Monday 25 November 2013

సూర్యశక్తితో ఐటి


                            వజ్రం ఎప్పటికీ నిలిచి ఇంటుంది- అంటూ ప్రకటన ఆమధ్య తెగ వచ్చేది. గుర్తుండే ఉంటుంది. అదేమాదిరి ఇపుడు సౌర విద్యుత్. సౌర విద్యుత్ -అంటే సూర్యరశ్మి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడం అనేది ఇప్పటికీ ఒక సవాలుగానే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ సౌర విద్యుత్ ఉత్పత్తి శాతం కేవలం 10 నించి 11 శాతమేనంటే ఆశ్చర్యం లేదు. మన దేశవ్యాప్తంగా సౌర విద్యుత్తు సామర్థ్యం మొత్తం 1,010 మెగావాట్లు. ఇందులో గుజరాత్ వాటా సగానికిపైనే.. అంటే 695 మెగావాట్లు. చెట్టూ పుట్టలపైనా, కాలువలపైనా, చివరకు ఇళ్లపైనా ఎక్కడ చూసినా సోలార్ ఫలకాలే కనిపిస్తాయి. ఈ సోదంతా ఎందుకంటారా? సింపుల్. మన కంప్యూటర్లకు యుపిఎస్‌ను ఏర్పాటు చేసుకుంటున్నాం. ఏటా వాటి బ్యాటరీలు మార్చుకుంటున్నాం. ఇంకా చెప్పాలంటే, మనలో చాలామంది ఇప్పటికే ఇన్వర్టర్లను ఏర్పాటు చేసుకుని కరెంటు కోతల సమయంలో దాన్నుంచి కరెంటు వాడుకుంటున్నాం. అంతదాకా బావుంది. దానిలో బ్యాటరీ ఉంటుందని తెలుసు కదా. మళ్లీ దానికి కరెంటు ఉంటేనే కదా అది ఛార్జి అయ్యేది.. అంటే, ఇన్వర్టర్ వాడటం అంత చవకేం కాదు కదా.
                           అసలూ, భౌగోళికంగా ఉన్న పరిస్థితుల వల్ల మనకు సూర్యకిరణాలు బాగా సోకుతూ ఉంటుంది. పైగా మీ ఇంట్లో, ఆఫీసులో ఎక్కడైనా సరే సూర్యరశ్మి ఫ్రీగా దొరుకుతుంది. ఆ సూర్యరశ్మి నుంచి విద్యుత్ తయారీ ఇపుడు ఆచరణ సాధ్యమైంది. సోలార్ ఫలకాలను మీ ఇంటిమీద ఏర్పాటు చేసుకుని తక్కువ ఖర్చుతోనే మీ ఇన్వర్టర్లను ఛార్జి చేసుకోవచ్చు. ఈ ఇన్వర్టర్ల సామర్థ్యం బాగా ఉంటే మీ కంప్యూటర్‌కు ఇక ప్రత్యేక యుపిఎస్ కూడా అక్కర్లేదు.
                             ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సోలార్ పవర్ ప్యాక్, సోలార్ లైట్లకు, సోలార్ వాటర్ హీటర్లకు సబ్సిడీ ఇస్తోంది. సోలార్ లైట్లకు 900 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు. సబ్సిడీ పోగా ఇవి 754 రూపాయల నుండి 1356 రూపాయల వరకు లభిస్తున్నాయి. ఒక్కో ఇంటికి అవసరమైన సౌర విద్యుత్తు ప్లాంట్‌ను (సోలార్ పవర్ ప్యాక్) ఏర్పాటు చేసుకుంటే ప్రస్తుతం మనం కట్టే విద్యుత్ బిల్లు భారం భారీగా తగ్గే అవకాశం ఉంది. ఇళ్లపై ఖాళీ స్థలాల్లో సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకోవడం కూడా సులభమే. సౌర విద్యుత్ ఉత్పాదక వ్యవస్థలు 1 లక్ష రూపాయల నుంచి లభిస్తున్నాయి. ఈ వ్యవస్థలు 1, 2, 3 కెడబ్ల్యుసి సామర్థ్యాలలో వస్తున్నాయి. వీటిలో 2, 3, 4, 5, 7 గంటల దాకా విద్యుత్ అందించే మాడల్సు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో సౌర ఫలకాలకు 25 ఏళ్ల వారంటీని, దానికి సంబంధించిన ఎలక్ట్రానిక్స్‌కు 2 ఏళ్ల వారంటీని, బాటరీకి 3 ఏళ్ల వారంటీని ఇస్తున్నాయి ఆయా సంస్థలు. అన్నట్టు బ్యాంకులూ ఇలాంటి పథకాలకు లోన్లిస్తున్నాయి(ట). 2 కిలోవాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసుకోవాలంటే 3 లక్షలు ఖర్చవుతుంది. కానీ దీంతో మనం 4 ట్యూబ్‌లైట్లూ, 1 పర్సనల్ కంప్యూటర్, 1 చిన్న రిఫ్రిజిరేటర్ లేదా ఏసి, 1 ఎల్‌సిడి టీవీ, 4 ఫాన్లూ దాదాపు 10 గంటల సేపు వాడుకోవచ్చు. 4 లక్షల లోపు పెట్టుబడికి మనం 2 కిలోవాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసుకోవచ్చు. దీంతో మనం 5 ట్యూబ్‌లైట్లూ, 1 పర్సనల్ కంప్యూటర్, 1 రిఫ్రిజిరేటర్ లేదా ఏసి, 1 ఎల్‌సిడి టీవీ, 5 ఫాన్లూ వాడుకోవచ్చు. ఐటి ఫలాలు మారుమూల గ్రామాలను చేరడానికి ఇలాంటి సౌకర్యాలను సమర్థవంతంగా వాడుకోవచ్చు. అక్కడ అభివృద్ధికి దోహదం చేయనూవచ్చు. చదువుకున్న నిరుద్యోగులు సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ స్కీంలలో ఇలాంటి సౌకర్యాలను ఏర్పాటు చేసుకుని వారి వారి గ్రామాల అభివృద్ధికి తోడ్పడటానికి ఇదొక చక్కని అవకాశం. ఎందుకంటే, ఇలాంటి సౌకర్యాలను ఆచరణ సాధ్యం చేయగలిగేది యూత్ మాత్రమే అని వేరే చెప్పాలా...
Courtesy with: PRAJA SEKTHI DAILY

సూర్య-చంద్రుల్లో ఏది పెద్దగా కనిపిస్తుంది?


    సూర్యుడు మన భూమి కన్నా మూడు లక్షల రెట్లకన్నా ఎక్కువ పెద్దగా ఉంటాడు. చంద్రుడితో పోలిస్తే సూర్యుడు మరెన్నో లక్షల రెట్లు పెద్దగా ఉంటాడు. ఆ లెక్కన - అంటే చంద్రుడికన్నా ఎన్నో లక్షల రెట్లు పెద్దగా ఉన్న కారణంగా సూర్యబింబం చంద్రబింబంకన్నా ఎంతో ఎంతో పెద్దగా కన్పించాలి. కానీ వాస్తవంలో మాత్రం సూర్యబింబం, చంద్రబింబం - రెండూ ఒకే సైజులో కనిపిస్తాయి. ఇందుకు ప్రధాన కారణం ఏమిటంటే...
మన భూమికి చంద్రుడికన్నా సూర్యుడు చాలా దూరంగా ఉన్నాడు. చంద్రుడు మన భూమికి సగటున 2,38,857 మైళ్ళ దూరంలో ఉంటే, సూర్యుడు 9.3 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు. అంటే మన భూమి నుంచి చంద్రుడికన్నా సూర్యుడు సుమారు 400 రెట్లు ఎక్కువ దూరంలో ఉన్నాడు. మరోపక్క చంద్రుడి వ్యాసం (2,160 మైళ్ళ) కన్నా సూర్యుడి వ్యాసం 400 రెట్లు ఎక్కువగా ఉంది. చంద్రుడికి సూర్యుడికి వ్యాసాల్లో ఉన్న వ్యత్యాసం ఎన్ని రెట్లు ఉందో, భూమి నుంచి చంద్రుడికి - సూర్యుడికి ఉన్న దూరాల్లో వ్యత్యాసం కూడా సరిగ్గా అంతే ఉండడంవల్ల మనకు చంద్రబింబం, సూర్యబింబం రెండూ ఒకే సైజులో కన్పిస్తాయి. భూమి నుంచి చూసినప్పుడు అవి రెండూ ఒకే సైజులో కన్పించడంవల్లనే సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించి నప్పుడు చంద్రబింబం సూర్యబింబాన్ని పూర్తిగా కప్పేయడం సాధ్యమవుతోంది. ఒకవేళ సూర్యబింబంకన్నా చంద్రబింబం చిన్నగా ఉండే పక్షంలో ఇలాంటిది సాధ్యం కాదు.
ఒకవేళ మన భూమి నుంచి సూర్యుడు మరి కొంచెం దూరంలో ఉన్నా, లేదా సూర్యుడి వ్యాసం ఇప్పుడున్న దానికన్నా ఒకటి-రెండు లక్షల మైళ్ళు తక్కువగా ఉన్నా అప్పుడు కచ్ఛితంగా చంద్రబింబంకన్నా సూర్యబింబం చిన్నగా కన్పించేది.
Courtesy with: Praja Sekthi 
 

