలు తెచ్చినారు.. కనుచూపు కరువైన వారికైనా.. కనిపించి కనువిందు చేసే రీతిగా శిలలపై శిల్పాలు చెక్కినారు..' అంటూ 'మంచిమనసులు' సినిమా కోసం ఆచార్య ఆత్రేయ ఈ సాహిత్యాన్ని పొందుపరిచారు. నిజంగా కళ్లు లేనివారు కూడా శిల్పకళను ఆస్వాదించేలా మన శిల్పులు చెక్కారనడం అతిశయోక్తిగా అనిపించినా.. వారిలో అంత నైపుణ్యం ఉందని చెప్పడం రచయిత ఉద్దేశం కావచ్చు. కానీ ఆ శిలల్ని తాకి కూడా అంతటి అనుభూతి పొందవచ్చేమో..?! ఏమైనా.. రాజుల కాలంలో కొండల్ని, బండల్ని తొలచి అపూర్వమైన శిల్పకళా సంపదను సృజించి మనకు అందిచారన్నది మాత్రం నిస్సందేహం. అందులో భాగమే మన రాష్ట్రంలోని ఉండవల్లి గుహల్లోని శిల్ప సంపద కూడా. మరి ఆ గుహల్లో ఏఏ శిల్పాలున్నాయో.... ఆ పరిసరాలు ఎలా ఉన్నాయో.. దాని చరిత్ర ఏమిటో తెలుసుకుందామా...!
విజయవాడలో నాల్గవ తరగతి చదువుకునేప్పుడు మా స్కూల్‌ (బిషప్‌ అజరయ్యా బాలికోన్నత పాఠశాల) వాళ్లు విజ్ఞానయాత్రకు తీసుకెళ్లారు. అందులో భాగంగా మొదటిసారి ఉండవల్లి గుహల్ని చూశాను. అప్పుడక్కడ అంతగా అభివృద్ధి చేయలేదు. లోపలంతా చీకటి. అందరితో పాటు అలా చూసి వచ్చేశా. అయితే మా అత్తగారిది ఉండవల్లే కావడం యాదృచ్ఛికం. కానీ ఎప్పుడెళ్లినా ఉండవల్లి వెళ్లటమేగానీ, గుహల్ని చూడ్డానికి వీలుపడేది కాదు. ఈ సారి ఏమైనా చూడాలని మా పాప పట్టుపట్టింది. ఈ లోగా ఊళ్లో ఏర్పాటు చేసిన వనభోజనాలకు ఆహ్వానం అందింది. రెండూ కలిసొస్తాయని బయల్దేరాం. అలా వెళ్లినప్పుడు మా పాపను తీసుకుని ఆ గుహల్ని సందర్శించాం. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం వల్ల పరిసరాలు కూడా చాలా అందంగా, ఆహ్లాదంగా ఉన్నాయి.
మన రాష్ట్రంలో చూడదగ్గ పర్యాటక కేంద్రాల్లో ఉండవల్లి గుహలకి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ గుహల దగ్గరకు వెళ్లాలంటే విజయవాడ నుండి వస్తే ప్రకాశం బ్యారేజీ మీదుగా రావొచ్చు. గుంటూరు నుండి మంగళగిరి మీదుగా వెళ్లొచ్చు. ఎటు నుంచి వచ్చినా ఉండవల్లి సెంటరు నుండి పెనుమాక మీదుగా అమరావతి వెళ్లే దారిలో ఈ గుహలు ఉంటాయి. కచ్చితంగా చెప్పాలంటే ఉండవల్లి సెంటర్‌ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ గుహలు ఉన్నాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో ఉండవల్లి అనేది ఒక గ్రామం. కృష్ణానదికి దక్షిణాన ఈ గుహలు ఉన్నాయి. అయితే వీటిలో పెద్ద గుహ నాలుగు అంతస్తులను కలిగి ఉంది. ఉండవల్లి గుహల్ని బౌద్ధ ఆరామాల రీతిలో నిర్మించినట్లు కనిపిస్తుంది. వీటిని క్రీ.శ. 420 నుంచి 620 సంవత్సరాల మధ్య పరిపాలించిన విష్ణుకుండిన రాజుల కాలంలో నిర్మించారని ప్రతీతి. విజయవాడ కనకదుర్గ గుడి, మంగళగిరి పానకాలస్వామి, అమరావతి దీనికి దగ్గరలోని దర్శనీయస్థలాలు.
ఉండవల్లి వెళ్లేప్పుడు మార్గానికి ఇరువైపులా పచ్చని పొలాలు. పూతోటలు.. ప్రకృతి అందాలన్నీ దారిపొడవునా స్వాగతం చెబుతుంటాయి. అలా వెళుతుండగా కొండవీటి వాగు వస్తుంది. ఈ వాగు ఒడ్డునే ఉండవల్లి గ్రామం, గుహలు ఉండేది. ఆ వాగుకు ఇరువైపులా పొలాలు పచ్చగా శోభాయమానంగా ఉంటాయి. చామంతి, బంతి, కనకాంబరం వంటి పూతోటలు కనువిందు చేస్తుంటే, బొప్పాయి, సపోట వంటి తోటల్లోని పండ్లు మనల్ని నోరూరిస్తాయి. ఇవి దాటుకుని వెళితే కృష్ణానది కరకట్ట వస్తుంది. ఈ కరకట్టకు ఆవలివైపున కృష్ణుడి గుడి ఉంది. కృష్ణానదిలో స్నానాలు చేయాలంటే ఇటు కూడా వెళ్లొచ్చు. కాకపోతే ఇక్కడ కృష్ణానది లోతు ఎక్కువగా ఉండటం, సరైన ఏర్పాట్లు లేకపోవడం వల్ల స్నానాలు చేయడం ప్రమాదమే సుమా!
ఈ గుహలను బయట నుంచి చూస్తే ఓ పెద్ద కొండను రాతిభవనంలాగా నిర్మించినట్లు కనిపిస్తుంది. నాటి శిల్పులు పెద్ద కొండను తొలిచి, గదులుగా ఎంతో వైవిధ్యంగా మలిచారు. కొండకు ముఖద్వారం ఏర్పరచి, అందులోంచి లోపలికి వెళ్లే కొద్దీ అనేక శిల్పాలు గుహంతా దర్శనమిస్తాయి. గుహ లోపల ఉన్న స్థంభాలపై చెక్కిన అందమైన పూలు, లతలు, గోడలపై అనేక ప్రతిమలు కనిపిస్తాయి. ఈ కొండను నాలుగు అంతస్థులు, 64 గదులు, 16 మండపాలుగా నిర్మించారు. వీటిని బౌద్ధమతం ప్రాచుర్యం పొందుతున్న రోజుల్లో గోవిందశర్మ నిర్మించాడని చెప్తారు.
రెండవ అంతస్థులో అనంత పద్మనాభస్వామి శిల్పం ఉంది. ఈ పర్వత గుహలో అత్యంత పెద్దది ఇదే(దాదాపు 20 అడుగులు). ఈ ప్రతిమ గుహ కుడివైపు పొడవుగా శేషతల్పంపై శయనించిన భంగిమలో ఉంటుంది. పద్మనాభుని నాభిలో తామరపువ్వు, మధ్యలో తపస్సు చేస్తున్న బ్రహ్మ. పాదాల వద్ద మధుకైటబులు అనే రాక్షసులు, విష్ణు వాహనమైన గరుత్మంతుడు ఉన్నట్లు చెక్కారు.
మిగతా అంతస్థుల్లో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, నరసింహస్వామి, దత్తాత్రేయను పోలిన ప్రతిమలు ఉన్నాయి. ఇవి గుప్తులకాలం నాటి నిర్మాణ శైలికి లభిస్తున్న ఆధారాలలో ఒకటని చెప్తుంటారు. పర్వత పైభాగంలో బయటి వైపు తపస్సు చేస్తున్న సప్త రుషులు, ఇతర దేవతల విగ్రహాలు ఉన్నాయి. ఇన్నింటినీ ఏకశిలలో నిర్మించిన ఆ శిల్పుల నైపుణ్యం ఎంత గొప్పదో వీటిని చూస్తేనే అర్థమవుతుంది.
ఇక్కడ 14వ శతాబ్దంలో కొండవీటి రాజులు వేసిన ఓ శాసనం ప్రకారం.. గుహలు 6,7 శతాబ్దాల నాటివని ఉంది. క్రీ.శ. 1343 లో అనిరెడ్డి కుమారుడు పంచమరెడ్డి అనంత పద్మనాభునికి దానం ఇచ్చినట్లు అందులో పేర్కొన్నారు. అనంత పద్మనాభుని విగ్రహం కింద పెద్దఎత్తున నిధులున్నాయనే పుకార్లు ఇటీవల షికార్లు చేశాయి. కేరళలో అనంత పద్మనాభస్వామి దేవాలయంలో నిధులు బయటపడినప్పుడు ఈ విగ్రహాన్ని దుండగులు పగులకొట్టడానికి యత్నించినట్లు ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. స్థానికులు మాత్రం 'అదంతా ఏమీలేదు.. ఈ స్వామి కూడా మాలాగా పేదవాడే' అంటుంటారు.
పూర్వకాలంలో రెండవ అంతస్థులో మెట్ల మార్గం మీదుగా మంగళగిరి పానకాల స్వామి గుడి వరకూ ఈ గుహల నుంచి సొరంగ మార్గం ఉందని అంటుంటారు. ఈ మార్గం నుండి రాజులు తమ సైన్యాన్ని శత్రు రాజులకు తెలియకుండా తరలించేవారని ప్రతీతి. అలాగే పూర్వకాలంలో మునులు, బౌద్ధభిక్షువులు కృష్ణానదిలో స్నానమాచరించి, మంగళగిరి కొండపైన గల పానకాలస్వామిని దర్శించి, ఉండవల్లి గుహలకు చేరుకుని తపస్సు చేసేవారనే కథలూ ఉన్నాయి. ఇక్కడ నుంచి కొండవీటి కోట, మంగళగిరి పానకాలస్వామి, కనకదుర్గమ్మ కొండకు రహస్య మార్గం ఉండేదని కూడా మరో కథనం. సొరంగ మార్గం ఉందని చెప్పేదాని దగ్గరే రెడ్డిరాజుల కాలం నాటి శిలాఫలకం ఒకటి ఉంది.
గుహల ప్రవేశద్వారం వద్ద ఉంచిన శిలాశాసనం ప్రకారం.. ఇది క్రీ.శ. 6, 7 శతాబ్దాలలో నిర్మితమైన నాలుగు అంతస్తుల గుహాలయం. క్రీ.శ 16వ శతాబ్దం వరకు రాజపోషణలో ఉంది. దీని కింది అంతస్తులోని స్తంభాల మండపము నిర్మాణం అప్పటికింకా పూర్తికాలేదు. మొదటి అంతస్తులో త్రిమూర్తులు, రెండవ అంతస్తులో అనంత శయన విష్ణువు ఆలయం ఉంది. మూడవ అంతస్తు పూర్తిగా త్రికూటాలయమే. ఇందులోని శిల్పకళ ఆధారంగానే ఈ గుహాలయము చాళుక్యుల కాలం నాటిదని చెప్తారు.
1959లో పురావస్తు శాఖ ఈ గుహలను స్వాధీనం చేసుకుంది. పాడైన శిల్పాలకు మెరుగులు దిద్దారు. అలాగే కొండకు దిగువనున్న స్థలంలో పార్కును ఏర్పాటు చేశారు. దీని అభివృద్ధికోసమంటూ రూ.5 లు చొప్పున ప్రవేశరుసుము కూడా వసూలు చేస్తున్నారు. ఇంతటి చారిత్రక విశిష్టత కలిగిన గుహల గురించి తెలియజేసే గైడ్‌ను ఏర్పాటు చేయకపోవడం విచారకరం. వచ్చినవాళ్లు ఎవరికి వాళ్లుగా చూసుకుంటూ వెళ్లడమేగానీ వాటి గురించిన చరిత్రను తెలుసుకునే వీలేలేదు.
కొండపైకి ఎక్కి చూస్తే చుట్టూ పచ్చని పొలాలు, పూలు, పండ్ల తోటలు సప్త వర్ణశోభితంగా కనిపిస్తాయి. అంతేకాదు, పరవళ్లు తొక్కే కృష్ణమ్మ, ప్రకాశం బ్యారేజీ, బెజవాడ కనకదుర్గ గుడి కనువిందు చేస్తాయి. ప్రకృతి అంతా ఈ గుహల్ని అక్కున చేర్చుకున్నట్లు ఉంటుంది ఆ దృశ్యం. ఇంత అపురూపమైన శిల్పకళా సంపదతో నిండిన ఈ ఉండవల్లి గుహలను చూసి తరించాల్సిందే. ఇంతటి అద్భుత శిల్పకళా సంపద మన ముందుతరాలకూ అందాలంటే పురావస్తు వారు జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిపై పిచ్చిగీతలూ అవి రాయకుండా, నిధులకోసం దుస్సాహసాలకు పాల్పడకుండా మనవంతు కర్తవ్యంగా నిలుపుకోవాలి.
________________________________________________________________

17. విశాఖతీరం... విహార శోభితం....

'నీలాల కన్నుల్లో సంద్రమే.. హైలెస్సో.. ! నింగి నీలమంతా సంద్రమే.. హైలెస్సో.. ! సంద్రాన మీనాల సందమే.. హైలెస్సో.. ! నేల కరిగిపోతే సందమ్రే.. హైలెస్సో.. ! నీటిబొట్టు పెరిగిపోతే సంద్రమే.. హైలెస్సో.. !' అన్నాడు ఓ సినీకవి.. నిజంగానే.. నింగి నీలాన్నంతా అద్దుకుని నీలంగా కనిపిస్తుంది సముద్రమే కదా..! సముద్రతీరాలు మనస్సును హాయిగొల్పిస్తాయి.. ఆ నీలి సముద్రం పైనుండి వీచే చల్లగాలులూ..కవ్వించే కెరటాలూ, బారులు తీరే పక్షులూ.. ఆ ఆహ్లాదభరిత వాతావరణంలో మైమరిచిన పిల్లాపెద్దల కేరింతలూ.. బెస్తవారి హైలెస్సలతో కడు రమణీయంగా ఉంటాయి సముద్రతీరాలు. అలాంటివాటిల్లో విశాఖతీరం ఒకటి. విశాఖ తీరం విహారశోభితంగా ఉంటుంది. ఎప్పుడూ అందంగా, ఆహ్లాదంగా కనిపిస్తూ పర్యాటకుల్ని రా.. రమ్మంటుంది.. తీరం పొడవునా కొబ్బరిచెట్లు.. వాటి నుండి వచ్చే స్వచ్ఛమైన గాలులు సందర్శకులను మైమరిపిస్తాయి. నిత్యం పర్యాటకులతో తీరం వెంబడి సందడే.. సందడి. ఉదయాన్నే సముద్రంలో నుండి సూర్యుడు బయటకు వస్తున్న దృశ్యం అత్యద్భుతం. ఆ శుభోదయ వేళ వ్యాహ్యాళికి వచ్చే వాళ్లు, ఆడుకునేవాళ్లతో సందడి ప్రారంభమవుతుంది.. సాయంవేళల్లో కవులు, రచయితలు, సందర్శకులతో కోలాహలంగా ఉంటుంది. రాత్రివేళ దీపపు కాంతులు ప్రతిబింబించడంతో సముద్రం కొత్త శోభను సంతరించుకుంటుంది. విశాఖతీరంలో చూడదగ్గవి భీమిలి, రిషికొండ, రామకృష్ణ బీచ్‌లు. మరి ఒక్కసారి వాటిని చూసొద్దామా..!

ఎప్పటి నుండో విశాఖపట్టణం వెళ్లాలని కోరిక. విశాఖలో స్నేహితుల్ని, బంధువుల్ని సంప్రదిస్తే వాళ్లు అక్టోబర్‌- నవంబర్‌ మాసాల్లో అయితే ప్రకృతి చాలా బాగుంటుందన్నారు. దసరా సెలవుల్లో బయల్దేరాం. విశాఖపట్టణం అనగానే గుర్తుకొచ్చేది సముద్రం. ఇది అందరికీ అందుబాటులో ఉండదు కదా! ఆ అందాల్ని నిత్యం ఆస్వాదించడం ఆ తీర ప్రాంతాల వారికే సొంతం. బీచ్‌ అనగానే పట్టణంలో ఉండే రామకృష్ణ బీచ్‌ గురించే చెప్తారు. అయితే మా ఆడపడుచు వాళ్ల అమ్మాయీ అల్లుడూ అక్కడే ఉంటున్నారు. ఆయన ముందు భీమిలి వెళ్లి అక్కడ నుండి సిటీలోకి వద్దామన్నాడు. అలాగే వెళ్దామనుకుని, ఒక వ్యాను మాట్లాడుకున్నాం. అందరం కలిసి ఉదయమే బయల్దేరాం. ముందు భీమిలి వెళ్లాం.
భీమిలి విశాఖపట్టణానికి 25 కి.మీ. దూరంలో ఉంది. భీమిలి పశ్చిమం వైపు ఎత్తుగా ఉండి క్రమంగా తూర్పువైపు సముద్రతీరానికి వచ్చేటప్పటికి పల్లంగా ఉంటుంది. దీంతో భీమిలిని పశ్చిమం నుండి తూర్పుకు సముద్రతీరంవైపు చూస్తే ఆ దృశ్యం ఎంతో రమణీయంగా ఉంటుంది. ఈ పట్టణంలోని లాటరైటు శిలలపై ప్రాచీనమైన నరసింహస్వామి దేవాలయం ఉంది. ఇంకో విశేషమేమంటే ఇక్కడ ఇప్పటికీ డచ్‌ వారి వలస స్థావర అవశేషాలుండడం. బీచ్‌ లోతు ఉండదు కాబట్టి ఈత కొట్టడానికి వీలుగా ఉంటుంది. ఇకపోతే ఇక్కడ చెప్పుకోదగ్గది భీమిలి కోట. '16-18 శతాబ్దాల మధ్య మన దేశం వర్తకానికి వచ్చినప్పుడు భీమిలిలో డచ్‌ వాళ్లు దిగారు. 1624లో డచ్‌ వారు ఇక్కడకు మొదట వలస వచ్చారు. ఆ సందర్భంగా వారికి మన వాళ్లకి మధ్య పోరు జరిగింది. ఆ ఘర్షణలో 101 మంది డచ్‌ సైనికులు, 200 మంది ప్రాంతీయులు మరణించారు. ఆ తర్వాత సంధి కుదిరి, వర్తకం చేసుకోవడానికి 1661లో అక్కడ ఈ కోట నిర్మించుకున్నార'ని అక్కడున్న శిలాఫలకాలపై రాసి ఉంది. ఈ కోట బాగా శిధిలమైంది. ఇక్కడే గడియార స్తంభం, టంకశాల ఉన్నాయి. దగ్గరలోనే ఉన్న ద్వీపస్తంభం (లైట్‌హౌస్‌) చాలా అందంగా ఉంది. దీన్ని 18వ శతాబ్దంలో నిర్మించారట. ఇది అప్పటి వైభవాన్ని తెలియజేస్తుంది.
ఇక్కడ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్న ఓ 'కలప కళాఖండం' గురించి తప్పక చెప్పుకోవాలి. పెద్ద పడవలో వివిధ భంగిమల్లో ఉన్న నలుగురు బెస్తవారు తెడ్లు వేస్తూ నడుపుతున్న దృశ్యమే ఆ కళాఖండం. దీన్ని చెక్కతో తయారుచేసి రోడ్డుపై ఉంచారు. అత్యద్భుతంగా ఉంది.
రోడ్డు అంచునే సముద్రం. నీలిరంగు సముద్రానికి పచ్చరంగు అంచులాగా బీచ్‌ పొడవునా పచ్చని కొబ్బరిచెట్లు చాలా అందంగా ఉన్నాయి. ఆ కొబ్బరి చెట్ల నీడలో సిమెంటు బెంచీలున్నాయి. అక్కడ కూర్చొని కడలి కెరటాల సయ్యాటలను ఆస్వాదిస్తూ ఎంతసేపైనా గడిపేయవచ్చనిపించింది. ఆ చల్లగాలి శరీరాన్ని సేద తీరిస్తే, ఆ చుట్టూ ప్రకృతి ఎంతో ఆహ్లాదంగా మనస్సుకు హాయి గొలిపింది. అక్కడ మెడవరకూ ఉన్న బుద్ధుని విగ్రహం కూడా చాలా అందంగా ఉంది. అలా ఇసుకలో నడుచుకుంటూ పిల్లల్ని పట్టుకుని సముద్రం చెంతకు చేరాం. సముద్రం నుండి కెరటాలు ఎగసిపడుతూ 'వచ్చారా!' అన్నట్లు దగ్గరగా వచ్చి తాకి మరీ వెనక్కు వెళ్లడం.. భలే బాగుంది. పిల్లలు ఆ కెరటం వచ్చి వెళ్లేప్పుడు కాళ్లకింద ఇసుక కదులుతుంటే ఒకటే కేరింతలు. ఆ అనుభూతే వేరు. అది అనుభవించిన ప్రతి ఒక్కరికీ మరపురాని జ్ఞాపకమే. కాసేపు అక్కడే గడిపాం.
రిషికొండ బీచ్‌... కనుచూపు మేర ఇసుకతిన్నెలు, తాటిచెట్లతో ఎంతో చూడచక్కగా ఉంది. ఇక్కడ బోటు షికారు చేసే సౌకర్యం ఉంది. మరీ చిన్నపిల్లలు ఉండడంతో మేం వెళ్లలేదు. చుట్టూ రెస్టారెంట్లున్నాయి. ఒడ్డునే ఉన్న పార్క్‌లోకి దారితీశాం. ఆ పార్కులో పిల్లలు ఆడుకోడానికి జారుడుబల్ల, సీసా వంటి ఆటవస్తువులు ఉన్నాయి. వెంట తెచ్చుకున్న పులిహోర, పెరుగన్నం అందరం కలిసి తినేశాం. ఆకలిమీద ఉన్నారేమో పిల్లలు కూడా పేచీల్లేకుండా తినేశారు. తర్వాత అందరం సముద్రం దగ్గరకు వెళ్లాం. మేమెళ్లిన చోట సముద్రం కొంచెం లోతుగా ఉంటుందంట. మరీ ముందుకు వెళ్లొద్దని అక్కడివాళ్లు హెచ్చరించారు. అందుకే మోకాళ్లలోతు వరకూ వెళ్లాం. అక్కడ లంగరు వేసిన పడవల్ని పట్టుకుని కాసేపు కెరటాలతో ఆడుకున్నాం.
అక్కడ నుండి కైలాసగిరికి వెళ్లాం. కొండ ఎక్కకుండా 'రోప్‌ వే' సౌకర్యం కూడా ఉంది. పిల్లలు సరదాపడుతుంటే వాళ్లని అందులో పంపించి, మేం వ్యానులోనే పైకి వెళ్లాం. కొండను ఎంతో అద్భుతంగా మలిచారు. కింద నుండి పై వరకూ ఆద్యంతం రకరకాల పూలమొక్కలతో ఎంతో మనోహరంగా తీర్చిదిద్దారు. కాసేపు ఆ మొక్కలను, పూలను ఆసక్తిగా గమనిస్తూ.. బాగా నచ్చినవాటిని చేతితో తాకుతూ.. అలా మెల్లగా పైకి ఎక్కాం. పైన వాతావరణం మరింత శోభాయమానంగా ఉంది. పై నుండి కిందకు పరికించగానే...ఓవైపు అనంతంగా సాగుతున్న సముద్రం. మరోవైపు విస్తరించిన పట్టణం.. చాలా అద్భుతంగా ఉందా దృశ్యం. బైనాక్యులర్స్‌తో అక్కడ నుంచి చూస్తే రామకృష్ణ బీచ్‌.. ఆ తీరం వెంబడి పర్యాటకులు.. ఎగసిపడుతున్న కెరటాలు.. ఓV్‌ా.. చెప్పటం కాదు.. చూసి తీరాల్సిందే. అక్కడ నిలబడితే వెనుకభాగంలో సుదూరంగా సముద్రతీరం.. అబ్బా.. అత్యద్భుతం ఆ దృశ్యం. ఎలా అంటే...చెయ్యితిరిగిన చిత్రకారుడు గీసిన చిత్రంలా ఉందనుకోండి. అలాగే ఆ కొండపైన శివపార్వతుల విగ్రహాలు మరో హైలైట్‌. అంత పెద్దగా మలచిన శిల్పకారుడిని మెచ్చుకుని తీరాల్సిందే. చుట్టూ అందమైన పూలమొక్కలు, మధ్యలో చిన్న జలపాతం.. ఓV్‌ా.. మనోహరం ఆ దృశ్యాలన్నీ. మొత్తం గార్డెన్‌లో కొన్ని లతల్ని ఆర్చీల్లా మలిచారు. ఇక అక్కడ నుండి కిందకు వచ్చాం.
రామకృష్ణ బీచ్‌లోకి అడుగుపెట్టాం. దీన్నే ఆర్‌.కె.బీచ్‌ అని పొట్టిగా పిలుస్తారు. అచ్చం మనం సినిమాల్లో చూస్తున్న బీచ్‌లాగా ఉంది. అన్ని ఏర్పాట్లూ ఉన్నాయి. వేరుశనక్కాయలు వంటి తినుబండారాలు అమ్మే చిరు వ్యాపారుల నుండి ఓ మాదిరి షాపుల వరకూ... ఒకటేమిటీ అన్నీ ఉన్నాయి అక్కడ. ముందుకు వెళ్లాక ఎంతో పద్ధతిగా సముద్రం దగ్గరకు వెళ్లే ఏర్పాట్లు ఉన్నాయి. అందరం ఒకరిచేతులు ఒకరం గట్టిగా పట్టుకుని సముద్రం దగ్గర కెరటాలకు ఎదురు నుంచున్నాం. మోకాళ్లు మునిగే అంతదూరం వెళ్లి ఆగిపోయాం. ఈలోపు ఓ పెద్ద కెరటం వచ్చింది. అంతే అందరం పూర్తిగా తడిచిపోయాం. కానీ అది కిందకు పడిపోయి వెనక్కు వెళ్లగానే పెద్దలూ పిల్లలై ఒకటే కేరింతలు. కొద్దిసేపయ్యాక సూర్యుడు అస్తమిస్తున్న దృశ్యం. ఓV్‌ా.. ఆ దృశ్యం ఎంత అత్యద్భుతంగా ఉందో మాటల్లో చెప్పలేం. చూసి తీరాల్సిందే..! ముదురు నారింజరంగులో అస్తమిస్తున్న సూర్యుడు నిజంగా సముద్రం లోపలికి వెళ్లిపోతున్నట్లు.. వెళుతున్నప్పుడు సముద్రంలో దాని ప్రతిబింబం ఎంత అందంగా ఉందో..!
ఆర్‌కె బీచ్‌లోనే నాడు మన దేశ విజయానికి ప్రతీకగా నిలిచిన కురుసుర జలాంతర్గామిని పర్యాటకులు వీక్షించేందుకు వీలుగా మ్యూజియంగా మలిచారు. భారత్‌-పాక్‌ యుద్ధంలో దేశ గౌరవానికి, ప్రతిభాపాటవాలకు ప్రతిరూపంగా నిలిచి భారత విజయానికి ప్రతీకగా నిలిచిందది. నౌకాదళ పనితీరు తెలుసుకోవాలంటే జలాంతర్గామిని సందర్శించాల్సిందే. దీన్ని ఇలా తీర్చిదిద్దడానికి ఏడాది పట్టిందంట. ఇది 2002, ఆగస్టు 9 నుండి పర్యాటకులకు కనువిందు చేస్తోంది. ఆయుధ సామగ్రినంతా అలాగే ఉంచారు. మనం చూసేందుకు వీలుగా ద్వారాలను కొంత మార్పు చేశారు. అయినా ఒకరి తర్వాత ఒకరు వెళ్లాల్సిందే. 91.3 మీటర్ల పొడవున్న దీన్ని ఆసాంతం చూడాలంటే సుమారు అరగంట పడుతుంది. అంతసేపు లోపల సందర్శకులకు ఇబ్బంది కలగకుండా 21 ఎసి మిషన్లను ఏర్పాటు చేశారు. ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే చూడనిస్తారు. ప్రతి సోమవారం సెలవు ఉంటుంది. దీన్ని చూసేందుకు పెద్దలకు రూ.25, పిల్లలకు రూ.15 సందర్శనా రుసుము వసూలు చేస్తున్నారు. వికలాంగులకు ఉచితం. ఇందులో సుమారు వందమంది సిబ్బంది పనిచేస్తున్నారు.
షిప్‌యార్డ్‌ దగ్గరకు వెళ్లాలంటే లాంచీల్లో వెళ్లాల్సిందే. ఆ లాంచీ ఎక్కడానికి టిక్కెట్‌ సౌకర్యం ఉంది. అరగంటసేపు క్యూలో నిలబడి టిక్కెట్‌ తీసుకుని లాంచీ ఎక్కాం. అది ఎక్కి అవతలివైపున్న కొండ దగ్గరకు చేరుకోవాలి. ఆ కొండమీద చిన్న గుడి ఉంది. ఆ కొండ దగ్గర నుండి చూస్తే ఎన్నో నౌకలు చమురు, బొగ్గు, తదితర సరకుల లోడ్‌తో కనిపిస్తుంటాయి. అంత దగ్గరగా వాటిని చూస్తుంటే చాలా ఆనందంగా అన్పించింది. ఒక్కో నౌక చిన్న ఊరిలాగా ఉంది.
ఏమైనా విశాఖతీర ప్రాంత సందర్శన ఓ మరుపురాని అనుభూతిగా మదిలో నిలిచిపోతుందంటే అతిశయోక్తి కాదు.
____________________________________________________________

