Wednesday 25 June 2014

చీకటిలో వెంటనే వస్తువులు కనిపించవు ఎందుకు?
         పగటి పూట సినిమా హల్లో లైట్లు ఆర్పి వేసిన తర్వాత లోనికి వెళ్లిన వారికి వెంటనే లోపలి మనుషులు గానీ, సీట్లు గానీ స్పష్టంగా కనిపిం చక పోవడం గమనించవచ్చు. కొంచెం సేపటి తర్వాత చూపు స్పష్టం అవుతుంది. బయటి కాంతిని బట్టి మనం కంటిలోని కనుపాప తన ఆకారాన్ని సరి చేసుకుంటుంది. కాంతి తక్కువగా వున్నప్పుడు కనుపాప పెద్దది అవుతుంది. దీనివల్ల కంటిలోకి ఎక్కువ కాంతి ప్రసరిస్తుంది.
          ఎండలో వున్నప్పుడు కనుపాప సంకోచిస్తుంది. అందువల్ల ఎక్కువ వెలుతురులో నుంచి తక్కువ వెలుతురులోకి వెళ్లినప్పుడు కనుపాప ఆ కాంతికి అనుగుణంగా మారడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి చీకటిలోకి వెళ్లిన వెంటనే వస్తువులు స్పష్టంగా కనిపిం చవు. దీంతో పాటూ ఇంకొంచెం లోతుగా ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే కంటిలో రెటీనాలోని ''రొడాప్సిన్‌'' అనే పదార్థం ఎక్కువ వెలుతురులో ఎక్కువ శాతంగా, చీకటిలో తక్కువ శాతంగా వుంటుంది. రోడాప్సిన్‌ వల్లనే వస్తువును చూసే సంకేతాలు మెదడుకు వెళతాయి.
వాస్తులో వాస్తవం లేదు
      ఈ మధ్య వాస్తును చాలామంది పాటిస్తున్నారు. వాస్తు శాస్త్రము నిజానికి ఓ విజ్ఞానశాస్త్ర భాగమా?
- ఎల్‌. శ్వేత, మందమర్రి, ఆదిలాబాద్‌
        వాస్తులో వాస్తవమేమీ లేదనీ, సందర్భానుసారంగా, అవకాశానుగు ణంగా దానిని వాడుకుంటున్నారనీ, దానికి ఏమాత్రం శాస్త్రీయ ప్రతిపత్తి లేదనీ ఇదే పత్రికలో పలు వ్యాసాల ద్వారా నా మిత్రుడు కె.ఎల్‌. కాంతారావుగారు వివరించి ఉన్నారు.
             ఈ దేశంలో మరే దేశంలోనూ లేనన్ని మూఢనమ్మకాలున్నాయి. మత ఛాందసత్వం, మతతత్వ రాజకీయాలు ఈ మూఢనమ్మకాలకు కావలసినంత సంపోషణనిస్తున్నాయి. ప్రజలు ఎదుర్కొంటున్న అనేక ఆర్థిక, సాంస్కృతిక సమస్యలకు పరిష్కారాలను చూపడంలో కావాలనే నిష్క్రియాపరత్వాన్ని ప్రదర్శిస్తున్న పాలక వర్గాలు ప్రజలను తప్పుదారి పట్టించడానికి, వారిని నిరంతరం ఊహల ప్రపంచంలో ఉంచడానికి, వారి సమస్యల పరిష్కారం వాస్తవ జగత్తులోను, పోరాట స్థలాల్లోను కాకుండా మిథ్యా పేటికల్లో చూపడానికి ఓ పథకం ప్రకారం పనిచేస్తున్నాయి. విజ్ఞానశాస్త్ర బీజాలు మనసులో పడకముందే మూఢనమ్మకాల వటవృక్షపు వేళ్లను నరనరాన విస్తరించే మూర్ఖపు వ్యవస్థల్ని ఉసిగొల్పుతున్నాయి. అందువల్లే విజ్ఞానశాస్త్రం, చదువుసంధ్యలు అందించే శాస్త్రీయత స్థానంలో మూఢనమ్మకాల పర్వతాలు పేరుకుపోయాయి. ఇక చదువరులు, అధికారులు, పాలకులు, సాధారణ ప్రజలు శాస్త్రీయ దృక్పథం ప్రాధాన్యాన్ని ఎలా గుర్తించగలరు?