జేబుకు చిల్లు... ఎనర్జీ నిల్లు


 - నిగ్గు తేల్చిన సైంటిస్టులు
   ఆధునిక కాలం యువత ఎక్కువగా ఉపయోగిస్తున్న శక్తి పానీయాలు (ఎనర్జీ డ్రింక్స్‌్‌) తక్షణ శక్తిని ఇస్తాయనేది వాస్తవం కాదని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌.ఐ.ఎన్‌) శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెలుగులోకి వచ్చింది.
దేశంలోనే మొట్టమొదటిసారిగా శక్తిపానీయాలపై పరిశోధన జరిగింది. ఎనర్జీ డ్రింక్స్‌ వాడకం పెరగడం, వాటి వలన యువతలో వస్తున్న మార్పులను వివరించడం కోసం, అలాగే ఉత్పత్తులను వినియోగించేవారు పెరగాలంటూ వ్యాపారవేత్తలు వాడుతున్న పదార్థాలను వివరించడం కోసం ఈ పరిశోధనకు పూనుకున్నామని పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్తలు ఐశ్వర్యా రవిచంద్రన్‌, జి.ఎమ్‌. సుబ్బారావు, వి. సుదర్శనరావులు చెబుతున్నారు. ఈ పరిశోధన ద్వారా అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయాలను వారు తమ పరిశోధనా పత్రం ద్వారా హైదరాబాద్‌లో జరుగుతున్న ఓ జాతీయ సెమినార్‌లో సమర్పించారు.
ఈ శక్తి పానీయాలను క్రమం తప్పకుండానూ, అప్పుడప్పుడూ వినియోగించే యువతను వారు ఈ పరిశోధనకు ఎంచుకున్నారు. ఈ పరిశోధనా ఫలితాల ద్వారా శక్తి పానీయాలను ఎక్కువగా ఉపయోగించేవారిని ఒకసారి పరిశీలిస్తే విద్యార్థులు 47%), ఉద్యోగాలు చేసేవారు (14.5%), యువత (92%) ఉన్నారు. వీరిలో యౌవన దశలో ఉన్న యువత ఎక్కువగా శక్తిపానీయాలను ఉపయోగిస్తున్నారు. వీరి సామాజిక, ఆర్థిక వివరాలను పరిశీలిస్తే దిగువ తరగతి , మధ్యతరగతి వారి కన్నా ఎక్కువగా ఎగువ తరగతికి చెందిన యువత (71%) ఈ తక్షణ శక్తినిచ్చే శక్తి పానీయాలను వాడుతున్నారు.
ఇంతేకాక శక్తి పానీయాలను యువత ఎక్కువగా స్నేహితులతో (56.1%) ఉన్నప్పుడు, పార్టీలలో (43.3%), అలసటగా అనిపించి నప్పుడు (36.1%), ప్రదర్శనకు ముందు (28.8%) ఎక్కువగా వినియో గిస్తున్నారని ఈ అధ్యయనం ద్వారా తెలుస్తోంది. శక్తి పానీయాలకు అలవాటు పడటానికి కారణాలను ఒకసారి పరిశీలిస్తే రుచి కోసం (64.4%), సువాసన కోసం (60.6%), తక్షణ శక్తి కోసం (57.2%) కోసం యువత ఎక్కువగా ఉపయోగిసున్నారని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది.
నోటికి రుచికరంగా ఉండడంతో అందరూ భ్రమపడే ఈ శక్తి పానీయాలలో కెఫీన్‌ ఎక్కువగా ఉండే విషయం ఎవ్వరికీ తెలియదని పరిశోధకులు అంటున్నారు. అందుకే యువత తక్షణ శక్తి కోసం ఈ డ్రింక్స్‌్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారని శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు. గతంలో అమెరికా పరిశోధనలు కూడా ఇదే విఫయాన్ని ధ్రువీకరించాయి. ఈ శక్తి పానీయాల వల్ల రక్తపోటు పెరుగుతుందనీ, ఇవి గుండె జబ్బులకు కారణ మవుతున్నాయని పరిశోధకులు చెప్పారు. అందుకే మరి పైన పటారం లోన లొటారం లాంటి ఈ ఎనర్జీ డ్రింక్‌లకు దూరంగా ఉండండి.
Courtesy with: PRAJA SEKTHI

Tuesday 12 November 2013

విమానాలకు దారి, దిశ ఎలా?
Posted on: Tue 12 Nov 23:20:13.640318 2013


                                                                                                                                                                     











                       విమానాలు ప్రపంచ నగరాలకు ఏ మార్గంలో వెళతాయి? వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను, దారులను, దిశలను ఎలా తెలుసుకుంటాయి?
-   జి.అశోక్‌, గోధూర్‌, కరీంనగర్‌ జిల్లా
    నేలమీదలాగా సముద్రయానానికి, విమాన యానానికి రోడ్లు, మైలురాళ్లు, రోడ్ల కూడళ్లు, మార్గదర్శక సూచికలు ఉండవు. దీనికి కారణం నేలమీద గ్రామాలు, కొండలు, నదులు, పొలాలు సహజమైన నిర్దేశచట్రం (frame of reference) గా పని చేయడంవల్ల దారుల్ని నిర్దేశించ డానికి వీలుంటుంది. కానీ సముద్రంలోకి ప్రవేశించాక కాలానికి సంబంధం లేకుండా నిలకడగా దగ్గర దగ్గరగా ఉండే నిర్మాణాలు ఉండవు. అలాగే గాల్లో కూడా నిర్మాణాలు ఉండవు. కాబట్టి సముద్ర యానానికి, విమానయానానికి మార్గాల్ని నిర్దేశించేందుకు ఇతర ఆధునిక పద్ధతుల్ని అవలంబిస్తారు. భూమి ఉపరితలం మొత్తం కొన్ని అక్షాంశాల (latitudes) రేఖాంశాల (longitudes) నే ఊహారేఖల పట్టీలలో గుర్తించారు. అంటే ఓ విధంగా ప్రపంచపటాన్ని గ్రాఫు కాగితం మీద గీచినట్లున్న మాట. గ్రాఫులో ప్రతిబిందువును, x అక్షాంశం (x-coordinate or abscissa) ద్వారాను, y -అక్షాంశం (y-coordinate or ordinate) ద్వారాను సూచించగలం. ఈ రెండు అక్షాంశాలను కలగలిపి x,y నిరూపకాంశాలు (x,y coordinates) అంటారు. అలాంటి స్థితిలో ఏర్పడే ప్రత్యేక అవకాశమేమిటంటే గ్రాఫు మీద ఏ రెండు బిందువులకు ఒకే x,y నిరూపకాంశాలు ఉండవు. వేర్వేరు బిందువులకు వేర్వేరు నిరూపకాంశాలుంటాయి. ఒక మార్గాన్ని అదే గ్రాఫు కాగితం మీద గీస్తే ఆ గీత ఏయే బిందువుల మీదుగా వెళ్లిందో చెప్పడాన్ని ఏయే నిరూపకాంశాల మీదుగా వెళ్లిందో చెప్పడం ద్వారా గుర్తించగలం. అదేవిధంగా ప్రపంచ పటంలో ప్రతి ప్రాంతానికి కచ్చితమైన అక్షాంశం, కచ్చితమైన రేఖాంశం ఉంటుంది. నేడున్న ఆధునిక సర్వేయింగ్‌ పద్ధతుల ద్వారా ప్రపంచపటంలో ఉన్న ప్రాంతాలన్నింటికీ చదరపు అంగుళం మేరకు కూడా నిర్దిష్టమైన అక్షాంశ, రేఖాంశాల జతలు ఉంటాయి. మరో మాటలో చెప్పాలంటే హైదరాబాదు నగరంలో ఓ వెయ్యి గజాల ప్రాంతంలో ఉన్న ప్రజాశక్తి కార్యాలయంలోని ఫలాని గదిలోని, ఫలాని కంప్యూటరు టేబుల్‌కున్న ముందుకాలు ఏ అక్షాంశం, ఏ రేఖాంశం మీద ఉందో చెప్పగలం. అలాగే మరో అంశం ఓ ప్రాంతం సముద్రమట్టం నుంచి ఎంత ఎత్తులో ఉందన్న విషయం. దీన్నే altitude అంటారు. ఇలా ప్రతి ప్రాంతానికీ latitude (అక్షాంశం), longitude (రేఖాంశం), altitude (ఎత్తు) ఉన్నాయి. ఈ పద్ధతిలో భూమధ్య రేఖ నుంచి ఉత్తరధృవపు అక్షం వరకు ఉన్న బిందువుల (స్థానాల) కు ధన చిహ్నం (+ve) ఉన్న సంఖ్యలలోనే అక్షాంశాలుంటాయి. భూమధ్య రేఖ మీద అక్షాంశం విలువ '0' (సున్నా) ఉత్తరధృవం దగ్గర అక్షాంశం విలువ 90డిగ్రిలు. అలాగే భూమధ్య రేఖకు దిగువుగా ఉన్న అన్ని ప్రాంతాలను ఋణ (-ve) చిహ్నం గల సంఖ్యలతో అక్షాంశాలు ఉంటాయి. దక్షిణధృవపు అక్షం దగ్గర ఆ విధంగా -90డిగ్రిలు అవుతుంది. ఇలా ధన ఋణ చిహ్నాల బదులు (+కు బదులు) చీ  N (North) గుర్తును, (-కు బదులు)S (South) గుర్తును సంఖ్య తర్వాత అనే పద్ధతి ఎక్కువగా అమల్లో ఉంది. ఇక రేఖాంశాల విషయానికొస్తే ఇంగ్లాండు ప్రాంతం దగ్గర ఉన్న Greenwich  మీదుగా ఉత్తర దక్షిణ ధృవాల్ని కలిపే నిలువు రేఖకు '0' (సున్న) విలువను ఆపాదించారు. రేఖలన్నీ ఉత్తర, దక్షిణ ధృవాల్ని కలిపేవే కాబట్టి ఈ రేఖలు గుమ్మడికాయ మీద నిలువు గీతల్లాగా ఉంటాయి. ఈ సున్న విలువగల రేఖాంశానికి ఎడమవైపు (అమెరికా ఖండంవైపు) ఉన్న ప్రాంతాలకు ఋణ గుర్తు (-ve) ఉన్న రేఖాంశ సంఖ్యగానీ లేదా సంఖ్య చివర  W (West) ఉండే విధంగాగానీ పద్ధతి ఉంటుంది. సున్నా రేఖాంశానికి కుడివైపుకు (భారతదేశం వైపు) ఉన్న ప్రాంతాలకు ధన  (+ve) గుర్తు గల రేఖాంశం ఉంటుంది లేద సంఖ్య చివర  E (East) ఉండే విధంగా రాస్తారు. భూమి గోళాకారంగా ఉండడం వల్ల ఇంగ్లాండులోని గ్రీన్‌విచ్‌కు నేరుగా వెనుక ఉన్న ప్రాంతానికి ఎడమవైపుగా -1800 కోణాన్ని, (లేదా 180w) కుడివైపుగా +180డిగ్రిలు కోణాన్ని (లేదా 180E) సూచిస్తారు. ఆ విధంగా ఆ ప్రాంతం నుంచి ఎటువైపు తిరిగి అక్కడికి చేరుకున్నా 360డిగ్రిలు (పూర్తి వలయం) కోణాన్ని పూర్తిచేసుకున్నట్టు అర్థం. ఇప్పుడిక అసలు విషయానికొద్దాం. ప్రపంచంలోని ప్రతి ప్రాంతానికి కచ్ఛితమైన అక్షాంశ రేఖాంశాలు ఉండడం వల్ల ప్రపంచం మొత్తాన్ని ఓ గ్రాఫు కాగితం మీద గీచినట్లుగా భావించాలి. ప్రతి ప్రాంతపు అక్షాంశ రేఖాంశాలు విలువల్ని విమానాల్లోని కంప్యూటర్లలో నిలువ చేశారు. ఫలాన ప్రాంతం (ఉదా: హైదరాబాదులోని శంషాబాదు విమానాశ్రయం) నుండి ఫలాని ప్రాంతం (ఉదా:అమెరికాలోని చికాగో విమానాశ్రయం) చేరుకోవడానికి ఉద్దేశించిన పైలట్‌ ఆ రెండు విమానాశ్రయాల అక్షాంశ, రేఖాంశాల్ని నమోదు చేస్తాడు. ప్రయాణిస్తున్న మార్గం ఏ అక్షాంశ రేఖాంశాల మీదుగా వెళ్లాలో కూడా కంప్యూటర్లు నిర్ణయిస్తాయి. పైలట్‌ పనల్లా ఆ విధంగా ఆ విమానం వెళ్లేలా హేండిల్సు, బటన్లు తిప్పడమే! ఇప్పుడిక పైలట్‌ అవసరం లేకుండా కూడా విమానాలు ప్రయోగించగలరు. మీ ప్రాంతపు అక్షాంశ రేఖాంశాలు, ఎత్తులు ఎంతో ఇంటర్‌నెట్‌లోని గూగుల్‌ మ్యాప్‌ ద్వారా తెలుసుకోండి.
ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక

Courtesy with: PRAJA SEKTHI DAILY

Monday 11 November 2013

పర్యావరణం

ముంచుకొస్తున్న ఉపద్రవం

           
                                 విద్యుత్ బల్బులు, కార్లు, ఎయిర్ కండిషనర్లు, టెలివిజన్లు, వంటకోసం కుకింగ్ ఓవెన్లు, చూలాలు, యంత్రాలు... మన జీవితంలోకి అడుగుపెట్టే ప్రతి ఒక్క దానికీ పనిచేసేందుకు శక్తి కావాలి. జీవనం ఉన్న ప్రతీదీ, మొక్కలు, జంతువులు, మనుష్యులు-అన్నీ శక్తికోసం బయట వనరులపైన ఆధారపడతాయి. మొక్కలు సూర్యుడి వేడిమీద ఆధారపడతాయి. జంతువులు పెరిగేందుకు, పునరుత్పత్తికోసం పనిచేసేందుకు ఏదో ఒక రూపంలోని రసాయన శక్తిమీద ఆధారపడతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ భూగ్రహం మీద జీవితం సాధ్యం కావాలంటే శక్తి కావాల్సిందే.
                               శక్తినిత్యత్వ సూత్రం గురించి మీరు విన్నారు కదా? శక్తిని పుట్టించలేం. శక్తిని నాశనం చేయలేం. ఒక రూపంలోంచి మరొక రూపంలోకి మార్చగలం. అయితే ఇక్కడా మనం గమనించాల్సింది ఒకటుంది. కొన్ని రూపాల్లో శక్తిని పునరుద్ధరించగలం. సూర్యుడి నుంచి, గాలి నుంచి, నీటినుంచి తయారయ్యే శక్తి ఈ విభాగం కిందకు వస్తుంది. చెత్తా చెదారం, చనిపోయిన చెట్లు, విరిగిపోయిన కొమ్మలు, పేడ, పంటల వ్యర్థాలు ఇలాంటి బయోమాస్‌నుంచి కూడా మనం శక్తిని తయారుచేస్తున్నాం.
                                ఇక రెండవ విభాగం. ఇది పునరుద్ధణకు వీలులేని ఇంధనాలు. అన్ని రకాల శిలాజ ఇంధనాలు-బొగ్గు, ఆయిల్, సహజ వాయువులాంటివి ఇందుకు ఉదాహరణలు. ఇప్పుడు మనం వాడుతున్న ఇంధనాలు 300 మిలియన్ల సంవత్సరాలకు పూర్వం తయారైనవి. అంటే డైనోసార్లకంటే ముందు కాలం నాటివి. నిరంతరం వాడుతూ ఉండడంవల్ల ఇవి క్రమంగా తగ్గిపోతున్నాయి. మనదేశంలో ఆయిల్ నిల్వలు మరో 19 సంవత్సరాలకు సరిపోతాయి. గ్యాస్ మరో 28 సంవత్సరాలు, బొగ్గు 230 సంవత్సరాలకు సరిపోతుంది. ఇవి ఒకసారి అయితే ఇక అంతే! దురదృష్టవశాత్తు మనం మనతోపాటు ఈ భూమీద ఉంటున్న అందరూ ఎక్కువగా శిలాజ ఇంధనాలమీద ఆధారపడుతూ ఉన్నాం రెండు వందల ఏళ్ల క్రితం శక్తివిప్లవం పారిశ్రామిక యుగం మొదలవడానికి కారణమైంది.
                             బొగ్గు, పెట్రోలియం, సహజవాయువుల వంటి శిలాజ ఇంధనాలను పెద్దమొత్తంలో వాడడంలో సమస్య ఏమిటంటే, ఇవి కావాల్సినంత లేవు. పైగా వాటివల్ల మన ఆరోగ్యానికి పర్యావరణానికీ తీవ్రమైన ముప్పు పొంచివుంది.
                            ఇందుకు మూలంగా నిలిచింది ఎక్కువ శక్తవంతమైన హైడ్రో కార్బన్‌లను కలిగి వున్న మామూలు నల్ల బొగ్గు. ఇది కలప స్థానాన్ని ఆక్రమించి వేల సంవత్సరాలపాటు ప్రాధమికమైన ఇంధనంగా కొనసాగింది. బొగ్గులో దాగివున్న శక్తి పారిశ్రామికవేత్తల అవసరాలను తీర్చింది. స్టీలును ప్రాసెస్ చేయాలన్నా, ఆవిరి యంత్రాలను నడపాలన్నా, యంత్రాలకు శక్తిని ఇవ్వాలన్నా బొగ్గే వాళ్లకు వరమైంది. ఆ తర్వాత పెట్రోలియం, సహజ వాయువులు ఎక్కువ శక్తిని కలిగి ఉన్న ఇంధనాలుగా నిలిచాయి. ఆ తర్వాత శాస్తవ్రేత్తలు యురేనియంతో అణుశక్తిని ఉపయోగించడం మొదలుపెట్టారు.
                          ఇక అప్పటి నుంచి పెరుగుతున్న శక్తి అవసరాలను తీర్చుకునేందుకు నాన్ రెన్యువబుల్ వనరులపైన ఆధారపడడం మొదలుపెట్టాం. బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువులను పెద్ద మొత్తంలో వాడడంలో మరికొన్ని సమస్యలున్నాయి. వీటి లభ్యత పరిమితంగా ఉండమే కాక మన ఆరోగ్యానికీ, పర్యావరణానికీ హాని కలిగిస్తున్నాయి.
శిలాజ ఇంధనాలతో భూగ్రహానికి చేటు
                           ఇదిఇలా జరుగుతుంది.... వాతావరణంలో కర్బనం రెండు ఆక్సిజన్ అణువులతో కలిసి కార్బన్ డై ఆక్సైడ్‌గా మారుతుంది. కార్బన్ డై ఆక్సైడ్ గ్రీన్ హౌస్ ఎఫెక్టు కారణంగా భూమి గడ్డగట్టుకుపోకుండా ఉంటుంది. కాని మన శక్తి అవసరాలు రోజురోజుకు పెరుగుతుండి ఎక్కువ మొత్తాల్లో కార్బన్ డైఆక్సైడ్ గాలిలోకి వచ్చి కలుస్తోంది. ఇందుకు మళ్లా కారణం శిలాజ ఇంధనాలే. వీటి పొగల్లో కార్బన్ డై ఆక్సైడ్ ఎక్కువ. వాతావరణంలో ఇప్పుడు సగటున మిలియన్‌కు 380 పార్ట్‌ల కార్బన్ డైఆక్సైడ్ ఉంది. పారిశ్రామిక విప్లవం మొదలుకావడానికి ముందు ఇది 280 పిపిఎం ఉండేది. అంటే ఇప్పుడు 36 శాతం ఎక్కువైంది. శిలాజ ఇంధనాల నుంచి వెలువడే కాలుష్యాలను తగ్గించకపోతే 2100 సంవత్సరం నాటికి ఉష్ణోగ్రత 3నుండి 6 డిగ్రీల సెల్సియస్ పెరుగుతుందని పేరుగాంచిన వాతావరణ శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. భూమి మీద వేడి పెరిగితే మంచు ఖండాలు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతాయి. తీరాన వున్న ద్వీపాలు, లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయి.
