ఆరోగ్యము-అవగాహన

 

మెంతులు

- డా. చిరుమామిళ్ల మురళీమనోహర్
 
              మెంతులు మనందరికీ తెలిసిన ఔషధ దినుసు. ఇది శరీరంలో వేడిని ఉత్పన్నం చేసే ఒక చక్కని ఓషధి. కఫాన్ని వాతాన్ని తగ్గిస్తుంది. మెంతులు మలబద్ధకం, అధిక కొలెస్టరాల్, షుగర్ వ్యాధి, అధిక బరువు సమస్యలను సమర్థవంతంగా తగ్గిస్తుంది. ప్రత్యేకమైన వాసన, శరీరాన్ని పోషించే తత్వం ఈ లక్షణాల వల్ల ఇది అతి ప్రభావవంతమైన, విలువైన ఓషధిగా ప్రసిద్ధి గాంచింది.
మెంతి మొక్క ఒకే ఏడాదిలో జీవిత చక్రాన్ని ముగించేసుకునే ఏకవార్షిక మొక్కగా పెరుగుతుంది. దీనిని పెరటి మొక్కగానే కాకుండా రోజువారీగా వంటల్లో వాడుకోవటం కోసం సాగు చేస్తుంటారు కూడా. ముఖ్యంగా మెంతి ఆకులను రుచికరమైన కూరగా వాడుకోవటం మన దేశంలో సర్వత్రా కనిపిస్తుంటుంది. మెంతులు శరీరం లోపలకు ప్రవేశించిన తరువాత ఇది స్వేదం ద్వారా ప్రత్యేకమైన వాసనతో బహిర్గతమవుతుంది. మెంతులు అతి ప్రసిద్ధి గాంచిన చతుర్భీజాల్లో ఒకటి. మెంతులు, చంద్రశూర, నల్లజీలకర్ర, వాము ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థను శక్తివంతం చేస్తాయి.
ఆయుర్వేద గుణకర్మలు
దీపన (ఆకలిని పెంచుతుంది) పాచన (అరుగుదలను పెంచుతుంది) అనులోమన (వాతాన్ని కిందకి కదిలేట్లు చేస్తుంది) విరేచన (మలవిసర్జన సజావుగా జరిగేలా చేస్తుంది) వాతకఫఘ్న (వాతాన్ని కఫాన్ని తగ్గిస్తుంది) ప్రమేహఘ్న (మధుమేహాన్ని నియంత్రిస్తుంది)
పరిశోధనలో తేలిన గుణకర్మలు
కార్మినేటివ్ (ఆకలిని పెంచుతుంది) కొలెస్ట్రోలిమిక్ (కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది) బల్క్‌ల్యాగ్జిటివ్ (మలాన్ని తయారయ్యేలా చేస్తుంది) యాంటీ డయాబెటిక్ (మధుమేహాన్ని తగ్గిస్తుంది) డెముల్సెంట్ (జారుడు గుణాన్ని కలిగిస్తుంది) ఎక్స్‌పెక్టోరెంట్ (కఫాన్ని పల్చన చేసి వెలుపలకు తెస్తుంది) డయూరిటిక్ (మూత్రాన్ని జారీ చేస్తుంది) డయాఫోరిటిక్ (చెమటను పుట్టించి శరీరాన్ని చల్లబరుస్తుంది) యాఫ్రోడైజియాక్ (కామశక్తిని పెంచుతుంది)
ప్రత్యేకతలు
మధుమేహం: ఇది మూత్ర వ్యవస్థను పరిపుష్టం చేస్తుంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని దీని మధుమేహ నియంత్రణ శక్తిని వినియోగించుకోవచ్చు. ప్యాంక్రియాస్ (క్లోమ గ్రంథి)ని పోషించే కొవ్వు మేటలను ఇది శుభ్రం చేస్తుంది. మెంతులు టైప్ 1, టైప్ 2 మధుమేహాలు రెండింటిలోనూ ఔషధంగా పని చేస్తుంది. మెంతుల్లో ఉండే ట్రైగోనెల్లిన్, కౌమారిన్ అనే తత్వాలు మధుమేహం మీద పని చేస్తాయి. మధుమేహ నియంత్రణ కోసం మెంతులను రోజుకి 50 గ్రాములను, రెండు మూడు డోసులుగా విభజించి తీసుకోవాల్సి ఉంటుంది.
కొలెస్టరాల్: మెంతులు మేదోవహ స్రోతస్సు మీద నేరుగా పని చేయటం వల్ల దీనిని కొలెస్టరాల్‌ని తగ్గించుకోవడానికి ఔషధంగా వాడుకోవచ్చు. కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు రోజుకి 10 నుంచి 20 గ్రాముల మెంతులను నీళ్లకు లేదా వెన్న తీసిన మజ్జిగకు కలిపి తీసుకుంటూ ఉంటే ప్రమాదకరమైన లోడెన్సిటీ లిపో ప్రొటీన్ (ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్) తగ్గినట్లుగా అధ్యయనాల్లో తేలింది.
జీర్ణశక్తి: కఫానికి వాతానికి వ్యతిరేకంగా మెంతులు పనిచేయటం వల్ల జీర్ణక్రియలో ఆలస్యం, గ్యాస్, పొట్ట ఉబ్బరింపు తదితర సమస్యలతో కూడిన అజీర్ణాన్ని మెంతులు సరిచేయగలుగుతుంది. మెంతులు నీళ్ల విరేచనాలను, అలాగే పేగుల లోపలి వాపును తగ్గిస్తుంది. మెంతుల్లోని జిగురు తత్వం పేగుల్లో తయారైన అల్సర్లని తగ్గించడంతోపాటు మలం విచ్చుకొని తయారయ్యేలా చేస్తుంది. అందుకే ఇది సౌమ్యమైన విరేచనకారిగా పని చేస్తుంది. మెంతుల్లోని చేదు తత్వాలు కాలేయాన్ని శక్తివంతం చేస్తాయి. అలాగే పోషక తత్వాల విలీనానికి సహాయపడతాయని అధ్యయనాల్లో తేలింది.
మహిళల సమస్యలు: గర్భాశయ వ్యాధుల్లోనూ, ఇతర స్ర్తిల వ్యాధుల్లోనూ, పునరుత్పత్తికి చెందిన అంగ ప్రత్యంగాల సమస్యల్లోనూ మెంతులు ఔషధంగా పని చేసినట్లు అధ్యయనాల్లో తేలింది. మెంతుల్లో ఉండే సపోనిన్స్‌లో ఫైటోఈస్ట్రోజన్స్ తయారీకి అవసరమైన ప్రికర్సార్లు - డోయోస్‌జెనిన్స్ అనేవి మహిళల గర్భాశయ ఆరోగ్యాన్ని పెంచుతాయి. ప్రసవం తరువాత మెంతులను వాడితే పేగుల కదలిక మెరుగవడమే కాకుండా గర్భాశయంలో సంచితమైన రక్తం వెలుపలకి వచ్చేసి గర్భాశయ శుద్ధి జరుగుతుంది. రసధాతువు మీద మెంతుల్లోని పోషకాంశాలు పని చేయటం వల్ల తల్లిపాల తయారీకి ఇది సహాయపడుతుంది. నొప్పితో కూడిన బహిష్టులో ఇది వేడిని ఉత్పన్నం చేయటం ద్వారా రక్తప్రసరణను పెంచి దోష సంచితాన్ని తగ్గిస్తుంది.
మగవాళ్ల ప్రత్యేక సమస్యలు: మెంతుల్లోని ప్రత్యేక తత్వాలు శీఘ్రస్కలనం, నపుంశకత, లైంగిక స్తబ్దత, అంగస్తంభన సమస్యలు ఇలాంటి వాటిని తగ్గిస్తాయి. దీనిలోని పోషక తత్వాలు పునరుత్పత్తి వ్యవస్థను శక్తివంతం చేస్తాయి. అలాగే దీనిలోని మధుర తత్వాలు శుక్రధాతువు తయారీకి సహాయపడతాయి.
నొప్పి: మెంతులు వాతహరంగా పని చేస్తుంది కాబట్టి దీనిని నడుము నొప్పి, సయాటికా, కీళ్లనొప్పి, వాపులు, కండరాల నొప్పి ఇలాంటి వాటిల్లో వాడుకోవచ్చు. ముఖ్యంగా నడుములో, తొడల్లో, రక్తప్రసరణ తగ్గటం వల్ల ఏర్పడిన చల్లదనాన్ని ఇది అమోఘంగా తగ్గిస్తుందని అధ్యయనాల్లో తేలింది. అస్త్ధితువును (ఎముకలు) ఇది శక్తివంతం చేయటం వల్ల ఆస్టియోపోరోసిస్, నడుమునొప్పి, జుట్టు రాలటం, ఎముకల బలహీనత వంటి సమస్యల్లో ఇది ఔషధంగా పని చేస్తుంది.
బాహ్య ప్రయోగం: మెంతులను నీళ్లతో కలిపి పై పూతగా లేదా పట్టుగా వాడితే ఇనె్ఫక్షన్లు, చీము పొక్కులు, ఎముకలు విరగటం, కీళ్లవాపు మొదలైన సమస్యలు తగ్గుతాయి.