వాస్తును ప్రచారం చేసేవారు విజ్ఞానశాస్త్రపు వాదనల సమయంలో గాలి, వెలుతురు, దుమ్ము, ధూళి, భవనపు సౌష్టవత, కట్టడపు బలం వగైరా అంశాలను నొక్కి చెప్పడానికే వాస్తు నిపుణులైన మహర్షులు వాస్తును రూపొందించారు కానీ, అందులో అశాస్త్రీయత ఏమీ లేదని వాదిస్తారు. మరో మాటలో చెప్పాలంటే ఆధునిక సివిల్‌ ఇంజనీరింగ్‌ లేదా ఆర్కిటెక్చర్‌కు మౌలిక లేదా వ్యావహారిక వైజ్ఞానిక రూపమే వాస్తు శాస్త్రం అన్న పిక్చర్‌ ఇస్తారు. వాస్తు కూడా సివిల్‌ ఇంజనీరింగే అయినట్లయితే వాస్తు పండితుల దగ్గరికి వెళ్లకుండా ఓ నమ్మదగిన సివిల్‌ ఇంజినీరును సంప్రదించాలి.
          వాస్తు చుట్టూ వైజ్ఞానిక విషయాలు దాదాపు శూన్యం. ఇంట్లో జ్వరం వచ్చినా, అల్లుడికి అమెరికాలో ఉద్యోగం ఊడినా, ఫలాని కళాశాలలో కొడుకుకి మార్కులు తక్కువ వచ్చినా, కూతురు పెళ్లి కావడానికి ఆలస్యం అవుతున్నా, భార్యాభర్తల మధ్య రోజూ వాగ్వివాదాలు, ఘర్షణలు ఉంటున్నా, పదవి ఊడిపోతుందేమోనన్న భయం ఉన్నా, పాలనా దక్షత లేక తన పరిపాలనలో ఎపుడూ సమస్యలు వస్తున్నా ఆ సమస్యల్ని సహేతుకంగా, వాస్తవ ప్రపంచంలో సామాజిక కోణాల్లోంచి చూడకుండా ఇంటిగోడల మూలల్లోను, తలుపు సందుల్లోను, కిటికీ ఊచల్లోను, తలుపుల సంఖ్యలోను, పెరటి చెట్లలోను, తోటల్లోను, ఇంటిపైనున్న బరువులలోను పరిష్కారాలను వెదికే కుహనా శాస్త్రమే వాస్తు.
       భౌతికవాదుల ప్రకారం భూమికి ఉన్న అయస్కాంత దిశ తప్ప మరే విషయంలోను ఓ నిర్దిష్ట ప్రాంతీయ దిశలను బట్టి తేడాలు ఉండవు. మా ఇంటికి తూర్పున చెట్టు ఉంటే అది పక్కింటి వాళ్లకు పడమర ఉన్నట్లు అర్థం. మా ఇంట్లో బోరుబావి ఈశాన్యంలో ఉంటే అదే బోరు బావి నుంచి అడపా దడపా నీళ్లు పొందుతున్న పక్కింటి వాళ్లకు ఆగేయంలో ఉన్నట్టు అర్థం.

Curtsey with : PRAJA SEKTHI 

Monday 9 June 2014

రోగిని వెటిలేట‌ర్ మీద ఎప్పు‌డుపెడుతారు?


   రోగిని వెంటి లేటర్‌ మీద ఎందుకు పెడతారు, అలా పెడితే బతికే అవకాశం ఉంటుందా? అన్న సందేహాలను పలువురు వ్యక్తం చేస్తుంటారు. అయితే అది రోగి ఆరోగ్య పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది తప్ప వెంటిలేటర్‌ మీద పెట్టినంత మాత్రాన కచ్చితంగా బతుకుతారనో, అసలు బతికే అవకాశం లేదనో గుడ్డిగా చెప్పలేం. రోగి కండిషన్‌ సీరియస్‌గా ఉండి, బతికే అవకాశాలు తక్కువున్నప్పుడు చివరి ప్రత్యామ్నాయంగా వెంటిలేటర్‌ పెడతారు. అది కూడా రోగి కుటుంబ సభ్యులకు తెలిపి, వారి అనుమతితో పెడతారు. దీనివల్ల చివరి వరకూ ప్రయత్నం చేశామన్న సంతృప్తి రోగి తరపు వారికి కలుగుతుంది. అలాగని ప్రతి కేసులోనూ ఇలాగే చేస్తారని అనుకోవద్దు.