                           గ్లోబల్ వార్మింగ్ ఇంకా పెరుగుతోంది. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తు ఎలా ఉంటుందో చూద్దాం. మంచు ప్రాంతాలకీ, ఉష్ణోగ్రతలకీ మధ్య ఉండే సంబంధాల వల్ల భూమి మీద ఉండే నీటి పరిమాణం బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది. 20వ శతాబ్దంలో మంచు ప్రాంతాలు కరిగిపోతున్న కారణంగా సముద్ర మట్టంలో 30 శాతం మార్పు వచ్చింది. వాతావరణ పరిస్థితుల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. వానలు కొన్ని ప్రాంతాల్లో పెరిగి మరికొన్ని ప్రాంతాల్లో బాగా తగ్గిపోతాయి. తుపానులు తరచుగా వస్తాయి. వడగాలులు, కరవులు పెరుగుతాయి. ప్రకృతి విపత్తులు పెరిగిపోతాయి. భూకంపాల తీవ్రత పెరుగుతుంది. అలాస్కాలో కరుగుతున్న మంచు పర్వతాలు, సముద్రంలో మంచు, పర్మాఫ్రాస్ట్ వంటి వాటి కారణంగా సముద్ర లోటు సంవత్సరానికి 3 మిల్లీ మీటర్లు పెరుగుతోంది. సరైన చర్యలు తీసుకోకపోతే 2100 సంవత్సరంనాటికి సముద్ర మట్టం 18నుండి 59 సెంటీమీటర్ల వరకుపెరగవచ్చు. దీనితో చిన్న చిన్న దీవులు, లోతట్టులో ఉండే డెల్టా ప్రాంతాలు, అంటే బంగ్లాదేశ్, ఈజిప్టు వంటి ప్రాంతాలు పూర్తిగా కనుమరుగవుతాయి.
                          కనుక శక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు మన ముందు రెండు ముఖ్యాంశాలు నిలుస్తాయి. వీటిలో ఒకటి పరిమితంగా ఉన్న ఇంధన వనరులు. కాని వీటి వాడకం మానవజాతికి ఒక వ్యసనంలా మారిపోయింది.
శిలాజ ఇంధనాలు-మన ఆరోగ్యం
                          శిలాజ ఇంధనాలను వాడడంవల్ల కాలుష్యాలు పెరుగుతాయి. నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డై-ఆకైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఓజోన్, గాలిలో తేలాడే ధూళి కణాల వంటివి వీటిలో కొన్ని. ఇవన్నీ మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపేవే. కంటి మంట, తలనొప్పి, తల తిరుగుడు వంటి చిన్నపాటి అనారోగ్యాలు మొదలు దీర్ఘకాలిక వ్యాధులైన గుండె జబ్బులు, శ్యాసకోశ వ్యాధులు, ఊపిరి తిత్తుల క్యాన్సర్ వంటివి కూడా రావచ్చు.
ఇప్పటికే ఒక స్థాయికి మించి వీటిని మనం వాడేశాం. కనుక భూమి ఒక అతి పెద్ద శక్తి సంక్షోభ దిశలో పయనిస్తోంది. ఇక రెండవది మనం ఈ నేల మీద బతికి బట్టకట్టడానికి కారణం ప్రకృతి సహజంగా ఇక్కడ వాతావరణంలో సమతుల్యత ఉండడం. మనం శక్తి వనరులను విపరీతంగా వాడడంవల్ల ఈ సమతుల్యత తలకిందులవుతోంది. వాహనాల పొగలు, కర్మాగారాల్లో మండించే ఆయిల్స్ వల్ల ఈ భూగ్రహం ఇప్పుడు మరుగుతున్న కుండలా తయారైంది.
మరి ఏం చేద్దాం?
జీవంపోసే శక్తి ప్రాణం తీసేశక్తిగా మారకూడదంటే మనం ఏం చేయాలి?
తక్కువ వాడదాం: శక్తి పరిరక్షణకు మొదటగా చేయవలసింది శక్తిని ఆదా చేయడం. అవసరం లేనప్పుడు విద్యుత్ ఉపకరణాలను ఆపివేయడం ఇందులో ఒకటి. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎదురు చూస్తూ ఆగి ఉన్నప్పుడు వాహనం ఇంజన్‌ను ఆపివుంచడం మరొకటి. ఇలా వ్యక్తిగతంగా మనం ప్రతి ఒక్కరం చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి. ఇక ఆ తర్వాత చేయవలసింది శక్తిని మరింత సమర్ధవంతంగా వాడుకునే ఉత్పత్తులు, పరికరాలు, సేవలమీద పెట్టుబడులను పెంచడం. ఉదాహరణకు కాంపాక్స్ ఫ్లోరసెంట్ లాంప్‌ల వాడకాన్ని పెంచడం. ఇది మామూలు బల్బులకన్నా 40 శాతం తక్కువ శక్తిని వాడుకుంటాయి. అలాగే ఇంధన సామర్ధ్యం ఎక్కువ ఉన్న వాహనానలు వాడడం, కొత్త వినూత్నమైన సాంకేతిక పరిజ్ఞానం ఇక్కడ అవసరం.
                            ప్రత్యామ్నాయాలను వెతకాలి: ఎక్కువ కాలం పాటు ఏ సమస్యా లేకుండా వాడుకునేందుకు వీలైన ప్రత్యామ్నాయాలను కనుగొనేంనుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. పెద్ద మొత్తంలో సరసమైన ధరలో సమర్ధవంతమైన ఇంధనాలను పొందే ప్రయత్నం చేయాలి. సూర్యుడి నుంచి, గాలినుంచి, బయోమాస్‌నుంచి శక్తిని తయారుచేసి వాడుకునే పద్ధతులకు ప్రోత్సాహం ఇవ్వాలి. శిలాజ ఇంధనాల స్థానంలో వీటిని వాడడంవల్ల తక్కువ కాలుష్యం వస్తుంది. వాతావరణ సమతుల్యత దెబ్బతినకుండా శక్తిని పొందడం సాధ్యం అవుతుంది. మనదేశంలో ఈ మార్పు ప్రభావం ఎక్కువ పట్టణ ప్రాంతాల్లో ఉంటుంది. ఎందుకంటే శిలాజ ఇంధనాలు లేదా వాణిజ్య పరమయిన శక్తిని ఎక్కువగా ఉపయోగించేది వారే కాబట్టి మన దేశంలో పట్టణ జనాభా మొత్తం జనాభాలో 30 శాతం. కానీ వీళ్లు వాణిజ్యపరమైన శక్తిలో 80 శాతానికి మించి వాడతారు. మిగిలిన 70 శాతం మంది ఇప్పటికీ వాణిజ్యేతర శక్తి వనరులైన వంట చెరుకు, పేడ, వ్యవసాయ పంటల మిగులు వ్యర్థాల వంటి వాటితో వంట చేసుకుంటూ ఇళ్లలో వెలుగుకోసం వాడుతున్నారు.