_____________________________________________

ప్రాణాయామం

            యోగాలో ప్రాణాయామానికి ప్రముఖ స్థానం ఉంది. ప్రాణాయామం అంటే ప్రాణశక్తిని శరీరమంతా వ్యాపింపజేయడం. శ్వాసకు ప్రాణానికి, శ్వాసకు మనస్సుకు చాలా దగ్గర సంబంధముంది. శ్వాసను స్వాధీనపరచుకుంటే మనస్సును అదుపులో ఉంచుకోవచ్చు. ప్రాణాయామాన్ని పద్మాసనం, వజ్రాసనం, సుఖాసనం, అర్ధపద్మాసనాలలో ఏదో ఒక ఆసనంలో ఉండి చెయ్యాలి. వెన్నుముక, తల నిటారుగా ఉండాలి. ఖాళీ కడుపుతో చెయ్యాలి. గాలి తీసుకున్నప్పుడు పొట్ట, ఛాతి బాగాలు ముందుకు రావాలి. వదలినప్పుడు లోపలికి వెళ్లాలి. ఇలా 15 నుంచి 20 నిమిషాలు చెయ్యాలి. ప్రాణాయామం వల్ల ఊపిరితిత్తులు విశాలమై ఆక్సిజను శరీరంలోకి ఎక్కువగా చేరుతుంది. ప్రతి అవయవానికీ, ప్రతి కణానికీ ఆక్సిజన్‌ సరఫరా జరిగి బాగా పనిచేస్తాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ప్రాణాయామం చేయడానికి పద్మాసనం, వజ్రాసనం అత్యంత అనుకూలమైనవి. ఈ ఆసనాలలో ఎంత సేపు కదలకుండా కూర్చున్నా శరీరంలో ఎలాంటి నొప్పులూ రావు.
పద్మాసనం : కింద కూర్చుని రెండు కాళ్లను చాపాలి. మొదట కుడికాలును ఎడమ తొడపైన, ఆపై రెండవ కాలును చేతులతో పట్టుకుని కుడితొడపైన ఉంచాలి. వెన్నెముకను నిటారుగా ఉంచాలి. రెండు చేతులను చిన్‌ముద్రలో ఉంచుకోవాలి.
జాగ్రత్తలు : మోకాళ్ల నొప్పులు అధికంగా ఉన్న వాళ్లు జాగ్రత్తగా వెయ్యాలి. లేదా వారు అర్ధ పద్మాసనంలో వేయొచ్చు.
వజ్రాసనం : రెండు కాళ్లను వెనకకు ముడిచి, రెండు మడిమలు పిక్కలకు అంటి ఉండేటట్లు ఉంచి, కాలి బొటన వేళ్లు ఒకదానికొకటి దగ్గరగా కలిపి ఉంచాలి. తల, వెన్నెముక నిటారుగా ఉండాలి. రెండు చేతులు చిన్‌ముద్రలో ఉంచాలి.
జాగ్రత్తలు : మోకాళ్ల నొప్పులు బాగా ఎక్కువగా ఉన్న వారు కొన్ని రోజుల వరకు వజ్రాసనం వెయ్యకూడదు.
- డాక్టర్‌ రాచమల్ల రంగనాథ్‌రెడ్డి
మిత్ర యోగ సెంటర్‌, కడప.
సెల్‌ : 9440074773
_________________________________________________________________________