18. మానస సరోవరం

మానస సరోవరానికి వెళ్లే దారిలో అక్కడక్కడా కనిపించే బౌద్ధ ఆరామాలు, దూరంగా కొలువు తీరిన కైలాస శిఖరాన్ని వీక్షించడం... ఆ మధురానుభూతి చెప్పడానికి మాటలు చాలవు. ఈ యాత్రకు ఆరోగ్యం కూడా సహకరించాలి.
మానస సరోవర యాత్రకు మొదటి మెట్టు నేపాల్‌. నేపాల్‌ నుండి బయలుదేరినప్పుడే మన రూపాయల్ని టిబెట్‌ కరెన్సీగా మార్చుకోవాలి.
ఈ యాత్రకు ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఒక వారం పదిరోజులకు సరిపడా దుస్తులు, స్వెటర్లు కూడా తీసుకెళ్లాలి. ఇక దారి పొడవునా స్నాన గదులు అద్దెకు ఇస్తారు.
నేపాల్‌లో అడుగు పెట్టడానికి ముందు 'కొడారె' అనే ఊరు ఉంది. అక్కడే మానస సరోవర యాత్రకు సంబంధించి నిబంధనలన్నీ పూర్తిచేసుకోవాలి.
ఖాట్మండులో చూడాల్సిన ప్రదేశాలు పశుపతినాథ్‌ మందిరం, బుఢా నీలకంఠ మందిరం.. వెళ్లే దారిలో హిమాలయ పర్వత శ్రేణులు, లోయలు, జలపాతాలు కనువిందు చేస్తాయి. మధ్యలో నేపాల్‌లోని 'కోసి' నదిని దాటాలి. అక్కడ ఎటు చూసినా ఆకుపచ్చని ఎత్తైన పర్వత శ్రేణులు, దూరాన మిలమిల మెరిసే హిమ శిఖరాలే. అవి చూస్తుంటే ప్రయాణ బడలిక ఇట్టే మాయమవుతుంది.
టిబెట్‌ నుండి చైనా భూభాగంలో అడుగు పెట్టాలంటే 100 మీటర్ల పొడవైన బ్రిడ్జ్‌ దాటాలి. దీన్ని 'ఫ్రెండ్‌షిప్‌ బ్రిడ్జ్‌' అంటారు. ఇది దాటుతుంటే భలేగా ఉంటుందిలే. కింద నురగలు కక్కే నీళ్లు ప్రవహిస్తుంటే... చుట్టూ ఎత్తైన కొండలు, వాటిపై పచ్చటి చెట్లు... ఆ ప్రకృతిని చూస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో రెండు దేశాల మధ్య వారధిని దాటడం మర్చిపోలేం.
అక్కడ్నుండి మానస సరోవరం చేరాలంటే ప్రత్యేకమైన ల్యాండ్‌ క్రూజర్లు ఉంటాయి. ఒక్కోదాన్లో నలుగురు కూర్చోవచ్చు. అది నడిపే డ్రైవర్లకు వారి మాతృభాష తప్ప హిందీ, ఇంగ్లీషు రాదు. మధ్యవర్తిగా ఒక నేపాలీ సహాయకుడు ఉంటాడు. మధ్యలో 'ఝాంగ్‌మా' అనే టిబెట్‌ పట్టణం వస్తుంది. అక్కడ నరాలు వణుకుపుట్టించే చలి.
అక్కడ్నుండి 14 గంటలు కచ్చారోడ్డు మీద ప్రయాణం చేస్తే 'న్యాలం' అనే పట్టణం వస్తుంది. అక్కడ ఉష్ణోగ్రత చాలా తక్కువ. శరీరం ఆ వాతావరణానికి అలవాటు పడాలంటే కనీసం రెండు రోజులైనా అక్కడుండాలి.
అక్కడి చలిని తట్టుకోవాలంటే తల నుండి పాదాల వరకు పూర్తిగా ఉన్ని దుస్తులు ధరించాల్సిందే.
నాల్యం నుండి 232 కిలో మీటర్ల దూరంలో 'సాగా' ఎత్తైన ప్రదేశం ఉంది. ఇది సముద్రమట్టానికి 4200 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడ జడల బర్రెలు ఎక్కువగా కనిపిస్తాయి.
సాగాలో చలిని తట్టుకోవడం మరీ కష్టం. ఒకటికి రెండు స్వెటర్లు వేసుకోవాల్సిందే. పైన మళ్లీ ఓ రగ్గు కప్పుకునేవారూ ఉన్నారు. ఈ చలికి కొంతమంది అనారోగ్యం బారిన పడుతుంటారు. ఆ చలి బెడద నుండి రక్షించుకోడానికి ఎక్కడ ఎండ దొరుకుతుందా అని వెతుక్కుంటారు.
తర్వాతి మజిలీ 'పర్యాంగ్‌' అనే గ్రామానికి. ఇది సాగాకి 285 కిలోమీటర్ల దూరంలో, 4500 మీటర్ల ఎత్తులో ఉంది. దాని తర్వాతి వచ్చేదే మానస సరోవరం.
ఎండ ఎక్కువగానే వున్నా చుట్టూ వీచే చలి గాలులు వణుకు పుట్టిస్తాయి. అక్కడ్నుండి కైలాస శిఖరం చేరాలంటే నడిచి వెళ్లాల్సిందే. 'దార్చెన్‌' అనే కైలాస శిఖరపు అడుగు ప్రాంతానికి చేరాలంటే 60 కిలోమీటర్లు నడవాలి. అక్కడికి దగ్గర్లో యమద్వార్‌, అష్టపథ్‌ అనే దేవాలయాలున్నాయి. యమద్వార్‌లో ప్రదక్షిణ చేస్తే మరో జన్మ ఉండదని కొందరి విశ్వాసం. కైలాస పర్వతానికి ఎదురుగా ఉండే చిన్న గుట్టలాంటిదే అష్టపథ్‌. దాన్ని ఎక్కి చూస్తే ఎదురుగా కైలాస, నంది పర్వతాలు అద్భుతంగా కనిపిస్తాయి.
______________________________________________________________

19. బీదర్‌ పోదామా

కొన్ని ప్రదేశాలు పర్యాటక స్థలాల్లా అనిపించవు. అక్కడికి వెళ్లి చూస్తేనే వాటి ప్రత్యేకత తెలుస్తుంది. అటువంటి వాటిలో హైదరాబాద్‌కి దగ్గర్లోలోని కర్నాటక ప్రాంతమైన బీదర్‌ ఒకటి. కొన్నేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో మద్యనిషేధం ఉన్నప్పుడు 'బీరు బాబులు' తరచూ బీదర్‌కి ప్రయాణం కడుతుండేవారు. దురదృష్టవశాత్తు బీదర్‌ అలా మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. మా ప్రయాణం ఆ సందడి సద్దుమణిగిన కొన్ని సంవత్సరాల తర్వాత జరిగిందనుకోండి!
హైదరాబాద్‌ నుండి సుమారు 140 కిలోమీటర్ల దూరంలో ఉంది బీదర్‌. 9వ జాతీయ రహదారి మీద ఓ మూడు గంటల ప్రయాణం. పటాన్‌ చెరు, సదాశివపేట దాటి, జహీరాబాద్‌ చేరాం. అక్కడ్నుండి కుడివైపుకి జాతీయ రహదారి వదిలి మల్కాపూర్‌ గుండా బీదర్‌ చేరాం. జహీరాబాద్‌ కంటే ముందే రోడ్డు పక్క ఎర్రటి మట్టి మన దృష్టిని ఆకర్షిస్తుంది. ఆ నేలలు 'లాటరైట్‌' అనే రకానికి చెందినవి. వాటిలో ఇనుము అధికంగా ఉంటుంది. అందుకే 'రస్టు' పట్టిన ముదురు ఎరుపు రంగు కనిపిస్తుంది. దారిలో (ముంబై హైవేలో) రెండు చోట్ల ఘోర ప్రమాదాలు జరిగిన దాఖలాలు కనిపించాయి. ఆ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయట. ముఖ్యంగా లోడుతో ఉన్న లారీలు. జహీరాబాద్‌లో ద్విచక్రవాహనాలకి కాస్త విశ్రాంతినిచ్చి రిలాక్సయ్యాం. రోడ్డు పక్క స్టాల్‌లో చారు, బిస్కట్‌, సమోసాలతో కాలం వెళ్లదీశాం.

అరగంట విరామం తర్వాత మా వాహనాల ఇంజన్లు వేగం పుంజుకున్నాయి. బీదర్‌ పట్టణం ఒకప్పుడు విదురా నగరం పేరుతో ఉండేదట. మహాభారతంలోని విదురుడు ఇక్కడే ఉండేవాడట. అయితే అది పురాణం. చరిత్ర ప్రకారం 1429లో బహమనీ రాజు ఒకటవ అహ్మద్‌ షా దీన్ని రాజధానిగా చేసుకున్నాడు. 'అహ్మదాబాద్‌ బీదర్‌' అని పేరు మార్చాడు. దాదాపు ఒక శతాబ్దం పాటు బహమనీ రాజుల పాలనలో ఉన్న బీదర్‌, 1527లో దక్కను పాలకులైన బరీద్‌ షాహీల చేతుల్లోకి వెళ్లింది. మరో రెండు వందల సంవత్సరాల తర్వాత ఔరంగజేబు బీదర్‌ని ఆక్రమించాడు. అతను 1713లో ఆసఫ్‌ జాహీని దక్కను ప్రాంత సుబేదారుగా నియమించాడు. ఆసఫ్‌ జాహీ 1724లో నైజాం ప్రభుత్వాన్ని నెలకొల్పాడు.

ఇంతమంది చేతులు మారినా, బీదర్‌లో మనకు కనిపించే శిధిల కట్టడాల్లో చాలా వరకు బహమనీ రాజులవే కావడం విశేషం. బీదరంతా శిధిలమౌతున్న మహా నిర్మాణంలా అనిపించింది. ఈ పట్టణానికి అయిదు ద్వారాలున్నాయి. వాటిలో ఒక దాని గుండా ప్రయాణించి 'పాత నగరానికి చేరాం. అక్కడ 15వ శతాబ్దపు బీదరు కోట ఉంది. దానికి చేరే ముందు ఒక అద్భుత నిర్మాణం కనిపించింది. అదే ఎనభై అడుగుల ఎత్తున్న పహారా గోపురం. దానిని చౌబారా అంటారు. అయిదు శతాబ్దాల క్రితం దాని పైన సైనికులు పహారా కాస్తూ పట్టణానికి రక్షణగా ఉండేవారట. ఇప్పుడు మాత్రం అది ట్రాఫిక్‌ ఐలాండ్‌లా ఉంది!

ఇటీవలి కాలంలో ఈ మహాగోపురంపై ఓ భారీ గడియారం అమర్చారు. చాలా క్లాక్‌ టవర్లలాగే అదీ పనిచేయడం లేదు. ఆ పహారా గోపురం పైకి వెళ్లే మార్గం తాళం వేసి ఉంది. ఎప్పుడూ తీయరట. ఎవరూ పట్టించుకోరట కూడా!బీదరు కోట అంత శిధిలావస్థలో ఉన్నా, నాకెందుకో హైదరాబాద్‌లోని గోల్కొండ కంటే మెరుగే అనిపించింది. కిలోమీటర్ల కొద్దీ పాకిన గోడలు, వాటిపై అక్కడక్కడా టవర్లు ఇంకా గత కాలపు రాజసాన్ని చూపుతున్నాయి. అద్భుతమైన 'ఆర్చీలు', ఒక భారీ మర్రి చెట్టు చూడ్డానికి వింతగా వున్నాయి. ఆ చెట్టుకి సమీపంలో 'రంగీన్‌ మహల్‌' ఉంది. దీన్ని 1487లో ఒకటవ మహ్మద్‌షా నిర్మించాడు. దీనిలో ఇంకా రంగురంగుల పలకలు, ముత్యాలు అమర్చిన నగిషీలున్నాయి. దాని పక్కనే ఒక చిన్న మ్యూజియం ఉంది. ఒకప్పుడు అది రాజుల స్నానశాల! రాతియుగం నాటి పరికరాలు, విగ్రహాలు, ఆభరణాలు ఇక్కడ ప్రదర్శనలో ఉన్నాయి.

ఇవన్నీ ఒక ఎత్తైతే, కాస్త దూరంలో ఉన్న 'సోలా కుంభ్‌ మసీదు' మరో ఎత్తు. దీన్ని 1423లో నిర్మించారట. దీని మధ్య భాగంలో 16 స్తంభాలున్నాయి. అందువల్లే ఆ పేరు. ఈ మసీదుకి తాళం వేసి ఉంటుంది. కానీ మ్యూజియంలో వారిని అడిగి తీయించవచ్చు. మసీదు చుట్టూ అందమైన గార్డెన్‌ కూడా ఉంది.మసీదు నుండి బయటికి వస్తుంటే కోట తాలూకు గాంభీర్యం ఇంకా కనిపించింది. అసలు ఈ కోట మూడవ శతాబ్దంలో యాదవులు, కాకతీయులకు చెందినదని పురాతత్వ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆ తర్వాత దీన్నే సుల్తాన్‌ అహ్మద్‌ షా బహమనీ తన కోటగా మార్చుకుని, టర్కీ-పర్షియా నుండి కళాకారులను పిలిపించి పునర్నిర్మించాడు. చౌబారా గోపురానికి సమీపంలోనే మహమూద్‌ గవన్‌ మదరసా ఉంది. ఇది దాదాపుగా శిధిలమైపోయినట్లే. అప్పట్లో ఇది మూడంతస్థుల భవనమట. దీనికి నాలుగు ఎత్తైన మినార్లూ ఉంటేవట. ఇప్పుడొక్కటే మిగిలింది. దానిపై తాపడం చేసిన నీలం, తెలుపు, పసుపు రాళ్లు ఇరాన్‌ నుండి తెప్పించారట.

ఇక్కడికి దగ్గర్లోనే బహమనీ సుల్తానుల సమాధులున్నాయి. అయితే ఇవన్నీ అత్యంత హీనావస్థలో ఉన్నాయి. సుల్తాన్‌ హుమయున్‌ సమాధి మాత్రం పిడుగు వల్ల రెండుగా చీలిపోయింది. ఇవన్నీ చూస్తే చరిత్ర ఎంత ఘనంగా ఉండేదో అనిపిస్తుంది. ఈ ప్రాంతాన్ని మరింత ఆకర్షణీయంగా చేసి పర్యాటకులను రప్పించవచ్చనిపిస్తుంది కూడా.బీదర్‌లో శతాబ్దాలనాటి శిధిలాలూ, సుల్తానుల సమాధులే కాదు... అద్భుతమైన 'బిద్రీ' కళ కూడా కనిపిస్తుంది. నల్లటి లోహపు పాత్రలపై తెల్లటి వెండి దారాలతో అందమైన చిత్రాలుగా అమర్చడం బిద్రీ ప్రత్యేకత. ఆ కళాకారుల వేళ్లు సున్నితంగా కళాఖండాలు సృష్టించడం చూస్తుంటే అబ్బురపోక తప్పదు. బీదర్‌ వెళ్తే మాత్రం కచ్చితంగా ఒక బిద్రీ పాత్ర తెచ్చుకుంటారు. అంత బావుంటాయవి!
________________________________________________________________

20. అజంతా గుహలు ఆకట్టుకునే చిత్రాలు

ఎల్లోరా గుహలు చూసిన ఆనందంతో, ఇక్కడేం చూడబోతున్నామనే ఆత్రుతతో అజంతా బయల్దేరాం. తెల్లవారుజామునే బయల్దేరామేమో చుట్టుపక్కలంతా మంచు తుంపర పడుతోంది. దారికిరువైపులా ఉన్న చెట్లు కలిసిపోయి ఆర్చిలా స్వాగతం చెబుతున్నాయి. రోడ్డుకి ఒకవైపు పెద్ద పెద్ద కొండలుంటే మరోవైపు అగాధంలాంటి లోయ... మధ్య మధ్యలో చిన్న చిన్న ఊళ్లు... అంటే ఓ పది, పదిహేను ఇళ్లు మాత్రమే... ఎల్లోరా నుండి అజంతా వరకు దారిమొత్తం ఇలా చేలమధ్యలోనే ఇళ్లు కనిపించాయి. పచ్చని పొలాల మధ్య ఆ పొదరిళ్లు ముచ్చటగా ఉన్నాయి.
ఎల్లోరా నుండి 100 కిలోమీటర్ల దూరంలో అజంతా గుహలున్నాయి. వీటి నిర్మాణం తర్వాత ఎన్నో ఏళ్లు నిర్లక్ష్యానికి గురై తిరిగి 18వ శతాబ్దంలో బయటపడ్డాయి. అజంతా అనే ఊరి నుండి 8 కిలోమీటర్ల దూరంలో వున్నాయి. గుహలు మరో 4 కిలోమీటర్ల దూరంలో ఉండగానే మనం తీసుకెళ్లే వాహనాలు ఆపేస్తారు. అక్కడ్నుండి వారి వాహనాల్లోనే వెళ్లాలి. అక్కడ కూడా ఎ.సి, నాన్‌ ఎ.సి బస్సులున్నాయి. ఎల్లోరా గుహల దగ్గర కంటే ఇక్కడ ఇంకా ఎక్కువ జన సందోహం ఉంది.
చుట్టూ చాలా పెద్ద అడవి... పర్వత శ్రేణులు, పచ్చని ప్రకృతి మధ్య గుర్రపునాడా ఆకారంలో ఈ గుహలున్నాయి. అయితే ఎల్లోరా కంటే ఇవి తక్కువ వైశాల్యంలో ఉండడం వల్ల ఎక్కువ దూరం నడిచేపని ఉండదు. అక్కడి లాగే ఇక్కడ కూడా కొండని తొలిచారు. వీటిలో కొన్ని క్రీస్తుపూర్వానికి చెందినవి కూడా ఉన్నాయి. వీటి ముందు అందమైన పెద్ద లోయ ఉంది. ఈ గుహలన్నిటిలో శిల్పకళ కన్నా చిత్రకళ అమితంగా ఆకర్షిస్తుంది. ఆ చిత్రాలవల్లే ఈ గుహలకి ఇంతటి పేరు ప్రఖ్యాతులొచ్చాయి.
మొత్తం 30 గుహల్లో కొన్ని అసంపూర్ణంగా ఉన్నాయి. ముఖ్యంగా చూడాల్సినవి 1,2,16,17,19,26,29 గుహలు. వీటిలో చాలా వరకు చిన్న చిన్న లైట్లు ఏర్పాటు చేశారు. రెండు మూడు గుహల్లో పెద్ద లైట్లు కూడా ఉన్నాయి. అన్ని గుహల్లో ఫొటోలు తీసుకోవచ్చు కానీ ఫ్లాష్‌ వెయ్యనివ్వరు.
1వ గుహ ఐదవ శతాబ్దం నాటిది. దీని ముఖద్వారం చక్కటి నగిషీలతో దర్శనమిస్తుంది. వరండా లాంటి ముందు భాగం దాటి లోపలికెళ్తే విశాలమైన గది ఉంది. అందులో మళ్లీ చిన్న చిన్న గదులున్నాయి. కానీ లోపలంతా చీకటి. వారు ఏర్పాటు చేసిన లైట్లే లేకపోతే ఏమీ కనిపించదు. ముఖద్వారానికి ఎదురుగా ఉన్న గదిలో పెద్ద బుద్ధుడు, ఆయన మొదటి ఐదుగురి శిష్యుల విగ్రహాలున్నాయి. ఇక చుట్టూ ఉన్న గోడలు, పై కప్పంతా అనేక కథలు చిత్రించిన ఆనవాళ్లు కనిపించాయి. కానీ వీటిలో సగానికిపైగా ఇప్పుడు కనిపించడం లేదు. రంగు వెలిసిపోయి, ఊడిపోయినట్లున్నాయి. ఉన్నవాటి వరకు మాత్రం చాలా బాగున్నాయి.
కనిపించే కొద్ది చిత్రాల్లో చాలా వరకు జాతక కథలే. వాటిలో ముఖ్యమైనవి మనందరికీ తెలిసిన శిబి చక్రవర్తి కథ, గౌతముడు ఏడేళ్ల అన్వేషణ తర్వాత జ్ఞానోదయం పొందుతున్న చిత్రం ముఖద్వారానికి ఎడమవైపు గోడకి ఉన్నాయి. కుడివైపు గోడమీద చిత్రించిన కథ విషయానికొస్తే... దుష్టుడైన మార గౌతముడికి అడుగడుగునా ఆటంకాలేర్పరుస్తాడు. చివరికి గౌతముని తపస్సును భగం చేయమని తన కూతుళ్లనే పంపించే ఇతివృత్తం చిత్రించారు. మిగతా గోడలకి బుద్ధుని జీవితంలో ముఖ్యమైన సంఘటనలకు చెందిన అనేక చిత్రాలు కనిపిస్తాయి. ఇంకా వీటి మధ్యలో కోతులు, నెమళ్ల చిత్రాలూ ఉన్నాయి.
2వ గుహలో గౌతముని పుట్టుకకు సంబంధించిన అనేక సంఘటనలు చిత్రించారు. గౌతముని తల్లి మాయకు ఒక కల రావడం, దాన్ని ఆమె భర్తతో చెప్పడం, అతను బ్రాహ్మణులను ఆస్థానానికి పిలిపించి మాయకు వచ్చిన కలకు అర్థమేంటని అడగడం, వారు ఆమెకు గౌతమోత్తముడు జన్మిస్తాడని చెప్పడం... అక్కడ చిత్రించారు. ఈ గుహలో పైకప్పుకి ఒక చోట బారులు తీరిన హంసలు కనిపించాయి. ముందున్న గోడకు మరో చక్కని చిత్రం... రాజు ఒక స్త్రీని ఖడ్గంతో శిక్షిస్తున్నట్లు, ఆమె భయపడి రాజుని వేడుకుంటున్నట్లు వుంది.
అజంతాలో అన్నింటికంటే పెద్ద గుహ నాల్గవది. ముఖద్వారం దాటి లోపలికెళ్తే 28 స్థంభాలున్న పెద్దగది ఉంది. కుడివైపు గోడకి బుద్ధుణ్ణి ప్రార్థిస్తున్న భక్తులు, ఒక జంటని తరుముకొస్తున్న ఏనుగు, ఉడుతతో ఆడుకుంటున్న స్త్రీ చిత్రాలు కనిపిస్తాయి. 6వ గుహలో అనేక భంగిమల్లో బుద్ధుని విగ్రహాలున్నాయి.
9వ గుహ క్రీస్తుపూర్వం ఒకటవ శతాబ్దం నాటిది. ఇందులో రోజువారీ జీవితంలో జరిగే సంఘటనలను చిత్రించారు. 10 వ గుహ క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం మొదటి భాగానికి చెందినది. ఇది చూడ్డానికి తొమ్మిదవ గుహలాగే ఉంటుంది. కానీ దానికంటే పెద్దది. ఇక్కడున్న అన్ని గుహలకంటే ఇదే ప్రాచీనమైంది. ఇందులో రాజు తన సైన్యంతో పాటు, నృత్యకళాకారులు, ఆస్థాన గాయకులతో కొలువుతీరి ఉన్నాడు. ఇందులో వారు ధరించిన దుస్తులు, నగలు, కేశాలంకరణ ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తుంది. వేయి సంవత్సరాల తర్వాత కూడా ఇంతందంగా కనిపిస్తున్నాయంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ చిత్రాలు గీచారో! గోడకు రెండు వైపులున్న చిత్రాలు పాడైపోకుండా కొంత వరకు అద్దాలు బిగించారు. ఈ గుహలోని గోడలమీద, స్థంభాలమీదున్న పెయింట్లు చాలా వరకు ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే లైట్లు వేస్తేనే అవి కనిపిస్తాయి.
13వ గుహని పురావస్తు శాఖవారు స్టోర్‌ రూమ్‌గా వాడుతున్నారు. 16వ గుహని సన్యాసుల కోసం నిర్మించారట. ఇందులో గౌతముడికి బాల్యంలో ఎదురైన అనేక సంఘటనలను చిత్రించారు. ముఖ్యంగా 'మరణిస్తున్న రాకుమారి' చిత్రం అందరినీ ఆకట్టుకుంది. రాకుమారి మృత్యుముఖంతో ఉంటే, ఆమె చెలికత్తెలు దుఃఖిస్తున్నట్లున్న చిత్రం చూపరులను కట్టిపడేస్తుంది. ఈ చిత్రం బుద్ధుని పినతండ్రి కొడుకు భార్యదట. నందుడు సన్యాస జీవితం కోరుకున్న సందర్భంలోనిది ఈ చిత్రం. ఆమె పడుతున్న హృదయ వేదనను అలా చిత్రించారు. 16వ గుహ దగ్గరి నుండి లోయలోకి (ఈ లోయ ఒకప్పటి నది) మెట్లున్నాయి.
17వ గుహ ముందు భాగంలో అందమైన నగిషీలు చెక్కారు. ఇందులో మానవ చిత్రాలు, గంధర్వులు, అప్సరసల చిత్రాలున్నాయి. కుడివైపు గోడమీద బుద్ధుడు మదపుటేనుగును అదుపులోకి తెస్తున్న చిత్రం అద్భుతంగా ఉంటుంది. జాతక చిత్రాల్లో ఆత్మ బలిదానం ఎక్కువసార్లు కనిపించింది. అందులో ఒకదాని వృత్తాంతం... ఒక జన్మలో బోధిసత్వుడు తనకున్నవన్నీ దానం చేయాలనే తపనతో ఉంటాడు. తన దగ్గరున్న అద్భుత శక్తిగల ఏనుగును దానం చేస్తాడు. తన దగ్గరున్న రథాన్ని, గుర్రాల్నీ దానం చేస్తాడు. చివరికి పిల్లల్ని కూడా దానం చేసే దృశ్యాలు మనసుకు హత్తుకుంటాయి. ఆ చిత్రాల్లోని ముఖ కవళికలు కూడా చాలా స్పష్టంగా కన్పిస్తాయి. బుద్ధుని ముందు ఓ తల్లీ కొడుకులు నమస్కరిస్తున్న చిత్రం, రాజమహలు ముందు బుద్ధుడు భిక్షాటన చేసే చిత్రం మరో గోడమీద వున్నాయి.
19వ గుహ ముందుభాగంలో చాలా బుద్ధ విగ్రహాలు అనేక వరుసలుగా ఎదురెదురుగా ఉన్న రెండు గోడల మీద చెక్కారు. ఇందులో బుద్ధుడి విగ్రహాలు అనేక ముద్రల రూపంలో ఉన్నాయి. లోపలున్న పెద్ద బుద్ధ విగ్రహం పైన ఒకదానిమీద ఒకటి మూడు గొడుగులున్నాయి. ఇవి బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి..... తెలుపుతాయట.
ఈ గుహల తవ్వకాలన్నింటిలో 24వ గుహ పెద్దది. కానీ ఇది పూర్తికాలేదు. 26వ గుహలో శయనిస్తున్న బుద్ధుడు కనిపిస్తాడు. ఈ విగ్రహం చాలా పెద్దది. ఇక్కడి గోడపై కూడా బుద్ధుని తపోభంగం చిత్రించారు.
అజంతా గుహలకు సోమవారం సెలవు. ఈ గుహలకు వెళ్లే బస్టాపులో పెద్ద షాపింగ్‌ కాంప్లెక్స్‌ కూడా ఉంది. ఇక్కడ అడుగడుగునా కమర్షిలైజేషన్‌ కనిపించింది. ఈ గుహల్లో ముఖ్యమైన వాటన్నింటి దగ్గరా క్యూ పద్దతి ఉంది.
____________________________________________________________

21. ఎల్లోరా గుహలు

స్కూళ్లకి నాలుగు రోజులు సెలవులు వచ్చేసరికి ఎక్కడికైనా వెళ్దామనుకున్నాం. మా అమ్మాయి మామయ్య దగ్గరికి వెళ్దామంది. సరేనని మా తమ్ముడికి (తను పూనాలో ఉంటాడు) వస్తున్నామని చెప్పాం. తను అందరం కలిసి అజంతా, ఎల్లోరా గుహలకు వెళ్దామంటే ఓకే చెప్పాం.
ఎల్లోరా గుహలున్న ఊరిపేరు వెరూల్‌. చుట్టూ అడవి... పచ్చని చెట్లు... ఓ పే...ద్ద... కొండ. ఆ కొండ మధ్యలో అగ్గిపెట్టెల్లాంటి చిన్న చిన్న గుహలు... ఆ రోజు వాతావరణం కూడా మబ్బులు పట్టి చల్లగా, ఆహ్లాదకరంగా, వర్షం వచ్చేలా ఉంది.