Courtesy with: ANDHRA BHUMI DAILY

Friday 8 November 2013


శీతాకాలపు సిరి



      వాన ముసురు తగ్గి, చలి కమ్మే శీతాకాలం వచ్చీ రాగానే నోరూరించే సీతాఫలాలు మనల్ని పలకరిస్తాయి. ఇంటి పెరటిలో మొదలుకొని, ఊరి చివర, అడవి మధ్య, ఎక్కడ పడితే అక్కడ విరగకాసే సీతాఫలాలు మనల్ని ఊరిస్తాయి. చక్కని సువాసనతో, అద్భుతమైన రుచితో సీతాఫలాలు పిల్లల్నే కాకుండా పెద్దల్ని సైతం ఆకర్షిస్తుంటాయి. సీతాఫలాల చెట్లు ఏ ఊళ్ళో పెరిగినా, ఏ తండాల్లో కనిపించినా ఏ అడవిలో దాగినా అడవిబిడ్డలు వాటిని సుతారంగా కోసుకొస్తారు. నగర ప్రజలకు అడవిబిడ్డల తీపి బహుమతి సీతాఫలం. వీటి శ్రమలో మహిళల పాత్రే ఎక్కువ. రోడ్డు పక్కనే జీవనాన్ని సాగిస్తూ సీతాఫలాలు విక్రయిస్తున్న మహిళలు మనకు కనిపిస్తూనే ఉంటారు. ఇంతగా ఇష్టపడే ఈ పండు గురించి విశేషాలనూ, ఉపయోగాలనూ తెలుసుకుందాం.
తాఫలాలు చలికాలంలోనే విరివిగా దొరుకుతాయి. ఈ ఫలాల్ని తాజాగా తినడమే మంచిది. వీటితో తయారుచేసే రసాలు, షేక్‌లు అంత మంచిది కాదు. అవి తయారుచేసే లోపు బ్యాక్టీరియా త్వరగా చేరిపోతుందంటున్నారు నిపుణులు. నేరుగా తినడం వల్ల చాలా ఉపయోగాలూ ఉన్నాయి. గుజ్జు నోటిలో పెట్టుకోగానే లాలాజలం ఊరుతుంది. తద్వారా జీర్ణప్రక్రియ సులువుగా అవుతుంది. వీటిలో ఔషధ గుణాలు కూడా ఎక్కువే.
పేరు వెనుక..
సీతాఫలాన్ని అమృతఫలం అని, ఆంగ్లంలో కస్టర్డ్‌ యాపిల్‌ అని పిలుస్తారు. సీతాఫలాన్ని తినడానికి సీతమ్మకున్నంత సహనం కావాలనీ అందుకే దానికి సీతాఫలం అని పేరు వచ్చిందని కొందరి భావన. పురాణాల్లో రామాయణంలో వనవాసం ప్రధానమైనది. వనంలో విరివిగా దొరికే ఫలం సీతాఫలం. అదీ కాకుండా శీతాకాలంలో దొరికే ఫలం కనుక సీతాఫలం అనే పేరు స్థిరపడి పోయిందని చరిత్రకారులు చెబుతారు. మనం తినే సీతాఫలం కాకుండా వివిధ రంగుల్లో కూడా ఉన్నాయి. మన రాష్ట్రంలో అటవీ ప్రాంతాలన్నింటా ఈ చెట్ల విస్తీర్ణం అపారం. ఇవి నాటిని నాలుగో ఏడాది నుంచే కాయలు కాయటం మొదలై 15 ఏళ్లు ఫలాల్ని అందిస్తూనే ఉంటాయి.
ఎంచుకోవడం ఎలా?
పక్వానికి వచ్చిన సీతాఫలాన్ని కోసి మూడురోజలు సాధారణ ఉష్ణోగ్రతలో ఉంచితే చాలు. అది పూర్తిగా పండుతుంది. పండుపైన కమిలినా, నల్లగా మారినా, వాసన మారినా వాటిని ఉపయోగించకూడద. కాయ పెద్దగా ఉంటే దానిలో గుజ్జు తియ్యగా ఉంటుంది. పండు బరువు 250 నుంచి 300 గ్రాముల మధ్య తూగితే మంచిది. అన్నీ పండినవే కొనకుండా ఒక మాదిరిగా మగ్గినవి కొనాలి. ఫలం కొద్దిగా మెత్తబడగానే తినొచ్చు. సీతాఫలం తినడం కూడా ఒక కళే. చాలా మంది దానిపైన కళ్లు (ఒక్కో భాగాన్ని) తీసి తింటారు. చాలా కష్టపడతారు. అలాకాకుండా కాయను రెండు బాగాలుగా విడదీసి, స్పూన్‌తో తీసుకుని, తినడం సులువు.
రకరకాల వంటకాలుగా..
సీతాఫలం గుజ్జుతో మిల్క్‌షేక్‌లు, జ్యూస్‌లు, ఐస్‌క్రీమ్‌లు, పాయసం తయారుచేస్తారు. వివిధ ఆహారపదార్థాలకు, ఐస్‌క్రీములకు సువాసన కోసం కూడా సీతాఫలం గుజ్జను కలుపుతారు.
ఔషధ గుణాలు
సీతాఫలంలోనే కాదు చెట్టులోనే ఔషధ విలువలు విరివిగా ఉన్నాయి. ఆకులు, వేర్లు, పచ్చికాయలు, గింజలు.. ఒకటేమిటి అన్నీ ఔషధ రూపాలే. ఈ చెట్టు బెరడు ఎటువంటి స్రావాలనైనా అరికడుతుంది. ఆకులకు, గింజలకు, పచ్చికాయలకు క్రిమిసంహారక గుణం ఉంది. ఆకులు బద్దె పురుగుల మీద పనిచేస్తాయి. వేరు విరేచనాల్ని అరికడుతుంది. పచ్చికాయలు చీము, రక్త వంటి స్రావాల్ని ఆగిపోయేలా చేస్తుంది. గింజలు తలలో పేలని నివారిస్తే, పండు తక్షణ శక్తినిచ్చే టానిక్‌లా ఉపయోగపడుతుంది. గిరిజనులు తేనెతుట్టెను చెట్టు నుంచి దింపేటప్పుడు తేనెటీగలు కుట్టకుండా ఈ ఆకుల రసాన్ని శరీరానికి పూసుకుంటారు.
ప్రయోజనాలు ఎన్నెన్నో..
- సీతాఫలాలు విరివిగా దొరికినప్పుడు దాని గుజ్జు తీసి, సరిపోను నీళ్లు, పంచదార చేర్చి బాగా మరగనివ్వాలి. పానీయం దగ్గరగా అయ్యాక పొడి సీసాలో భద్రపరుచుకోవాలి. వేసవిలో దాహం తీరడానికి ఈ పానీయం ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనికి మూడువంతుల నీళ్లు కలిపి తీసుకోవాలి.
- ఎదిగే పిల్లలకు, గర్భిణీలకు క్యాల్షియం, పోషకాల అవసరం ఎక్కువ. వీరికి సీతాఫలం పుష్టికరమైన ఆహారం. సీతాఫలం గుజ్జును బెల్లంతోగానీ, తేనెతోగానీ కలిపి ఇస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ పండు గుజ్జుతో మలబద్ధకం, అజీర్తి సమస్యలు కూడా తొలగిపోతాయి.
- బక్కగా ఉన్న వారు ఎంత తిన్నా, ఏమి తిన్నా లావు కారు. అలాంటి వారు సీతాఫలాల గుజ్జును తేనెతో కలిపి తీసకుంటే కొద్దిరోజుల్లోనే ఒళ్లు చేస్తారు. దీనిలో క్యాలరీల స్థాయి హెచ్చుగా ఉంటుంది. కాబట్టి లావు కావాలనుకునే వారికి అమృతఫలమే. హైపర్‌ థైరాయిడ్‌తో బాధపడే వారికి కూడా ఈ ఫలం మంచి సుగుణం చూపిస్తంది.
- చిన్నపిల్లలో సెగ్గెడ్డల, ఇతర చీము గడ్డలు తరచూ వస్తూ ఇబ్బంది పెడతాయి. ఇలాంటి వారికి సీతాఫలం గుజ్జుకు ఉప్పు చేర్చి గడ్డపై పట్టు వేయాలి. దీంతో గడ్డ మెత్తబడి, చీము త్వరగా బయటకు వచ్చేస్తుంది. చీముగడ్డలు, ఇతర ఇన్‌ఫెక్షన్‌కు గురైన ఇతర గడ్డల మీద సీతాఫలం ఆకుల్ని మెత్తగా నూరి లేపనం వేస్తే వాటిల్లో చేరిన సూక్ష్మజీవులు గుడ్డుతో సహా నశించి, గాయం త్వరగా మానుపడుతుంది.
- జిగట విరేచనాలకు మంచి ఔషధం సీతాఫలం గుజ్జు. ఇన్‌ఫెక్షన్‌తోగానీ, జిగట విరేచనాలుగానీ అవుతున్నప్పుడు ఓ పెద్ద చెంచా సీతాఫలం గుజ్జును తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
- చుండ్రు, ఫంగస్‌ వంటి వాటితో కొంతమంది దీర్ఘకాలం బాధపడుతుంటార. ఇలాంటివారు సీతాఫలం గింజల్ని పొడిచేసి, శీకాయపొడితోగానీ, త్రిఫల చూర్ణం (ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది) తోగానీ కలిపి వాడితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. దీని గింజల పొడి కళ్లకు తగలకుండా జాగ్రత్తపడాలి సుమీ!
- కొద్దరు అకస్మాత్తుగా బిపీ డౌన్‌ అయిగానీ, బాగా నీరసించిగానీ స్పృహ కోల్పోతారు. అలాంటివారికి సీతాఫలం ఆకుల్ని బాగా నలిపి వాసన చూపించాలి. ఆ ఆకుల ఘాటైన వాసనకు స్పృహలోకి వస్తారు. ఇలా చేయడం వల్ల హిస్టీరియా రోగులకూ ఎంతో ఉపశమనం లభిస్తుంది.
- కొందరిలో నరాలపై కురుపులు వస్తాయి. వీటినే నారకురుపులు అనీ అంటారు. వీటికి సీతాఫలం ఆకుల్ని, లేత మర్రి ఊడల్ని కలిపి మెత్తగా నూరాలి. ఈ పేస్టును ఆ కురుపులపై లేపనంగా రాయాలి. దీంతో ఆ కురుపులోని పురుగు వెలుపలికి వచ్చేస్తుంది. గాయం త్వరగా నయమవుతుంది.
- జ్వరం వచ్చినప్పుడు సీతాఫలం వేరును మెత్తగా నూరి, పావు చెంచా పొడిని నీటిలో వేసి కషాయంలా తయారుచేసి, గోరువెచ్చగా ఉండగానే తాగాలి. ఆకులు కూడా జ్వరాన్ని తగ్గిస్తాయి. మూడు,నాలుగు ఆకుల్ని నలిపి నీళ్లల్లో వేసి కషాయం కాయాలి. దీనిలో కొద్దిగా ఉప్పు చేర్చి తీసుకుంటే జ్వర ఉష్ణోగ్రత తగ్గుతుంది.
- తలలో పేలు ఎంతకీ తగ్గకుండా ఇబ్బంది పెడుతుంటే సీతాఫలం ఆకుల్ని మెత్తగా రుబ్బి, తలకు పట్టించి, రాత్రంతా ఉంచాలి. తెల్లారే తలస్నానం చేయాలి. ఆకుల్ని, గింజల్ని ఎండబెట్టి వేర్వేరుగా పొడిచేయాలి. ఈ పొడులకు పెసరపిండి కలిపి తలస్నానం చేయాలి. ఇలా చేస్తే పేలు ఈరుతో సహా పోయి తల శుభ్రమవుతుంది. జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది.
- కీళ్లనొప్పులు, ఆర్థ్రరైటిస్‌ నొప్పుల ఉపశమనానికి సీతాఫలం ఆకుల్ని నీళ్లల్లో మరిగించి, ఆ నీటితో నొప్పులున్న చోట్ల కాపడం పెట్టుకోవాలి.
- దంతాల నొప్పి, చిగుళ్ల వాపు తగ్గాలంటే సీతాఫలం వేరు చిన్న చిన్న ముక్కలుగా చేసి నోట్లో పెట్టుకుని నమలాలి.