సౌర ఆసనాలు

సూర్యోదయాన ఆసనాలు వేయడం వల్ల మనసుకు, శరీరానికి ఆరోగ్యం లభిస్తుంది. 12 ఆసనాలు ఉంటాయి. వీటిని ఒక పద్ధతి ప్రకారం ఒక దాని తర్వాత ఒకటిగా వెయ్యాలి. రోజూ ఇలా సాధన చేయడం వల్ల శరీరంలోని 72 వేల నాడులు ఉత్తేజితమవుతాయి. మొత్తం నాడీ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
శరీరమంతా వార్మ్‌అప్‌ జరగడానికి ఏ రకమైన శారీరక వ్యాయామ పద్ధతిలోనైనా కనీసం గంట సమయం పడుతుంది. సౌర ఆసనాల వల్ల ఆ ఫలితాలన్ని 5 నిమిషాల్లోనే పొందవచ్చు. శ్వాసను గమ నిస్తూ చెయ్యడం వల్ల ప్రాణాయామంలోని ఫలితాలనూ పొందవచ్చు. ఇది అత్యంత సురక్షితమైన వ్యాయామ పద్ధతి. చాలా సులుభంగా చేయొచ్చు. ఉదయం సూర్యు నికి ఎదురుగా తూర్పు వైపునకు తిరిగి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. సూర్యాస్తమయ సమయంలోనూ ఈ ఆసనాలు వేయొచ్చు. ఈ రెండు సమయాల్లోనూ చేయలేని వారు ఆహారం తీసుకున్న 4-5 గంటల వ్యవధి తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు.
చేయాల్సిన విధానం :
1) ప్రణామాసనం : పాదాలు రెండూ దగ్గరగా ఉంచి చేతులు నమస్కార స్థితిలో ఉంచి హృదయ స్థానం దగ్గర ఛాతీకి బొటన వేళ్లు తగిలేటట్లు ఉంచాలి. ఒక సారి గాలి పీల్చి వదలాలి.
2) హస్త ఉత్తానాసనం : గాలి పీలుస్తూ నెమ్మదిగా చేతులు పైకి లేపి సాధ్యమైనంత వెనక్కు వంగాలి. శరీరమంతా ఒక విల్లులాగా వంచాలి.
3) పాదహస్తానం : గాలిని వదులుతూ పాదాల పక్కగా అరచేతులను నేలకు తాకిస్తూ మోకాళ్లకు నుదిటిని ఆనించాలి.
4) అశ్వసంచలనాసనం : గాలిని తీసుకుంటూ కుడి కాలును వీలైనంత వెనుకగా ఉంచి మోకాలును నేలకు ఆనించాలి. తలను పైకెత్తాలి.
5) దండాసనం : గాలిని కుంచిస్తూ ఎడమ కాలిని వెనక్కు తీసుకువచ్చి రెండు కాళ్ల వేళ్లను నేలకు తాకించి శరీరమంతటినీ దండం వలే నిటారుగా ఉంచాలి.
6) సాష్ఠాంగ నమస్కారాసనం : గాలిని వదులుతూ మోకాళ్లు, ఛాతీని నేలకు ఆనించాలి. నడుమును కిందకు వంచకుండా గాలిలోనే ఉంచాలి.
7) భుజంగాసనం : శరీరాన్ని ముందుకు లాగి గాలిని తీసుకుంటూ తల, ఛాతీ, చేతులు నిటారుగా వచ్చే దాకా పైకి ఎత్తాలి.
8) పర్వతాసనం : కాళ్లు, చేతులు వాటి స్థానాల నుంచి కదలకుండా గాలిని వదులుతూ నడుమును పూర్తిగా పైకి ఎత్తాలి.
9) అశ్వసంచలనాసనం : గాలిని తీసుకుంటూ కుడి కాలును ముందుకు తెచ్చి రెండు హస్తాల మధ్య ఉంచాలి.
10) పాదహస్తానం : గాలిని వదులుతూ ఎడమ కాలిని కుడికాలు ప్రక్కకు తీసుకురావాలి.
11) హస్త ఉత్తానాసనం : గాలిని తీసుకుంటూ రెండు చేతులు పైకి తీసి శరీరాన్ని వెనక్కు వంచాలి.
12) ప్రణామాసనం : చేతులు నమస్కార స్థితిలో ఉంచి ఒక సారి గాలిని తీసుకుని వదలాలి. తర్వాత చేతులు కిందకు దించి నిటారుగా నిలబడాలి.
గమనిక : ఇదే విధంగా ఎడమ కాలితో కూడా చెయ్యాలి. ఈ విధంగా కుడి, ఎడమ కాళ్లతో చేస్తే ఒక పర్యాయం పూర్తి అవుతుంది. రోజూ 3-12 పర్యాయాలు సూర్య నమస్కార ఆసనాలు వేస్తే ప్రయోజనం చేకూరుతుంది.
నియమాలు :ఈ అసనాలు శ్వాసతో ఏక కాలంలో చెయ్యాలి. పూర్తి ఏకాగ్రతతో చెయ్యాలి. సౌర పూర్తయిన తర్వాత శవాసనంలో విశ్రాంతి తీసుకోవాలి.
జాగ్రత్తలు :సయాటిక, నడుము నొప్పి అధికంగా ఉన్నవారు మొదట్లో జాగ్రత్తగా, నెమ్మదిగా చెయ్యాలి. తక్కువ పర్యాయాలు చెయ్యాలి. మహిళలు నెలసరి సమయంలో మొదటి 3 రోజులు చెయ్యకూడదు.
- డాక్టర్‌ రాచమల్ల రంగనాథ్‌రెడ్డి
మిత్ర యోగ సెంటర్‌, కడప.
సెల్‌ : 9440074773

  ________________________________________________________

బార్లీతో బలం

  • -డా. జి.వి. పూర్ణచందు 9440172642
  • 22/04/2012
బార్లీ గింజలను జ్వరం వచ్చినపుడు జావ కాచుకొని తాగేందుకే మనం వాడుతున్నాం. గోధుమ, వరి, జొన్నల తర్వాత బార్లీనే ఆహార ధాన్యంగా ప్రపంచంలో ఎక్కువమంది వాడుతున్నారు. పశువుల మేతలోనూ, బీరు తయారీ పరిశ్రమల్లో కూడా దీని వినియోగం ఎక్కువ. బార్లీ పంట ఈనాటిది కాదు. క్రీ.పూ.10,000 నాటికే బార్లీ పండించటం ప్రారంభించారు. రుగ్వేదంలో పేర్కొన్న యవధాన్యం బార్లీయేనని చెప్తారు. ordeum vulgare అనేధి దీని శాస్ర్తియ నామం. ఇండో యూరోపియన్ పూర్వ రూపాలలో ‘బ్యారే’ అనే పదం బార్లీ పేరుకి మూలంగా భాషావేత్తలు పేర్కొంటున్నారు. ఇజ్రాయెల్, జోర్డాన్ ప్రాంతాల్లో దీని ఉత్పత్తి ప్రారంభమైందట. బహుశా భూ ఉపరితల ఉష్ణోగ్రతను తగ్గించటానికి బార్లీ ఉత్పత్తి ఆనాడు అనివార్యమై ఉంటుంది. ఉష్ణమండల దేశాలవారికి బార్లీ అత్యవసర ఆహార పదార్థం. ఆఫ్రికాలో బార్లీ సాగు మొదట ప్రారంభమైందనే వాదన ఉంది. క్రీ.శ.1500 దాకా బార్లీని రొట్టెల తయారీ కోసమే ఎక్కువగా ఉపయోగించారు.pot barley అంటే పట్టు తక్కువ లేదా దంపుడు బార్లీ గింజలని అర్థం. పాలిష్ చేసిన బార్లీ గింజల్ని ‘పెరల్ బార్లీ’ అంటారు.pearling అంటే తెల్లగా ఫాలిష్ పట్టటం. ముత్యాల్లా ఉంటాయి కాబట్టి ఈ పేరు సార్థకం అయ్యింది.