గుహల దగ్గరికెళ్లగానే ఇద్దరు ముగ్గురు పరుగెత్తుకొచ్చి ఆరుగురికి (మేం వెళ్లింది ఆరుగురం) మూడొందలు ఇస్తే ఆటోలో తిప్పి మొత్తం గుహలు చూపిస్తామన్నారు.ఆటోలో వెళ్తే తనివితీరా చూడలేమని నడిచే చూద్దామనుకున్నాం ఎల్లోరా గుహల్లో హిందూ, బౌద్ధ, జైన మతానికి చెందిన శిల్ప కళ కనిపిస్తుంది. ఈ గుహలన్నీ ఎక్కువ శాతం తొమ్మిది నుండి 11వ శతాబ్దానికి చెందినవి. 1 నుండి 12వ గుహ వరకు బౌద్ధమతానికి, 14 నుండి 29 వరకు హిందూమతానికి, 30 నుండి 34 వరకు ఉన్న గుహలు జైన మతానికి చెందినవి. అయితే వీటిలో కొన్ని గుహలను మొదలు పెట్టి సగంలో ఆపేశారు. వాటిలో రెండు మూడు శిల్పాలు మాత్రమే ఉన్నాయి. మరి కొన్ని గుహలనైతే తవ్వి వదిలేశారు.

ముందుగా ఎటునుండి చూడాలో అర్థం కాలేదు. సరేనని అలా నడుచుకుంటూ వెళ్తే 14వ నెంబరు గుహ అని ఓ గుహ ఎదురుగా రోడ్డుమీద రాసి ఉంది. అక్కడి నుండి 1వ గుహ వరకు వరుసగా వున్నాయి. అంటే మేం 14 నుండి 1 వరకు వెనక్కి చూశాం. 14వ గుహ బయటినుండి చూసి లోపలంతా చీకటిగా వుంటుందేమో అనుకున్నాం. అనుకున్నట్లుగానే లోపల చీకటిగానే ఉంది. అయితే మరీ అసలు కనిపించనంత చీకటి కాదు. అక్కడున్న శిల్పాలన్నీ చక్కగా కనిపిస్తున్నాయి. ఒక్కో శిల్పం 12 అడుగుల పైనే ఉంది.

ఈ గుహ మధ్యలో ఉన్న గదిలో పెద్ద బుద్ధ విగ్రహం, దానికి ఎడమవైపు గోడ మొదటి ఫలకం మీద దుర్గాదేవి విగ్రహం, మూడవ ఫలకం మీద విష్ణుమూర్తి విగ్రహం ఉన్నాయి. ఇంకా లక్ష్మీదేవి, శివుడు, పార్వతీదేవి విగ్రహాలు కూడా ఉన్నాయి. బాబోరు కొండని తొలిచి ఇలా చెక్కడానికి ఎన్నేళ్లు పట్టిందో! ఇక్కడ మరో విషయమేంటంటే ఈ గుహలన్నీ కొండ వాలు తలాన్ని ఎన్నుకుని చెక్కారు.

ముఖ్యంగా చెప్పుకోవాల్సిన గుహలు 11, 12. వీటిని చూసి ఆహా... ఏమి పనితనం అని మెచ్చుకోకుండా ఉండలేం. ఎందుకంటే ఈ రెండు గుహలూ మూడు అంతస్తులుగా చెక్కారు. ఈ రెండింటిలోనూ 12వ గుహ ఇంకా పెద్దది. దీన్ని చూశాక ఇది నిజంగా కొండని తొలిచే చెక్కారా లేదా సిమెంటుతో కట్టారా అనిపించింది. దీన్ని 'తీన్‌ థల్‌' అని పిలుస్తారట. దీని ద్వారం సుమారు 15 మీటర్ల పైనే ఉంది. మొదటి అంతస్తు కొలత 35×13 మీటర్లు. పై రెండు అంతస్తులు కూడా అదే కొలతతో ఉన్నాయి. పైకెక్కడానికి మెట్లు చాలా పెద్దగా ఉన్నాయి. ఒక్కో మెట్టు ఎత్తు అడుగున్నర, రెండడుగుల వరకూ ఉంది. ఈ గుహలోని బుద్ధవిగ్రహం ప్రసన్న వదనంతో చేతులు జోడించి నమస్కరిస్తున్నట్లు ఉంది.

చూసేకొద్దీ ఇంకా చూడాలనిపించేలా ఉందీ విగ్రహం. రెండో అంతస్తులో కాపీ పేస్ట్‌ చేసిన వాటిలా గుమ్మానికి అటు ఏడు, ఇటు ఏడు అందంగా చెక్కబడిన బుద్ధ విగ్రహాలున్నాయి. వీటిలో ప్రతి విగ్రహం పక్కన ధర్మచక్రం, తలపైన బోధివృక్షం, ఆయన్ని ఆశీర్వదిస్తున్నట్లు పైన గంధర్వులున్నారు. పక్కనున్న మరో గోడకి ఇంకో పేద్ద బుద్ధవిగ్రహం ఉంది. తలమీద రింగులు తిరిగిన జుట్టుతో సహా ఎంత బాగా చెక్కారో... ఇందులోని బుద్ధవిగ్రహానికి చిన్న చిన్న రిపేర్లు చేస్తున్నారు. అందుకే కాబోలు రెండు మూడు విద్యుత్‌దీపాలు పెట్టారు. ఈ గుహల్లో మరెక్కడా లైట్లు కనిపించలేదు. పైకి సాదాసీదాగా కనిపించినా గుహ లోపలకి వెళ్లి తిరిగి చూస్తుంటే దాని గొప్పదనం, శిల్పుల పనితనం, వారు పడిన కష్టం తెలుస్తుంది. ఆ రోజుల్లో విద్యుత్‌ దీపాలు లేకుండా గుడ్డి దీపాలు పెట్టుకుని ఆ చీకట్లోనే అంత పెద్ద కొండని తొలిచారంటే మాటలు కాదు. అంతేకాదు కొండపై నుండి వచ్చే వర్షపు నీళ్లు లోపల నిలవకుండా బయటికి పోడానికి తగిన ఏర్పాట్లు కూడా ఉన్నాయి.

10వ గుహ రెండతస్థులుగా నిర్మించారు. ఇందులో ఎక్కువగా నగిషీలు చెక్కబడ్డాయి. ఇవి రాతితో చెక్కిన వాటిలా వుండవు. పోతపోసిన అచ్చుల్లా ఉంటాయి. దీని లోపల పై కప్పు భాగమంతా అనేక ఆర్చీలు పక్కపక్కన పేర్చినట్లుంది. స్థంభాల పై భాగంలో అనేక మానవాకృతిలో శిల్పాలు చెక్కారు. ఈ గుహలోని బుద్ధుడి వెనుక బౌద్ధ స్థూపం కూడా ఉంది. ఈ గుహని విశ్వకర్మకి అంకితం చేశారట. బౌద్ధమతానికీ ఆయకీ ఎటువంటి సంబంధమూ లేకపోయినా ఆయనమీదున్న గౌరవంతో శిల్పులు ఈ పని చేశారు.

6వ గుహలో చాలా శిల్పాలున్నాయి. అందులో చెప్పుకోవాల్సింది హిందువులు చదువుల తల్లిగా కొలిచే సరస్వతీ దేవి విగ్రహం. ఈమెకి దేశంలో రెండు చోట్ల మాత్రమే గుళ్లున్నాయంటారు. అయితే ఇక్కడ మాత్రం శిల్పం ఉంది. చెప్పుకోదగ్గ గుహల్లో మరొకటి 5వ గుహ. ఇది క్రీస్తు శకం 7వ శతాబ్దం నాటిది. ఇది చాలా పెద్దది. 351/2 మీటర్ల పొడవు, 17 మీటర్ల వెడల్పు ఉంది. ఎక్కువ స్థంభాలున్నది కూడా ఇందులోనేనేమో. మొత్తం 24 స్థంభాలున్నాయి. దీన్ని అప్పట్లో సమావేశాలకు, భోజనశాలగా ఉపయోగించేవారట.

3వ గుహలో ఇరువైపులా సర్పాలతో, పద్మాసీనుడైన బుద్ధుడు కనిపించాడు. ఇది కూడా దాదాపుగా 5వ గుహను పోలి వుంది. 2వ గుహలో సింహాసనంపై కూర్చున్న బుద్ధుడున్నాడు. ఇది బుద్ధుని రాజరికానికి గుర్తుగా చెక్కారేమో అనిపించింది. అయితే ఇందులో బుద్ధుని శిష్యబృందం కూడా కనిపిస్తుంది. ఇక 1వ గుహ ఎల్లోరాలోని అన్నింటికంటే అతి పురాతనమైనది. 6, 7 గుహల వద్ద చిన్న జలపాతం ఉంది. వర్షపు నీరు ఆ గుహల అంచుపై నుండి లోయలోకి పడుతుందేమో అనుకున్నాం. కాదని అక్కడి వాచ్‌మెన్‌ చెప్పాడు. ఎన్నో ఏళ్లనుండి అలా పడుతూనే ఉందట. చిరు జల్లులతో చాలా బావుంది.

ఇక అక్కడ్నుండి బ్యాక్‌ టు పెవిలియన్‌ అని మొదలుపెట్టిన 14వ గుహ దగ్గరికి వచ్చాం. దాని పక్కనే 15వ గుహ ఉంది. అప్పుడే వర్షం మొదలైంది. అలా వర్షంలోనే తడుస్తూ, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ 15వ గుహ చూశాం. దీని లోపలికి వెళ్లాంటే చాలా మెట్లెక్కాలి. దీన్ని దశావతార టెంపుల్‌ అంటారు. ఇది క్రీస్తుశకం 5,7 శతాబ్దాల మధ్యకాలం నాటిది (758-556 ఎ.డి). దీనికెదురుగా ఓ మండపం ఉంది. ఇది ఆనాటి నాట్యమండపమట.ఈ గుహ కూడా రెండంతస్తులు ఉంది.

పై భాగంలో నాలుగు చిన్న చిన్న గదులున్నాయి. గోడలమీద శివుడికి సంబంధించిన అనేక అవతారాలున్నాయి. ఎనిమిది చేతులతో రాక్షస సంహారం చేస్తున్న శివుడు, శివతాండవం చేస్తూ, పార్వతితో కలిసి పాచికలు ఆడుతున్నట్లు... ఇలా అనేక రకాల భంగిమలున్నాయి. గర్భగుడిలాంటి గదిలో పెద్ద లింగాకారం, దానికెదురుగా నంది ఉన్నాయి. ఇక్కడున్నవన్నీ కొండనుండి తొలిచినట్లు కనిపిస్తాయి. కానీ ఈ నంది మాత్రం తెచ్చిపెట్టినట్లపించింది. ఇందులోని స్థంభాలు ఒక్కోటి మీటరు వైశాల్యంతో చాలా పెద్దగా ఉన్నాయి. మెట్లు కూడా అంతే, ఒక్కోటి రెండడుగుల ఎత్తు ఉంది. వీటిని ఎక్కడం లాగే దిగడమూ కష్టమే. ఈ స్థంబాలకి గతంలో తోరణాలు కట్టారేమో(?)! ప్రతి దానికీ నాలుగు వైపులా చిన్న చిన్న రంధ్రాలున్నాయి.

16వ గుహ అన్నింటికంటే ప్రధానమైనది, ముఖ్యమైనది కూడా. ఆ విషయం దీన్ని చూసింతర్వాత గానీ తెలీలేదు. దీనికెదురుగా ఉన్న స్థలాన్ని పార్క్‌లాగా చేశారు. అక్కడ కూర్చుంటే మనసుకు హాయిగా, అప్పటి వరకు ఉన్న అలసట మొత్తం పోయింది. ఇక లోపలికెళ్లి చూస్తే... వావ్‌... అనకుండా ఉండలేరు. కళ్లు తిప్పుకోలేనంత అందంగా ఉందా గుహ. దీన్ని తలపెట్టిన వారిని మెచ్చుకోకుండా, అభినందించకుండా ఉండలేం. అన్నట్టు దీనికి సెక్యూరిటీ కూడా ఉందండోరు. దీన్ని గుహ అని కూడా అనకూడదేమో! ఎందుకంటే చూడ్డానికి అదో గుడి గోపురంలా ఉంది. ముదురు సిమెంటు రంగులో (అదో రకం నలుపు రంగు) ఉన్న కొండని తొలిచిన గుహ అది. ఓ ఆరేడంతస్థుల కంటే ఎత్తుగా ఉంటుందేమో ఆ కొండ. అమ్మో అంత కొండని తొలిచి ఇంత బాగా చెక్కడానికి ఎన్నేళ్లు పట్టిందో అనిపించింది.

నిజంగానే దీని చెక్కడానికి ఏళ్లు కాదు, శతాబ్దాలే పట్టింది. 200 సంవత్సరాలపాటు, 10 తరాల వాళ్లు దీని నిర్మాణంలో పాల్గొన్నారట. దీన్ని కైలాస గుహ అంటారు. లోపలకి అడుగు పెట్టగానే రెండు గజరాజులు స్వాగతం పలుకుతాయి. అయితే అందులో ఒకటి బాగానే ఉంది కానీ, రెండో దానికి తొండం లేదు. చాలా వరకు పాడైపోయింది. గజరాజుల పక్కన రెండు పెద్ద ద్వజస్థంభాలున్నాయి. వీటి మధ్యలో రెండంతస్తుల నిర్మాణం, దాని వెనుక గుడి గోపురం ఉన్నాయి. కింది నుండి తల పైకెత్తి చూస్తే ఆ కొండ ఆకాశాన్ని తాకుతుందా అనిపిస్తుంది. ఓV్‌ా...! దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. చూడాల్సిందే గానీ చెప్పడానికి మాటలు చాలవు.

చరిత్రలోకెళ్తే... దీని నిర్మాణాన్ని రాష్ట్రకూట వంశానికి చెందిన దంతి దుర్గ అనే రాజు 8వ శతాబ్దంలో మొదలెట్టాడు. కానీ ఆయన కాలంలో ఎక్కువ పని జరగలేదు. 9-11 శతాబ్దాల మధ్య ప్రాంతంలో దీనికి మెరుగులు దిద్దారు. కృష్ణ -1 అనే రాజు ప్రత్యేక శ్రద్ధ పెట్టి దీని నిర్మాణం పూర్తి చేయించాడు. దీన్ని ప్రత్యేకంగా శివుడి కోసమే నిర్మించారట. ముఖద్వారానికి ఎదురుగా ఉన్న మండపంలో లక్ష్మీదేవి విగ్రహం ఉంది. లోపలి భాగంలో గోపురం గోడల చుట్టూ ఏనుగుల శిల్పాలున్నాయి. అవే గోపురాన్ని మోస్తున్నాయా అనిపిస్తుంది.

ఏనుగులు ఆనాటి రాజుల శక్తికి, గొప్పదనానికి గుర్తు. ఇంకా అనేక జంతువుల బొమ్మలు కూడా ఉన్నాయి. ఆ కాలంలో జంతువుల మీద ఎంత ప్రేమ చూపించేవారో, వాటిని ఎంత శ్రద్ధగా చూసేవారో తెలుసుకోడానికి ఇవి ఉపయోగపడతాయి. ఇందులో గంగ, యమున, సరస్వతి శిల్పాలున్నాయి. గంగ స్వచ్ఛతకు, యమున దైవత్వానికి, సరస్వతి విజ్ఞానానికి ప్రతీకలుగా వీటిని చెక్కారట. గోపురం ఉన్న భాగంలో ఇరువైపుల ఉన్న గోడలపై రామాయణ, మహా భారత గాథలకు చెందిన అనేక దృశ్యాలు చెక్కారు. ఈ ఆవరణలో ఓ మండపం కూడా ఉంది. దీన్ని రంగ్‌ మహల్‌ అంటారు. ఇందులో నాట్యం చేస్తున్న శివుడు, అన్నం పెట్టే అన్నపూర్ణ విగ్రహాలున్నాయి. ఈ గుహలోనుండి బయటికి రావడానికి అంత తొందరగా మనసొప్పదు. ఎంత సేపు చూసినా తనివి తీరదు. ఇందులో ఓ గ్యాలరీ కూడా ఉంది. అందులో కైలాసాన్ని వణికించే రావణుడి పురాణాన్ని తెలిపే గాథలు చెక్కారు.

16 గుహకి ఎడమవైపున 15 నుండి 1వరకు వరుసగా ఉన్నాయి. కుడివైపు 17 నుండి 34వ గుహ వరకు ఉన్నాయి. 17, 20 గుహల్లో లింగాకారం, బ్రహ్మ, విష్ణువు, వినాయకుడు, మహిషాసురమర్థిని శిల్పాలు ఉన్నాయి. ఇందులోని స్థంభాలకు కిందనుండే శిల్పాలు చెక్కారు. 21వ గుహ 7వ శతాబ్దానికి చెందింది. ఇందులోని స్థంభాలపై చక్కటి నగిషీలు చెక్కారు. దీని ముందుభాగం చాలా అందంగా ఉంది. ఇందులో మొసలి వాహనంపై గంగాదేవి విగ్రహం పెద్దగా, అందంగా ఉంది.

ఇక్కడున్న నంది అన్ని గుహల్లో కంటే కొంచెం రిచ్‌గా, ప్రత్యేకంగా కనిపిస్తుంది. 25వ గుహ ఇక్కడున్న అన్నిటికంటే పెద్దది. ఇందులో ఏడు గుర్రాలతో ఉన్న రథంలో నిల్చున్న సూర్యుడు కనిపిస్తాడు. ఉష, ప్రత్యూష అనే ధనుస్సు, బాణాలను పట్టుకుని ఉంటుందీ శిల్పం. 27వ గుహలో బలరామ, కృష్ణుల విగ్రహాలున్నాయి. ఈ గుహ తర్వాత ఓ చిన్న జలపాతం చాలా ఎత్తునుండి ప్రవహిస్తుంది. ఇది బాగా వర్షాలు పడినప్పుడు మాత్రమే ఉంటుందట.

29వ గుహ కూడా పెద్దదే. ఇందులో గదుల సమూహం ఉంది. అవి కొంచెం క్రాస్‌గా ఉంటాయి. ఇక్కడ హిందూ ఆలయాల్లోలాగా మెట్లకు రెండువైపులా సింహాలు కనిపిస్తాయి. అంటే మిగతా వాటికి కొంచెం భిన్నంగా ఉంటుందీ గుహ. ఇందులో రౌద్ర రూపంలో ఉన్న శిల్పమొకటుంది (పేరు తెలీదు). మరో మండపంలో విలయ తాండవం చేస్తున్న నటరాజ విగ్రహం ఉంది. ముందు భాగంలో యమునానదికి మనిషి రూపమిచ్చి అందంగా మలిచారు. 30 గుహ 16వ గుహని పోలి ఉంది. దీన్ని ఛోటా కైలాస్‌ అంటారు. మొత్తం నగిషీలతో చెక్కబడి ఉంది. ఇందులో మహావీరుని శిల్పం, దాని చుట్టూ మరికొన్ని శిల్పాలున్నాయి. 31లో కూడా జైనుల విగ్రహాలే వున్నాయి. 32వ గుహ పేరు ఇంద్ర సభ. ఇది రెండంతస్తులతో ఉంది.

ముఖద్వారం వద్ద పెద్దరాతి ఏనుగు స్థంభం, 12వ గుహలో ఉన్నట్లుగా పై కప్పుకి పద్మం, అందులో మహావీరుని విగ్రహం చెక్కబడి వుంది. ఒక జైన మతస్థుడు తీవ్రమైన తపోదీక్షలో ఉన్నట్లు మరో విగ్రహం ఉంది. పై అంతస్థులో నగిషీలు చెక్కిన స్థంభాలు, పెద్ద మండపం ఉన్నాయి. ఎల్లోరా గుహలన్నింటిలోని నగిషీల కంటే ఇక్కడివి ఆకర్షణీయంగా ఉన్నాయి. 34వ గుహకు అర్థచంద్రాకారపు ఆర్చి గుండా వెళ్లాలి. ఇక్కడ కూడా 32వ గుహలో లాగే అందంగా చెక్కబడిన శిల్పాలు, స్థంభాలున్నాయి. జైన మతానికి చెందిన శిల్పకళ ఇక్కడ చాలా ఉంది.

సోమవారం ఎల్లోరా గుహలకి సెలవు. ఇందులోకి వెళ్లడానికి ఎంట్రన్స్‌ టిక్కెట్‌ 5 రూపాయలు. తినడానికి ఏమైనా తీసుకెళ్తే మంచిది. అన్నీ అక్కడ కొనుక్కుని తినాలన్నా కష్టమే. ఈ గుహలన్నీ చూసిన తర్వాత మాత్రం ఓ మంచి అనుభూతికి లోనవుతారు (కానీ కాళ్లు నొప్పెడతాయనుకోండి. అది వేరే విషయం).

ఇలాంటివి మళ్లీ మళ్లీ చూడలేం కాబట్టి హడావుడి పడకుండా కొంచెం తీరిగ్గా చూస్తేనే బాగుంటాయి. చుట్టూ ఉన్న ప్రకృతి కూడా చాలా బావుంటుంది. కాకపోతే వీటిని చూడడంలో మునిగిపోయి దాని ప్రాముఖ్యత కాస్త తగ్గుతుంది అంతే. అయితే మాత్రం ప్రకృతిని పూర్తిగా వదిలేసినట్లు మాత్రం కాదు. గుహలపైకి ఎక్కి దిగేటప్పుడు అది మన కళ్లెదురుగానే ఉంటుందిగా. మధ్య మధ్యలో దాన్నీ ఆస్వాదించొచ్చు. మనసుండాలే కానీ మార్గముండదా ఏంటి?!
____________________________________________________________

22. తిరుమల నామాలగెవి చూద్దామా!

తెలుపు, ఎరుపు, పసుపు రంగు మట్టి సహజసిద్ధంగా తయారు కావడం అక్కడి ప్రత్యేకత. అక్కడున్న కోనేటికీ ఓ విశిష్టత ఉంది. అదేంటంటే సూర్యకిరణాలు ఆ కోనేట్లో పడవు. చుట్టూ చీకటి. ఆ కోనేటి లోతెంతో తెలియదు. మొసళ్లు, కొండచిలువలు ఏవైనా ఉన్నాయేమో కూడా తెలియదు.
మా కుటుంబం విహారయాత్రలకు వెళ్లడం చాలా అరుదు. ఎప్పుడో మూడేళ్ల క్రితం అక్కవాళ్లతో కలిసి ఊటీ అందాలను, మైసూరులో దసరా వేడుకలను చూశాం. మళ్లీ ఇన్నాళ్లకి తిరుపతికి కూతవేటు దూరంలోని తిరుమల నామాలగెవి చూడాలనుకున్నాం. మా కుటుంబం, మా చెల్లి వాళ్ల కుటుంబం, సమీప బంధువు మణి ఏడాది బిడ్డతో కలిసి మొత్తం పది మందిమి బయల్దేరాం. శనివారం సాయంత్రం తిరుమలకు వెళ్లి రాత్రికి అక్కడే బస చేశాం. ఆదివారం ఉదయం పదిన్నరకు నామాలగెవికి బయల్దేరాం. అప్పటివరకు మేం వెళ్లాలనుకున్న ప్రదేశం ఎంత దూరంలో ఉందో, ఎటువైపు ఉందో తెలీదు. ఆ ప్రాంతాన్ని చూపించడానికి టిటిడిలో పనిచేసే నలుగురు మాకు తోడుగా వచ్చారు.
అడవి లోపల ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది నామాలగెవి. ఆ చుట్టుపక్కల జనసంచారమనే ప్రశ్నే లేదు. చిన్నపిల్లలతో అటవీ మార్గంలో వెళ్లడమంటే ఒకింత ఒళ్లు గగుర్పొడిచే విషయమే. అయినా సాహసం చేశాం.
తిరుమల ఘాట్‌లో (దిగేదారి) అక్కగార్ల గుడి దగ్గర్నుండి నడుచుకుంటూ వెళ్లాలి. తినుబండారాలు, మంచినీళ్ల బాటిళ్లు తీసుకుని అక్కడినుంచి అవ్వాచారికోనవైపు మెట్లెక్కడం ప్రారంభించాం. మెట్లు చూసేసరికి అంతా మెట్లే ఎక్కాలేమోనని భయమేసింది. ఎందుకంటే నాకు ఆయాసం ఉంది. రొప్పుతూనే అరకిలోమీటరు దూరం మెట్లెక్కాం. కొంత దూరం నడిచిన తర్వాత నేలంతా చదునుగా యూకలిప్టస్‌ ఆకులతో నిండిపోయి ఉంది. దాదాపు మూడు కిలోమీటర్లు అడవిలో నడిచాం. ఆ ప్రాంతమంతా ఎంతో సుందరంగా, పచ్చదనంతో ఆహ్లాదపరిచేలా ఉంది. అదంతా టిటిడి అటవీ కార్మికుల శ్రమ ఫలితమేననిపించింది. వెళ్లే మార్గమంతా కొంత దూరం కరివేపాకు, ఈత, నేరేడు, సపోటా చెట్లు కనిపించాయి. మధ్య మధ్యలో ఎత్తయిన బండలూ ఉన్నాయి. ఇంకో కిలోమీటర్‌ దూరం కిందికి దిగితే నామాలగెవి వస్తుందట. అక్కడ్నుండి దారంతా సన్నగా, ఇరుకుగా ఉంది. ఏమాత్రం కాలుజారినా ఏ లోయలో పడిపోతామో తెలీదు. ఓ వైపు అడవి చెట్ల ముళ్లు చేతులకు గీసుకుంటున్నాయి. అలాగే ఒకరి వెనుక ఒకరు దిగడం ప్రారంభించాం. పిల్లలు మాత్రం చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎలాగో చిన్నగా చెట్లకొమ్మలు పట్టుకుని నామాలగెని (రాతిగుహ) వద్దకు చేరుకున్నాం.
ఆ ప్రాంతంలో ఆదిమ మానవులు నివాసమున్న ఆధారాలు కనిపించాయి. ప్రకృతి చర్యల ద్వారా ఏర్పడిన రెండు రాతిగుహలు ఉన్నాయి. ప్రస్తుతం అవి వన్యప్రాణులకు, గబ్బిలాలకు నివాసంగా మారిపోయాయి. తిరుమలకు చెందిన స్థానిక ప్రజలు ఇక్కడ పూజలు నిర్వహించడం, యాత్రాకేంద్రంగా సందర్శించడం ఓ సాంప్రదాయంగా ఉన్నట్లుంది. పెద్దపెద్ద మంటలు వేసినట్లుగా (నెగళ్లు) మండిన కట్టెలు, బూడిద కనిపించాయి. ఆ గుహంతా చిమ్మచీకటి. ఎవరెక్కడున్నారో కనిపించదు. ఎలాగో సెల్‌ఫోన్ల బ్యాటరీ లైట్‌ వెలుతురులో చూడడానికి ప్రయత్నించాం. వేలు, లక్షల సంఖ్యలో గబ్బిలాలు గుహ పైకప్పుకు అంటిపెట్టుకుని తిరుగుతున్నాయి. కిందంతా అవి విసర్జించిన పదార్ధం నిండిపోయి మా పాదాలకు మెత్తగా తగులుతోంది.
నామాలగెని కొండల ప్రత్యేకత ఏమంటే తెలుపు, ఎరుపు, పసుపు రంగు మట్టి సహజసిద్ధంగా తయారు కావడం. అక్కడున్న కోనేటికీ ఓ విశిష్టత ఉంది. అదేంటంటే సూర్యకిరణాలు ఆ కోనేట్లో పడవు. చుట్టూ చీకటి. ఆ కోనేటి లోతెంతో తెలియదు. మొసళ్లు, కొండచిలువలు ఏవైనా ఉన్నాయేమో కూడా తెలియదు.
ఎక్కువ వైశాల్యం కలిగిన ఈ రాతిగుహల నుంచి తిరుమల కొండ అందాలను సందర్శించడం అద్భుతమైన అనుభూతి. అయితే అంతటి అందాలను సందర్శించడానికి సౌకర్యం లేకపోవడం విచారకరం.
ఓసారి ఏడుకొండల స్వామి ఆ మార్గంలో నడచివస్తూ అక్కడున్న కోనేరులో దిగి స్నానం చేసి, తెలుపు, ఎరుపు, పసుపు రంగులో ఉన్న మన్నును నామాలుగా పెట్టుకున్నాడని భక్తుల విశ్వాసం. ఈ కారణంగానే ఆ ప్రాంతానికి నామాలగెవి అని పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.
అవ్వాచారికోన నుంచి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరం అడవిలో ప్రయాణం చేసి కొండలు, మిట్టలు, రాళ్లు దాటుకుని రాతిగుహలను చేరుకోవడం సాహస కార్యమే. ఎలా వెళ్లామో అలాగే మళ్లీ కొండ ఎక్కాం. అక్కడ నుంచి కిందకు చూస్తే తిరుమల ఘాట్‌రోడ్డు అందాలన్నీ నల్లని కొండచిలువల మాదిరి సన్నగా, అందంగా పచ్చదనం మధ్య కనిపించడం అద్భుతమైన దృశ్యం. బాధాకరమైన విషయం ఏమంటే కొందరు దుండగులు గుప్తనిధుల కోసం ఈ రాతిగుహలలో అక్రమ తవ్వకాలకు పాల్పడడం. దాదాపు నాలుగు అడుగుల లోతైన గుంత తవ్వి ఉంది. పురాతన సంపదను ధ్వంసం చేస్తున్నా టిటిడి పట్టనట్లు ఉంది. పాతమెట్ల దారిని పునరుద్ధరించి, స్వల్ప మార్పులతో సౌకర్యాలను కల్పిస్తే భక్తులకు, యాత్రికులకు మంచి సందర్శనీయ స్థలంగా నామాలగెవి ఉంటుందనడంలో ఆశ్చర్యం లేదు.
_________________________________________________________________