Courtesy with: PRAJA SEKTHI

Wednesday 6 November 2013

చంద్రశేఖర వేంకట రామన్ 125 వ జన్మదినము సందర్బముగా

                                         



                  సర్‌ సి.వి.రామన్‌ : తిరుచురాపల్లి సమీపంలో తేది: 07-11-1888వ సంవత్సరంలో జన్మించారు.
విశాఖపట్నంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశారు. ఎమ్మే చదివి ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేశారు.
 1907లో ఉద్యోగరీత్యా కలకత్తాకు బదిలీ అయ్యారు. అక్కడ ఇండియన్‌ సైన్స్‌ అసోసియేషన్‌కు రోజూ వెళ్ళి
 పరిశోధనలు చేసుకునేవారు. రామన్‌ ఆసక్తిని గమనించిన కలకత్తా విశ్వవిద్యాలయం ఉపకులపతి అశుతోష్‌
 ముఖర్జీ బ్రిటీష్‌ ప్రభుత్వానికి లేఖ రాస్తూ... రామన్‌ సైన్స్‌ పరిశోధనలను పూర్తి కాలానికి వినియోగించుకుంటే
 బాగుంటుం దని సూచించారు. కానీ, బ్రిటీష్‌ ప్రభుత్వంఅంగీకరించలేదు. ఉద్యోగానికి రాజీనామా చేసి పరిశోధనలు
 కొనసాగించాడు. రామన్‌ ఎఫెక్ట్‌ను కనిపెట్టాడు. 28-02-1828న తన పరిశోధనా ఫలితాన్ని ధృవపరచుకున్నాడు.
 ఈ అంశం పై నేచర్‌ పత్రికలో ఆయన ప్రచురించిన వ్యాసాలను చూసి ప్రపంచం ఆశ్చర్యపడింది. 1930 డిసెంబర్‌లో
 రామన్‌ కు నోబెల్‌ బహుమతి ప్రకటింపబడింది. వీరికి భారతరత్న (1954) బహుకరింపబడింది. ఆయన పరిశోధన
 ఫలితాన్ని ధృవపరిచిన రోజును (ఫిబ్రవరి 28) నేషనల్‌ సైన్స్‌ డే గా జరుపుకుంటున్నారు.
            భౌతిక శాస్త్రంలో భారత కీర్తి కిరీటి సి.వి రామన్. ప్రపంచ వైజ్ఞానిక రంగంలో భారతదేశపు కీర్తి బావుటాను ఎగురవేసి,
 భారతదేశపు వైజ్ఞానిక రంగంలో ఏకైక నోబెల్ బహుమతి విజేతగా, అన్నింటికీ మించి భారతరత్నగా మనందరికి
 సుపరిచితుడు శ్రీ చంద్రశేఖర్ వెంకటరామన్ (సి.వి.రామన్).  1888 నవంబరు 7 న తమిళనాడులోని తిరుచినాపల్లిలో
 జన్మించి, తన రామన్ ఎఫెక్టుతో ప్రపంచ ప్రసిద్దిగాంచిన సి.వి.రామన్ చిన్నతనం నుంచి విజ్ఞాన శాస్త్ర విషయాల పట్ల
 అమితమైన ఆసక్తిని ప్రదర్శించేవారు. ఆయన తండ్రి భౌతిక అధ్యాపకులవడం, అతనిని భౌతికశాస్త్రం వైపు మరింత 
కుతూహలం పెంచుకునేలా చేసింది. చిన్నతనం నుంచి తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్న రామన్ తన 12వ ఏట
 మెట్రిక్యులేషన్ (ఫిజిక్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించి) పూర్తి చేశాడు. 1907లో ఎం.యస్.సి (ఫిజిక్స్)లో యూనివర్సిటీకి
 ప్రధముడిగా నిలిచారు. తన 18 వ ఏటనే కాంతికి సంబంధించిన ధర్మాలపై ఈయన పరిశోధనా వ్యాసం లండన్ నుంచి
 వెలువడే ఫిలసాఫికల్ మేగజైన్‌లో ప్రచురితమైంది. ఆయనలోని పరిశోధనాభిరుచిని పరిశీలించిన అధ్యాపకులు ప్రోత్సహించి
 ఇంగ్లాండు వెళ్ళి పరిశోధన చేయమన్నారు. కానీ ప్రభుత్వం నిర్వహించిన వైద్య పరీక్షలో ఒక వైద్యుడు ఆయన ఇంగ్లాండు
 వాతావరణానికి సరిపడడని తేల్చడంతో అతను ఇంగ్లాండు ప్రయాణం విరమించుకున్నాడు. నన్ను అన్‌ఫిట్ అన్న 
ఆ డాక్టరుకు నేనెంతో రుణపడి ఉన్నాను అని తర్వాత రామన్ పేర్కొన్నారు. ఆ తర్వాత తల్లిదండ్రుల కోరిక మేరకు
 ఐసిఎస్ పాసై కలకత్తా ప్రభుత్వ ఆర్థికశాఖలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్‌గా చేరారు. ఉద్యోగంలో చేరే ముందు లోకసుందరి
 అమ్మాళ్‌తో పెళ్ళయింది. ఒకసారి కలకత్తాలో ప్రయాణం చేస్తున్నప్పుడు బౌబజారు స్ట్రీట్ వద్ద ఇండియన్ అసోసియేషన్ ఫర్
 కల్టివేషన్ ఆఫ్ సైన్స్ అనే బోర్డు చూసి పరుగు పరుగున వెళ్ళాడు. ఆ సంస్థ గౌరవ కార్యదర్శి డాక్టర్ అమృతలాల్ సర్కార్‌ను
కలిసి పరిశోధన చేయడానికి అనుమతిని పొందాడు. పరిశోధనలపై ఉన్న ఆసక్తి వలన తెల్లవారుజామున ఐదున్నరకే
 ఐసిఎస్‌కు వెళ్ళేవారు. తర్వాత ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగం, తిరిగిసాయంకాలం 
5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పరిశోధన, ఆదివారాలు, సెలవు దినాలు పరిశోధనలోనే గడిచేవి.
         అతని తల్లి పార్వతి అమ్మాళ్‌కు సంగీతంలో మంచి అభిరుచి ఉండేది. ఆమె వీణను అద్భుతంగా వాయించేది.
 అందుకే రామన్ తొలి పరిశోధనలు వయోలిన్, వీణ, మృదంగం వంటి సంగీతవాయిద్యాల గురించి సాగాయి. విజ్ఞాన
 పరిశోధన తృష్ణ వలన తను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి కలకత్తా యూనివర్సిటీ ఫిజిక్స్ ప్రొఫెసరుగా చేరారు.
 1921లో లండన్‌లో తను అధ్యయనం చేసిన సంగీత పరికరాల శబ్ద రహస్యంపై ఉపన్యాసాలు ఇచ్చా డు.
 అప్పుడు శ్రోతల్లోని ఒకరు ఇలాంటి అంశాలతోరాయల్ సొసైటీ సభ్యుడవు కావాలనుకుంటున్నావా అంటు
 నవ్వులాటగా అన్నప్పుడు ఆయనలో పరిశోధనలపై మరింత ఆసక్తి పెరిగింది. శబ్దశాస్త్రం నుంచి తన పరిశోధనలను
 కాంతి శాస్త్రం వైపు మార్చాడు. తన తిరుగు ప్రయాణంలో ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు ఆకాశం, సముద్రం నీరు
రెండింటికి నీలిరంగు ఉండటం ఆయనను ఆలోచింపచేసింది. అప్పటిదాకా అనుకుంటున్నట్లు సముద్రపు నీలి
 రంగుకు కారణం ఆకాశపు నీలిరంగు సముద్రం మీద ప్రతిఫలించడం కాదు. సముద్రపు నీటి గుండా కాంతి
 ప్రవహించేటప్పుడు కాంతి పరిక్షేపణం చెందడమే కారణం అ ని ఊహించాడు. కలకత్తా చేరగానే తన ఊహను
నిరూపించడానికి ద్రవాలు, వాయువులు, పారదర్శక ఘనపదార్థాలు కాంతి పరిక్షేపణం గురించి పరిశోధనలు
 చేశారు. అందుకు యువశాస్త్రవేత్తలైన కె.ఆర్.రామనాధన్, కె.యస్ .కృష్ణన్ ఆయనకు అండగా నిలిచారు.
1927 డిసెంబరులో ఒకరోజు సాయంత్రం కె.యస్.కృష్ణన్ రామన్ వద్దకు పరుగెత్తుకొని వచ్చి కాంప్టన్ (భౌతిక శాస్త్రవేత్త)కు
 నోబెల్ బహుమతి వచ్చిందని ఆనందంతో చెప్పగానే రామన్ ఎక్సలెంట్ న్యూస్ అని సంతోషపడ్డా, కాంప్టన్ ఫలితం
ఎక్సరేయిస్ విషయంలో నిజమైనపుడు, కాంతి విషయాలలో నిజం కావాలి కదా అనే ఆలోచనలో పడ్డాడు.
 ఆ ఆలోచనే రామన్ ఎఫెక్టుకు దారితీసింది. తగినంత అధునాతనమైన పరికరాల్లేకపోయినా, రామన్ తన
ఆలోచనకు ప్రయోగ రూపంలో జవాబు లభిస్తుందని నమ్మకంగా ఉన్నాడు.
             అతను అనుకున్నట్లే 1928 ఫిబ్రవరి 28 న రామన్ ఎఫెక్టు అంటే పారదర్శకంగా ఉన్న ఘన లేదా ద్రవ లేదా
 వాయు మాధ్యమం గుండా కాంతిని ప్రసరింపచేసినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుంది.
ఈ దృగ్విషయాన్ని 1928 మార్చి 16 న బెంగుళూరులో జరిగిన శాస్త్రజ్ఞులసదస్సులో చూపించాడు.
 అందుకే బ్రిటీష్ ప్రభుత్వం 1929లో నైట్‌హుడ్ బిరుదుతో సత్కరించింది. ఈ రామన్ ఎఫెక్టు అసామాన్యమైనదని,
 అందులో 200 రూపాయలు కూడా ధరచేయని పరికరాలతో ఆ దృగ్విషయ నిరూపణ జరగడం అద్భుతమైనదని
 ప్రపంచ శాస్త్రజ్ఞులందరూ రామన్‌ను అభినందించారు. ఈయన పరిశోధన యొక్క విలువను గుర్తించి 1930లో
నోబెల్ బహుమతి ప్రధానం చేశారు. ఆ మహనీయుని సేవలను భారత ప్రభుత్వం గుర్తించి 1954లో 'భారతరత్న'
 అవార్డు బహుకరించిన సమయంలో సందేశాత్మక ఉపన్యాసం ఇస్తూ 'విజ్ఞాన శాస్త్ర సారాంశం, ప్రయోగశాలల
పరికరాలతో వికసించదు. నిరంతర పరిశోధన, స్వంతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి ఇవే విజ్ఞానశాస్త్ర సాగరాన్ని మధించి
 వేస్తాయి' అన్న మాటలు నేటికి ఆలోచింపచేసేవి. ఆయన నాజీవితంలో ఒక విఫల ప్రయోగం. ఎందుకంటే నేను
నా మాతృభూమిలో నిజమైన సైన్స్ నిర్మాణం చేయగలననుకున్నాను. అంటూ చివరి వరకు భారతదేశంలో సైన్స్
 అభివృద్దికై పాటుపడ్డ ఆ మహనీయుడు 1970 నవంబరు 20 న భౌతికంగా కన్నుమూసినా ప్రతి సంవత్సరం
 ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రకటించుకొని ఆయనను చిరంజీవిగా మనమధ్యే నిలిపేలా కొన్ని
 సంస్థలు ఆయన పేరు మీద టాలెంట్ టెస్ట్‌లు, సైన్స్‌కు సంబంధించిన కార్యక్రమాలు చేపడుతున్నాయి.
విద్యార్ధినీ, విద్యార్ధుల్లో ఆయన స్పూర్తిని నింపుతూ సైన్స్ అంటే మక్కువ కలిగేలా చేస్తున్నాయి. 1928లో ఫిబ్రవరి 28న
 ఈయన రామన్ ఎఫెక్టును కనుగొన్న సందర్భాన్ని పురస్కరించుకుని భారతదేశంలో ఫిబ్రవరి 28వ తారీఖును
 జాతీయ విజ్ఞాన దినోత్సవంగా (నేషనల్ సైన్స్ డే) జరుపుకొంటారు.
                 జననం నవంబర్ 7 1888(1888-11-07) తిరుచిరపల్లి, మద్రాసు రాష్ట్రం, భారతదేశం మరణం
 నవంబర్ 21 1970 (వయసు: 82) బెంగళూరు, కర్నాటక, భారతదేశం జాతీయత భారతీయుడు రంగము
భౌతిక శాస్త్రము సంస్థ భారత ఆర్థిక విభాగము ఇండియన్ అసోసియేషన్ ఫార్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్ ఇండియన్
 ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మాతృ సంస్థ ప్రెసిడెన్సీ కాలేజి ప్రముఖ విద్యార్ధులు జి.ఎన్.రామచంద్రన్ ప్రాముఖ్యత
 రామన్ ఎఫెక్ట్ ముఖ్య పురస్కారాలు,  నోబెల్ పురస్కారం,  భారతరత్న, లెనిన్
 శాంతి పురస్కారం.