10-25 శాతం బార్లీ పిండిలో గోధుమ పిండి కలిపి బేకింగ్ ప్రక్రియలో రొట్టెల తయారీకి వాడుతున్నారు. బార్లీ గింజల మాల్ట్ వాడకం ఇప్పుడు ఎక్కువగా ఉంది. నాన్ రొట్టెలు (బ్రెడ్స్), చంటిపిల్లలకు పెట్టే ఫారెక్స్, సెరెలాక్ లాంటి పోషక పదార్థాల తయారీలో ఈ ‘బార్లీమాల్ట్’ ఉపయోగపడుతోంది. బార్లీ మాల్ట్‌లో పోషక విలువలు ఎక్కువగా ఉండటం ఇందుకు కారణం. బార్లీగింజల్ని నల్లగా మాడ్చి కాఫీ గింజలకు బదులుగా వాడుతున్నారు. అది చేదు రుచినే కలిగింటుంది. ఇలా నల్లగా మాడ్చిన గింజలతో ‘వినెగార్’ తయారుచేస్తున్నారు.
ఓట్స్ అనేవి గొప్ప ధాన్యం అనే ప్రచార ప్రభావంతో తెలుగు నేలమీద చాలామంది ఓట్స్ అటుకులను తిని, ఇంకా తమకు తగినంత బలం రాలేదని అంటుంటారు. ఓట్స్‌కన్నా బార్లీలో మూడురెట్లు అధికంగా పోషక విలువలున్నాయని ఆహార శాస్తవ్రేత్తలు చెపుతున్నారు. బార్లీ అనగానే ఫైబర్ నిండిన ఒక గొప్ప ధాన్యం అని మనకు గుర్తుకు రావాలి. పళ్ల రసాలు, కూరగాయలకన్నా బార్లీద్వారా లాభించే ఫైబర్ పేగులకు ఎక్కువ మేలు చేస్తుంది. భాస్వరం, రాగి, మాంగనీసు ఖనిజాలు నిండుగా ఉన్న ధాన్యం ఇది. గుండె, రక్తనాళాలకు ఎక్కువగా బలాన్ని కలిగిస్తుంది. రక్తపోటుని నివారించటంలో బార్లీ శక్తిమంతంగా పనిచేయటానికి ఈ ఖనిజాలే కారణం. గుండె జబ్బులు, పేగుపూత, జీర్ణకోశవ్యాధులు, అమీబియాసిస్, ‘ఇరిటబుల్ బవుల్ సిండ్రోమ్’ వ్యాధుల్లో ఇది ఔషధమే! రోజుకు 21 గ్రాముల బార్లీని తీసుకొంటే గుండెజబ్బులను నివారించవచ్చునని శాస్తవ్రేత్తలు చెప్తున్నారు. ఫైబర్ కారణంగా పేగులు శుద్ధి అయి, పేగులలో బంధించబడిన మలం మెత్తబడి సాఫీగా విసర్జించబడుతుంది. మొలలు, లూఠీ వ్యాధులతో బాధపడేవారు బార్లీని ఔషధంగా వాడుకోవాలి. మూత్రంలో మంట తగ్గుతుంది. శరీరంలో వేడి తగ్గుతుంది. శరీరానికి పట్టిన నీరు తగ్గుతుంది. పేగుల్లో కేన్సర్ రోగాలకు బార్లీతో ఉపశమనం కనిపిస్తుంది.
బార్లీని జావగా మాత్రమే తాగనక్కర్లేదు. దీని పిండితో గోధుమ, జొన్న, రాగి, బియ్యం పిండిగానీ కలిపి రొట్టెలు చేసుకోవచ్చు. రుబ్బిన మినప్పిండిలో బార్లీ పిండిని కలిపి గారెలు, దోశెలు వేసుకోవచ్చు. పూరీ, ఉప్మాలాంటివికూడా వండుకోవచ్చు. యూరోపియన్లు పుట్టగొడుగులతో బార్లీని కలిపి వండుకుంటారు. బార్లీజావలో పెరుగు కలిపి మిక్సీపట్టండి లేదా చల్ల కవ్వంతో చిలకండి. ఈ మజ్జిగలో ఉండే బ్యాక్టీరియా బార్లీలోని ఫైబర్‌ను త్వరగా పులిసేలా చేసి ఇఖఆకూజష ఘషజజూ అనే కొవ్వు ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ బుటిరిక్ ఆమ్లం పెద్ద పేగుల్లో కణాల్ని బలసంపన్నం చేస్తుంది. పేగుల్లో కేన్సర్, అల్సర్లవంటివి రాకుండా చేస్తుంది. పేగులు బలసంపన్నమైతే, సమస్త వ్యాధులనూ నివారించినట్టే కదా..! కామెర్లు, తదితర లివర్ వ్యాధులకు, మూత్రపిండాల వ్యాధులకు బార్లీమజ్జిగ గొప్ప ఔషధం. కొలెస్ట్రాల్‌ని ఉత్పత్తి చేసే ఎంజైమ్‌లను అదుపు చేసి కొవ్వు పెరగకుండా చేయగల పానీయం ఇది. స్థూలకాయులు, షుగర్‌వ్యాధి ఉన్నవారు దీన్ని తీసుకోవచ్చు. నియాసిస్ అనే బి- విటమిన్ బార్లీలో ఎక్కువగా ఉంటుంది.
బార్లీ మజ్జిగ షుగర్ వ్యాధిలో వచ్చే అరికాళ్ల మంటలు, తిమ్మిర్లను తగ్గించటానికి పనికొస్తుంది. మెనోపాజ్‌కు చేరిన స్ర్తిలు బార్లీ మజ్జిగ తాగితే మెనోపాజల్ సిండ్రోమ్ లక్షణాలు తగ్గుముఖం పడతాయి. పొద్దునే్న లీటర్లకొద్దీ నీళ్లు తాగే అలవాటున్నవారు బార్లీ మజ్జిగ తాగటం అలవాటు చేసుకొంటే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. బాలింతలు బార్లీ గింజలతో కాచిన పాయసం తాగుతూ ఉంటే తల్లిపాలు పెరుగుతాయి. ఆమెపాలు తాగిన బిడ్డ కూడా ఆరోగ్యవంతంగా పెరుగుతాడు. బార్లీపట్ల మనకున్న అపోహలను తొలగించుకొని, అది మన ప్రాచీన ధాన్యాలలో ఒకటిగా గ్రహించి సద్వినియోగపరచుకోవటం అవసరం.
__________________________________________________________________