రక్తంలో ఆక్సిజన్‌ తగ్గినప్పుడు
సాధారణంగా రక్తంలో ఆక్సిజన్‌ తక్కువ ఉన్నప్పుడు, బొగ్గు పులుసు వాయువు ఎక్కువ ఉన్నప్పుడు, రోగి ఆయాసపడుతున్నప్పుడు వెంటిలేటర్‌ పెట్టాల్సి వస్తుంది. రోగి అపస్మారక స్థితిలో ఉండి, ఊపిరి తీసుకోలేకపోతున్నప్పుడు, ఊపిరి తీసుకోవడానికి అవసరమయ్యే కండరాలు పనిచేయనప్పుడు వెంటిలేటర్‌ పెడతారు. ఊపిరి తిత్తులకు న్యుమోనియా, సిఒపిడి , ఉబ్బసం తీవ్రంగా సోకినప్పుడు, పక్షవాతం వచ్చినప్పుడు అవసరాన్నిబట్టి వెంటిలేటర్‌ పెట్టాల్సి వస్తుంది.
పెట్టే విధానం
వెంటిలేటర్‌పై పెట్టాలంటే, ముందు శ్వాసనాళంలోకి గొట్టం వేస్తారు. దానిని వెంటిలేటర్‌ ట్యూబులతో కలుపుతారు. ఈ ప్రక్రియలో శరీరం సహజ సిద్ధమైన రక్షణ విధానాన్ని అతిక్రమిస్తుంది. ఇంకా నష్టం జరగకుండా, ఇన్ఫెక్షన్స్‌ రాకుండా, నిష్ణాతులైన ఐసియు డాక్టర్లు, నర్సులు, రెస్పిరేటరీ థెరపిస్టులు 24 గంటలూ జాగ్రత్తగా చూసుకుంటారు.
పరిస్థితి మెరుగుపడే వరకు
ఒకసారి వెంటిలేటర్‌ పై పెట్టిన తర్వాత ఆ పరిస్థితి మెరుగయ్యే వరకూ ఎన్ని రోజులైనా ఉంచాల్సి రావచ్చు. కొంతమందిలో వెంటిలేటర్‌ తీయడం కష్టం కావచ్చు. ఉదాహరణకు సిఒపిడి ఉన్నా, చాలా రోజులు వెంటిలేటర్‌ మీద ఉన్నా, ఊబకాయంవల్లా, కండరాల బలహీనత ఉన్నప్పుడు ప్రత్యేక పద్ధతులు అనుసరించాల్సి ఉంటుంది. సాధారణంగా ఐదురోజులకన్నా ఎక్కువ రోజులు వెంటిలేటర్‌ అవసరం అయితే ట్రాక్యులోస్టమీ అని చేస్తారు. దీనివల్ల స్వరపేటికకు నష్టం వాటిల్లదు, వెంటిలేటర్‌ని తొందరగా తీసేయవచ్చు. మళ్లీ అవసరమైతే ప్రమాదం లేకుండా వెంటనే కనెక్ట్‌ చేయవచ్చు.
ప్రస్తుతం సాంకేతిక, వైద్య పరిజ్ఞానం పెరిగింది. వైద్య సేవలకు కావలసిన యంత్రాలు పాశ్చాత్య దేశాలతో సమానంగా మనకు అందుబాటులో ఉంటున్నాయి. ఫలితాలు కూడా మెరుగ్గానే ఉంటున్నాయి. కాకపోతే మనకున్న సమస్యంతా ఒక్కటే. అదేమిటంటే సామాన్యులు అంత ఖర్చు భరించలేకపోవడం, ఇన్సూరెన్స్‌ లేకపోవడం. వెంటిలేటర్‌పై పెట్టినప్పుడుగానీ, ఏ ఆరోగ్య సంబంధిత విషయంలోనైనా గానీ సందేహం కలిగినప్పుడు చికిత్స చేస్తున్న డాక్టర్‌ను అడిగి నివృత్తి చేసుకోవడం మంచిది.

Curtsey with: PRAJA SEKTHY
 
వ‌ర్షా‌కాలం... హ‌ర్షోల్లా‌సం ...

    వర్షాన్ని ఎలా కొలుస్తారు?
        వర్షపాతాన్ని వర్షమానిక (రెయిన్‌ గేజ్‌)తో కొలుస్తారు. ఈ కొలతను ఒక చదరపు తలంపై సేకరించిన నీటి లోతుగా వ్యక్తీకరిస్తారు. 0.01 మి.మీ లేదా 0.01 అంగుళాల ఖచ్చితత్వంతో వర్షాన్ని కొలుస్తారు. వివిధ ప్రదేశాల్లోని వర్షమానికలను భూమినుండి ఒకే ఎత్తులో ఉంచుతారు. వర్షమానికలు రెండు రకాలుగా ఉంటాయి. అవి నిలువ వర్షమానికలు, రికార్డింగు వర్షమానికలు. నిలువ వర్షమానికలను దినసరి వర్షపాతాన్ని లేదా నెల మొత్తం కురిసిన వర్షపాతాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు. రికార్డింగు వర్షమానికలను వర్షపాతం తీవ్రతను కొలవడానికి ఉపయోగిస్తారు. రికార్డింగ్‌ వర్షమానికలో ఒక బకెట్‌లో నిర్దిష్ట ఘనపరిమాణంలో వర్షం నీరు చేరినప్పుడు ఆ బకెట్‌లోనుంచి నీరు ఒలికిపోతుంది. ఇలా బకెట్‌ నిండి, నీరు ఒలికిన ప్రతిసారీ ఒక విద్యుత్‌ స్విచ్‌ దానిని నమోదు చేస్తుంటుంది.