mom india mars orbitor mission

Tuesday 5 November 2013



    - పిఎస్‌ఎల్‌వి సి-25 సక్సెస్‌
   - సుదీర్ఘ ప్రయాణం తర్వాత మార్స్‌ ఆర్బిట్‌లోకి
    - ఇది తొలి గ్రహాంతర ప్రయోగం
     - నింగినంటిన సంబరాలు
     భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అంగారకుడి వైపు తొలి అడుగేసి మరో మైలురాయిని దాటింది. తొలి గ్రహాంతరం ప్రయోగానికి నాంది పలికింది. శాస్త్ర, సాంకేతిక రంగంలో తన సత్తాచాటి అగ్రరాజ్యాల సరసన నిలిచింది. ఈ అద్భుతానికి నెల్లూరు జిల్లా సతీష్‌ థావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ వేదికైంది. ప్రతిష్టాత్మకమైన పిఎస్‌ఎల్‌సి-25 ద్వారా అంగారక గ్రహ అన్వేషణకు బయలుదేరిన తొలి ప్రయోగం విజయవంతమైంది. తనకు అత్యంత ప్రీతిపాత్రమైన పిఎస్‌ఎల్‌వి తమ నమ్మకాన్ని వమ్ము చేయలేదంటూ శాస్త్రవేత్తలు ఆనందంలో మునిగిపోయారు. ఈ ప్రయోగం 25వ కావడంతో షార్‌లో రజతోత్సవ సంబరాలు జరుపుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2.38 నిమిషాల 26 సెకన్లకు మొదటి ల్యాంచ్‌ ప్యాడ్‌ నుండి ప్రయోగం జరిగింది.
     ప్రజాశక్తి - షార్‌ సెంటర్‌ ప్రతినిధి
 - సతీష్‌ థావన్‌ స్పేస్‌ సెంటర్‌.. 
- మంగళవారం మధ్యాహ్నం 2.38.26 నిమిషాలు.. 
- అందరిలోనూ ఒకే ఉత్కంఠత.. 
- తొలి గ్రహాంతర ప్రయోగానికి సిద్ధమవుతున్న వేళ..
       పిఎస్‌ఎల్‌వి తన సుదీర్ఘ ప్రయాణాన్ని గమ్యం చేరుతుందో లేదోననే ఆందోళన. నిశ్శబ్ద వాతావరణంలో కౌంట్‌డౌన్‌ ముగిసింది.. -8 నుండి 0...8 అవగానే పచ్చని చెట్ల నుండి నిప్పులు గక్కుతూ పిఎస్‌ఎల్‌వి సి-25 నింగికెగిసింది. నాలుగు దశలు విజయవంతంగా పూర్తి చేసుకుంది. 43.32 నిమిషాల ప్రయాణ అనంతరం మార్స్‌ ఆర్బిట్‌ మిషన్‌ అంగారకుడి మార్గంలో పడింది. సాధారణంగా పిఎస్‌ఎల్‌వి ద్వారా పంపించే ఉపగ్రహాలు ఇప్పటి వరకూ 18 నుండి 20 నిమిషాల వ్యవధిలోనే లక్ష్యాన్ని చేరేవి. తొలిసారిగా 43 నిమిషాల 32 సెకన్లు ప్రయాణం చేసి రాకెట్‌ నుండి ఉపగ్రహం వేరుపడి నిర్దేశిత లక్ష్యాన్ని చేరింది. సాధారణంగా పిఎస్‌ఎల్‌విలో 4 ఎక్స్‌ఎల్‌ స్ట్రాఫ్‌ ఆన్‌ మోటార్లు వాడతారు. సి-25లో 6 ఎక్స్‌ఎల్‌ మోటార్లను ఉపయోగించారు. భూమి దగ్గరగా 250 కిమీ, దూరంగా దీర్ఘవృత్తాకార కక్ష్యలో 23,500 కిలోమీటర్ల దూరంలో ఉపగ్రహాన్ని చేర్చాల్సి ఉంది. భూమి దగ్గరకు 246.9, దూరంగా 23,560 కిలో మీటర్ల దీర్ఘవృత్తాకార కక్షలో అంగారకుడి మార్గంలో ప్రవేశపెట్టారు. ఇప్పటి నుండి 15 రోజులపాటు బెంగళూరులోని హసన్‌లో మాస్టర్‌ కంట్రోల్‌ ఫెసిలిటీ నుండి ఒక్కో దశను దాటుకుంటూ భూమికి దగ్గరగా 300కిలో మీటర్లు, దూరంగా రెండు లక్షల కిలోమీటర్ల పరిధిలో వృత్తాకార కక్ష్యలో పరిభ్రమించేలా శాస్త్రవేత్తలు పర్యవేక్షిస్తున్నారు. 300 రోజుల తర్వాత 35 వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి అంగారకుడికి దగ్గరగా చేరుకుంటుంది. ఈ దశలో ఉపగ్రహంలో అమర్చిన ఐదు పరికరాలు పనిచేయడం వల్ల అంగారకుడిపై అన్వేషణ ప్రారంభమవుతుంది. అక్కడి చిత్రాలను తీసేందుకు రంగురంగుల కెమెరా, అంగారకుడి నుండి వచ్చే ఆవిర్లను విశ్లేషించేందుకు, నీరు, ఇతర చిన్న జీవులను పరిశీలించేందుకు పరికరాలను అమర్చారు.
ఐదేళ్లకోసారి భూమికి దగ్గరగా అంగారకుడు వస్తుంది. ఈ ఏడాది కూడా అలా వస్తుండడంతో ఇస్రో 18 నెలలపాటు కష్టపడి ఈ ప్రాజెక్టు పూర్తి చేసింది. ఇస్రో చరిత్రలో ఇది అత్యంత సుదీర్ఘ ప్రయాణ ఉపగ్రహం. ఇప్పటి వరకూ 20 వేల కిలో మీటర్ల పరిధిలోనే భారత భూ భాగంలో ఉన్న ఇస్రో రాడార్లు రాకెట్‌ గమనాన్ని పరిశీలించేవి. ఆ పరిధి దాటాక పరిశీలించే రాడార్‌ వ్యవస్థ ఇస్రోకు లేకపోవడంతో నలంద, యమున ఓడలను అద్దెకు తీసుకుని పసిఫిక్‌ మహాసముద్రంలో మార్స్‌ ఉపగ్రహ పయనాన్ని పర్యవేక్షించారు. 3 నుండి 4 దశలు అత్యంత కీలకం కావడంతో అద్దెకు తీసుకున్న రాడార్లూ పనిచేస్తాయో లేదోనని శాస్త్రవేత్తలు ఆందోళనపడ్డారు. కానీ, రాడార్లు అత్యంత అద్భుతంగా పనిచేశాయి. పిఎస్‌ఎల్‌ సి25 నాలుగు దశలు దాటుకుని మార్స్‌ మార్గంలో వెళ్లేందుకు దోహదపడ్డాయి. ఈ ప్రయోగంతో దేశ ప్రజలకు నేరుగా ఉపయోగం లేనప్పటికీ శాస్త్ర సాంకేతిక రంగాల్లో తామెవరికీ తీసిపోమని, తమకూ సత్తా ఉందని చాటుకునేందుకు ఇస్రో ఈ ప్రయోగం చేపట్టింది. ఇందుకు 450 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఉపగ్రహం బరువు 1337కిలోలు. అందులో 857 కిలోల ఇంధనం ఉంది. అది మండించడం ద్వారా 300 రోజుల ప్రయాణిస్తుంది.
ఐదు కీలక దశలు
ఈ ప్రయోగంలో ఐదు కీలక దశలను దాటాల్సి ఉంది. అందులో భూ స్థిర కక్ష్యలోకి ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టడం మొదటి దశ. నేటి నుండి 15 రోజలపాటు బెంగళూరులోని హసన్‌లోని ఎంసిఎఫ్‌ సెంటర్‌ నుంచి ఉపగ్రహం కక్ష్య పెంచుకుంటూ వెళ్లేలా ఆపరేట్‌ చేస్తారు. నవంబరు 30 రాత్రి, డిసెంబరు ఒకటిన ఉపగ్రహంలోని ఇంధనాన్ని మండించి అంగారక గ్రహానికి దగ్గరగా వెళ్లే ప్రయత్నం చేస్తారు. వచ్చే ఏడాది సెప్టెంబరు 24న ఆ గ్రహానికి మరింత దగ్గరగా వెళ్లేలా చూస్తారు. భూమి చుట్టూ 9 లక్షల కిలో మీటర్లు తిరుగుతుంది.
ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో ఛైర్మన్‌ రాధాకృష్ణన్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఇది ఇస్రో కుటుంబ విజయమని ప్రకటించారు. మిషన్‌డైరెక్టర్‌ కున్నికృష్ణన్‌, విక్రం సారాభారు స్పేస్‌ సెంటర్‌ డైరెక్టర్‌ ఎస్‌.రామకృష్ణన్‌, షార్‌ డైరెక్టర్‌ ఎం.వై.ఎస్‌. ప్రసాద్‌, మాజీ డైరెక్టర్‌ ఎం.చంద్రదత్తన్‌ ప్రయోగాన్ని పర్యవేక్షించారు. పిఎం కార్యాలయ మంత్రిత్వ శాఖ నుండి నారాయణస్వామి, ఇస్రో మాజీ ఛైర్మన్‌ కస్తూరి రంగన్‌, శాస్త్రవేత్తలు డాక్టర్‌ ఎస్‌.ఆర్‌.శివకుమార్‌, ఎఎస్‌ కిరణ్‌కుమార్‌, డాక్టర్‌ శేషగిరి రావు ప్రయోగాన్ని వీక్షించారు.