ఎండల్లో ఆరోగ్యం

సాధారణంగా ఎండాకాలం తీవ్రత ఏప్రిల్‌-మే నెలలో ఉంటుంది. ఈ సంవత్సరం మన రాష్ట్రంలో మార్చి నెల మొదటి వారంలోనే ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే మే నెలలో ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ఎండలు ఎక్కువైతే వడదెబ్బ, అలసట, కండరాల నొప్పులు, చెమట కాయలు, నీటి కాలుష్యపు రోగాలు వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు ముఖ్యంగా పిల్లల్లో, వృద్ధుల్లో ఎక్కువగా ఉంటాయి. ఎండల్లో ఆరోగ్యం కాపాడుకోవడం ఎలాగో ఈ వారం తెలుసుకుందాం.....
వడదెబ్బ చాలా ప్రమాదకరమైన ఆరోగ్య సమస్య. మద్యం తాగేవారిలో, వయసు మళ్లిన వారిలో ఈ సమస్య ఎక్కువగా రావొచ్చు. ఎండల్లో ఎక్కువగా తిరగడం వల్ల ఈ సమస్య వస్తుంది. వడదెబ్బ వచ్చిన వ్యక్తికి శరీరం ఎర్రగా, వేడిగా, పొడిగా ఉంటుంది. చెమటపట్టదు. చివరికి చంకలు కూడా తడిగా ఉండవు. శరీర ఉష్ణోగ్రత 110 డిగ్రీల ఫారన్‌ హీట్‌ వరకు పెరిగే అవకాశముంది. శ్వాసపీల్చడం పెరుగుతుంది. గుండె కొట్టుకునే వేగం అధికమవుతుంది. రక్తపోటు ఎక్కువైతుంది. కొందరు స్పృహ కూడా తప్పొచ్చు. వడదెబ్బ వచ్చిన వ్యక్తికి వెంటనే చికిత్స మొదలు పెట్టాలి. ఆలస్యమైతే మెదడు దెబ్బతినొచ్చు.మరణం సంభవించొచ్చు. గంటలో ఉష్ణోగ్రత బాగా తగ్గించే చర్యలు తీసుకోవాలి. వడదెబ్బ లక్షణాలు కలిగిన వ్యక్తిని వెంటనే నీడలోకి తీసుకెళ్లాలి. బట్టలు బాగా వదులు చేయాలి. తడి బట్టతో శరీరాన్ని చుట్టాలి. ఫ్యాన్‌ దగ్గర పడుకోబెట్టాలి. ఫ్యాన్‌లేకపోతే విసనకర్రతో విసరాలి. చల్లనీరు తాగించాలి. ఈ చికిత్స తర్వాత అవసరమనిపిస్తే ఆసుపత్రికి తీసుకెళ్లాలి.
అలసటతో తగ్గే రక్తపోటు
ఎండల్లో ఎక్కువగా పనిచేయడం వల్ల నీరసం, అలసట కలుగుతుంది. వీరిలో చెమట ఎక్కువ పడుతుంది. రక్తపోటు తగ్గుతుంది. నాడీబలహీనంగా ఉంటుంది. ఈ లక్షణాలు గలవారిని వెంటనే చల్లని ప్రదేశానికి తీసుకెళ్లాలి. తలకంటే కాళ్లు ఎత్తుగా ఉండేట్టు పడుకోబెట్టాలి. కాళ్లు, చేతులు బాగా రుద్దాలి. ఒక లీటరు నీళ్లలో ఒకటే స్పూను ఉప్పు కలిపి కొంచెం కొంచెం తరచుగా పెట్టాలి. అపస్మారక స్థితి ఉంటే, ఎలాంటి ఆహారం ఇవ్వకుండా ఆసుపత్రికి తీసుకెళ్లాలి. వీరు ఎక్కువ రోజులు అదనంగా ఉప్పు వాడాలి.
కండరాల నొప్పులు
ఎండాకాలం శరీరంలో లవణాల శాతం తగ్గిపోవడం వల్ల కండరాల నొప్పులు వస్తాయి. ఎక్కువగా ఎండల్లో పనిచేస్తూ, చాలా ఎక్కువగా నీరు తాగే వారిలో ఈ సమస్య రావొచ్చు. పనివేళల్లో సాయంత్రపూట ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. వీరికి ఒక లీటరు నీళ్లలో ఒక టీ స్పూను ఉప్పుకలిపి కొంచెం-కొంచెం తరచూ పట్టాలి. ఉప్పు కలిపిన నీటితో వీరికి తొందరగా ఉపశమనం కలుగుతుంది. ప్రథమ చికిత్స తర్వాత అవసరమనుకుంటే ఆసుపత్రికి తీసుకెళ్లాలి.
చెమటకాయలు
ఎండల్లో కొందరికి చెమట కాయలు రావొచ్చు. ఇలాంటి వారుదురద లేకుండా 'కెలడ్రిల్‌' పూత మందు వాడవచ్చు. ఎక్కువ భాగం చల్లటి ప్రదేశాలలో ఉండాలి. నూలుబట్టలు ధరించాలి. చెమట ఎక్కువగా కలిగించే వేపుడు పదార్థాలు, మద్యపానానికి దూరంగా ఉండాలి.
ఎండాకాలంలో గ్లూకోజు ?
ఎండాకాలంలో చాలా మంది చల్లదనం వస్తుందని గ్లూకోజు నీటిలో కలిపి తాగుతుంటారు. ఇది అశాస్త్రీయం. గ్లూకోజుకు ఎండలకు ఎలాంటి సంబంధం లేదు. గ్లూకోజు కూడా ఇతర పిండి పదార్థాల్లాగానే ఒక పిండి పదార్థం. గ్లూకోజు శరీరానికి చల్లదనం ఇవ్వదు.
నీటికాలుష్య రోగాలు
ఎండాకాలం బావుల్లో, తాగునీటి వనరుల్లో నీరు ఇంకి కలుషితం అవుతుంది. ఇందు వల్ల నీళ్ల విరేచనాలు, చీము రక్త విరేచనాలు, కలరా, టైఫాయిడ్‌, అమీబియాసిస్‌, కొన్ని రకాల పచ్చకామెర్లు, నుళిపురుగుల వ్యాధులు, పోలియో వ్యాధి రావొచ్చు. నీళ్లు బాగా మరగకాచి, చల్లార్చి తాగితే ఈ వ్యాధులు నిరోధించొచ్చు.
ఆరోగ్యంగా ఉండటానికి....
* ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వీలైతే ఎండలో తిరగరాదు.
* నూలు, వదులు బట్టలు ధరించాలి.
* బయటికి వెళ్లినప్పుడు టోపి పెట్టుకోవాలి.
* మంచినీరు ఎక్కువగా తాగాలి.
* సాధారణ నీటితో తరచూ స్నానం చేయాలి.
* రోజూ వాడే ఉప్పుకంటే అదనంగా ఉప్పు వాడాలి.
కాచి చల్లార్చిన నీళు ్లతాగాలి
అందరూ ఆరోగ్యంగా ఉండాటానికి మంచినీరు అన్నిటికంటే ఎక్కువ పాత్ర నిర్వహిస్తుంది. రక్షిత మంచిన నీరు అందరికీ అందించడం ప్రభుత్వం చేయాల్సిన మొదటి బాధ్యత. ఇక్కడ మన ప్రభుత్వాలు దాదాపు ఫెయిలైనట్లే. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాలా ప్రకారం నీరు-పారిశుధ్యలోపాల వల్ల మన దేశంలో ఏటా 78 లక్షల మంది చనిపోతున్నారు. దీన్ని గురించి ఏడస్తూ కూర్చోకుండా, వ్యక్తులు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. మనలో చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేస్తారు. నీరు వేడి చేసినప్పుడు సూక్ష్మజీవులు చనిపోతాయి. అంటే ఆ నీరు శుభ్రమైన నీరు. అశుభ్రమైన నీటితో స్నానం చేస్తాం. వేడి నీటితో స్నానం చేస్తే శరీరానికి ఆట్టే ప్రయోజనం లేదు. వేడి నీటితో స్నానం చేయడానికి ఎక్కువ నీరు కావాలి. ఎక్కువ ఇంధనం కావాలి. ఎక్కువ సమయం పడుతుంది. వేడి నీటి స్నానం వల్ల కాలం, ఇంధనం, డబ్బు వృధా అవుతుంది. మనలో చాలా మంది మనకు సాధారణంగా లభించే నీటిని ఏ చర్యలు చేయకుండా తాగుతాం. మనం తాగే నీటిలో వ్యాధులు కలిగించే ఎన్నోరకాల సూక్ష్మజీవులుంటాయి. అంటే మనం కలుషిత నీరు తాగుతున్నామన్నమాట. ఇందువల్ల నీళ్ల విరేచనాలు, చీము-రక్తవిరేచనాలు, కలరా, టైఫాయిడ్‌, అమీబియాసిస్‌, కొన్ని రకాల పచ్చకామెర్లు, నుళిపురుగుల వ్యాధులు, పోలియో రావొచ్చు. నీళ్లు బాగా కాచి, చల్లార్చి తాగితే ఈ వ్యాధులు రావు. నీరు మరిగేటప్పటి నుండి 15 నిమిషాలు కాచాలి. ఏ పాత్రలో కాచుతారో అదే పాత్రలో చల్లారనీయాలి. తాగటానికి స్నానం కంటే తక్కువ కావాలి. తాగేనీరు కాచటానికి తక్కువ సమయం పడుతుంది. ఆరోగ్యమూ వస్తుంది. వెరసి మనం పరిశుభ్రమైన నీరు స్నానం చేయడానికి, అపరిశుభ్రమైన నీరు తాగడానికి వాడి జబ్బులు, మరణాలు, తెచ్చుకుంటున్నాం. కాలం, ఇంధనం, డబ్బు వృధా చేస్తున్నాం. ఈ పద్ధతి మార్చుకుంటే ఆరోగ్యం, ఇంధనం మిగులు, డబ్బు మనకు వచ్చే లాభాలు. వెంటనే ఇప్పుడున్న పద్ధతులు రివర్స్‌ చేసుకోండి. తాగటానికి బాగా కాచి చల్లార్చిన నీరు, స్నానానికి మామూలుగా లభించే నీరు. ఈ ఎండాకాంలోనే ఈ మార్పుకు శ్రీకారం చుట్టాలి.
డాక్టర్‌ ఆరవీటి రామయోగయ్య
ఆర్గనైజేషన్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ సోషల్‌ డైమెన్షన్స్‌ ఆఫ్‌ హెల్త్‌
హైదరాబాద్‌.
_________________________________________________________________