రుతువుల రాణీ వసంతకాలం
మంత్రకవాటం తెరచుకునీ,
కంచువృషభముల అగ్నిశ్వాసం
క్రక్కే గ్రీష్మం కదలాడీ,
ఏళ్లూ, బయళ్లూ, ఊళ్లూ, బీళ్లూ
ఏకం చేసే వర్షాకాలం,
స్వచ్ఛకౌముదుల శరన్నిశీథినులు,
హిమానీ నిబిడ హేమంతములు,
చలి వడికించే శైశిరకాలం
వస్తూ పోతూ దాగుడుమూతల
క్రీడలాడుతవి మీ నిమిత్తమే
(శ్రీశ్రీ-శైశవగీతి)
         రుతువులు వస్తూ పోతూ మీ నిమిత్తమే దాగుడు మూతల క్రీడలాడుతాయని మహాకవి శ్రీశ్రీ బాలలతో అంటున్నాడు. నిజానికి రుతువులు ఆడే దాగుడుమూతల ఆట ఎవరికి ఇష్టం కాదు? వాటి ముందు పెద్దలు కూడా పిల్లలే అయిపోతారు. మనిషి తన జీవితంలో ఎన్ని వసంతాలు, ఎన్ని శరత్తులు, ఎన్ని హేమంతాలు, ఎన్ని వర్షాలు చూసినా ఏటా ప్రతిసారీ వాటిని కొత్తగా చూస్తూనే ఉంటాడు. రుతుభ్రమణంతోపాటే వాటిని అల్లుకున్న మనిషి జ్ఞాపకాలు, అనుభూతుల భ్రమణం కూడా ఏటేటా నూతనత్వాన్ని తెచ్చుకుంటూనే ఉంటుంది.
           వచ్చేది వర్షరుతువు. ఎందరికో హర్షరుతువు. విఫలమైతే విషాదరుతువు కూడా. రుతువులలో వర్షరుతువు దారే వేరు. ఎండాకాలం ఎర్రని ఎండ మాడ్చేస్తుంది. శీతాకాలం చలి ఒక్కోసారి ఎముకల్ని కొరికేస్తుంది. కన్యాశుల్కంలో చెప్పినట్టు ఇవి పోలీసు దెబ్బలు చేసే పైకి కనిపించని గాయాలలాంటివి. వర్షాకాలం అలా కాదు. చిరుజల్లుతో మొదలై, చిన్నా పెద్దా చినుకుగా మారి, కుంభవృష్టిగా పరిణమించి, వరదగా ముంచెత్తే వర్ష విజృంభణం మనకు ఒక్కోసారి మరింత ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ అనుభవంలోకి వస్తూ ఉంటుంది.
                       గ్రీష్మతాపంతో వేగిపోయిన దేహంపై తొలకరి జల్లు కలిగించే పులకింతను మాటల్లో చెప్పడం కష్టం. అప్పుడు వేసే అదోరకం మట్టివాసన ఒక జీవితకాలం గుర్తుండిపోతుంది. ఇంట్లో కూర్చున్నప్పుడు తాకే ఆ మట్టివాసన వర్షం పడుతోందన్న సంకేతాన్ని మన మెదడుకు అప్రయత్నంగా అందిస్తుంది. శ్రావణ, భాద్రపదాల దగ్గరికి వచ్చేసరికి ప్రియవర్షం కాస్తా వరదలు పోటెత్తించి భయవర్షంగా మారి చాలు బాబూ, ఈ వర్షాలు అని కూడా అనిపిస్తుంది, అయినాసరే, ఏటేటా నిత్యనూతనంగా మనిషి వర్షోల్లాసాన్ని అనుభవిస్తూనే ఉంటాడు.
              వర్షాలు మొదలవడం కవులకు ప్రతిసారీ కవిత్వోద్దీపకమే. ప్రముఖ కవి కె. శివారెడ్డి 'వర్షాలు మొదలయ్యాయి' అనే శీర్షికతో రాసిన ఓ కవితలో ఇలా అంటారు.