Courtesy With: PRAJA SEKTHI DAILY

జయహో.. ఇస్రో అరుణోదయం

  • 06/11/2013


                 300 రోజుల ప్రయాణం 9లక్షల కిలోమీటర్ల గమనం లక్ష్యం
షార్‌లో నింగికెగసిన ఆనందం అగ్రరాజ్యాల సరసన భారత్ కీర్తిపతాక
నెల్లూరు, సూళ్లూరుపేట, నవంబర్ 5: అంగారక గ్రహంపై పరిశోధనలు సాగించగలమంటూ
భారత శాస్తవ్రేత్తల బృందంలో భరోసా కలిగించే అపూరూప ఘట్టం ఆవిష్కృతమైంది. మంగళవారం
 మధ్యాహ్నం సరిగ్గా 2.38 నిమిషాలకు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌నుంచి పిఎస్‌ఎల్‌వి సి-25 రాకెట్
 ద్వారా మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్తవ్రేత్తల ఆనందానికి అవధుల్లేవు.
 ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ సహా శాస్తవ్రేత్తల బృందం భారతీయుల అభినందలు అందుకుంన్నారు. గత
జిఎస్‌ఎల్‌వి డి-5 ఆకస్మికంగా వాయిదా పడినా, షార్ శాస్తవ్రేత్తల బృందం నిరుత్సాహ పడక ప్రస్తుత
ప్రయోగాన్ని విజయవంతం చేశారు. ప్రయోగానికి మొక్కవోని పటిమ చూపారు. పిఎస్‌ఎల్‌వి సి-25
విజయవంతమై మాస్ ఆర్బిటర్ మిషన్ (ఎంఓఎం) కక్ష్యలోకి చేరుకోవడం వల్ల భారత్ అగ్రారాజ్యాల
 సరసన చేరుకుంది. అమెరికా, రష్యా, ఫ్రాన్స్ దేశాలు మాత్రమే ఇప్పటి వరకు అంగారక యాత్రలో
సఫలీకృతమయ్యాయి. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ మొదటి
ప్రయోగ వేదిక నుంచి పిఎస్‌ఎల్‌వి సి-25ని నింగిలోకి పంపారు. ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్
 ప్రక్రియ 56.30 గంటల ముందే ప్రారంభమైంది. కౌంట్‌డౌన్ సజావుగా సాగి వాతావరణం అనుకూలించడంతో
రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగానికి పది నిమిషాల ముందు రాకెట్‌లోని అన్ని వ్యవస్థలు సూపర్
 కంప్యూటర్ ఆధీనంలోకి తీసుకొచ్చారు. సరిగ్గా ప్రయోగ సందర్భంలో ప్రథమ దశలోని స్ట్ఫ్రాన్ మోటార్లను
మండించడంతో పిఎస్‌ఎల్‌వి సి-25 రాకెట్ రోదసిలోకి నిప్పులు చిమ్ముకుంటూ దూసుకెళ్లింది. అంగారక
యాత్ర ప్రయోగం విజయవంతం కావడంతో షార్ ఒక్కసారిగా సందడి వాతావరణంతో నిండిపోయింది.
 పిఎస్‌ఎల్‌వి సి-25 ప్రయోగంతో కక్ష్యలోకి చేరిన మాస్ ఆర్బిటర్ మిషన్ (ఎంఓఎం) మూడు వందల రోజుల
 తరువాత తొమ్మిది లక్షల కిలోమీటర్ల గమనం సాగించి అంగారక కక్షలోకి చేరుకుంటుందని శాస్తవ్రేత్తలు
చెపుతున్నారు. అంగారకుడిపై వాతావరణ, పర్యావరణ పరిస్థితులు, సూర్యకిరణాల వ్యాప్తి, ఉష్ణోగ్రత, మట్టి,
 రాళ్లలో ఉండే ఖనిజ సంపదపై పరిశోధలు చేసేందుకు ఉపకరించే వివిధ పరికరాల్ని ఎంఓఎంలో అమర్చారు.
వీటి ద్వారా తటస్థ అణువుల వివరాలు, మిథేన్ గ్యాస్ సమాచారం, హైడ్రోజన్, హీలియంల వివరాలను
తెలుసుకుంటారు. ఉపగ్రహంలో అమర్చిన ఐదు పరికరాల బరువు15 కిలోల వరకూ ఉంది. మొత్తం ప్రయోగం
కోసం ఇస్రో 450 కోట్ల రూపాయల వరకూ ఖర్చు చేసింది. ఇదిలావుంటే సూర్యుని చుట్టూ పరిభ్రమించే భూమి,
 అంగారక గ్రహాల నడుమ సుమారు నాలుగు వందల మిలియన్ కిలోమీటర్ల దూరం వరకూ ఉంటుంది.
ఈ రెండు గ్రహాల పరిభ్రమణంలో 780 రోజులకు ఓ పర్యాయం 44 డిగ్రీల కోణంలో చేరువ అవుతుంటాయి.
సరిగ్గా ఇదే సందర్భంలో కృత్రిమ ఉపగ్రహాల్ని అంగారకుడి గమనంలోకి పంపించే ప్రయోగాలు జరుగుతుండటం
పరిపాటి.  కలిసొచ్చిన సెంటిమెంట్ప్ర యోగానికి ముందు రోజున పిఎస్‌ఎల్‌వి సి-25 నమూనా రాకెట్‌కు
తిరుమల వెంకటేశ్వరుని సన్నిధిలో, శ్రీ కాళహస్తిలో, సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయంలో ప్రత్యేక పూజా
 కార్యక్రమాలను నిర్వహించారు. ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ నేతృత్వంలో పూజా కార్యక్రమాల్ని చేపట్టారు.
శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయని గత కొన్ని ప్రయోగాలకు ముందునుంచీ ఇదే సెంటిమెంట్
కొనసాగుతోంది.
ముఖ్యాంశాలు
* ఆసియా ఖండంలోనే అంగారక యాత్రలో విజయవంతమైన తొలి అడుగు వేసిన దేశంగా భారత్‌కు ఖ్యాతిదక్కింది.
* భారతదేశ రాకెట్ ప్రయోగాల్లో 50వ సంవత్సరం అంగారక యాత్రకు శ్రీకారం చుట్టి విజయవంతం చేశారు.
* పిఎస్‌ఎల్‌వి సి-25 రాకెట్ 23566 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఎంఒఎం ఉపగ్రహాన్ని భూకక్షలోకి చేర్చింది.
* సెకనుకు 9.3 కిలోమీటర్ల వేగంతో రాకెట్ దూసుకెళ్లింది.
* మొత్తం ఐదు దశల్లో అంగారక కక్ష్యలో చేరనుండగా తొలి, కీలకమైన రాకెట్ ప్రయోగం ద్వారా కృత్రిక ఉపగ్రహం
 అంగారకుడి దిశగా భూకక్ష్యలోకి చేరుకోవడం విశేషం.
రోదసి పరిశోధనల్లో భారత్ సాధించిన నిరుపమాన విజయమిది. ఈరోజు మన రోదసి కార్యక్రమంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.
-రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ
ఇదో చారిత్రక విజయం. దేశ గౌరవాన్ని మరింతగా ఇనుమడింప చేసిన శాస్తవ్రేత్తలకు అభినందనలు. -ప్రధాని మన్మోహన్
ఇదో అద్భుతమైన విజయం. అంతరిక్షంలో భారత నిరుపమానతకు నిదర్శనం. చారిత్రక విజయం సాధించిన శాస్తవ్రేత్తలను అభినందిస్తున్నాను
.
Courtesy with: Andhra Bhumi Daily