Tuesday 18 March 2014

ప్రాచీన కట్టడం - చార్మినార్‌



       






               హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ ప్రాచీన కట్టడమైన చార్మినార్‌ కేవలం ఆ నగరానికేగాక మొత్తం భారతదేశానికే ఓ గర్వకారణమైన అంశంగా నిలుస్తోంది.
'ముత్యాల నగరం'గా ప్రసిద్ధి పొందిన భాగ్యనగరానికి ఓ కొండ గుర్తులా నిలుస్తున్న చార్మినార్‌ క్రీ.శ. 1591లో నిర్మించబడింది. అతి భయంకరమైన ప్లేగువ్యాధి నివారణకు ఓ చిహ్నంగా కట్టబడిన ఈ మహా నిర్మాణం ఆ వ్యాధితో అసువులుబాపిన మానవులకు ఓ నివాళిగా నిలవడమేగాక, మొత్తం మానవజాతి అత్మస్థైర్యానికీ ఓ నిదర్శనంగానూ నిలుస్తోంది.
చార్మినార్‌ని మహ్మద్‌ కులీకుతుబ్‌షా అనే చక్రవర్తి కట్టించాడు. అతను తన రాజధానిని గోల్కొండ నుంచి హైదరాబాద్‌కి (భాగ్యనగరం) మార్చిన కొంతకాలానికే దీని నిర్మాణం చేపట్టడం విశేషం. ఇప్పుడు హైదరాబాద్‌ ఎంతగానో విస్తరించి, పాతనగరం అందులో ఓ చిన్న భాగమైపోయింది గానీ, అప్పట్లో సరిగ్గా హైదరాబాద్‌ నడిబొడ్డున చార్మినార్‌ వుండేది. గ్రానైట్‌ రాళ్లు, సున్నం, బంకమట్టి, ఇంకా పాలరాతి తునుకలను ఉపయోగించి ఈ అందాల కట్టడాన్ని నిర్మించారు.
చార్మినార్‌ మౌలికంగా ఓ చతురస్రాకారంలో వుంటుంది. ఘనాకృతిలో వుండే ప్రధాన కట్టడంపైన నాలుగు మూలల్లోనూ ఓ నాలుగు పొడవైన శిఖరాలు (మినార్‌లు) వుంటాయి. నేల నుంచి మినార్‌ పైకొస దాకా మొత్తం 48.7 విూటర్ల ఎత్తు వుంటుంది. చార్మినార్‌లో ప్రతివైపున ఉన్న భాగమూ 20 విూటర్ల పొడవుంటుంది. ప్రతివైపున 11 విూటర్ల పొడల్పుతో వుండే ఓ పెద్ద కమాను (ఆర్చీ) వుంటుంది. ఈ కమానుకు చెందిన అత్యున్నత ప్రదేశం నేల నుంచి 20 విూటర్ల ఎత్తులో వుంటుంది.
చార్మినార్‌లోని ప్రతి మినార్‌లోనూ మొత్తం 4 అంతస్తులు వుంటాయి. ప్రతి అంతస్తు చివరన కమానులతో కూడిన నిర్మాణం వుంటుంది. మినార్‌పైకి చేరుకునేందుకుగానూ కింది నుంచి పైకి 149 సర్పిలాకారపు మెట్లు వున్నాయి. చార్మినార్‌ కింది నుంచి పైదాకా, అన్నివైపులా అందమైన వంపులు, డిజైన్లు అనేకం మనకు కన్పిస్తాయి.
చార్మినార్‌ ప్రధాన కట్టడం ఉపరిభాగంలో పడమటి దిక్కున ఓ అందమైన మసీదు ఉంది. కాగా మిగతా భాగాన్ని కుతుబ్‌షాహీ రాజు కాలంలో ఒక దర్బారులా ఉపయోగించేవారు. చార్మినార్‌ మొత్తం మీద ప్రార్ధించుకునేందుకు అనువుగా మొత్తం 45 ప్రదేశాలు ఉండటం విశేషం. ఇకపోతే మొదటి అంతస్తుపైన ఉన్న బాల్కనీ నుంచి చూస్తే చుట్టూ ఉన్న నగరం ఎంతో అందంగా దర్శనమిస్తుంది.

No comments:

Post a Comment