HEALTH AWARENESS

జలుబుకు గృహవైద్యం


  • 02/02/2012
వాతావరణంలో వచ్చే మార్పుల ఫలితంగా జలుబు బారిన పడిన వారు ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలు పాటించి ఉపశమనం పొందవచ్చు. వేడిపాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగితే జలుబును త్వరితగతిన వదిలించుకోవచ్చు. రాత్రి సమయంలో నిద్ర పోయేముందు పాలు తాగితే జలుబు నుంచి దూరం కావచ్చు. రెండు కప్పుల నీటిలో చిన్న అల్లం ముక్క, దాల్చిన చెక్క ముక్కలు వేసి బాగా మరగించి, ఆ తర్వాత ఆ నీటిని శుభ్రమైన వస్త్రంతో వడగట్టి కొద్దిగా తేనె కలిపి తాగితే జలుబు తగ్గుతుంది. తులసి ఆకులు కూడా జలుబును తగ్గించేందుకు దోహద పడతాయి. కొన్ని తులసి ఆకులు, చిటికెడు రాతి ఉప్పు కలిపి రసాన్ని మింగితే మంచి ఫలితం లభిస్తుంది. తులసి ఆకులను ‘టీ’లా మరగించి తాగినా జలుబు నుంచి విముక్తి పొందవచ్చు.
________________________________________________________

ఐడియా


  • 31/01/2012
తలంటుకోడానికి అరగంట ముందు నువ్వుల నూనె చేతిలో వేసుకుని తలకు మర్దనా చేయాలి. కొంతసేపటికి తలలో వేడి బైటకు వచ్చి నూనె మాడులోపలకు ఇంకుతుంది. ఆ తర్వాత కుంకుడుకాయ, సీకాయతో తలస్నానం చేయాలి.
ఉసిరికను, కొద్దిగా మెంతులను వేరు వేరుగా నానబెట్టి మెత్తగా వేరువేరుగా రుబ్బి ముందు మెంతిపిండితో, తరువాత ఉసిరిక ముద్దతో తలరుద్దుకోవాలి. తరువాత గోరువెచ్చని నీళ్ళతో తలంటుకోవాలి.
నిమ్మరసం, కోడిగుడ్డు సొన కలిపి తలకు బాగా మర్దనా చేయాలి. అరగంట అయ్యాక స్నానం చేయాలి. దీనివల్ల కుదుళ్ళు గట్టిపడతాయి. జుత్తు మృదువుగా తయారై మెరుస్తుంటుంది.
వంట చేయటమే కాదు వంట సామాగ్రిని కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరి ఇంట్లో స్టీలు, రాగి, ఇత్తడి, అల్యూమినియం సామాన్లు తప్పకుండా ఉంటాయి. ఇనుము, వెండివల్ల ప్రమాదం లేదు గాని, తగరం, సీసం వంటి లోహపు వస్తువులు తినుబండారాలను విషతుల్యం చేస్తాయి. రాగి, ఇత్తడి, అల్యూమినియం పాత్రలో పుల్లటి పదార్థాలను ఉంచకూడదు. ఆహార పదార్థాలు చెడిపోయే అవకాశం ఎక్కువ. స్టీలు, గాజు, పింగాణి, మట్టి, రాగి, చెక్క పాత్రలను ఉపయోగించాలి. రాగి, ఇత్తడి పాత్రలను నీరు నిలువ చేసుకునేందుకు ఉపయోగించాలి. రాగి చెంబులోని నీరు ప్రతిరోజూ తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు.
నిమ్మరసం, చక్కెర కలిపి మోచేతులకు బాగా మర్దనా చేశాక స్నానం చేస్తే మీ చేతి నలుపు విరిగి చర్మపు అసలు రంగు బైటకు వస్తుంది. అలా పది రోజులు స్నానానికి ముందు చేస్తే, చేతులు మృదువుగా, ఆకర్షణీయంగా తయారవుతాయి.
రాత్రి పడుకునే ముందు పుదీనా ఆకు రసం కొద్దిగా ముఖానికి రాసుకుంటే ముఖంపై మొటిమలు తగ్గిపోయి చర్మం మృదువుగా నునుపు తేలి అందంగా ఉంటుంది.
_______________________________________________

మర్దనతో మరమ్మతు..!

ఒళ్ళు అలసటగా ఉంటే మంచి మర్దన వల్ల కొత్త ఉత్సాహం పుట్టుకొస్తుంది. కానీ, అసలు మసాజ్‌ వల్ల కొత్త కణాలు పుడతాయంటే ఎలా ఉంటుంది? అది నిజం అని నిరూపించింది ఓ పరిశోధన. ఇప్పటివరకూ కండరాలను మర్దన చేస్తే 'లాక్టిక్‌ ఆమ్లం' పుట్టి ఇబ్బంది కలిగిస్తుందని అనుకునేవారు. కానీ వ్యాయామం పిదప కండరాల మర్దన అనే అంశంపై జరిగిన ఈ మొట్టమొదటి పరిశోధనలో మర్దన మంచిదని తేలింది. అది కండరా లలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించే దిశగా రసాయనాల ఉత్పత్తి జరిపి, కొత్త కణాల జననానికి అవసరమైన 'ఎంఆర్‌ఎన్‌ఎ' (మెసెంజర్‌ రైబో న్యూక్లియిక్‌ ఆసిడ్‌) అనే పదార్థాన్ని విడుదల చేస్తుంది. ఆ ఎంఆర్‌ఎన్‌ఎ కణాల ద్వారా కొత్త ప్రొటీన్ల తయారీకి అవసరమైన సమాచారాన్ని మోసుకెళుతుంది ఆ విధంగా మర్దన కండరాల మరమ్మతుకు తోడ్పడుతుంది
 ________________________________________________

ఉపవాసంతో దీర్ఘాయువు..!

ఉపవాసంతో పుణ్యం వస్తుందో లేదోగానీ, ఆరోగ్యం, తద్వారా దీర్ఘాయుష్షు లభిస్తాయని సైన్స్‌ చెబుతోంది. అసలు ఉపవాసం ఆరోగ్యానికి ఎంతమటుకు మేలు చేస్తుందో, ఏవిధంగా హాని చేస్తుందో అనే విషయంపై సర్వత్రా కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. తాజా పరిశోధన ప్రకారం వారానికి రెండురోజులు ఉపవాసం చేస్తే ఆయుష్షును కాస్త పొడిగించుకోవచ్చని తెలిసింది. పస్తులతో మెదడుకి మంచి జరుగుతుందట. ప్రత్యేకించి 'అల్జీమర్‌' వ్యాధి వంటి మెదడు వినాశనకర వ్యాధికారక కాలరీలు నియంత్రిస్తే మెదడు రసాయ నాలు మెరుగవుతాయనీ, అవి వ్యాధులను రాకుండా అడ్డుకుంటా యనీ తెలుస్తోంది. గతంలో పస్తులు పెట్టి జీవితకాలం పొడిగించ వచ్చు అని ఎలుకల్లో నిరూపించారు. అటువంటి ప్రయోగాలు మానవులలో చేయడం కష్టమే కదండీ! కష్టమనుకుంటే ఎలా? ఆ మాత్రం పస్తులకీ అలవాటుపడాలండోరు..! ఏమంటారు..?! ఏమైనా మానవులకు జిహ్వ చాపల్యం ఎక్కువే కదా! అయితే ఈ పరిశోధనలపై మళ్ల్లీ చర్చ జరగడం మాత్రం ఖాయం. పస్తులుండాలా అని అప్పుడే భయపడకండేం..?!
_________________________________________________