23. ఆల్ఫ్స్‌ అందాలు

ఎత్తైన కొండలమీద నుండి దూకే జలపాతాలు, దారి పక్కనే ప్రవహిస్తున్న చిన్న చిన్న సెలయేళ్లు, వాటి పక్కనే పచ్చని తివాచీలాంటి పచ్చికబీళ్లు... ఇవన్నీ స్విట్జర్లాండుకు ఆస్ట్రియాకు మధ్యన విస్తరించిన ఆల్ఫ్స్‌ పర్వతాల మధ్య కనిపిస్తాయి. అటువంటి ప్రశాంత వాతావరణంలో ఎంతటి అలసటతో ఉన్నవారైనా అన్నీ మర్చిపోయి అప్పుడే విరిసిన మొగ్గలాంటి తాజాదనంతో ఆహ్లాదకరంగా మారిపోతారు.
ఈ ప్రయాణంలో ప్రత్యేక ఆకర్షణ మరొకటి ఉంది. అవే పెద్ద పెద్ద టనెల్స్‌ (సొరంగమార్గాలు). అడుగడుగునా ఎదురయ్యే ఈ సొరంగమార్గాలలో ప్రయాణం చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఆ సొరంగ మార్గాలలో ఒకదాని పొడవు 13. 97 కిలోమీటర్లు ఉంది. అది యూరప్‌లో ఉన్న పెద్ద టనెల్స్‌లో మూడవ స్థానంలో ఉందట. అంత పెద్ద సొరంగ మార్గాలంటే ఎలా ఉంటాయో, శుభ్రంగా ఉండవేమో అనుకుంటాం. కానీ ఇవి చాలా నీట్‌గా ఉండడమే, కాదు మూడు రంగుల విద్యుద్దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతుంటాయి. ప్రతి టనెల్‌లోనూ ఈ విద్యుత్‌ తోరణాలను అమర్చారు. వాటి మధ్య ప్రయాణిస్తుంటే అడవిలో ప్రయాణిస్తున్నామనే ఆలోచనే రాదు. అవి అంత విశాలంగా ఉన్నా కూడా వెళ్లే వాహనాలకు ఒకటి, వచ్చే వాహనాలకు ఒకటి... ఇలా వేరు వేరుగా టనెల్స్‌ ఉన్నాయి. వీటిలో అక్కడక్కడ ట్రాన్స్‌ఫార్మర్లు, టెలిఫోన్‌ బూతులు కూడా ఉన్నాయి. పర్యాటకులకు అడవిలో కూడా ఇంత సురక్షితమైన సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేసిన ఆ ప్రభుత్వాలకు అభినందనలు.
స్విట్జర్లాండు అందాలని ఆగస్టు నెలలోనే చూడాలి. భూమి ఇంతందంగా ఉంటుందా అనిపిస్తుంది. ఇక్కడ మొత్తం 26 సువిశాల, అందమైన సరస్సులున్నాయి. కొండలమీద అంచెలంచెలుగా పెరిగిన చెట్ల తాలూకు లేత, ముదురాకుపచ్చ రంగులను ఆ సరస్సులలోని నీళ్లు తమలో ఇముడ్చుకుని ఆకుపచ్చరంగుతో అలరారుతుంటాయి. ఎత్తైన కొండ శిఖరాలను తాకుతున్న నీలి మబ్బులు అలా అలా... తేలియాడుతుంటే... ఆ దృశ్యాలను చూసి ఆనందంతో పరవశించనివారు ఉండరు. వాటి మధ్య నున్న ఇళ్లను చూస్తుంటే ఎవరికైనా బొమ్మరిళ్లు గుర్తురావాల్సిందే.
మెలికలు తిరిగిన కొండ మీద విజ్‌ వేలి అనే కేబుల్‌ కారు స్టేషనుంది. ఎత్తైన చెట్లమధ్య అలా అలా కేబుల్‌ కారులో కొండపైకి వెళ్తుంటే ఆ ఆనందాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. వర్షంలో కేబుల్‌ కార్లు స్లిప్పయ్యే ప్రమాదం ఉందట. అందుకే వర్షం పడుతున్నప్పుడు కేబుల్‌ కారు వేయరు. ఈ కార్లలో ఎక్కి పైనున్న స్టేషన్‌లో దిగిన తర్వాత ఒకసారి చుట్టూ చూశామనుకోండి. కిందున్న సరస్సులన్నీ చెల్లాచెదరుగా పడిపోయిన అద్దం ముక్కల్లా కనిపిస్తాయి. కేబుల్‌ కారు స్టేషన్‌కి ఇరవై అడుగుల దూరంలో ఒక చెక్క ఇల్లుంది. అది ఆరడుగులతో మన కౌబారు సినిమాల్లో కనిపించే ఇల్లులా ఉంది. అందులో వేడివేడి టీ, తినుబండారాలు దొరుకుతాయి. నునుపుగా లేని చెక్కలు, బెంచీలు, రంపాలు, కొమ్ముబూరలు, పశుగ్రాసం... ఇలా గ్రామీణ వాతావరణంలో యేఏ వస్తువులు ఉంటాయో అవన్నీ అక్కడ కనిపిస్తాయి. స్థానిక సంప్రదాయ దుస్తులతో స్త్రీ పురుషులు అక్కడికెళ్లిన వాళ్లని ఎంటర్‌టైన్‌ చేస్తుంటారు. అక్కడ ఎవరి వినోదం వాళ్లది. అటువంటి వాతావరణంలో ఎవరైనా మమేకమవ్వాల్సిందే.
ఒక కొండకీ మరొక కొండకీ మధ్య మెలికలు తిరిగి మధ్యలో కొండ కింద సరస్సు చుట్టూ తిరిగి వచ్చే రోడ్లు భలేగా ఉంటాయి. కొండ శిఖరాగ్రాన ఉన్న రోడ్డును చూస్తుంటే ఆకాశాన్ని తాకుతుందా అనిపిస్తుంది. చిరు చీకట్లు కమ్ముకుంటున్న ఆ సమయంలో ఆ దృశ్యాన్ని చూస్తుంటే మనసుకెంతో హాయిగా ఉంటుంది.
ఎత్తైన ఒక ఆల్ఫ్స్‌ పర్వత శ్రేణిమీద ఎంగెల్బర్గ్‌ అనే ఊరుంది. ఆ వూళ్లో అడుగుపెడతామో లేదో చర్చి గంటలు అలలు అలలుగా చెవులను తాకుతాయి. అది ప్రఖ్యాతి గాంచిన మౌంట్‌ టిట్లిస్‌. అసలు సిసలు స్విస్‌ అనుభవం కలిగిస్తుందా ప్రదేశం.
జలపాతాల హోరు....
అడవి మధ్యలో ఇంటర్‌లేకెన్‌ ( రెండు సరస్సుల మధ్య ఊరు) అనే ఊరికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది లాటర్బ్రన్నెన్‌ వాలీ. అక్కడ ట్రమ్మెల్‌ బాక్‌ అనే గ్లేసియరు జలపాతం ఉంది. ఎక్కడో పైన కొండలమీదున్న గ్లేసియరు కరిగి నీరై అమిత వేగంతో పెద్ద శబ్దంతో కిందికి దూకడాన్ని అంత దగ్గర్నుండి చూస్తుంటే మనసంతా ఒక విధమైన అలజడికి గురౌతుంది. ఆ కొండల్లో దాన్ని చేరుకోడానికి మెట్లు కట్టారు. కొంత ఎత్తు వరకు మెట్లు ఎక్కాక అక్కడ లిఫ్ట్‌ ఉంది. అందులో ఎక్కి మరింత పైకి వెళ్లొచ్చు. అక్కడినుండి మళ్లీ మెట్లెక్కాలి. ఆ నల్లని కొండలో పొడవాటి గుహలో, కొండ బిలాల్లో సుళ్లు తిరుగుతూ కిందికి దూకే జలపాత ఉధృతాన్ని చూసి తీరాల్సిందే కానీ వర్ణించడానికి మాటలు రావు. ఆ ప్రాంతంలో నడిచి వెళ్తుంటే మరింత మజా వస్తుంది.
ఈ జలపాతం మూడు ఎత్తైన కొండల (ఎయిగర్‌ 3970మీటర్లు, మాంక్‌ 4099మీటర్లు, జంగ్‌ఫ్రా 4158మీటర్లు) మధ్యన ఇరుకు దారుల్లో ప్రయాణిస్తుందట. పర్వతం లోపలి నుండి దూకే జలపాతం యూరప్‌లో ఇదొక్కటేనట. దాని విస్తీర్ణం 24 కిలోమీటర్లు. మంచుతోనూ, గ్లేసియర్లతోనూ కప్పబడున్న ప్రాంతం నుండి సెకనుకు 20వేల లీటర్ల నీరు పై నుండి పడుతుందట. అంటే ఆ నీటి ఉధృతి ఎంత ఎక్కువగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అంత ఎత్తులో ఉన్న దాన్ని దగ్గర్నుండి చూసేందుకు ఎలివేటర్లు, మెట్లు, ఫోకస్‌ లైట్లు ఏర్పాటు చేసిన ఆ దేశపు అధికార బృందానికి అభినందనలు చెప్పాల్సిందే.
టాప్‌ ఆఫ్‌ యూరప్‌....
స్విట్జర్లాండ్‌ ఆల్ఫ్స్‌ పర్వతాల్లోని ఎత్తైన శిఖరాల్లో ఒకటి యూంగ్‌ ఫ్రూ ప్రాంతం. ప్రపంచ సాంస్కృతిక ప్రాంతంగా యునెస్కో చేత గుర్తింపు పొందిన ప్రదేశం ఇది. దాన్నే టాప్‌ ఆఫ్‌ యూరప్‌ అంటారు. మంచుతో కప్పబడిన ఆ కొండ శిఖరాగ్రానికి చేరుకోడానికి రెండు బుజ్జి రైళ్లను ఏర్పాటు చేశారు. అవి పర్యావరణానికి ఎలాంటి హానీ కలిగించని కాగ్‌ వీల్‌ రైళ్లు. వీటిని పునిక్యులర్‌ రైళ్లంటారు. ఇవి కేబుల్‌ ద్వారా పనిచేస్తాయి. మొదటి రైలు 1323 మీటర్ల ఎత్తుకు తీసుకువెళ్తుంది. అక్కడ రైలు మారి యూంగ్‌ ఫ్రూకి వెళ్లాలి. యూంగ్‌ఫ్రూలో కెఫటీరియాలు, షాపింగ్‌ సెంటర్లు, బాలీవుడ్‌ రెస్టారెంట్లు... ఇలా అక్కడంతా సందడి సందడిగా ఉంటుంది. అక్కడ్నుండి ఎటు చూసినా విపరీతమైన మంచు. బాలీవుడ్‌ రెస్టారెంటులో చాలా రుచికరమైన శాకాహారం దొరుకుతుంది. అక్కడి గోడలమీద ఐశ్వర్యారారు, షారూక్‌ఖాన్‌... వంటి బాలీవుడ్‌ స్టార్ల ఫొటోలు అతికించి ఉంటాయి.
స్ఫింక్స్‌ చేరుకోవాంటే ఎలివేటరు ఎక్కాల్సిందే. అది సముద్ర మట్టానికి 3571 మీటర్ల ఎత్తులో ఉన్న శిఖరాగ్రం. అక్కడి నుండి చూస్తే కళ్లు తిరగాల్సిందే. అంత ఎత్తైన కొండమీద రీసెర్చ్‌ ల్యాబు, ఇ మెయిల్‌ టెర్మినల్‌... ఇంకా ఎన్నెన్నో ఆధునిక సదుపాయాలను ఏర్పాటు చేశారు. స్ఫింక్స్‌ టెర్మినల్‌ నుండి కిందికి చూస్తే 'స్కీ - స్నో బోర్డ్‌ పార్క్‌' కనిపిస్తుంది.
ఐస్‌ ప్యాలెస్‌లో నేల, గోడలు, పై కప్పు అంతా మంచే. దానిలో నడుస్తూ మధ్యమధ్యలో అమర్చిన మంచు శిల్పాలు చూడడం మరపురాని అనుభూతి. మధ్యలో ఒకచోట టాప్‌ ఆఫ్‌ యూరప్‌ అని రాసుంటుంది. అంటే 3454 మీటర్ల ఎత్తులో ఉన్నామని అర్థం. ఆ బిలం నుండి ఒక దారి అతి పొడవైన గ్లేసియర్‌కు వెళ్తుంది.
__________________________________________________________

24. వెయ్యేళ్ల నాటి ఆలయం

ఆ ఆలయం పొడవు 793 అడుగులు, గోపురం ఎత్తు 216 అగుడులు. దీని నిర్మాణానికి ఇటుకలు, సున్నపురాయి, బంకమట్టి లాంటివేవీ ఉపయోగించలేదు. పునాదులు, గోపురం, శిఖరం... అన్నీ పూర్తిగా రాళ్లతో నిర్మించారు. గోపురం 13 అంతస్తులు. ఆ రాష్ట్రంలోనే అది పెద్ద ఆలయంగా పేరుగాంచింది. చోళులు, పాండ్యులు, నాయకులు... ఇలా రకరకాల పాలకుల ఆనవాళ్లు ఇక్కడ కనిపిస్తాయి. ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. అదే తమిళనాడుకు చెందిన తంజావూరులోని వెయ్యేళ్లు పూర్తి చేసుకున్న బృహదీశ్వరాలయం ఈ వారం చూద్దామాలో...
క్రీ.శ.985 -1012 మధ్య కాలంలో తంజావూరును రాజధానిగా చేసుకుని రాజరాజ చోళుడు పాలించాడు. ఇతను శైవ భక్తుడు. కేరళ, మధురై మొదలుకుని శ్రీలంక వరకూ తన రాజ్యాన్ని విస్తరించాడు. రాజ్యంతో పాటూ ఆదాయమూ బాగా పెరిగింది. ఈ విజయానికి గుర్తుగా, దేశమంతటా తన కీర్తి ప్రతిష్టలు తెలియజేయడానికి పెద్ద ఆలయాన్ని నిర్మించాలనుకున్నాడు. అలా, రాజధాని తంజావూరులో బృహదీశ్వరాలయ నిర్మాణానికి పూనుకున్నాడు. రాజరాజ చోళుడు బృహదీశ్వరాలయ నిర్వహణకు ప్రత్యేకంగా భూములు కేటాయించాడు. దేవాలయ నిధిని ఏర్పాటు చేశాడు. దేవాలయాలు సాంస్కృతిక కేంద్రాలుగా మారింది ఇక్కడనుంచేనని చెబుతారు చరిత్రకారులు. ఆలయ నిర్మాణం క్రీ.శ. 1004లో మొదలై 1010 లో పూర్తయింది. ఇప్పటికీ దేశంలో అతి పెద్ద ఆలయంగా దీన్నే చెబుతారు. బృహదీశ్వరాలయ ప్రాగణం పొడవు 793 అడుగులు, వెడల్పు 393 అడుగులు, గోపురం ఎత్తు 216 అడుగులు. ఈ ఆలయ నిర్మాణానికి ఇటుకలు, సున్నపురాయి, బంకమట్టి... ఇవేవీ ఉపయోగించలేదు.
నిర్మాణంపై ఎలాంటి పూతా పూయలేదు. పునాదుల దగ్గర నుండి పీఠాలు, గోపురం, శిఖరం... ఇలా అన్నీ రాళ్లతోనే తయారయ్యాయి. వాటి బరువుని బట్టి ఒక రాయి మీద మరో రాయిని పేర్చి నిర్మించారు. ఈ ఆలయ గోపురం 13 అంతస్తులు వుంది. గోపురం పై కప్పు నిర్మాణానికి 80 టన్నుల బరువుండే ఏక శిలను ఉపయోగించారట. దీని విస్తీర్ణం 25.5 చదరపు అడుగులు. ఈ రాయిని గోపురంపైకి తీసుకెళ్లడానికి చాలా ఇబ్బంది పడ్డారు. గోపురం నుండి ఏడు కిలోమీటర్లు దూరంలో ఉన్న ఓ గ్రామం దగ్గర్నుండి ఏటవాలుగా ఉండే ప్రత్యేక వంతెనను నిర్మించారు. శిఖరం రెండు తలాలుగా ఉంటుంది. తంజావూరు చుట్టుపక్కల ఎక్కడా కొండలు, గుట్టలు కనిపించవు. ఈరాళ్లను దాదాపు 150 కిలోమీటర్లు దూరంలో ఉన్న పుదుకొవై ప్రాంతంలోని రెండు కొండల్ని పూర్తిగా తొలిచి తీసుకొచ్చి ఆలయం నిర్మించి ఉంటారని ఒక అంచనా.
బృహదీశ్వరాలయ గోపురం మొత్తం ఎక్కడా కొంచెం కూడా ఖాళీ లేకుండా శిల్పాలతో తీర్చి దిద్దారు. ఆలయం నిర్మాణ గొప్పదనం బయట గోడలపైనే కాదు లోపల కూడా కనిపిస్తుంది.
\గర్భగుడిలోని శివలింగాన్ని 13 అడుగుల ఎత్తున్న ఏకశిలతో మలిచారు. ఈ శివలింగాన్ని ఉత్తర భారతదేశంలోని నర్మదా తీరం నుండి తీసుకొచ్చారని చెబుతారు. ఎత్తైన ఈ లింగాన్ని పూజించడానికి రెండు వైపులా మెట్లు ఉంటాయి. ఈ లింగానికి గోముఖ పానవట్టం కూడా సుమారు 500 టన్నుల బరువున్న కొండరాయితో నిర్మించారు. గుడి లోపల భాగం రెండు అంతస్తులుగా ఉంటుంది. ఎక్కడా తలుపులు ఉండవు. రాతి ద్వారాలు ఉంటాయి. లోపలి గోడలపై రాజుల కాలంలో వేసిన కుడ్యచిత్రాలు కన్పిస్తాయి. ఇవి అక్కడక్కడా చోళుల కాలంనాటి చిత్రాలపైన వేసి ఉన్నాయి. రాజరాజ చోళుడు తన ముగ్గురు రాణులతో కలిసి దక్షిణామూర్తి రూపంలో నటరాజుకు పూజలు చేస్తున్న కుడ్యచిత్రాలు దర్శనమిస్తాయి. ఈ చిత్రాలు ఇప్పుడు అస్పష్టంగా కన్పిస్తున్నాయి.
సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకోసం ఈ ఆలయానికి రాజ్యం నలుమూలల నుండి 91 దేవాలయాల నుండి 400 మంది దేవదాసీల్ని రప్పించారు. తర్వాత కాలంలో బృహదీశ్వరాలయం... దేవాలయాలూ, దేవాలయ నగరాల నిర్వహణకు ఒక నమూనాగా నిలిచింది.
పాలనా నమూనా
1279లో తంజావూరు చోళుల ఆధిపత్యం నుండి మధురై పాలకులైన పాండ్యుల చేతుల్లోకి వెళ్లింది. పాండ్యుల తర్వాత తంజావూరు విజయనగర రాజుల పాలనలోకి వచ్చింది. ఈ కాలంలో బృహదీశ్వరాలయం ప్రజల సమావేశ మందిరంగా, విద్యా సాంస్కృతిక శిక్షణా కేంద్రంగా ఉండేది. ఆ తర్వాత తెలుగు పాలకులైన నాయకుల ఆధీనంలోకి వచ్చింది. చోళుల కాలం నాటి నందికి వీరు రక్షణగా మండపాన్ని నిర్మించారు. పంతొమ్మిది అడుగుల పొడవూ, ఎనిమిది అడుగుల వెడల్పూ, పన్నెండు అడుగుల ఎత్తూ ఉన్న ఈ నందిని ఏకశిలతో మలిచారు. ఇది దేశంలోనే రెండో అది పెద్ద ఏకశిల నంది (మొదటిది లేపాక్షి నంది). నాయకుల తర్వాత తంజావూరు మరాఠా పాలకుల చేతిలోకి వెళ్లింది. వీరు ఆలయ శిఖరానికి కొన్ని మార్పులు చేయించారు. ఒకే ఆలయంలో భిన్న రకాల పాలకుల గుర్తులు కనిపించడమనేది భారతదేశంలో మరే చోటా ఉండదు.
ఇదీ బృహదీశ్వరాలయమే
ఉత్తరాదికి రాజ్యాన్ని విస్తరించిన మొట్టమొదటి దక్షిణాది రాజు మొదటి రాజేంద్ర చోళుడు. ఇతడు రాజరాజ చోళుడి తనయుడు. గంగానది తీరం వరకు తన రాజ్య విస్తరణకు గుర్తుగా రాజధాని నగరాన్ని (గంగై కొండ చోళపురం) నిర్మించాడు. మొదటి రాజేంద్రుడు తంజావూరులో నిర్మించిన బృహదీశ్వరాలయాన్ని పోలిన మరో బృహదీశ్వర ఆలయాన్ని గంగై కొండచోళపురంలో నిర్మించాడు. ఈ రెండు దేవాలయాలూ దాదాపు ఒకేలా ఉంటాయి. ఎత్తైన రాజ గోపురాలూ ప్రహరీలూ అపురూప శిల్ప సంపద... ఇవన్నీ ఈ రెండు ఆలయాలకే సొంతం. తండ్రిపై విధేయతను చూపుతూ శిఖరం ఎత్తును మాత్రం తగ్గించాడు రాజేంద్రుడు. విస్తీర్ణంలో మాత్రం ఇదే పెద్దది. ఈ ఆలయ ప్రాంగణంలో శివుడితో పాటు ఇతర దేవుళ్ల ఆలయాలూ ఉన్నాయి.
బృహదీశ్వరాలయం నిర్మాణాన్ని అప్పటి రాజులు తమ దైవభక్తితో పాటు ఆర్థిక, సైనిక సామర్థ్యాన్ని చాటి చెప్పుకోడానికి చేసిన ప్రయత్నంగా చరిత్రకారులు చెబుతారు. ఏదేమైనా చోళుల కాలంనాటి సంస్కృతీ, సంప్రదాయాలు తెలుసుకోడానికి ఈ ఆలయాల్లోని చిత్రాలు ఉపయోగపడతాయి.
బృహదీశ్వరాలయ నిర్మాణంలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది భక్తులే. ఆలయాన్ని నిర్మించిన రాజరాజ చోళుడు 'ఈ ఆలయ నిర్మాణంలో భాగమైన అందరి పేర్లూ ఇక్కడ చెక్కించాలి' అని ఆదేశించాడట. ఆయన చెప్పినట్లే వాళ్లందరి పేర్లన్నీ శాసనాల్లో కనిపిస్తాయి. వందేళ్ల క్రితం వరకూ ఈ ఆలయాన్ని కరికాళ చోళుడి కాలంలో నిర్మితమైందని భావించేవారు. జర్మనీకి చెందిన ఓ పరిశోధకుడు మాత్రం రాజరాజ చోళుడు నిర్మించాడని నిర్ధారించాడు.
దర్శనీయ ప్రాంతాలు
తంజావూరు చెన్నైకి దక్షిణంగా 320 కిలోమీటర్ల దూరంలో ఉంది. బృహదీశ్వరాలయం తంజావూరు పట్టణంలో మధ్యలో ఉంది. బృహదీశ్వరాలయంతో పాటు అక్కడ చూడాల్సిన ప్రదేశాలు చాలా వున్నాయి. ఇక్కడున్న ప్రసిద్ధ సరస్వతి మహల్‌ లైబ్రరీ సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఆలయానికి సమీపంలో పురావస్తుశాఖ మ్యూజియం ఉంది. రాజభవనాన్నే మ్యూజియంగా మార్చారు. తంజావూరు పరిసరాల్లో లభించిన వివిధ రాజుల కాలం నాటి ఆయుధాలు, నాణేలు... అన్నీ అక్కడ చూడొచ్చు. గంగై కొండచోళపురం ఇక్కడి నుండి 61కిలోమీటర్ల దూరంలో ఉంది.
__________________________________________________________

25.  ప్రకృతి సోయగం... కేరళ తీరం!