నిశ్శబ్దంగా
కూర్చున్న నా వళ్లో
నాలుగు చినుకులొచ్చి వాలాయి
చినుకులకు రెక్కలుంటాయని
కిరణంలా బద్దలయ్యే శక్తి వుంటుందని
నా కిదివరకు తెలియదు
కర్టెన్‌ ఎత్తి తొంగి చూస్తాయి
కిటికీ అవతల నుంచుని కాళ్లు లోనికి
దీర్ఘంగా చాపుతాయి,
చిన్నప్పుడెప్పుడో చీకట్లో
బల్ల కింద వస్తువుల్ని కాళ్లతో దేవులాడినట్టు
చినుకులకు వళ్లంతా కళ్లు
..........................
చినుకుల కేసీ చినుకుల్లో నానుతున్న చెట్ల కేసి
మనుషుల కేసీ, వస్తువుల కేసీ, వాహనాల కేసీ
అప్పుడే చూపొచ్చినట్టు చూడడం
మరుక్షణంలో కళ్లు పోతాయన్నట్టు
చూపులాగుతాయన్నట్టు, సాంద్రంగా
తదేకంగా, తన్మయంగా, తనివి తీరనట్టు చూడడం-

ఎవరో నా నెత్తిన వర్షం కొంగు కప్పారు
ఎదురుగ్గా ఉన్న
అయిదంతస్తుల పంజరంలో
రెండు చినుకులు కిచకిచమంటున్నాయి-
వర్షాలు మొదలయ్యాయి
                మిగతా రుతువులతో పోల్చితే వర్షరుతువుకు ఇంకో ప్రత్యేకత కూడా ఉంది, రుతువుల రాణీ వసంతమే కానీ, సాహిత్యానికి ఎక్కువ వస్తువును సమకూర్చింది మాత్రం వర్షమే. వర్షం అనగానే మనకు వెంటనే మేఘం గుర్తుకు రావలసిందే. కావడానికి ఆషాఢమేఘమే కావచ్చు కానీ, కాళిదాసు మేఘదూతం కావ్యంలో ప్రియుడికీ, ప్రియురాలికీ మధ్య మేఘమే వార్తాహరి అయింది. ఇక కావ్యాలలో వర్షరుతు వర్ణనలు సరేసరి. అయితే, ఆహ్లాదకత్వం వర్షానికి ఒక పార్శ్వం మాత్రమే, ఇంకో పార్శ్వాన్ని చూస్తే వర్షం ఏటేటా మనిషిలో పంటసిరుల ఆశలు మోసులెత్తించే జీవనధార కూడా. ఒక ఏడాది వర్షం కరుణించిందంటే ఆ ఏడాది రైతు ఇంట అన్నరాశికి లోటు లేనట్టే. ఆ ఏడాదంతా రైతు కంట ఆనందవర్షమే. కానీ ఒక్కో ఏడాది వర్షం మొహం చాటేస్తుంది. మబ్బులు తెల్లమొహం వేస్తాయి. ఇంకా అన్యాయంగా వరసగా రెండు మూడేళ్లపాటు అనావృష్టి కొనసాగుతుంది. ప్రభుత్వాల రైతు వ్యతిరేక అపసవ్య విధానాల పుణ్యమా అని రైతు బతుకు అప్పుల ఊబిగా మారి ఎండిన పొలాలు ఆత్మహత్యలనే పండిస్తూ ఉంటాయి. ఈ దేశంలో ఇప్పటికీ వర్షసమృద్ధే ఆ ఏడాది ఆర్థిక ఆరోగ్యానికి కొలమానం అవుతూనే ఉండడం వర్షాలతో ఈ దేశం బతుకు ఎలా పెనవేసుకుపోయిందో గ్రహించడానికి సాక్ష్యం.