చల్లగాలితో గుండెకు హాని

గుండెవ్యాధిగ్రస్తులకు చల్లగాలి మంచిది కాదు, ముఖ్యంగా వ్యాయామం చేస్తున్నప్పుడు. ఎందుకంటే వ్యాయామం చేస్తున్నప్పుడు ఆక్సీజన్‌ను అధికంగా తీసుకోలేరు. వ్యాయామం చేస్తున్నప్పుడు చల్లగాలి పీల్చడం వల్ల గుండెలో అసమమైన గాలి అంతా పంపిణీ అవుతుంది. కానీ ఆరోగ్యవంతుడి శరీరం ఈ సమస్యను సరిచేస్తుంది. రక్తప్రసరణను పున:పంపిణీచేస్తుంది. గుండె సరిగ్గా పనిచేసేలా చేస్తుంది. గుండె జబ్బు- కరొనరి అర్టిరరి జబ్బు ఉన్నవారిలో ఇలా జరగదు. ఒక వేళ వీరు ఐసొమెట్రిక్‌ (సమపరిమాణం) పనిచేస్తూ, చల్లగాలి పీల్చినప్పుడు గుండె ఎక్కువగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో సాధారణం కన్నా ఎక్కువ ఆక్సీజన్‌ తీసుకుంటారు. ఐసొమెట్రిక్‌ పని అంటే మంచును తొలగించడం, బ్రీఫ్‌కేస్‌ లేదా ల్యాప్‌టాప్‌ బ్యాగు మోయడం.

చల్లటి వాతావరణంలోకి వెళ్లినప్పుడు గుండె ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. అందుకే చలికాలంలో కార్డియాక్‌ అరెస్ట్‌ వల్ల చాలా మరణాలు సంభవిస్తాయి. 'ఇక్కడ రెండు సంఘటనలు సంభవిస్తాయి-డిమాండ్‌, సరఫరా' అని హార్ట్‌ అండ్‌ వాస్క్యులర్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పోస్ట్‌డాక్టొరల్‌ మాథ్యు ముల్లర్‌ తెలిపారు. చల్లని గాలి శ్వాసతో గుండెలో ఆక్సీజన్‌ డిమాండ్‌ అధికంగా ఉంటుంది. ఆక్సీజన్‌ సరఫరా కొద్దిగా బలహీనపడుతుంది. ఎందుకంటే చల్లగాలి వల్ల గుండె సంబంధ సమస్యలు ఉత్పన్నం అవుతాయనే అంశం అర్థం చేసుకోవడానికి ఈ అధ్యయనం సహకరిస్తుంది' అని పెన్‌ స్టేట్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌లోని మెడిసిన్‌ అండ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ద హార్ట్‌ అండ్‌ వాస్క్యులర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రొఫెసర్‌ లారెన్స్‌ ఐ సినొవె తెలిపారు. 
______________________________________________________