ఆహ్లాదకరమైన వాతావరణం... పచ్చని కొబ్బరి చెట్లు... ప్రశాంతంగా ఉండే లెక్కలేనన్ని పిల్లకాల్వలు... గలగల పారే సెలయేర్లు... నేలంతా పచ్చని తివాచీ పరిచినట్లుండే టీ తోటలు... చేయి తిరిగిన చిత్రకారుడు గీచిన చిత్రంలా కనిపిస్తుందా దృశ్యం. పచ్చని పొదరిల్లులా ఉండే ఆ అందాల్ని చూడాల్సిందే తప్ప చెప్పడానికి మాటలు చాలవు. తొలకరి వానల్లో మరింత అందంగా కనిపించే కేరళ అందాలు ఈ వారం చూద్దామాలో...
వర్షానికి తడిచి ముద్దయిన ప్రకృతి అందాలు... చల్లని గాలులు... మనసుకు స్వాగతం పలుకుతాయి. దారి పొడవునా పచ్చని కొబ్బరి తోటలు, మధ్యమధ్యలో ఎర్రని పెంకుటిళ్లు, నిర్మలంగా ఉండే పిల్లకాల్వలు... ఇవన్నీ ప్రకృతి మనకోసమే అందించిన అద్భుతమైన కానుకలనిపిస్తుంది.
కోవళంలో సముద్రాన్ని చూసి ఒక్క క్షణం మనల్ని మనమే మైమరచిపోతాం. ఎదురుగా ఎగసిపడే అలలు... ఆ పక్కనే కొండలు.. ఆ కొండల మీదే రెస్టారెంట్లూ, కొబ్బరి చెట్లూ ఉంటాయి. అక్కడ అన్నింటికన్నా ఆకర్షించేవి నెట్‌ ఉయ్యాలలు. వాటిని చూడగానే అందులో కాసేపు సేద తీరాలనిపిస్తుంది. కనువిందు చేసే ప్రకృతి మధ్య చేసే భోజనం మహా రుచిగా ఉంటుంది.
తిరువనంతపురంలో తప్పకుండా చూడాల్సిన వాటిలో ఒకటి పద్మనాభస్వామి ఆలయం. అక్కడ పవళించి ఉన్న స్వామి విగ్రహాన్ని మూడు ద్వారాల నుండి చూడాలి. ప్రపంచంలో మరే ఆలయంలో లేనంత సంపద ఈ ఆలయంలో ఉంది! ఇక్కడే మోహినీ రూపంలోని విష్ణుమూర్తి విగ్రహం కూడా ఉంది. అక్కడ్నుండి అలెప్పీ వెళ్లే దారిలో మున్నార్‌ శాలలో నాగలక్ష్మి, నాగ చాముండి, విష్ణుమూర్తి ఆలయాలు, అంబలపుజలో శ్రీ కృష్ణుడి ఆలయం ఉన్నాయి.
కదిలే ఇల్లు
అలెప్పీ ఊరంతా కాలువలమయమే. అందుకే దీన్ని 'వెనిస్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌' అంటారు. ఇక్కడ పడవ ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. పడవే ఓ పెద్ద ఇల్లులా ఉంటుంది. పడకగదులు, వంటగది, హాలు... అన్నీ ఆ కదిలే ఇంట్లోనే ఉంటాయి. అందులో విహారం ఓ మధురమైన అనుభవం.
అలలు లేని నీళ్లలో పడవ నెమ్మదిగా కదులుతుంటే... చల్లని పిల్లగాలులు శరీరాన్ని తాకుతూ ఊసులాడుతుంటే... మనసు పరవశించిపోతుంది. అసలు ఆ ఆనందం... సంతోషం... చెప్పడానికి మాటలు చాలవేమో. చుట్టూ నీళ్లు... మధ్యమధ్యలో ఇళ్లూ....కొబ్బరి చెట్లూ, అరటి తోటలతో కమనీయ దృశ్య కావ్యంలా ఉంటుందా ప్రదేశం. సాయంత్రం ఆరు గంటలకు పడవ ఆపేస్తారు. అక్కడికి దగ్గర్లో ఒడ్డుమీద మసాజ్‌ సెంటర్లు కూడా ఉంటాయి. ఇష్టమైనవాళ్లు వెళ్తుంటారు. మనిషికి వెయ్యి రూపాయలు తీసుకుంటారు.
ప్రకృతిలో లీనమై కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే టైమే తెలీదు. అంతలోనే రాత్రి భోజనం సిద్ధమంటూ పడవ వాళ్లు పిలుస్తారు. నిద్ర కూడా అందులోనే. ఉదయాన్నే నిద్ర లేచేసరికల్లా వేడి వేడి ఇడ్లీ సాంబార్‌ సిద్ధం.
సర్వమత సామరస్యం....
అక్కడ్నుండి కుమర్‌కోమ్‌ వెళ్లే దారిలో రెండు చర్చీలుంటాయి. ఇవి అన్ని మతాలూ ఒక్కటే అని చెప్తాయి. అందులో ఒకటి 1579లో కట్టినదైతే. మరోటి అంతకంటే పురాతనమైంది. మొదటి చర్చి ప్రత్యేకత ఏంటంటే... వత్తులతో అఖండదీపం వెలిగించడం. ఇక్కడ శంఖుచక్రాలు, మినార్లు, శిలువ కూడా ఉన్నాయి.
కుమర్‌కోమ్‌....
కుమర్‌కోమ్‌లో ఉండడానికి వాటర్‌ స్కేప్స్‌ కాటేజీలు ఉంటాయి. బారులు తీరిన కొబ్బరిచెట్లు, పిల్లకాలువలు.. వాటి మీద కాటేజీలు. ఎదురుగా రంగు రంగుల పూలమొక్కలతో నిండిన పెద్ద కొలను. ఆ దృశ్యాలన్నింటినీ కళ్లప్పగించి అలా చూస్తుండిపోతాం. అక్కడున్న వెంబనాడ్‌ సరస్సులో బోటు విహారం మనసును ఆనంద డోలికల్లో తేలియాడిస్తుంది.
సరస్సును ఆనుకున్న మబ్బులు బంగారు వర్ణంలో మెరుస్తుంటాయి. వాటి పైభాగంలోని మబ్బులు నీలిరంగులో కొండల్ని తలపిస్తాయి. ఇటువంటి అద్భుతమైన దృశ్యాల్ని ఫొటోలు తీయని వారుంటారా చెప్పండి? అక్కడ ప్రతి ఒక్కరూ చేతిలోని కెమెరాకి పని చెప్పకుండా ఉండరు.
తెక్కడి ప్రయాణం
కొండలూ లోయలతో కూడిన ఆ మార్గంలో ఎక్కడ చూసినా రబ్బరు తోటలే. చెట్లకు ఇనుప గిన్నెలు కట్టి ప్లాస్టిక్‌ కవర్లు కప్పి ఉంటాయి. రబ్బరు పాలు కారి ఆ గిన్నె నిండడానికి చాలా రోజులే పడుతుందట. ఆ దారిలోనే కొండల మీదనుండి ఉరికే జలపాతాలు, టీ తోటలు కనిపిస్తాయి.
భూమికి ఆకుపచ్చ రంగు వేసిన్నట్లు ఎటు చూసినా పచ్చదనమే. కొండల మీద అంచెలంచెలుగా పెంచుతున్న టీ తోటలు కనువిందు చేస్తాయి.
తెక్కడిలో అడవి మధ్యలో ఓ సరస్సు ఉంది. అందులో కాటేజీలు ఉంటాయి. మూడంతస్తుల పడవ ఎక్కి అందులో విహరిస్తుంటే ఆ అనుభూతే వేరు... అక్కడున్న పెరియార్‌ వైల్డ్‌ లైఫ్‌ శాంక్చ్యురీలోని జంతువులను తప్పని సరిగా చూడాల్సిందే. నీలగిరి కోతులు, ఏనుగులూ, అడవిదున్నలు, పులులు కనిపిస్తాయక్కడ.
గుండెకు తాళం
తెక్కడి నుండి మున్నార్‌ ఘాట్‌ రోడ్డు ప్రయాణం.... దారిలో 'లాక్‌ హార్ట్‌ గ్యాప్‌' అన్న బోర్డు ఉంటుంది. నిజంగానే అక్కడి ప్రకృతి అందాలు గుండెకు తాళం వేస్తాయి. ఓ వైపు కొండలమీద నుండి జారే జలపాతాలు... మరో వైపు టీ తోటలు.. పైకి చూస్తే మబ్బుల గుంపు. కింద ఆకుపచ్చని తివాచీ పరిచినట్లుండే టీ తోటలు.... వాటిపైన తెల్లని మేలి ముసుగు కప్పినట్లు మంచు.
మళయాళంలో 'మును' అంటే మూడు అని, 'ఆరు' అంటే నది అని అర్థమట. నల్లతన్ని, కుండలి, ముతిరప్పుజ అనే మూడు నదులు కలిసే ప్రదేశం కాబట్టి దీనికి మున్నార్‌ అనే పేరు వచ్చిందట. టాటావారి టీ ఎస్టేట్లు, మహీంద్రా రిసార్టులు ఈ ప్రాంతమంతటా ఉన్నాయి.
మబ్బుల్లో తేలినట్టుందే...
ఈ పర్వత ప్రాంతానికి దక్షిణదేశ హిమాలయాలని పేరు. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 1600 నుండి 1800 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడున్న 'అనముడి' శిఖరం ఎత్తు 2695 మీటర్లు. ఇక్కడ వందల, వేల ఎకరాల టీ తోటలు... వాటి పక్కనే ఆకాశాన్ని తాకుతున్నట్లున్న యూకలిప్టస్‌ వృక్షాలు ఉన్నాయి. ఇక్కడే మట్టుపట్ట ఆనకట్ట కూడా ఉంది. దీనిమీద నుండి కనిపించే తేయాకు తోటల సోయగం చెప్పడానికి మాటలు చాలవు. పశ్చిమ కనుమల్లోని ఈ యాలకుల కొండమీద ఎప్పుడూ వర్షాలు పడుతూనే ఉంటాయి.
మున్నార్‌లో అడుగడుగునా సరస్సులే. అందులో ఒకటి ఎకో పాయింట్‌. అక్కడి గ్రాండీస్‌ తోట సరస్సును ఆనుకునే ఉంటుంది. ఈ గ్రాండీస్‌ తోటలోని మొక్కలనుండే టిష్యూ పేపర్లు తయారు చేస్తారు. ఈ తోట సరస్సుమీదకి వాలినట్లుంటుంది. అక్కడ పెద్దగా అరిస్తే మన మాట తిరిగి మనకే వినిపిస్తుంది.
మనోహరమైన మున్నార్‌ తేయాకు సోయగాలను ఆస్వాదిస్తూ రెప్పవేయడం కూడా మర్చిపోతాం. నీలాకాశ పందిరి కింద పరిచిన పచ్చని తివాచీ లాంటి మున్నార్‌ను చూసి... ఆకాశపుటంచుల దగ్గర మెరుస్తున్న తెల్లని దూదిమబ్బుల్ని చూసి మనసు గాల్లో తేలిపోతుంది.
కేరళ, తమిళనాడు సరిహద్దుల్లో ఓ చిన్న గ్రామం ఉంది. నీలకురింజి పూలు ఈ గ్రామంలో బాగా పూస్తాయి. వీటి ప్రత్యేకతేమంటే ఇవి పన్నెండేళ్లకోసారి మాత్రమే పూస్తాయి.
మున్నార్‌ కు 17 కిలోమీటర్ల దూరంలోని రాజమలైలో ఎరావికుళం పార్కు ఉంది. ఇక్కడ అంతరించిపోతున్న నీలగిరి జింక, సాంబార్‌, సింహం తోక ఉండే మెకాకె, లంగూర్‌, కోతులు, అరుదైన పుష్ప జాతులు ఇక్కడ కనిపిస్తాయి.
అక్కడ్నుండి కొచ్చిన్‌కి వెళ్లే దారిలో లెక్కలేనన్ని జలపాతాలు కనిపిస్తాయి.ఆది శంకరాచార్యుల జన్మస్థలమైన కాలడి ఆ దారిలోనే ఉంది. అక్కడ సుబ్రమణ్యేశ్వరస్వామి, విఘ్నేశ్వరుడు, అమ్మవారి విగ్రహాలు కూడా ఉన్నాయి.
కొచ్చిన్‌లోని డచ్‌ ప్యాలెస్‌ లో అప్పటి రాజులు కేరళవర్మ, రామవర్మల చిత్రపటాలు, వారి కిరీటాలు, వారికి సంబంధించిన అనేక వస్తువులున్నాయి.
బ్యాక్‌ వాటర్స్‌ పక్కనే ఉన్న చైనీస్‌ ఫిషర్‌నెట్స్‌ కొచ్చికే ప్రత్యేకం. చైనాలో తప్ప మరెక్కగా కనిపించని ఈ వలలు ఇక్కడ కనిపిస్తాయి. స్థానికులు వీటితోనే చేపలు పడతారు.
______________________________________________________________

26. సిగపూర్‌ సింగారాలు

వావ్‌...సింగపూర్‌! ఇక్కడకు వెళ్లగానే మనల్ని ఆకట్టుకునేది రోడ్లు, రైళ్లు, ఆకాశహర్మ్యాలు. ఇక్కడి వీధులు పరిశుభ్రతకు అసలు సిసలు అర్థాన్నిచ్చేలా వుంటాయి. రహదారులమీద ఎక్కడా చిన్న కాగితం ముక్క కూడా కనిపించదు. ప్రతి చోటా చెత్తకుండీలు అందుబాటులో వుంటాయి. వేగంగా వచ్చి పోతుండే రైళ్లు ప్యాసెంజర్లను గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. ఆకాశాన్నంటే భవనాలు అందంగా ఆకట్టుకుంటాయి. ఇంక వీధి దీపాల సంగతి సరేసరి. ఇది సింగపూర్‌లో దిగీదిగగానే పర్యాటకులకు కనిపించే సర్వసాధారణ దృశ్యం. ఇంక...అక్కడ చూడదగిన ప్రదేశాలు, భవనాలు, ప్రకృతి... సంగతులు అన్నీ ఇన్నీ కావు. ఈ వారం సింగపూర్‌ సింగారాలను అలా అలా చూసొద్దామా!
మొదటిసారిగా సింగపూర్‌లోకి అడుగెట్టిన పర్యాటకుడిని ఆకట్టుకునేది మూడు. రోడ్లు, రైళ్లు, భవనాలు. బస్సులు, ట్యాక్సీలు, హోటళ్లలో అన్ని చోట్లా ఏసీ సౌకర్యం వుంటుంది. రోడ్లు చాలా శుభ్రంగా వుంటాయి. వయ్యారంగా మెలికలు తిరిగిన ఆ రోడ్ల అందాలను చూచి అలా కదలక మెదలక నిల్చుండిపోయినట్టుండే వీధిదీపాలు ప్రతి చోటా కనిపిస్తాయి. ఇక్కడి ట్రాఫిక్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చిన్నపిల్లవాడు సైతం సురక్షితంగా రద్దీ ప్రాంతాల్లో కూడా రోడ్డు దాటగలడు. ఎలాగంటే ఎక్కడికక్కడ జీబ్రా క్రాసింగులుంటాయికదా. వాటి ద్వారా ఎంచక్కా దాటొచ్చన్నమాట. పొరపాటున ఏదైనా వాహనం మార్గమధ్యలో ఆగిపోయిందనుకోండి. మనకైతే వెనక వాహనదారులు ఒకటేమని హారన్లు నొక్కేస్తారు. కానీ అక్కడ మాత్రం కాస్త ఓపిగ్గా ఆగుతారంట!
సంతోషాల సాగరం
'సింగపూర్‌' అర్ధం ఏంటో తెల్సా! చాలా తమాషాగా వుంటుంది. సింగం అంటే సింహం. పురం అంటే నగరం. ఈ రెంటి కలయికే సింగపూర్‌. సింగపూర్‌ 63 చిన్న చిన్న ద్వీపాల సమూహం. వీటిలో నాలుగు పెద్ద ద్వీపాలుండగా అందులో సెంటోసా ఒకటి. 'సెంటోసా' అంటే 'సంతోషం' అని అర్ధం. సంతోషాల సాగరం. దీనివైపు వెళ్లే దారిలో హార్బర్‌ ఫ్రంట్‌ వుంది. రోడ్డుమీద నుంచి చూస్తే ఒక అద్భుత దృశ్యం కనిపిస్తుంది. అక్కడ ఓడలు సరకులు దింపుకుంటూనో, ఎత్తుకుంటూనో కనిపిస్తాయి. సెంటోసాకు చేరుకున్నాక అక్కడ స్థానికంగా పర్యటించడానికి వీలుగా బస్సులుంటాయి. వాటిని రెడ్‌లైన్‌, గ్రీన్‌లైన్‌ బస్సులని పిలుస్తుంటారు. సెంటోసాలో చూడాల్సినవి చాలానే వున్నాయి. అండర్‌ వాటర్‌ వరల్డ్‌, డాల్ఫిన్‌ లాగూన్‌, బటర్‌ఫ్లై అండ్‌ ఇన్సెక్ట్స్‌ పార్కు, ఫ్లవర్‌ క్లాక్‌...ఇలా ఎన్నో వున్నాయి.
అవన్నీ చూడాలంటే ఒక రోజు మొత్తం చాలదు. ఇక్కడ కేబుల్‌ కార్లు కూడా వున్నాయి. ఒక కొండ మీద నుంచి మరో కొండ మీదికి వీటిద్వారా వెళ్లొచ్చు. కాకపోతే కా...స్త భయంగా వుంటుంది. కానీ ఈ అనుభవం మరువలేనిది. ఇక్కడ నుంచి ఇంకా చూడాల్సినవి వున్నాయి. మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌, లేజర్‌ షో. ఇక్కడికొచ్చిన పర్యాటకులెవరూ వీటిని చూడకుండా తిరిగి వెళ్లే ప్రసక్తే వుండదు. సూర్యాస్తమయం తర్వాత చీకటి పడుతున్న సమయంలో ఫౌంటెయిన్లను విద్యుద్దీపాలతో అందంగా అలంకరిస్తారు. ఓ వైపు లౌడ్‌ స్పీకర్లో సంగీతం... మరో వైపు ఆ సంగీతానికి లయబద్ధంగా నీటి ధారల నృత్యం. అద్భుతం...మసక మసక చీకట్లో సంగీతానికి అనుగుణంగా నాట్యమాడే నీటి ధారలను చూసి పరవశించని వారుండరు. పాదం కదపని వారుండరు.
ఇవే కాదండోరు! సెంటోసాలో రెస్టారెంట్లు, బీచ్‌లు, రిసార్టులు, గోల్ఫ్‌కోర్సులు... ఒకటా రెండా ఈ వినోదాలన్నింటి కలబోతే. బ్రిటిష్‌వారి కాలంలో దొరసానులు, దొరలు ఇక్కడ చేపలు పట్టేవారట. కొద్ది రోజుల పాటు వారి మిలిటరీ బేస్‌ ఇదే. అయితే 1972లో దీన్ని వినోద కేంద్రంగా మార్చేశారు. ఆ తర్వాతే పర్యాటకుల రాకపోకలు బాగా పెరిగాయి. ఇహ ఇప్పుడు సెంటోసా గురించి తెలియని పర్యాటకులే లేరు. సింగపూర్‌లో చెప్పుకోదగ్గ బీచ్‌లు ఈ దీవిలోనే వున్నాయి. ప్రేమికులు ఎంతగానో ఇష్టపడే ప్రదేశమిది. సీ స్పోర్ట్స్‌, వాటర్‌గేమ్స్‌, సైక్లింగ్‌, ఇన్‌లైన్‌ స్కేటింగ్‌ వంటివి ఇక్కడ ఆస్వాదించవచ్చు. ఇక రాత్రిపూట ఇసుకతిన్నెలపై జరిగే పార్టీల సంగతి చెప్పతరం కాదు.
ఏం భవనాలు!
మెర్‌లయన్‌ పార్క్‌! సింగపూర్‌లో చూడదగ్గ ప్రదేశాల్లో ఒకటి. సముద్రం మధ్యలో పేద్ద మెర్‌లయన్‌ బొమ్మ వుంటుంది. అచ్చం హుస్సేన్‌సాగర్‌లో బుద్ధ విగ్రహం లాగా అన్నమాట. మెర్‌లయన్‌ అంటే సింహం తల, చేప తోక వున్న ఓ ఆకారం. 37 మీటర్ల పొడవున్న ఈ మెర్‌లయన్‌ సింగపూర్‌ టూరిజం బోర్డు వారి చిహ్నం. అక్కడే పనసకాయ ఆకారంలో వున్న ఓ భవనం కూడా వుంటుంది. సూర్య గమనం ఆధారంగా దీన్ని నిర్మించారంటారు. ఆ భవనం లోపలికి వెలుతురు వస్తుంది. కానీ ఎండ మాత్రం పడదట. ఈ భవనాన్ని స్థానికులు డురియన్‌ అంటారు. డురియన్‌ అంటే అక్కడ లభించే ఒక పండు.
రాఫిల్‌ ప్రాంతంలో చేతివేళ్లలా కనిపించే ఐదు ఎత్తైన భవనాలు కనిపిస్తాయి. వాటికి దగ్గరల్లో పేద్ద ఫౌంటెయిన్‌ కూడా వుంది. ఇంతకు ముందు సినిమాల్లో చూసిన ప్రాంతమే ఇది. దానిపక్కనే ఓ షాపింగ్‌ మాల్‌ కనిపిస్తుంది. అక్కడ ఎన్నో రకాల పండ్లు వుంటాయి. షాపుల ముందరకెళ్లగానే రుచి చూడ్డానికి పండును ఇస్తారు సిబ్బంది. ఇక రెస్టారెంట్లలో ఓ తమాషా వుంది. అదేమంటే మనం ఆర్డర్‌ చేసినదాన్ని మాత్రమే అక్కడ సరఫరా చేస్తారు. అంతేకానీ అది తిన్న తర్వాత తాగడానికి నీళ్లు మాత్రం ఇవ్వరు. కావాలంటే మనం నీళ్ల బాటిల్‌ కొనుక్కోవాల్సిందే. ఎందుకలా! అంటే...అక్కడివారు ఏదైనా తిన్న తర్వాత నీళ్లు తాగరంట. సూప్‌తోనే సరిపుచ్చుకుంటారు.
ఏం రైళ్లు!
సింగపూర్‌ రైల్వే గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక్కడ మనం ఏ స్టేషన్‌కి వెళ్లినా గంటల తరబడి ఎదురుచూడాల్సిన అవసరమే వుండదు. హాయిగా నిముషానికో రైలు వచ్చి వెళుతుంటుంది. వీటిని ఎంఆర్‌టి స్టేషన్లు అంటారు. అంటే మాస్‌ రాపిడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌. ఇవన్నీ భూగర్భంలో దాదాపు ముప్పై అడుగుల లోతులో వుంటాయి. ఏ రైల్వే స్టేషన్‌కి వెళ్లినా సిబ్బంది కనిపించరు. టికెట్‌ కౌంటర్‌ దగ్గర మాత్రం ఓ మ్యాప్‌ వుంటుంది. మనం ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకుని దానిపై ఉన్న బటన్‌ని నొక్కితే టికెట్‌ ధర ఎంతో అక్కడే స్క్రీన్‌ మీద కనిపిస్తుంది. నోట్లు ఓ వైపు, చిల్లర మరోవైపు వేయగానే టికెట్‌ వచ్చేస్తుంది. ప్లాట్‌ ఫారం మీదకు వెళ్లాలంటే మరో పని చేయాలి. మన చేతిలోని టికెట్‌ను పంచ్‌ చేస్తే దారిలో అడ్డంగా వున్న ఐరన్‌ బార్లు దారి ఇస్తాయి. రైల్లో కూడా ఇప్పుడున్న స్టేషన్‌ పేరూ రాబోయే స్టేషన్‌ పేరూ కంప్యూటర్‌ చెబుతూంటుంది. కొత్తవారైనా సరే ఎలాంటి ఇబ్బందులూ లేకుండా సింగపూర్‌ రైళ్లలో హాయిగా ప్రయాణించేలా వుంటుంది.
షాపింగ్‌ సంగతులు
ముస్తఫా సెంటర్‌ అనేది పెద్ద షాపింగ్‌ కాంప్లెక్స్‌. ఇందులో అన్ని భాగాలనూ తిరిగి చూడాలంటే ఒక రోజు సరిపోదు.
ఆర్చర్డ్‌ ప్రాంతంలో అనేక షాపింగ్‌ కాంప్లెక్స్‌లు వున్నాయి. ఇందులో తకషిమాయా ప్లాజా చాలా పేరుగాంచినది.
ఇక్కడ ఎలక్ట్రానిక్‌ వస్తువులు చాలా చౌక. అందుకే సింగపూర్‌ వచ్చినవారంతా ఏదో ఒక వస్తువు తప్పక కొనుక్కెళుతుంటారు.  
___________________________________________________________

27. అందాల సిడ్నీ

  • అందమైన ఆకాశహర్మ్యాలు, ముచ్చటైన చిన్న చిన్న నదులు ఈ నగరం సొంతం. సముద్రం ఒడ్డున ఉండడం వల్ల బీచ్‌లకైతే లెక్కేలేదు. షాపింగ్‌ ప్రియులు ఎంతో ఇష్టపడే మాల్స్‌ ఎన్నో ఇక్కడున్నాయి. అన్నింటినీ మించి వెంకటేశ్వరస్వామి ఆలయం కూడా ఉంది. ఇక బౌద్ధాలయాల సంగతి సరేసరి. ఇదే ఆస్ట్రేలియాలోని అతి పురాతన నగరం... సిడ్నీ. ఈవారం సిడ్నీ అందాలు చూద్దామా!
ఆస్ట్రేలియాకు ఆగేయ దిశలో పసిఫిక్‌ మహా సముద్ర తీరాన ఉందీ నగరం. దేశంలో పెద్ద నగరం కూడా ఇదే. ఇక్కడ లెక్కలేనన్ని పార్కులున్నాయి. ఆ నగర ప్రజల గురించి చెప్పుకోవాలంటే... వారికి రెండు ప్రత్యేకతలున్నాయి. అవేంటంటే... ఎవరి పని వారు చేసుకోవడం, పర్యాటకులకు సాయం చేయడం సిడ్నీవాసుల నైజం. సుమారు 50 వేల ఏళ్ల క్రితం ఆదిమ మానవులు ఆగేయాసియా నుండి ఆస్ట్రేలియా వచ్చి స్థిరపడ్డారని చెపుతారు. వారు పోలికల్లో భారతీయుల్లా వుండేవారట. ఆంగ్లేయులు సామ్రాజ్య విస్తరణలో అక్కడున్న చాలామంది ఆదివాసీలను చంపేశారు. అప్పుడు మిగిలిన సంతతే ప్రస్తుతం ఆస్ట్రేలియా అడవుల్లో నివసిస్తున్నారు. వారిలో కొంతమంది పట్టణాల్లో బిచ్చమెత్తుకుంటూ కనిపిస్తారు కూడా.
తావరణం
ఇక్కడ జనవరి నుండి వర్షాకాలం. అత్యధిక ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్‌ మాత్రమే. మే నుండి ఆగస్టు వరకు చలికాలం. సెప్టెంబర్‌ నుండి వేసవికాలం. అయితే మార్చి నుండి మే నెల వరకు పర్యాటకులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అప్పుడైతే చాలా ఉత్సవాలు జరుగుతాయక్కడ. ఇక్కడ కంగారూ మాంసంతో చేసిన వంటకాలు ప్రత్యేకం. మరొక విషయం ఏంటంటే మాంసాహారులకు బోలెడు వెరైటీలు అందుబాటులో ఉంటాయి. శాకాహారులకు మాత్రం చాలా తక్కువ వంటకాలు లభిస్తాయి. సిడ్నీలో రెండు ప్రధానమైన పర్యాటక ప్రదేశాలున్నాయి. ఒకటి ఒపెరా హౌస్‌, ంండోది హార్బర్‌ బ్రిడ్జ్‌.
ఒపెరా హౌస్‌...
నదిలో 550 పలకలపై దీన్ని నిర్మించారు. దీని నిర్మాణానికి సుమారు 300 కోట్ల డాలర్లు ఖర్చుపెట్టి, 14 సంవత్సరాల పాటు కట్టారట. దీన్ని చూడ్డానికొచ్చే పర్యాటకులతో ఈ ప్రాంతం ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది. ప్రపంచంలోకెల్లా గొప్పగొప్ప కళాకారులిచ్చే బ్యాలే, ఒపెరా సంగీత ప్రదర్శనలు నిత్యం ఇందులో జరుగుతుంటాయి.
హార్బర్‌ బ్రిడ్జి
ఉత్తర దక్షిణ సిడ్నీలకు మధ్య వారధి ఈ బ్రిడ్జి. దీని పొడవు1149 మీటర్లు. ప్రపంచంలోనే పొడవైన స్టీల్‌ ఆర్చిబ్రిడ్జి ఇది. అర్థ చంద్రాకారంలో కనిపించే ఈ నిర్మాణానికి సుమారు 53 వేల టన్నుల స్టీలుని వినియోగించారట. దీనిపైకి ఎక్కాలంటే చాలా ధైర్యముండాలి. ధైర్యం సంగతి తర్వాత! బ్రిడ్జి ఎక్కాలంటే టిక్కెట్‌ కొనాలి. దాని ధర ఎంతో తెలుసా? సింపుల్‌గా 180 డాలర్లు. ఈ బ్రిడ్జి కింద చాలా మంది ఆదివాసీలు కనిపిస్తారు. పర్యాటకులు సరదాగా వాళ్లతో ఫొటోలు కూడా దిగుతారు.
వావ్‌... ఎన్ని బీచ్‌లో!
సిడ్నీలో చూడాల్సిన మరో ముఖ్యమైన ప్రదేశం మ్యాన్స్‌ బీచ్‌. ఇది హార్బర్‌ బ్రిడ్జికి ఒక వైపు ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఫెర్రీలు తిరుగుతుంటాయి. ఆదివాసులుండే ప్రదేశానికి వెళ్లాలంటే వీటిలోనే వెళ్లాలి. మంగళ, శనివారాల్లో మాత్రమే అక్కడికి వెళ్లడానికి వీలవుతుంది. అక్కడైతే వారి జీవన విధానాన్ని చాలా దగ్గరగా చూడొచ్చు. ఇక్కడ మన మక్కా మసీదులోలాగే బోలెడు పావురాలు కనిపిస్తాయి. షాపింగ్‌ చేయాలనుకునేవారికి ఈ బీచ్‌ తీరంలో లెక్కలేనన్ని షాపింగ్‌ మాల్స్‌ కూడా ఉన్నాయి. స్టాన్లీ బీచ్‌కి వెళ్లే రోడ్డు ప్రయాణం ఓ అడ్వంచర్‌లా వుంటుంది. ఈ బీచ్‌ ఒడ్డు నిటారుగా 70 అడుగుల లోతు ఉంటుంది. ఏ కొంచెం అదుపు తప్పినా లోయలో పడిపోవాల్సిందే. చాలా ప్రమాదకరమైన ప్రయాణం ఇది. అక్కడ్నుండి తూర్పువైపు కనుచూపు మేర ఎంత దూరం చూసినా సముద్రమే. అదే దక్షిణం వైపు చూశామనుకోండి.... కొండలు...వాటి అంచున చూడముచ్చటైన కాలనీలున్నాయి. వేసవిలో ఈ దేశస్థులు సముద్రం వెంబడి గ్లైడింగ్‌ విన్యాసాలు చేస్తారట.
పేద్ద మార్కెట్‌
సిడ్నీలో చెప్పుకోదగిన మరో ప్రదేశం వెస్ట్‌ఫీల్డ్‌ మార్కెట్‌. ఇది చాలా పెద్దది. గుండు సూది మొదలుకొని పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్‌ వస్తువుల వరకు అన్నీ దొరుకుతాయి. 10 ఎకరాల స్థలంలో 54 అంతస్తులుగా కట్టారు దీన్ని. కార్లు నిలపడానికే మూడు అంతస్తులున్నాయి.
నేషనల్‌ పార్క్‌
చూడాల్సిన మరో ప్రదేశం హెలెన్‌బర్గ్‌ నేషనల్‌ పార్కు. ఇందులో వెంకటేశ్వరస్వామి దేవాలయం కూడా ఉంది. దీని విస్తీర్ణమే 10 ఎకరాలు. ఇందులోనే వరసిద్ధి వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి, చంద్రకాళీశ్వరునికి కూడా ఆలయాలున్నాయి. విశేషమేమంటే ఇక్కడి అర్చకులు తెలుగు, తమిళం చక్కగా మాట్లాడతారు. ఈ పార్కుకు వెళ్లే దారిలో దట్టమైన అడవి ఉంది. మామూలుగా అడవంటే ఎత్తుపల్లాలుంటాయి. కానీ ఈ అడవి మాత్రం చదునుగా, సమాంతరంగా ఉంది. సిడ్నీలో స్థిరపడిన విదేశీయుల్లో చాలామంది చైనీయులు, ముస్లిములే. వీరిలో చైనీయులు రెస్టారెంట్లు, షాపింగ్‌ మాళ్లు నడుపుతున్నారు. వీటిలో ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే యాత్రికులు ఎక్కువగా చైనావాళ్ల మాల్స్‌ ఎక్కడున్నాయో అడిగి వెతుక్కుని మరీ వెళ్తుంటారు. ఇక్కడ మన దేశస్తుల గురించీ కొంత చెప్పుకోవాలి. చాలా ఏళ్ల క్రితం పంజాబీలు మెల్‌బోర్న్‌లో స్థిరపడ్డారట. ఇక్కడ వీరే భారీస్థాయిలో వ్యవసాయం చేస్తున్నారు. వీరు పండించిన గోధుమలు, కూరగాయలు, వేరుశనగలు... ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి అవుతాయట. ఇక్కడే స్థిరపడిన ఫిజీ ఇండియన్లు కూడా వ్యాపారాలు చేస్తున్నారు.
ఆస్ట్రేలియాలో మరో మంచి విషయమేంటంటే... గర్భిణులకు ప్రతి కాన్పుకూ ఆరువేల డాలర్లు ప్రభుత్వం చెల్లిస్తుంది.ఈ డబ్బు బిడ్డ సంరక్షణ కోసమట. శాశ్వత నివాస ధృవపత్రం పొందిన విదేశీయులకు కూడా ఈ పద్ధతి వర్తిస్తుంది.
బౌద్ధాలయం
50 ఎకరాల విస్తీర్ణంలో నాన్‌టీన్‌ బౌద్ధాలయం ఉంది. దీన్ని చైనీయుల సంప్రదాయ పద్ధతిలో నిర్మించారు. చిన్న కొండని తలపించే ఈ బౌద్ధాలయం మన దేశంలోని సాధువుల ఆశ్రమంలా ఉంటుంది. దీన్ని ఏడు అంతస్తుల్లో నిర్మించారు. చివరి అంతస్తులో బుద్ధుని అస్తికలను భద్రపరిచారు. పక్కనే ఎత్తైన ప్రదేశంలో కనిపించే మరో భవనం గురించి చెప్పుకోకపోతే ఎలా? బుద్ధుని జీవిత విశేషాలు తెలిపే బొమ్మలు, వస్తువులు, పుస్తకాలు ఎన్నో ఈ భవనంలో ఉన్నాయి. హాలు మధ్యలో ఎనిమిది అడుగుల బుద్ధ విగ్రహం ఉంది. ఇక్కడి బుద్ధ విగ్రహాలన్నింటిపైనా స్వస్తిక్‌ గుర్తు, నుదుట బొట్టు కనిపిస్తుంది.
ఇంకా...
ప్రపంచంలోకెల్లా పెద్ద అక్వేరియం సిడ్నీలో ఉంది. ఇందులో ఐదువేల జంతుజాతులు కనిపిస్తాయి. డార్లింగ్‌ హార్బర్‌, విక్టోరియా బిల్డింగ్‌ షాపింగ్‌ ప్రియుల మనసు దోచే ప్రదేశాలు. ఇక్కడ దొరకని వస్తువంటూ ఉండదు. ఇక్కడ తప్పకుండా చూడాల్సిన మరో ప్రదేశం టరోంగా జూ. ఇది సుమారు 29 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 2500 పైగా జంతువులున్నాయి. 
______________________________________________________________