                          పడిన వర్షం మనపై పన్నీటి చిలకరింత ఎలా అవుతుందో, రాని వాన మనలో అలాగే కన్నీటి ఊట కూడా అవుతుంది. దేశంలో అనావృష్టి ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ఆ ప్రాంతాలలో చినుకు పడడ మంటే కనకవర్షమే. వర్షాకాలం వచ్చిందంటే ఆ ప్రాంతాల జనం ఆకాశం వైపు దృష్టిసారించి నేత్ర తపస్సు తపస్సు చేస్తూనే ఉంటారు. మన రాష్ట్రంలో అలాంటి ప్రాంతాలలో రాయలసీమ ఒకటి. అనావృష్టి సీమ రైతుల వెన్ను ఎలా విరుస్తుందో, వారి జీవితాల నిండా విషాదం ఎలా పరచుకుంటుందో చిత్రించిన సాహిత్యం అనంతం. పడని వర్షాలు సృష్టించిన కన్నీరు ఎన్నో కథలుగా మారి వేల పుటల మీదుగా ప్రవహించింది. రాయలసీమవాసి కాకపోయినా పర్యావరణకార్యకర్తగా ఆ ప్రాంతాలలో అనేకసార్లు పర్యటించిన ప్రముఖ కథకుడు తల్లావఝల పతంజలిశాస్త్రి సీమ ప్రజల బతుకుల్లోని వర్షాభావవిషాదానికి అద్దం పట్టే కథలు ఎన్నో రాశారు. ఎండిన పొలాలు, మోడువారిన చెట్టులానే వెలసిపోయి కళావిహీనంగా కనిపించే ఊరి మనుషుల ఊహల్లో వర్షం ఒక అందమైన కలగానూ, ఊహగానూ మారిపోతుంది. కాంతిలేని ఆ గాజు కళ్లముందు నిరంతరం విరగపండిన పొలాలు, ఆకుపచ్చని పరిసరాలు తిష్టవేసుకుని కూర్చుంటాయి. వారి జీవితమే ఒక స్వప్నసంచారాన్ని తలపిస్తుంది. చివరికి పిల్లల అంతశ్చేతనలో కూడా వర్షాభావం ఇంకిపోతుంది. పతంజలిశాస్త్రిగారి 'కతలవ్వ' కథలో వానలు పడని ఓ వానాకాలంలో ఆ రోజు మధ్యాహ్నమే ఒక రైతు పురుగు మందు తాగా కరువు బాధను తప్పించుకున్నాడు. రాత్రివేళ ఉన్నట్టుండి రావిచెట్టు గలగల మంది. గాలి గిర్రున తిరిగింది. వెంకట్రావు అనే కుర్రాడికి చెట్టుకింద తెల్లజుట్టు ముసలవ్వ మఠం వేసుకుని కూర్చుని కనిపించింది. ఆమె పక్కనే ఓ బుట్ట, దాని పక్కనే గుమ్మడికాయ తంబుర ఉన్నాయి. ఆమె ఆ అబ్బాయిని పిలిచి, కతలు చెబుతాను పిల్లల నందరినీ పిలుకు రమ్మని చెప్పింది. పిల్చుకొచ్చాడు. ఆమె బుట్టలోంచి దొంతర్లు దొంతర్లుగా మబ్బుల్ని తీసి పిల్లల మీద కప్పింది. ఆ స్పర్శ వాళ్లకు చల్లగా సిల్కులా తాకి హాయి గొలిపింది. అవ్వ వాళ్లకు ఓ కథ చెప్పింది. అదో రాక్షసుడి కథ. ఆకాశం భళ్లున బద్దలై కుండపోతగా వాన పడింది. వెండి దారాల మాదిరిగా ఉంది ఆ వర్షం. ఒకటే వర్షం. అలా నెలరోజులు కురిసింది. కానీ, చిత్రం, నేల మీద చుక్క నీరు లేదు. రాక్షసుడు తాగేశాడు. అప్పుడు మబ్బులన్నీ కలసి ఓ వీరుణ్ణి సృష్టించి రాక్షషుణ్ణి చంపించాయి. అతని దేహంలోంచి ఒకటే నీటిధార. ఎక్కడ చూసినా నీళ్లే. కరువు తీరేలా. పొలాలన్నీ నీటితో తళతళలాడుతున్నాయి. అనావృష్టికి అలవాటు పడిన చేతన ఊహల్లో జలపుష్కలత్వాన్ని ఎలా సృష్టించుకుంటుందో ఈ కథ చెబుతుంది.
ఎన్నో ఆశలు పెట్టుకున్న వాన ఓ ఏడాది వంచించవచ్చు, కానీ కరుణించిన రోజులూ అంతకంటె ఎక్కువే ఉండవచ్చు. మనిషి నిరంతర ఆశాజీవి కదా. కనుక నిండు మనసుతో ఈ ఏడు కూడా వర్షాన్ని ఆహ్వానిద్దాం.
సూర్య వర్షపాతం ఎన్నిరకాలు?
                 సముద్రాలనుంచి నీరు ఆవిరైపోయి, ఆ తేమ ఆకాశంలో ద్రవీభవించి, బుడగలలాగా ఏర్పడి మేఘాలను సృష్టిస్తుంది. మేఘాలనుంచి వర్షం కురుస్తుంది. ఈ వర్షం తిరిగి సముద్రానికి చేరుతుంది. ఇలా ఒక జల చక్రం తిరుగుతుంటుంది. వర్షాన్ని అవపాత పరిమాణం, అవపాతానికి కారణం అనే రెండు అంశాలతో వర్గీకరిస్తారు. అవపాత పరిమాణం ప్రకారం వర్షాన్ని మళ్లీ ఈ కింది విధాలుగా వర్గీకరిస్తారు.