నో స్మోకింగ్‌

పొగతాగడంతో ఆరోగ్యం క్షీణించి, మృత్యువుకు దగ్గరవుతాం. పొగాకు పొగలో ఆక్సిడెంట్స్‌, ఫ్రీ రాడికల్స్‌, కార్సినోజెన్స్‌ ఉంటాయి. వీటిలో కొన్ని శోధం కలిగించేవి. ఈ పదార్థాలు మానవ శరీరంమీద నేరుగా, శాశ్వత ప్రభావాన్ని చూపిస్తాయి. సిగరెట్‌ తాగడం వల్ల శరీరంలోని దెబ్బతినే ముఖ్య అవయవాల గురించి తెలుసుకుందాం...
పొగతాగడంతో శరీరం మీద పడే ప్రభావాలు కళ్లు, ముక్కు, గొంతు మీద కనిపిస్తాయి. మొదటి దమ్ము పీల్చుక్ను కొద్ది సెకన్లలోనే, శోధాన్ని కలిగించే వాయువులు కళ్లు, ముక్కు, గొంతులాంటి సున్నితమైన పొరలమీద పనితనం చూపించడం ప్రారంభిస్తాయి. కళ్ల నుంచి నీళ్లు కారుతాయి. ముక్కు కారుతుంటుంది. గొంతు శోధంతో బాధపడుతుంది. మీరు ఇలాగే పొగతాగడం కొనసాగిస్తుంటే, శోధం కలిగించే ఈ వాయువులు కఫం ఏర్పడేలా చేస్తాయి. నిరంతరం పొగతాగడంతో, గొంతు పొర లైనింగ్‌ అనూహ్యంగా మందంగా తయారవుతుంది. దీని వల్ల గొంతు క్యాన్సర్‌లో కనిపించే కణాల మార్పు కనిపిస్తుంది.
పోరాడే శక్తి కోల్పోతుంది..
ఊపిరితిత్తులకు సంబంధించి పొగతాగడంతో అపాయకరమైన ఆరోగ్య ప్రభావాలుంటాయి. నిరంతరం పొగతాగడంతో ఊపిరితిత్తుల సహజసిద్ధమైన శుభ్రపరిచే సామర్థ్యం పూర్తిగా క్షీణిస్తుంది. శ్వాస స్థాయి పెరిగి, ఊపిరితిత్తులు ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. శోధం కలిగించే వాయువులు మూలంగా ఊపిరితిత్తుల కణాలకు రసాయనిక హాని జరుగుతుంది. దీని వల్ల శ్లేష్మం ఉత్పత్తి పెరిగి దగ్గు, కఫం స్వభావం పెరుగుతుంది. అధిక శ్లేశ్మం పలు రకాల క్రిములకు, సూక్ష్మ క్రిములకు పోషణ వేదికగా మారుతుంది. చలిజ్వరం, ఫ్లూ, బ్రాంకైటిస్‌ ఇతర శ్వాస సంబంధిత అంటువ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువ. అంటువ్యాధులకు గురైతే శరీరంలో పోరాడే శక్తి తగ్గుతుంది. ఎందుకంటే పొగతాగడంతో ఆక్రమణ జరిపే జీవాణువులతో పోరాడే తెల్ల రక్త కణాలకు వైకల్యం సంభవిస్తుంది. శ్వాసనాళం లైనింగ్‌ మందంగా మారి క్యాన్సర్‌కు కారణం అవుతుంది. అత్యధిక ఊపిరితిత్తుల క్యాన్సర్లు శ్వాసనాళం లైనింగ్‌ మూలంగానే సంభవిస్తాయి. సిఓపిడి (ఊపిరితిత్తులకు వాయు ప్రవాహం అవరోధం మూలంగా సంభించే శ్వాస ఇబ్బంది) బాధకు గురికావచ్చు. సిఓపిడి సంభవించగల ఏకైక కీలక అపాయ అంశం పొగతాగడం. ఇది 81.5 శాతం సిఓపిడి మృత్యువులకు కారణం. ఇన్‌ఫ్లూయెంజా, న్యూమోనియా లాంటి అపాయకరమైన శ్వాసకోశ అంటువ్యాధుల అపాయం ఎక్కువ.
గుండె గుభేల్‌....!
గుండె వ్యాధులు (సివిడి) అభివృద్ధి సాధించిన దేశాలలో మృత్యువుకు కారణమయ్యే కారణాలలో అగ్రస్థానంలో ఉన్నాయి. పొగతాగడం అనేది సివిడి పెంపొందే అపాయకరమైన కారణాలలో కీలకమైన ఒక కారణంగా పరిగణించబడుతుంది. ఇదే గుండెపోటుకు కారణాల్లో ముఖ్యమైంది.
ఊపిరితిత్తులకు పొగ చేరుకోగానే గుండె ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. ఇది నిమిషానికి 10 నుంచి 25 నిమిషాలు అదనంగా కోట్టుకోవాల్సి ఉంటుంది. లేదా ప్రతి రోజూ 36,000 సార్లు అదనంగా, నికోటిన్‌ పొగాకు పొగలోని ఇతర శోధం కలిగించే ప్రభావాల మూలంగా ఎన్నోసార్లు మీ గుండె దడ క్రమరహితంగా కొనసాగుతుంది.
రక్తపోటు రగులుతుంది
పొగతాగడంతో రక్తపోటు మీదకూడా ఆరోగ్య ప్రభావాలు కనిపిస్తాయి. సిగరెట్‌ కాల్చే ప్రతీసారి రక్తపోటు 10 నుంచి 15శాతం పెరుగుతుంది. గుండె, రక్తనాళాల మీద అదనపు ఒత్తిడి ఏర్పడి గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. పెద్దనాళం పరిఫెరల్‌ వాస్కులర్‌ వ్యాధి సంభవించేందుకు పొగతాడగడం అత్యంత కీలకమైన అంశాలలో ఒకటి. ఇది పొగతాగడానికి కారణమయ్యే అథిరొక్లిరోసిస్‌, వాసోకన్‌స్ట్రిక్చర్‌కి దారితీస్తుంది. పొగతాగనివారితో పోల్చితే రోజూ 15 సిగరెట్లు కాల్చేవారిలో రక్తనాళాల వ్యాప్తి నివారణ తర్వాత అవయవ అంగచ్ఛేదం రేటు రెట్టింపు కంటే ఎక్కువుంటుంది.
నల్లటిరక్తం
పొగతాగడంతో ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే కీలకమైన అంశం కార్బన్‌ మోనాక్సైడ్‌. ఇది రంగు రహితమైన, రుచిరహితమైన ప్రాణాపాయకరమైన వాయువు. వాహనాల విడుదల చేసే కాలుష్యంలో ఇది ఉంటుంది. పరిశ్రమల యంత్రాలలో సురక్షితం అని పరిగణించేదానికంటే 600 అంతకన్నా ఎక్కువగా గాఢత్వం సిగరెట్‌ పొగలో ఉంటుంది. పొగతానివారితోల్చితే మామూలుగా పొగాతాగేవారి రక్తంలో నాలుగు నుంచి పదిహేను అంతలు ఎక్కువ కార్బన్‌మోనాక్సైడ్‌ ఉంటుంది. ఆ కార్బన్‌ మోనాక్సైడ్‌ పొగతాగడం నిలిపేసిన తర్వాత ఆరు గంటల వరకు రక్తప్రవాహంలో కొనసాగుతుంది. పొగతాగడం నిలిపేసిన కొన్ని గంటల్లోపు అకస్మాత్తు మృత్యువు సంభావన 50 శాతం తగ్గుతుంది. సిగరెట్‌ కాల్చి పొగ పీల్చుకోగానే కార్బన్‌ మోనాక్సైడ్‌ రక్తంలోకి చేరుతుంది. ఆక్సీజన్‌ గ్రహితల చోటుకు అవరోధం కలిగించి ఎర్ర రక్తకణాలను తొలగిస్తుంది. దీని అర్ధం మీ మెదడు, ఇతర కీలక అవయవాలకు తక్కువ ఆక్సీజన్‌ వెళ్తుందన్నమాట. కార్బన్‌ మోనాక్సైడ్‌ భారం అధికంగా ఉన్నందువల్ల పొగతాగేవారి ఎర్ర రక్తకణాలు, ఊపిరితిత్తులలో వాయమార్పిడి వ్యవస్థ నుంచి కార్బన్‌ మోనాక్సైడ్‌ తొలగించడంలో తక్కువ ప్రభావాన్ని కూడా చూపిస్తాయి. దీర్ఘకాలం పొగతాగేవారిలో అన్యుహ్యంగా ఎర్ర రక్తకణాల స్థాయి అధికంగా ఉంటుంది. ఇంకా పొగతాగడంతో మీ రక్తం సులభంగా గడ్డకట్టుకుంటుంది. ఆ రెండు అంశాల వల్ల గుండెపోటు, పక్షవాతం అపాయం ఎంతో ఉంటుంది.
చర్మం ముడతలుపడుతుంది
పొగతాడంతో చర్మం మీద కూడా ఎన్నెన్నో ఆరోగ్య ప్రభావాలు కనిపిస్తాయి. పొగతాగడంతో చర్మంలోని రక్తనాళాలు బిగుసుకుపోతాయి. ఆ విధంగా శరీరంలోని అతిపెద్ద అవయవానికి ప్రాణాన్ని సమకూర్చే ఆక్సీజన్‌ సరఫరా తగ్గిపోతుంది. దీనికితోడుగా పొగతాగేవారిలో హానికలిగించే సూర్యకిరణాలు వయసుకు ముందే ముడతలు పడేలా చేస్తాయి.
ఆహార నాళంలో క్యాన్సర్‌
సిగరెట్‌ తాగడానికి శరీరంల వివిధ భాగాలలో సంభవించే క్యాన్సర్‌కి మధ్యలో విడదీయరాని సంబంధమున్నట్లు పరిశోధనలు రుజువుచేశాయి. సిగరెట్‌లో 43 కార్సినొజెన్స్‌ ఉన్నాయని వివరించడం జరిగింది. ఇనిషియేషన్‌, ప్రమోషన్‌ అన్ని బహుళ ప్రక్రియలలో వ్యవహరించే పదార్థాలు సిగరెట్‌ పొగలో ఉన్నాయి. పొగతో నేరుగా సంప్రదింపులకు వచ్చే అవయవాలకు (ఊపిరితిత్తులు, నోరు, అన్ననాళిక) క్యాన్సర్‌ పెంపొందే అపాయం ఎక్కువగా ఉంటుంది. ఇంకా సిగరెట్‌ పొగలో విడుదలయ్యే పదార్థాలు మానవ శరీరం ద్వారా పీల్చుకుని వ్యాపిస్తాయి. కాబట్టి శరీరంలో దూరమైన భాగాలకు కూడా క్యాన్సర్‌ చేరుకుంటుంది. ఉదాహరణకు సిగరెట్‌ తాగడంతో మెడ క్యాన్సర్‌, స్వరపేటిక క్యాన్సర్‌, మూత్రాశయ, మూత్రపిండాల క్యాన్సర్‌, క్లోమ క్యాన్సర్‌, జీర్ణాశయం క్యాన్సర్‌ అపాయాలు కూడా ఉంటాయి.
పెప్టిక్‌ అల్సర్‌
పొగతాగడం పెప్టిక్‌ అల్సర్‌ పెంపొందడం, ఆలస్యంగా నయం అవడం, తిరిగి సంభవించడం ఇంకా చికిత్సనిరోధకత వంటి వాటికి దారితీస్తుంది. పొగతాగడం ఆస్టియోపోరొసిస్‌, ఎముక ఫ్రాక్చర్స్‌క్‌ అపాయకరమైన అంశం. పొగతాగడంతో ఆరోగ్యమైన జీవితానికి అవరోధం కలగడమే కాకుండా, ప్రాణాంతకమైన ఎన్నెన్నో అపాయాలు కలిగే అవకాశముంది.
డా|| సుధీర్‌ ప్రసాద్‌
పల్మనాలజిస్ట్‌ అవేర్‌ గ్లోబల్‌ ఆసుపత్రి
ఎల్‌బినగర్‌, హైదరాబాద్‌. 
_______________________________________________

No comments:

Post a Comment