28. ఆహ్లాదం ... ఆగ్రా ప్రయాణం

ఈ మధ్య కుటుంబ సభ్యులతో ఢిల్లీ, ఆగ్రా, మధురలో పర్యటించాం. ఎండలు మండిపోతున్నప్పటికీ పిల్లల చదువులు, సెలవుల సమస్యల కారణంగా ఎండల్లోనే పర్యటన సాగించాం. కొంత ఇబ్బందికి గురి చేసినప్పటికీ ఆ చారిత్రక కట్టడాలు చూశాక, వాటి చరిత్ర తెలుసుకున్నాక ఆహ్లాదకరంగా అనిపించింది. పిల్లలకైనా, పెద్దలకైనా పర్యటనలు అనేవి వినోదం, ఆనందం కలిగించడంతోపాటు విజ్ఞానాన్ని పెంపొందిస్తాయి. ఢిల్లీలో ఎర్రకోట, కుతుబ్‌ మినార్‌, తీన్‌మూర్తి భవన్‌, ఇందిరాగాంధీ మెమోరియల్‌, అక్షరధామ్‌, హుమాయున్‌ టూంబ్‌...మొదలైనవన్నీ చూశాక ఆగ్రాకు వెళ్లాం. ఢిల్లీ వెళ్లిన ఎవరైనా తప్పనిసరిగా చూడాలనుకునే చారిత్రక పర్యాటక ప్రదేశం ఆగ్రా.
మరి ఈ వారం ఆగ్రా విశేషాలేంటో చూద్దామా.
ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ చూడనిదే ఢిల్లీ యాత్రకు అర్ధం ఉండదు. అదొక అసంతృప్తిగా మిగిలిపోతుంది. నిజానికి ఢిల్లీ పర్యటనకు వెళ్లాల్సిన సరైన సమయం జనవరి-ఫిబ్రవరి నెలలు. అప్పుడు వాతావరణం ఇబ్బంది పెట్టదు. చలి, ఎండ ఎక్కువగా ఉండవు. కాని...ఆ సమయంలో పిల్లలకు స్కూళ్లు ఉండటం వల్ల సాధ్యం కాలేదు. అందుకే ఎండలు భరిస్తూనే ఆగ్రాకు వెళ్లాల్సి వచ్చింది. హైదరాబాద్‌తో పోలిస్తే అక్కడ ఎండ పదింతలు ఎక్కువగా ఉంది. అయినప్పటికీ చూడని ప్రదేశాలను చూస్తున్నామనే హుషారుతో బయలుదేరాం.

ఆగ్రా కోట తాజ్‌ మహల్‌కు సుమారు 6 కిలో మీటర్ల దూరంలో ఉంది. దేశంలోని ప్రసిద్ధ కోటల్లో ఆగ్రా కోట ఒకటి. తప్పనిసరిగా చూడదగ్గది. దీన్ని కూడా ఢిల్లీలోని ఎరక్రోట మాదిరిగానే ఎర్రరాయితో నిర్మించారు. ఇది నిర్మాణంలో, శిల్పంలో దాదాపుగా ఎర్రకోటను పోలి ఉంటుంది. ఈ రెండు ప్రసిద్ధ కోటలు నేల మీద కట్టినవే కావడం విశేషం. అత్యంత పెద్దదైన ఆగ్రా కోటలో ఎన్నో విశేషాలున్నాయి. ఊరికే చూస్తే ఉపయోగం లేదని ఓ గైడ్‌ను మాట్లాడుకున్నాం. అతనితో బేరమాడితే రూ.60కి ఒప్పుకున్నాడు. దాదాపు రెండు గంటలపాటు కోట అంతా తిప్పి చూపించి, విశేషాలు వివరించాడు. ఎర్ర కోటలో పైకి ఎక్కి తిరిగేందుకు అనుమతి లేదు. కాని ఇక్కడ అలాంటి నిబంధనలు ఏమీ లేవు. కోట లోపల ఎన్నో అందమైన భవనాలు ఉన్నాయి.

ఈ కోటకు ఢిల్లీ గేటు, అమర్‌ సింగ్‌ గేటు అనే రెండు గేట్లు ఉండగా, ప్రస్తుతం సందర్శకుల రాకపోకలకు అమర్‌సింగ్‌ గేటు ఒక్కటే ఉపయోగిస్తున్నారు. ఈ కోటలో దివాన్‌-ఇ-ఖాస్‌, ముస్సమాన్‌ బుర్జ్‌, మచ్చి భవన్‌ (ఫిష్‌ ప్యాలెస్‌), హమ్మన్‌-ఇ-షాహి (రాచరికపు స్నానశాల), నగీనా మసీద్‌, జనానా మీనా బజార్‌...మొదలైనవి ఉన్నాయి. ఇక్కడి ముంతాజ్‌ మహల్లో మొఘల్‌ చక్రవర్తులు వాడిన ఆయుధాలు, దుస్తులు, వివిధ రకాల వస్తువులు, ఖురాన్‌ లిఖిత ప్రతులు, షాజహాన్‌ చక్రవర్తి జారీ చేసిన ఫర్మానాలు (రాజాజ్ఞలు) మొదలైనవి ఎన్నో ఉన్నాయి. అక్బర్‌ పునాది రాయి వేసిన ఈ కోటల్లోనే మొఘల్‌ చక్రవర్తులంతా జన్మించి, ఇక్కడి నుంచే రాజ్యపాలన చేశారు. ఈ కోటలో ప్రతి అంశం తీరిగ్గా చూడాలనుకుంటే ఒక రోజు పూర్తిగా పడుతుంది. ఆగ్రా కోట నుంచి తాజ్‌మహల్‌ కనబడుతూనే ఉంటుంది. షాజహాన్‌ కొడుకు ఔరంగజేబు చేతిలో బందీ అయి ఈ కోట నుంచే తాజ్‌మహల్‌ను చూసుకుంటూ తన అవసాన దశను గడిపాడు.

ఆగ్రా ఫోర్టు సందర్శన ముగిశాక మధ్యాహ్నం సుమారు రెండు గంటల ప్రాంతంలో, ఎరట్రి ఎండలో ఆటోలో తాజ్‌మహల్‌కు చేరుకున్నాం. అంత ఎండలోనూ తాజ్‌లో పర్యాటకులు కిటకిటలాడుతున్నారు. ముఖ్యంగా పెద్ద సంఖ్యలో విదేశీయులు ఉన్నారు. ప్రపంచ ప్రసిద్ధి పొందిన తాజ్‌ గురించి తెలియంది ఎవరికి? వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఈ పాలరాతి ప్రేమ మందిరాన్ని ఎవరికి వారు తమకు తోచినట్లుగా వర్ణించుకోవాల్సిందే. ఇక్కడ సందర్శకులు ఎంతమంది ఉన్నారో వృత్తి నిపుణులైన ఫోటోగ్రాఫర్లూ అంతమంది ఉన్నారు. తాజ్‌ దగ్గర ఫోటోలు తీయించుకోకుండా ఉండలేరు. మేమూ అందుకు అతీతులం కాదు. తాజ్‌ లోపలికి చెప్పులు వేసుకొని పోకూడదు. ఉత్త కాళ్లతో వెళుతుంటే కాళ్లు మంటలెత్తి పోయాయి. కొందరు పాలిథిన్‌ కవర్లు తొడుక్కొని వచ్చారు. లోపలికి వెళ్లాక చల్లగా ఉంది. లోపల షాజహాన్‌, ముంతాజ్‌ సమాధులు ఉన్నాయి. అయితే అసలు సమాధులు అడుగున ఉన్నాయని, అవి కనబడవని, మనకు కనిపించేవి వాటి ప్రతిరూపాలని అక్కడి వారు చెప్పారు.

యమునానది ఒడ్డునే ఉన్న తాజ్‌లో పాలరాయి మినహా మరో రాయి కనబడదు. కాని... యమునా నదే... మన మూసీలా మురికిగా, కాలుష్యంతో ఉంది. తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలు ఎవరో మనకు తెలీదుగాని, వారు సృష్టించిన ఈ కళాఖండం అద్భుతం. ఆగ్రా చుట్టుపక్కల ఇతిమది ఉద్దౌలా, అక్బర్‌ టూంబ్‌, సికిందరా, ఫతేపూర్‌ సిక్రీ మొదలైనవి చూడదగ్గవి. కాని మాకు సమయం లేదు. అన్నీ కలిపి చూసేందుకు రూ.500 ప్యాకేజీ టూర్లు ఉన్నాయి. ఏ పర్యాటక ప్రదేశంలోనైనా ప్రవేశ రుసుం రూ. 10-15కు మించి లేదు. పిల్లలకు 15 ఏళ్ల వరకు ఉచితం. తాజ్‌కు శుక్రవారం సెలవు. తాజ్‌లో మూడు గంటల పాటు గడిపాక బయటకు వచ్చి మళ్లీ సౌత్‌ ఇండియన్‌ రెస్టారెంట్‌లో భోజనం చేసి ఓ టెంపోలో మధురకు వెళ్లాం. కృష్ణుడు పుట్టిన స్థలంగా చెప్పుకునే మధుర ఆగ్రాకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి రాత్రి 8 గంటలకు తాజ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కి 10 గంటలకల్లా ఢిల్లీ నిజాముద్దీన్‌ స్టేషన్‌కు చేరుకున్నాం.
టూర్‌ ప్యాకేజీలు....
అన్ని నగరాల్లో మాదిరే ఢిల్లీలోనూ అనేక టూర్‌ ప్యాకేజీలు ఉన్నాయి. ప్రభుత్వ పర్యాటక శాఖ నిర్వహించే ప్యాకేజీలే కాకుండా, ప్రయివేటు సంస్థలు నిర్వహించే ప్యాకేజీలు కూడా ఉన్నాయి. ఊరు తెలియని కొత్త వారికి టూర్‌ ప్యాకేజీలు ఒకందుకు సౌకర్యమే అయినా నిర్వాహకులు నిర్దేశించిన సమయంలోగా హడావుడిగా చూసి రావాల్సి ఉంటుంది. మనం ఆ కట్టడాలనో, ప్రాంతాలనో తీరిగ్గా చూసేందుకు, వివరంగా తెలుసుకునేందుకు అవకాశం ఉండదు. సరే... ఎన్ని చూడగలిగితే అన్నే చూస్తామనే ఉద్దేశంతో మేం అన్ని చోట్లకు విడిగానే వెళ్లాం. ఢిల్లీ నుంచి ఆగ్రా, ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా టూర్‌ ప్యాకేజీలు ఉన్నాయి. ఇందుకోసం బస్సులో వెళ్లాలి. వారు అక్కడ తాజ్‌మహల్‌, ఆగ్రా కోట, మధుర, బృందావనం... మొదలైనవి చూపిస్తారు. అన్ని ప్యాకేజీల్లో పర్యాటక ప్రదేశాల జాబితా ఒక్కతీరుగా లేదు. మేం సంప్రదించిన టూర్‌ ప్యాకేజీలో తాజ్‌ మహల్‌, ఆగ్రా కోట, మధుర ఉన్నాయి. ఈ ప్యాకేజీలో చార్జి మనిషికి రూ.900. ఉదయం 6 గంటలకు బస్సు (ఎసి) ఢిల్లీ నుంచి బయలుదేరి రాత్రి సుమారు 11 గంటలకు తిరిగి వస్తుంది. సామాన్యులకు ఈ ఖర్చు భారమే. అందుకే మేం రైలులో వెళ్లాలని నిర్ణయించుకుని ముందుగా టిక్కెట్లు రిజర్వు చేయించుకున్నాం. రైలు టిక్కెట్టు రూ.74 మాత్రమే.

ఆగ్రా స్టేషన్‌కు ముందు రాజాకీ మండీ స్టేషన్‌ ఉంది. మేం అక్కడి వరకు టిక్కెట్టు తీసుకున్నాం. ఆగ్రాకైతే టిక్కెట్టు చార్జి రూ.75. అయితే రాజాకీమండీలో దిగితే ఆగ్రాకు వెళ్లే దూరం తగ్గుతుందని మిత్రులు చెప్పడంతో అక్కడికే టిక్కెట్టు తీసుకున్నాం. ఢిల్లీ నుంచి ఆగ్రాకు వెళ్లే తాజ్‌ ఎక్స్‌ప్రెస్‌ (ఇది ఝాన్సీ వరకు వెళుతుంది) ఢిల్లీలో ఉదయం 6.15కు బయలుదేరి మూడు గంటల్లో రాజాకీ మండీకి చేరుకుంటుంది. ఢిల్లీ నుంచి ఆగ్రాకు ప్రయాణ సమయం తక్కువే అయినప్పటికీ తాజ్‌ ఎక్స్‌ప్రెస్‌లో టిక్కెట్లు ముందుగా రిజర్వు చేసుకోకపోతే ఇబ్బంది పడాల్సిందే. అందుకే మేం ముందుగా రిజర్వు చేసుకున్నాం. తిరుగు ప్రయాణంలో మధురకు వెళ్లాలనే ఉద్దేశంతో మధుర నుంచి ఢిల్లీకి రిజర్వు చేయించాం. మేం దాదాపు 10 గంటల కల్లా రాజాకీమండీ చేరుకున్నాం. ఆగ్రాకు వెళ్లేందుకు స్టేషన్‌ బయట చాలా ఆటోలు ఉన్నాయి. మేం రైలు దిగగానే ఒక ఆటోవాలా మా (మేం ఐదుగురం) దగ్గరకు వచ్చాడు. మేం తాజ్‌మహల్‌ వెళ్లాలని చెప్పాం. 70 రూపాయలు ఇవ్వమన్నాడు.

మేం సరేననేలోగానే అతనో ప్యాకేజ్‌ చెప్పాడు. తాజ్‌మహల్‌, ఆగ్రా కోటకు తీసుకెళతానని, ఇప్పటి నుంచి (మేం ఆటో బేరం కుదుర్చుకున్నప్పటి నుంచి) సాయంత్రం 4 గంటల వరకు మాతోనే ఉంటానని, మధ్యలో భోజనం కోసం, టిఫిన్‌ కోసం హోటల్‌కు, షాపింగ్‌ చేసేందుకు అవసరమైన దుకాణాలకు తీసుకెళతానని, ఇందుకు గాను రూ.300 ఇవ్వమని అడిగాడు. నిజానికి మనం మధ్య మధ్య ఆటోలు మాట్లాడుకుంటూ విడిగా తిరిగినా ఇంత మొత్తం ఎలాగూ అవుతుంది. పైగా అన్నీ కనుక్కుంటూ తిరగడం సమయం వృథా. దీనికితోడు పైగా ఎండ మండిపోతోంది. ఐదుగురికి ఈ మొత్తం సమంజసంగానే ఉందనిపించి ఆ ప్యాకేజీకి ఓకె చెప్పాం. అక్కడి ఆటోవాలాలు దాదాపుగా ఇలాగే ప్యాకేజీలు కుదుర్చుకుంటారు. మేం ఆటో ఎక్కగానే మమ్మల్ని ఓ సౌత్‌ ఇండియన్‌ రెస్టారెంట్‌కు తీసుకెళ్లాడు. దీంతో ప్రాణం లేచి వచ్చింది. అక్కడ టిఫిన్‌ చేశాక ఆ చిన్న ఊళ్లో ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయానికి తీసుకెళ్లాడు. ఆ ఊళ్లో ఉన్న ఏకైక దక్షిణాది ఆలయం ఇదే. దాని పేరు 'తిరుపతి బాలాజీ టెంపుల్‌'. ఇక్కడి ఆలయాల్లో మాదిరే అక్కడ పెద్ద లడ్డూలు విక్రయిస్తున్నారు.
____________________________________________________________

29. సుందర దృశ్యాల నందనవనం

  • టారుట్రైన్‌ లో ప్రయాణం... అతి దగ్గరగా కదిలే మేఘాలు... సూర్యోదయాలూ, సూర్యాస్తమయాలు అద్భుతంగా ఉంటాయక్కడ. బంగారు వర్ణంలో మెరిసే ఉదయభానుడి తొలి కిరణాల మధ్య నుండి వెండి కొండలను చూడడం మరో సుందర దృశ్యం. రంగు రంగుల పూలు, పిల్ల గాలులతో కూడిన ప్రశాంత వాతావరణంలో అలా ఆలా... నడిచి వెళ్తుంటే.... మైమరచిపోతాం. ఈ అనుభూతులు అందాల సుందర సందాక్‌ఫూ సొంతం.
పశ్చిమ బెంగాల్‌లోని సందాక్‌ ఫూ ఆ రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశం. సముద్ర మట్టానికి సుమారు 3636 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. అక్కడికి వచ్చేవారు ట్రెకింగ్‌ చేయడమంటే బాగా ఇష్టపడతారు. నడవలేని వారికి వాహనాలు కూడా ఉంటాయి. ఈ ట్రెక్‌లో చాలా భాగం ఇండో-నేపాల్‌ అంతర్జాతీయ సరిహద్దులో, కొంతభాగం నేపాల్‌లో జరుగుతుంది.
నడవాలనకునేవారు ముందుగా న్యూ జల్‌పారుగురి చేరుకుని అక్కడ్నుండి మనేరు భంజంగ్‌కు చేరుకోవచ్చు.
జాగ్రత్తలు
ఎక్కడ పడితే అక్కడ నీటిని తాగడం మంచిది కాదు. అందుకే నీటిని శుభ్రం చేసే ట్యాబ్లెట్లు తీసుకెళితే మంచిది. ఇవి డార్జిలింగ్‌లో దొరుకుతాయి. ఉప్పు, గ్లూకోజ్‌ తప్పక వెంట తీసుకెళ్లాలి.
తినడానికి?
అక్కడి హోటళ్లలో అన్నం, గుడ్లు, రోటీలు, కూరలు అన్నీ దొరుకుతాయి. రుచిగా కూడా ఉంటాయి. ట్రెకర్స్‌ హట్‌లో నూడుల్స్‌, అన్నం, క్యారెట్‌ లేదా బంగాళదుంప కూర, రోటీలు ఇస్తారు. న్యూ జల్‌పారుగురి నుండి డార్జిలింగ్‌ వెళ్లే దారిలో (65 కి.మీ దూరంలో) సుఖియాపొక్రి అనే ఊరు వస్తుంది. అక్కణ్నుండి మనేరు భంజంగ్‌ ఆరు కిలోమీటర్ల దూరం. బయల్దేరిన కొద్దిసేపటికే సిలిగురి అనే ఊరు వస్తుంది. అక్కణ్ణుండి డార్జిలింగ్‌కి టారుట్రైన్‌లో వెళ్తే బావుంటుంది. అదేనండీ... స్టీమ్‌ ఇంజన్‌తో నడిచే రైలు. ఈ రైళ్లు ఇలా ఎత్తైన ప్రదేశాల్లో మాత్రమే కనిపిస్తాయి. కొన్ని చోట్ల టారుట్రైన్‌ వెళ్లే రోడ్డు, బస్సు రోడ్డు పక్కపక్కనే వస్తుంది. సుఖియాపొక్రి వెళ్లే రోడ్డు పక్కనున్న కొండలు... వాటిని తాకుతూ వెళ్లే మేఘాలు... చూపరులకు అద్భుత దృశ్యాన్ని కళ్లముందు ఆవిష్కరింపజేస్తాయి. కదిలే మేఘాల మధ్య తేయాకు తోటలను చూసినవారు ఆ ప్రదేశమంతా ఆకుపచ్చ తివాచీ పరిచారా అనుకోకుండా ఉండలేరు. అక్కణ్ణుండి మనేరుభంజంగ్‌కు వెళ్లే దారిలో వచ్చే వాహనాలన్నింటినీ సరిహద్దు కమెండోలు తనిఖీ చేసి వివరాలు రాసుకుంటారు.
మనేరుభంజంగ్‌ నుండి 31కి.మీ వెళ్తే సందాక్‌ఫూ వస్తుంది. అడుగడుగునా రాళ్లు... చిన్న చిన్న మలుపులతో నిండిన ఆ రహదారిలో మామూలు వాహనాలు ప్రయాణించలేవు. అందుకే నడవలేనివారు బ్రిటీష్‌ కాలంనాటి లాండ్‌రోవర్‌ వాహనాల్లో వెళ్తుంటారు. ఆ దారంతా ఏటవాలుగా ఉంటుంది. నడిచి వెళ్లేవాళ్లు రెండు కి.మీ దూరంలో ఉన్న ఛిత్రే అనే ఊళ్లో బస చేస్తారు. ఈ దారికి ఇరువైపులా ఏపుగా పెరిగిన పైన్‌ వృక్షాలు కనువిందు చేస్తాయి. ఇక్కడి నీళ్లపైపులు చెట్లపై నుండి వేలాడుతూ టెలిఫోన్‌ కేబుల్‌ వైర్లను తలపిస్తాయి.
ట్రెకింగ్‌ చేసేవారు సేదతీరడానికి ఛిత్రే అనే గ్రామంలో చిన్న షెడ్డుల్లాంటి నిర్మాణాలున్నాయి. వీటిని ట్రెకర్స్‌ హట్స్‌ అంటారు. ప్రభాతవేళ అక్కణ్ణుండి ఎదురుగా ఉన్న కొండ ఎక్కిచూస్తే కాంచన్‌జంగ శిఖరం అద్భుతంగా కనిపిస్తుంది. అప్పుడే ఉదయిస్తున్న సూర్య కిరణాలు పడి ఆ శిఖరం గులాబీ రంగులో మెరిసిపోతుంది. ఆ దృశ్యాన్ని చూడాల్సిందే కానీ వర్ణించలేం. ఇక తర్వాత మజిలీ 9 కి.మీ. దూరంలో ఉన్న టోంగ్లు. అక్కడికి చేరుకునే దారిలో రోడోడెండ్రాన్‌ పూలు కనిపిస్తాయి. ఇవి తెలుపు, గులాబీ, ఎరుపు రంగుల్లో చాలా అందంగా ఉంటాయి. ఇవి ఎక్కువగా ఏప్రిల్‌, మే నెలల్లో పూస్తాయి. ఇక్కడ మరో సుందర దృశ్యం గురించి చెప్పుకోవాలి. ఆ చుట్టుపక్కల ఏ రంగు పూల చెట్లు ఉంటాయో ఆ ప్రదేశమంతా అదే రంగు నిండిపోయి కనువిందు చేస్తుంది.
పొరబడితే నేపాల్‌లో ఉంటాం
ఈ మార్గం చాలా చిన్నది. చిన్న చిన్న వాహనాలు మాత్రమే వెళ్లడానికి వీలవుతుంది. ఆ దారిలో వెళ్తే ఎక్కువ దూరం నడవాల్సి వస్తుంది. అందుకోసం కొంతమంది అంత దూరం నడవకుండా కొన్ని దగ్గర దారుల్లో వెళ్తుంటారు. అయితే అది చాలా ప్రమాదకరం. పొరపాటున వెళ్లారా... తిన్నగా నేపాల్‌ సరిహద్దు దాటి ఆ దేశంలో అడుగుపెడతారు. అది నేపాల్‌ అని తెలియడానికి అక్కడక్కడా సిమెంటు దిమ్మెలు కూడా ఉంటాయి. వాటిమీద మన దేశం వైపు భారత్‌ అనీ, మరొక వైపు నేపాల్‌ అనీ రాసుంటుంది. అంటే మనకు తెలియకుండానే నేపాల్‌లోకి వెళ్లిపోతామన్నమాట. అందుకే ఆ మార్గాల్లోకి ఎవరినీ వెళ్లనివ్వరు. అలా ఘాట్‌ రోడ్డులో నడుస్తూ వెళ్తుంటే మేఘ్మా వస్తుంది. దీనికి గుర్తుగా సరిహద్దులోనే కమెండోల నివాస సముదాయం ఉంటుంది. ఇక్కడి బౌద్దుల గుడి చాలా బావుంటుంది. మేఘ్మా దారిపక్కన ఇండో-నేపాల్‌ సరిహద్దు రాయి కనిపిస్తుంది. అక్కణ్ణుండి నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఒక పర్వతం అంచున టోంగ్లు అనే గ్రామం ఉంది.
మరో విషయం ఏంటంటే ఇక్కడ ఎప్పుడూ మేఘాలు దట్టంగా కమ్ముకుని ఉంటాయి. ఎంతగా అంటే ఎప్పుడు సూర్యోదయం అయిందో, ఎప్పుడు సూర్యాస్తమయమయిందో కూడా తెలియదు. పరిసరాలేవీ సరిగ్గా కనిపించవు. రెండు మూడు మీటర్ల దూరంలో ఏముందో కూడా అర్ధం కాదు. ఎక్కువగా మధ్యాహ్న సమయం తర్వాత మేఘాలు దట్టంగా ఆవరిస్తాయి. ఇక్కడ కనిపించే అద్భుత దృశ్యాల్లో సూర్యోదయం, సూర్యాస్తమయం ముఖ్యమైనవి. ఎక్కువగా మబ్బులు కమ్మేయడం వల్ల వీటి దర్శన భాగ్యం పర్యాటకులకు అరుదుగానే లభిస్తుందని చెప్పాలి. కొండల వెనుక నుండి మబ్బుల మధ్యలో అలా అలా పైకి వచ్చే ఉదయభానుడి తొలి వెలుగు కిరణాలు బంగారు వర్ణంలో ప్రకాశిస్తాయి. అవి కొద్దికొద్దిగా పైకి వస్తూ కాంచన్‌జంగ, పాండిమ్‌, జాను శిఖరాలమీద వెలుగులు విరజిమ్ముతాయి. కాంచన్‌జంగకు కుడివైపున పాండిమ్‌, ఎడమ వైపున జాను పర్వతాలు ఉంటాయి. ఈ మూడు శిఖరాగ్రాలు పడుకుని ఉన్న మనిషి ఆకారంలో కనిపిస్తాయి. జాను శిఖరం తలగాను, కాంచన్‌జంగ శరీరంగాను, పాండిమ్‌ కాళ్లలా కనిపిస్తాయి. స్థానికులు ఆ ఆకారాన్ని 'నిద్రిస్తున్న బుద్ధుడు' అని చెప్తారు.
పూలూ పక్షులూ!
అక్కణ్ణుండి 15 కి.మీ దూరంలో కాలాపొఖ్రి గ్రామం ఉంది. ఆ దారిలోనే నేపాల్‌లోని టుమ్లింగ్‌ వస్తుంది. అక్కడ చూడాల్సిన ప్రదేశం సింగలీల నేషనల్‌ పార్కు. ఈ పార్కుకు వెళ్లే దారిలో ఫెర్న్‌ మొక్కలు కనిపిస్తాయి. శీతాకాలంలో మంచు కప్పేసిన ఆ మొక్కలు... వేసవి ప్రారంభంలో మంచు కరగడం వల్ల తిరిగి కనిపిస్తాయి. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో చిగురించడం ప్రారంభిస్తాయి. మాగ్నోలియా చెట్లు పూలతో నిండి ఉంటాయి. ఈకాలంలో చూస్తే అసలు ఆ చెట్లకి ఆకులనేవి ఉంటాయా అనిపిస్తుంది. ఈ పార్కులో అక్కడక్కడా ఎర్ర పాండాలు, చిరుతలు, ఎలుగుబంట్లు వంటి జంతువులు కనిపిస్తాయి. ఈ కొండల్లో పుష్పించే రంగురంగుల పూల కోసం సుమారు 600 రకాల పక్షులు ఇక్కడికి వలస వస్తుంటాయి. అవన్నీ ఈ పార్కుకు అదనపు అందాలే. పార్కు కొండ దిగి నాలుగు కి.మీ నడిస్తే కాలాపొఖ్రి వస్తుంది. అక్కణ్ణుండి సందాక్‌ఫూ ఆరు కిలోమీటర్ల దూరం. సందాక్‌ఫూ దగ్గరికి రాగానే చిన్న చిన్న మంచుగుట్టలు కనిపిస్తాయి. ఇక్కడ్నుండి చూస్తే మబ్బులు కమ్మేసిన హిమాలయాలు కనిపించీ కనిపించనట్లు బహు సుందరంగా ఉంటాయి.
నాలుగు శిఖరాలు!
ప్రపంచంలోని ఎత్తైన మొదటి అయిదు శిఖరాల్లో నాలుగింటిని ఇక్కడి నుండే చూడొచ్చు! అంటే, మొత్తం 320 కి.మీ మేర మంచు కప్పేసిన హిమాలయ పర్వత సముదాయాన్ని ఈ ప్రాంతం నుండి చూడొచ్చన్నమాట. హిమాలయాల్లో మరే ప్రదేశంలోనూ ఇలా కనిపించదు. ఈ దృశ్యాల్ని ఎంతసేపు చూసినా ఇంకా చూడాలని అనిపిస్తుంది. అక్కడ్నుండి 12 కి.మీ వెళ్తే సిరిఖోలా వస్తుంది. ఈ దారి పొడవునా మాగ్నోలియా, రోడోడెండ్రాన్‌ పూలచెట్లు అందమైన రంగుల్లో కనువిందు చేస్తాయి. ఖోలా అంటే అక్కడి భాషలో నది అని అర్ధమట. నదిలోకెళ్లి అక్కడ ఉన్న పెద్ద పెద్ద రాళ్లమీద కూర్చుంటే ఏటి గలగలలు తప్ప మరే శబ్దం వినిపించదు.తిరుగు ప్రయాణం ఉదయాన్నే చేస్తే బావుంటుంది. ఎంచక్కా నదివెంట ప్రయాణిస్తూ మనేరుభంజంగ్‌ చేరుకోవచ్చు. అక్కణ్ణుండి న్యూ జల్‌ పారుగురి వెళ్లి ట్రైన్‌ మీద రావచ్చు.
ట్రెకింగ్‌ కాస్త కష్టమనిపించినా శరీరానికి మంచి వ్యాయామం... మొత్తమ్మీద ఇదో అద్భుతమైన ప్రయాణం!
ఖర్చులు
అనేక ట్రావెల్‌ ఏజెన్సీలూ ట్రెకింగ్‌ ఏజెన్సీలూ 'సందాక్‌ఫూ, డార్జిలింగ్‌ ట్రెకింగ్‌' నిర్వహిస్తుంటాయి. పది రోజుల ఈ ట్రెకింగ్‌కు ఒక్కో మనిషికి 25 వేల నుండి 48 వేల వరకూ తీసుకుంటారు. ఫస్ట్‌క్లాస్‌ హోటల్‌ వసతి, టెంట్లు, గైడు, భోజనాలు... అన్నీ వాళ్లే సమకూరుస్తారు. ఈ ట్రెక్‌లో భాగంగా డార్జిలింగ్‌లోని పర్యాటక ప్రదేశాలన్నీ చూడొచ్చు.
సూచనలూ.... సలహాలూ...
వాతావరణం ఎప్పుడెలా ఉంటుందో చెప్పలేం కనుక రెయిన్‌కోటు తప్పనిసరి. ట్రెకింగ్‌ చేసేవాళ్లు నీళ్లు ఎక్కువగా తాగాలి. మంచుమీద ఎక్కువగా ఆడకూడదు. అందరితో కలిసి కదలాలి. _______________________________________________________________