1) అతి తేలికపాటి వర్షం - అవపాతం (నీరు కురవడం) గంటకు 1 మి.మీ కంటే తక్కువ ఉంటే అతి తేలికపాటి వర్షమంటారు.
2) తేలికపాటి వర్షం - అవపాతం గంటకు 1 మి.మీ. నుంచి 2 మి.మీ. మధ్య ఉంటే తేలికపాటి వర్షం
3) ఒక మోస్తరు వర్షం - అవపాతం గంటకు 2 మి.మీ.నుండి 5 మి.మీ. మధ్య ఉంటుంది.
4) భారీ వర్షం - అవపాతం గంటకు 5 మి.మీ.నుంచి 10 మి.మీ. మధ్య ఉంటుంది.
5) అతి భారీ వర్షం - అవపాతం గంటకు 10 మి.మీ.నుండి 20 మి.మీ మధ్య ఉంటుంది.
6) కుండపోత వర్షం - దీనిని అత్యంత భారీ వర్షంగా గుర్తిస్తారు. దీనిలో అవపాతం 20 మి.మీ కంటే ఎక్కువ ఉంటుంది.
       అంతా భూమికి చేరదు
ఆకాశంనుంచి కురిసే మొత్తం వర్షం భూమి మీదకు చేరదు. కొంతశాతం వర్షం పొడి గాలి ద్వారా కిందపడుతున్న సమయంలో గాలిలోనే ఆవిరైపోతుంది. ఇలా వర్షం భూమికి చేరకుండా గాలిలో ఆవిరైపోవడాన్ని విర్గా అంటారు. సాధారణంగా ఉష్ణోగ్రత అధికంగా ఉండే ప్రాంతాల్లోనూ, వాతావరణంలో తేమ తక్కువగా లేదా వాతావరణం పొడిగా ఉండే ప్రాంతాల్లోనూ వర్షం పూర్తిగా భూమిపైకి చేరకుండా గాలిలోనే ఆవిరైపోవడం జరుగుతుంటుంది. ఇలాంటి పరిస్థితి ఎడారి ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తుంది.
ఎల్‌ నినో అంటే?
                భారత దేశ వ్యవసాయ రంగంపై ఎల్‌ నినో ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. ఎల్‌ నినో వాతావరణ సంబంధమైన పరిస్థితి. దీనిలో ఫసిఫిక్‌ మహా సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రతలు మరింత వేడెక్కుతాయి. ఇది గాలి వీచే విధానాలపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా వరదలు లేదా కరువు కాటకాలు సంభవిస్తాయి.
                  ఎల్‌ నినో అనేది స్పానిష్‌ పదం. ఈ పదానికి 'పసి బాలుడు' అని అర్థం. వాతావరణంలో ఈ పరిస్థితి ప్రతి మూడు నుంచి ఐదేళ్లకు ఒకసారి వస్తుంది. ఎల్‌ నినో ఏర్పడితే అది ఒక సంవత్సరకాలం పాటు కొనసాగుతుంది.
                   భారతదేశంలో 18 71నుంచి ఇప్పటి వరకూ సంభవించిన అతి పెద్ద కరువుకాటకాల్లో ఆరు ఎల్‌ నినో సంబంధమైనవిగా వాతావరణ శాస్త్రవేత్తలు ప్రకటించారు. 2002, 2009నాటి కరువు పరిస్థితులకు ఎల్‌ నినో ప్రధాన కారణం.
                అయితే ఎల్‌ నినో ఏర్పడిన ప్రతిసారీ తప్పనిసరిగా కరువు కాటకాలు ఏర్పడే పరిస్థితి ఉండకపోవచ్చు. ఉదాహరణకు 1997-98 సంవత్సరం అతి తీవ్రమైన ఎల్‌ నినో ఏర్పడినప్పటికీ భారతదేశంలో కరువు ఏర్పడలేదు. 2002లో ఒక మాదిరి ఎల్‌ నినో ఏర్పడగా, భారత్‌ తీవ్రమైన దుర్భిక్షాన్ని ఎదుర్కొంది.
భారతదేశ వ్యవసాయ రంగంపై ఎల్‌ నినో ప్రభావం చాలా అధికంగా ఉంటుంది.
ఈ సంవత్సరం (2014) కూడా ఎల్‌ నినో తన ప్రభావం చూపవచ్చునని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఏప్రిల్‌ మాసాంతంనుంచి ఎల్‌ నినో ప్రభావం సూచీమాత్రంగా కనిపిస్తూ వస్తున్నది.