బుద్ధగయ

బుద్ధం శరణం గచ్ఛామి
సంఘం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి
అనే పదాలతో ఆ పరిసరాలు మారుమోగేవి ఒకప్పుడు. బుద్ధుడి పాదస్పర్శతో ఆ నేల పులకించిపోయింది. బౌద్ధమతం తీసుకున్న వారితో ఊరంతా సందడిగా ఉండేది. బోధివృక్షం చల్లని నీడతో, స్వచ్ఛమైన గాలితో మనుషుల్ని సేదతీర్చేది. జ్ఞానవంతుల్ని చేసేది. బౌద్ధమతం అంటే ముందుగా గుర్తొచ్చేది ఈ ఊరే. బుద్ధునికి జ్ఞానోదయమయింది. ఇక్కడున్న మహాబోధి వృక్షం కిందే. అదే బుద్ధ గయ.
ఇప్పుడు బుద్ధగయ గడిచిన జ్ఞాపకాలను నెమరేసుకుంటూ నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంది. వెనకటి సందడి లేకపోయినా ప్రశాంతతతో కూడిన గంభీర వాతావరణం ఊరంతా అలుముకుని ఉంటుంది. పర్యాటకులు, బౌద్ధమతస్థులు సందడి తప్ప. ఊరంతా ప్రశాంతంగా, అసలు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? లేరా? అన్నట్లు ఉంటుంది.
ప్రముఖ స్థలం
పూర్వం మగధ సామ్రాజ్యంలో ప్రముఖ స్థలంగా భాసిల్లిన బుద్ధగయను హిందువులూ, బౌద్ధులూ పవిత్ర స్థలంగా పరిగణిస్తారు. సిద్ధార్థుడు మహాపరి నిర్వాణం చెంది బుద్ధుడు అయింది ఇక్కడే. ఇక్కడున్న ఓ అశ్వద్ధవృక్షం కింద కూర్చొని తపస్సులో మునిగిపోయాడు సిద్ధార్థుడు. తొమ్మిది సంవత్సరాల తర్వాత సిద్ధార్థుడు బుద్ధుడయి ప్రపంచానికే వెలుగునిచ్చాడు. ''దుఃఖం ఉంది. హేతువు ఉంది. దుఃఖ నిరోధానికి మార్గం ఉంది'' అన్న జ్ఞానాన్ని సముపార్జించుకున్న బుద్ధుడు దీన్ని ప్రపంచం నలుమూలలా ప్రచారం చేయ సంకల్పించుకున్నాడు. బోధి లభించిననాటికి ఈయనకు 36 సంవత్సరాలు. ఆ వయసులోనే ప్రజలందరి దుఃఖాన్ని రూపుమాపటానికి కంకణం కట్టుకున్నాడు. సిద్ధార్థునికి జ్ఞానసిద్ధి కలిగిన ఆ స్థలమే బుద్ధగయగా విలసిల్లుతోంది.
నాలుగు పుణ్యక్షేత్రాలు
బౌద్ధ మతస్థులు అతి పవిత్రంగా పరిగణించే పుణ్యస్థలాలు నాలుగు. మొదటిది నేపాల్‌లోని లుంబిని. ఇక్కడే శుద్ధోదన మహారాజు, మాయాదేవి దంపతులకు సిద్ధార్థుడు జన్మించాడు. రెండోది సిద్ధార్థుడు బుద్ధుడు అయిన బుద్ధగయ. దీనినే బోధిగయ అని కూడా అంటారు. మూడోది సారనాథ్‌. వారణాశి సమీపంలో ఉన్న సారనాథ్‌లోనే బుద్ధుడు మొదటిసారిగా తన శిష్యులు అయిదుగురికి బుద్ధ ధర్మాల్ని ఉపదేశించాడు.
జ్ఞానసిద్ధి లభించిన తర్వాత బుద్ధుడు కాశీకి దగ్గరగా ఉన్న రుషిపత్తన మృగవనం అనే ఊరికి వెళ్లాడు. అక్కడ తనతో కలిసి కొంతకాలం తపస్సు చేసిన ఐదుగురిని శిష్యులుగా చేసుకున్నాడు. వారికి ధర్మోపదేశం చేశాడు. ఆ ప్రదేశమే సారనాథ్‌గా ప్రసిద్ధికెక్కింది. బౌద్ధులకు అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా వర్థిల్లుతోంది.
నాలుగోది గోరఖ్‌పూర్‌ సమీపంలోని కృషినగర్‌. ఇక్కడే బుద్ధుడు నిర్యాణం చెందాడు. ఈ నాలుగింటికీ దేని ప్రత్యేకత దానిదే. అయినప్పటికీ బుద్ధునికి జ్ఞానసిద్ధి కలిగిన బుద్ధగయను విశేషంగా భావిస్తారు భక్తులు.
బోధి వృక్షం
బుద్ధగయ గయకు పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడకొచ్చిన సందర్శకులు ముందుగా చూడాలనుకునేది బోధి వృక్షాన్నే. దీని కింద కూర్చుని ధ్యానించే సిద్ధార్థుడు బుద్ధుడు అయ్యాడు. అయితే అప్పటి బోధివృక్షం ఇప్పుడు లేదు. దాని తాలూకు మొలకే పెరిగి పెద్దదయి ఇప్పుడు సందర్శకులకు కనువిందు చేస్తుంది. తల్లిచెట్టును మరపిస్తోంది.
బోధివృక్షానికి చెందిన ఓ మొలకను అప్పట్లో అశోకచక్రవర్తి శ్రీలంకకు పంపాడు. బౌద్ధమత ప్రచారానికై అశోకుని కుమారుడు మహేంద్ర శ్రీలంక వెళ్లినప్పుడు, బోధివృక్షం తాలూకు ఒక అంటును కూడా తనతో తీసుకెళ్లాడట. దీన్ని శ్రీలంకలోని అనూరాధాపురలో నాటారు. ఈ మొలకే ఇప్పుడు మహావృక్షమైంది. బుద్ధగయ లోని బోధివృక్షం తల్లిచెట్టు కాల గమనంలో అంతరించిపోతే, అనూరాధాపురలోని పిల్ల చెట్టునుండి మరో అంటును తీసుకొచ్చి బుద్ధగయలో నాటారు. ప్రస్తుతం బుద్ధగయలోని బోధివృక్షం అదే. అసలు వృక్షం నుండి వచ్చింది కాబట్టి దీన్ని కూడా భక్తి శ్రద్ధలతోనే తిలకిస్తూ వుంటారు సందర్శకులు.
వజ్రాసనం
బోధివృక్షం కిందే 'వజ్రాసనం' ఉంది. ఎర్రరాతితో నిర్మించిన ఈ ఆసనంపై కూర్చుని సిద్ధార్థుడు ధ్యానసమాధిలో మునిగిపోయాడట. వజ్రాసనాన్ని చూస్తుంటే మనస్సులో ధ్యాననిష్టుడయిన గౌతముడు మెదులుతాడు. మసస్సు తన్మయత్వం చెందుతుంది.
బుద్ధగయకు కొద్ది దూరంలో ఉంది నిరంజానా నది. జ్ఞానసిద్ధి కలిగిన తర్వాత బుద్ధుడు సరాసరి నిరంజనా నది దగ్గరకు వచ్చి ఇందులో స్నానం చేశాడట. చుట్టూ చిన్న చిన్న కొండలతో, నిర్మలంగా ఉన్న నీటితో, ఎటువంటి శబ్ధం లేకుండా గంభీరంగా ప్రవహిస్తుంది ఈ నది. ఇక్కడికొచ్చిన వాళ్లు నిరంజనా నదిని చూడకుండా రారు. కొంతమంది భక్తులు నిరంజనలో స్నానం చేసి సంతోషిస్తారు కూడా.
ఎన్నో చైత్యాలు
బుద్ధగయలోకెల్లా ముఖ్యమైనది మహాబోధి ఆలయం. ఈ ఆలయం చుట్టూ అనేక చైత్యాలు, స్థూపాలు వున్నాయి. టిబెట్‌, జపాన్‌వారు నడుపుతున్న అనేక మఠాలు, ఆశ్రమాలు వున్నాయి.
ఇక్కడున్న చైత్యాలలో అనిమిషలోచన చైత్యం అతి ముఖ్యమైంది. బుద్ధునకు జ్ఞానసిద్ధి కలిగిన తర్వాత కొద్దిసేపు అనిమిషలోచనుడై ఈ ప్రదేశంలోనే నిలిచిపోయాడని చెప్తారు. తనకు జ్ఞానం లభింపజేసినందుకు కృతజ్ఞతా సూచికగా కొద్దిసేపు కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడట బుద్ధుడు. అప్పట్నుంచి అది అనిమిషలోచన చైత్యంగా ప్రసిద్ధికెక్కింది.
చంక్రమణ అనే పేరు గల అరుగులాంటి కట్టడాన్ని కూడా భక్తులు పవిత్రంగా భావించి దర్శిస్తుంటారు.
బుద్ధ గయలో ఉన్న ప్రధాన దర్శనీయ స్థలం మహాబోధి ఆలయం. ఈ ఆలయాన్ని అశోకచక్రవర్తి క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దిలో నిర్మించినట్లుగా చరిత్రకారుల కథనం. అశోకుడు నిర్మించిన ఆ ఆలయం కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ, అదే స్థలంలో పునర్నిర్మాణం జరిపించిందే ఇప్పుడున్న ఆలయం. దీన్ని రెండుసార్లు పునర్నిర్మించారు. 11వ శతాబ్దిలో ఒకసారి, 1882లో రెండోసారి నిర్మించడం జరిగింది. ఎన్ని సార్లు పునర్నిర్మాణం జరిగినా అసలు ఆలయం పద్ధతులలోనే తిరిగి నెలకొల్పారట.
యాభై మీటర్ల ఎత్తున్న పెద్ద గోపురంతో ఉండే ఈ ఆలయం యాత్రీకులను బాగా ఆకర్షిస్తుంది. తూర్పు ద్వారం ద్వారా భక్తులు ఆలయ ప్రవేశం చేస్తుంటారు. బౌద్ధశిల్పకళకు ప్రతీకగా తోరణద్వారాలు ఈ ఆలయంలో ఉంటాయి. ఆలయం లోపల బంగారు మలామా చేయబడిన బుద్ధదేవుని విగ్రహం కూడా ఉంది.
ఈ ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. 635వ సంవత్సరంలో చైనా యాత్రీకుడు హుయాన్‌ త్సాంగ్‌ ఈ ఆలయాన్ని సందర్శించినట్లు ఆయన రాసుకున్న గ్రంథాలవల్ల తెలుస్తోంది. అప్పట్లోనే మహాబోధి ఆలయం బౌద్ధుల్ని విశేషంగా ఆకర్షించింది. భారతదేశం నుంచే కాక చైనా, జపాన్‌, మలేషియా వంటి విదేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చేవారని హుయాన్‌ త్సాంగ్‌ రచనవల్ల తెలుస్తోంది. ఈనాటికీ ఈ బౌద్ధ పుణ్యక్షేత్రం విదేశీ స్వదేశీ భక్తులందర్నీ తన దగ్గరకు రప్పించుకుంటుంది. మహాబోధి ఆలయం సమీపంలోనే రత్నగిర్‌ అనే పేరుగల చిన్న చైత్యం ఉంది. ఈ ప్రదేశంలోనే బుద్ధుడు ఓ వారం రోజుల పాటు ధ్యానంలో గడిపాడంటారు. బుద్ధగయ వెళ్లినవాళ్లు ఈ చైత్యాన్ని కూడా తప్పకుండా దర్శిస్తారు.
బుద్ధగయ చిన్న ఊరే అయినప్పటికీ యాత్రీకులు బస చేయడానికి అనేక మఠాలు, ఆశ్రమాలున్నాయి. టూరిస్టు లాడ్జి, హోటళ్లు ఉన్నాయి.
ధర్మచక్రం
టిబెట్‌వారు నడుపుతున్న ఓ పెద్ద మఠంలో ధర్మచక్రం ఉంది. ఈ చక్రాన్ని మూడుసార్లు తిప్పినవారి పాపాలు పరిహారమౌతాయని స్థానికులు విశ్వసిస్తారు.
జపాన్‌వారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఆశ్రమంలో బ్రహ్మాండమైన బుద్ధవిగ్రహం ఉంది. దీన్ని జపాన్‌ నుంచే తీసుకొచ్చి ప్రతిష్టించినట్లు చెబుతారు. బర్మావారి ఆశ్రమం, థారులాండ్‌ వారి ఆశ్రమాలూ వున్నాయి. అన్నీ కూడా యాత్రీకులకు వసతి సౌకర్యాలు కల్పిస్తాయి. అయితే ఆశ్రమాల్లో ఉండేవారెవరూ అక్కడున్నంత కాలం ధూమపానం చేయకూడదు. మద్యమాంసాలను సేవించరాదు. ఈ నియమాలను పాటించేవారికి మాత్రమే ఇక్కడ వసతి సౌకర్యం లభిస్తుంది. అసలు బుద్ధగయలోని ఆశ్రమాల్లో, మఠాల్లో, హోటళ్లలో లభించేది శాకాహారమే. యాత్రీకులు శాకాహారంతోనే సంతృప్తిపడి పుణ్యస్థలాల సందర్శనం పూర్తి చేసుకోవాలి.
గయ నుంచి బుద్ధగయకు బస్సులు ఉంటాయి. ఇతర ఊళ్ల నుంచి రైలుమార్గం ద్వారా కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. ఊళ్లో వివిధ ప్రదేశాలు సందర్శించడానికి టూరిస్టు కార్లు, టాంగాలు, రిక్షాలు దొరుకుతాయి. గైడ్లు కూడా ఉంటారు.
సీజన్‌
అక్టోబర్‌ నుంచి మార్చి వరకు యాత్రీకుల సీజన్‌ అని చెప్పుకోవచ్చు. ఈ కాలంలోనే ఎక్కువ మంది యాత్రీకులు బుద్ధగయను సందర్శిస్తుంటారు. మే నెలలో యాత్రీకుల రద్దీ పెరుగుతుంది. బుద్ధపూర్ణిమ నాటికి బుద్ధగయ భక్తులతో కిటకిటలాడిపోతుంది. త్రిపిటకములతోఊరు మారుమోగుతుంది.
మే నెల తొమ్మిదో తేదీ బుద్ధుడి జన్మదినం. ఈ రోజు కోసం భక్తులంతా ఆతురతతో ఎదురుచూస్తుంటారు. ఆనాటికి బుద్ధగయ చేరుకోవాలని వారంతా ఆరాటపడుతుంటారు.
_________________________________________________________________

వలస పక్షులు

  • పచ్చని పైరులతో, వింజామరలు వీచే వృక్ష సంపదతో, జలపుష్పాలతో నిండిన చెరువుల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం కలిగిన పదహారణాల పల్లెటూరు తేలినీలాపురం.
ఈ పేరు వెనుక ఓ కథ ప్రచారంలో ఉంది. ఈ గ్రామంలో పూర్వం రెండు కులాల వారు నివశించేవారు. 'తెలుకల మరియు రెడ్డిక' అనే ఈ రెండు కులాలకు ఆ వూళ్లో ఇంచుమించు అన్ని రంగాల్లోనూ సమాన ప్రాతినిధ్యం ఉండేది. ఊరికి ఎవరి కులానికి సంబంధించిన పేరు వారు పెట్టుకోవాలని ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. చివరికి పెద్దల సమక్షంలో సంధి కుదిరింది. అదేంటంటే తెలుకల కులానికి చెందిన పేరులో తొలి రెండక్షరాలు, రెడ్డి కులంలో మెజారిటీ ప్రజల ఇంటిపేరైన 'నీలాపు' అనే పదం వచ్చేట్టుగా ఆ గ్రామానికి తేలి+నీల+పురం కలిపి తేలినీలాపురంగా మార్చారు. తర్వాత కాలంలో రెడ్డి కులస్థులు ఏ కారణం చేతనో ఈ వూరినుండి వలసపొయ్యారు. ఈ గ్రామం చాలా చిన్నది. కేవలం 120 ఇళ్లు, 850 మంది జనాభా కలిగి ఉంది. వేములవాడ, విశ్వనాథపురం, శ్రీరంగం అనే మూడు ఊళ్లు తేలినీలాపురం పంచాయతీలోకి వస్తాయి. తేలినీలాపురం పక్కనే రాజగోపాలపురం ఉంది. ఇక్కడా 40 ఇళ్లకు మించి వుండవు. చూడ్డానికి ఈ రెండూళ్లు ఒక్కటే అనిపిస్తుంది. విచిత్రం ఏమంటే రకరకాల పక్షుల ఆవాసానికి తేలినీలాపురం అనుకూలంగా ఉంటుంది. అయితే వీటిని చూడ్డానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాచ్‌టవర్‌, గెస్ట్‌హౌస్‌లు రాజగోపాలపురంలో ఉన్నాయి. ఈ ఊరి చుట్టూ 8 చెరువులున్నాయి. దగ్గర్లోనే సముద్రం కూడా ఉంది. 15 కిలోమీటర్ల దూరంలో బానవపాడు బీచ్‌ ఉంది. ఈ బీచ్‌కి, తేలినీలాపురం గ్రామానికి మధ్య ఉన్న కాకరాపల్లి, మేఘవరం, తంపర గ్రామాల్లో రకరకాల విదేశీ పక్షులు కనిపిస్తాయి. పక్షులకు కావలసిన ఆహారం కూడా ఈ గ్రామాల్లో ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణం.

ఈ పక్షులు సైబీరియా నుండి వలస వస్తుంటాయి. అక్కడ్నుండి తేలినీలాపురానికి సుమారు 12 వేల కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంత చిన్న పక్షులు ఆహారం, అనుకూల వాతావరణం కోసం ఎంత శ్రమకోర్చి ఇంత దూరం ప్రయాణం చేస్తున్నాయో కదా! మరో విషయం ఏంటంటే ఇవి ఏ కొద్దికాలం నుండో ఇక్కడికి రావడం లేదు. దశాబ్దాల క్రితం నుండే ఈ వలసలు ఉన్నాయి. మన దేశం బ్రిటీష్‌ పాలనలో ఉన్నప్పటి నుండే ఈ పక్షులు వస్తున్నట్లుగా స్థానికులు చెప్తారు. అయితే ఫలానా సంవత్సరం నుండి వస్తున్నాయనడానికి ఖచ్చితమైన ఆధారాలేమీ లేవు. ఒక బ్రిటీష్‌ అధికారి ఈ పక్షులను వేటాడుతుంటే ఈ గ్రామస్తులు అతన్ని ఎదిరించారు కూడా. పక్షులంటే ఎంత ప్రేమో ఈ గ్రామస్థులకి.
ఓ బ్రిటీష్‌ అధికారి రోజూ ఆ గ్రామానికి వచ్చి పక్షుల్ని వేటాడేవాడు. పక్షుల్ని చంపడం ఇష్టంలేని ఊరి ప్రజలందరూ కలిసి ఓ రోజు ఆ అధికారి దగ్గరికి వెళ్లి ''అయ్యా! మా ఊరికి ఈ పక్షులు ఎన్నో ఏళ్లుగా వస్తున్నాయి. మాకు వీటిని ఆదరించడమే తప్ప హానిచేయడం తెలీదు. వీటిని కన్న బిడ్డల్లా పెంచుకుంటున్నాం. మీరిలా చంపడం చూడలేకపోతున్నాం. దయచేసి వీటిని వేటాడకండి'' అని వేడుకున్నారు.
అప్పుడతను ''ఈ పక్షుల్ని మీరు నిజంగా పెంచుకుంటున్నారంటే చెప్పండి. వీటినేమీ చెయ్యను. కొన్ని చేపల్ని ఇస్తాను. వాటిని పక్షులతో తినిపించండి. అవి గానీ తింటే ఇక నేనెప్పుడూ ఈ పక్షుల జోలికి రాను'' అని ఓ చేపల బుట్టని తెప్పించాడు.

గ్రామస్తులు మొదట కొద్దిగా వెనుకంజ వేసినా తర్వాత సరేనన్నారు. ఆ ఊరిపెద్ద చేపల బుట్టని తీసుకెళ్లి ఓ చెట్టుకింద పెట్టి పక్షుల్ని పిలిచాడు. వెంటనే ఆ దగ్గర్లో ఉన్న పక్షులన్నీ వచ్చి చేపల్ని నోట కరుచుకుని వెళ్లాయి. అందరూ చూస్తుండగానే కొన్ని నిమిషాల్లోనే బుట్ట ఖాళీ పోయింది. ఈ దృశ్యం చూసిన అధికారి ఆశ్చర్యపోయాడు. ఊరికిచ్చిన మాట ప్రకారం అతనెప్పుడూ ఆ వూరికి వేటకి రాలేదు.
పక్షులకు, గ్రామానికి మధ్య విడదీయరాని అనుబంధానికి ప్రతీకగా మరో సంఘటన కూడా ఉంది. 1960, ఫిబ్రవరి 20న ఈ వూరిలో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. అందులో చాలా నష్టం జరిగింది. అప్పటికి వూళ్లో రెండు పక్కాఇళ్లు మాత్రమే వున్నాయి. అవి తప్ప ఊరంతా నాశనమైపోయింది. ఊరి జనం కట్టు బట్టలతో మిగిలారు. ఆస్తి నష్టంతో పాటు, చెట్లూ, వాటిమీదున్న పక్షి పిల్లలు, గుడ్లు కూడా మంటల్లో మాడి మసైపోయాయి. అయినా కూడా గ్రామస్తుల్లాగే పక్షులూ ఆ వూరిని విడిచి వెళ్లలేదు. ఇళ్లు కాలిపోయినవాళ్లంతా కొత్త గుడిసెలు వేసుకుంటే, పక్షులు కాలిన చెట్లపైనే కొత్త గూళ్లు కట్టుకున్నాయి.
గత వంద సంవత్సరాల్లో ఒకే ఒక్క సంవత్సరం (1986) మాత్రం పక్షులు రాలేదు. ఈ గ్రామస్తులకు పక్షుల మీద ఓ నమ్మకం కూడా ఉంది. అదేంటంటే... పక్షులు ఆలస్యంగా వస్తే తుఫాన్లు లేదా ప్రకృతి వైపరీత్యాలు లాంటివి వస్తాయని వారి విశ్వాసం. అసలు రాకపోతే ఆ ఏడాది కరువు కాటకాలు తప్పవని అంటారు. అలాగే అవి వచ్చిన రోజు చాలా మంచిరోజని, ఆ రోజు ఏ పని తలపెట్టినా దిగ్విజయంగా జరుగుతుందని వీరి విశ్వాసం. ఈ పక్షులని వెలకట్టలేని సంపదగా స్థానికులు భావిస్తారు.
వలస పక్షుల్లో రెండు జాతులున్నాయి. ఒకటి 'పెయింటెడ్‌ స్టార్క్‌' అనే కొంగ జాతి, రెండోది 'పెలికాన్‌' అనే బాతు జాతి. ఇవి ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ మొదటివారం వస్తాయి. అన్ని పక్షులూ ఒకేసారి రావు. గుంపులు గుంపులుగా పది పదిహేను రోజుల తేడాతో ఈ గ్రామానికి చేరతాయి. సుమారు ఎనిమిది నెలలపాటు ఇక్కడే ఉంటాయి. ఎండుపుల్లలు, పచ్చి పుల్లలు ఏరుకొచ్చి చక్కటి గూడు కట్టుకుంటాయి. ఎంత పెద్ద గాలులు వీచినా ఈ గూళ్లు చెక్కు చెదరవు.
ఈ పక్షులు ముందుగా బంగాళాఖాత తీరంలోని కాకరాపల్లిలో కొద్ది రోజులు ఉండి తర్వాత తేలినీలాపురం చేరతాయి.
స్టార్క్‌ పక్షుల్లో ఆరు రకాలున్నాయి. కానీ ఇక్కడికొచ్చేది మాత్రం పెయింటెడ్‌ స్టార్క్‌ పక్షి ఒక్కటే.
పెయింటెడ్‌ స్టార్క్‌ : దీని జీవితకాలం 20-28 సంవత్సరాలు. వీటిని స్థానికంగా ఎర్రజవడ, ఎర్రజాడపిట్ట, సెంగ్వ, ఎరకల కొంగ, ఎర్రకాళ్ల కొంగ అని పిలుస్తారు. తెల్లటి శరీరంతో మెత్తగా ఉండే ఈ పక్షి తల ఎరుపు రంగులో ఉంటుంది. నారింజరంగు ముక్కు, పొడవాటి కాళ్లుంటాయి. రెక్కలపైన, ఉదరభాగంలో నలుపు, గులాబీ రంగు చారలుంటాయి. తోక గులాబీ రంగులో ఉంటుంది. ఇది రెక్కలు చాచి ఆకాశంలో చేసే విన్యాసాలు చాలా బాగుంటాయి. పంచరంగుల్లో వెలిగిపోయే ఈ పక్షి పిల్లగా ఉన్నప్పుడు మాత్రం రెండు రంగుల్లోనే ఉంటుంది. పెరిగే కొద్దీ కొత్త కొత్త రంగులతో ఆకర్షణీయంగా మారుతుంది.
ఇదే జాతిలో మిగతా వాటి పేర్లు 2. ఓపెన్‌ బిల్ట్‌ స్టార్క్‌, 3.అడ్జెస్టంట్‌ స్టార్క్‌, 4. బ్లాక్‌నెక్‌ స్టార్క్‌, 5. వైట్‌నెక్‌ స్టార్క్‌, 6. వైట్‌ స్టార్క్‌.
పెలికాన్‌ పక్షుల్లో ఏడు రకాలున్నాయి. వాటిలో గ్రే పెలికాన్‌ రకం పక్షులు ఈ వూరికి వస్తాయి.
వీటిని స్థానికంగా చింకు బాతులు, గూడ బాతులు అని పిలుస్తారు. వీటి శరీర నిర్మాణం కూడా బాతులాగే ఉంటుంది. 25 - 30 సంవత్సరాల వరకు జీవిస్తాయి. వీటి శరీరం లావుగా, కుదించినట్లుగా ఉంటుంది. ఈకలు నలుపు, తెలుపు, బూడిద రంగులో ఉంటాయి. ముక్కు పొడవుగా, చివరి భాగం కొక్కెంలా వుంటుంది. నోటి కిందిభాగంలో సంచిలాంటి నిర్మాణముంటుంది.
వీటిలో మిగతావి వైట్‌ పెలికాన్‌, బ్రౌన్‌ పెలికాన్‌, పింక్‌ పెలికాన్‌, రోజ్‌ పెలికాన్‌, ధలామస ఆన్‌ పెలికాన్‌, ఆస్ట్రియల్‌ పెలికాన్‌లు.
ఈ రెండు జాతుల్లో ఆడ, మగ పక్షులను గుర్తించడం కష్టం. పిల్లల పెంపకంలో తల్లి, తండ్రి పక్షులు రెండూ ప్రధాన పాత్ర వహిస్తాయి.
_____________________________________________________________-

తలకోన తలపులు

  • చుట్టూ ఎత్తైన కొండలు... దట్టమైన అరణ్యప్రాంతం... మధ్యలో ఓ జలపాతం ఉంటే ఎంత బాగుంటుందో కదా. అంత అందమైన ప్రకృతి ఎక్కడుందా అనుకుంటున్నారా? మరెక్కడో కాదు... చిత్తూరు జిల్లాలో. ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న తిరుపతికి 45 కిలోమీటర్ల దూరంలోనే ఈ రమణీయ ప్రదేశం ఉంది. అదే తలకోన జలపాతం. ఈ ప్రాంతం నిత్యం పర్యాటకులతో కళకళలాడుతుంటుంది.
నల్లమల పర్వతశ్రేణుల్లో ఈ జలపాతం ఉండడం విశేషం. చుట్టూ దట్టమైన అడవి, ఎత్తైన కొండలు... మధ్యలో జలపాతాన్ని చూసిన పర్యాటకులకు చిత్రమైన అనుభూతి కల్గుతుంది. దాదాపు అరవై మీటర్ల ఎత్తునుంచి జాలువారే జలపాతం కింద నిలబడితే శరీరమంతా చిత్రమైన జలదరింపుకు లోనవుతుంది. ఇక అక్కడినుండి కదలాలని ఎవరికైనా అనిపిస్తుందా చెప్పండి? తలకోన జలపాతం ఉన్న ప్రాంతంలోనే ఓ శివాలయం ఉంది. ఇక్కడి శివుడు సిద్ధేశ్వరుని రూపాన కొలువై ఉన్నాడు. శివుడితో పాటు అమ్మవారు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు కూడా వున్నాయి. పర్యాటకులు తీసుకెళ్లే వాహనాలను ఈ దేవాలయ ప్రాంతం వరకు మాత్రమే అనుమతిస్తారు. అక్కడ్నుండి జలపాతం దగ్గరికి చేరుకోవాలంటే పాదయాత్ర చేయాల్సిందే. కొండ అంచుల్లో దట్టమైన అడవిగుండా దాదాపు రెండు కిలోమీటర్లు ముందుకు వెళ్తే అక్కడ జాలువారే జలపాతాన్ని చూడొచ్చు. రెండు కొండల మధ్య జాలువారే జలపాత దృశ్యం అద్భుతంగా ఉంటుంది. జలపాతానికి కొంత ఎత్తువరకు ఆక్రమించిన బండరాళ్లపై నిలబడితే జలపాతం కింద తడవడానికి వీలవుతుంది. అలాగే జలపాతం కింద పడడం వల్ల ఆ ప్రాంతంలో ఓ పెద్ద గుంటలా ఏర్పడింది. అక్కడ పర్యాటకులు హాయిగా ఈత కొడుతుంటారు.
తలకోనలో వసతి సౌకర్యాలు
జలపాతానికి దగ్గర్లోని ఆలయ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకశాఖ నిర్మించిన ఓ అతిథి గృహం ఉంది. ఇది తప్ప చెప్పుకోదగ్గ సౌకర్యాలు లేవు. ఆలయానికి ముందు భాగంలో పూజాసామగ్రి విక్రయించే చిన్న దుకాణాలు రెండో మూడో ఉంటాయి. అలాగే ఆలయానికి పక్కగా ఓ చిన్న హోటల్‌ అందుబాటులో ఉంటుంది. తలకోనకు వెళ్లే పర్యాటకులు తినే పదార్థాలను వెంట తీసుకెళ్లాలి. ఏమీ తీసుకెళ్లనివారు ఆలయం దగ్గరున్న హోటల్లో ముందుగా చెపితే భోజనం ఏర్పాటు చేస్తారు. తలకోనలోని జలపాతాన్ని సందర్శించే పర్యాటకులు సాయంత్రం వరకు జలపాతం వద్ద గడిపి పొద్దుపోయే సమయానికి గుడిదగ్గరికి చేరుకుంటారు. ఏ కొద్దిమందో తప్ప అందరూ సాయంత్రానికి దగ్గర్లోని గ్రామాలకో లేదా సొంత ప్రదేశానికో తిరుగు ప్రయాణమౌతారు. మరో ప్రత్యేకత ఏమంటే ఇక్కడ సినిమా షూటింగులు నిరంతరం జరుగుతూనే వుంటాయి.
రవాణా సౌకర్యం
తిరుపతి నుండి యెర్రావారి పాలెం చేరుకుని అక్కడ్నుండి పైవేటు వాహనాల ద్వారా తలకోన ఆలయం వద్దకు చేరుకోవచ్చు. యెర్రావారిపాలెం వరకు ఎప్పుడూ బస్సు సౌకర్యం ఉంటుంది. అక్కడినుండి తలకోనకు చేరడానికి వ్యాన్‌, ఆటోలు సిద్ధంగా ఉంటాయి. 
_____________________________________________________________

చరిత్ర సాక్ష్యం... చంద్రగిరి కోట
Chandragiriవిజయ నగర రాజుల చరిత్రలో చంద్రగిరి ఓ ప్రముఖ స్థానం వహించింది. కృష్ణదేవరాయల విడిదికేంద్రంగా అలరారిని ఈ కోట... ఇప్పటికీ పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందిస్తూ... చరిత్ర సాక్ష్యంగా నిలుస్తోంది. కృష్ణదేవరాయలు తిరుమల దర్శించినప్పుడు ఇక్కడే విడిదిచేసేవారు.

శత్రుదుర్భేద్యం... రక్షణ వలయం...
శ్రీకృష్ణదేవరాయలు మహా మంత్రి తిమ్మరుసు జన్మస్థలం చంద్ర గిరి. అర్ధచంద్రాకారంగా ఉన్న కొండ పాదభాగంలో కోటను నిర్మించడం వలన దీనిని చంద్రగిరి దుర్గం అని పిలిచేవారు. ఇలా నిర్మించడం వలన కోట రక్షణ కొండ ప్రాంతమువైపుగా తగ్గగల దనీ కొండ పైనుండి శత్రువుల కదలికలను దూరంనుండి గమ నించుట సులభం కనుక కొండ ప్రక్కగా నిర్మించారనీ మ్యూజి యంలో సమాచారం ద్వారా తెలుస్తున్నది. కోట చుట్టూ దాదాపు కిలోమీటరు దృఢమైన గోడకలదు.

ఈ గోడ నిర్మించేందుకు విని యోగించిన రాళ్ళ పరిమాణం చాలా పెద్దది. దీనిని ఏనుగుల సహాయంతో నిర్మించారని తెలుస్తుంది. ఈ గోడ పొదల తుప్పల మద్య ఇప్పటికీ చెక్కు చెదరక ఉన్నది. ఈ గోడననుసరిస్తూ బయ టి వైపుగా పెద్ద కందకం ఉన్నది. ఈ కందకంలో ఆనా డు మొసళ్ళను పెంచేవారట.
చంద్రగిరి నుండి పాలించిన చిట్టచివ రి విజయనగర రాజు పెద వేంకట రా యలు, తన సామంతుడు దామెర్ల చె న్నప్ప నాయకుడు ఆగస్టు 22, 1639 లో బ్రిటీషు ఈస్ట్‌ ఇండియా కంపెనీకి చందిన ఫ్రాన్సిస్‌ డే కి చెన్నపట్నంలో కోటను కట్టుకోవడానికి అనుమతి చ్చింది ఈ కోట నుండే. ఇప్పటికీ ఆనా టి దస్తావేజులను మ్యూజియంలో చూడవచ్చు.

Chandragiri1కొండ పైభాగంలో ఒక సైనిక స్థావరం నిర్మించారు. వారి అవసరాల నిమిత్తం పై భాగంలో రెండు చెరువులను నిర్మించి క్రింది నున్న పెద్ద చెరు వు నుండి పైకి నీటిని పంపించేవారని కోటలో మ్యూజియంలోని సమాచారం ద్వారా తెలుస్తున్నది (ఇప్పటికీ కొండపైకి నీటిని పం పించుట అనేది పెద్ద మిస్టరీ). అప్పుడు పైకి పంపించేందుకు ఉప యోగించిన సాధనాలు పాడయిపోయినాయి. అయితే పైన చెరు వులు, క్రింద చెరువు ఇప్పటికీ మంచి నీటితో కనిపిస్తాయి.

చూడాల్సినవివే...
రాణీ మహల్‌ రెండు అంతస్తులుగానూ రాజ మహల్‌ మూడు అంతస్తులుగానూ ఉంది. రాణీ మహల్‌ చాలా వరకు పాడయిపోయినది. రాణీ మహల్‌ పేరుకే రాణీ మహల్‌ అని ఇప్పుడు పిలుస్తున్నారు కానీ దీని వాస్తు నుబట్టి ఇది ఒక గుర్రపుశాల కావచ్చని అక్కడి బోర్డు లో వ్రాసి ఉంది. పురావస్తు శాఖ అధీనములోకొచ్చిన తరువాత కొంత వరకూ బాగు చేశారు. రాణీమహల్‌ వెనుక కొంచెం దూరంగా కోట నీటి అవసరాలకోసం ఒక దిగుడు బావికలదు. దీనినుండే అంతపుర అవస రాలకు నీటిని సరఫరా చేసే వారని తెలియ చేయబడినది. ఈ బావికి కొద్ది దూరంలో మరణశిక్ష పడ్డ ఖైదీలను ఉరి తీసేందుకు ఆరు స్థంభాలు కలిగి ఉపరితలానికి నాలుగు రింగులు ఉన్న చిన్న మండపం ఉన్నాయి. రాజమహల్‌లో మొదటి అంతస్తును మ్యూ జియంగా మార్చారు. ముస్లిం పాలకులు నాశనం చేయగా మిగి లిన శిల్పాలు, చంద్రగిరి వైభవాన్ని తెలిపే శాసనాలు లాంటివి ఇందులో ఉన్నాయి. రెండవ అంతస్తులో సింహాసనాలతో కూడిన అప్పటి దర్బారు లేదా సభా దృశ్యాన్ని చూడచ్చు.

మూడవ అంతస్తులో అప్పటి కోట నమూనా, ప్రజల జీవనవిధా నం లాంటివి ప్రదర్శన కొరకు ఉంచారు. ఇదే అంతస్తులో రాజప మ్రుఖుల గదులు కలవు. చాలావరకు పాడైన దేవాలయాలు వది లేసి కొంత బాగున్న రాణీమహల్‌, రాజమహల్‌, వీటివెనుక ఉన్న చెరువు మొదలయిన వాటిని బాగుచేసి కొంత వరకూ తోట వేసి అన్ని చోట్లా మొక్కలు పెంచి సందర్శకులకు ఆహ్లాదంగా ఉండేలా మార్చారు. రాజమహల్‌కు వెనుక ఖాళీ ప్రదేశంలో పెద్ద ఓపెన్‌ ధియేటర్‌ మాదిరిగా మార్చి, దృశ్య కాంతి శబ్ధ (సౌండ్‌, లైటింగ్‌ షో) ప్రదర్శిస్తారు.
___________________________________________________________________

వేసవిలో చల్లని ప్రదేశాలు

పర్యాటకులు 'ప్రిన్స్‌ ఆఫ్‌ హిల్‌ స్టేషన్‌' అని ముద్దుగా పిలుచుకునే ప్రాంతం కొడైకెనాల్‌. ఇది చెన్నై నగరానికి 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. పళని కొండల శ్రేణిలో సముద్రమట్టం నుండి 2,130 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రదేశంలో ఉన్న లోయలు, పర్వతాలు, పూలతోటలు, జలపాతాలు, సరస్సులు పర్యాటకులకు కనువిందు చేస్తాయి.
వేసవిలో గరిష్టంగా 20 డిగ్రీల సెల్సియస్‌, కనిష్టంగా 11 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు ఉండే కొడైకెనాల్‌లో చూడాలంటే చాలా ప్రదేశాలున్నాయి. వాటిలో కొడై సరస్సు, కోకర్స్‌ వాక్‌, సెయింట్‌ మేరీ చర్చ్‌, పంపార్‌ జలపాతం, గ్రీన్‌ వ్యాలీ వ్యూ, గుణ గుహ, ఫైన్‌ వృక్షారణ్యం, శాంతిలోయ, కురుంజి ఆండవర్‌ ఆలయం... తదితర ప్రదేశాలు ముఖ్యంగా చూడదగినవి.
'కొడై సరస్సు' కొడైకెనాల్‌ పట్టణం సెంటర్‌కు దగ్గర్లో ఉంటుంది. ఇది సహజసిద్ధంగా ఏర్పడింది కాదు. 1863లో దీన్ని నిర్మించారు. 60 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఈ సరస్సు ఓ వైపు వెడల్పుగా, మరో వైపు సన్నటి పాయలుగా ఉంటుంది. ఇందులో బోటు షికారు చేసేందుకు పర్యాటకులు చాలా ఆసక్తి చూపిస్తుంటారు.
కొండ అంచున సన్నగా పొడుగ్గా వుండే కాలిబాట వెంట నడుచుకుంటూ వెళ్తే చుట్టూ కనిపించే ప్రకృతి దృశ్యమే 'కొడై సరస్సు కోకర్స్‌ వాక్‌' ప్రదేశం. దీని తర్వాత చూడాల్సిన ప్రదేశం 'సెయింట్‌ మేరీ చర్చి'. దీన్ని సుమారు 150 సంవత్సరాల క్రితం నిర్మించారు. దీని మీదున్న నగిషీపని చూపరులను కట్టిపడేస్తుంది.
పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే మరో ప్రదేశం కొడైకెనాల్‌ పట్టణానికి చివర్లో ఉన్న 'పంపార్‌ జలపాతం'. ఇది ఎత్తుపల్లాలతో ఉండే రాతి నేలమీద ప్రవహించే సన్నటి వాగు.
తర్వాత చెప్పుకోదగ్గ ప్రదేశం 'గ్రీన్‌ వ్యాలీ వ్యూ'. దీన్ని కొండ అంచున నిలబడి చూసేందుకు వీలుగా నిర్మించారు. ఇక్కడినుంచి చూస్తే విశాలమైన లోయ, పచ్చని చెట్లతో కూడిన పర్వతాలు ప్రకృతి ప్రేమికులను పరవశింపజేస్తాయి.
చూడాల్సిన ప్రదేశాల్లో మరోటి 'గుణ గుహ'. దీన్ని చూడాలంటే రోడ్డు అంచున ఉన్న ఓ బాట వెంబడి సుమారు 200 గజాలు నడవాలి. అక్కడ్నుండి గుబురుగా ఉండే చెట్ల మధ్యలోంచి కిందికి దిగుతూ వెళ్తే ఓ చిన్న కొండ అడుగుభాగంలో ఈ గుహ దర్శనమిస్తుంది. అయితే దీనిని దగ్గరగా వెళ్లి చూడడం మాత్రం వీలుపడదు. ఎందుకంటే అక్కడికి వెళ్లే వీలు లేకుండా చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. దీన్నే 'దెయ్యాల గుహ' అని కూడా స్థానికులు పిలుస్తుంటారు.
నీలగిరి కా రాణి
తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి పర్వతాలపై ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం 'ఊటీ'. దీన్నే ఉదకమండలం, క్వీన్‌ ఆఫ్‌ హిల్‌ స్టేషన్‌ అని కూడా పిలుస్తారు. సముద్ర మట్టానికి 2,240 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశం ఎప్పుడూ చల్లగా ఉంటుంది. అందుకే వేసవి విడిదిగా ప్రసిద్ధి గాంచింది. ఇక్కడికి దేశ విదేశాల నుంచి పర్యాటకులు రెక్కలు గట్టుకుని వాలిపోతుంటారు.
ఊటీ చరిత్ర
పూర్వం నీలగిరి పర్వతాలు చేర సామ్రాజ్యంలో భాగంగా ఉండేవి. తర్వాత గంగరాజులు, 12వ శతాబ్దంలో హొయసాలుల వంశరాజైన విష్ణువర్థనుడి సామ్రాజ్యంలో భాగమయ్యాయి. చివరిగా టిప్పుసుల్తాన్‌ అధీనంలోకి, ఆ తర్వాత 18వ శతాబ్దంలో తెల్లవారి సామ్రాజ్యంలో భాగంగా ఉన్నాయి.
ఆంగ్లేయుల కాలంలోనే కోయంబత్తూర్‌ ప్రావిన్స్‌ గవర్నర్‌గా పనిచేసిన జాన్‌ సుల్లివాన్‌ నీలగిరి పర్వత శ్రేణుల్లోని ఊటీ వాతావరణానికి, అక్కడి ప్రకృతి సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు. వెంటనే అక్కడ నివసిస్తున్న కోయజాతి ప్రజలకు అతి తక్కువ పైకం ముట్టజెప్పి ఆ ప్రాంతాన్ని కొనేశాడు. అలా ఊటీ ప్రాంతంలోని స్థలాలన్నీ చిన్నగా ఆంగ్లేయులపరం అయ్యాయి. వారే ఆ ప్రాంతాల్ని అభివృద్ధి చేశారు.
ఆ తర్వాత మద్రాసుకి ఊటీ వేసవి రాజధానిగా మారింది. మద్రాసు సంస్థానం సహకారంతో ఊటీలో ప్రముఖ ఆంగ్లేయులు కొండల మధ్య మెలికలు తిరిగే రహదారులు, సంక్లిష్టమైన రైలు మార్గాన్ని నిర్మించారు. ఎటు చూసినా కనిపించే పచ్చదనం, ముచ్చటగొలిపే లోయల సౌందర్యానికి ముగ్ధులైన ఆంగ్లేయులు దీన్ని 'క్వీన్‌ ఆఫ్‌ హిల్స్‌' అని పిలిచేవారు.
ఊటీలో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. వాటిలో బొటానికల్‌ గార్డెన్‌, లేక్‌, గవర్నమెంటు మ్యూజియం, దొడ్డబెట్ట శిఖరం, ఊటీ బోట్‌హౌస్‌, కాఫీ తోటలు, మురుగన్‌ కోయిల్‌, వెంకటేశ్వరస్వామి, మరియమ్మ, సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలు ముఖ్యమైనవి. ఇక్కడ మే నెలలో జరిగే ఫ్లవర్‌ షో, ఫ్రూట్‌ షో పర్యాటకులను కట్టిపడేస్తాయి.
ఊటీ పరిసర ప్రాంతాల్లో కెట్టివాలి వ్యూ, పైకరా, అప్పర్‌ భవాని, అవలంచి, జయలలిత వైల్డ్‌ లైఫ్‌ శాంక్చురీ, దొడ్డబెట్ట, కల్హట్టి ఫాల్స్‌, వెన్‌బాక్‌ డాన్స్‌, వెక్‌ హిల్స్‌, స్నో డెక్‌ పీక్‌, కూనూరు, డాల్ఫిన్స్‌ నోన్‌, లాంబ్స్‌ రాక్‌, లాన్‌ ఫాల్స్‌, సెయింట్‌ కేథరిన్‌ ఫాల్స్‌, సిమ్స్‌ పార్క్‌, కోటగిరి, కొడనాడ్‌ పాయింట్‌ కూడా చూడాల్సిన ప్రదేశాలే.
సమ్మర్‌ క్యాపిటల్‌
పచ్చటి ప్రకృతి పరుచుకున్న దారులు, అందమైన కొండలు, ఘాట్‌ రోడ్లలో పర్వతాలపై దూసుకెళ్లే సొరంగమార్గాలు, పొడవాటి వంతెనలు... ఇలా ఒకటేమిటి 'సిమ్లా'లో కనిపించే ప్రతి దృశ్యమూ చూపరులను కట్టిపడేస్తుంది. దీన్నే సమ్మర్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియా అని కూడా అంటారు. బ్రిటీష్‌ వారు 1819లో సిమ్లాని కనుగొన్నారు.
సిమ్లా పట్టణం ఓ కొండ వాలులో విస్తరించి ఉంది. అర్థచంద్రాకారపు పర్వత సానువుల పైభాగంలో ఉండే ఈ పట్టణంలో ఎటుచూసినా ఫైన్‌, దేవదారు చెట్లు ఒకదాన్ని మించి మరొకటి ఆకాశాన్నంటాలన్న తాపత్రయంతో పెరుగుతున్నట్లుంటాయి. అయితే శీతాకాలంలో మాత్రం ఈ చెట్లను మంచు కప్పేసి, ముగ్గుబుట్ట తలపై కుమ్మరించుకున్నట్లు కనిపిస్తాయి.
మంచును రాశి పోసినట్లుగా ఉండే పర్వతాలు, వాటిమీద పడి మెరిసిపోయే సూర్యకిరణాలను ఇష్టపడని వారుండరు. ప్రకృతి సౌందర్యం సిమ్లాకు సొంతం. ఎటుచూసినా హిమాలయ పర్వత శ్రేణులు, లోయలు, కనిపిస్తాయి.
సిమ్లానే కాదు, అక్కడికి వెళ్లేదారి కూడా అందమైన ప్రకృతి దృశ్యాలతో ఆహ్లాదాన్ని పంచుతుంది. ఎటుచూసినా అందమే... ఆనందమే... అన్నట్లుంటుంది. ముఖ్యంగా సిమ్లా అనగానే గుర్తొచ్చేది ఆపిల్‌ తోటలు. ఎర్రగా నిగనిగలాడుతూ నోరూరించే ఆపిల్‌పండ్లు చెట్లకి గుత్తులు గుత్తులుగా వేలాడుతూ దారి పొడవునా తోరణాల్లా స్వాగతం పలుకుతాయి.
సిమ్లానుంచి కుఫ్రి వెళ్లే దారంతా ఒకవైపు ఆకాశాన్నంటే పర్వతాలు, మరోవైపు, లోతెంతో అంతుబట్టని అగాధాలుంటాయి. ఈ పర్వత శ్రేణులన్నీ మంచు దుప్పటి కప్పుకున్నట్లు, లోయలన్నీ రంగురంగుల సీతాకోకచిలుకల్లా ఉంటాయి.
సిమ్లాలో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శ్యామలాదేవి ఆలయం. ఎందుకంటే ఈ ఆలయంలోని దేవత పేరు వల్లే ఈ నగరానికి సిమ్లా అనే పేరు వచ్చిందని స్థానికులు చెప్తారు. దీన్నే కాలిబరి ఆలయం అని కూడా పిలుస్తారు.
అప్పట్లో బ్రిటీష్‌వారు సిమ్లాను వేసవి విడిదిగా ఉపయోగించుకున్నారు. దేశ విభజన సమయంలో కాశ్మీర్‌కు సంబంధించిన చర్చలు ఇక్కడి వైశ్రారు భవనంలోనే జరిగాయి. అందుకే సిమ్లాకు వచ్చినవారు తప్పకుండా వైశ్రారు భవనాన్ని దర్శిస్తుంటారు. ప్రస్తుతం ఈ భవనంలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌ స్టడీస్‌ ఏర్పాటు చేశారు.
వెండి కొండల్లో అడ్వెంచర్‌
స్నో స్కీయింగ్‌ చేయాలనుకునేవారికి ఇది అనువైన ప్రదేశం. సిమ్లాలో ప్రతి ఏడాదీ ఫిబ్రవరిలో స్పోర్ట్స్‌ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి.
సిమ్లా వెళ్లినవారు మొట్టమొదట దర్శించే ప్రదేశం మాల్‌రోడ్డు. మాల్‌ సెంటర్‌ ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. షాపింగ్‌ చేసినా, చేయకపోయినా తిరిగి చూడ్డానికి బావుంటుంది. గుర్రమెక్కి మాల్‌ అంతా చుట్టి, ఫొటో తీసుకుంటే ఆ మధురానుభూతే వేరు. సిమ్లాలో, దాని చుట్టుపక్కల ప్రాంతాలలో ఆపిల్‌ తోటలు ఎక్కువగా ఉంటాయి. పర్యాటకులు ఈ పండ్లను కోసుకుంటున్నా స్థానికులు ఏమీ అనరు. అయితే పండు కాకుండా పచ్చికాయను మాత్రం కోయనివ్వరు.
ఇంకా... హిమాలయ పర్వతాలు అత్యద్భుతంగా కనిపించే స్కాండల్‌ పాయింట్‌, చర్చి లైబ్రరీ, లక్కడ్‌ బజార్‌ తదితర ప్రాంతాలను కూడా తప్పకుండా సందర్శించాల్సిందే. లక్కడ్‌ బజార్‌లో చెక్కతో చేసిన కళాకృతులు పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి.
సిమ్లాలోని జాకూ ఆలయం ఉన్న శిఖరం ప్రత్యేకంగా చూడాల్సిన ప్రదేశం. ఇక్కడి నుంచి చూస్తే సిమ్లా అంతా కనిపిస్తుంది. ఇక్కడున్న హనుమాన్‌ ఆలయానికి చేరుకోవాలంటే కాస్త ఓపికతో నడిచి వెళ్లాల్సిందే. నడవలేని వారి కోసం గుర్రాలు, టాక్సీలు అందుబాటులో ఉంటాయి.
స్టేట్‌ మ్యూజియంలో హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన పురాతన, చారిత్రక ప్రాధాన్యం ఉన్న శిల్పాలు, పెయింటింగ్స్‌ ఉన్నాయి. భారతీయ సంస్కృతిని కళ్లకు కట్టినట్లు చూపించే ఈ మ్యూజియంలోకి వెళ్తే సమయం ఎలా గడిచిపోయిందో కూడా తెలీదు.
హాట్‌ వాటర్‌ స్ప్రింగ్‌
ఈ వేడినీటి గుండంలోని నీరు తప్ప దాని చుట్టుపక్కల పరిసరాలన్నీ రక్తం గడ్డకట్టించేంతగా చల్లగా ఉంటాయి. అయితే ఈ వేడినీటి గుండంలోని నీరు మాత్రం మరుగుతూ ఉంటాయి. నీటిలో సల్ఫర్‌ ఉన్న కారణంగా రసాయనిక చర్య జరిగి నీరు వేడిగా ఉంటుందట. 
________________________________________________________________

No comments:

Post a Comment