                ఎల్‌ నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పడినప్పటికీ, వర్షాధారంపై ఆధారపడి వ్యవసాయం చేసే భారత దేశం వంటి దేశాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
అలరించే ఇంద్ర ధనుస్సు
            వర్షాకాలంలో అందరినీ అలరించే సుందర దృశ్యం ఇంద్రధనుస్సు. ఎండ వేళ, సన్నటి వర్షపు జల్లులు కురుస్తున్నప్పుడు ఆకాశంలో సప్తవర్ణాలతో అలరారుతూ కనిపించే ఇంద్రధనుస్సును చూసి ఆనందించని హృదయం ఉండదు. సూర్యుడి కిరణాలు వర్షపు నీటి బిందువుల్లో పడి వక్రీకరణం చెంది, పరావర్తనమవడం ద్వారా ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది. ఇంద్రధనుస్సు పూర్తి వర్తులాకారంలోనూ ఏర్పడుతుంది. కానీ, చూపరులకు సగమే కనిపిస్తుంది. ఆకాశంలో ఇంద్రధనుస్సు ఏర్పడిన స్థలాన్ని ఖచ్చితంగా గుర్తించి చెప్పడం కష్టం. ఇది వస్తు రూపంలో ఉండదు కనుక దీని దగ్గరకు చేరడం, చేతితో స్పృశించడమనేవి అసాధ్యాలే. ఇంద్రధనుస్సును కేవలం 42 డిగ్రీల కోణంలోనుంచే చూడగలుగుతాము.
 వర్షచ్ఛాయా ప్రాంతం
              సముద్రాలు, భూమి సూర్యరశ్మిని గ్రహించి వేడెక్కడంలో ఉండే భేదాల వల్ల, ఎల్లవేళలా వీచే గాలి వల్ల సముద్రాల ఉపరితలంనుంచి భూమి మీదకు తేమతో కూడిన గాలులు వీస్తాయి. ఇలాంటి గాలి మార్గానికి అడ్డుగా ఎత్తయిన కొండలు లేదా పర్వతాల వంటివి ఉంటే తేమతో కూడిన గాలి పైకి ఎగుస్తుంది. గాలి పైకి వెళ్లే కొద్దీ వాయుపీడనం తగ్గి, అది వ్యాకోచిస్తుంది. ఫలితంగా దాని సాపేక్ష ఆర్ద్రత పెరిగి నీటి ఆవిరి నీటి బిందువులుగా మారి మేఘాలు ఉత్పన్నమవుతాయి. ఇలా పైకి వెళ్లిన గాలి ద్రవీభవన స్థాయిని (పైకి వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రత తగ్గి ద్రవీభవనం సంభవించే ఎత్తును ద్రవీభవన స్థాయి అంటారు) చేరుకునే వరకూ సాపేక్ష ఆర్ద్రత మరింతగా పెరిగి గాలిని సంతృప్తం చేస్తుంది. తేలుతూ ఉన్న మేఘాలు బరువైనపుడు వర్షపాతం సంభవిస్తుంది. ఆ ప్రక్రియకు అడ్డంకిగా నిలిచిన భూస్వరూపం తాలూకు పవనాభిముఖ పార్శ్వంలో వర్షం కురుస్తుంది. ఈ భూస్వరూపానికి రెండవ వైపున ఆర్ద్రత కోల్పోయి పొడిగా ఉన్న గాలి కిందికి దిగుతూ సంకోచించి, మరింత వెచ్చగా మారుతుంది. కనుక రెండవ ఆవైపు వర్షం కురవదు. ఆ కారణంగా దానిని వర్షచ్ఛాయా ప్రాంతమని అంటారు.
క్యుములో నింబస్‌ మేఘాలు
                   ఎత్తుకు వెళ్లే కొద్దీ వాయుపీడనం తగ్గడం వల్ల గాలి వ్యాకోచిస్తుంది. దానివల్ల గాలి ఉష్ణోగ్రత తగ్గి సాపేక్ష ఆర్ద్రత (తేమ) పెరుగుతుంది. ఫలితంగా నీటి ఆవిరి బిందువులుగా ద్రవీభవించి పేరుకుపోతూ, క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడుతాయి. ఇవి బరువెక్కి వర్షాన్నిస్తాయి. దీనిని సంవహన వర్షపాతమని అంటారు. ఈ రకమైన వర్షపాతంలో కుంభవృష్టి కాని, వడగండ్ల వాన కానీ సంభవిస్తుంది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈ సంవహన వర్షపాతం మధ్యాహ్న సమయంలో కాని, సాయంకాల సమయంలో కానీ సంభవిస్తుంది.

Courtesy with : PRAJA SEKTHI